
కౌన్సిలర్ గుండ్లపల్లి వాణికి పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న ఎంపీ వెంకట్రెడ్డి
భువనగిరి, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ గుండ్లపల్లి వాణిభరత్గౌడ్ సొంతగూటికి చేరారు. సోమవారం భువనగిరి పట్టణ శివారులోని దీప్తి హోటల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రాష్ట్రం నాశనమైందన్నారు. ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు.
బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పి రూ.5లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఖమ్మంలో జరిగిన జనగర్జన సభను అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రజలు భారీగా తరలివచ్చారని పేర్కొన్నారు. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్కు 8 సీట్లు రాగా బీఆర్ఎస్కు 4 వచ్చాయన్నారు. వాణికి చైర్మన్ పదవి ఇస్తామని మాయమాటలు చెప్పి బీఆర్ఎస్లో చేర్చుకున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో యాదగిరిగుట్టలో 12కు 12 సీట్లు గెలిపించే బాధ్యత నాదేనన్నారు.
తుది శ్వాస వరకు కాంగ్రెస్తోనే : వాణిభరత్గౌడ్
బీఆర్ఎస్లో ప్రాధాన్యం లేకపోవడంతో తిరిగి కాంగ్రెస్లో చేరామని కౌన్సిలర్ గుండ్లపల్లి వాణిభరత్ గౌడ్ తెలిపారు. తుదిశ్వాస వరకు కాంగ్రెస్తోనే ఉంటామన్నారు. తమకు పదవుల కంటే విలువలతో కూడిన రాజకీయాలు ముఖ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తామన్నారు.
కాంగ్రెస్లో చేరిన వారిలో వాణితో పాటు అరుణ గుణశేఖర్, ముక్కెర్ల మల్లేష్, సరోజన హరీష్ వారి అనుచరులు ఉన్నారు. కార్యక్రమంలో గుట్ట ఎంపీపీ చీర శ్రీశైలంమండల, పట్టణ అధ్యక్షులు కానుగు బాలరాజుగౌడ్, బందారపు భిక్షపతిగౌడ్, కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్యాదవ్, నాయకులు బిట్టు హరీష్ పాల్గొన్నారు.