
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట తాజా మాజీ సర్పంచ్ల ఆందోళన
కరీంనగర్: ‘గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవడం, అప్పులు తెచ్చి పనులు చేయడమే తప్పా. తక్షణమే మా బిల్లులు చెల్లించండి’అంటూ మాజీ సర్పంచ్లు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలంటూ మాజీ సర్పంచులు దశలవారీగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని ప్లకార్డులతో నిర్వహించిన ప్రదర్శన ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం నుంచే పోలీసులు ప్రధాన గేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజావాణికి వచ్చే వారిని సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తూ లోపలికి పంపించారు.
మాజీ సర్పంచ్లు దఫదఫాలుగా బృందాలుగా ఏర్పడి ప్రధాన గేట్ ముందుకు చొచ్చుకురావడంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పీటీసీ సెంటర్కు తరలించారు. తాజా మాజీ సర్పంచ్లు పంజాల జగన్మోహన్గౌడ్, శ్రీధర్, సమ్మయ్య, మల్లారెడ్డి తదితరులు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల బిల్లులు ఏడాదిగా మంజూరు చేయకపోవడంతో ఇక్కట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బిల్లుల మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. బిల్లులు ఇవ్వకపోతే చావే శరణ్యమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment