రోజురోజుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి మద్ధతు పెరిగిపోతుండగా అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు కష్టాలు రెట్టింపవుతున్నాయి. పన్నీర్ వర్గంలో అన్నాడీఎంకే మాజీ ఎంపీ, సీనియర్ నేత రామరాజన్ చేరిపోయారు. నేటి ఉదయం చెన్నైలో పన్నీర్ సెల్వాన్ని తన మద్ధతుదారులతో ఆయన కలుసుకుని మద్ధతు ప్రకటించారు. 'అమ్మ' జయలలిత వీర విధేయుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమే తమ పార్టీ నేత అని తెలిపారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ బాటలో పన్నీర్ నడుచుకుంటున్నారని కొనియాడారు. ఎంజీఆర్ వారసత్వాన్ని జయ అందిపుచ్చుకున్నట్లుగా, జయ అనంతరం ఆమె రాజకీయ వారసత్వాన్ని పన్నీర్ సెల్వం కొనసాగించాలని నటుడు, మాజీ ఎంపీ రామరాజన్ ఆకాంక్షించారు.