పార్టీలో ఏపీ టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, రాజస్తాన్ మాజీ ఎమ్మెల్యే
డ్రగ్స్ పార్టీ జరుగుతోందనే సమాచారంతో సోదాలకు వెళ్లిన ఈగల్ టీం
మఫ్టీలో ఉన్న పోలీసులపైకి కాల్పులు జరిపిన యువకులు
కొకైన్, మద్యం, గన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు సహా ఐదుగురికి పాజిటివ్
సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్: హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు కేంద్ర బిందువుగా వార్తల్లోకెక్కిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్లో ఉన్న ఆయన అతిథిగృహంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫామ్ హౌస్లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. పార్టీలో రోహిత్ రెడ్డి, అతడి సోదరుడు రితేష్ రెడ్డి, ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, రాజస్తాన్ మాజీ ఎమ్మెల్యే నితీశ్ శర్మ (జైపూర్) సైతం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అలాగే, ఎనిమిది మంది వీఐపీలు ఉన్నట్లు సమాచారం. పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
వీరిలో రోహిత్ రెడ్డి, అతడి సోదరుడితోపాటు మరో ఐదుగురు కొకైన్ తీసుకున్నట్టుగా నిర్ధారించారు. మిగిలిన వారిని పరీక్షల కోసం ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఈగల్ టీమ్కు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయనే వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. జైపూర్ మాజీ ఎమ్మెల్యే నితీశ్ శర్మను టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ పార్టీకి తీసుకొచ్చినట్లు తెలిసింది. నితీశ్ శనివారం సాయంత్రమే హైదరాబాద్కు వచ్చారు.
అజీజ్నగర్లోని రోహిత్రెడ్డి ఫామ్ హౌస్
పోలీసులపైకి కాల్పులు
ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు ఫాంహౌస్లోకి వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్న యువకులు సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులను అడ్డుకుని హంగామా సృష్టించారు. మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి, ఎవరో వచ్చారన్న ఆందోళనతో తుపాకీతో గాలిలోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిద్ మిశ్రా కూడా కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఈ తుపాకీ రితేష్ రెడ్డిదిగా గుర్తించారు. కాల్పులతో ఫాంహౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొద్దిక్షణాల్లోనే పోలీసులు ఫాంహౌస్ను చుట్టుముట్టారు. లోపలి నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా పారీ్టలో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో కొకైన్, ఇతర మత్తు పదార్థాలు లభించాయి. అలాగే, మద్యం బాటిళ్లతోపాటు కాల్పులు జరిపిన తుపాకీ, బుల్లెట్లను స్వా«దీనం చేసుకున్నారు.

రహస్యంగా విచారణ
విందులో పాల్గొన్న వారిలో పేరున్న నాయకులు కావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత రహస్యంగా, లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగింది మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ కావడం, గతంలోనూ ఇక్కడ ఇలాంటి పెద్ద కేసే నమోదు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా ఉన్నవారెవరు, పరోక్షంగా ఉన్నవారెవరనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోందని సమాచారం.

స్వాధీనం చేసుకున్న రివాల్వర్
పట్టుబడింది వీరే..
1) ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్కుమార్ యాదవ్
2) బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి
3) రాజస్తాన్ మాజీ ఎమ్మెల్యే నితీశ్ శర్మ
4) వర్గనేని రమేష్
5) వి.శ్రవణ్ కుమార్
6) రితీశ్రెడ్డి
7) నల్లపునేని విజయకృష్ణతోపాటు మరో ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు.


