
నేటి నుంచి అమలుకు సీఎస్ ఆదేశాలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది. సచివాలయ అధికారులు, ఉద్యోగులతోపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గురువారం నుంచి తమ అటెండెన్స్ను ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు ఆమె మంగళవారం సచివాలయంలోని అన్ని శాఖల కార్యదర్శులకు లేఖలు రాశారు.
సచివాలయ హాజరు విధానంలో కచ్చిత త్వం, సవర్థత, భద్రతను పెంపొందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సచివాలయ ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన ఫేషియల్ రికగి్నషన్ అటెండెన్స్ యంత్రాల ముందు కొన్ని క్షణాల పాటు ఉద్యోగులు నిలబడితే, వారి ముఖకవలికలను గుర్తించి హాజరును నమో దు చేస్తాయి. ఉద్యోగులు, అధికారులందరి వివరాలను ఇప్పటికే ఆ యంత్రాల్లో రికార్డు చేశారు.
సచివాలయంలోకి ప్రవేశించే సమయంలో, విధులు ముగించుకుని వెళ్లే సమయంలో అటెండెన్స్ను నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో సాంకేతిక సమస్యలొచ్చే అవకాశం ఉండడంతో శనివారం వరకు ఫిజికల్ అటెండెన్స్ విధానాన్ని సైతం కొనసాగించాలని సీఎస్ సూచించారు.
త్వరలో జిల్లా, మండల కార్యాలయాల్లో సైతం..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేయా లని, సచివాలయం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న కొత్తలో సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా సచివాలయంలో అమల్లోకి తీసుకురాగా, త్వరలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సైతం ఫేషియల్ రికగి్నషన్ విధానాన్ని అమలు చేయనున్నారు.

Comments
Please login to add a commentAdd a comment