కళాశాల.. సమస్యల తిష్ట
●
ఒక్కటే మూత్రశాల..
వందలమంది విద్యార్థినులు చదువుతున్న కళాశాలలో ఒక్కటే మూత్రశాల ఉండటంతో క్యూలైన్లో నిలబడి ఎదురుచూడటం సిగ్గుగా ఉంది. పాలకులు, అధికారులు కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి.
– చిన్నారి, విద్యార్థిని
కనీస సౌకర్యాలు
కల్పించాలి..
కళాశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో చాలామంది విద్యార్థినులు చదువుకు దూరమవుతున్నారు. బస్టాండ్ ఎదురుగా కళాశాల ఉండటం, బాత్రూం కోసం క్యూలో నిల్చోవడం చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు పరిశీలించి వసతులు కల్పించాలి.
– మాధవి, విద్యార్థిని
ఉన్నతాధికారులకు
వివరించాం..
కళాశాలలో నెలకొన్న సమస్యలను గతంలోనే పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మూత్రశాలలు, శిథిలావస్థకు చేరుకున్న భవనం, ఆవరణలో నిలుస్తున్న వర్షపునీరు, అసంపూర్తి అదనపు తరగతి గదులు ఇతర సమస్యలను నివేదించాం.
– భాగ్యవర్ధన్రెడ్డి, ప్రిన్సిపాల్
శిథిలావస్థలో ఆత్మకూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల
● వందలాది మంది విద్యార్థులు.. ఒక్కటే మూత్రశాల
● పట్టించుకోని అధికారులు.. ఆందోళనలో విద్యార్థులు
ఆత్మకూర్: పట్టణంలో 50 ఏళ్ల కిందట నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం ప్రస్తుతం శిథిలావాస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కళాశాల ఆవరణలోనే ఉన్నత పాఠశాల కూడా ఉంది. ఇందులో 200 పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కళాశాల, పాఠశాల విద్యార్థులందరికి కలిపి ఒకే మూత్రశాల ఉండటంతో వెళ్లాలంటే క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్నత పాఠశాలకు వేరుగా మూత్రశాలలు నిర్మించాల్సి ఉండగా సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదు. కళాశాల వెనుక భాగంలో ఐదేళ్ల కిందట కాంట్రాక్టర్ మూత్రశాలలను ఇష్టానుసారంగా నిర్మించడంతో నీటి సౌకర్యం లేకపోవడంతో పాటు డ్రెయినేజీలోని మురుగు తిరిగి వస్తుండటంతో వృథాగా మారాయి.
ఆవరణలో నిలుస్తున్న వర్షపు నీరు..
కళాశాల భవనం కుంగిపోవడంతో వర్షాకాలంలో వర్షపు నీరు ఆవరణలో నిలిచి విద్యార్థులు, అధ్యాపకులు లోనికి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఆవరణలో మట్టి వేయించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా ఫలితం లేదని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన భవనాన్ని కూల్చి కొత్తది నిర్మిస్తే తప్పా సమస్య పరిష్కారం కాదని స్థానికులు అంటున్నారు.
అసంపూర్తిగా అదనపు గదులు..
రూ.20 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి 2008, జనవరి 6న అప్పటి ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ బేస్మెంట్ వరకు పనులు చేసి అందినకాడికి బిల్లు తీసుకొని చేతులెత్తేశాడు. నాటి నుంచి నేటివరకు పనులు అక్కడే నిలిచిపోయాయి. కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టిసారించి కళాశాలను సందర్శించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
పిల్లర్లకే పరిమితమైన అదనపు తరగతి గదులు
విద్యార్థులు ఇలా..
ఇంటర్మీడియట్ రెగ్యులర్ ఒకేషనల్
మొదటి సంవత్సరం 208 75
రెండో సంవత్సరం 172 60
కళాశాల.. సమస్యల తిష్ట
కళాశాల.. సమస్యల తిష్ట
కళాశాల.. సమస్యల తిష్ట
కళాశాల.. సమస్యల తిష్ట
కళాశాల.. సమస్యల తిష్ట


