
కనికరించని ప్రభుత్వం
కరువు తాండవం..
జిల్లాలో కరువు కరాళ నృత్యం చేసింది. ఖరీఫ్, రబీ సీజన్లలో తీవ్ర వర్షాభావం వెంటాడింది. వాన జాడలేక పంటలు నిట్టనిలువునా ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. కొంత మంది రైతులు పొలాల్లోనే పంటలు వదిలేసుకుని, సర్వం నష్టపోయారు. పశుగ్రాసం కూడా దక్కలేదు. చివరికి అన్నదాత అప్పుల పాలయ్యాడు. ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం అన్యాయమే చేసింది.
● జిల్లా అంతటా దుర్భిక్ష ఛాయలు
● జాబితాలో 10 మండలాలకే చోటు
● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
● మిగతా మండలాల మాటేమిటి?
● మహానాడు నేపథ్యంలోమభ్యపెట్టేందుకే కంటితుడుపు ప్రకటన
కడప సెవెన్రోడ్స్/కడప అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా జిల్లాలో కరువు మండలాలను ప్రకటించింది. రబీ సీజన్లో 10 మండలాలను కరువు జాబితాలో చేరుస్తూ సోమవారం జీఓ ఎంఎస్ నంబరు 3ను జారీ చేసింది. మైదుకూరు, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం, ఖాజీపేట, చాపాడు, కాశినాయన, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, తొండూరు మండలాల్లో కరువు తీవ్రత అధికంగా ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మైలవరం మండలాన్ని మోడరేట్డ్రాట్ కింద చేర్చింది. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం మండలాలు కరువు కింద చూపారు. కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలోని మండలాలు ఇందులో అధికంగా ఉండటం గమనార్హం.
తీవ్ర వర్షాభావం
జిల్లా అంతటా తీవ్ర వర్షాభావం చోటు చేసుకుంది. జిల్లా సాధారణ వర్షపాతంలో 14.1 శాతం లోటు ఏర్పడింది. వరి, పత్తి, జొన్న, మినుము, కంది, తదితర 18 రకాల పంటల సాధారణ సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. తీవ్ర వర్షపాత లోటు, డ్రైస్పెల్స్ కారణంగా సాగు చేసిన పంటలు నిలువునా ఎండిపోయాయి. పెద్దముడియం మండలంలో వర్షపాత లోటుతోపాటు రెండు డ్రైస్పెల్స్ అంటే వరుసగా 42 రోజులు వర్షమే పడలేదు. కలసపాడు, తొండూరు, వేంపల్లె మండలాల్లో కూడా రెండు డ్రైస్పెల్స్ చోటు చేసుకున్నాయి. పోరుమామిళ్ల, గోపవరం, అట్లూరు, సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల్లో ఒక్కొక్క డ్రైస్పెల్స్ చొప్పున నమోదయ్యాయి. బద్వేలు మండలంలో మాత్రం డ్రైస్పెల్ లేకపోయినా వర్షపాత లోటు ఏర్పడింది. జూన్ 4 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రెఫరెన్స్ పిరీయడ్గా తీసుకున్నారు. వర్షపాత లోటు, డ్రైస్పెల్స్లు విపత్తుల నిర్వహణ విభాగం మ్యాండేటరీ ఇండికేటర్స్గా పరిగణిస్తుంది. ఒక మండలాన్ని కరువు కింద ప్రకటించాడానికి ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. పంటల సాగు విస్తీర్ణం, రిమోట్సెన్సింగ్ మాయిశ్చర్ అడక్వేట్ ఇండెక్స్, హైడ్రోలాజికల్ ఇండెక్స్లను ఇంప్యాక్ట్ ఇండికేటర్స్గా తీసుకుంటారు. వీటన్నింటినీ పరినణనలోకి తీసుకొని పరిశీలిస్తే.. జిల్లాలో దాదాపు అన్ని మండలాలను కరువు జాబితా కింద చేర్చాల్సి వుంటుంది. కానీ అప్పట్లో అధికారులు గ్రౌండ్ ట్రూతింగ్ పేరిట ఒక తప్పుడు నివేదికను కమిషనర్ డిజాస్టర్ మేనేజ్మెంట్కు పంపారు. ఆ నివేదిక ఆధారంగా జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు కింద ప్రకటించలేదు.
ఆందోళనల నేపథ్యంలో..
ప్రభుత్వ వైఖరిపై జిల్లా రైతాంగంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. జిల్లా సమీక్ష కమిటీ సమావేశం ఎదుట సీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆ తరువాత కాలంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులను నిలదీశారు. కరువు మండలాల ప్రకటన చేయకపోవడంపై జిల్లా అంతటా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలకు సమాధానం చెప్పలేక జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు తల పట్టుకోవాల్సి వచ్చింది. జిల్లాలో అధిక అసెంబ్లీ స్థానాలను ప్రజలు ఎన్డీఏ కూటమికి కట్టబెట్టినా అభివృద్ధి చేయకపోగా.. కొప్పర్తి ఎంఎస్ఎంఈ, ఏపీజీబీ ప్రధాన కార్యాలయం వంటి వాటిని అమరావతికి ప్రభుత్వం తరలించింది. ఇది కూటమి నేతలను మరింత ఇరకాటంలోకి నెట్టింది. మే నెలలో తెలుగుదేశం పార్టీ కడపలో మహానాడు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు ఏమి చేశారని ఇక్కడ మహానాడు జరుపుతున్నారంటూ ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంది. కనీసం కంటి తుడుపుగా కరువు మండలాలను ప్రకటించాలని భావించే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 10 మండలాలను మాత్రమే కరువు కింద ప్రకటిస్తే మిగతా మండలాల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కనికరించని ప్రభుత్వం

కనికరించని ప్రభుత్వం