భార్యను చంపి, ముక్కలు చేసి.. కుక్కర్‌లో ఉడికించి.. | Women Dead in Retired Army jawan Gurumurthy Case at Meerpet | Sakshi
Sakshi News home page

భార్యను చంపి, ముక్కలు చేసి.. కుక్కర్‌లో ఉడికించి..

Jan 23 2025 1:26 AM | Updated on Jan 23 2025 10:52 AM

Women Dead in Retired Army jawan Gurumurthy Case at Meerpet

హైదరాబాద్‌లోని మీర్‌పేటలో రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ దారుణం 

ఉడికించిన ముక్కలను ఎండబెట్టి, రోకలితో దంచి పొడిచేసిన తీరు

పొడిని డ్రైనేజీలో, ఎముకలను జిల్లెలగూడ చెరువులో కలిపిన వైనం 

యూట్యూబ్‌లో శోధించి, క్రైమ్‌ సినిమాలు చూసి ఆధారాలు దొరక్కుండా ప్రయత్నాలు 

ముందుగానే ఓ వీధి కుక్కపై ప్రయోగం.. తర్వాత భార్య మృతదేహంపై కిరాతకం

ఏమీ తెలియనట్టుగా భార్య తల్లిదండ్రులతో కలసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

అదుపులోకి తీసుకొని విచారించడంతో వెలుగులోకి..

భార్యపై అనుమానంతోనే ఘాతుకం

సాక్షి, హైదరాబాద్‌/మీర్‌పేట: ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను పాశవికంగా హత్య చేశాడు. అయినా కసి తీరక ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఓ పెద్ద కుక్కర్‌ తీసుకొచ్చి శరీర భాగాలను ఉడకబెట్టాడు. తర్వాత ఎండబెట్టి, కాల్చాడు. ఇంట్లోనే రెండు, మూడు రోజుల పాటు రోకలి బండతో దంచి పొడిగా చేశాడు. ఆ పొడిని డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో కలిపేశాడు. మిగిలిన ఎముకల ముక్కలను సమీపంలోని జిల్లెలగూడ (చందన) చెరువులో పారేశాడు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలోని జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. 

హత్య చేసి.. ఇంట్లోంచి వెళ్లిపోయిందని... 
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్‌ గురుమూర్తి (39), వెంకట మాధవి (35) భార్యాభర్తలు. వారికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలోకి వచ్చి, అద్దె ఇంట్లో ఉంటున్నారు. గురుమూర్తి కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురుమూర్తి విపరీత ప్రవర్తన, అనుమానిస్తూ వేధిస్తుండటంతో భార్య మాధవి ఇబ్బందిపడుతూ ఉండేది. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. 

ఈ నెల 16న గురుమూర్తి, మాధవి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గురుమూర్తి ఆమెను పాశవికంగా హత్యచేశాడు. కానీ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరికీ చెప్పాడు. మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని ఈ నెల 18న మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 

అదుపులోకి తీసుకుని విచారించడంతో.. 
ఇంట్లో గొడవ జరిగిన సమయంలోనే మాధవిని గురుమూర్తి హత్య చేశాడు. కానీ ఏమీ ఎరగనట్టుగా అత్తమామలతోపాటు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టారు. అతడి ప్రవర్తన, కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మీర్‌పేట్‌ సీఐ నాగరాజు తెలిపారు. 

యూట్యూబ్‌లో చూసి.. ముందుగా కుక్కపై ప్రయోగం చేసి.. 
భార్యను హత్య చేసిన గురుమూర్తి పోలీసులకు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు చిక్కకుండా పక్కా ప్లాన్‌ చేశాడు. శరీరంలోని ఎముకలను పొడిగా ఎలా మార్చాలని యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో శోధించాడు. క్రైమ్, హర్రర్‌ సినిమాలు చూశాడు. ముందుగా వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు. ముక్కలుగా నరికి, ఎముకలతో సహా కుక్కర్‌లో ఉడకబెట్టాడు. తర్వాత అదే తరహాలో భార్య శరీరాన్ని కూడా ముక్కలు చేసి, ఉడకబెట్టాడు. ఎండబెట్టి, కాల్చి పొడి చేశాడు. 



ఆధారాల కోసం పోలీసుల ప్రయత్నాలు.. 
మాధవి మిస్సింగ్‌ కేసు నేపథ్యంలో.. జిల్లెలగూడ న్యూవేంకటేశ్వర కాలనీలో గురుమూర్తి, మాధవి నివాసమున్న ఇల్లు, పరిసర ప్రాంతాలను పోలీసులు మూడు రోజులుగా క్షుణ్నంగా పరిశీలించినట్టు తెలిసింది. ఆమె హత్యకు గురై ఉంటే ఏమైనా ఆధారాలు లభిస్తాయేమోనని డ్రైనేజీ మ్యాన్‌హోల్స్, నాలాలను కూడా తెరిచి పరిశీలించినట్టు స్థానికులు తెలిపారు. కానీ నిందితుడిని విచారించిన సమయంలో అసలు సంగతి బయటపడింది. దీనితో ఆయా అంశాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. నిందితుడు గురుమూర్తి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారి పిల్లలు మేడ్చల్‌లోని అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నట్టు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement