ఉపకార వేతనాలు విడుదల చేయాలి
నర్సంపేట: ప్రభుత్వం ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని లేదంటే కళాశాలల బంద్ కొనసాగుతుందని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యం అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ ప్రాంత కళాశాలలు కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలపై ఆధారపడి నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులకు జీతాలు, అద్దె భవనాల కిరాయి ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. దిక్కులేని పరిస్థితిలో ప్రైవేట్ యాజ మాన్యాలు నిరవధికంగా కళాశాలలను మూసి వేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. బకాయిలు విడుదల చేసే వరకు నిరసన కొనసాగుతుందని, రాబోయే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించడానికి వెనకాడబోమన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీ, సిద్దార్థ, ఆచార్య, మాతృశ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ఎం.రామరాజు, పరమేశ్వర్, సాగర్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో..
పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దిడ్డి పార్ధసారధి, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గుర్రం అజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీఓ కార్యాలయ అధికారికి సోమవారం విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా..ఇప్పటి వరకు పెండింగ్ బకాయిలు విడుదల చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ జిల్లా నాయకులు పాలక పవన్, టైన్ నాయకులు ఈశ్వర్, డివిజన్ నాయకులు సందీప్, శ్రీనివాస్, సంపత్, మహేష్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యం


