డిసెంబర్ 30 తర్వాత కూడా రద్దయిన పాత పెద్ద నోట్లను తమ వద్దే అట్టిపెట్టుకున్న వారిపై జరిమానా విధించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఆర్డినెన్స్ తేవాలని కేంద్రం యోచిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. డిసెంబర్ 30 తర్వాత చెరో పది లేదా అంతకంటే ఎక్కువ రూ.500 నోట్లు, రూ.1000 నోట్లు తమ వద్ద ఉంచేసుకున్న వారిపై జరిమానా విధించాలని ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ఎక్కువగా నోట్లు అట్టిపెట్టుకున్న వారిపై రూ.50వేల జరిమానా లేదా దాచుకున్న నగదువిలువకు ఐదురెట్లు జరిమానా విధించే వీలుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతాపార్టీ 1978లో రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దుచేసినపుడు సైతం ఇలాంటి ఆర్డినెన్స్నే జారీచేసింది.