తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు!.. ఇదో వృద్ధ దంపతుల గా(వ‍్య)థ | Tahsildar office not completing the registration process for the land which was sold by elder people | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు!.. ఇదో వృద్ధ దంపతుల గా(వ‍్య)థ

Published Sat, Dec 7 2024 1:59 PM | Last Updated on Sat, Dec 7 2024 2:14 PM

Tahsildar office not completing the registration process for the land which was sold by elder people

సంస్థాన్‌ నారాయణపురం(నల్గొండ): తాము కొంత భూమి అమ్ముకుంటే.. ఆ భూమిని కొనుగోలు చేసిన వారికి తహసీల్దార్‌ రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వృద్ధ దంపతులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన జక్కడి బాల్‌రెడ్డికి 40ఎకరాల భూమి ఉంది. తన కుమారుడు జక్కడి శ్రీనివాస్‌రెడ్డికి 36 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేయగా ఇంకా బాల్‌రెడ్డి పేరు మీద 4ఎకరాల 10గుంటల భూమి ఉంది. 

కుమారుడు తమ బాగోగులు పట్టించుకోకపోడవంతో బాల్‌రెడ్డి తన పేరు మీద ఉన్న భూమిని ఇతరులకు విక్రయించాడు. భూమి కొనుగొలుదారు రిజిస్ట్రేషన్‌ కోసం బుధవారం స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. గురువారం 12గంటలకు రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుక్‌ అయ్యింది. తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేయకపోవడంతో బాల్‌రెడ్డి అధికారులను ప్రశ్నించాడు. రిజిస్ట్రేషన్‌ చేయవద్దని బాల్‌రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు చేశాడని, దీంతో రిజిస్ట్రేషన్‌ నిలిపివేస్తున్నానని తహసీల్దార్‌ తెలిపారు. తమ భూమి అమ్ముకుంటే ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేయరంటూ తహసీల్దార్‌తో బాల్‌రెడ్డి వాదించాడు.

 వృద్ధ దంపతులు సుమారు మూడు గంటలకు పైగా తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తాము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. చివరకు రిజిస్ట్రేషన్‌ చేయడంతో కథ సుఖాంతం అయ్యింది. ఈ విషయమై తహసీల్దార్‌ కృష్ణను వివరణ కోరగా.. బాల్‌రెడ్డికి కుంటుంబ సభ్యులతో మాట్లాడుకోమని కొంత సమయం ఇచ్చామని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ ప్రకియ పూర్తిచేసినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement