92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి రైల్వే బడ్జెట్ ప్రణాళికను సాధారణ బడ్జెట్లో భాగంగా బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. గత సంవత్సరం కన్నా పదివేల కోట్ల రూపాయలు అధికంగా.. రూ. 1.31 లక్షల కోట్లతో రైల్వే బడ్జెట్ను జైట్లీ ప్రకటించారు. అందులో రూ. 55 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకు అందిస్తుంది. ఇటీవలి వరుస ప్రమాదాల నేపథ్యంలో ఏటా రూ. 20 వేల కోట్ల చొప్పున రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్లతో ప్రత్యేక జాతీయ రైలు భద్రత నిధి(నేషనల్ రైల్ సేఫ్టీ ఫండ్)ని ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారు. ట్రాక్స్తో పాటు సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునీకరణ, కాపలా లేని లెవెల్ క్రాసింగ్ల సంపూర్ణ తొలగింపు.. తదితర అవసరాలకు ఆ నిధిని వినియోగించనున్నారు.