విద్యుత్‌శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం | Vacancies will be filled in the Electricity Department | Sakshi
Sakshi News home page

విద్యుత్‌శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం

Oct 9 2024 4:39 AM | Updated on Oct 9 2024 4:39 AM

Vacancies will be filled in the Electricity Department

దసరా కన్నా ముందేఅన్ని పెండింగ్‌ బిల్లుల విడుదల 

కేబినెట్‌లో చర్చించాకే మూసీపై నిర్ణయం.. ఖమ్మంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క 

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘విద్యుత్‌ శాఖలో పదేళ్లు గా ప్రమోషన్లు పెండింగ్‌లో ఉండగా, మా ప్రభుత్వమే ఇచ్చి0ది. ఎవరూ అడగక ముందే దీనిపై నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం ఈ శాఖలో ఖాళీల కారణంగా ఉన్న వారిపై పనిభారం పడు తోంది. 

నెల,రెండు నెలల్లో వీటి భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తాం’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల అధికారుల తో విద్యుత్, సంక్షేమ శాఖలపై మంగళవారం ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు.  

మార్పులపై ప్రత్యేక శిక్షణ 
వరదల సమయంలో విద్యుత్‌ ఉద్యోగులు ఎంతో కష్టపడి పనిచేశారని భట్టి అభినందించారు. అయితే శాఖలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగ వ్యవస్థ అందుబాటులోకి రావాల్సి ఉందని, 20 నుంచి 30 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి హైదరాబాద్‌లోని స్టాఫ్‌ కాలేజీలో శిక్షణ ఇస్తామని తెలిపారు. విద్యుత్‌కు సంబంధించి ఏ సమస్య వచ్చినా వినియోగదారులు 1912కు కాల్‌ చేయొచ్చని, 108 లాగే ఇది కూడా ఉపయోగపడుతుందన్నారు. 

పేరు, అడ్రస్‌ చెబితే అక్కడ సమస్య పరిష్కారానికి అధికారులు కృషి చేస్తారని తెలిపారు. ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలో లిఫ్ట్‌ ఇరిగేషన్లు ఉన్నందున ఉద్యోగులు చిన్నలోపం కూడా ఎదురుకాకుండా చూడాలన్నారు. మరమ్మతులు చేసిన కొన్నాళ్లకే టాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నందున, వ్యవస్థలను తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు.  

మూసీ అంశం కొత్తది కాదు  
రెవెన్యూ రికార్డుల అప్‌డేట్‌ అంటూ.. గత పాలకులు బినామీల పేర్లపైకి భూములను బదలాయించారని భట్టి ఆరోపించారు. తాము మాత్రమే ఆక్రమణకు గురైన చెరువులను సరిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్‌ ఒక్కరే నిర్ణయాలు తీసుకునేవారని, అందుకే మూసీ అంశాన్ని కేబినెట్‌లో చర్చించారా అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారన్నారు. 

మూసీపై కేబినెట్‌లో చర్చించడానికి కొత్త అంశమేమీ కాదన్నారు. మూసీని శుభ్రం చేసి నగరం నడి»ొడ్డున స్వచ్ఛమైన నది ప్రవహించేలా సుందరీకరణ చేయబోతున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మూసీని సుందరీకరణ చేస్తామని చెప్పి చేయలేదని, తాము చేసి చూపిస్తామని, నిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమన్నారు. మూసీ ప్రక్షాళనకు డీపీఆర్‌లు సిద్ధం కాకముందే రూ.1.50 లక్షల కోట్లు వ్యయమవుతుందని చెప్పడం సరికాదని చెప్పారు. తాము గడీల్లో లేమని, ఎవరైనా ఎప్పుడైనా వచ్చి సలహాలు ఇవొచ్చని భట్టి తెలిపారు. 

మైనింగ్‌ వ్యవస్థపై అధ్యయనం చేశాం  
అమెరికాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్‌ ఎక్స్‌పోలో పాల్గొని ఆధునిక యంత్ర పరికరా లు, సాంకేతికతను వినియోగించి ఎక్కువ బొగ్గు వెలికితీయడం, బొగ్గు ఉత్పత్తిలో భద్రతా చర్యలను పరిశీలించామని భట్టి తెలిపారు. సింగరేణి పెద్ద మైనింగ్‌ వ్యవస్థ కావడంతో ఆ శాఖ మంత్రి గా అమెరికా, జపాన్‌ దేశాల్లో పర్యటించానన్నా రు. 

దసరా కన్నా ముందే అన్ని రకాల పెండింగ్‌ బిల్లులు విడుదల చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్ల పెండింగ్‌ బిల్లులు రూ.114 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్‌ బిల్లులు విడుదల చేశామని, పిల్లల కాస్మోటిక్‌ చార్జీలను ఏ నెలకానెల అందజేస్తామని తెలిపారు. 

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అన్నీ క్లియర్‌ చేస్తామన్నారు. 2029–2030 వరకు 20 వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కె.వరుణ్‌రెడ్డి, కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement