సూళ్లూరుపేట : పట్టణంలోని కస్వారెడ్డిపాళెం కాలనీ (కేఆర్పీ కాలనీ)లో బుధవారం సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేస్తూ ప్రమాదవశాత్తూ అందులో పడి ఎద్దల నాగరాజు (41) అనే కార్మికుడు మృతి చెందాడు. వివరాలు.. నాగరాజు సుమారు 15 ఏళ్లుగా షార్లో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. తహసీల్దార్ నరసింహారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీసి షార్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఫిర్యాదు అందినట్లు ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలిపారు.
‘భవిత’ విద్యార్థికి కలెక్టర్ చేయూత
తిరుపతి అర్బన్ : తిరుపతిలోని మహాత్మాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల పరిధిలోని భవిత కేంద్రం విద్యార్థి వడ్లమూడి రమేష్కు కలెక్టర్ వెంకటేశ్వర్ చేయూతనందించారు. బుధవారం ఈ మేరకు రూ.50వేలు విలువైన బ్యాటరీ మోటార్ సైకిల్ను సొంత నిధులతో కొనుగోలు చేసి అప్పగించారు. కార్యక్రమంలో జేసీ శుభం బన్సల్, డీఈఓ కేవీఎన్ కుమార్, భవిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
17 మందికి జరిమానా
తిరుపతి లీగల్: మద్యం తాగి తిరుపతిలో వాహనాలు నడుపుతున్న కేసుల్లో 17 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పినట్టు కోర్టు సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి ట్రాఫిక్ పోలీసులు నగరంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారని కోర్టు కానిస్టేబుల్ గిరిబాబు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి జరిమానా విధించినట్లు వివరించారు.
రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు ఇంటర్వ్యూ
తిరుపతి తుడా : స్విమ్స్ వర్సిటీ న్యూరాలజీ విభాగంలో రీసెర్చ్ అసోసియేట్గా ఆరునెలల పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్క పోస్టు మాత్రమే ఉందని, ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 9వ తేదీన స్విమ్స్ పాత డైరెక్టర్ కార్యాలయంలోని కమిటీ హాల్లో హాజరుకావాలని కోరారు. అర్హతలు, దరఖాస్తు ఫారం కోసం స్విమ్స్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
న్యూసెన్స్ చేస్తే సహించం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్ ): డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా, ప్రజలను ఇబ్బంది పెట్టేలా న్యూసెన్స్ చేసినా సహించే ప్రసక్తే లేదని రేణిగుంట ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని స్పష్టం చేశారు.