Railway Budget
-
చిన్నమ్మా.. చేతకాలేదా?
చిన్నమ్మకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం చేతకావడం లేదా.. ఎంపీగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడం లేదా.. బీజేపీ పెద్దల వద్ద ఆమె మాట చెల్లడం లేదా.. టీడీపీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారనే అనుమానంతో చిన్నమ్మను కేంద్రం దూరం పెట్టిందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇటీవలి కేంద్ర బడ్జెట్టే దీనికి నిదర్శనంగా నిలుస్తూండగా.. రైల్వే బడ్జెట్లో సైతం జిల్లాకు కేటాయింపులు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వలస వచ్చినా ఇక్కడి ప్రజలు ఆమెను ఆదరించారు. 54.82 శాతం ఓట్లు వేసి, 2,39,139 ఓట్ల మెజార్టీతో పట్టం కట్టారు. ఆమె ద్వారా జిల్లాకు మరిన్ని మంచి రోజులు వస్తాయని, తమ గళం ఢిల్లీ వరకూ వినిపిస్తుందని భావించారు. కానీ, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. తనపై అంత అభిమానం చూపిన జిల్లా ప్రజల అభ్యున్నతి, అభివృద్ధిపై చిన్నమ్మ కనీస శ్రద్ధ కూడా చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కుబడిగా సమావేశాలకు రావడం, వెళ్లడం తప్ప గోదారోళ్ల గుండె ఘోష తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో మోదీ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించకపోవడమే ఇందుకు నిదర్శనమని పలువురు పెదవి విరుస్తున్నారు. స్వయానా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికే నిధులు రాబట్టుకోలేని చిన్నమ్మ నిస్సహాయతను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కనీసం రైల్వే అభివృద్ధికి కూడా పాటు పడిన దాఖలాలు లేకపోవడంతో కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అలాగే మిగిలిపోయాయి.ప్రత్యామ్నాయ మార్గం ప్రస్తావనేదీ?రాష్ట్రంలో రాజమండ్రి రైల్వే స్టేషన్కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రతి రోజూ సుమారు 200కు పైగా ప్రయాణికుల, గూడ్సు రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తూంటాయి. మామూలు రోజుల్లో 30 వేల మంది, పండగ సమయాల్లో 40 వేల మందికి పైగా ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తూంటారు. ఆదాయంలోనూ ఈ స్టేషన్ మేటిగా నిలుస్తోంది. ఏటా రూ.123 కోట్లకు పైగా ఆదాయంతో ఎన్ఎస్జీ–2 హోదా సొంతం చేసుకుంటోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం బడ్జెట్లో నయా పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ట్రాక్లు నిత్యం రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. ఈ దృష్ట్యా గోదావరి బ్రిడ్జిల పైన, కొవ్వూరు, ఔటర్లోను పలు సందర్భాల్లో రైళ్లను నిలిపివేస్తూ, ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి కడియం నుంచి నిడదవోలు వరకూ ప్రత్యామ్నాయ రైల్వే లైన్ వేయాలనే ప్రతిపాదన ఉంది. తద్వారా గూడ్స్ రైళ్లను అటు మళ్లించడంతో రాజమండ్రి స్టేషన్కు ట్రాఫిక్ ఒత్తిడి లేకుండా చేయవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, ఈ రైల్వే లైన్ నిర్మాణ విషయం బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు. నిధుల కేటాయింపుపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.గత నిధులనే ఇప్పుడిచ్చినట్లు!రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.271 కోట్లు కేటాయించారు. పనులు టెండర్ల దశలో ఉన్నాయి. ప్రస్తుత రైల్వే బడ్జెట్లో మరోసారి కేటాయింపులు ఉంటాయని భావించారు. కానీ, గతంలో మంజూరైన నిధులనే కొత్తగా ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చారు. కేంద్రం తెలివితేటలు చూసి, జిల్లా ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.ఆర్వోబీల ఏర్పాటుపై నీలినీడలురైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు నివారించాలంటే ఆర్వోబీల నిర్మాణం చేపట్టాలని రైల్వే శాఖ భావించింది. దీనికి గాను 2027 నాటికి గేట్లను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం నగరంలోని అన్నపూర్ణమ్మపేట, కేశవరం, అనపర్తి ఆర్వోబీల ఏర్పాటుకు రైల్వే శాఖ పంపిన ప్రతిపాదనలకు తాజా బడ్జెట్లో దిక్కూమొక్కూ లేకుండా పోయింది.కొవ్వూరు – కొత్తగూడెం రైల్వే లైన్ ఊసే లేదువిశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని సుమారు 130 కిలోమీటర్ల మేర తగ్గించాలనే ఉద్దేశంతో కొవ్వూరు నుంచి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వరకూ కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని చాలా కాలం కిందటే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఇటీవల తిరిగి పట్టాలెక్కినట్టు కనిపించింది. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగింది. ఈ రైల్వే లైను నిర్మాణం అన్నివిధాలుగా ఉపయోగకరమని నివేదికలు సైతం స్పష్టం చేశాయి. దీనికి ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని భావించినా నిరాశే ఎదురైంది.పుష్కర నిధులపై స్పష్టత ఏదీ?గోదావరి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు రూ.1,286 కోట్లు అవసరమని ప్రజాప్రతినిధులు, అధికారులు లెక్కలు వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు జరుగుతుందని భావించారు. కానీ, ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో అసలు పుష్కరాలకు కేంద్రం తన వాటా ఇస్తుందా, లేదా.. ఇస్తే ఏ మేరకు అనే ప్రశ్న తలెత్తుతోంది. పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమీక్ష నిర్వహించిన ఎంపీ పురందేశ్వరి నిధుల మంజూరుపై దృష్టి సారించలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అలాగే, రైల్వే సమస్యలపై కూడా ఆమె ఎందుకు శ్రద్ధ చూపలేదని ప్రశ్నిస్తున్నారు.అమృత్ స్టేషన్ల అభివృద్ధేదీ?అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా నిడదవోలు జంక్షన్, కొవ్వూరు, రాజమహేంద్రవరం, కడియం, ద్వారపూడి (కోనసీమ జిల్లా), అనపర్తి స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు. ప్రకటనలే తప్ప ఈ పనులు నత్తకు మేనత్తలా మారాయి. ప్రస్తుత బడ్జెట్లో వీటికి భారీగా నిధులు కేటాయిస్తారని భావించారు. కానీ, నయాపైసా కూడా ఇవ్వలేదు. -
రైల్వేబడ్జెట్లో తెలంగాణకు రూ.4,400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఈసారి రైల్వేబడ్జెట్లో రూ.4,400 కోట్లు కేటాయించామని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ప్రపంచ స్థాయి స్టేషన్గా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ, ఏపీలకు రెండు వందే భారత్ రైళ్లను అందించామని చెప్పారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభలో అశ్వనీ వైష్ణవ్ మాట్లాడారు. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్.. సబ్కా ప్రయాస్’పేరుతో ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైల్వేల అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శ్రీవెంకటేశ్వర స్వామి సులభతర దర్శనం కోసమే వందేభారత్ రైలును ప్రారంభించినట్లు చెప్పారు. తెలంగాణను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు: కిషన్రెడ్డి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అని.. మంచి మౌలిక వసతులు కల్పించేందుకే మోదీ హైదరాబాద్కు వచ్చారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు. తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశామన్నారు. ఇప్పటివరకు దేశంలో 14 వందే భారత్ రైళ్లను ప్రారంభించామని, అందులో రెండింటిని తెలంగాణకు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారని పేర్కొన్నారు. రూ.714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తుండటం గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొంతకాలం ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఆగిపోయిందని.. బీజేపీ ఎంపీలు వెళ్లి ప్రధానికి విజ్ఞప్తి చేయగా.. కేంద్రం చొరవ తీసుకుని మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ను, 13 కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభిస్తోందని చెప్పారు. తెలంగాణను అన్నిరకాలుగా ఆదుకుంటున్న ప్రధాని మోదీని రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. -
పాత ప్రాజెక్టులకే పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లోని రైల్వే పద్దులో మోదీ ప్రభుత్వం ఈసారి తెలంగాణకు కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు ప్రకటించలేదు. కనీసం కొత్త లైన్లు, సర్వేలను సైతం ప్రస్తావించలేదు. కేవలం పాత ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులతోనే సరిపెట్టింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు గత బడ్జెట్తో పోలిస్తే కేటాయింపులు మెరుగ్గా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఈసారి దక్షిణ మధ్య రైల్వేకు రూ.13,786.19 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇది గతేడాది కేటాయించిన రూ. 8,349.75లతో పోలిస్తే 60 శాతం ఎక్కువ. ఇందులో తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులు, ఇతర పనులకు రూ. 4,418 కోట్లు లభించాయి. ఈ మొత్తం గతేడాది కేటాయింపు (రూ. 3,048 కోట్లు)ల కంటే 45 శాతం ఎక్కువ కావడం విశేషం. దక్షిణమధ్య రైల్వే పరిధిలోకే వచ్చే ఏపీలో జరుగుతున్న ప్రాజెక్టులకు కేంద్రం రూ. 8,406 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కేటాయింపు (రూ. 7,032)ల కంటే 20 శాతం ఎక్కువ. గతం కన్నా రూ. 5,437 కోట్లు ఎక్కువ.. ఈసారి దక్షిణమధ్య రైల్వే జోన్కు గత బడ్జెట్ కంటే ఏకంగా రూ. 5,437 కోట్లు ఎక్కువగా కేటాయించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు జోన్ పరిధిలోకి వచ్చే కర్ణాటక, మహారాష్ట్రలో రైల్వే లైన్ల ఏర్పాటుకు కూడా ఈ కేటాయింపులు ఊతమిస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులతోపాటు జోన్ పరిధిలో మరో 105 స్టేషన్లను అభివృద్ధి చేయబోతున్నాం. నగరానికి అత్యంత కీలకమైన ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పూర్తి చేసేలా ఏకంగా రూ. 600 కోట్లు కేటాయింపు ఆ ప్రాజెక్టుకు పెద్ద మలుపు కానుంది. – అరుణ్కుమార్జైన్, జీఎం దక్షిణ మధ్య రైల్వే -
దక్షిణ కోస్తా రైల్వే జోన్పై నోరు మెదపని రైల్వే బడ్జెట్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ విశాఖపట్నం రైల్వే జోన్ కూత వినిపించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బుధవారం 2023–24 వార్షిక బడ్జెట్లో అంతర్భాగంగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర నిరాశ కలిగించింది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ అయిన విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఆచరణలోకి తీసుకువచ్చే అంశంపై కేంద్రం మౌనం దాల్చింది. రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఇచ్చిన హామీకి కట్టుబడి రైల్వే జోన్ను ఆచరణలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించారు. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కీలక ప్రతిపాదనలతో కూడిన నివేదికను కేంద్రానికి సమర్పించింది. అయినప్పటికీ కేంద్ర వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. బడ్జెట్లో రైల్వేశాఖకు కేటాయింపులపై పూర్తి వివరాలతో బ్లూ బుక్ వస్తే గానీ రాష్ట్రంలో ఇతర రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం విధానమేమిటన్నది స్పష్టం కాదు. ‘బ్లూ బుక్’ వస్తేనే.. కేంద్ర బడ్జెట్లో రైల్వే శాఖకు కేటాయింపులపై సమగ్ర వివరాలతో ‘బ్లూ బుక్’ శుక్రవారం విజయవాడలోని రైల్వే డీఆర్ఎం కార్యాలయానికి చేరుతుంది. అది వస్తేగానీ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం కేటాయింపులు ఏమిటన్నది తెలియదు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు, కొత్త లైన్ల కోసం సర్వేలు, కొత్త ఆర్వోబీల నిర్మాణం, ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు, కొత్త రైళ్ల కేటాయింపులు మొదలైన అంశాలపై అప్పుడే స్పష్టత వస్తుంది. స్పష్టత ఇవ్వని కేంద్రం.. రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను కొన్ని నెలల క్రితమే సూత్రప్రాయంగా ప్రారంభించినప్పటికీ.. జోన్ వాస్తవంగా ఆచరణలోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై ఈసారి కేంద్ర బడ్జెట్లో అయినా స్పష్టత వస్తుందని అంతా ఆశించారు. కానీ ఎలాంటి స్పష్టతను కేంద్రం ఇవ్వలేదు. ఇప్పటికే విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఏర్పాటు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రైల్వే శాఖ రూపొందించింది. భవనాలు, ఇతర అవసరాలకోసం విశాఖలో దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో విశాఖపట్నంలో రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి ఇటీవల రూ.170 కోట్లు కేటాయించింది కూడా. కానీ రైల్వే జోన్ ఆచరణలోకి రావాలంటే సాంకేతికంగా కీలక అంశాలపై కేంద్రం మౌనం వహిస్తోంది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్, సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లతో ఏపీ పరిధిలో ఆస్తుల పంపకం, కొత్త డివిజన్ల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు, కొత్త కార్యాలయాల ఏర్పాటు తదితర అంశాలను ఓ కొలిక్కి తీసుకువచ్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఆచరణలోకి తీసుకురావాలి. కానీ.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ విషయాలేవీ కనీసం ప్రస్తావించలేదు. ఒడిశాలో రాజకీయ ప్రయోజనాల కోసమేనా! ఒడిశాలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పరిశీలకులు విమర్శిస్తున్నారు. ప్రధానంగా విశాఖ కేంద్రంగా వాల్తేర్ రైల్వే డివిజన్ను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. వాల్తేర్ రైల్వే డివిజన్ను రద్దు చేసి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లతోనే కొత్త జోన్ ఏర్పాటుపై డీపీఆర్లో ప్రస్తావించారు. దీనిపై విశాఖపట్నంతోపాటు యావత్ రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విజయవాడ నుంచి విశాఖపట్నం 350 కి.మీ. దూరంలో ఉండగా.. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్చాపురం 580 కి.మీ. దూరంలో ఉంది. అంతవరకు విజయవాడ రైల్వే డివిజన్గా ఏర్పాటు చేస్తే పరిపాలన నిర్వహణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే వాల్తేర్ రైల్వే డివిజన్ను కొనసాగిస్తూనే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం తూర్పు కోస్తా జోన్లో అత్యధిక రాబడి ఉన్న వాల్తేర్ డివిజన్ను ఏకంగా రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ఒడిశాలో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే ఇలా వ్యవహరిస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా క్యాడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కావడం గమనార్హం. ఆయన కూడా ఒడిశాకు అనుకూలంగా వ్యవహరిస్తూ విశాఖపట్నం రైల్వే జోన్ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. -
బడ్జెట్ రైలు ఆగేనా!
రాజంపేట: పార్లమెంట్లో నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఏటా ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఉమ్మడి వైఎస్సార్ జిల్లా పరిధిలో రైల్వేలకు అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించడం లేదు. గత బడ్జెట్లో కేవలం పాత ప్రాజెక్టులకే నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఆదాయపరంగా ముందంజలో ఉన్నా రైళ్ల కేటాయింపులోగానీ, పొడిగింపుల్లో కానీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టులు కడప–బెంగళూరుల మధ్య కొత్త ప్రాజెక్టుకు 2008–09లో ప్రణాళికలు తయారు చేసి రూ.2706 కోట్లు కేటాయిస్తూ పనులు ప్రారంభించారు. మొత్తం 255 కి.మీల పొడవు కల్గిన ఈ మార్గంలో ఇప్పటివరకు కేవలం 21 కి.మీలు కడప–పెండ్లిమర్రి మార్గం మాత్రమే పూర్తయింది. గత బడ్టెట్లో రూ.289 కోట్లు కేటాయించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టుబట్టి దక్కించుకున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే కడప, అనంతపురం జిల్లా వాసులకు బెంగళూరు నగరం మరింత దగ్గరవుతుంది. కలగానే బాలాజీ డివిజన్ ప్రతిపాదన డివిజన్ కేంద్రంగా తిరుపతిని చేస్తే కాట్పాడి నుంచి గుంతకల్, నెల్లూరులో గూడూరు , వైఎస్సార్, అన్నమయ్య జిల్లా పరిధిలో 700 కిలోమీటర్ల దూరం వస్తుంది. 400 కిలోమీటర్ల పరిధి ఉంటే డివిజన్గా ప్రకటించవచ్చని రైల్వే నిపుణులు అంటున్నారు. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే అనుకూలంగా ఉంటుందని నివేదికలు ఉన్నాయి. ఇందులో తిరుపతి–గూడూరు (92.96కి.మీ), తిరుపతి–కాట్పాడి (104.39కి.మీ), పాకాల–మదనపల్లె (83కి.మీ), రేణిగుంట–కడప (125 కి.మీ)లైను కలిపే అంశాన్ని గతంలోనే రైల్వే అధికారులు పరిశీలించారు. బడ్జెట్లో ఆమోదం..సర్వేకే పరిమితం ∙కడప–గుంతకల్లు–బళ్లారి ∙కంభం–ప్రొద్దుటూరు ∙భాకరాపేట–గిద్దలూరు ∙ముద్దనూరు–ముదిగుబ్బ నందలూరు రైల్వేకు ఏదీ పూర్వవైభవం నందలూరు రైల్వేకు పూర్వవైభవం కోసం ఐకేపీఎస్ ఆధ్వర్యంలో యూపీఏ పాలన హయాంలో చేపట్టిన ఉద్యమం దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంది. అప్పటి రైల్వేమంత్రి లాలూప్రసాద్ కూడా రాజ్యసభలో నందలూరులో రైల్వే ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ« తర్వాత ఈ ప్రతిపాదనలు అటకెక్కాయి. మాట తప్పిన బీజేపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నందలూరు రైల్వే పూర్వవైభవం కోసం కృషిచేస్తామన్న బీజెపీ అగ్రనేతలు ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఈ సమస్యను విస్మరించారు. పరిశ్రమ కాదు..ఉన్న రన్నింగ్ స్టాఫ్ క్రూసెంటర్ను, వివిధ రైళ్లకు ఉన్న స్టాపింగ్స్ను కూడా ఎత్తివేసే క్రమంలో రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. స్టాపింగ్స్కు ఎర్నింగ్ అడ్డంకి.. పలురైళ్ల స్టాపింగ్స్కు ఎర్నింగ్స్ను అడ్డంకిగా చూపుతున్నారు. ప్రజాసేవను దూరంపెట్టేసింది. కేవలం లాభార్జన పరంగా ముందుకువెళ్లడంతో పలురైళ్లు జిల్లా వాసులకు దూరమయ్యాయి. కమలాపురం, రాజంపేట, నందలూరు, రైల్వేకోడూరుతో పాటు కొన్ని నియోజకవర్గ కేంద్రాలలో కూడా కొన్ని రైళ్ల స్టాపింగ్కు ఎర్నింగ్ అడ్డంకిగా చూపుతున్నారు. పుణ్యక్షేత్రాల స్టేషన్లపై శీతకన్ను జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల రైల్వేస్టేషన్లపై రైల్వేశాఖ శీతకన్ను వేసింది. రాష్ట్ర విభజన తర్వాత పుణ్యక్షేత్రంగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్స్ లేదు. అలాగే మరో పుణ్యక్షేత్రమైన నందలూరు(సౌమ్యనాథాలయం) స్టేషన్లో కూడా తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రల రాజధానుల నుంచి నడిచే ఎక్స్ప్రెస్రైళ్లకు స్టాపింగ్స్ లేవు. ఈ పుణ్యక్షేత్రాలకు దూరప్రాంతాల నుంచి వచ్చే రైలు ప్రయాణికులకు సౌకర్యం కల్పించడంలో రైల్వేశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. కనీసం బుధవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు రైల్వే పరంగా కొద్దివరకైనా న్యాయం జరుగుతుందో లేక మళ్లీ మొండి చేయి చూపుతారో వేచి చూడాల్సిందే. కన్నెత్తిచూడని కొత్తరైళ్లు.. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాను కలుపుతూ నెల్లూరుకు డైలీ డెమో రైలును తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రాపూరు, ఓబులవారిపల్లె, రాజంపేట, నందలూరు మీదుగా కడప వరకు ఎక్స్ప్రెస్ రైలును తీసుకువస్తే అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. పెన్నా ఎక్స్ప్రెస్ పేరుతో హిందుపూరం నుంచి వయా ధర్మవరం, అనంతపురం గుత్తి, డోన్, నంద్యాల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లె మీదుగా నెల్లూరు వరకు రైలును తీసుకొస్తే సీమలోని కడప, అనంతపురం, నెల్లూరు జిల్లా మధ్య రాకపోకలకు సులభమవుతుంది. ∙నంద్యాల–కడప మధ్య నడిచే డెమో ఎక్స్ప్రెస్రైలును రేణిగుంట వరకు పొడిగింపు నిర్ణయం తీసుకున్నా ఇంతవరకు అమలుకాలేదు. ∙ముంబయి–చెన్నై రైలు మార్గంలో రాత్రి వేళలో నడిచే నైన్ మెయిల్, టెన్ మెయిల్ రైళ్లు ఇప్పుడు లేకుండా చేశారు. పగటిపూట మాత్రమే అడపాదడపా రైళ్లు నడుస్తున్నాయి.. ∙మచిలీపట్నం–తిరుపతి మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలును కడప వరకు పొడిగించే ప్రతిపాదన కార్యరూపందాల్చేలా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జిల్లాలు: వైఎస్సార్, అన్నమయ్య ప్రధానరైల్వేకేంద్రం: నందలూరు ప్రధానస్టేషన్లు: కడప, ఎర్రగుంట్ల, ఓబులవారిపల్లె ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలమీదుగా నడిచే రైళ్లు: 30 (డౌన్, అప్) గూడ్స్రైళ్లు: 40 స్టేషన్లు: 25 కార్మికులు: 4000 కిలోమీటర్లు: 180 -
కేంద్ర బడ్జెట్ 2022: మీకు ఈ విషయాలు తెలుసా..
మళ్లీ కేంద్ర బడ్జెట్ వచ్చేసింది. కేంద్రం ఎవరెవరికి ఉపశమనం కలిగిస్తుంది, ఎవరిపై భారం పెరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడేకాదు ఏటా బడ్జెట్ వచ్చిందంటే ఉత్కంఠగానే ఉంటుంది. అయితే బడ్జెట్లో లెక్కలే కాకుండా.. మరెన్నో విశేషాలు కూడా ఉంటుంటాయి. అలాంటి కొన్ని విశేషాలు తెలుసుకుందామా? నెహ్రూ.. ఇందిర.. రాజీవ్ 1958లో అప్పటి ఆర్థికమంత్రి టి.టి.కృష్ణమాచారి రాజీనామా చేసినప్పుడు, జవహర్లాల్ నెహ్రూ బడ్జెట్ను సమర్పించి అలా చేసిన మొదటి ప్రధానమంత్రిగా నిలిచారు. 1970లో ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ఆర్థికమంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసి ఉన్నారు. 1987–88లో ఆర్థికమంత్రి వీపీ సింగ్ రాజీనామా చేసినప్పుడు, అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ బడ్జెట్ను సమర్పించారు. తెల్లారింది లేవండోయ్.. 2000 సంవత్సరం వరకు, ఫిబ్రవరి నెల చివరి పనిదినం సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ను సమర్పించేవారు. అయితే, అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణ సమయాన్ని ఉదయం 11 గంటలకు, సభలో మొదటి కార్యక్రమంగా మార్చారు. 2014లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ను సమర్పించినప్పుడు, 2.5 గంటలపాటు సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేశారు. దీనిని బడ్జెట్ సమర్పణలలో సుదీర్ఘ ప్రసంగాలలో ఒకటిగా పరిగణిస్తారు. రైల్వేను కలిపేశారు.. 2017 వరకు, ప్రతి సంవత్సరం రెండు వేర్వేరు బడ్జెట్లు సమర్పించేవారు. ఆర్థిక బడ్జెట్ను ఆర్థికమంత్రి, రైల్వే బడ్జెట్ను రైల్వే మంత్రి సమర్పించడం ఆనవాయితీగా ఉండేది. నరేంద్రమోదీ ప్రభుత్వం రెండు బడ్జెట్లను కలిపి ఉమ్మడి బడ్జెట్ను తీసుకొచ్చింది. 2017లో అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైటీ తొలి ఉమ్మడి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొదటి బడ్జెట్కు 162 ఏళ్లు.. మొదట్లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న మన దేశాన్ని.. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటన్ నేరుగా పాలించడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే మన దేశానికంటూ మొదటిసారిగా 1860 ఏప్రిల్ 7న బడ్జెట్ ప్రవేశపెట్టారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తరఫున స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్ ఆ బడ్జెట్ రూపొందించి, బ్రిటిష్ పార్లమెంట్కు సమర్పించారు. స్వాతంత్య్ర భారతంలో 1947 నవంబర్ 26న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రహస్యంగా..ప్రింటింగ్నే మార్చేసి కేంద్ర బడ్జెట్ రూపకల్పన, పత్రాల ముద్రణ అత్యంత రహస్యంగా సాగుతుంది. బడ్జెట్లోని అంశాలు ముందే తెలిస్తే.. ఎవరైనా వాటిని మార్చేలా ప్రభావితం చేయడానికి వీలు ఉంటుందన్నదే దీనికి కారణం. అందుకే బడ్జెట్ పత్రాలను ముద్రించినన్ని రోజులు సిబ్బంది ఎవరినీ బయటికి వెళ్లనివ్వరు. 1950 వరకు రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ పత్రాలు ముద్రించేవారు. ఆ ఏడాది బడ్జెట్ రహస్యాలు ముందే లీకవడంతో ముద్రణను ఢిల్లీలోని మింట్ రోడ్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్కు మార్చారు. 1980 నుంచి కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయం ఉండే నార్త్బ్లాక్లో బడ్జెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. -
లైన్లకే గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: కొత్త రైళ్ల బాధ్యతను ప్రైవేటుకు అప్పగించి మౌలిక వసతుల కల్పనపై రైల్వే శాఖ దృష్టి సారించింది. వీలైనన్ని ప్రైవేటు రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధమైన రైల్వేశాఖ దక్షిణమధ్య రైల్వేకు సంబంధించి 11మార్గాలను గుర్తించింది. ఆ మార్గా ల్లో ప్రైవేటు రైళ్లను పరుగు పెట్టించేందుకు కావాల్సిన ప్రణాళికలను రైల్వే బోర్డు పరిశీలిస్తోంది. సొంతంగా నిర్వహించే ఒక్క కొత్త రైలు ప్రస్తావన కూడా లేకుండానే తాజా బడ్జెట్ను రూపొందించారు. అయితే ఇప్పటికే మొదలైన కొత్త లైన్లు, డబ్లింగ్, మూడో లైన్ల నిర్మాణాలకు భారీగానే నిధులు కేటాయించారు. తాజా బడ్జెట్లో దక్షిణమధ్య రైల్వేకు రూ.6,846 కోట్లను కేటాయించారు. ఇది గత ఏడాది కంటే రూ.922 కోట్లు ఎక్కువ. ప్రారంభమైన లైన్లు పూర్తి చేశాకే కొత్తవి మొదలుపెట్టాలన్న ప్రధాని మోదీ ఆలోచన బడ్జెట్లో స్పష్టంగా కనిపించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేపడుతున్న కొన్ని ప్రాజెక్టులకు నామమాత్రపు నిధులతో సరిపెట్టింది. తాజా బడ్జెట్లో దక్షిణమధ్య రైల్వే జోన్కు కేటాయింపుల వివరాలను బుధవారం జీఎం గజానన్ మాల్యా రైల్ నిలయంలో మీడియాకు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు ఇక పరుగు పెట్టినట్టే... మనోహరాబాద్–కొత్తపల్లి: రూ.235 కోట్లు.. హైదరాబాద్తో కరీంనగర్ పట్టణాన్ని రైల్వే ద్వారా అనుసంధానించే కీలక ప్రాజెక్టు మనోహరాబాద్–కొత్తపల్లికి రూ.235 కోట్లు కేటాయించారు. ఈ మార్చినాటికి గజ్వేల్ వరకు ఈ మార్గంలో రైలును నడిపేందుకు సిద్ధమైన అధికారులు, భూసేకరణ సమస్యలను అధిగమించి సిద్దిపేట వరకు వేగంగా పనులు పూర్తి చేసే యోచనలో ఉన్నారు. 2006–07లో మంజూరైన 151 కి.మీ. ఈ ప్రాజెక్టు గత రెండేళ్లుగా పరుగుపెడుతోంది. రూ.1,160 కోట్ల అంచనాతో ఇది ప్రారంభమైంది. మునీరాబాద్–మహబూబ్నగర్: రూ.240 కోట్లు ఈ ప్రాజెక్టుకు రూ.240 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఈ మార్గంలో కాచిగూడ నుంచి జక్లేర్ వరకు డెమో రైలు నడుస్తోంది. ఆ తర్వాత భూసేకరణలో జరిగిన జాప్యంతో పనుల్లో కొంత ఆటంకం ఏర్పడింది. 243 కి.మీ. ఈ మార్గం పనులు రూ.1,723 కోట్ల అంచనాతో మొదలయ్యాయి. ఇందులో 66 కి.మీ. పరిధి తెలంగాణలో ఉండగా, మిగతాది కర్ణాటక పరిధిలో ఉంది. ద.మ. రైల్వే పరిధికి సంబంధించి జక్లేర్–మక్తల్, కృష్ణ–మాగనూరు మధ్య పనులు జరుగుతున్నాయి. భద్రాచలం–సత్తుపల్లి: రూ.520 కోట్లు దక్షిణమధ్య రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు అయిన బొగ్గు తరలింపుపై ఆ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త గనులతో రైల్వేను అనుసంధానించే క్రమంలో భద్రాచలం–సత్తుపల్లి కొత్త లైను నిర్మాణం చివరి దశకు వచి్చంది. గత బడ్జెట్లో రూ.405 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.115 కోట్లు ఎక్కువగా కేటాయించింది. ఈ సంవత్సరం పనులు పూర్తి చేసే లక్ష్యంతో ఉంది. 54 కి.మీ.ల ఈ మార్గంలో భూసేకరణ వ్యయాన్ని రైల్వే భరించనుండగా, ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు (రూ.704 కోట్లు)ను సింగరేణి సంస్థ భరించాల్సి ఉంది. ఎంఎంటీఎస్కు రూ.40 కోట్లు... ఈ ఆర్థిక సంవత్సరం ఎంఎంటీఎస్ రెండో దశకు మరో రూ.40 కోట్లను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం తన వాటాగా 2/3 వంతు చొప్పున సుమారు రూ.450 కోట్ల వరకు అందజేయవలసి ఉంది. ఈ నిధుల విడుదలలో జాప్యంతో సికింద్రాబాద్–»ొల్లారం, పటాన్చెరు–తెల్లాపూర్ తదితర మార్గాల్లో లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ, స్టేషన్ల ఏర్పాటు పనులు పూర్తయినప్పటికీ రైళ్లను కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇక రూ.150 కోట్ల అంచనాలతో మూడేళ్ల క్రితం ప్రతిపాదించిన చర్లపల్లి టర్మినల్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వంద ఎకరాల భూమిని కేటాయించవలసి ఉంది. ఇప్పటి వరకు ఆ భూమి ఇవ్వకపోవడంతో రైల్వేకు ఉన్న 50 ఎకరాల్లోనే రూ.80 కోట్లతో గత ఏడాది టరి్మనల్ విస్తరణ చేపట్టారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రస్తుతం రూ.5 కోట్లు కేటాయించారు. ఘట్కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.412 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్రం ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు. కేంద్రం మాత్రం ఈ బడ్జెట్లో రూ.10 లక్షలతో సరిపెట్టింది. డబ్లింగ్, మూడో లైన్లకు మహర్దశ... రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో అదనపు లైను నిర్మాణం రైల్వేకు పెద్ద సవాలు. కాజీపేట–బల్లార్షా మూడోలైన్కు తాజా బడ్జెట్లో ఏకంగా రూ.483 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే రూ.118 కోట్లు ఎక్కువ. రెండు లైన్లు ఉన్నప్పటికీ సామర్థ్యం కంటే 130 శాతం అధికంగా రైళ్లను నడుపుతున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో రాఘవాపురం–పోట్కపల్లి, బిసుగిర్షరీఫ్–ఉప్పల్, విరూర్–మాణిక్ఘర్ మధ్య మూడోలైన్ చివరి దశలో ఉండటంతో త్వరలో పూర్తి చేయనుంది. మిగతా చోట్ల పనులను వేగంగా పూర్తి చేసేందుకు ఇప్పుడు భారీగా నిధులు కేటాయించింది. ఇక కాజీపేట–విజయవాడ మూడో లైన్ పనులకోసం రూ.404 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో ఇచ్చింది రూ.110కోట్లే. ఫలితంగా ఈ సారి పనుల్లో వేగం పెరగనుంది. ఈ మార్గంలో కొంతమేర భూసేకరణ సమస్య ఉన్నందున దీన్ని తొందరగా పరిష్కరించాలని ఇప్పటికే స్థానిక అధికారులకు ఆదేశాలు అందాయి. సికింద్రాబాద్–మహబూబ్నగర్ మధ్య 85 కి.మీ. మేర డబ్లింగ్ పనులకు గాను రూ.185 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.200 కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయి. షాద్నగర్–గొల్లపల్లి మధ్య 29 కి.మీ. మార్గం పూర్తి కావచి్చంది. త్వరలో దాన్ని అందుబాటులోకి తెచ్చి రైళ్లను నడిపే ఆలోచనలో అధికారులు ఉన్నారు. కాజీపేట వర్క్షాపు అంతేనా.. కాజీపేటలో నిర్మించతలపెట్టిన పీరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్షాప్ పరిస్థితి డోలాయమానంలో పడ్డట్టు కనిపిస్తోంది. గత బడ్జెట్లో రూ.కోటిన్నర మంజూరు చేసిన రైల్వే ఈసారి నయాపైసా ప్రకటించకపోవటం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, భూ సమస్య పరిష్కారం కాగానే పనులు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బుధవారం విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే జీఎం గజానన్ మాల్యా చెప్పటం విశేషం. ఎయిర్లైన్స్ తరహాలో ప్రైవేట్ రైళ్లు... ఎయిర్లైన్స్ తరహాలో ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో ప్రైవేట్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. చర్లపల్లి టరి్మనల్ నుంచి ఈ రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను రూపొందిస్తోంది. చర్లపల్లి–శ్రీకాకుళం, చర్లపల్లి–వారణాసి, చర్లపల్లి–పన్వేల్, లింగంపల్లి–తిరుపతి, సికింద్రాబాద్–గౌహతి, చర్లపల్లి–చెన్నై, చర్లపల్లి–షాలిమార్, విజయవాడ–విశాఖ, తిరుపతి–విశాఖ తదితర ప్రాంతాల మధ్య ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో లింగంపల్లి–గుంటూరు, ఔరంగాబాద్–పన్వేల్ మధ్య తేజాస్ రైళ్లను నడుపుతారు. ఈ రైళ్ల కోసం త్వరలో ఓపెన్ టెండర్లను ఆహా్వనించనున్నారు. -
బడ్జెట్లో కూతపెట్టని రైల్వే!
సాక్షి, హైదరాబాద్: రైల్వే బడ్జెట్ అనగానే యావత్తు దేశం ఎదురుచూసేది.. ఏ ప్రాంతానికి ఏ రైలు వస్తుంది, కొత్త రైల్వే లైన్లు ఏ ప్రాంతానికి మంజూరవుతాయి అని ప్రజలు టీవీలకు అతుక్కుపోయేవారు. కానీ, శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రైల్వే ప్రస్తావనకు కేటాయించిన సమయం రెండుమూడు నిమిషాలు మాత్రమే.అందులోనే కొన్ని విషయాలు ప్రస్తావించారే తప్ప కొత్త రైళ్లు, లైన్లు, సర్వేలు వంటి వాటి ఊసే లేదు. రైల్వే బడ్జెట్ను విడిగా ప్రవేశపెట్టకుండా సాధారణ బడ్జెట్లో కలిపేసిన తర్వాత, రైల్వేకు చెందిన వివరాలను సంక్షిప్తంగా వెల్లడిస్తున్నారు. కానీ తాజా బడ్జెట్ ప్రసంగంలో నామమాత్రపు ప్రస్తావనతోనే సరిపుచ్చటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థూలంగా నాలుగైదు విషయాలతో సరిపుచ్చినప్పటికీ, జోన్ల వారీగా వివరాలను ఆ తర్వాత కూడా వెల్లడించలేదు. పింక్బుక్ పేరుతో ఉండే పూర్తి వివరాల పుస్తకాన్ని మరుసటి రోజో, ఆ తర్వాతనో విడుదల చేసేవారు. ఈసారి ఆ పింక్ బుక్ను ఐదో తేదీన విడుదల చేస్తారని చెబుతున్నారు. అంటే అప్పటి వరకు జోన్ల వారీగా కేటాయింపుల విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉండదు. రైల్నిలయానికి సమాచారం లేదు దక్షిణ మధ్య రైల్వేకు చేసిన కేటాయింపులకు సంబంధించి రైల్ నిలయంకు ఎలాంటి సమాచారం అందలేదు. ‘బడ్జెట్లో రైల్వేలకు సం బంధించి కనీస వివరాలు కూడా వెల్లడించకపోవటాన్ని తొలిసారి చూస్తున్నాం. కొన్ని ప్రధాన ప్రాజెక్టులు, చేపట్టబోయే కొత్త సంస్కరణలు, కొత్త రైళ్లు లాంటి వివరాలైనా వెల్లడించాల్సింది. ఇక జోన్ల వారీగా కేటాయింపు లు ఎప్పుడిస్తారో కూడా సమాచారం లేదు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసి అడిగినా చెప్పలేదు. ఐదో తేదీన పార్లమెంటు లో పింక్బుక్ను విడుదల చేసిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉంది’అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వేకు దాదాపు రూ.6,100 కోట్ల మేర నిధులు కేటాయించారని, ప్రస్తుతం పనులు జరుగుతున్న మనోహరాబాద్–కొత్తపల్లి, మహబూబ్నగర్ డబ్లింగ్, కాజీపేట–బల్లార్షా, కాజీపేట–విజయవాడ మూడో లైన్ పనులు, మెదక్–అక్కన్నపేట, భద్రాచలం–సత్తుపల్లి ప్రాజెక్టులకు రూ.1,200 కోట్ల మేర కేటాయింపులున్నాయని సమాచారం. ఓ హైస్పీడ్ కారిడార్, రెండు రైళ్ల ప్రస్తావన ఉందని చెబుతున్నారు. -
మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1.7 లక్షల కోట్లు...
-
వచ్చే నాలుగేళ్లలో 100 కొత్త ఎయిర్పోర్టులు..
న్యూఢిల్లీ: రవాణా రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో రూ. 1.7 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను శనివారం నిర్మల పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. 2023 కల్లా ఢిల్లీ- ముంబై ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం పూర్తి చేస్తామని.. చెన్నె- బెంగళూరు ఎక్స్ప్రెస్ వే నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ముంబై- అహ్మదాబాద్ మధ్య త్వరలో హైస్పీడ్ రైలు ప్రారంభం కానుందన్నారు. రైల్వేల్లో సోలార్ విద్యుత్ వినియోగం పెంచి.. రైల్వే లైన్ విద్యుదీకరణ చేపడతామని తెలిపారు. అదే విధంగా బెంగళూరులో సబర్బన్ రైల్వే ప్రాజెక్టు కోసం రూ. 1800 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పర్యాటక అభివృద్ధికై తేజాస్ వంటి మరిన్ని రైళ్లను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. రైల్వేల్లో మరింత ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని... ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో 150 రైళ్లు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.(మరింత ఈజీగా జీఎస్టీ...) అదే విధంగా ఉడాన్ పథకం కింద 2024 నాటికి వంద ఎయిర్పోర్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. నేషనల్ గ్యాస్ గ్రిడ్ను విస్తరిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డేటా సెంటర్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని.. లక్ష గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ అందుబాటులోకి రానుందని తెలిపారు. విద్యుత్ రంగానికి రూ. 22, 000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.(బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బడ్జెట్ రైలు ఆగేనా?
సాక్షి, అమరావతి: పార్లమెంట్లో నేడు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈసారైనా కేంద్రం కరుణిస్తేనే పలు కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో అధిక శాతం ఆదాయం ఏపీ నుంచే లభిస్తున్నా ఆ మేరకు న్యాయం జరగడం లేదు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా నిధులు, విధులు తేలక అయోమయం నెలకొంది. రాష్ట్రంలో ప్రాధాన్య ప్రాజెక్టులన్నీ కాస్ట్ షేరింగ్ విధానంలో మంజూరయ్యాయి. రాష్ట్రం తన వాటాగా భూ సేకరణ జరిపి భూమిని అప్పగిస్తే రైల్వే శాఖ నిధులు మంజూరు చేసి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ అంచనా వ్యయం పెరగకముందే నిధులు కేటాయించి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. కోటిపల్లి–నరసాపురం, కడప–బెంగళూరు, డబ్లింగ్ ప్రాజెక్టులు, మూడో లైన్ల పూర్తికి కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందో చూడాల్సిందే. ఇక 2012, 2013లోనే మంజూరైన భద్రాచలం–కొవ్వూరు, కొండపల్లి–కొత్తగూడెం ప్రాజెక్టులు పూర్తి కావాలంటే నిధులు అత్యవసరం. పట్టాలెక్కని ప్రతిపాదనలు! స్టేషన్ రీ డెవలప్మెంట్ కింద తిరుపతి, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, గుంతకల్ స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ గతంలో అంగీకరించింది. విజయవాడను శాటిలైట్ స్టేషన్గా తీర్చిదిద్దాలని ఏన్నో ఏళ్ల నుంచి ప్రతిపాదనలున్నాయి. గతంలో గుంతకల్ డివిజన్లో చంద్రగిరి, గుంటూరు డివిజన్లో న్యూ గుంటూరు, ఫిరంగిపురం, విజయవాడ డివిజన్లో రామవరప్పాడు స్టేషన్లను మహిళా స్టేషన్లుగా ప్రకటించారు. మొత్తం మహిళా సిబ్బంది ఈ స్టేషన్లలో విధులు నిర్వహించేలా రైల్వే శాఖ ఆదేశాలిచ్చింది. వీటిని అభివృద్ధి చేయాల్సి ఉంది. కొత్త రైల్వే లైన్లపై కరుణించేనా? నరసరావుపేట–మచిలీపట్నం, కంభం–ఒంగోలు, చిత్తూరు–కుప్పం వయా పలమనేరు, ఓబులవారిపల్లె–వాయల్పాడు రైల్వే లైన్ల సర్వేపై బోర్డు ఏమీ తేల్చడం లేదు. మచిలీపట్నం–బాపట్ల కనెక్టివిటీ కోసం సర్వే చేసి అంచనా వ్యయం రూ.793 కోట్లుగా తేల్చినా నివేదికను పక్కన పెట్టారు. ప్రైవేట్ రైళ్ల ప్రతిపాదనలు.. విజయవాడ–దువ్వాడ మధ్య 335 కి.మీ. మేర మూడో లైన్ను నిర్మించాలి. విశాఖకు కనెక్టివిటీ పెంచేందుకు 2015–16లోనే రూ.3,873 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ బడ్జెట్లో మూడో లైన్కు నిధులు కేటాయించాలని కోరుతున్నారు. తేజాస్ తరహాలో తిరుపతి–విశాఖ, సికింద్రాబాద్–విశాఖ మధ్య ప్రైవేట్ రైళ్ల ప్రతిపాదనలున్నాయి. -
అదిగదిగో.. ఆశల బండి కూత
వైఎస్ఆర్ జిల్లా,రాజంపేట: కేంద్ర ప్రభుత్వం రేపు రైల్వే బడ్జెట్ను ప్రవేశపెడుతోంది. ఏటా మాదిరిగానే జిల్లా ప్రజానీకం ఈ బడ్జెట్ అయినా తమ ఆకాంక్షలను నెరవేరుస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వారి ఆశలపై నీళ్లు చల్లుతుందో..తీపి కబురు చెబుతుందో తెలియడానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. గతేడాది రైల్వేబడ్జెట్ జిల్లా ప్రజలను నిరాశ పరిచింది. నిధుల కేటాయింపులో కోతలు విధించింది. జిల్లాలో రైల్వేపరమైన అభివృద్ధి విషయంలో వివక్ష కొనసాగుతోందనేది జనం భావన. ఏళ్లతరబడి ప్రాజెక్టులు పెండింగులోనే కొనసాగుతూనే ఉన్నాయి. మూడుదశాబ్దాల తర్వాత నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వేలైన్ అందుబాటులోకి వచ్చినా కొత్తరైళ్లు జిల్లా వైపు కన్నెత్తి చూడటంలేదు. కడప, రాజంపేట, నందలూరు, ఎర్రగుంట్ల, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్లలో మౌలిక వసతులు అంతంత మాత్రంగా ఉన్నాయి. పలురైళ్లు జిల్లాలో ఆగకుండానే వెళుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు రాజధానికి లింక్గా డీఎంయు రైళ్లను నడిపించాల్సిన అవసరముందనేది దీర్ఘకాలిక కోరిక. అదీ నెరవేరడం లేదు. వీక్లీ, బైవీక్లీ లాంటి రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలన్న వినతులు రైల్వే ఉన్నతాధికారులు పెడచెవిన పెడుతున్నారు. రాజంపేట, రైల్వేకోడూరులో ఆర్యూబీలునిర్మాణంలో జాప్యం కొనసాగుతోంది. కొన్ని రైల్వేస్టేషన్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు లేవు. ప్రయాణీకుల సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి. జిల్లా కు రైల్వేపరిశ్రమ కలేనా.. నందలూరు రైల్వేకేంద్రంలో ప్రత్యామ్నాయ రైల్వేపరిశ్రమ ఏర్పాటు కలగానే మిగిలింది. ఎన్డీఏ హయాంలో ఇది కార్యరూపం దాల్చుతుందని జిల్లా వాసులు ఆశించారు. కేంద్రంలో ప్రభు త్వాలేవి మారినా ఈ పరిశ్రమ ఊసెత్తడంలేదు. నందలూరులో రైల్వేపరిశ్రమ ఏర్పాటుచేయాలని కొన్నేళ్లుగా నానుతు న్న విషయం. రాజంపేట ఎంపీ మిధునరెడ్డి లోక్సభలో దీనిపై ప్రస్తావించారు. 250 క్వార్టర్స్తో పాటు 150 ఎకరాలు రైల్వేభూమి ఉంది. భూమి విషయంలో ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. గతంలో రైల్వేమంత్రిగా పనిచేసిన లాలు ప్రసాద్యాదవ్ వ్యాగన్ రిపేరువర్క్షాపు పెడతామని ప్రకటించారు. కానీ తర్వాత విస్మరించారు. బెంగళూరు లైన్ నిర్మాణం ముందుకెళ్లేదెపుడో... 2008–09 రైల్వేబడ్జెట్లో కడప–బెంగళూరు రైల్వేలైను రైలుమార్గాన్ని ప్రకటించారు. ఈ మార్గం పూర్తికావడానికి అంచనా రూ.2050 కోట్లకు చేరుకుంది. 2010 సెప్టెంబరులో అప్పటి రైల్వేమంత్రి మునియప్ప శంకుస్ధాపన చేశారు. 21.8కిలోమీటర్ల మేర తొలిదశపనులు పూర్తయ్యాయి. అక్కడి వరకు డెమోరైలు నడిపిస్తున్నారు. రెండో వదశలో పెండ్లిమర్రి నుంచి రాయచోటి, లక్కిరెడ్డిపల్లె మీదుగా చిత్తూరు జిల్లా వాయల్పాడువరకు పనులు చేయాల్సి ఉంది. 102వ లైను చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఈమార్గంలో పదిశాతం పనులే జరిగాయి. ప్రయాణీకుల రవాణకు నోచుకోనికృష్ణపట్నం రైల్వేలైన్ వైఎస్సార్ జిల్లా, నెల్లూరు జిల్లాలను కలిపే కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్ సరకు రవాణకే పరిమితమైంది. ప్రయాణీకులకు ఈ మార్గంలో వెళ్లే అవకాశం లెేఛీజీ ఈ రైల్వేలైన్కు ఇప్పటి వరకు రూ.1186కోట్లు ఖర్చు చేశారు. ఇది కూడా అంచనా రూ.1646కోట్లకు చేరుకుంది. వెంకటాచలం–ఓబులవారిపల్లె మధ్య మార్గం పూర్తయి గూడ్స్రైళ్లకే పరిమితమైంది. సర్వేలకే రైలుమార్గాలు ♦ కంభం–ప్రొద్దుటూరు రైల్వేలైన్ సర్వే కు గతబడ్జెట్లో.1లక్ష మాత్రమే కేటాయించారు. ఈ లైన్ సర్వే దశను దాట ♦ భాకరాపేట–గిద్దలూరు రైల్వేలైన్ గురించి గత బడ్జెట్లో ప్రస్తావనే లేదు. జిల్లాలో రెండు కొత్త రైలుమార్గాలు సర్వేలకే పరిమితమైయ్యాయి. ♦ కడప–గుంతకల్లు–బళ్లారి రైల్వేలైన్ సర్వేకు బడ్జెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే కడప–గుంతకల్లు మధ్య డబుల్లైన్ నిర్మితమైంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి ఈ లైను అనువుగా ఉంటుంది. సర్వే చేపట్టేందుకు ఆమోదం లభించినా అడుగు ముందుకు పడలేదు. ♦ భాకరాపేట–గిద్దలూరు రైల్వేలైన్ కూడా సర్వేలకే పరిమితమైంది. ఈ కొత్త రైలుమార్గం పురోగతి ప్రశ్నార్ధకరంగా మారింది. ♦ జిల్లా కేంద్రంతో సంబంధం లేకుండా ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్లో రాజధానికి రైలునడుస్తోంది. ♦ జిల్లా కేంద్రం నుంచి రాజధానికి రేణిగుంట మీదుగా వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్ రైలు ఒక్కటే దిక్కయింది. నంద్యాల రైల్వేలైన్విద్యుద్దీకరణ ఎప్పుడో.. ♦ కర్నూలు, వైఎస్సార్జిల్లాలను కలుపుతూఏర్పాటైన ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్నువిద్యుద్దీకరణ (ట్రాక్షన్) చేయనున్నారు. రూ.20కోట్లు కేటాయించారు. 123 కిలోమీటర్ల మార్గంలో దీనివల్ల కరెంటురైలింజన్లు నడిచే అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది. ట్రాక్షన్ పూర్తి కావాలంటే రూ111.48కోట్లు వ్యయం చేయాలి. ఇంకా సర్వేదశలోఈ మార్గం విద్యుద్దీకరణ పనులున్నాయి. -
బడ్జెట్ రైలు ఆగేనా ?
సాక్షి, కాజీపేట : కేంద్రంలో ప్రవేశపెట్టె బడ్జెట్లో రైల్వే పరంగా ఈసారైనా న్యాయం జరిగేనా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టే బడ్జెట్లో కాజీపేట జంక్షన్కు న్యాయం జరగాలని జిల్లా ప్రజలు, రైల్వే కార్మికులు ఆకాంక్షిస్తున్నారు. నిజాం రైల్వే కాలంలో 1094లో ఏర్పాటైన కాజీపేట దినాదినాభివృద్ధి చెంది కాజీపేట జంక్షన్గా ఏర్పడి ఇప్పుడు దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు గేట్వేగా విలసిల్లుతోంది. అయితే, గతంలో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లు, ఇప్పుడు ఉమ్మడిగా ప్రవేశపెడుతున్న సాధారణ బడ్జెట్లకు సంబంధించి ఏటా నిరాశే ఎదురవుతోంది. ఈసారైనా కాజీపేట జంక్షన్ పరిధిలో పెండింగ్లో ఉన్న యూనిట్ల నిర్మాణం, రైల్వే లైన్ల నిర్మాణంతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతాయని భావిస్తున్నారు. ఫిట్లైన్ నుండి కొత్త రైళ్లు కాజీపేటలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మాణమవుతున్న ఫిట్లైన్ పనులను త్వరగా పూర్తి చేసి కాజీపేట కేంద్రంగా కొత్త రైళ్లు ప్రారంభించాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే జరిగితే కాజీపేట జంక్షన్ నుంచి ముంబై, తిరుపతి, సికింద్రాబాద్ రూట్లలో కొత్త రైళ్లను ఇక్కడి నుంచే ప్రారంభించవచ్చు. తద్వారా కార్మికుల సంఖ్య పెరగడంతో పాటు కొత్తగా రైల్వే కార్యాలయాలు వస్తాయి. మూడో లేన్ కాజీపేట జంక్షన్ మీదుగా బల్లార్షా – విజయవాడ వరకు నిర్మాణంలో ఉన్న మూడో రైల్వే లైన్ను పూర్తి చేసేందుకు ఈసారి బడ్జెట్లో పూర్తి స్థాయి కేటాయింపులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ లేన్ పూర్తయితే అయితే న్యూఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్ మార్గాల్లో ట్రాఫిక్ తగ్గిపోతుంది. అలాగే, ఆలస్యాన్ని నివారించచ్చు. వడ్డేపల్లి చెరువు కట్లపై రైల్వే లైన్ కాజీపేట వడ్డేపల్లి చెరువు కట్టపై 200 మీటర్ల మేర సర్వే అయిన రేల్ అండర్ రైల్ లైన్ నిర్మాణం, కాజీపేట – బల్లార్షా వరకు సర్వే అయిన నాలుగో లేన్ నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. సర్వే పూర్తయిన మణుగూరు – రామగుండం లేన్కు నిధులు, ఘన్పూర్ – సూర్యాపేట వరకు వయా పాలకుర్తి, కొడకండ్ల మీదుగా సర్వే అయిన లేన్ నిర్మాణానికి ఈ బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని, భూపాలపల్లి రైల్వే లేన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని జిల్లా ప్రజలు గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. కొత్త రైళ్లు, రైళ్ల పొడిగింపు కాజీపేట జంక్షన్ మీదుగా ఈసారి బడ్జెట్లో కొత్త రైళ్లు ఉంటాయా, లేదా అనే చర్చ సాగుతోంది. ఇంకా పద్మావతి ఎక్స్ప్రెస్, కరీంనగర్ – తిరుపతి ఎక్స్ప్రెస్, షిర్డీ ఎక్స్ప్రెస్లను డెయిలీగా మార్చాలనే డిమాండ్ ఉంది. అంతేకాకుండా కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లే పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. డివిజన్ కల నెరవేరేనా? 1904 సంవత్సరంలో ఏర్పాటైన కాజీపేట రైల్వే స్టేషన్ 115 ఏళ్ల ప్రస్థానంలో డివిజన్ కేంద్రంగా ఏర్పాటు కావాలనేది జిల్లా ప్రజలు, ఇక్కడ పని చేస్తున్న కార్మికుల చిరకాల కోరిక. ఇది ఈసారి బడ్జెట్లో నెరవేరుతుందని అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ను డివిజన్గా అప్గ్రేడ్ చేసినా కాజీపేట జంక్షన్ను చేయకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. డివిజన్ ఏర్పాటైతే ఈ ప్రాంత అభివృద్దితో పాటు కొత్త రైల్వే పరిశ్రమలు వస్తాయి. పాలన అందరి చెంతకు చేరుతుంది. కొత్త రైళ్లను ఇక్కడకు ప్రారంభించేందుకు వెసలుబాటు కలుగుతుంది. డివిజన్ స్థాయి రైల్వే భవనాలు, అధికారులు వస్తారు. వ్యాగన్ పీఓహెచ్ షెడ్ కాజీపేట కేంద్రంగా పదేళ్ల క్రితం మంజూరైన రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ.. ఆ తర్వాత దీని స్థానంలో మంజూరైన వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ షెడ్(పీఓహెచ్ షెడ్) నిర్మాణానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈసారైనా ఇవి తొలగిపోయి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని, శంకుస్థాపన జరుగుతుం దని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. వ్యాగన్ పీఓహెచ్ షెడ్ వస్తే కాజీపేట అభివృద్ధి చెందడమే కాకుండా ప్రాధాన్యత పెరుగుతుంది. కొంత మేరకు నిరుద్యోగం తగ్గుతుంది. దీనికి తోడు అనుబంధంగా చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటవుతాయి. -
పాతపని పూర్తిచేసేందుకే!
సాక్షి, హైదరాబాద్: ఈసారి బడ్జెట్లో పెండింగ్లో ఉన్న పాత ప్రాజెక్టులను పూర్తిచేసేందుకే కేంద్రం ఎక్కువ ఆసక్తి చూపించింది. కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి ప్రకటన చేయకుండా.. పాత వాటికి నిధుల కేటాయింపునకే పెద్దపీట వేసింది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కాజీపేట డివిజన్ హోదా, వట్టినాగులపల్లి టెర్మినల్ నిర్మాణం తదితర డిమాండ్లు ఈ బడ్జెట్లోనూ తీరని కోరికలుగానే మిగిలిపోయాయి. కాజీపేట–బల్లార్షా మూడో లైనుకు ఈ ఏడాది కూడా మోక్షం లభించలేదు. మరోవైపు అక్కన్నపేట–మెదక్ రైలు మార్గం ఈఏడాది ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కొత్తపల్లి–మనోహరాబాద్కు మార్గంలోనూ మనోహరాబాద్–గజ్వేల్ వరకు ట్రయల్ రన్కు అధికారులు సిద్ధమవుతుండటం శుభసూచకం. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే కేంద్రమైన సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ జాన్ థామస్ బడ్జెట్ వివరాలు వెల్లడించారు. కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు.. 1. మనోహరాబాద్ కొత్తపల్లి ప్రాజెక్టుకు రూ.200 కోట్లు 2. మునీరాబాద్–మహబూబ్నగర్ మార్గానికి రూ.275 కోట్లు 3. భద్రాచలం–సత్తుపల్లి లైన్కు రూ.405 కోట్లు 4. కాజీపేట–బల్లార్షా మూడో లైన్కు రూ.265 కోట్లు 5. సికింద్రాబాద్–మహబూబ్నగర్ డబ్లింగ్కు రూ.200 కోట్లు 6. కాజీపేట–విజయవాడ మూడోలైన్కు రూ.110 కోట్లు 7. ఘట్కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్ ఫేజ్–2కు రూ.20 కోట్లు 8. చర్లపల్లి శాటిలైట్ స్టేషన్కు రూ.5 కోట్లు 9. కాజీపేట ఓవర్ హాలింగ్ వర్క్షాప్కు రూ.10 కోట్లు 10. మౌలాలిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైల్వే ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏర్పాటుకు రూ.1.5 కోట్లు తీరని కలలు... 1980 నుంచి తీరని కలగా మిగిలిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఈసారి కూడా మోక్షం దక్కలేదు. కాజీపేటను డివిజన్గా మార్చాలన్న డిమాండ్, లాలాగూడలో మెడికల్ కాలేజీ నిర్మించాలన్న డిమాండ్ ప్రస్తుతానికి పెండింగ్లోనే ఉన్నాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని చర్లపల్లి, వట్టినాగులపల్లి టెర్మినళ్ల నిర్మాణం ఇంకా సాకారం కావడం లేదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించడంలో జాప్యం చేస్తున్నందునే ఇది ఆలస్యమవుతోంది. ఈ సర్వే పనులకు టెండర్లు పిలుస్తారా? 1. పటాన్చెరు–సంగారెడ్డి–జోగిపేట–మెదక్ 95 కిలోమీటర్లు 2. నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్ రూ.125 కోట్లు 3. కరీంనగర్–హుజూరాబాద్–ఎల్కతుర్తి: 60 కిమీ ‘ఓట్ల కోసమే ఈ బడ్జెట్ ’ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం ఓట్ల కోసమే పెట్టినట్టుందని కాంగ్రెస్ ఆరోపించింది. పేదలను వదిలి వ్యాపారుల మన్ననలు పొందేలా ఉన్న ఈ బడ్జెట్తో బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని మరోమారు తేలిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం గాంధీభవన్లో ఏఐసీసీ కిసాన్సెల్ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డితో కలసి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్నును మినహాయించినట్టు ప్రకటించి వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని చెప్పడం దారుణమన్నారు. బడాబాబులకు ఐటీ తగ్గించి పేదలను పట్టించుకోకుండా అంకెలు చూపెట్టారని, మోదీ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని, రాబోయే ఎన్నికల్లో మోదీ సర్కారును గద్దెదింపేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ త్వరలో జరిగే సాధారణ ఎన్నికలకు ప్రచారం మాదిరిగా ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ ద్వారా గతంలో తాను ప్రవేశపెట్టిన అన్ని పథకాలు విఫలమైనట్లుగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అయిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు, మద్దతు ధర, ఈనామ్ లాంటివన్నీ విఫలమవడంతో ఇప్పుడు కొత్తగా రైతులకు పెట్టుబడి సాయం పేరుతో ముందుకొచ్చారని విమర్శించారు. ఆదాయ పన్ను పరిమితి పెంపు మంచిదని పేర్కొన్నారు. అయితే, దీన్ని గత ఐదేళ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఎన్నికల కోణంలో ఉందన్నారు. -
ప్రగతికి ‘పట్టాలు’!
న్యూఢిల్లీ: మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఊహించినట్లుగానే రైల్వే చార్జీల పెంపు లేకుండానే తాజా బడ్జెట్ వచ్చింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనంత మూలధన వ్యయాన్ని ఈ బడ్జెట్లో రైల్వేకు కేటాయించారు. గతేడాది అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉండగా రూ. 1.48 లక్షల కోట్లను రైల్వేకు కేటాయించగా, ప్రస్తుతం దాన్ని మరో పది వేల కోట్లు పెంచి రూ. 1,58,658 కోట్లకు పియూష్ గోయల్ చేర్చారు. అలాగే బడ్జెట్ నుంచి మూలధన సాయంగా రూ.64,587 కోట్లను రైల్వేలకు కేటాయించారు. ఇప్పటివరకు రైల్వే చరిత్రలో 2018–19 సంవత్సరమే అత్యంత సురక్షితమైనదనీ, బ్రాడ్గేజ్ పట్టాలపై వెంట ఉన్ని కాపలా లేని రైల్వే గేట్లను సంపూర్ణంగా తొలగించామని రైల్వే, ఆర్థిక శాఖల మంత్రి పియూష్ చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ‘వచ్చే ఏడాదికి రైల్వేకు కేటాయించిన మూలధన వ్యయం చరిత్రలోనే అత్యధికం. ఆ మొత్తం రూ. 1.58 లక్షల కోట్లు. దేశీయంగా తయారైన పాక్షిక అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ 18) భారతీయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభవాన్ని ఇవ్వనుంది. పూర్తిగా మన ఇంజినీర్లే తయారు చేసిన ఈ రైలుతో మనం సాంకేతికతలో మరో పెద్ద అడుగు ముందుకేశాం’అని వివరించారు. రైల్వేకు వచ్చే ఆర్థిక ఏడాదిలో రూ. 2.73 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. గతేడాది ఈ అంచనా రూ. 2.5 లక్షల కోట్లుగా ఉంది. కొత్త మార్గాల నిర్మాణాలకు రూ. 7,255 కోట్లు, గేజ్ మార్పిడికి రూ. 2,200 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 700 కోట్లు, ఇంజిన్లు, బోగీలు తదితరాలకు రూ. 6,114.82 కోట్లు, సిగ్నల్ వ్యవస్థ, టెలికాంలకు కలిపి రూ. 1,750 కోట్లు, ప్రయాణికులకు సౌర్యాలను మెరుగుపరిచేందుకు రూ. 3,422 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ నిష్పత్తి 96.2కు మెరుగుపడిందనీ, వచ్చే ఏడాదికి దీనిని 95 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గోయల్ చెప్పారు. త్వరలో అధునాతన బోగీలు ఇంజిన్లు, బోగీలు తదితరాల కోసం గతేడాది కన్నా ఈ ఏడాది బడ్జెట్లో 64 శాతం అధిక కేటాయింపులకు చేశారు. 2018–19 బడ్జెట్లో ఈ కేటగిరీ కోసం రూ. 3,724.93 కోట్లు కేటాయించగా, తాజా ఆ బడ్జెట్లో ఆ మొత్తం రూ. 6,114.82 కోట్లుగా ఉంది. దీంతో త్వరలోనే అధునాతన బోగీలు రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రైలు బోగీల మార్కెట్లో ప్రపంచ వ్యాప్తంగా 200 బిలియన్ డాలర్ల వ్యాపారం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు తాజా బడ్జెట్ కేటాయింపులు ఉపకరించనున్నాయి. భారత్లో అత్యంత వేగవంతమైన రైలు ట్రైన్ 18 (వందే భారత్ ఎక్స్ప్రెస్), కొత్త ఏసీ కోచ్లు, మెట్రో కోచ్లు తదితరాల తయారీ విజయవంతం అవ్వడంతో అదే ఉత్సాహంతో 2021 వరకు తయారీ ప్రణాళికలను రైల్వే అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఇవి సరిగ్గా అమలైతే వచ్చే రెండేళ్లలో దేశంలోని వివిధ రైల్వే ఫ్యాక్టరీలు కలిసి దాదాపు 15 వేల బోగీలను తయారు చేయనున్నాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో తిరుగుతున్న ఈమూ, మెమూ రైళ్లకు బదులుగా కొత్త బోగీలను ప్రవేశపెట్టనున్నారు. త్వరలోనే మరో 6 ట్రైన్ 18లను తయారు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఫస్ట్ యాక్సిడెంట్.. ప్రపంచంలో తొలిసారి రైలు చక్రాల కింద నలిగిపోయిన అభాగ్యుడెవరో తెలుసా? ఈయనే. పేరు విలియం హస్కిసన్, బ్రిటన్ ఎంపీ. 1830 సెప్టెంబర్ 15న బ్రిటన్లోని లివర్పూల్, మాంచెస్టర్ రైల్వేలైన్ను ప్రారంభించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ రైలు కింద పడి మరణించారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆర్థర్ వెలస్లీతో మాట్లాడేందుకు పక్కనే ఉన్న పట్టాలపై నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. అయితే అదే సమయంలో ఆ పట్టాలపై మరో రైలు వస్తోంది. రైలు దగ్గరికి రాగానే తడబడుతూ పట్టాలపై పడిపోయారు. అందరూ చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ 1850 తొలినాళ్లలో మన దేశంలో ఇలా ఎడ్లే ఇంజిన్లుగా అప్పటి న్యారో గేజ్ రైలును లాగేవి. -
రైల్వే బడ్జెట్లో ఉమ్మడి జిల్లాపై శీతకన్ను
రైల్వే బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాపై కేంద్రం శీతకన్ను వహించింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సికింద్రాబాద్ – కాజీపేట మార్గంలో మూడో లేన్ ఊసే లేకపోగా.. బీబీనగర్–నడికుడి డబ్లింగ్ పనులకు మోక్షం కలగలేదు. ఇక సూర్యాపేటకు రైలు మార్గానికి సంబంధించిన ప్రతిపాదనలు ఈసారీ పట్టాలెక్కలేదు. రైల్వే శాఖకు అత్యధిక ఆదాయం సమకూర్చుతున్న విష్ణుపురం మార్గంపైనా జాలి చూపలేదు. రైల్వే ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన ఉమ్మడి జిల్లా వాసులకు నిరాశే మిగిలింది. సాక్షి, యాదాద్రి : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 2018–19 బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు న్యాయం జరుగలేదు. ఎన్నికల బడ్జెట్లో జిల్లాకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందని.. ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ప్రస్తుత కేటాయింపులపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు, బీబీనగర్ నడికుడి డబ్లింగ్ పనులకు మోక్షం లభించలేదు. సూర్యాపేట ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న ఎక్స్ప్రెస్ హైవే రైలు మార్గ ప్రతిపాదనలు ఈ సారి కూడా పట్టాలెక్కలేదు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ లైను పొడిగింపునకు అరకొర నిధులు కేటాయించారు. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టం (ఎంఎంటీఎస్) రైలు వస్తుందని భావించిన వారికి మరో ఏడాది పైగా నిరీక్షించకతప్పని పరిస్థితి. ఎంఎంటీఎస్ ఫేజ్–2కు మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.330కోట్లుకాగా.. రూ.21.25కోట్లు మంజూరు చేశారు. సికింద్రాబాద్ –కాజీపేట మార్గంలో మూడో లైన్ ఊసే లేకుండా పోయింది. ఈ ప్రాజెక్టు కోసం దశాబ్ధాలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. గతంలో సర్వే చేసిన అధికారులు ఇప్పుడు దాన్ని మరిచిపోయారు. దక్షిణమధ్య రైల్వే గుంటూరు డివిజన్లో గల బీబీనగర్– నడికుడి (252 కిలో మీటర్లు) డబ్లింగ్ పనులకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఎంతో ఆశగా చూశారు. ఈ మార్గానికి నిధులు కేటాయింపే జరగలేదు. పగిడిపల్లి నుంచి నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా నడికుడి జంక్షన్ వరకు రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయాలనేది ఈ ప్రాంత ప్రజల డిమాండ్ ఉంది. దక్షిణ, తూర్పు రైల్వే ప్రాంత ప్రజలకు ఈ మార్గం ద్వారా రైలు ప్రయాణం సాగుతోంది. క్రాసింగ్లతో ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లను సైతం ఆపక తప్పడం లేదు. గంటల తరబడి క్రాసింగ్లతో ప్రయాణకాలం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబంగా, కర్ణాటక రాష్ట్రాలతో అనుసంధానం గల ఈ మార్గంపై నిర్లక్ష్యం కొనసాగడం ప్రయాణికులను వేదనకు గురిచేస్తోంది. పగిడిపల్లి నుంచి నల్లపాడు వరకు విద్యుద్దీకరణ పనులకు రూ.291.75కోట్లు మంజూరు చేశారు. ఇందులో మొదటి విడుతగా నల్లపాడు నుంచి రెడ్డిగూడెం వరకు రైల్వే లైన్ విద్యుదీకరణ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తారు. రెడ్డిగూడెం నుంచి పగిడిపల్లి వరకు వచ్చే ఆర్థిక సంవత్సరం 2018–19లో పూర్తి చేస్తారు. సూర్యాపేట రైలు మార్గం ఎక్కడ..? హైదరాబాద్– అమరావతి ఎక్స్ప్రెస్ రైల్వే కోసం జిల్లాలోని సూర్యాపేట, కోదాడ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్లో దాని పేరెత్తలేదు. ప్రస్తుతం ఉన్న జాతీయరహదారి 65కు అనుబంధంగా అమరావతి వరకు నూతన రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. దీంతోపాటు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి మిర్యాలగూడ వరకు (వయా సూర్యాపేట) మార్గానికి 2013–14లో కొత్త లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనికి బడ్జెట్లో ఏ మాత్రం ప్రాధాన్యతను ఇవ్వలేదు. గుంటూరు రైల్వే డివిజన్లో రైల్వే శాఖకు అత్యధిక ఆదాయం వస్తున్న విష్ణుపురం మార్గంపైనా కేంద్రం జాలి చూపలేదు. మఠంపల్లి నుంచి జాన్పహాడ్ వరకు ఉన్న 18 కిలోమీటర్లు మార్గాన్ని పూర్తి చేస్తే జగ్గయ్యపేట నుంచి విష్ణుపురం రైలు మార్గం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తే బాగుండేది. రైల్వే బడ్జెట్లో భువనగిరి ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఘట్కేసర్ – యాదాద్రి (రాయగిరి) వరకు ఎంఎంటీఎస్–2కు రూ.21.25కోట్లు కేటాయించడం బాధాకరం. ఈ ప్రాంతానికి ఎంఎంటీఎస్ తీసుకువచ్చే ప్రయత్నంలో పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయిస్తే బాగుండేది. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు కాకుండా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్ట పట్టణం వరకు పొడగిస్తే ప్రయాణికులు సంతోషించే వారు. ఎంఎంటీఎస్–2ను ఘట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు పొడగించి, మరిన్ని నిధులు కేటాయించి పూర్తి చేయాలి. – ఎండీ అతీఫ్, యాదగిరిగుట్ట రాష్ట్రానికి మొండిచేయి.. కేంద్ర ప్రభుత్వం ఈసారి రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి మెండి చేయి చూపారు. రూ.1,813 కోట్ల నిధులు కేటాయించడం దారనుణం. పాత ప్రాజెక్టుల పనులకు మాత్రమే నిధులు కేటాయించారు. కొత్త ప్రాజెక్టులకు కేటాయించలేదు. నామమాత్రం నిధుల కేటాయింపు వల్ల పనుల్లో జాప్యం జరగవచ్చు. – బాలచందర్, మాజీ వైస్ ఎంపీపీ, బీబీనగర్ -
రైల్వే కేటాయింపుల్లో తీవ్ర నిరాశ..
సాక్షి, హైదరాబాద్ ఒక్క కొత్త రైలు రాలేదు.. కీలక మార్గాల్లో కొత్త్త లైన్ ఒక్కటీ లేదు.. భారీ ప్రాజెక్టులూ లేవు.. వెరసి మోదీ రైలు తెలంగాణలో ఆగకుండానే దూసుకుపోయింది! కోటి ఆశలతో కేంద్రం వైపు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రాష్ట్రానికి తీవ్ర నిరాశే మిగిల్చింది. రైల్వే లైన్లు పరిమితంగా ఉన్న తెలంగాణ ప్రతిసారీ రైల్వే బడ్జెట్ అనగానే కేంద్రం వైపు ఎంతో ఆశతో చూస్తోంది. ప్రతిసారీ ఎంతో కొంత విదిల్చి నిరుత్సాహపరిచే కేంద్రం ఈసారి మరింత పిసినారితనాన్ని ప్రదర్శించింది. బడ్జెట్లో రైల్వేకు తొలిసారి రూ.లక్ష కోట్లను మించి (రూ.1,46,500 కోట్లు) నిధులు కేటాయించినా.. అందులో రాష్ట్రానికి విదిల్చింది కేవలం రూ.1,813 కోట్లు. మొత్తం కేటాయింపులో ఇది కేవలం 1.23 శాతం! బడ్జెట్ విధానాన్ని మార్చినందున కచ్చితంగా కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయాలన్న నిర్ణయం ఉండదని, సంవత్సరంలో ఎప్పుడైనా మంజూరు చేయొచ్చంటున్న కేంద్రం.. ఇప్పటికే పనులు జరుగుతున్న ప్రాజెక్టులకన్నా భారీగా నిధులు ఇచ్చిందా అంటే అదీ లేదు. అత్తెసరు నిధులు విదిల్చి ఆ పనులు ఇప్పట్లో పూర్తి కావనే సంకేతాలనిచ్చింది. పండుగల సమయంలో లక్షల మంది ప్రయాణికులు పోటెత్తినా చాలినన్ని ప్రత్యేక రైళ్లు నడిపే శక్తి దక్షిణ మధ్య రైల్వేకు లేదు. డిమాండ్ను తట్టుకునే స్థాయిలో రైల్వే లైన్లు లేకపోవటమే ఇందుకు కారణమని రైల్వేనే చెబుతోంది. రెండు, మూడో లైన్ల నిర్మాణం, కీలక మార్గాల్లో కొత్త లైన్లకు నిధులిస్తే ఈ సమస్య తీరేంది. కానీ ఆ ప్రయత్నం కూడా జరగలేదని బడ్జెట్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా సాధారణ కేటాయింపులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ రాష్ట్రానికి మొండిచేయి చూపారు. ఇలాగైతే పదేళ్లయినా పూర్తి కావు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం 2,623 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్లకు ఉద్దేశించిన 22 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.19,983 కోట్లు. కానీ రాష్ట్రం ఆవిర్భవించినప్పట్నుంచీ ఇప్పటి వరకు వీటిపై చేసిన ఖర్చు రూ.3,026 కోట్లు మాత్రమే. వాటికి తాజా బడ్జెట్లో కేటాయించిన మొత్తం రూ.1,757 కోట్లు. అందులో తెలంగాణ వాటా కేవలం రూ.675 కోట్లు. ఇదేరకంగా నిధులు కేటాయిస్తూ పోతే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు పదేళ్ల కాలం పడుతుంది. ఇక కొత్త లైన్ల సంగతి చెప్పేదేముంది. జరిగిన పనులు 8.2 శాతమే.. పెరుగుతున్న డిమాండ్, రైళ్ల ట్రాఫిక్ నేపథ్యంలో ప్రస్తుతం రెండు, మూడో లైన్ నిర్మాణం ఎంతో అవసరం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2,268 కి.మీ. మేర ఈ పనులు సాగుతున్నాయి. వీటి అంచనా వ్యయం రూ.19,647 కోట్లు. కానీ 2014 నుంచి ఇప్పటివరకు రూ.1,626 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. అంటే.. 8.2 శాతం పనులే జరిగాయని ఈ లెక్కలు చెబుతున్నాయి. తాజాగా అందుకు ఇచ్చిన మొత్తం రూ.611 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కొత్త లైన్లకు సంబంధించి 113 కి.మీ., డబ్లింగ్, ట్రిప్లింగ్కు సంబంధించి 24.50 కి.మీ. మాత్రమే పూర్తి చేయగలిగారు. నిధుల కేటాయింపుల్లో పెరుగుదల ఏది? రైల్వే వసతి అతి తక్కువ ఉన్న రాష్ట్రంలో ఆది నుంచి బడ్జెట్ కేటాయింపులు అత్తెసరే. కానీ 2014లో మోదీ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత కాస్త ఆశలు పెరిగాయి. అప్పటి వరకు ఉన్న నామమాత్రపు కేటాయింపులను కొంత పెంచటమే ఇందుకు కారణం. వరుసగా మూడేళ్లపాటు ఆ పెంపు ఓ మోస్తరుగా ఉండటంతో.. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఈ చివరి బడ్జెట్లో అది మరింత ఆశాజనకంగా ఉంటుందని ఆశించారు. కానీ నామమాత్రపు పెంపుతో నీళ్లు చల్లారు. బడ్జెట్లో కేటాయింపులివీ.. ఇక అన్నీ ఎలక్ట్రిక్.. : దక్షిణ మధ్య రైల్వేను పూర్తిగా కరెంటు మార్గంగా చేయబోతున్నారు. ఈ జోన్ పరిధిలోని బీదర్–గుల్బర్గా మార్గం మినహా యావత్తు ద.మ. రైల్వేను ఎలక్ట్రికల్ మార్గంగా చేయబోతున్నట్టు బడ్జెట్లో ప్రకటించారు. ఇందుకు తాజా బడ్జెట్లో 1,261 కి.మీ. మార్గాన్ని విద్యుద్దీకరించేందుకు రూ.1,172 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది మాత్రం ఇందుకు రూ.72 కోట్లు మంజూరు చేశారు. ఇందులో తెలంగాణ వాటా మార్గాలు... లింగంపేట–జగిత్యాల–నిజామాబాద్– 95 కి.మీ.(రూ.80.29 కోట్లు) వికారాబాద్–పర్లివైజ్నాథ్–269 కి.మీ.(రూ.262.12 కోట్లు) పింపల్కుట్టి–ముద్ఖేడ్–పర్లి– 246 కి.మీ.(రూ.224.17 కోట్లు) సికింద్రాబాద్ ‘జిగేల్’.. రెండేళ్ల తర్వాతే.. దేశంలోని ప్రధాన స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు కేంద్రం గత బడ్జెట్లో శ్రీకారం చుట్టింది. తొలిదశలో 25 స్టేషన్లను ఎంచుకోగా అందులో సికింద్రాబాద్ చోటు దక్కించుకుంది. పీపీపీ పద్ధతిలో వాటిని అభివృద్ధి చేస్తారు. గత సంవత్సరమే రైల్వే టెండర్లు పిలిచింది. కానీ నిబంధనలు చూసిన తర్వాత బిడ్డర్లు వెనకడుగు వేశారు. ఈ ప్రాజెక్టులో లీజు గడువు 40 ఏళ్లుగా రైల్వే నిర్ధారించింది. దాన్ని మారిస్తేనే ముందుకొస్తామని బిడ్డర్లు తేల్చి చెప్పారు. ఫలితంగా ఆ ప్రాజెక్టు దాదాపు ఆగిపోయింది. దీంతో తాజాగా కేంద్రం లీజు సమయాన్ని 99 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. బిడ్ల తంతు పూర్తి చేసి వచ్చే సంవత్సరం పనులు ప్రారంభించే అవకాశం ఉందని ద.మ. రైల్వే జీఎం వినోద్కుమార్ యాదవ్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోనే ‘కాజీపేట’ జాప్యం కొంతకాలం నడిచిన తర్వాత బోగీలను తిరిగి కండీషన్లోకి తెచ్చేందుకు ఉద్దేశించిన వ్యాగన్ ఓవర్హాలింగ్ వర్క్షాపు ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పనుల్లో జాప్యం జరుగుతోంది. దీనికి కావాల్సిన 150 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ అది దేవాదాయశాఖ భూమి కావటంతో కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. దీంతో గత బడ్జెట్లో రైల్వే శాఖ నిధులు కేటాయించినా పనులు చేపట్టలేకపోయింది. ఇప్పటికీ ఆ భూమి మధ్యలో ఓ బిట్పై ఇంకా కేసు కొనసాగుతుండటంతో దాన్ని రైల్వేకు స్వాధీనం చేయలేకపోయారు. తాజా బడ్జెట్లో కేంద్రం దానికి రూ.200 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగించిన 18 నెలల్లో వర్క్షాపు పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం తెలిపారు. మరిన్ని విశేషాలు.. ⇒ నిత్యం 25 వేల మంది వరకు ప్రయాణికుల తాకిడి ఉండే అన్ని రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంవత్సరం హఫీజ్పేట, ఖమ్మంలలో ఏర్పాటు చేస్తారు. ⇒ అన్ని రైల్వే స్టేషన్లలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తారు. స్టేషన్ భవనాలపైన సౌరఫలకాలు ఏర్పాటు చేసి సౌర విద్యుత్ను అందిపుచ్చుకుంటారు. ⇒ కొత్తగా 2 ఆర్ఓబీలు, 9 ఆర్యూబీలను రూ.195 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. ఇందులో రైల్వే రూ.73.14 కోట్లు భరించనుండగా మిగతా మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. ⇒ సికింద్రాబాద్–కరీంనగర్ను రైల్వేతో అనుసంధానించేందుకు ఉద్దేశించిన మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టుకు ఈసారి రూ.125 కోట్లు కేటాయించారు. వీటితో మనోహరాబాద్–గజ్వేల్ మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేస్తారు. చర్లపల్లి శాటిలైట్ స్టేషన్కు భూమి ఏది? సికింద్రాబాద్ స్టేషన్లో కొత్త ప్లాట్ఫామ్స్ నిర్మించేందుకు స్థలం లేక రైళ్లను శివార్లలో నిలపాల్సి రావటం ప్రయాణికులకు శాపంగా మారడంతో చర్లపల్లిలో ఆ«ధునిక శాటిలైట్ టెర్మినల్ నిర్మించాలని రైల్వే శాఖ రెండేళ్ల క్రితం నిర్ణయించింది. దీనికి 150 ఎకరాల స్థలం కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా కోరింది. కానీ స్థలం లభించక పనులు మొదలు పెట్టలేకపోయింది. ఎన్నిసార్లు రాష్ట్రప్రభుత్వాన్ని కోరినా స్పందన లేకపోవటంతో ఇక అక్కడ తనకు ఉన్న 50 ఎకరాల స్థలంలోనే పనులు చేపట్టాలని రైల్వే నిర్ణయించింది. ఉన్న నిధులతో పనులు వేగంగా చేస్తాం గత నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే దక్షిణ మధ్య రైల్వేకు మెరుగ్గానే నిధుల కేటాయింపు జరిగింది. వీటితో కొత్త లైన్లు, రెండు, మూడో లైన్ల నిర్మాణంపై దృష్టి పెడతాం. ముఖ్యంగా ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణం, కాపలా లేని లెవల్ క్రాసింగ్స్ తొలగింపు, హైలెవల్ ప్లాట్ఫామ్ల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తున్నాం. జోన్కు కేటాయించిన నిధులను అవసరమైతే మంజూరైన ఇతర పనులకు సర్దుబాటు చేసే అధికారాన్ని జీఎంలకు కల్పించటం శుభపరిణామం. దీంతో ఏదైనా సమస్య వల్ల నిర్ధారిత పనులు ఆగిపోతే ఆ నిధులు వెనక్కు పోకుండా అవసరమైన ఇతర పనులకు ఖర్చు చేసే వెసులుబాటు కలుగుతుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి కాపలాదారులేని లెవల్ క్రాసింగ్స్ లేకుండా చేస్తాం. అలాంటివి 214 ఉన్నట్టు గుర్తించాం. యాదాద్రి ఎంఎంటీఎస్కు ఈ నెలలోనే టెండర్లను ఆహ్వానిస్తాం. –వినోద్కుమార్ యాదవ్. జీఎం, దక్షిణ మధ్య రైల్వే -
పట్టాలెక్కని డిమాండ్లు
తిరుపతి మెయిన్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో అనుబంధంగా ఉన్న వెస్ట్, రేణిగుంట, తిరుచానూరు రైల్వేస్టేషన్లను ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసేందుకు తయారు చేసిన డిజైన్లు, ప్రాజెక్ట్ రిపోర్టుల కన్సల్టెన్సీలకే పుణ్య కాలం హరించుకుపోతోంది. గడచిన 12 ఏళ్లలో సుమారు రూ.15 కోట్లమేర ఇందుకోసం రైల్వేశాఖ ఖర్చు చేసింది. ఇప్పటికీ రూపురేఖలు మారకపోవడం ఒక ఎత్తయితే.. మౌలిక వసతులు కల్పించకపోవడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రైల్వే బడ్జెట్పై జనం ఆశతో ఉన్నారు. తిరుపతి అర్బన్: దశాబ్దాల తరబడి జిల్లాకు రైల్వేపరంగా సరైన ప్రాధాన్యం లభించడం లేదు. ఫలితంగా అనేక డిమాండ్లు అమలుకు నోచుకోవడం లేదు. నేటికీ రద్దీ మేరకు రైళ్లు లేకపోగా, తిరుపతికి వస్తున్న యాత్రికులకు కనీస వసతులు కల్పించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తొలి రెండున్నరేళ్లపాటు రైల్వేమంత్రిగా కొనసాగిన సురేష్ప్రభుతో జిల్లా ఎంపీలు పలుమార్లు సంప్రదించి నివేదిం చిన అంశాల్లో కొన్నింటికి గ్రీన్ సిగ్నల్ పడ్డాయి. చాలా అంశాలు నేటికీ ఊరిస్తూ ...ఉసూరుమనిపిస్తూ కాలగమనంలో పడిలేస్తున్నాయి. కొత్త రైళ్లు ఏర్పాటు చేయకపోగా, మీటర్గేజ్ ఉన్నప్పుడు నడుస్తున్న పాత రైళ్లనైనా పునరుద్ధరించాలన్న డిమాం డ్లకు మోక్షం రావడం లేదు. కానరాని వరల్డ్క్లాస్....ఊరిస్తున్న మోడల్ క్లాస్ దక్షిణమధ్య రైల్వే జోన్లోనే అత్యధిక రద్దీ, ఆదాయం సమకూరుస్తున్న రెండో రైల్వేస్టేషన్ తిరుపతి. అందుకు అనుగుణంగా 2008లో అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తిరుపతిని వరల్డ్క్లాస్ స్థాయికి తీసుకువెళ్తామంటూ బడ్జెట్లో ప్రకటించారు. అనంతరం రైల్వేమంత్రి మారడం, ఉన్నతాధికారుల పర్యటనల్లో మార్పులు సూచించడం వంటి కారణాలతోనే పదేళ్లు గడచిపోయాయి. ఇప్పటికీ వరల్డ్క్లాస్ హోదా లేదు. ప్రస్తుత రైల్వే జీఎం వినోద్కుమార్ యాదవ్ మాత్రం వరల్డ్క్లాస్ ఫైల్ ముగిసిపోలేదని చెబుతున్నప్పటికీ ఆ స్థాయిలో పనులకు అడుగు పడటం లేదు. మూడేళ్ల క్రితం మోడల్క్లాస్ స్థాయికి చేస్తామంటూ రైల్వేబోర్డు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇప్పుడు తిరుపతి రైల్వే వెలుపల గోడలకు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఆ ఊసేలేదు. అదికూడా ఎప్పుడో 60 ఏళ్లక్రితం నిర్మించిన గోడలకే రంగులు అద్దడం విశేషం. దక్షిణం వైపు రూ.500 కోట్లతో మల్టీప్లెక్స్లు, సినిమా హాళ్లు, అన్నిరకాల కమర్షి యల్ కాంప్లెక్స్లు నిర్మించేస్తామంటూ రెండేళ్లుగా ఊరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పనులకు కూడా ఈసారి బడ్జెట్లో నిధులు చాలినన్ని మంజూరు చేస్తారా...? అనేది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. పాత రైళ్లనైనా పునరుద్ధరించేనా...? 15 ఏళ్లక్రితం వరకు ఉన్న మీటర్గేజ్ కాలంలో అనేక రైళ్లను ఆ తర్వాత బ్రాడ్గేజ్ వచ్చాక నిలిపేశారు. ప్రస్తుతం ఆయా మార్గాల్లో పెరిగిపోతున్న రద్దీని దష్టిలో ఉంచుకుని గడచిన మూడేళ్లుగా పాతరైళ్ల పునరుద్ధరణకు ఒత్తిడి పెరిగింది. ఆ దిశగానైనా ఈసారి బడ్జెట్లో ఆమోదం వచ్చి గ్రీన్ సిగ్నల్ పడాలని ఎదురు చూస్తున్నారు. పాత రైళ్లు, పెండింగ్ డిమాండ్లు ♦ తిరుపతి నుంచి రామేశ్వరం వరకు 15ఏళ్ల క్రితం నడుస్తున్న డైలీ ఎక్స్ప్రెస్ ♦ తిరుపతి నుంచి పాకాల–ధర్మవరం మీదుగా హైదరాబాద్కు రోజూ ఒకే సమయంలో నడుస్తున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ♦ తిరుపతి నుంచి వారణాసికి 12 ఏళ్లక్రితం వరకు నడుస్తున్న ఎక్స్ప్రెస్ రైలు ♦ తిరుపతి నుంచి చెన్నైకి రాత్రివేళల్లో నడుస్తుండిన ఎక్స్ప్రెస్ రైలు ♦ ప్రస్తుతం కోయంబత్తూరు మార్గంలో నడుస్తున్న ఇంటర్సిటీని డైలీగా మార్పు చేయాల న్న నాలుగేళ్ల డిమాండ్కు మోక్షం కల్పించాలి. ♦ చిత్తూరు జాతీయ రహదారిలో ఎం.బండపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పెండింగ్లో ఉంది. ♦ రేణిగుంట మీదుగా చెన్నైకి నడుస్తున్న దాదర్ ఎక్స్ప్రెస్ రైలుకు నగరిలో హాల్ట్ ఇవ్వాలన్న డిమాండ్కు 6 ఏళ్లుగా ఆచరణ రావడం లేదు. -
రైల్వే మంత్రిగారూ.. దయచేసి వినండి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రైల్వే బడ్జెట్ ప్రతిసారీ ఊరించి ఉస్సూరనిపిస్తోంది. కొత్త రైళ్ల ఊసే ఉండడం లేదు. కొత్త రైల్వే లైన్ల పరిస్థితి కూడా అంతే. జిల్లా ఎంపీల నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నా రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. రైల్వే స్టేషన్లలో సమస్యల కూతలు వినిపిస్తున్నాయి. ఏటా కొత్త బడ్జెట్ ప్రవేశపెడుతున్నా స్టేషన్ల అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. బడ్జెట్లో ప్రకటనలు తప్ప ఆచరణకు నోచుకోవడం లేదన్న విమర్శలూ లేకపోలేదు. ప్రధానమైన ప్రతిపాదనలివీ... కాకినాడ–కోటిపల్లి రైల్వేను లైన్ నర్సాపురం వరకు విస్తరించేందుకు మరో రూ. 600 కోట్లు రైల్వే శాఖ నుంచి రావల్సి ఉంది. అవి వస్తే తప్ప కోటిపల్లి నుంచి రైల్వే పనులు ప్రారంభంకావు. వీటి విషయంలో అమలాపురం ఎంపీ రవీంద్రబాబు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ బడ్జెట్లో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ♦ 30 ఏళ్ల క్రితం నివేదిక ఆధారంగా పిఠాపురం– కాకినాడ మెయిన్ లైన్ సాధ్యం కాదని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి మారింది. రద్దీ పెరిగింది. కొత్తగా కోటిపల్లి– నర్సాపురం లైన్ వేస్తుండటంతో ఈ మెయిన్ లైన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నేరుగా ప్రధానమంత్రి మోదీ దృష్టికి ఎంపీ తోట నర్సింహం తీసుకెళ్లారు. గత బడ్జెట్లో 200 కేటాయించినందున దీన్ని పూర్తి చేయాలని కోరారు. ఎంపీ తోట నర్సింహం పరువు నిలుపుతారో లేదో చూడాలి. ♦ రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో 3,4 ప్లాట్ఫారమ్ల అభివృద్ధి కోసం గత బడ్జెట్లో రూ.29 కోట్లు మంజూరయ్యాయి. కానీ ఇంతవరకు ఆ నిధులు రాలేదు. పనులు మొదలు కాలేదు. ♦ కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు లైన్ వేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇంకాస్త ప్రయోజనకరంగా, పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే నర్సాపురం నుంచి మచిలీపట్నం, రేపెల్లె, నిజాంపట్నం మీదుగా బాపట్ల వరకు కలిపే కోస్తా రైలు మార్గం అవుతుందని,ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్న ప్రతిపాదన ఉంది. ♦ జిల్లాలో ఏ ఒక్క రైల్వే స్టేషన్లో ‘వైఫై’ సదుపాయం లేదు. ఇక నూతన రైల్వే లైన్ల ఊసే ఉండటం లేదు. కొత్తగా రైళ్లు రావడం లేదు. ఎంపీలు కోరడమే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదు. వీటికి ఈ బడ్జెట్లో మోక్షం కలుగుతుందో లేదంటే ఎప్పటిలాగే ప్రతిపాదనలు పక్కన పెట్టేస్తుందో చూడాలి. గతంలో ప్రకటించిన నిధులు ఈసారైనా విడుదల చేస్తుందో లేదో చూడాలి. దేశ వ్యాప్తంగా ప్రకటించినట్టుగా మన రైల్వే స్టేషన్ల అభివృద్ధి, సౌకర్యాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందో? గత బడ్జెట్ మాదిరిగా మొండి చేయి చూపుతుందో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. -
సర్కారు సగమిస్తేనే..!
ఎనిమిది దశాబ్దాల కలకు.. ‘బంగారు తెలంగాణ’లోనూ మోక్షం కలగడం లేదు. బోధన్–బీదర్ రైల్వే లైన్ పొడిగింపు అడుగు ముందుకు పడట్లేదు. 1938లో నిజాం హయాంలో ప్రతిపాదించిన ఈ రైల్వే మార్గం.. ఇప్పటికీ పట్టాలెక్కలేదు. 2014లో సర్వే పూర్తయినా నిధుల కేటాయింపు లేక ‘లైన్ క్లియర్’ కావట్లేదు. ఈ ‘మార్గం’ సుగమం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే, కేంద్రం కూడా ఆ మేరకు నిధులు ఇవ్వనుంది. అయితే, ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందా..? దశాబ్దాల కల సాకారమవుతుందా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. బాన్సువాడ: అసంపూర్తిగా ఉన్న బోధన్ రైల్వే లైన్ను బీదర్ వరకు పొడిగిస్తే వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో లబ్ధి చేకూరనుంది. ఆయా ప్రాంతాలకు రవాణా వసతులు పెరిగి అభివృద్ధి బాట పట్టే అవకాశముంది. అయితే, సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఆయా ప్రాంతాలకు ఇప్పట్లో ‘రైలు బండి’ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చట్లేదు. 201లో రూ.1,029 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ ప్రాజెక్టు.. జాప్యం కారణంగా ప్రస్తుత అంచనా వ్యయం రెట్టింపయింది. అయితే, మారిన నిబంధనల ప్రకారం ఈ రైల్వే లైన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉంది. ఈ లైన్ ప్రస్తుతం పట్టాలెక్కాలంటే సుమారు రూ.2 వేల కోట్ల వ్యయం కానుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సగం కేటాయిస్తే, కేంద్రం సగం కేటాయించనుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించని కారణంగా ఈ ‘మార్గానికి’ మోక్షం కలగట్లేదు. ఎనిమిది దశాబ్దాల కల.. బోధన్–బీదర్ రైల్వే లైన్ను పొడిగించేందుకు 1938లోనే నిజాం సర్కార్ హయాంలో ప్రతిపాదనలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన రైల్వే లైన్ నిర్మాణం కలగానే మారింది. బోధన్–బాన్సువాడ–బీదర్ ప్రాంత ప్రజల కోరిక మేరకు 2010లో అప్పటి రైల్వే మంత్రి మమతాబెనర్జీ ఈ మార్గానికి ‘లైన్ క్లీయర్’ చేశారు. దశాబ్దాల కల అయిన బోధన్–బీదర్ రైల్వే లైన్కు సర్వే కోసం పచ్చజెండా ఊపిన మమతా బెనర్జీ.. ఆదిలాబాద్–పటాన్చెరు మధ్య కొత్తగా మరో రైల్వే లైన్ కోసం సర్వే చేసేందుకు పచ్చ జెండా ఊపారు. దీంతో ఈ ప్రాంతం మీదుగా ఒకేసారి రెండు రైల్వే లైన్ల కోసం సర్వే చేయించేందుకు అనుమతి లభించడంతో అందరూ ఎంతో సంబర పడ్డారు. కానీ ఈ ప్రతిపాదనలు పట్టాలెక్కకుండానే కనుమరుగయ్యాయి. 2014లో సర్వే పూర్తి! 2010లో రైల్వే బడ్జెట్లో రెండు లైన్లకు లభించిన సర్వే అనుమతుల దృష్ట్యా సర్వే అయితే పూర్తి చేశారు. 138 కిలోమీటర్ల బోధన్–బీదర్ రైల్వే లైన్ కోసం 2011 ఏప్రిల్లో ప్రారంభమైన సర్వే 2014లో పూర్తయింది. బోధన్ నుంచి రుద్రూర్, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, పిట్లం మీదుగా నారాయణఖేడ్, బీదర్ వరకు వారు సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం మార్గమధ్యలో భారీ వంతెనలు లేవని తేలింది. కేవలం రూ.1,029 వ్యయంతో లైన్ వేయవచ్చని అధికారులు తేల్చారు. బాన్సువాడ–బోధన్ ప్రధాన రోడ్డుకు ఆవలి వైపు సుమారు 3 కిలోమీటర్ల వ్యత్యాసంలో సర్వే నిర్వహించి, హద్దు రాళ్లను పాతారు. ఈ మేరకు హద్దు రాళ్లు ఆయా పంట పొలాలు, అడవుల్లో ఇప్పటికీ ఉన్నాయి. దశల వారీగా నిర్వహించిన ఈ సర్వేలో మార్గ మధ్యలో వచ్చే నదులపై వంతెనలు, ఎత్తుపల్లాలు ఇతర అన్ని రకాల భౌగోళిక పరిస్థితులపై అంచనా వేసి రైల్వే శాఖ ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. నిధుల కేటాయింపుపై సందిగ్ధత 2014లో సర్వే పూర్తవడంతో ఏటా రైల్వే బడ్జెట్లో ఎంతో కొంత నిధులు మంజూరవుతాయని అంతా భావించారు. కానీ ఇప్పటివరకు మూడు బడ్జెట్లు పూర్తయినా పైసా కూడా మంజూరు కాలేదు. తెలంగాణలోని కొన్ని కొత్త మార్గాల్లో మెండుగా నిధులు కేటాయించిన కేంద్రం.. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బోధన్–బీదర్ రైల్వే లైన్కు మొండి చేయి చూపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే ఈ లైన్ పట్టాలెక్కే అవకాశముంది. ఈ మార్గంలో సర్వే పూర్తయినందున రాష్ట్రప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయిస్తే, మరో 50శాతం కేంద్రం కేటాయించనుంది. సుమారు రూ.2వేల కోట్ల అంచనా వ్యయం కాగా, ఇందులో 50శాతం నిధులను రాష్ట్రం కేటాయిస్తేనే కేంద్రం తన వాటా 50 శాతం నిధులు మంజూరు చేయనుం దని అధికారులు చెబుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైంది. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో రూపా యి కూడా కేటాయించలేదు. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా నిధులు కేటాయిం చాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. 50 శాతం నిధులిస్తే.. బోధన్–బీదర్ రైలు మార్గానికి సర్వే పూర్త యింది. రూ.2వేల కోట్ల తో ఈ ప్రాజెక్టు చేపట్టా ల్సి ఉంది. మారిన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయిస్తే 50 శాతం నిధులను కేంద్రం మంజూరు చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపుపైనే ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది. – బీబీ పాటిల్, జహీరాబాద్ ఎంపీ ♦ బోధన్–బీదర్ రైల్వేలైన్ ప్రతిపాదించింది 1938 నిజాం హయాంలో ♦ రైల్వే లైన్ పొడవు 138 కిలో మీటర్లు (తెలంగాణలో 90 కి.మీ., మహారాష్ట్ర, కర్ణాటకలో 48 కి.మీ.) ♦ లబ్ధి పొందే జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, బీదర్ ♦ సర్వే పూర్తయినది 2014లో ♦ అప్పట్లో అంచనా వ్యయం రూ.1,029 కోట్లు ♦ ప్రస్తుత అంచనా రూ.2 వేల కోట్లు -
పూర్తి ఏసీతో డబుల్ డెకర్ రైళ్లు
ఇంతకుముందు ప్రవేశపెట్టిన డబుల్ డెకర్ రైళ్లకు ఆదరణ లభించకపోవడంతో.. భారతీయ రైల్వేలు సరికొత్త ప్రయోగం చేస్తున్నాయి. ఎక్కువ డిమాండ్ ఉండే రూట్లలో పూర్తి ఏసీ, వై-ఫై సదుపాయంతో కొత్తగా ఉత్కృష్ట్ డబుల్ డెకర్ ఏఎక్స్ యారీ (ఉదయ్) రైళ్లను నడిపించనున్నాయి. ఇవి జూలై నుంచిప్రారంభం అవుతాయని రైల్వేశాఖ తెలిపింది. ఒక్కో కోచ్లో వెనక్కి వాలగలిగేలా 120 సీట్లు ఉంటాయి. ప్రయాణసమయంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా ఆటోమేటిక్ టీ/కాఫీ/ కూల్ డ్రింక్ వెండింగ్ మిషన్లు కూడా ప్రతి బోగీలో ఉంటాయి. ఢిల్లీ-లక్నో లాంటి బాగా డిమాండ్ ఉండే మార్గాల్లో ఇవి నడుస్తాయి. మామూలు రైళ్లలో ఉండే థర్డ్ ఏసీ కంటే వీటిలో చార్జి తక్కువగానే ఉంటుందని అంటున్నారు. ప్రతి బోగీలోనూ ఎల్సీడీ స్క్రీన్లు, వై-ఫై స్పీకర్ సిస్టం కూడా ఉంటాయి. మామూలు రైళ్ల కంటే సీట్ల సామర్థ్యం 40 శాతం ఎక్కువగా ఉండటంతో రద్దీని తట్టుకోడానికి ఇవి ఉపయోగపడతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే.. రాత్రిపూట ప్రయాణించే రైళ్లయినా వీటిలో బెర్తులు లేకపోవడం మాత్రం కొంత ఇబ్బందికరమే అంటున్నారు. దాంతో అదనపు సదుపాయాలతో ప్రయాణాన్ని సుఖవంతం చేస్తున్నామని అధికారులు తెలిపారు. రాత్రిపూట వెనక్కి వాలి, కాళ్లు చాపుకునేలా తగినంత లెగ్ స్పేస్ ఉంటుంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైళ్ల గురించి 2016-17 రైల్వే బడ్జెట్లో ప్రకటించారు. -
అమరావతికి లైన్ క్లియర్
రాజధానికి రైలు మార్గం రూ.2,680 కోట్ల నిధులు కేటాయింపు విజయవాడ – అమరావతి – గుంటూరు కలిపి రైల్వే లైను 106 కిలోమీటర్ల మేర నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ నడికుడి – శ్రీకాళహస్తి పనులకు రూ.340 కోట్లు మంజూరు తెనాలి–గుంతకల్ డబ్లింగ్ పనులకు రూ.174 కోట్లు మచిలీపట్నం పోర్టు వరకు గుడివాడ రైల్వే లైన్ పొడిగింపు కాజీపేట–విజయవాడ మధ్య నాలుగో లైన్ సర్వేకు అనుమతి సాక్షి, విజయవాడ : రాష్ట్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతానికి రైలు మార్గం ఖరారైంది. రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వం చేసిన వినతులకు ఎట్టకేలకు కేంద్ర రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో రైల్వే బడ్జెట్లో గుంటూరు, కృష్ణా జిల్లాలకు పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులు కేటాయించారు. విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో ఇప్పటికే కొన్ని పనులు కొనసాగుతున్నాయి. వాటికి నిధుల కేటాయింపుతో పాటు, కొత్త ప్రాజెక్టులు మంజూరు చేశారు. ప్రధానంగా విజయవాడ – అమరావతి – గుంటూరులను కలుపుతూ 106 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్వల్పంగా పెరిగిన కేటాయింపులు... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం సాధారణ బడ్జెట్తో పాటు రైల్వే బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పార్లమెంటు సభ్యులు పలు ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు, కేంద్ర మంత్రికి అందజేశారు. ఈ క్రమంలో వాటిలో కొంతమేర కేటాయింపులు జరిగాయి. గత ఏడాది కంటే కేటాయింపుల సంఖ్య కొంత పెరిగింది. గత రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి రూ.2,195 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించగా, ఈసారి రూ.3,406 కోట్ల నిధులు కేటాయించారు. రాజధానికి రైల్వే లైన్... రైల్వే బడ్జెట్లో ప్రధానంగా రాజధాని ప్రాంతమైన అమరావతికి రైలు మంజూరైంది. సీఎం చంద్రబాబు సహా రెండు జిల్లాల ఎంపీలు రైలు మార్గం కోసం అనేక పర్యాయాలు వినతి పత్రాలు ప్రభుత్వానికి అందజేశారు. విజయవాడలో నిర్మించనున్న మెట్రో రైలు మార్గాన్ని రాజధాని వరకు కొనసాగించే విషయంపైనా తర్జనభర్జనలు, పరిశీలన జరిగింది. ఈ పరిణామాల క్రమంలో రైల్వే బడ్జెట్లో కొత్త రైలు మార్గానికి నిధులు మంజూరయ్యాయి. విజయవాడ నుంచి రాజధాని ప్రాంతమైన అమరావతి (తుళ్లూరు), అక్కడి నుంచి గుంటూరుకు సర్క్యూట్ రైలు తరహాలో రాకపోకలు నిర్వహించడానికి వీలుగా రైల్వే లైను నిర్మించనున్నారు. మొత్తం 106 కిలోమీటర్ల నిర్మించే లైనుకు రూ.2,680 కోట్లు నిర్మాణ వ్యయంగా నిర్ణయించి కేటాయింపులు జరిపారు. ప్రాజెక్టు ఖరారు చేసి బడ్జెట్లో కేటాయింపులు జరగడంతో మరో రెండు నెలల కాలవ్యవధిలో టెండర్ల దశ దాటి పనులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. నడికుడి లైనుకు రూ.340 కోట్లు నిర్మాణ పనులు ప్రారంభమైన నడికుడి– శ్రీకాళహస్తి రైల్వేలైనుకు 2017–18 సంవత్సరానికి రూ.340 కోట్లు కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.2,330 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు గత రెండు బడ్జెట్లు కలిపి రూ.290 కోట్లు కేటాయించారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలో 42 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రైలు మార్గానికి సంబంధించి ఇద్దరు కాంట్రాక్టర్లకు రెండు వర్కులుగా విభజించి కేటాయించారు. అయితే స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి మామూళ్ళ వేధింపులతో ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ వ్యవహారం కేంద్ర రైల్వే శాఖ దృష్టికి వెళ్ళింది. గత నెల రోజులుగా పనులు నిలిచిపోయిన క్రమంలో బడ్జెట్లో కేటాయింపులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేటాయింపులు ఇవే... విజయవాడ – గుడివాడ లైనును మచిలీపట్నం పోర్టు వరకు పొడిగించాలని నిర్ణయించి దానికి రూ.130 కోట్లు కేటాయించారు. దీనివల్ల మచిలీపట్నం పోర్టు నుంచి సరకు రవాణా సులభం అవుతుంది. పది కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రైలు మార్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేస్తాయి. ► కాజీపేట–విజయవాడ మధ్య మూడో లైను ఇప్పటికే మూడొంతులు పూర్తయింది. దీనికి రూ.100 కోట్లు కేటాయించారు. అంతేగాక కాజీపేట–విజయవాడ మధ్య నాలుగో లైను ఏర్పాటుకు సర్వే చేయించేందుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ► విజయవాడ – భీమవరం – నిడదవోలు మధ్య 221 కిలోమీటర్ల డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్కు రూ.122 కోట్లు కేటాయించారు. ► విజయవాడ – గూడూరు మధ్య 287.67 కిలోమీటర్ల మేర మూడో ట్రాక్ నిర్మాణానికి సంబంధించి రూ.100 కోట్లు కేటాయింపు ► కొండపల్లి – కిరండోల్ మధ్య రైల్వే లైనుకు అనుమతి లభించింది. ► కోటిపల్లి– నర్సాపురం– మచిలీపట్నం మార్గానికి రూ.430 కోట్లు కేటాయించారు. ► గుంటూరు– తెనాలి రైల్వే లైన్ మధ్య 24.38 కిలోమీటర్లు డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులకు రూ.36 కోట్లు కేటాయింపు ► గుంటూరు – గుంతకల్లు మధ్య 463 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు రూ.124 కోట్ల కేటాయింపు ► రాయనపాడు రైల్వే కోచ్ మెయింటెనెన్స్ పనులకు రూ.8.7 కోట్లు కేటాయింపు ► గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో 72 రైల్వే స్టేషన్లలో సుమారు రూ.1.2 కోట్ల నిధులతో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు ► రూ.79 కోట్లతో జగ్గయ్యపేట, మేళ్ళచెరువు, జాన్ఫహాడ్ల మధ్య 24 కిలోమీటర్ల రైల్వే లైను నిర్మాణానికి అనుమతి -
అమరావతి రైలు మార్గానికి 2,680 కోట్లు
తాజా రైల్వే బడ్జెట్లో కేటాయింపు సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ నూతన రైల్వే మార్గం నిర్మాణానికి తాజా రైల్వే బడ్జెట్లో రూ.2,680 కోట్లు మంజూరయ్యాయి. ఆ మేరకు విజయవాడ–అమరావతి–గుంటూరులను కలుపుతూ 106 కిలోమీటర్ల మేరకు రైల్వే ట్రాక్ నిర్మించనున్నారు. 2016–17 బడ్జెట్లో ఈ రైల్వే లైన్కు సర్వే మంజూరవగా.. ఇటీవలే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) సర్వే పూర్తి చేసి రైల్వే బోర్డుకు నివేదిక అందించింది. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్లో ఈ మార్గానికి నిధులు కేటాయించడంతో నాలుగేళ్లలో రైల్వే లైన్ నిర్మాణం పూర్తి కానుంది. ఏపీ ప్రభుత్వం రైల్వేశాఖతో ఇటీవలే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వివిధ ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగాయి. ఆ మేరకు నడికుడి–శ్రీకాళహస్తి, కడప–బెంగళూరు, కోటిపల్లి–నర్సాపురం, అమరావతికి రైల్వే కనెక్టివిటీ... ఈ నాలుగు ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. -
పట్టాలు పడుతున్నాయి
రాష్ట్ర పరిధిలోని రైల్వే లైన్లకు భారీగా నిధులు • మొత్తంగా ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు • సీఎం కలల ప్రాజెక్టు కొత్తపల్లి– మనోహరాబాద్కి రూ.350 కోట్లు • బల్లార్షా–కాజీపేట–విజయవాడ మూడో లైన్కు రూ.260 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఈ సారి రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి తగినంత ప్రాధాన్యం లభించింది. పలు పెండింగ్ ప్రాజెక్టులు సహా కొత్త రైల్వే మార్గాలకు సైతం ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కలల ప్రాజెక్టు అయిన కొత్తపల్లి–మనోహరాబాద్ (కరీంనగర్–హైదరాబాద్) ప్రాజెక్టుకు రూ.350 కోట్లు ఇవ్వడం గమనార్హం. మొత్తంగా దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లను కేటాయించగా.. అందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు ఇచ్చారు. మొత్తంగా రైల్వే బడ్జెట్లో ఒక్క కొత్త రైలును ప్రకటించకున్నా.. కొత్త లైన్ల ఏర్పాటు, ఉన్న లైన్లకు అదనంగా రెండు, మూడు లైన్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించడం గమనార్హం. కొత్త పంథాలో.. దాదాపు తొమ్మిది దశాబ్దాల ఆనవాయితీని పక్కనపెడుతూ సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను కలిపేసిన కేంద్రం.. కేటాయింపుల్లోనూ కొత్త పంథా చూపింది. అయితే బడ్జెట్లో రైల్వేకు సంబంధించి ఏయే ప్రాజెక్టులకు ఎన్ని నిధులిచ్చారనే పూర్తి వివరాలను పేర్కొనలేదు. పింక్బుక్గా వ్యవహరించే ఈ పద్దుల వివరాలను శుక్రవారం పార్లమెంటుకు సమర్పించింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ యాదవ్ ఆ వివరాలను శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ఆయన వెల్లడించిన ప్రకారం.. దక్షిణ మధ్య రైల్వేకు ఈసారి మొత్తంగా రూ.5,135 కోట్లను కేటాయించారు. ఇందులో తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా కొత్త లైన్లు, రెండు, మూడో లైన్ నిర్మాణ పనులకు ఎక్కువ నిధులు ఇచ్చారు. బల్లార్షా–కాజీపేట–విజయవాడ మూడో లైన్ నిర్మాణానికి రూ.260 కోట్లు, మునీరాబాద్–మహబూబ్నగర్ లైన్కు రూ.300 కోట్లు, అక్కన్నపేట–మెదక్కు రూ.160 కోట్లు కేటాయించారు. దీంతో ఇంతకాలం నత్తనడకన జరుగుతున్న ఈ పనుల్లో వేగం పెరగబోతోంది. సీఎం కలల ప్రాజెక్టుకు రూ.350 కోట్లు తెలంగాణలో కీలకమైన కరీంనగర్, సిద్దిపేట పట్టణాలకు రాజధానితో రైల్వే అనుసంధానం లేదు. సిద్దిపేటకు అసలు రైల్వే మార్గమే లేదు. దీంతో సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా కరీంనగర్కు రైల్వే లైన్ నిర్మించాలంటూ కేసీఆర్ రెండు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల క్రితం కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు రైల్వే బడ్జెట్లో చోటు దక్కినా.. ముందుకు సాగలేదు. ఇటీవల సీఎం కేసీఆర్ గట్టిగా ప్రయత్నించడంతో కదలిక వచ్చింది. గతేడాది ప్రధాని మోదీ స్వయంగా ఈ రైల్వే లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. తాజా బడ్జెట్లో ఏకంగా రూ.350 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ శివార్లలోని మనోహరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త లైన్.. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లల మీదుగా కరీంనగర్ శివారులోని కొత్తపల్లి వరకు 148.9 కిలోమీటర్లు కొనసాగుతుంది. బల్లార్షా–కాజీపేట–విజయవాడ నాలుగో లైన్ అత్యంత రద్దీ మార్గంగా పేరున్న బల్లార్షా–కాజీపేట–విజయవాడ మార్గంలో ప్రస్తుతం మూడో లైన్ నిర్మాణం జరుగుతోంది. అది అందుబాటులోకి రావటానికి మరో రెండేళ్లు పట్టనుంది. అయితే ఆ మార్గంలో నాలుగో లైన్ కూడా అవసరమని భావించిన రైల్వే దానికి సర్వే పనులు చేపట్టనుంది. ఇక ఈ ఏడాదితో పూర్తికానున్న పెద్దపల్లి– కరీంనగర్–నిజామాబాద్ (178 కి.మీ.) లైనుకు రూ.25 కోట్లు కేటాయించారు. ఈ ఏడాదిలోనే ఈ మార్గంలో పూర్తి స్థాయిలో రైళ్లు పరుగెత్తనున్నాయి. టీకాస్కు మరిన్ని నిధులు రైళ్లు ఢీ కొనకుండా అభివృద్ధి చేస్తున్న ‘ట్రెయిన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టం (టీకాస్)’ను మరిన్ని చోట్లకు విస్తరించనున్నారు. దీనిని ఇప్పటికే సికింద్రాబాద్– వాడి–వికారాబాద్–బీదర్ సెక్షన్లలో వినియోగి స్తుండగా.. తాజాగా సికింద్రాబాద్– గద్వాల–డోన్– గుంతకల్ మార్గానికి విస్తరించారు. ఇందుకు రూ.120 కోట్లు కేటాయించారు. కొత్త మార్గం ఆర్మూర్–ఆదిలాబాద్ వయా నిర్మల్ (220 కి.మీ). అంచనా వ్యయం రూ.2,800 కోట్లు. (రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రాజెక్టు) రైళ్ల క్రాసింగ్స్ కోసం కొత్త స్టేషన్ల నిర్మాణం: (అంచనా రూ.15 కోట్లు) – వనపర్తి రోడ్డు–కౌకుంట్ల; మానవపాడు–అలంపూర్ రోడ్డు; ఇటిక్యాల–మానవపాడు కొత్త లైన్ల కోసం సర్వే ⇔ బొల్లారం–ముద్ఖేడ్ డబ్లింగ్ (235 కి.మీ) ⇔ కాజీపేట–బల్లార్షా నాలుగో లైన్(234 కి.మీ) ⇔ కాజీపేట–విజయవాడ నాలుగో లైన్ (219 కి.మీ.) ⇔ మంచిర్యాల–గడ్చిరోలి కొత్త లైన్ (115 కి.మీ.) భద్రతా పరమైన పనులు ⇔ 12 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ఆర్ఓబీలు), 7 రైల్వే అండర్ బ్రిడ్జిలు (ఆర్యూ బీ). అంచనా వ్యయం రూ.941 కోట్లు. రైల్వే వాటా రూ.383 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.558 కోట్లు ⇔ 9 కొత్త వంతెనలకు రూ.31 కోట్లు ⇔ లెవల్ క్రాసింగ్స్, ఇంటర్లాకింగ్ పనులకు రూ.69.5 కోట్లు -
ఇవీ దక్షిణ మధ్య రైల్వే కేటాయింపులు
-
ఇవీ దక్షిణ మధ్య రైల్వే కేటాయింపులు
న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లు ప్రకటించారు. శుక్రవారం సభకు సమర్పించిన అనంతరం పూర్తి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. గత బడ్జెట్లో తెలంగాణకు కేవలం రూ.601 కోట్లు మాత్రమే కేటాయించగా ఈసారి రూ.1,729 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు గత బడ్జెట్లో రూ.2,195 కోట్లు కేటాయించగా ఈసారి రూ.3,406 కోట్లు కేటాయించటం విశేషం. దక్షిణ మధ్య రైల్వేలో పలు ప్రాజెక్టులకు బడ్జెట్లో మంజూరైన నిధులు... -నడికుడి- శ్రీకాళహస్తి మధ్య రైల్వేలైన్కు రూ.340కోట్లు -కడప-బెంగళూరు మధ్య రైల్వేలైన్కు రూ.240కోట్లు -కాకినాడ-పిఠాపురం మధ్య రైల్వేలైన్కు రూ.150కోట్లు -గుంటూరు-గుంతకల్ మధ్య రైల్వే డబ్లింగ్ పనులకు రూ.124కోట్లు -కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్కు రూ.430 కోట్లు -ఓబులవారిపల్లె-కృష్ణపట్నం పోర్టు రైల్వేలైన్కు రూ.100 కోట్లు -గుంటూరు-తెనాలి రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు రూ.50కోట్లు -తిరుపతిలో విశ్రాంతి గది నిర్మాణానికి రూ.7 కోట్లు -గూడూరులో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి రూ.2.7 కోట్లు -విజయవాడ-గుడివాడ లైన్ మచిలీపట్నం పోర్టు వరకు పొడిగింపునకు రూ.130 కోట్లు -తిరుచానూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.6 కోట్లు -కాజీపేట- విజయవాడ మూడో లైన్కు రూ.100 కోట్లు -కాజీపేట-విజయవాడ మధ్య నాలుగో లైన్ సర్వేకు అనుమతి - కొండపల్లి-కిరండోల్ మధ్య రైల్వే లైన్ సర్వేకు అనుమతి - మంత్రాలయం-కర్నూలు మధ్య రైల్వేలైన్ సర్వేకు అనుమతి - హిందూపురం- చిత్రదుర్గం మధ్య రైల్వేలైన్ సర్వేకు అనుమతి -మంత్రాలయం-కర్నూలు మధ్య రైల్వే లైన్ సర్వేకు అనుమతి - ఏపీ, తెలంగాణలో 4 రైల్వే క్రాసింగ్లకు రూ.19 కోట్లు -మునిరాబాద్- మహబూబ్ నగర్ రైల్వే లైన్కు రూ. 300 కోట్లు -మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైన్కు రూ.350 కోట్లు -అక్కన్న పేట-మెదక్ రైల్వే లైన్కు రూ. 196 కోట్లు -భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్కు రూ. 300 కోట్లు -కరీంనగర్-పెద్దపల్లి రైల్వే లైన్కు రూ.120 కోట్లు -
బడ్జెట్లో రైల్వే హైలెట్స్..
-
బడ్జెట్ బాత్...
ఏం మాట్లాడుతున్నారు? పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన కష్టాలు తాత్కాలికమేనని, ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రభావం చూపలేదని అరుణ్ జైట్లీ అంటున్నారు. ఆయన ఏం చూసి ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. బడ్జెట్పై నేను వెంటనే స్పందించలేను. – మన్మోహన్సింగ్ దశ, దిశ లేదు.. ఈ బడ్జెట్ తీవ్ర నిరా శకలిగించేలా ఉంది. దశ, దిశ లేదు. రైతులకు మేలు కలిగించే చర్యలేవీ లేవు. యువత కు ఉద్యోగ కల్పన విషయంలో భరోసా ఎక్కడా కనిపించలేదు. జైట్లీ కవితలు చదివి సరిపెట్టారు. ఏమాత్రం ముందు చూపులేని బడ్జెట్ ఇది. – రాహుల్ గాంధీ అంతా డొల్ల బడ్జెట్ అంతా వట్టి డొల్ల. బడుగు బలహీనవర్గాలకు ఎలాంటి మేలు జరగదు. రైల్వే మంత్రి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనప్పుడు ఆయన ఆ పదవిలో ఎలా కొనసాగుతారు? పనికిమాలిన నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ, ట్రంప్ కవల పిల్లల్లా ఉన్నారు. – లాలూ ప్రసాద్ యాదవ్ నిరాశ కలిగించింది బడ్జెట్ నిరాశకలిగించింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎంతమొత్తంలో నల్లధనాన్ని రాబట్టారో వివరాలు ఇవ్వలేదు. నోట్ల రద్దును సమర్థించిన వారిని నిరాశకు గురిచేశారు. సాధారణ బడ్జెట్తో రైల్వే బడ్జెట్ను కలిపేసి కేంద్ర ప్రభుత్వం రైల్వేలను నాశనం చేసిందని అన్నారు. – నితీశ్ కుమార్ అంతా గిమ్మిక్కే బడ్జెట్ అంతా గిమ్మిక్కే. ఉద్యోగ, ఉపాధి కల్పనకు సంబంధించి నిర్ధిష్ట చర్యలు లేవు. పైగా ప్రభుత్వం ఆదా యం పెంచుకోవడానికి పరోక్ష పన్నులను పెంచడంతో ప్రజలపై భారం పెరుగుతుం ది. ప్రధాని బాటలో జైట్లీ పయనిస్తున్నారు. మాటల గారడీకే పరిమితమయ్యారు. – సీతారాం ఏచూరి పనికిమాలిన బడ్జెట్ దారీ, తెన్నూ లేని పనికిమాలిన బడ్జెట్ ఇది. దేశాభివృద్ధికి దోహదపడే చర్యలు లేవు. అంతా డొల్ల. మోదీ ప్రభుత్వం ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది. ప్రజలకు నోట్ల రద్దు కష్టాలు ఇంకా తీరలేదు. తక్షణం ఆంక్షలు అన్నీ ఎత్తివేయాలి. – మమతా బెనర్జీ మౌలికానికి 3.96 లక్షల కోట్లు న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల వృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేసినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రికార్డు స్థాయిలో మొత్తం రూ. 3,96,135 కోట్లు కేటాయించామని, కేంద్ర ప్రభుత్వానికి ఇది అత్యంత ప్రాధాన్యతా రంగమని చెప్పారు. రైల్వేలు, రోడ్లు, నదులు దేశానికి జీవనాడి వంటివని అన్నారు. మౌలిక సదుపాయాలకు 2016–17 బడ్జెట్ అంచనాలు రూ. 3,48,952 కోట్లు కాగా సవరించిన అంచనాలు రూ. 3,58,634 కోట్లు అని తెలిపారు. మౌలికసదుపాయాల రంగంలో భారీ కేటాయింపులతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరగనున్నాయని, దీనివల్ల మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రాంతీయ విమానం.. పైపైకి న్యూఢిల్లీ: ప్రాంతీయంగా విమానయాన అనుసంధాన పథకానికి సర్వీస్ ట్యాక్స్ మినహాయించారు. ఈ మినహాయింపు ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ప్రయాణికులకు సదుపాయంగా తీర్చిదిద్దడం, నష్టాలను తగ్గించడం వంటి లక్ష్యాలతో ప్రాంతీయ విమానాశ్రయాలను అనుసంధానిస్తూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతీయ విమానయాన అనుసంధాన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) ప్రోత్సాహం లభిస్తుంది. ఈ వీజీఎఫ్పై విధించే 14శాతం సర్వీస్ ట్యాక్స్ను మినహాయిస్తున్నట్లు 2017–18 బడ్జెట్లో ఆర్ధిక మంత్రి అరుణ్జైట్లీ ప్రకటించారు. స్వచ్ఛ ఇంధనానికి దన్ను న్యూఢిల్లీ: స్వచ్ఛ, పునర్వినియోగ ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు జైట్లీ తాజా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. సోలార్ పార్క్ డెవలప్మెంట్ రెండో దశ కింద 20వేల మెగావాట్ల సౌరవిద్యుత్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సౌర, పవన విద్యుత్ ప్లాంట్లలో వాడే పరికరాలపై పరోక్ష పన్నులను జైట్లీ భారీగా తగ్గించారు. సోలార్ సెల్స్ / ప్యానళ్లు / మ్యాడ్యూల్స్ తయారీకి వాడే సోలార్ టెంపర్డ్ గ్లాస్పై ప్రస్తుతం 5 శాతంగా ఉన్న మూల కస్టమ్స్ డ్యూటీ(బీసీడీ) పూర్తిగా రద్దు చేశారు. విద్యుత్ శాఖకు రూ. 13,881 కోట్లు, నూతన, పునర్వినియోగ మంత్రిత్వ శాఖకు రూ. 5,473 కోట్లు కేటాయించారు. -
ద.మ. రైల్వేకు 5,135 కోట్లు
తెలంగాణకు రూ.1,729 కోట్లు.. ఏపీకి రూ.3,406 కోట్లు సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేనివిధంగా బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు ఈసారి భారీ నిధులే దక్కాయి. బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లు ప్రకటించారు. విడిగా రైల్వే బడ్జెట్లు ప్రవేశపెట్టిన సమయాల్లో ఎప్పుడూ దక్షిణ మధ్య రైల్వేకు ఇంతమొత్తం కేటాయించిన దాఖలా లేదు. అయితే ఈ నిధులను ఏయే ప్రాజెక్టులకు ఎంతెంత కేటాయించారనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. పద్దులను ఇంకా సభకు సమర్పించనందున ఆ వివరాలను వెల్లడించలేదు. శుక్రవారం సభకు సమర్పించిన అనంతరం వాటిని బహిర్గతం చేయనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. కేటాయించిన మొత్తం నిధులను కొత్త ప్రాజెక్టులు, గత బడ్జెట్లలో ప్రకటించిన ప్రధాన లైన్ల నిర్మాణానికి కేటాయిస్తే మాత్రం ఈసారి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత బడ్జెట్లో తెలంగాణకు కేవలం రూ.601 కోట్లు మాత్రమే కేటాయించగా ఈసారి రూ.1,729 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు గత బడ్జెట్లో రూ.2,195 కోట్లు కేటాయించగా ఈసారి రూ.3,406 కోట్లు కేటాయించటం విశేషం. భద్రతకు ప్రాధాన్యం: జీఎం ప్రయాణికులకు పూర్తి భద్రతతో కూడి న రైల్వే సదుపాయం, సేవలు, నాణ్యమైన, మెరుగైన సదుపాయాలను కల్పించడమే లక్ష్యం గా కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారని దక్షిణ మధ్య రైల్వేజీఎం వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. రైల్వేల అభివృద్ధికి సముచితమైన నిధులను కేటాయించారని సంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో రైల్వే ప్రాధాన్యతలపై బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వేల అభివృద్ధి కోసం కేటాయిం చిన బడ్జెట్లో ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రైల్ సంరక్షణ ఫండ్ను ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొ న్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రస్తుతం 355 కాపలాలేని రైల్వే క్రాసింగ్లు ఉన్నాయని, దశలవారీగా 2020 నాటికి మొత్తం తొలగించ నున్నట్లు వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వేలో 4,138 కోచ్లకు ఇప్పటి వరకు బయో టాయిలెట్ సదుపాయం ఉందని, మరో 3 వేల కోచ్లకు ఆ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. -
ఇదీ రైల్వే బడ్జెట్
ఐఆర్సీటీసీతో చేసే టికెట్ బుకింగ్లపై నో సర్వీస్ చార్జి దివ్యాంగులకు ఉపయుక్తంగా ఉండేలా 500 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ 2020 నాటికి కాపలాలేని లెవెల్క్రాసింగ్ల తొలగింపు న్యూఢిల్లీ: 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి రైల్వే బడ్జెట్ ప్రణాళికను సాధారణ బడ్జెట్లో భాగంగా బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. గత సంవత్సరం కన్నా పదివేల కోట్ల రూపాయలు అధికంగా.. రూ. 1.31 లక్షల కోట్లతో రైల్వే బడ్జెట్ను జైట్లీ ప్రకటించారు. అందులో రూ. 55 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకు అందిస్తుంది. ఇటీవలి వరుస ప్రమాదాల నేపథ్యంలో ఏటా రూ. 20 వేల కోట్ల చొప్పున రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్లతో ప్రత్యేక జాతీయ రైలు భద్రత నిధి(నేషనల్ రైల్ సేఫ్టీ ఫండ్)ని ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ ప్రకటించారు. ట్రాక్స్తో పాటు సిగ్నలింగ్ వ్యవస్థల ఆధునీకరణ, కాపలా లేని లెవెల్ క్రాసింగ్ల సంపూర్ణ తొలగింపు.. తదితర అవసరాలకు ఆ నిధిని వినియోగించనున్నారు. అలాగే, 2017–18 సంవత్సరంలో 3500 కిమీల మేర రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. గత సంవత్సరం అది 2800 కిమీలుగా ఉంది. రైల్వేలో ఇకపై ప్రధానంగా ప్రయాణికుల భద్రత, అభివృద్ధి పనులు, స్వచ్ఛత, ఆర్థిక, అకౌంటింగ్ సంస్కరణలపై దృష్టి పెట్టనున్నామని జైట్లీ చెప్పారు. కాగా, బడ్జెట్లోని రైల్వేలకు సంబంధించిన ప్రతిపాదనలను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు స్వాగతించారు. ప్రతిపాదిత భద్రత నిధి ప్రమాదాలను తగ్గించడంతో పాటు రైళ్ల వేగాన్ని పెంచేందుకు ఉపకరిస్తుందన్నారు. రైల్వే బడ్జెట్ను విలీనం చేయడంపై స్పందిస్తూ.. ఇప్పుడు దాదాపు ప్రపంచమంతటా ఇదే విధానం అమలవుతోందన్నారు. రైలు, రోడ్డు, విమాన, జల మార్గాల అనుసంధానంతో నూతన విధానం దిశగా వెళ్తున్నామన్నారు. విలీనం వల్ల.. ఇకపై ఆర్థిక శాఖకు రైల్వే శాఖ డివిడెండ్లను చెల్లించాల్సిన అవసరం ఉండబోదని వెల్లడించారు. ఇతర ముఖ్యాంశాలు.. ► ఈ టికెటింగ్ను ప్రోత్సహించేందుకు ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకునే టికెట్లపై సర్వీస్ చార్జి మినహాయింపు. ఇప్పటివరకు స్లీపర్ కోచ్లకు రూ. 20, ఏసీ క్లాస్లకు రూ. 40 సర్వీస్ చార్జీగా ఉంది. తాజా మినహాయింపుతో ఐఆర్సీటీసీ ఏటా రూ. 500 కోట్ల వరకు నష్టపోనుంది. ► స్టాక్ ఎక్సేంజ్ల్లో రైల్వేలకు చెందిన సంస్థలైన ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్), ఐఆర్ఎఫ్సీ(ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్), ఇర్కాన్ల నమోదు. ► ఉపాధి అవకాశాలను మరింత పెంచేలా త్వరలో నూతన మెట్రో రైలు విధానం. మెట్రో రైలు వ్యవస్థలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రస్తుత చట్టాలను మార్చి కొత్త చట్టం రూపకల్పన. ► 500 రైల్వే స్టేషన్లలో దివ్యాంగుల కోసం లిఫ్ట్లు, ఎస్కలేటర్లు.. తదితర సౌకర్యాల ఏర్పాటు. ► రైలు సేవలకు సంబంధించిన అన్ని ఫిర్యాదులు, సేవల కొరకు త్వరలో ‘క్లీన్ మిత్ర’ సింగిల్విండో. ► పర్యాటక, ఆధ్యాత్మిక పర్యటనల కోసం ప్రత్యేక రైళ్ల ఏర్పాటు. ► న్యూఢిల్లీ, జైపూర్ రైల్వేస్టేషన్లలో బయోడీగ్రేడబుల్ వ్యర్థాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటు. ► ఎంపిక చేసిన సరుకులకు సంబంధించి పూర్తిస్థాయి రవాణాకు సమగ్ర వ్యవస్థ ఏర్పాటు. 2019 నాటికి అన్ని బోగీల్లో బయో టాయిలెట్ల ఏర్పాటు. ‘క్లీన్ మై కోచ్’ యాప్ ద్వారా స్వచ్ఛతకు సంబంధించిన సేవలు పొందే అవకాశం 2020 నాటికి బ్రాడ్గేజ్ నెట్వర్క్లోని అన్ని కాపలా లేని లెవెల్ క్రాసింగ్ల తొలగింపు -
అప్పుడు విడిపోయింది.. ఇప్పుడు కలిసింది
రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ రెండు కలిసిపోయాయి. 92 ఏళ్ల వేరుకుంపటికి స్వస్తి పలికాయి. ఒకేరోజు కలిసి వస్తామంటూ పార్లమెంట్ ముందుకు వచ్చేశాయి. అయితే రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ ఎప్పుడు విడిపోయాయో తెలుసా? సరిగ్గా తొంభై రెండేళ్ల క్రితం బ్రిటీష్ వారు భారత్ను పరిపాలించే సమయంలో 1924లో ఈ రెండు వేరు కుంపటి పెట్టాయి. ఆ సమయంలో రైల్వే దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంపద. బడ్జెట్లో వీటికి 75 నుంచి 85 శాతం కేటాయింపులుండేవి. జనరల్ బడ్జెట్లోరైల్వేలు ఎక్కువ స్థానాన్ని ఆక్రమించుకుంటుండంతో, దీన్ని వేరుగా తీసుకురావాలని బ్రిటీష్ అధికారులు ప్రతిపాదించారు. 10 మంది సభ్యులు అక్వర్త్ కమిటీ 192-21లో ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. అనంతరం 1924లో దీన్ని సాధారణ బడ్జెట్ నుంచి విడదీశారు. దీని ద్వారా మంచి విధాన రూపకల్పన, అమలు చేయొచ్చని భావించారు. అప్పటినుంచి రెండు బడ్జెట్లు విడివిడిగా పార్లమెంట్ ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం సాధారణ బడ్జెట్లో రైల్వేలు కలిగి ఉంది కేవలం 4 శాతం మాత్రమే. దీంతో పాటు రైల్వే తీవ్ర నష్టాలను భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైల్వేను సాధారణ బడ్జెట్ లో కలుపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రెండు బడ్జెట్ లను కలిపి పార్లమెంట్లోకి తీసుకొచ్చింది. 70 ఏళ్ల క్రితం అంటే 1994 మార్చి 24న రైల్వే బడ్జెట్ను తొలిసారి లైవ్ టెలికాస్ట్ చేయడం ప్రారంభించారు. 1947 ఆగస్టు 15న భారత్ స్వాతంత్య్రం సాధించిన అనంతరం తొలి రైల్వే మంత్రి జాన్ మతాయి. మొదటి మహిళా రైల్వే మంత్రిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పనిచేశారు. -
నేడే కేంద్ర బడ్జెట్
-
ఎదురు దెబ్బలు తగిలినా భవిష్యత్తు ఆశాజనకమే !
-
నేడే కేంద్ర బడ్జెట్
న్యూఢిల్లీ: నోట్ల రద్దు, జీఎస్టీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఉదయం సాధారణ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్ను కూడా సాధారణ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెడ్తున్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా పలు నిర్ణయాలను ఆర్థికమంత్రి ఈ బడ్జెట్లో ప్రకటించనున్నారని, పన్ను శ్లాబుల్లోనూ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కీలకమైన యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండటంతో..ఆయా ఓటర్లను ఆకట్టుకునేలా బడ్జెట్లో పలు ప్రతిపాదనలుండొచ్చు. అయితే, ఎన్నికలను ప్రభావితం చేసేలా ఎలాంటి ప్రకటనలు ఉండొద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో.. జైట్లీ తాజా పద్దు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. -
భద్రత, వేగానికి పెద్దపీట!
రైల్వే బడ్జెట్లో ప్రత్యేకంగా రూ.20 వేల కోట్లు! న్యూఢిల్లీ: తొంభై రెండేళ్ల సుదీర్ఘ సంప్రదాయానికి విరుద్ధంగా తొలిసారిగా సాధారణ బడ్జెట్తో ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్లో భద్రత, వేగం, మౌలిక సదుపా యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాటు రైళ్ల వేగాన్ని 200 కి.మీ. వరకు పెంచే చర్యలు చేపట్టనున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఈ చారిత్రక బడ్జెట్ను బుధవారం సమర్పించనున్నారు. తరచూ రైళ్లు పట్టాలు తప్పుతున్న నేపథ్యంలో కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, కొన్ని స్టేషన్ల ఆధునీ కరణ చేయనున్నారు. దీనికి రానున్న ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రైల్వే భద్రత నిధిని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నిధిలో 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.20 వేల కోట్లు కేటాయించవచ్చు. రైళ్ల భద్రతా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు రూ.1.19 లక్షల కోట్ల ప్రత్యేక నిధి కేటా యించాలన్న రైల్వేమంత్రి సురేశ్ప్రభు అభ్యర్థన మేరకు జైట్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రైళ్ల పర్యవేక్షణకు రైలు అభివృద్ధి సంస్థను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు హైస్పీడ్ రైల్ అథారిటీనీ ఏర్పాటు చేయవచ్చు. అలాగే టిక్కెటేతర ఆదాయాన్ని పెంచుకొనేందుకు కసరత్తు జరుగుతోంది. -
ఈసారైనా..
జిల్లా వాసుల ఆశలు పట్టాలెక్కేనా.. కాజీపేట రూరల్ : ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రాంతాలకు గేట్వేగా ఉన్న కాజీపేట జంక్షన్కు ఈ సారి రైల్వే బడ్జెట్లో న్యాయం జరగాలని ఈ ప్రాంత ప్రజలు, రైల్వే కార్మికులు ఆశిస్తున్నారు. కాజీపేట జంక్షన్లో మూడు ఫ్లాట్ఫాంలు మాత్రమే ఉన్నాయి. అదనంగా మరో మూడు ప్లాట్ఫాంలు కావాలనే డిమాండ్ ఉంది. ఈ బడ్జెట్లో అదనపు ప్లాట్ఫాంలు మంజూరైతే రైళ్ల సంఖ్య ఇక్కడి నుంచి పెరగడమే కాకుండా వచ్చిన రైళ్లకు ట్రాఫిక్ అంతరాయం ఉండదు. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లే పద్మావతి ఎక్స్ప్రెస్ వారానికి రెండు రోజులు ఉండదు. జిల్లా నుంచి తిరుమలకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా పద్మావతి ఎక్స్ప్రెస్ను వారం రోజుల పాటు పొడిగించితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ఎస్కలేటర్ ఎప్పుడో.. ఈ జంక్షన్ నుంచి ప్రతి రోజు సుమారు 15 వేల మంది ప్రయాణికులు వివిధ రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. కాజీపేటలో చంటి పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు పుట్ఓవర్ బ్రిడ్జి మీదుగానే వెళ్లాలి. ఇక్కడ ఎస్కలేటర్ నిర్మాణం జరిగితే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా డీజిల్ లోకోషెడ్, ఎలక్ట్రిక్ లోకోషెడ్ల సామర్థ్యం నిర్వాహణ మరింత పెరిగేందుకు బడ్జెట్లో నిధులు మంజూరు కావాలని కార్మికులు కోరుతున్నారు. అప్రెంటీస్ ట్రైనింగ్ సెంటర్ అయ్యేనా.. కాజీపేటలో ఆక్ట్ అప్రంటీస్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని గత పదేళ్ల నుంచి డిమాండ్ ఉంది. కాజీపేటలో ఎక్కువ శాతం రైల్వే కార్మికుల పిల్లలు ఐటీఐ చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు. ఇక్కడ అప్రంటీస్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కాజీపేట–బెల్లంపల్లికి పుష్పుల్ వచ్చేనా.. కాజీపేట నుంచి బెల్లంపల్లి వరకు పుష్పుల్ ప్యాసింజర్ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు పాట్నా ఎక్స్ప్రెస్ తర్వాత సాయంత్రం 5.30 గంటలకు భాగ్యనగర్ వరకు ఒక్క రైలు లేదు. ఈ మధ్యకాలంలో పుష్పుల్ వేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్కు చోటు దొరికేనా.. కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ను 2006లో నిర్మించారు. అప్పటి నుంచి ఈ స్టేషన్ నుంచి ఒక్కటే ప్యాసింజర్ రాకపోకలు చేస్తుంది. ఈ టౌన్ స్టేషన్ మీదుగా న్యూఢిల్లీ–విజయవాడ, హైదరాబాద్ మార్గంలో వందల రైళ్లు రాకపపోకలు సాగిస్తాయి. ఇక్కడ కొన్ని రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని, స్టేషన్ను కూడా అభివృద్ధి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. పలు రైళ్లకు హాల్టింగ్ లభించేనా.. కాజీపేటలో ఆగకుండా వెళ్తున్న సికింద్రాబాద్–కాకినాడ ఏసీ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–విశాఖ వెళ్లే దురంతో, సికింద్రాబాద్–విశాఖపట్నం వెళ్లే గరీభ్రథ్, సికింద్రాబాద్–గౌహతి వెళ్లే గౌహతి, సికింద్రాబాద్–నిజాముద్దీన్ వెళ్లే దురంతో ఎక్స్ప్రెస్ రైళ్లకు కాజీపేటలో హాల్టింగ్ కల్పించాలని ఈ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు. -
రైల్వే బడ్జెట్ విలీనానికి రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను విలీనం చేయడానికి సంబంధించి మార్చిన నిబంధనలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. రైల్వే శాఖకు కేటాయింపులు సహా, కేంద్ర బడ్జెట్ తయారీని ఆర్థిక వ్యవహారాల విభాగానికి అప్పగించినట్లు మంత్రివర్గ కార్యదర్శి తాజాగా ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొన్నారు. భారత ప్రభుత్వ (వాణిజ్య కేటాయింపులు) నిబంధనలు–1961 చట్టంలో ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసేందుకు గతేడాది సెప్టెంబరులో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. -
31 నుంచే బడ్జెట్ సమావేశాలు
ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టాలని సీసీపీఏ సిఫారసు సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31 నుంచే ప్రారంభించాలని, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సిఫారసు చేసింది. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సీసీపీఏ సమావేశం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. దీన్ని త్వరలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపనున్నారు. ఈ సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే రైల్వేకు కేటాయింపులతో సహా సాధారణ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెడతారు. దాదాపు 92 ఏళ్లుగా రైల్వే బడ్జెట్ను విడిగా ప్రవేశపెడుతున్న సంప్రదాయానికి ఈ బడ్జెట్తో మంగళం పలకనున్నారు. జనవరి 31న పార్లమెంటు సమావేశాల ప్రారంభంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. బడ్జెట్ తొలి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ పథకాలకు త్వరితగతిన కేటాయింపులు చేసేందుకు వీలుగా దాదాపు నాలుగు వారాలు ముందుగానే బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. -
రైల్వే బడ్జెట్ విలీనానికి ఓకే
-
రైల్వే బడ్జెట్ విలీనానికి ఓకే
ఫిబ్రవరి 1నే సాధారణ బడ్జెట్ - యూపీ ఎన్నికల తేదీల ఆధారంగా 2017-18 ఏడాది బడ్జెట్ తేదీ ప్రకటన - వివేక్ దేవ్రాయ్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం - ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం విధానానికీ చెల్లుచీటి న్యూఢిల్లీ: దాదాపు శతాబ్దకాలంగా(92 ఏళ్లుగా) అమల్లో ఉన్న విధానానికి తెరదించుతూ.. వేరుగా ఉండే రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్తో కలిపి ప్రవేశపెట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం.. కేంద్ర బడ్జెట్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు.. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల విధానానికి స్వస్తి చెప్పాలని దీని ద్వారా బడ్జెట్ను మరింత సరళతరం చేయాలని నిర్ణయించింది. కేబినెట్ భేటీ వివరాలను మీడియాకు వెల్లడించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఫిబ్రవరి నెల చివరి రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలనే విధానాన్ని పక్కన పెట్టి.. ఈ తేదీని ఫిబ్రవరి 1కి మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఏ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారనే అంశాన్ని వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా వెల్లడిస్తామన్నారు. ఒకే బడ్జెట్ వల్ల దేశ ఆర్థిక స్థితిని సమగ్రంగా ఆవిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడైన వివేక్ దేవ్రాయ్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విలీనంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విలీనం ద్వారా రైల్వేల గుర్తింపు పోకుండా వ్యవహరిస్తామన్నారు. రైల్వేలకు లాభమే: సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ విలీనం వల్ల రైల్వే శాఖకు ఎలాంటి నష్టమూ రాదని ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. అంతే కాకుండా రైల్వేల మూలధన వ్యయం పెంచుకోవచ్చన్నారు. ఆర్థిక, రైల్వే శాఖల మధ్య మరింత సమన్వయం ఏర్పడుతుందన్నారు. రైల్వేలు ప్రభుత్వానికి డివిడెండు చెల్లించనక్కర్లేదన్నారు.అయితే ప్రస్తుతానికి 7వ వేతన కమిషన్ అమలు చేసేందుకు రైల్వేలపై రూ. 40వేల కోట్లు, ప్రయాణికులకు సబ్సిడీల రూపంలో మరో రూ. 35వేల కోట్ల భారాన్ని రైల్వే శాఖ మోయాల్సిందే. ‘నమామి గంగే’ వేగవంతం: ‘నమామి గంగే’ అమలుకోసం కార్యాచరణను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జాతీయ గంగానది బేసిన్ అథారిటీ స్థానంలో గంగానది జాతీయ కౌన్సిల్ ఏర్పాటు చేయనుంది.కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి ఈ టాస్క్ఫోర్స్కు అధ్యక్షురాలిగా ఉంటారు. గంగానది నీటిని కలుషితం చేసేవారిపై చట్టపరంగా శిక్ష తీసుకునేలా.. స్వచ్ఛ గంగా జాతీయ మిషన్కు అథారిటీ హోదా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు.. ► స్వాతంత్య్ర సమరయోధులకిచ్చే పింఛనును కేంద్రం గణనీయంగా పెంచింది. అండమాన్తోపాటు భారత్ వెలుపల జైళ్లలో శిక్ష అనుభవించినవారి బంధువుల(భార్య, పిల్లలు) పింఛన్ను రూ. 5వేలు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సమరయోధుల పింఛను (అన్నిరకాల), పొందుతున్న వారికి అదనంగా 20 % పెంపును కల్పించనున్నట్లు తెలిపింది. ఈ పెంపు(డియర్నెస్ రిలీఫ్) 2016 ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. ► పప్పుధాన్యాలు, నూనెలు, నూనె గింజల నిల్వ విషయంలో వ్యాపారులు, దళారులపై విధించిన నిల్వ పరిమితిని మరో ఏడాది కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నెలాఖరుతో ఈ పరిమితి గడువు ముగియనుంది. ► నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన అడిమిరల్టీ(షిప్పింగ్ వివాదాల్లో న్యాయ పరిధి, ఒప్పందం, తీరప్రాంత సమస్యలు) బిల్లు, 2016ను కూడా ఆమోదించింది. ► అండమాన్ నికోబార్ దీవుల్లో టెలికం సేవలను విస్తరించేందుకు రూ. 1,102.38 కోట్లతో చెన్నై నుంచి అండమాన్కు కేబుల్ లింక్ ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2018 కల్లా ఈ ప్రాజెక్టు పూర్తికావాలని ఆదేశించింది. సపర్యాటక రంగ పురోగతి కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుర్తించిన 26 దీవులను (తొలివిడతగా)వేగంగా అభివృద్ధి చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా, బడ్జెట్ల విలీనం వల్ల రైల్వేల స్వయం ప్రతిపత్తికి భంగం కలుగుతున్నందని, ఇది సరైన నిర్ణయం కాదని మాజీ రైల్వే మంత్రి, బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. -
ఇక రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండదు!
న్యూఢిల్లీ: 92 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ సంప్రదాయానికి ఇక తెరపడనుంది. వచ్చే ఏడాది నుంచి రైల్వే బడ్జెట్ కేంద్ర సార్వత్రిక బడ్జెట్లో విలీనం కానుంది. ఈ మేరకు రైల్వేమంత్రి సురేశ్ ప్రభు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆమోదం తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రైల్వే బడ్జెట్ విలీనంపై విధివిధానాలు ఖరారుచేసేందుకు ఆర్థికమంత్రిత్వశాఖ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో ఆర్థికశాఖ, రైల్వే శాఖ సీనియర్ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ నెల 31నాటికి నివేదిక సమర్పించాల్సిందిగా కమిటీని ఆర్థికశాఖ ఆదేశించింది. 'కేంద్ర బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను విలీనం చేయాల్సిందిగా ఆర్థికమంత్రి జైట్లీకి లేఖ రాశాను. రైల్వే ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. విలీనం విధివిధానాలపై మేం కసరత్తు చేస్తున్నాం' అని ప్రభు పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. -
సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్!!
-
కేంద్ర, రాష్ట్రాల్లో ఇక మోదీ మార్కు బడ్జెట్లు
- బడ్జెట్ స్వరూపంలో సమూల మార్పులు - రైల్వే బడ్జెట్కు మంగళం.. ఇక సాధారణ బడ్జెట్లోనే.. సాక్షి, హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్రాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లలో ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్కు కనిపించనుంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న వార్షిక బడ్జెట్ రూపకల్పన విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై నీతి ఆయోగ్ కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్ స్వరూపంలో పాతకాలం విధానాలకు స్వస్తి పలకాలని నిర్ణయిం చింది. బడ్జెట్ ఏడాదిలో కూడా మార్పులు చేయాలని యోచిస్తోంది. 27వ తేదీన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఈ అంశాలను అన్ని రాష్ట్రాలకు వివరించింది. ప్రస్తుతం ఏప్రిల్ నుంచి మార్చి నెలాఖరు వరకు బడ్జెట్ సంవత్సరం కొనసాగుతోంది. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో బడ్జెట్ సంవత్సరాన్ని జూన్ నుంచి మే వరకు చేయాలా? లేదా జనవరి నుంచి డిసెంబర్ వరకు చేయాలా? అనేదానిపై నీతి ఆయోగ్ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులుండవు! ప్రస్తుతం బడ్జెట్లో కొనసాగుతున్న ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులకు స్వస్తి పలకాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. ఈ పద్దుల కింద కేటాయింపులు, వ్యయాలు వాస్తవానికి భిన్నంగా ఉన్నాయని కేంద్రం భావించింది. ప్రణాళిక పద్దు కింద కేటాయింపులు, వ్యయాలను ఆస్తుల కల్పనకు, ప్రణాళికేతర పద్దు కింద కేటాయింపులు, వ్యయాలను నిర్వహణ, జీతభత్యాలకని పేర్కొంటున్నారు. వాస్తవానికి ప్రణాళిక పద్దు కింద కూడా నిర్వహణ, జీతభత్యాలు ఉంటున్నాయని, ఇది శాస్త్రీయంగా లేదని నీతి ఆయోగ్ తేల్చింది. ఈ నేపథ్యంలో కేపిటల్, రెవెన్యూ వ్యయం పద్దుల కింద మార్చాలా లేక అభివృద్ధి, అభివృద్ధియేతర పద్దుల కింద మార్చాలా అనేదానిపై నీతి ఆయోగ్ కసరత్తు చేస్తోంది. ఏదిఏమైనా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులనేవి ఉండవని రాష్ట్రాలకు తేల్చి చెప్పింది. ఈ పద్దులను మారిస్తే కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్లలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. పీపీపీ తరహా విమానాశ్రయాలు.. దశాబ్దాలుగా సంప్రదాయంగా వస్తున్న రైల్వే బడ్జెట్కు కూడా మంగళం పలకాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్ర సాధారణ బడ్జెట్ కంటే ముందుగానే రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో భాగంగానే ప్రవేశపెట్టడంపై నీతి ఆయోగ్ కసరత్తు చేస్తోంది. దేశంలో విమాన సేవలను మరింతగా విస్తరిం చడంలో భాగంగా రాష్ట్రాల్లోని రీజియన్స్లో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో విమానాశ్రయాలను నిర్మించడంతోపాటు విమానాలను నడిపేందుకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఈ అంశం ఉండనున్నట్లు కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. 150 కిలోమీటర్ల దూరం గల రీజియన్స్కు విమాన టికెట్ రూ.2,000 నుంచి రూ.2,500 ఉండేలా చర్యలు తీసుకుంటారు. వయబులిటీ గ్యాప్లో 80 శాతం కేంద్రం, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. -
ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక సంస్థ
రైల్వే మంత్రి సురేశ్ప్రభు వెల్లడి నెల్లూరు(సెంట్రల్)/ముత్తుకూరు/తిరుపతి అర్బన్: ఆంధ్రప్రదేశ్లో రైల్వే పరంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. నెల్లూరు దక్షిణ రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, గూడూరు స్టేషన్లో కొత్త ప్లాట్ ఫామ్ నిర్మాణాలకు శంకుస్థాపన, తిరుపతి స్టేషన్లో వైఫై సదుపాయాన్ని మరో కేంద్రమంత్రి వెంకయ్యతో కలిసి రిమోట్ ద్వారా ఆదివారం సురేష్ ప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో డిజిటల్ విప్లవం వస్తోందని, అందుకనుగుణంగానే రైల్వేలను కూడా సాంకేతికంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విజన్ 2030తో దేశంలోని తీర ప్రాంతాలను కలుపుతూ రైలు మార్గాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.భవిష్యత్తులో వేగంగా, చౌకగా సరుకులను రవాణా చేసేందుకు లెవల్ టు గూడ్స్ రైళ్లను ప్రవేశపెడుతున్నామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. కృష్ణపట్నం పోర్టులో ఆదివారం పోర్టు ‘సైడ్ కంటైనర్ ఫెసిలిటీ’ విభాగాన్ని, గోల్ఫ్ కోర్సును ఆయన ప్రారంభించారు. పాత ప్రాజెక్టుల పూర్తికే ప్రాధాన్యం.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రైల్వే బడ్జెట్లో కొత్త హామీలివ్వకుండా పాత ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యమివ్వాలని ప్రభును మోదీ కోరారన్నారు. తమిళనాడులో గ్రీన్ రైల్ కారిడార్! చెన్నై: దేశంలోనే తొలిసారిగా తమిళనాడులో రామేశ్వరం-మనామదురై మధ్య 114 కిలోమీటర్ల గ్రీన్ రైల్ కారిడార్ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆదివారం ప్రారంభించారు. ఇందులోభాగంగా మార్గంలోని రైల్వే ట్రాక్లపై మల, మూత్ర వ్యర్థాలు పడకుండా రైళ్లలో బయో టాయ్లెట్స్ ఏర్పాటుచేశారు. -
రైల్వే బడ్జెట్ కు చరమగీతం?
న్యూఢిల్లీ : 92 ఏళ్ల క్రితం నాటి నుంచి ఆనవాయితీగా కొనసాగుతూ వస్తున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ కు ఎన్డీయే ప్రభుత్వం చరమగీతం పాడనుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేయాలని కోరుతూ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. 92 ఏళ్ల నాటి నుంచి వస్తున్న ప్రత్యేక బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలపడాన్ని సురేష్ ప్రభు ప్రతిపాదించారని సీనియర్ రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు. జూన్ లోనే ఆర్థిక మంత్రికి ఈ లేఖను పంపించారని, ఇంకా అరుణ్ జైట్లీ నుంచి ఎలాంటి సమాధాన రాలేదని అధికారులు పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డేబ్రోయ్ ఈ విలీనాన్ని మొదట ప్రతిపాదించిన అనంతరం, రైల్వేశాఖ సమాధానం కోరుతూ గత నెల ప్రధానమంత్రి కార్యాలయం ఈ లేఖను పంపింది. ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తూ.. ఆర్థికమంత్రికి ఈ లేఖను రైల్వే శాఖ పంపించింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో 2017-18 రైల్వే బడ్జెట్ లేదా 2016-17 బడ్జెట్, రైల్వేకు తుది బడ్జెట్ కానుందని అధికారులు చెప్పారు. ఈ విలీన ప్రతిపాదనతో, మొత్తం ఆర్థిక భారం ఇక నుంచి ఆర్థిక మంత్రి చేతులోకి వెళ్లనుంది. అయితే ఈ విలీనానికి సంబంధించి గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్యాసెంజర్ సెగ్మెంట్ లో రైల్వే రూ. 34,000కోట్ల నష్టాలను భరిస్తుంది. రాబడులు సైతం పతనమవుతున్నాయి. -
విశాఖ రైల్వే జోన్ను ఏం చేశారు?
రైల్వే మంత్రికి మేకపాటి ప్రశ్న సాక్షి, న్యూఢిల్లీ: చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాల్సిన విశాఖ రైల్వే జోన్ను ఏంచేశారని, ప్రస్తుతం దాని స్థితి ఏంటని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్రెడ్డి రైల్వే మంత్రి సురేష్ ప్రభును ప్రశ్నించారు. బుధవారం లోక్సభలో రైల్వే బడ్జెట్పై జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇచ్చిన అనంతరం వివిధ పార్టీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వగా ముందుగా నలుగురైదుగురు సభ్యులు మాట్లాడారు. అప్పటికే ఆలస్యం కావడంతో స్పీకర్ ఇక ఇంతటితో ముగిద్దామని ప్రకటించారు. ఈ సమయంలో నెలకొన్న గందరగోళంలోనే మేకపాటి రైల్వే మంత్రిని ప్రశ్నించారు. -
అది సామాన్యుల బడ్జెట్
రైల్వే బడ్జెట్పై మంత్రి సురేశ్ప్రభు ♦ రైల్వే వృద్ధి కోసం మూడంచెల వ్యూహం న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్తో సామాన్యులకు ఒరిగిందేమీ లేదన్న విపక్షాల ఆరోపణలను రైల్వేమంత్రి సురేశ్ ప్రభు తిప్పికొట్టారు. బడ్జెట్ సామాన్యుల కోసమే రూపొందించిందన్నారు. రైల్వే అభివృద్ధి కోసం సేవల మెరుగు, ఆదాయ సమీకరణ, వ్యయ నియంత్రణ అనే మూడంచెల వ్యూహాన్ని అమలుచేస్తామన్నారు. రైల్వేస్టేషన్లలో స్టాళ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిస్తామన్నారు. బుధవారం లోక్సభలో రైల్వేబడ్జెట్పై చర్చలో ఆయన మాట్లాడారు. రైల్వేలో రిక్రూట్మెంట్కు ఆన్లైన్ పరీక్ష పద్ధతి తెచ్చామన్నారు. ప్రయాణ, రవాణా చార్జీల నుంచి మరింత ఆదాయాన్ని రాబట్టేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ప్రయాణికుల చార్జీలు, సరుకు రవాణా చార్జీల సవరణల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఎప్పుడు ధరలు పెంచినా ధరల కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉంటాయని, అందువల్ల దీన్ని నివారించేందుకు కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైల్వే రెగ్యులేటరీ అథారిటీ పేరును ‘రైల్వే డెవలప్మెంట్ అథారిటీ’గా మార్చాలనుకుంటున్నామని తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రతిపాదించిన బుల్లెట్ రైలు ప్రాజెక్టును సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో చేపడతామన్నారు. దీనికయ్యే మొత్తాన్ని 0.1 శాతం నామమాత్ర వడ్డీతో రుణమిచ్చేందుకు జపాన్ అంగీకరించిందన్నారు. జాట్ ఆందోళనల వల్ల రైల్వేకి రూ.55.92 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. చర్చ తర్వాత రైల్వే బడ్జెట్ సంబంధ ద్రవ్యవినియోగ బిల్లులను, గ్రాంట్స్ డిమాండ్లను సభ ఆమోదించింది. జాతీయ జలరవాణా బిల్లుకు ఆమోదం 111 నదీమార్గాల్లో జలరవాణాను పెంచేందుకు ఉద్దేశించిన జాతీయ జలరవాణా బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. . బిల్లుకు లోక్సభ గత ఏడాదే ఆమోదం తెలిపింది. -
కొత్త పట్టాలెక్కిన రైలు బండి
అభిప్రాయం రాజకీయవేత్తలు.. భారత రైల్వేలనే అద్భుత సంస్థను ఓటర్లకు, నియోజకవర్గాలకు చిల్లర మల్లర ప్రయోజనాలను కలుగచేసేదిగా మార్చినప్పుడే అది కుప్పకూలడం మొదలైంది. ఏదేమైనా ఎట్టకేలకు మన రైల్వేలు సరైన దిశలో వేగంగా ముందుకు కదులుతున్నాయి. మన ప్రభుత్వాలు దుర్వార్తల విషయంలో సంస్థాగతమైన వైఖరిని చేబడుతుంటాయి. తగి నంత దీర్ఘకాలం పాటూ విస్మరిస్తే సమస్య దానికదే పరిష్కారమై పోతుందనేది మొదటి ఆశ. అది, తన తర్వాత వచ్చే మరో మంత్రి సమస్యగా మారేంత వరకు దాని పరిష్కారాన్ని వాయిదా వేస్తూ పోవడం రెండవది. బ్రిటిష్ పాలకుల నుంచి మనకు మహత్తర వారసత్వంగా సంక్రమించిన భారత రైల్వేలను వరుసగా మన ప్రభుత్వాలన్నీ క్షీణ దశకు చేర్చడానికి చెప్పదగిన వివరణ నిస్సందేహంగా ఇదొక్కటే. బ్రిటిష్ పాలకులు తమ వ్యూహాత్మక, వాణిజ్య అవసరాల కోసమే రైల్వేలను నిర్మించారనడం పూర్తిగా నిజం. అయితే ఆ క్రమంలో వారు దేశవ్యాప్తమైన మౌలిక సదుపాయాలను, నిర్వహణా వ్యవస్థను నెలకొల్పారు. అదే స్వతంత్ర భారత దేశపు జీవ వాహినిగా, ప్రజలకు సేవచేసే అద్భుత రవాణా వ్యవస్థగా మారింది. ఆర్థిక వ్యవస్థను పెంపొందింపజేస్తూ, ఐక్యతకు నిజమైన ఆర్థాన్నిచ్చే అనుసంధానాలను ఏర్పరుస్తోంది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజాభీష్టానుసారం సాగేది. మన స్వతంత్ర దేశంలో పౌరులు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి భారత రైల్వేలు వెళ్తాయి. వైమానిక సేవలు ఒక పౌర విమాన సంస్థ కట్టడిలోంచి విముక్తి చెందడానికి ముందటి ఐదు దశాబ్దాలలో రైల్వేలు... భిన్న భాషలు, సంస్కృతులతో కూడిన దేశంలోని నలుమూలల ప్రజలు ఒకరినొకరు తెలుసుకోడానికి, పరిచయాలు చేసుకోవడానికి సాధనమయ్యాయి. అవి ఆర్థిక వ్యవస్థ నాడీ స్పందన కూడా అయ్యాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో క్రమానుగతంగా ఆకలితో అల్లాడే పరిస్థితులు తలెత్తున్నప్పుడు రైల్వేలే ఆ ప్రదేశాలకు ఆహారాన్ని రవాణా చేశాయి. దేశ ఐక్యతకు ఏ ప్రభుత్వం కన్నా మిన్నగా కృషి చేసినది బాలీవుడ్ సినిమాయేనని అప్పుడప్పుడూ అంటుండటం కేవలం పరిహాసోక్తే కాదు. ప్రజా ప్రచార సాధనాల శక్తిని తక్కువగా అంచనా వేయలేం. అయినాగానీ, 1950లు, 1960లలో పొగలు చిమ్ముకుంటూ, ఆవిర్లు వదులుకుంటూ పరుగులు దీసిన రైళ్లూ, ఆ తర్వాతి దశాబ్దాలలో డీజిల్, విద్యుత్ రైళ్లూ దేశ ఐక్యతకు అంతకంటే ఎక్కువే చేశాయి. ప్రజాదరణ, జనాకర్షణకు తల వంచడం ప్రారంభమైనప్పటి నుంచి రైల్వేల క్షీణత ప్రారంభమైంది. పేర్లను ప్రస్తావిస్తే దివంగతులైన కొందరు గౌరవనీయుల పట్ల అగౌరవాన్ని చూపినట్టవుతుంది. కాబట్టి పేర్లు వద్దు గానీ. మహత్తరమైన, దాదాపు విభ్రాంతికరమైన మన రైలు వ్యవస్థను రాజకీయవేత్తలు... ఓటర్లకు, నియోజక వర్గాలకు చిల్లర మల్లర ప్రయోజనాలను చేకూర్చే సాధనంగా మార్చినప్పటి నుంచి అది కుప్పకూలిపోవడం ప్రారంభమైంది. నియామకాలు, దయ, అనుగ్రహాల కటాక్షంగా మారాయి. ప్రజలకు సేవ చేయడానికి బదులు రైల్వేలు రాజకీయవేత్తలకు ఊడిగం చేయడం ప్రారంభించాయి. ఒకప్పుడు పార్లమెంటు వార్షిక కార్యక్రమంలో ముఖ్యమైనదిగా ఉండిన రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టే రోజు స్వీయ వంచనగా దిగజారింది. ఒక బూటకపు ఫార్ములాను మంత్రులు పూర్తి స్థాయిలో వాడుకున్నారు. రైల్వేలు అవసానదశకు చేరే రోగగ్రస్తతలోకి దిగజారిపోతుంటే,.. ఒక ఆస్పిరిన్ దుకాణాన్ని ఏర్పాటు చేసి, నొప్పిని దాచి పెట్టేస్తే ఎవరూ ఆ రోగాన్ని గుర్తించలేరని వారు ఆశించారు. ఆస్పిరిన్ పరిష్కారానికి తోడు దీపావళి బాణసంచా లాంటి వాగ్దానాల గుప్పింపూ ఉంటుంది. వాటిలో అత్యధికం భ్రమాత్మకమైనవే. ఆహూతులంతా పెదవులు కదిలిస్తూ, త్రేన్పులు తీస్తూ ఉండే బెర్మిసైడ్ విందు భోజనానికి పౌరులను ఆహ్వానించడం లాంటిదే ఇది (అరేబియన్ నైట్స్ కథల్లో ఒకదానిలో బెర్మిసైడ్ అనే ధనికుడు, బిచ్చగాడికి ఇలాగే ఉత్తుత్తి భోజనం పెడతాడు). గత రైల్వే మంత్రులంతా బెర్మిసైడ్లే అనడం సమంజససం కాదు గానీ, చాలా మంది ఆ బాపతే. ఆవర్జా పుస్తకంలో సానుకూల చిట్టాలో కనిపించే వాటిలో రెండు పేర్లు గుర్తుకొస్తున్నాయి. మాధవ్రావ్ సింథియా, తాను ప్రవేశపెట్టిన ఏకైక రైల్వే బడ్జెట్లో ఈ సమస్యకు సంబంధించి సమంజస స్థాయి అవగాహనను కనబరి చారు. ఇక దినేష్ త్రివేదీ, ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు గానీ, ఆయన చేతులు కట్టేసి ఉండటంతో చేసింది దాదాపు ఏమీ లేదు. సురేశ్ ప్రభు ముందున్న సవాళ్లు చాలా స్పష్టంగానే ఉన్నాయి. ఆయన ఈ క్షీణతను ఆపడమే కాదు, దాన్ని వ్యతిరేక దిశకు మరల్చాల్సి ఉంది. క్షీణత విచ్ఛిన్నత దిశగా దిగజారిపోతుండగా ఆయన పగ్గాలు చేపట్టారు. ఆయన తన ఉత్పత్తిని మెరుగుపరచాల్సి ఉంది. ప్రయాణికుల కోచ్లు, సరుకు రవాణా బోగీలు, రైళ్లు, పట్టాలు, సేవల నాణ్యత, వ్యవస్థలు, స్టేషన్లు అన్నిటినీ ఆయన మెరుగుపరచాలి. అది కూడా అనూహ్యమైన వేగంతో చేయాలి. ఎటు చూసినా మీకు సమస్యలే కనిపిస్తాయి. యూపీఏ ప్రభుత్వ హయాం నాటి భయానక కథనాలను గుర్తు చేసుకోవడంలో అర్థం లేదు. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునేది సమస్యలను పరిష్కరించడానికే తప్ప, గతాన్ని తలుచుకుని నిట్టూర్పులు విడవడానికి కాదు. గత ప్రభుత్వం ఘోరంగా లేకపోతే వారు దాన్ని ఎందుకు మారుస్తారు? ప్రభును తీవ్రంగా విమర్శించేవారు సైతం రైల్వేలందించే సేవలలో, పర్యావరణంలో నాణ్యత పెరుగుతున్న క్రమంలో ఉన్నదని ఒప్పుకుంటారు. దేశంలోని వందలాది పట్టణాలలోని 400 రైల్వే స్టేషన్లను చిన్నపాటి ఆర్థిక కేంద్రాలుగా పరివర్తన చెందించడం ప్రభు సాఫల్యతకు కీలకమైన కొలబద్ద అవుతుంది. తాజాగా పెట్టుబడులను పెట్టడం ద్వారా రద్దీ అత్యధికంగా ఉన్న మార్గాల్లో ప్రపంచ స్థాయి రైళ్లను ప్రవేశపెట్టి సాధించాల్సిన పరివర్తన అంతకంటే కష్టమైన సవాలు. ముంబై, అహ్మదాబాద్ల మధ్య హైస్పీడ్ రైలును ప్రవేశపెట్టడం అసమంజసమని లేదా ఉన్నత వర్గాలకు అనుకూలమైనదనీ భావించేవారు... రైలు మార్గాల విద్యుదీకరణను చేపట్టినప్పుడు అది అన్ని చోట్లా ఒకేసారి మొదలు కాలేదని గుర్తుకు తెచ్చుకోవాలి. మన రైల్వేలు భారీ సంస్థ కాబట్టి దానికి పెట్టాల్సిన పెట్టుబడులు కూడా భారీగానే ఉంటాయి. పెద్ద ఎత్తున వాటిని విదేశాల నుంచి సమకూర్చుకోవడం అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ వంటి దేశాలతో అందుకు కావాల్సిన కష్టభరితమైన సన్నాహక కృషిని చేశారు. అయితే ఆ రైలు బండి కదిలేలోగా పరిపూర్తి చేయాల్సిన గురుతర కర్తవ్యాలు చాలానే ఉంటాయి. ఏదేమైనా ఎట్టకేలకు మన రైల్వేలు సరైన దిశలో కదలుతున్నాయి. వేగంగా వెనుకకు గాక, వేగంగా ముందుకు పోతున్నాయి. ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు, వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి -
కేంద్రాన్ని బతిమాలుదాం.. ఒత్తిడి తేవద్దు
