నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్‌

Nov 20 2025 7:08 AM | Updated on Nov 20 2025 7:08 AM

నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్‌

నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్‌

చౌటుప్పల్‌ రూరల్‌: చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురం గ్రామంలో 3.05 ఎకరాల భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఓ ప్రధాన పార్టీ మండల అధ్యక్షుడితో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురిని బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దండుమల్కాపురం గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 42లో 3.05 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో తెల్లపాటి భూపేష్‌ పేరుతో ఉంది. ఈ భూమిని 2019లో చౌటుప్పల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన ఉప్పు రాజేష్‌ సహకారంతో ఏపీలోని నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం గువ్వాడి గ్రామానికి చెందిన భోగినేని మెహన్‌రావు పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి దండుమల్కాపురం గ్రామానికే చెందిన బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్‌ తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 1994 జూన్‌ 15న ఈ భూమిని సాదాబైనామా కింద మోహన్‌రావుకు అమ్మినట్లు, 2007లో 1–బి సర్టిఫికెట్‌ జారీ చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని, 2019లో రికార్డు సవరణ కోసం దరఖాస్తు చేసుకుని మెహన్‌రావు పేరు మీద భూమి ఉన్నట్లు రికార్డులు మార్చారని పోలీసులు పేర్కొన్నారు. 2019 సెప్టెంబర్‌ 23న ప్రొసీడింగ్‌ను అప్పటి చౌటుప్పల్‌ తహసీల్దార్‌ రవీంద్రసాగర్‌ జారీ చేసినట్లు నకిలీ పత్రాలు తయారు చేశారని వివరించారు.

సీనియర్‌ అసిస్టెంట్‌దే కీలకపాత్ర..

ఈ 3.05 ఎకరాల భూమి పక్కనే కాందీశీకుల భూమి కూడా ఉంది. ఈ భూములు విలువైనవని తెలుసుకుని 2019లో అప్పటి చౌటుప్పల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన ఉప్పు రాజేష్‌ రాజకీయ నాయకులతో కుమ్మకై ్క అక్రమ రిజిస్ట్రేషన్‌ చేయడానికి కావాల్సిన పనిని చక్కబెట్టినట్లు సమాచారం. అసలు యాజమాని తెల్లపాటి భూపేష్‌ నుంచి సాదాబైనామాగా భోగినేని మోహన్‌రావు భూమి కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రం సృష్టించాడు. అంతేకాకుండా అప్పటి తహసీల్దార్‌కు ఫైల్‌ తయారుచేసి అసలు విషయం చెప్పకుండా అన్ని ఫైల్స్‌ మాదిరిగా టప్పాలో పెట్టి తహసీల్దార్‌ చేత సంతకం చేయించాడు. సాదాబైనామా నుంచి ప్రొసీడింగ్‌ ఇచ్చినట్లు పత్రాన్ని జారీ చేశాడు. దీని ఆధారంగా మోహన్‌రావు భూమిని గిర్కటి నిరంజన్‌కు రిజిస్ట్రేషన్‌ చేసేలా లైన్‌ క్లియర్‌ చేశాడు. ఈ రిజిస్ట్రేషన్‌లో గిర్కటి నిరంజన్‌గౌడ్‌తో పాటు ఓ గ్రామ మాజీ సర్పంచ్‌ భర్తకు కూడా వాటా ఉండగా.. లావాదేవీల్లో వచ్చిన తేడాలతో ఆయనకు కొంత మొత్తం ఇచ్చి భూమిని నిరంజన్‌గౌడ్‌ ఒక్కడే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు.

నలుగురి అరెస్ట్‌..

ఈ అక్రమ రిజిసేర్టషన్‌పై దండుమల్కాపురం గ్రామానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త చౌటుప్పల్‌ తహసీల్దార్‌ వీరబాయికి ఫిర్యాదు చేయగా.. తహసీల్దార్‌ చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి గిర్కంటి నిరంజన్‌గౌడ్‌, అడ్డగూడూరు మండలం ఆర్‌ఐగా పనిచేస్తున్న ఉప్పు రాజేష్‌, భోగినేని మోహన్‌రావు, దండుమల్కాపురం గ్రామానికి చెందిన అత్తాపురం నరేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు.

ఫ 3.05 ఎకరాల భూమికి

తప్పుడు పత్రాల సృష్టి

ఫ రిజిస్ట్రేషన్‌లో కీలకపాత్ర పోషించిన తహసీల్దార్‌ కార్యాలయంలోని సీనియర్‌ అసిస్టెంట్‌

ఫ నలుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

ఫ రిమాండ్‌కు తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement