
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పంచతుల బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం, ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దివ్య విమాన స్వర్ణ గోపుర ఆవిష్కరణకు సంబంధించి ‘పంచ కుండాత్మక మహా కుంభాభిషేక సంప్రోక్షణ’ మహోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. మహాపూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో రేవంత్ దంపతులకు వేదపండితులు ఆశ్వీరాదం ఇచ్చారు.
ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు వెళ్లిన సీఎం.. మొదటగా గుట్టపైన ఉన్న యాగశాలకు చేరుకున్నారు. ఆలయ ఈవో, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఆలయ పరిసరాలు, అభివృద్ధి పనులు పర్యవేక్షించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
