Hyderabad: సొంత తమ్ముడే సూత్రధారి! | Domalguda Robbery Case Solved by Police | Sakshi
Sakshi News home page

Hyderabad: సొంత తమ్ముడే సూత్రధారి!

Published Mon, Dec 23 2024 8:04 AM | Last Updated on Thu, Dec 26 2024 4:28 PM

Domalguda Robbery Case Solved by Police

అన్న ఎదుగుదలను ఓర్వలేకనే దోపిడీకి ప్లాన్‌ 

గుట్టు వీడిన దోమలగూడ బందిపోటు దొంగతనం 

రౌడీషీటర్లు పాత్రధారులు.. పథకం ఓ న్యాయవాదిది 

12 మందిని అరెస్టు చేసిన మధ్యమండల టాస్‌్కఫోర్స్‌ 

రూ.1.2 కోట్ల సొత్తు, వాహనం, ఆయుధాలు స్వాధీనం 

పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు ముమ్మరం

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని దోమలగూడ ఠాణా పరిధిలో ఈ నెల 12న తెల్లవారుజామున చోటు చేసుకున్న బందిపోటు దొంగతనం కేసును మధ్య మండల టాస్‌్కఫోర్స్‌ పోలీసులు ఛేదించారు. బాధితుడి తమ్ముడే దీనికి సూత్రధారిగా తేల్చారు. దొంగతనానికి పథకం ఓ న్యాయవాది వేయగా... ఇద్దరు రౌడీషీటర్లు తమ అనుచరులతో కలిసి అమలు చేసినట్లు గుర్తించారు. మొత్తం 15 మంది నిందితుల్లో 12 మందిని అరెస్టు చేశామని, వీరి నుంచి రూ.1.2 కోట్ల విలువైన సొత్తు, వాహనం, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. డీసీపీలు అక్షాంశ్‌ యాదవ్, వైవీఎస్‌ సుదీంద్రలతో కలిసి బంజారాహిల్స్‌లోని టీజీ సీసీసీలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వెల్లడించిన వివరాల ప్రకారం..  

తన వ్యసనాలకు అన్నను బాధ్యుణ్ని చేస్తూ.. 
పశ్చిమ బెంగాల్ కు చెందిన అన్నదమ్ములు రంజిత్‌ ఘోరాయ్, ఇంద్రజిత్‌ ఘోరాయ్‌ కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. దోమలగూడలోని అరి్వంద్‌నగర్‌లో ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో నివసిస్తూ బంగారు ఆభరణాల తయారీ వ్యాపారం చేస్తున్నారు. రంజిత్‌ ప్రస్తుతం 50 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి చేరగా... ఇంద్రజిత్‌ తనకు ఉన్న వ్యవసాలు, ఆన్‌లైన్‌ బెట్టింగ్, జల్సాలతో ఆర్థికంగా చితికిపోయాడు. 

ఇటీవలే రంజిత్‌ తన భార్య పేరుతో దోమలగూడలో రెండు ఇళ్లు ఖరీదు చేశాడు. దీంతో అన్నపై ఇంద్రజిత్‌ ఈర‡్ష్య పెంచుకున్నాడు. అన్న వద్ద ఉండే బంగారం వివరాలు గమనిస్తూ వచి్చన ఇంద్రజిత్‌.. ఇటీవల ఆ వివరాలను తన వాకింగ్‌ మేట్స్‌ అల్తాఫ్‌ మహ్మద్‌ ఖాన్, సయ్యద్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌లకు చెప్పాడు. ఆ బంగారం దోచుకుని తీసుకువస్తే అందరికీ లాభమని అన్నాడు. దీనికి అంగీకరించిన అల్తాఫ్, ఇర్ఫాన్‌ విషయాన్ని బాలాపూర్‌కు చెందిన రౌడీషిటర్‌ హబీబ్‌ హుస్సేన్‌ ద్వారా షేక్‌ మైలార్‌దేవ్‌పల్లికి చెందిన షబ్బీర్‌కు చెప్పాడు. 

గ్యాంగ్‌తో రంగంలోకి దిగిన అర్బాజ్‌.. 
ఇంద్రజిత్‌ ద్వారా రంగంలోకి దిగిన మైలార్‌దేవ్‌పల్లి రౌడీషిటర్‌ మహ్మద్‌ అర్బాజ్‌ దోపిడీ చేయడానికి అంగీకరించాడు. వీరంతా పలుమార్లు వివిధ హోటళ్లలో కూర్చుని వాటాపై బేరసారాలు చేసుకున్నారు. ఇవి కొలిక్కిరావడంతో అర్బాజ్‌ తన అనుచరులైన షోయబ్‌ ఖాన్, షేక్‌ ఉస్మాన్, షేక్‌ అల్లాఉద్దీన్, షేక్‌ అక్రమ్, షహబాజ్, నజీర్, జహీర్‌లతో కలిసి రంగంలోకి దిగాడు. ఇంద్రజిత్‌తో చర్చించడంతో పాటు వాహనం ఖరీదు చేసిన అర్బాజ్‌.. రంజిత్‌ ఇంటి వద్ద రెక్కీ సైతం పూర్తి చేయించాడు. ఈ నేరం ఎలా చేయాలి? పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలి? అనే అంశాలు చర్చించడానికి వీళ్లు బహదూర్‌పురకు చెందిన న్యాయవాది మహ్మద్‌ నూరుల్లా సహాయం తీసుకున్నారు. నేరం చేయడానికి పది రోజుల ముందు మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ రెస్టారెంట్‌లో కీలక నిందితులతో సమావేశమైన నూరుల్లా పథకం అమలు చేయడం ఎలా? ఆధారాలు లేకుండా జాగ్రత్తపడటం ఎలా? అనే అంశాలను వారికి వివరించాడు.  

షబ్బీర్‌ ఇంటి నుంచి బయలుదేరిన ఆరుగురు... 
ఈ నెల 12 రాత్రి అర్బాజ్‌ నేతృత్వంలో హబీబ్‌ హుస్సేన్, షోయబ్, సైఫ్, గులాం మగ్దూం, షేక్‌ అల్లావుద్దీన్‌.. షబ్బీర్‌ ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడ నుంచి వాహనంలో షబ్బీర్‌ మినహా మిగిలిన వాళ్లు బయలుదేరి రంజిత్‌ ఇంటి వద్దకు వచ్చారు. తమతో పాటు ప్రత్యేకంగా తయారు చేయించిన ఓ భారీ గొడ్డలితో పాటు ఇతర గొడ్డళ్లు, కత్తులు, తుపాకీ మాదిరిగా కనిపించే లైటర్‌ తీసుకువచ్చారు. ఇంద్రజిత్‌ సాయంతోనే ఇంట్లోకి ప్రవేశించిన వీళ్లు రంజిత్‌ కుటుంబాన్ని బంధించి, వారి పిల్లల మెడపై కత్తి పెట్టి, అడ్డుకునే ప్రయత్నం చేసిన రంజిత్‌ చేతిని గాయపరిచి తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ఆపై ఇంట్లో ఉన్న రెండు కేజీల బంగారం, 616 గ్రాముల వెండితో పాటు పూజ గదిలో ఉన్న రెండు కేజీల ఇత్తడి సామాను సైతం దోచుకుపోయారు. పోలీసులకు ఏమాత్రం ఆధారాలు దొరక్కుండా, సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా జాగ్రత్తపడ్డారు. ఈ కేసు ఛేదించడానికి మధ్య మండల టాస్‌్కఫోర్స్‌ రంగంలోకి దిగింది.  

బంగారం చోరీ కేసు ఇంటి దొంగల పనేనా?

ముమ్మర గాలింపుతో.. 
ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న ఈ కేసు చిక్కుముడి విప్పడానికి ఇన్‌స్పెక్టర్‌  ఖలీల్‌ పాషా నేతృత్వంలో ఎస్సైలు నవీన్‌కుమార్, నాగేష్‌ శ్రీకాంత్‌ తమ బృందాలతో దర్యాప్తు చేసి సాంకేతిక ఆధారాలు సేకరించారు. షహబాజ్, నజీర్, జహీర్‌ మినహా మిగిలిన 12 మందిని ఆదివారం పట్టుకున్నారు. వీరి నుంచి రూ.2.9 లక్షల నగదు, కారు, ఆయుధాలతో పాటు 1,228 గ్రాముల బంగారం, 616 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రెండు కేజీల ఇత్తడి వస్తువులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని కొత్వాల్‌ ఆనంద్‌ తెలిపారు. ఈ కేసు ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులకు ప్రత్యేక రివార్డులు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement