
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్ల సాధనకు పది రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది సోమవారం నుంచి తీవ్రం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నాలు, 19న మండల కేంద్రాల్లో రాజకీయపార్టీలు, ట్రేడ్ యూనియన్లతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ (సీఐటీయూ, ఏఐటీయూసీ, టీజీకేబీయూ, ఐఎఫ్టీయూలతో కూడిన) శనివారం నిర్ణయించింది. అలాగే 20న సమ్మె పరిష్కరించాలంటూ అన్ని గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయాలని, 21న కలెక్టరేట్ల ముట్టడి చేపట్టాలని తీర్మానించింది. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 21 తర్వాత నీరు, కరెంట్, వీధి దీపాలు సహా అన్ని అత్యవసర సేవలు నిలిపేస్తామని హెచ్చరించింది.
డిమాండ్ల సాధన కోసం జేఏసీ ఈనెల 6న ప్రారంభించిన సమ్మె నేటికి పదో రోజుకు చేరనుంది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో వివిధ కేటగిరీల్లో 50 వేల మంది పనిచేస్తున్నారు. సిబ్బందిని పర్మినెంట్ చేయడంతోపాటు పీఆర్సీలో నిర్ణయించినట్టు రూ.19 వేలు కనీస బేసిక్ పే ఇవ్వాలని, అప్పటిదాకా స్వీపర్లకు రూ.15,600, పంప్ ఆపరేటర్లు, ఎల్రక్టీషియన్లు, డ్రైవర్లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ.19,500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, పది రోజులుగా సమ్మె చేస్తున్నా జేఏసీని ప్రభుత్వం చర్చలకు పిలవకపోగా సమ్మెను నీరుగార్చేందుకు పోటీ కార్మికులను నియమించే ప్రయత్నం చేస్తోందని జేఏసీ చైర్మన్ పాలడుగు భాస్కర్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment