
వివరాలు వెల్లడిస్తున్న సీపీ సత్యనారాయణ
సాక్షి కరీంనగర్: కరీంనగర్లోని ముకరాంపురలో గల సేవా మ్యూచ్వల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీలో సోమవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. మూడు గంటల్లోనే పోలీసులు ఈ చోరీని ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను సీపీ సత్యనారాయణ వెల్లడించారు. సేవా మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీలో వడ్డీ లేకుండా రుణాలు అందిస్తూ తిరిగి వసూలు చేస్తుంటారు. 19న శనివారం, 20న ఆదివారం బ్యాంకుకు సెలవు కావడంతో వసూలు చేసిన నగదు మొత్తం సొసైటీ కార్యాలయంలోని క్యాష్ చెస్ట్లో భద్రపరిచారు.
సోమవారం ఉదయం కార్యాలయం షట్టర్ తాళం పగలగొట్టి ఉండడం గమనించిన స్థానికులు నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు వెళ్లి చూడగా నగదు, బంగారు నగలు భద్రపరిచిన చెస్ట్ కనిపించలేదు. ఉదయం 11 గంటలకు పోలీసులకు సమాచారమందించగా, వన్టౌన్ పోలీసులు హుటాహుటిన చేరుకున్నారు. అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్), టౌన్ ఏసీపీ తుల శ్రీనివాసరావు, వన్టౌన్ సీఐ సీహెచ్ నటేశ్, ఎస్సై ఎస్.శ్రీనివాస్ నేరం జరిగిన ప్రాంతాలను పరిశీలించారు.
సేవా సొసైటీని పరిశీలిస్తున్న అధికారులు
మూడు గంటల్లోనే..
చోరీ కేసులో పోలీసులు డాగ్స్క్వాడ్తో పాటు సీసీ కెమెరాలు పరిశీలించారు. వెంటనే నిందితుడికి సంబంధించిన సీసీ వీడియోలను సోషల్ మీడియాల్లో సర్క్యులేట్ చేయడంతో పలువురు గుర్తు పట్టి పోలీసులకు సమాచారమందించారు. నిందితులు నగరం దాటకముందే పట్టుకోవాలన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించారు. మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్ బస్టాండ్లో నిందితులు నగరానికి చెందిన షేక్ సాధిక్(24), మహమ్మద్ షాబాజ్(22)లను పట్టుకున్నారు. వారి నుంచి రూ.14.03 లక్షలు, 13 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సాధిక్ ఆటోడ్రైవర్ కాగా, షాబాజ్ ఇదివరకే సెల్ఫోన్ దొంగతనం కేసులో నిందితుడిగా పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment