అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
ఏలూరు టౌన్: ఏలూరు శాంతినగర్ ఏడో రోడ్డులోని అపార్ట్మెంట్లోని ప్లాట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించడంతో ఆ ప్రాంతంలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో అర్థంకాక జనం కిందికి పరుగులు తీశారు. అపార్ట్మెంట్లోని ఫోర్బీ ప్లాట్లో మంటలు చెలరేగటం, మరోవైపు దట్టమైన పొగతో 5వ అంతస్తులోని వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతూ బయటకు రాలేక తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేశారు. అప్పటికే ప్లాట్లోని వస్తువులు, విలువైన సామాగ్రి కాలి బూడిదయ్యాయి. బాధితులను అగ్నిమాపక శాఖ సిబ్బంది సాహసోపేతంగా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సీహెచ్ రత్నబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శాంతినగర్ ఏడో రోడ్డు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల పక్కన హిమనీ అపార్ట్మెంట్స్ ఉంది. శనివారం ఉదయం ఫోర్త్ బీ ప్లాట్లోని టీవీ ప్యానెల్ బోర్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు బెడ్రూమ్, హాలు, కిచెన్లోకి వ్యాపించాయి. ఆ సమయంలో ప్లాట్ యజమాని శ్రీకాంత్, కుటుంబ సభ్యులు ఇంట్లో లేదు. దట్టమైన పొగతో కారిడార్, మెట్ల ప్రాంతం పొగ కమ్మేసింది. 5వ అంతస్తులోని వృద్ధులు పీ.రామకృష్ణ (74), ఎస్.విజయలక్ష్మి (82) బయటకు రాలేక చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది వారిని చేతులపై ఎత్తుకుని కిందికి తీసుకువచ్చారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది గంటకు పైగా శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.15 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది సేవలను అపార్ట్మెంట్ వాసులు అభినందించారు.
తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య
చాట్రాయి: మనస్తాపంతో ఉరేసుకుని విద్యార్థిని మృతి చెందిన సంఘటన మండలంలోని చాట్రాయి గ్రామానికి చెందిన మరీదు ప్రవల్లిక(20) తరుచూ ఫోన్ చూస్తుందని తల్లిదండ్రులు శుక్రవారం మందలించారు. శనివారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లగా మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట వికాస్ కాలేజీలో బీ ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతుంది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో అధికారిణి
యలమంచిలి: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మండల స్థాయి మహిళా అధికారి చిక్కుకున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. పది రోజుల క్రితం ఉన్నతాధికారి పేరుతో బెదిరించడంతో ఆమె ఆన్లైన్లో రూ.70 వేలు వేసినట్లు సమాచారం. సైబర్ నేరగాళ్ల పని అని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకున్నట్లు తెలిసింది.
15 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి..
ఏలూరు టౌన్: విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తులు 15 ఏళ్ళ క్రితం పోలీసులను మోసం చేసేందుకు ప్రయత్నించటంతో వారిని అరెస్ట్ చేయగా.. న్యాయస్థానం అప్పట్లో బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి నుంచి కోర్టు వాయిదాలకు రాకుండా పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతోన్న ఒక వ్యక్తిని ఏలూరు ఐడీ పార్టీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. 2010లో ఏలూరు డీఐజీగా మహేష్ భగవత్ వద్దకు జవ్వాది లక్ష్మీచెందు, చిన్న నాయుడు వచ్చి తాము దివంగత వైఎస్సార్ బంధువులమని.. ఒక ఎస్సైకు తణుకు పోలీస్స్టేషన్కు పోస్టింగ్ ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అనుమానం వచ్చిన డీఐజీ ఆరా తీయగా, నకిలీ వ్యక్తులుగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. బెయిల్పై విడుదల అయ్యాక జవ్వాది లక్ష్మీచెందు వాయిదాలకు గైర్హాజరవుతున్నాడు.


