
టార్గెట్.. 2.50 లక్షల మంది
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి : వరంగల్ వేదికగా బీఆర్ఎస్ మరోసారి ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించేందుకు బుధవారం అంకురార్పణ జరిగింది. పార్టీ రజతోత్సవ వేడుకల మహాసభ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దా స్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, సభా పర్యవేక్షకులు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మా జీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి, నరేందర్, ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్చార్జ్ గ్యా దరి బాలమల్లు తదితరులు భూమి పూజ చేశారు. అంతకుముందు మంగళవారం ఎర్రవెల్లిలో ఉమ్మడి వరంగల్కు చెందిన ముఖ్యనేతలతో సమావేశమైన అధినేత కేసీఆర్.. సభావేదిక, జనసమీకరణ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. 10లక్షలకుపైగా మందితో బహిరంగసభ నిర్వహించా లని, దీనికి కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ వేడుకల బహిరంగసభ ఏర్పాట్లపైనే నిమగ్నమైన పార్టీ నాయకులు బుధవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2.50 లక్షలమందిని సమీకరించాలని టార్గెట్ పెట్టారు.
జన సమీకరణకు ఇన్చార్జ్లు..
కేసీఆర్ ఆదేశాలతో 2.50 లక్షల మంది జనసమీకరణకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఈమేరకు కేసీఆర్.. సభా ఏర్పాట్లు, జన సమీకరణకు సంబంధించి ముఖ్యనేతలకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. పాలకుర్తి, వర్ధన్నపేటకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇన్చార్జ్గా వ్యవహరించనుండగా.. వరంగల్ పశ్చిమను మాజీ చీఫ్ విప్ వినయ్భాస్కర్కు అప్పగించారు. వరంగల్ తూర్పును నన్నపునేని నరేందర్, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి, భూపాలపల్లిని గండ్ర వెంకటరమణారెడ్డికి, నర్సంపేట, ములుగు నియోజకవర్గాలకు పెద్ది సుదర్శన్రెడ్డిని ఇన్చార్జ్లుగా నియమించారు. అదేవిధంగా జనగామ, స్టేషన్ ఘన్పూర్ బాధ్యతలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చూడనుండగా, పరకాలను చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ను సత్యవతి రాథోడ్, శంకర్నాయక్, డోర్నకల్ను రెడ్యానాయక్, మాలోత్ కవితకు అప్పగించారు. జన సమీకరణపై ప్రతీ రోజూ దృష్టిపెట్టాలని, మండల, గ్రామస్థాయిల్లో పర్యటించి సమావేశాలు నిర్వహించాలన్న కేసీఆర్ ఆదేశంతో ఇన్చార్జ్లు ద్వితీయ శ్రేణి, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు చేస్తున్నారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణ తదితర బాధ్యతలు నిర్వహించే హైదరాబాద్కు చెందిన పార్టీ రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు వరంగల్ నగరంలోనే మకాం వేయనున్నారు.
నేటి నుంచి మరింత వేగంగా పనులు..
సభకు మరో 24 రోజులే గడువు ఉండడంతో గురువారం నుంచి సభా కోసం చేపట్టే పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటి వరకు బహిరంగసభకు సిద్ధం చేసిన 1,213 ఎకరాల స్థలంలో.. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఉంటుందని, పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించిన బీఆర్ఎస్ నేతలు, మరో మూడు, నాలుగు వందల ఎకరాలు కూడా సమీకరించనున్నట్లు వివరించారు. సుమారు 50వేలకుపైగా వాహనాలను పార్కింగ్ చేయడానికి వీలుగా ఏర్పాట్లుంటాయని, మహాసభకు తరలివచ్చే ప్రజల కోసం 10లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల నీళ్ల బాటిళ్లను సిద్ధంగా ఉంచనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ తదితర ఏర్పాట్లకు ఆటంకం కలగకుండా 1,500 మంది వలంటీర్లను నియమించి శిక్షణ ఇస్తున్నామన్నారు. అత్యవసర వైద్యసేవలు, అంబులెన్సులను అందుబాటులో ఉంచుతున్నారు.
భూమి పూజకు తరలివచ్చిన నేతలు..
భూమి పూజలో ముఖ్యనేతలతోపాటు మర్రి యాదవరెడ్డి, వాసుదేవరెడ్డి, సతీశ్రెడ్డి, భరత్ కుమార్రెడ్డి, చింతం సదానందం, వొడితల ఇంద్రనీల్, బొంగు అశోక్ యాదవ్, సోదా కిరణ్, నరెడ్ల శ్రీధర్, కొండపాక రఘు, రాకేశ్రెడ్డి, పులి రజినీకాంత్, జోరిక రమేశ్, రామ్మూర్తి, చింతల యాదగిరి, తంగెడ నగేశ్, తంగెడ మహేందర్, ఎల్తూరి స్వామితోపాటు ఎల్కతుర్తి నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలం ఇదే..
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి జనసమీకరణ
ఉమ్మడి వరంగల్ నేతలకు టార్గెట్..
జన సమీకరణకు ఇన్చార్జ్లుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఇప్పటికే కేసీఆర్తో భేటీ అయిన ముఖ్య నేతలు
నేటి నుంచి సభావేదిక ఏర్పాట్లు.. వరంగల్లోనే హైదరాబాద్ నేతలు
రజతోత్సవ సభకు మరో 24 రోజులే...

టార్గెట్.. 2.50 లక్షల మంది