
లింగ్యానాయక్(ఫైల్)
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్కు పితృవియోగం కలిగింది. సత్యవతి తండ్రి లింగ్యానా యక్(85) అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు పెద్దతండాలో మరణించారు. మేడారం జాతర ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న మంత్రికి సమాచారం అందగానే హుటాహుటీన పెద్దతండా చేరుకున్నారు. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో తండా సమీపాన అంత్యక్రియలు నిర్వహించారు.
లింగ్యానాయక్ మరణ వార్త తెలియగానే సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మంత్రిని పరామర్శించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అలాగే శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు తన్నీరు హరీశ్రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ కమిషన్ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ తదితరులు మంత్రికి ఫొన్ చేసి సంతాపం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్, శంకర్నాయక్, పెద్ది సుదర్శన్రెడ్డి తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment