కన్నతల్లి కన్నీటి వ్యథ | Hussain Sagar Boat Incident | Sakshi
Sakshi News home page

కన్నతల్లి కన్నీటి వ్యథ

Jan 29 2025 8:11 AM | Updated on Jan 29 2025 4:03 PM

 Hussain Sagar Boat Incident

‘మహా హారతి’ ప్రమాదంలో గల్లంతైన అజయ్‌ మృతదేహం లభ్యం 

 కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మరొకరి మృతి

హైద‌రాబాద్‌: పీపుల్స్‌ ప్లాజా వేదికగా గత ఆదివారం భారతమాత ఫౌండేషన్‌ (Bharat Mata Foundation) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారత మాత మహా హారతి’ కార్యక్రమంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం (Fire Accident) ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. ఈ ఘటనలో హుస్సేన్‌సాగర్‌లో గల్లంతైన అజయ్‌ మృతదేహం మంగళవారం లభించగా.. ఇదే ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న గణపతి అనే యువకుడు కూడా మంగళవారం మృతిచెందాడు.  

రెండు రోజులుగా గాలింపు..
నాగారంకు చెందిన అజయ్‌ మిస్సింగ్‌ అయ్యాడని కుటుంబ సభ్యులు సోమవారం (Monday) తెల్లవారుజామున లేక్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం నుంచి బోటు ప్రమాదం జరిగిన ప్రదేశం, ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యులు, లేక్‌ పోలీసులు, లుంబీపార్క్‌ బోటింగ్‌ సిబ్బంది మరోసారి గాలింపు చేపట్టగా మంగళవారం సాయంత్రం సంజీవయ్య పార్కు వద్ద ఉన్న భారీ జాతీయ జెండా సమీపంలో మృతదేహం లభ్యమైంది.  

అజయ్‌ కుటుంబంలో విషాదం
కన్నబిడ్డ క్షేమంగా ఉంటాడని గంపెడాశతో ఎదురు చూసిన అజయ్‌ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. రెండు రోజులుగా హుస్సేన్‌ సాగర్‌ వద్దే పడిగాపులు కాస్తున్న ఆ కుటుంబ సభ్యులకు మంగళవారం సాయంత్రం మృతదేహం దొరికిందని తెలియగానే.. తల్లిదండ్రులు జానకిరాం, నాగలక్ష్మి దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు.  

తూ.గో జిల్లా నుంచి వచ్చిన..
టాటా ఏస్‌ డ్రైవర్‌ గణపతి (22) తూర్పు గోదావరి జిల్లా నుంచి బాణసంచా కాల్చే టీంతో కలిసి వచ్చాడు. ఆ సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలపాలై సికింద్రాబాద్‌ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు.
  
అనుమతి తీసుకున్నారా?
కాగా సాధారణంగా బాణసంచా కాల్చేందుకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. కానీ ఆదివారం రాత్రి హుస్సేన్‌సాగర్‌లో మహా హారతి కార్యక్రమంలో బాణసంచా కాల్చేందుకు పోలీసుల అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. లుంబినీ పార్కు మేనేజర్, బోటింగ్‌ ఇన్‌చార్జి, ఇతర అధికారుల అనుమతితో బోటులో బాణసంచా కాల్చేందుకు వెళ్లినట్లు తెలిసింది.

బాణసంచా కాలుస్తుండగా..
మహా హారతి ఇచ్చే క్రమంలో హుస్సేన్‌ సాగర్‌లో బోటులోంచి బాణసంచా కాలుస్తుండగా మంటలు అంటుకున్నాయి. దీంతో బోట్‌లో ఉన్న వారంతా నీటిలోకి దూకేశారు. ఈ క్రమంలో నీటిలోకి దూకిన వారిలో నాగారంకు చెందిన సిల్వేరు అజయ్‌(21) గల్లంతయ్యాడు. అదే బోటులో మంటల తాకిడికి తీవ్ర గాయాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గణపతి (22) మంగళవారం ఉదయం మృతిచెందాడు. దీంతో ఈ సంఘటనలో ఇద్దరు మృత్యువాత పడటం విషాదాంతంగా మారింది.  

చ‌ద‌వండి: ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

రెండు రోజులుగా బోటింగ్‌ నిలిపివేత
సాగర్‌లో బోటింగ్‌లో మంటలు చెలరేగి యువకుడు గల్లంతైన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో సాగర్‌లో బోటింగ్‌ నిలిపివేశారు. బోటింగ్‌ సిబ్బంది మొత్తం అజయ్‌ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement