మాజీమంత్రి, ప్రస్తుత పీసీసీ అధికార ప్రతినిధి కోటగిరి విద్యాధరరావు గుండెపోటుతో మరణించారు. ఏలూరులోని తన నివాసంలో ఈరోజు ఉదయం ఆయన కన్నుమూశారు. పంచాయతీ ఎన్నికల్లో తన కుమార్తెకు మద్దతుగా ప్రచారం చేసేందుకు వెళుతు విద్యాధరరావు కారు ఎక్కుతూ గుండెపోటుకు గురయ్యారు. ఆయన కొంతకాలం అనారోగ్యంతో బాధపడ్డారు. కోటగిరి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 1983లో విద్యాధరరావు తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ హయాంలో వ్యవసాయ శాఖ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తీర్థం తీసుకున్నారు. పీఆర్పీ విలీనం అనంతరం చిరంజీవి వెంటే కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1983 నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా చింతలపూడి నియోజకవర్గం నుంచి ఎన్నికైన కోటిగిరికి జిల్లాలో మంచి పట్టున్న నేతగా పేరుంది. ఆయన ఆకస్మిక మృతితో ఏలూరులో విషాద ఛాయలు అలుముకున్నారు. విద్యాధరరావు మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. కాగా కోటగిరి మరణవార్త విన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి హుటాహుటీన ఢిల్లీ నుంచి ఏలూరు బయల్దేరారు.
Published Sat, Jul 20 2013 10:50 AM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement