దారిదోపిడీ దొంగల అరెస్ట్
ఏలూరు టౌన్ : దారిదోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను ద్వారకాతిరుమల మండలం కప్పలగుంటలో బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కొంతమూరు జంగాలకాలనీకి చెందిన మానిపాటి విజయ్కుమార్, రాజమహేంద్రవరంలోని చింతల నామవరం ప్రాంతానికి చెందిన దామిరెడ్డి త్రిమూర్తులుగా గుర్తించారు. వీరినుంచి రూ.5 వేల నగదు, ఒక బంగారపు ఉంగరం, టార్చ్లైట్, నిందితులు వినియోగించే పాసింజర్ ఆటో ఏపీ39 యూక్యూ 2652ను సీజ్ చేశారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపర్చారు. ఈ దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్సై సుధీర్, భీమడోలు హెచ్సీ ఎస్.శ్రీనివాసరావు, ద్వారకాతిరుమల కానిస్టేబుల్ ఎంఎన్డీ ప్రసాద్, హెచ్జీ వీజే ప్రకాష్బాబును ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. దారిదోపిడి ఘటనలను ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ వెల్లడించారు.
దారి దోపిడీ ఘటనలు ఇలా ఉన్నాయి.
● మానిపాటి విజయ్కుమార్ రెండేళ్ల క్రితం తన స్నేహితులు సాల వెంకన్న, అతని భార్య ముంతాజ్, ధవళేశ్వరానికి చెందిన రవి, సానిటోరియంకు చెందిన మానస (హిజ్రా) గోకవరం బస్టాండ్ ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్ సంజీవ్ అనే ఆరుగురు వ్యక్తులు దారిదోపిడీలకు పాల్పడడం ప్రారంభించారు. కారును అద్దెకు తీసుకుని విజయవాడ వైపు వెళుతూ ఏలూరు జిల్లా దెందులూరు మండలం గుండుగొలను బస్టాండ్ సమీపంలో కారు రోడ్డు పక్కగా పార్కింగ్చేసి ఉండటాన్ని గమనించారు. కారు డ్రైవర్ సీట్ వైపు అద్దం కిందకు దింపి ఉండడంతో డ్రింక్ తాగేందుకు ఆపినట్లు నిందితులు కారు ఆపి వేరొక కారులోని సీటులో ఉన్న పర్సులో బంగారు చైను, బంగారపు ఉంగరాన్ని, రూ.5 వేల నగదును కాజేశారు.
● జగ్గంపేట దగ్గరలోని ఎర్రవరం ప్రాంతంలో నాలుగేళ్ల క్రితం విజయ్కుమార్, సాలా బలరాం ఇద్దరూ కలిసి రాత్రి సమయంలో జాతీయ రహదారిపై టార్చ్లైట్ వేస్తూ వారివద్దకు వచ్చిన వ్యక్తిని కొట్టి అతని వద్ద రెండు బంగారు ఉంగరాలు లాక్కున్నారు.
● మూడేళ్ల క్రితం సిద్ధాంతం ఇటుకల బట్టీ రోడ్డు పక్కన ఒక వ్యక్తి మద్యం మత్తులో తన మోటారు సైకిల్పై ఉండగా విజయ్కుమార్, సాల వెంకన్న, అతని భార్య ముంతాజ్, రవి, మానస (హిజ్రా), సంజీవ్ కలిసి అతడ్ని కొట్టి 3 బంగారు ఉంగరాలు బలవంతంగా లాక్కున్నారు.
● రాజానగరం దాటిని అనంతరం మల్లేపల్లి సమీపంలో పామాయిల్ తోటల వద్ద చేప పిల్లల వ్యాను డ్రైవర్ను కొట్టి అతని మెడలోని బంగారు చైను లాక్కుని పారిపోయారు.
● దేవరపల్లి మండలం చిన్నాయగూడెం గ్రామానికి చెందిన ఆలూరి చిన్న వెంకటేశ్వరరావు అక్టోబర్ 25న మోటారు సైకిల్పై భీమడోలు వస్తున్నాడు. ద్వారకాతిరుమల మండలం కప్పలగుంట గ్రామంలో జాతీయ రహదారిలో ఒక కల్వర్టు వద్ద మోటారు సైకిల్ను ఆపగా అప్పటికే పొలంలో దాగి ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంకటేశ్వరరావుపై ఆకస్మికంగా దాడి చేశారు. రూ.10 వేల నగదు, సెల్ఫోన్, బంగారు ఉంగరాన్ని బలవంతంగా లాక్కున్నారు. వెంకటేశ్వరరావు కాళ్లు, చేతులు కట్టివేసి చెట్లపొదల్లో పడేసి పారిపోయారు. ఈ ఘటనపై బాధితుడు ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేశారు. ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో భీమడోలు సీఐ యూజే విల్సన్ ఆధ్వర్యంలో ఎస్సై సుధీర్, సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు. దారి దోపిడీకి పాల్పడిన విజయ్కుమార్, త్రిమూర్తులను సాంకేతిక పరిజ్ఞానంతో ద్వారకాతిరుమల మండలంలోని కప్పలగుంటలో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇద్దరు దొంగలను పట్టుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్


