
మీడియాతో మాట్లాడుతున్న సంతోష్ గుప్తా
గుల్జార్హౌస్ అగ్నిప్రమాదం బాధితురాలి ఆరోపణ
కనీసం టార్చ్లైట్ లేదు.. ఆక్సిజన్ మాస్క్లు లేవు..తలుపులు పగులగొట్టే పరికరాల్లేవు
అందుకే అగ్నిమాపక సిబ్బంది
వెంటనే సహాయక చర్యలు చేపట్టలేదు
6:45కి వచ్చినా 8:04 వరకు ఏం చెయ్యలేకపోయారు
తల్లిదండ్రులు, కుమార్తె సహా బంధువుల్ని కోల్పోయిన మహిళ ఆవేదన
అంబులెన్సుల్లో ఆక్సిజన్ లేదు.. సీపీఆర్ చెయ్యలేదు
ఉస్మానియా వైద్యులు కాళ్లు పట్టుకున్నా వైద్యం చేయలేదన్న బాధితురాలి కుమారుడు
వీటన్నిటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
పంజగుట్ట (హైదరాబాద్): హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి చెందడానికి.. అగి్నమాపక సిబ్బంది వద్ద సరైన పరికరాలు లేకపోవడం, ఫైర్ సిబ్బంది సరిగా స్పందించక పోవడమే కారణమని ఈ ఘోర ప్రమాదంలో తన తల్లిదండ్రులు, కుమార్తె, ఇతర కుటుంబసభ్యులను పోగొట్టుకున్న సంతోష్గుప్తా (భవన యజమాని ప్రహ్లాద్ మోదీ కుమార్తె) ఆరోపించారు. ‘ఫైర్ ఇంజన్లో సరిపడా నీళ్లు లేవు. పైపులకు రంధ్రాలు ఉండడంతో మన ఇంట్లో ట్యాప్లో ఎలా వస్తాయో అలా నీళ్లు బయటకు వస్తున్నాయి. ఆక్సిజన్ మాస్్కలు లేవు. సిబ్బంది వద్ద కనీసం టార్చ్లైట్ కూడా లేదు. తలుపులు, గోడలు పగలగొట్టేందుకు ఎలాంటి పరికరాలు లేవు.
దీంతో బాధితులను కాపాడేందుకు వారు ప్రయత్నించలేదు. ఉదయం 6:45కు ఫైర్ ఇంజన్లతో వచి్చనా 8:04 వరకు ఏం చెయ్యలేకపోయారు. ఈ సమయంలో లోపల ఉన్నవారు దట్టమైన పొగ కారణంగా బయటకు రాలేక, ఆ పొగ పీల్చుకోవడంతో మృతి చెందారు..’అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 18వ తేదీ ఉదయం జరిగిన ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుని బయటకు వచి్చన ప్రహ్లాద్ మోదీ ఇద్దరు కుమార్తెల్లో ఈమె ఒకరు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తన కుమారుడు నితీష్, సమీప బంధువు అతుల్ అగర్వాల్తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.
నేను, నా సోదరి బయటికొచ్చాం..: ‘ఉదయం 5:55కు పొగ వాసన వస్తుండటంతో నిద్ర లేచా. కుటుంబ సభ్యులు కొందరిని అప్రమత్తం చేశా. పొగ ఎక్కడనుండి వస్తోందో చూసేందుకు నేను, నా సోదరి ఒకామె 6:05 సమయంలో కిందకు వెళ్లాం. నలుగురు పైకి వెళ్లారు. అప్పటికే మొదటి అంతస్తు నుంచి దట్టమైన పొగలు వస్తున్నాయి. తర్వాత పెద్ద శబ్దంతో పాటు ఆవరణలో మంటలు వచ్చాయి. ఉదయం 6:12కు అగ్నిమాపక సిబ్బందికి (101కు) ఫోన్ చేశాం. 6:16కు 100కు ఫోన్ చేసి బాధితులు ఎక్కువగా ఉన్నారని కనీసం 10 అంబులెన్సులు పంపించాలని కోరాం.
మమ్మల్ని టార్చిలైట్ తెమ్మన్నారు..
ఉదయం 6:45కు ఒక ఫైర్ ఇంజన్, ఒక అంబులెన్స్ వచి్చంది. ఫైర్ ఇంజన్ పైపులకు రంధ్రాలు ఉండడంతో ప్రెజర్ రావడం లేదు. ఫైర్ సిబ్బంది పైపులను సరిచెయ్యలేకపోయారు. వారి వద్ద కనీసం టార్చ్లైట్ కూడా లేదు. మమ్మల్ని టార్చ్ తెమ్మని అడిగారు. కొందరు స్థానికులు లోనికి వెళ్లేందుకు ప్రయతి్నంచారు కానీ సిబ్బంది మాత్రం సరైన సమయంలో లోనికి వెళ్లలేకపోయారు.
అంబులెన్సులో సౌకర్యాలు లేవు..
నితీష్తో పాటు స్థానికులు కొంతమంది 8:04 సమయంలో ధైర్యంగా లోనికి వెళ్లి కొంతమందిని బయటకు తీసుకువచ్చా రు. కానీ అప్పటికే వారు బాగా పొగ పీల్చడంతో అప స్మారక స్థితిలోకి వెళ్లారు. ఇక అంబులెన్సుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్క అంబులెన్సులో ఆక్సిజన్ లేదు. బయటకు తీసుకువచి్చన బాధితులకు సిబ్బంది కనీసం సీపీఆర్ కూడా చెయ్యలేదు..’అని సంతోష్ గుప్తా ఆరోపించారు.
కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు..
‘అంబులెన్సు డ్రైవర్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళదాం అంటే ఒప్పుకోకుండా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడకు తీసుకువెళ్లిన ముగ్గురు అప్పటికి బతికే ఉన్నారు. కానీ ఉస్మానియా వైద్యులు ఎఫ్ఐఆర్ చూపించాలని, లేనిపక్షంలో పోలీస్ అధికారులు వచ్చి చెబితేనే చికిత్స చేస్తామని పట్టుబట్టి కూర్చున్నారు..’అని నితీష్ తెలిపారు. డాక్టర్ కాళ్లు పట్టుకున్నా తాను చికిత్స చెయ్యను అంటే చెయ్యను అన్నా రని చేసేది లేక 15 నిమిషాల తరువాత మలక్పేట యశోదా ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఈలోగా బతికి ఉన్నవారు కూడా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
కమిటీ మమ్మల్ని సంప్రదించలేదు
రాష్ట్రపతి, ప్రధాని, సీఎంకు లేఖలు
ఘోర అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినా, సదరు కమిటీ ఏదీ ఇప్పటివరకు తమను సంప్రదించలేదని బాధితులు తెలిపారు. ఫైర్ సిబ్బంది వద్ద సరైన పరికరాలు ఉండి ఉంటే, సుమారు గంటన్నర సమయం వృధా చేసి ఉండకపోతే, సరైన సిబ్బంది ఉండి ఉంటే.. అన్ని ప్రాణాలు పోయేవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యావత్ ఉదంతంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఢిల్లీలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ విభాగానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి సైతం లేఖలు రాసినట్లు వెల్లడించారు.