మరింత క్షీణించిన ఆరోగ్యం | Fasting Vijayamma health deteriorates | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 24 2013 11:25 AM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఆమరణదీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. ఆమె చేపట్టిన సమరదీక్ష ఆరవ రోజుకు చేరుకుంది. విజయమ్మ ఆరోగ్యంపై గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తక్షణం దీక్ష విరమించాలన్న తమ విజ్ఞప్తిని ఆమె తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. విజయమ్మ ఇదే విధంగా దీక్ష కొనసాగిస్తే ప్రమాదకరం అని వారు హెచ్చరించారు. ఆమె మూత్రపిండాలు పాడయ్యే అవకాశముందన్నారు. తక్షణం వైద్యచికిత్స అందించకుంటే మెదడు మీదా ప్రభావం చూపుతుందని చెప్పారు. కీటోన్ బాడీస్ విడుదలవుతున్నట్లు తేలిందని, ఇది ప్రమాదకరమని వైద్యులు తెలిపారు. విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను తీవ్ర ఉద్రిక్తతల మధ్య శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.55 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. పోలీసు బలగాలు శిబిరంలోకి దూసుకొచ్చాయి. నీరసిం చిన విజయమ్మను తమతోపాటు రావాలని, ఆస్పత్రికి తరలిస్తామని పోలీసులు కోరారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు దీక్షవిరమించేది లేదని విజయమ్మ తేల్చి చెప్పారు. అక్కడ ఉన్న నేతలు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. జై జగన్, జై సమైక్యాంధ్ర నినాదాలతో దీక్షా ప్రాంగణం హోరెత్తింది. కనీసం అంబులెన్స్ కూడా తీసుకురాని పోలీసులు 1.55 గంటలకు బలవంతంగా ఆమెను పోలీసు వ్యాన్‌లోనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. కొందరు నేతలను పోలీసులు వేదికపై నుంచి ఎత్తి పడేశారు. కోటంరెడ్డి శ్రీధరరెడ్డిని వేదిక పైనుంచి కిందికి తోసేశారు. దీంతో ఆయన కాలికి గాయమయింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ విజయమ్మ ఆస్పత్రి నుంచి బయటికి వచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. 20 నిమిషాల తర్వాత వైద్యులు వచ్చి ఆమెను ఐసీయూలోకి తరలించారు. కాగా, సర్కారు తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఈరోజు సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే ఆస్పత్రిలోనూ విజయమ్మ దీక్షను కొనసాగిస్తున్నారని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఐవీ ప్లూయిడ్స్ తీసుకునేందుకు కూడా ఆమె ఒప్పుకోవడం లేదని వెల్లడించారు. మహానేత సతీమణిని అమానుషంగా తరలించిన తీరుకు నిరసనగా బంద్ కు పిలుపునిస్తున్నట్టు చెప్పారు. బంద్కు అందరూ సహకరించాలని కోరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement