వరి కొయ్యలు కాల్చొద్దు
ఫ భూమిలో కలియదున్నితేనే మేలు
ఫ గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సూచనలు
గుర్రంపోడు: వానాకాలం వరి కోతలు ముగియడంతో రైతులు యాసంగి వరి సాగుకు నారుమడులను సిద్ధం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది రైతులు తమ పొలాల్లోని వరి కొయ్యలకు నిప్పు పెడుతుండటంతో భూసారం తగ్గిపోతుంది. భూమిలో ఉండి పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించిపోతున్నాయి. వరి కొయ్యలను భూమిలో కలియదున్నడం వల్ల పంటలకు ఎరువుగా మారి దిగుబడి పెరుగుతుందని గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సూచిస్తున్నారు.
హార్వెస్టర్లతో వరి కోతలు..
వానాకాలం సీజన్లో అధిక వర్షాలతో పొలాలు జాలు పట్టాయి. దీంతో పొలాలు ఆరే పరిస్థితితి లేక చైన్ హార్వెస్టర్లతో రైతులు వరి కోతలు జరిపించారు. దీంతో పొలాల్లో గడ్డి చేతికందే పరిస్థితి లేదు. పైరు సగానికే కోయడం వల్ల రైతులు వరి కొయ్యలు కాల్చి త్వరగా పొలం తయారుచేస్తున్నారు.
కలియదున్నితే ప్రయోజనాలు ఇవీ..
●వరి కొయ్యలను భూమిలోనే కలియదున్నితే మట్టిలో కలిసిపోయి సేంద్రియ ఎరువుగా మారుతుంది.
● పంటలకు మేలు చేసే బ్యాక్టీరియా సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి.
● సేంద్రియ కర్బన శాతం, వానపాములు పెరిగి భూమి సారవంతమవుతుంది.
● రసాయన ఎరువులను 30 శాతం వరకు తగ్గించుకోవచ్చు.
● పొలాన్ని రోటోవేటర్తో కలియదున్నితే వరి కొయ్యలు చిన్న ముక్కలుగా మారుతాయి.
● దుక్కికి నీళ్లు పెట్టి సింగిల్ సూపర్ ఫాస్పేట్ వేసి 15 నుంచి 20 రోజులు నానబెట్టాలి.
వరి కొయ్యలు కాల్చితే కలిగే నష్టాలు..
● భూసారం దెబ్బతిని భూమి తేమను నిలుపుకునే సహాజ గుణాన్ని కోల్పోతుంది.
● నేలలో సహజంగా ఉండే సూక్ష్మజీవులు, మిత్ర పురుగులు నశిస్తాయి. నత్రజని పోషక పదార్ధాలు క్షీణించి సాగుకు పనికిరాకుండా పోతుంది.
● కాల్చడం వల్ల వచ్చే దట్టమైన పొగతో ఆరోగ్యం దెబ్బతింటుంది.
● మంటలు పెద్దవైతే పక్కనున్న పంటలు, వస్తువులు కాలిపోయే ప్రమాదం ఉంది.
వరి కొయ్యలు కాల్చొద్దు


