
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష తుది కీ విడుదలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసిన కమిషన్... ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ చేపట్టింది. ఈనెల 4తో ప్రాథమిక కీ అభ్యంతరాల స్వీకరణ పూర్తికాగా, పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. అయితే మొత్తంగా ఎన్ని అభ్యంతరాలు వచ్చాయనే విషయాన్ని కమిషన్ వెల్లడించలేదు.
మరోవైపు ప్రాథ మిక కీ పైన వచ్చిన అభ్యంతరాల పరిశీలనకు టీఎస్పీఎస్సీ కార్యాచరణ సిద్ధంచేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను లోతుగా పరిశీలించాలని నిర్ణయించిన టీఎస్పీఎస్సీ.. ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం నుంచి అభ్యంతరాల పరిశీలన చేపట్టనున్నట్లు సమాచారం. వాటిలో సమ్మతమైనవెన్ని?... ప్రశ్నపత్రంలో తప్పొప్పులున్నాయా?
తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి తుది కీ ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లోగా పరిశీలన పూర్తి చేయాలని భావిస్తున్న కమిషన్.. ఈ ప్రక్రియ ముగిస్తే వచ్చే వారంలో తుది కీని విడుదల చేయనుంది. ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 3.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈనెల 16న పరీక్షకు 2,85,916 మంది హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment