
పక్కా ప్రణాళికతో సాగండి
● జిల్లాలో రాజీవ్ యువ వికాస పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలి ● కలెక్టర్ ప్రతీక్జైన్
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మండల కేంద్రంలో రాజీవ్ యువ వికాస కేంద్రం ఏర్పాటు చేసి అర్హులైన నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఈ నెల 14వ తేదీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు కుల, ఆదాయ, ధ్రువీకరణ సర్టిఫికెట్లు కోరితే వెంటనే జారీ చేయాలని ఆదేశించారు. రూ.50 వేల వరకు లబ్ధి పొందే వారికి వారం రోజులపాటు, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు లబ్ధి పొందే వారికి 15 రోజులు, రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు ప్రయోజనం పొందే వారికి నెలరోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వారు ఎంచుకున్న ప్రాజెక్టు నెలకొల్పడానికి ఆర్థిక వనరులు సమకూర్చాల్సి ఉంటుందన్నారు. జూలై మొదటి వారంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రతి మండలంలో ఒక అధికారిని నియమించాలన్నారు. అలాగే సన్నబియ్యం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. డీలర్లు దొడ్డు బియ్యం ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా అధికారులు నవీన్, హనుమంతురావు, కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.