♦ టీడీపీపీ సమావేశంలో ఎంపీలకు బాబు సూచన ♦ రైల్వే బడ్జెట్లో గతం కంటే కేటాయింపులు బాగానే చేశారు ♦ రైల్వే జోన్ ఎందుకివ్వలేదో కారణం చెబితే బాగుండేది ♦ భేటీకి హాజరైన బీజేపీ సభ్యులు హరిబాబు, గోకరాజు సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలపై కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదని టీడీపీ నిర్ణయించింది. బతిమాలి నిధులు సాధించుకోవడమొక్కటే మార్గమని అభిప్రాయపడింది. ఆదివారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ(టీడీపీపీ) సమావేశానికి ఏపీ, తెలంగాణలకు చెందిన టీడీపీ ఎంపీలతోపాటు ఏపీ బీజేపీ ఎంపీలు హరిబాబు, గోకరాజు గంగరాజులు హాజరయ్యారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులతోపాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రైల్వేబడ్జెట్లో ఏపీకి చేసిన కేటాయింపులపట్ల చంద్రబాబు సంతృప్తి వ్యక్తంచేశారు. గతంలో రైల్వేబడ్జెట్లలో చేసిన కేటాయింపులకంటే ఈసారి మెరుగుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరు ఎంపీలు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని మనం పదేపదే కోరినా బడ్జెట్లో ప్రకటన లేకపోవడాన్ని ప్రస్తావించగా.. ప్రకటన చేయకపోవడానికి కారణాలేమిటో తెలియదని, అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండని చంద్రబాబు వారికి సూచించారు. రాష్ట్రవిభజన సమయంలో కేంద్రమిచ్చిన హామీల అమలులో భాగంగా ఈసారి బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు, ప్యాకేజీలు మెరుగ్గా ఉంటాయేమో వేచిచూద్దామన్నారు. ఒకవేళ ఆశించినంతగా లేకపోతే ప్రధాని, ఆర్థికమంత్రి, నీతిఆయోగ్ దృష్టికి లేఖరూపంలో తెలియచేద్దామన్నారు. కరువు, వరదలవల్ల రాష్ట్రానికి నష్టం జరిగినా కేంద్రంనుంచి ఆశించినంతగా నిధుల కేటాయింపు లేదని ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేయగా.. అది నిజమేనని అంగీకరించిన చంద్రబాబు దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని వారిని కోరారు. కాగా ఇప్పటికే ఇసుక విధానంలో అనుసరించిన వైఖరి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, ఇప్పుడు ఉచిత ఇసుక విధానంతో అపప్రద తెచ్చుకోకుండా చూడాలని ఎంపీలు సూచించారు. ఉచితం పేరుతో పార్టీ నేతలు, ఇతరులు భారీగా ఇసుకను నిల్వచేసి ఇతర రాష్ట్రాలకు తరలించి, రాష్ట్రంలో ఎక్కువ ధరలకు అమ్మితే మరింత చెడ్డపేరు వస్తుందన్నారు. ప్రత్యేక హోదానా.. అంతకంటే ఎక్కువగానా అనేది తేలుస్తాం: సుజనా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తారా? అంతకంటే ఎక్కువ ప్యాకేజీ ముట్టజెబుతారా? తేల్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీడీపీపీ సమావేశంలో నిర్ణయించినట్టు కేంద్రమంత్రి సుజనాచౌదరి చెప్పారు. ఎంపీలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకహోదాకు చట్టపరమైన ఇబ్బందులున్నందున..ఎక్కువ నిధులు రాబట్టే మార్గాలను చూస్తున్నట్టు చెప్పారు. రైల్వేజోన్ను రైల్వే బడ్జెట్ సవరణలో పెట్టకపోయినా అది వస్తుందని చెప్పారు. ఫిరాయింపులే లక్ష్యంగా పనిచేయండి.. టీడీపీపీ సమావేశంలో ఫిరాయింపుల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఫిరాయింపులపై నేతలమధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. అయితే వలసలే లక్ష్యంగా పనిచేయడంతోపాటు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎంపీలకు ఈ సందర్భంగా చంద్రబాబు హితబోధ చేశారు. పదవులు, నిధులు, ఇతర విషయాల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పడంద్వారా ప్రతిపక్ష పార్టీలోని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలను టీడీపీలో చేర్పించేందుకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలని సూచించినట్టు సమాచారం. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలలో ప్రతిపక్షాల్ని బలహీనపర్చడంలో అధికారపార్టీలు విజయవంతమయ్యాయని, అందువల్లే అక్కడ ఒకే పార్టీ దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతుందని, ఇక్కడా ఆ పరిస్థితి రావాలంటే ఫిరాయింపులద్వారా పార్టీని బలపర్చుకోవడమే ఏకైక మార్గమని ఎంపీలకు సీఎం సూచించినట్టు తెలుస్తోంది. -
కోచ్ ఫ్యాక్టరీకి రూ.1000
బరంపురం: ఓ ప్రతిపాదిత రైలు బోగీల ఫ్యాక్టరీకి తాజా రైల్వే బడ్జెట్లో కేటాయించిన మొత్తం అక్షరాలా రూ.1000! దీంతో ఆ ప్రాజెక్టు అసలు సాధ్యమేనా అని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒడిశాలోని గంజాం జిల్లా సీతల్పల్లిలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో బోగీల ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు 2011-12 రైల్వే బడ్జెట్లో నాటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కానీ తర్వాతి బడ్జెట్లలో ప్రాజెక్టుకు అరకొర నిధులే ప్రకటిస్తూ వస్తున్నారు. దీని కోసం రాష్ట్ర సర్కారు 101 ఎకరాలు సేకరించినా నిధుల్లేకపోవడంతో పనులు మొదలు కాలేదు. తాజా రూ. వెయ్యి విదిలింపుపై సీఎం నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారని, నిధులు పెంచాలన్ని కేంద్రాన్ని అడిగారని బరంపురం బీజేడీ ఎమ్మెల్యే చ్యాపట్నాయక్ చెప్పారు. -
నాడు వైఎస్ పోరాటంతో రాష్ట్రానికి న్యాయం
రైల్వే బడ్జెట్లో మనకు తీరని అన్యాయం: రఘువీరా సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు లాలూప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉండగా, రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలు వైఎస్ సాధించారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం ఒంటెద్దు పోకడలతో రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందన్నారు. శుక్రవారం ఇందిరభవన్లో పార్టీ నేతలు శైలజానాథ్, తులసిరెడ్డి తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్నింటా మోసం చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదని, రాష్ట్ర ప్రయోజనాలా? రాజకీయాలా? ఏది ముఖ్యమో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. అప్పట్లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలందరితో సమావేశమై కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాల సాధనకు వైఎస్ కృషి చేశారని, ప్రస్తుతం చంద్రబాబు అలాంటి సంప్రదాయాన్ని పక్కనపెట్టేశారన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం, అసమర్థత వల్లే రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. -
బడ్జెట్లో వాజ్పేయి కవితలు
రైల్వే బడ్జెట్ సైడ్లైట్స్ న్యూఢిల్లీ: రైల్వే మంత్రి సురేశ్ప్రభు తన రెండో రైల్వే బడ్జెట్ సమర్పణ సందర్భంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, హరివంశ్రాయ్ బచ్చన్ కవితలు మొదలుకొని గౌతం బుద్ధుడి సూక్తులను ప్రస్తావించారు.సురేశ్ప్రభు సతీమణి ఉమ, కుమారుడు అమయలు సందర్శకుల గ్యాలరీలో కూర్చొని బడ్జెట్ ప్రసంగాన్ని వీక్షించారు.గంటకుపైగా సాగిన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీతోపాటు అధికార పార్టీ సభ్యులు పదేపదే బల్లలను చరిచి రైల్వేమంత్రిని అభినందించారు.జిల్లాల్లో చేపట్టిన రైల్వే ప్రాజెక్టుల్లో ఉపాధి కల్పన అవకాశాల గురించి, ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లలో వికలాంగులకు టాయిలెట్లు ఏర్పాటుచేస్తామని సురేశ్ చెబుతుండగా మోదీ చప్పట్లు కొడుతూ కనిపించారు.ఉదయం 11.50 గంటలకు సభలోకి వచ్చిన ప్రభు.. 12.05 గంటలకు రైల్వేమంత్రిగా తన అనుభవాలతో మొదలుపెట్టి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘నూతన ఆదాయం, నూతన విధానం, నూతన నిర్మాణం’ అనే మూడు స్తంభాలపై రైల్వే ఆధారపడి ఉందంటూ తన వ్యూహాన్ని సభ ముందుంచారు.సురేశ్ప్రభు తన ప్రసంగాన్ని ముగించే ముందు బుద్ధుడి సూక్తి చెప్పారు. ‘ఎప్పుడైనా ఎవరైనా ప్రయాణం చేయాలని తలచినప్పుడు రెండు తప్పులు చేసే అవకాశముంది. ఒకటి ప్రారంభించకపోవడం.. రెండు తుదికంటా వెళ్లకపోవడం’ అని అన్నారు. ‘మేము ఇప్పటికే ప్రయాణాన్ని ప్రారంభించేశాం.. మేము చివరి వరకూ ప్రయాణిస్తాం.. సమృద్ధి లేక విజయం అనే గమ్యస్థానానికి భారతీయ రైల్వేని తీసుకెళ్లే వరకు విశ్రమించం’ అని చెప్పారు. బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయంలో కాంగ్రెస్, వామపక్షాలతోపాటు ఇతర విపక్షాల సభ్యులు లేచి నిలబడి బడ్జెట్పై అసంతృప్తి వెలిబుచ్చారు.బడ్జెట్ ముగిసిన వెంటనే ప్రధాని మోదీ.. సురేశ్ప్రభు వద్దకు వెళ్లి కరచాలనం చేసి అభినందించారు. -
రిజర్వేషన్ ప్రయాణికులకు 3 రైళ్లు
♦ హమ్సఫర్, తేజస్, ఉదయ్గా నామకరణం ♦ అన్రిజర్వ్డ్ ప్రయాణికుల కోసం అంత్యోదయ ఎక్స్ప్రెస్ ♦ దూరప్రాంత రైళ్లలో 2-4 దీన్ దయాళ్ అన్రిజర్వ్డ్ బోగీలు ♦ రైల్వే బడ్జెట్ ప్రసంగంలో సురేశ్ ప్రభు ప్రకటన న్యూఢిల్లీ రిజర్వేషన్ ప్రయాణికుల సౌకర్యం, సంతృప్తికి పెద్దపీట వేస్తూ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తన బడ్జెట్ ప్రసంగంలో మూడు రైళ్లను ప్రకటించారు. హమ్సఫర్, తేజస్, ఉదయ్ పేరిట ఈ సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. ‘‘ప్రతి వినియోగదారుడు మా బ్రాండ్ అంబాసిడర్. మా (రైల్వే) ఉనికికి కారణం వారే. అందుకే అతను/ఆమె ప్రయాణించే ప్రతిసారీ వారి ప్రయాణ సంతృప్తి పెరగాలి. రైలు ప్రయాణాన్ని సంతోషించదగ్గదిగా చేసేందుకు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కొనసాగిస్తూనే ఉంటాం. ఏటా రైళ్లలో ప్రయాణించే 700 కోట్ల మంది ప్రయాణికుల్లో ప్రతిఒక్కరి సంతృప్తి కోసం నిరంతరం శ్రమిస్తాం’’ అని సురేశ్ ప్రభు చెప్పారు. రిజర్వేషన్ ప్రయాణికుల కోసం... ► హమ్సఫర్: పూర్తిగా థర్డ్ ఏసీ సర్వీసు. కోరుకున్న ప్రయాణికులకు భోజన సదుపాయం. ► తేజస్: దేశ రైలు ప్రయాణ భవిష్యత్తును చాటిచెప్పేలా గంటకు 130 కిలోమీటర్లు, అంతకన్నా ఎక్కవ వేగంతో ప్రయాణం. రైల్లో వినోదం, స్థానిక రుచులు, వైఫై సేవలు. ► ఉదయ్: అత్యంత రద్దీ మార్గాల్లో రాత్రిపూట నడిచే ఉత్కృష్ట్ డబుల్ డెకర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రీ (ఉదయ్) ఎక్స్ప్రెస్. ప్రయాణికుల తరలింపు సామర్థ్యాన్ని 40% వరకు పెంచగల సామర్థ్యం దీనికి ఉంది. టారిఫ్, టారిఫ్యేతర చర్యల ద్వారా హమ్సఫర్, తేజస్ల ఖర్చును తిరిగి రాబడతారు. అన్రిజర్వ్డ్ ప్రయాణికుల కోసం... ► సామాన్యుల కోసం దూరప్రాంతాలకు పూర్తిగా అన్రిజర్వ్డ్ బోగీలతో అంత్యోదయ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. రద్దీ మార్గాల్లో అందుబాటులో సేవలు. ► ఎక్కువ మంది అన్రిజర్వ్డ్ ప్రయాణికులకు చోటు కల్పించేందుకు వీలుగా దూరప్రాంత రైళ్లలో రెండు నుంచి నాలుగు వరకు దీన్ దయాళ్ బోగీలు. ► ఈ బోగీల్లో అందుబాటులోకి తాగునీరు, మరిన్ని మొబైల్ చార్జింగ్ పాయింట్లు. రైల్వే పుష్టికి ‘సప్త’ పది.. న్యూఢిల్లీ: రైల్వే వ్యవస్థను మరింత సమర్థంగా తయారుచేసేందుకు, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మంత్రి సురేశ్ ప్రభు తన బడ్జెట్లో ఏడు లక్ష్యాలను ప్రకటించారు. అవేంటంటే.. మిషన్ రఫ్తార్: సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని రెట్టింపు చేయడం దీని ఉద్దేశం. వచ్చే ఐదేళ్లలో సూపర్ ఫాస్ట్ మెయిల్/ఎక్స్ప్రెస్ల సగటు వేగాన్ని గంటకు 25 కి.మీ మేర పెంచడం కూడా ఈ మిషన్ లక్ష్యం. మిషన్ 25 టన్నులు: సరుకు రవాణా సామర్థ్యం పెంచి అధిక ఆదాయం ఆర్జించడం దీని ఉద్దేశం. 2016-17లో 25 టన్నుల యాక్సిల్ లోడ్ వ్యాగన్ల ద్వారా 10-20% సరుకును రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టారు. 2019-20 నాటికి 70% సరుకును ఈ వ్యాగన్ల ద్వారా రవాణా చేయాలి. మిషన్ 100: సైడ్ ట్రాక్లు, సరుకు రవాణా కేంద్రాల సంఖ్య పెంచడం దీని లక్ష్యం. ప్రస్తుతం వివిధ చోట్ల వీటి ఏర్పాటుకు 400 ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిలో రెండేళ్లలో వంద సైడింగ్స్ను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. మిషన్ జీరో యాక్సిడెంట్: రైలు ప్రమాదాలను పూర్తిగా నివారించడం దీని లక్ష్యం. వచ్చే రెండుమూడేళ్లలో కాపలా లేని క్రాసింగ్లు లేకుండా చేస్తారు. రైళ్లు ఢీకొనకుండా ప్రత్యేక టెక్నాలజీని వినియోగిస్తారు. మిషన్ పేస్(ప్రొక్యూర్మెంట్ అండ్ కన్జప్షన్ ఎఫిషియెన్సీ): రైల్వే పరికరాల కొనుగోలు, సేవల్లో నాణ్యతను పెంచడం దీని లక్ష్యం. దీనిద్వారా 2016-17లో రూ.1,500 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిషన్ బియాండ్ బుక్-కీపింగ్: రైల్వేలో ఖాతాల తనిఖీని పక్కాగా నిర్వహించడం దీని ఉద్దేశం. మిషన్ కెపాసిటీ యుటిలైజేషన్: 2019నాటికల్లా సిద్ధం కాబోయే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్కతా రవాణా కారిడార్ను పూర్తిస్థాయిలో వినియోగించుకొని అధిక ఆదాయం ఆర్జించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రాజెక్టుల పరిశీలనకు డ్రోన్లు.. న్యూఢిల్లీ: రైల్వేలోని ప్రధానమైన ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించేందుకు అడ్రోన్లు, జియో స్పేసియల్ శాటిలైట్ వ్యవస్థను వినియోగించుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణకు సాంకేతికతపై ఆధారపడకూడదని నిర్ణయించినట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. అలాగే సరుకు రవాణా కారిడార్ పురోగతిని సమీక్షించేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ విధానాన్ని వినియోగిస్తామని ప్రకటించారు. పర్యాటకం ప్రాముఖ్యత రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆయా రాష్ట్రాల్లోని పర్యాటక కేంద్రాలతో ఓ సర్క్యూట్ను ఏర్పాటు చేసి దీన్ని నేషనల్ రైల్ మ్యూజియంతో అనుసంధానం చేసి.. యునెస్కో ద్వారా పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయనున్నారు. ఈ సర్క్యూట్ ప్యాకేజీలో జాతీయ జంతువైన పులులుండే అభయారణ్యాలైన కన్హా, పెంచ్, బాంధవ్గఢ్లను కలపనున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కేంద్రం ఆరోగ్య శాఖతో ఒప్పందం కుదుర్చుకుని రైల్వే ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేయనున్నాయి. దీని ద్వారా రైలు ప్రయాణికులకు దారి పొడవునా ఎక్కడైనా అత్యవసర వైద్యసేవలందేలా చొరవతీసుకుంటారు. గ్యాంగ్మెన్లకు రక్షక్ పథకం పేరుతో.. ప్రత్యేక సదుపాయాలు కల్పించటం, ట్రాక్ రక్షణ (పెట్రోలింగ్)లో వీళ్లు వాడే పరికరాల బరువు తగ్గించేందుకు ఏర్పాట్లు. వినియోగదారుల సేవలో.. ప్రధాన వ్యాపార భాగస్వాములతోపాటు చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా.. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రతి జోనల్ రైల్వే పరిధిలో కస్టమర్ కమిట్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. వ్యాగన్లను లీజుకు ఇచ్చే వ్యవస్థను సులభతరం చేయనున్నారు. యువత కోసం.. ప్రతి ఏడాది వందమంది ఎంబీఏ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆహ్వానం పలికి 2-6 నెలలపాటు ఇంటర్న్న్షిప్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతోపాటు నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని రైల్వే పరిధిలో స్కిల్ డెవలప్మెంట్కు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యుత్, నీటిని ఆదా చేసేందుకు.. శక్తి వినియోగాన్ని 10 నుంచి 15 శాతం తగ్గించాలనే లక్ష్యంతోపాటు విద్యుత్ను ఆదా చేసేందుకు వచ్చే రెండు మూడేళ్లలో దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లను ఎల్ఈడీ లైట్లతో ముస్తాబు చేయనున్నారు. ► రైళ్లు, రైల్వే స్టేషన్లో నీటి వినియోగాన్ని అవసరమైనంతమేరకే పరిమితం చేసి.. వృథాను అరికట్టేందుకు ఏర్పాట్లు. 2వేలకు పైగా రైల్వే స్టేషన్లలో వర్షపునీటిని సద్వినియోగపరుచుకునేలా ఏర్పాట్లు చేసేందుకు నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. ► గిర్డర్ బ్రిడ్జెస్లో స్టీల్ స్లీపర్స్కు బదులుగా పర్యావరణానికి అనుకూలంగా ఉండే రీసైకిల్ ప్లాస్టిక్తో చేసిన స్లీపర్స్ను వినియోగించాలని నిర్ణయం. ► భవిష్యత్తులో 32 స్టేషన్లు, 10 కోచింగ్ డిపోల్లో నీటి రీసైక్లింగ్ డిపోలను ఏర్పాటుచేయటం. మొబైల్ యాప్స్.. టికెటింగ్ సమస్యలు, ఫిర్యాదులు-సూచనలకోసం రెండు యాప్లను రూపొందించటం. రైలు మిత్ర సేవ... కొంకణ్ రైల్వేలో వయోవృద్ధులు, వికలాంగుల కోసం ఉన్న ‘సారథి సేవ’ను బలోపేతం చేయటంతోపాటు రైలు మిత్ర సేవ పేరుతో దేశవ్యాప్తంగా అమలుచేయ టం. దీని ద్వారా బ్యాటరీ ఆధారిత కారు, పోర్టర్ సేవలను విస్తృత పరచటం. సాంకేతికంగా స్టేషన్లను ఆధునీకరించి.. రెండువేల స్టేషన్లలో 20వేల స్క్రీన్స్ను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయటం ఇందులో భాగం. దివ్యాంగుల కోసం.. దివ్యాంగులకు అన్ని సౌకర్యాలుండేలా స్టేషన్ల ఆధునీకరణ. ఏ1 క్లాసు స్టేషన్లలో దివ్యాంగులను టాయిలెట్ తీసుకెళ్లేందుకు సహాయకుల ఏర్పాటు. ప్రయాణ బీమా బుకింగ్ సమయంలోనే ప్రయాణికులకు ప్రయాణ బీమా కల్పించేలా ఏర్పాటు. ట్రెయిన్ నం. 2016 బడ్జెట్ బండిలో ఏముందంటే..? రైల్వే మంత్రి సురేశ్ ప్రభు బడ్జెట్లో అన్ని వర్గాలను సంతృప్తిపరిచేందుకు యత్నించినట్లు కనిపించింది. ప్రధాని మోదీ మానసపుత్రికలైన ‘స్వచ్ఛభారత్’, ‘డిజిటల్ ఇండియా’కు బడ్జెట్లో పెద్దపీట వేశారు. మౌలిక వసతులకూ ప్రాధాన్యం ఇచ్చారు. చిరు వ్యాపారులకు కస్టమర్ కేంద్రం నుంచిప్రయాణికులకు బీమా వరకు పలు కొత్త కార్యక్రమాలను ప్రతిపాదించారు. ఆ విశేషాలేమిటంటే.. యాత్రాస్థలాలను కలుపుతూ... ► అజ్మీర్, అమృత్సర్, బిహార్ షరీఫ్, చెంగనూర్, ద్వారక, గయ, హరిద్వార్, మథుర, నాగపట్నం, నాందేడ్, నాసిక్, పాలి, పారస్నాథ్, పూరి, తిరుపతి, వైలకన్ని, వారణాసి, వాస్కో వంటి యాత్రాస్థలాలను కలుపుతూ ‘ఆస్థా సర్క్యూట్’ను ప్రారంభించటంతోపాటు.. ఆయా రైల్వే స్టేషన్లను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ► పోర్టర్లకు కొత్త యూనిఫామ్లను సమకూర్చటంతోపాటు వారికి సాఫ్ట్స్కిల్స్ను నేర్పించి సహాయకులుగా పిలవనున్నారు. ► జపాన్ ప్రభుత్వ సహకారంతో అహ్మదాబాద్-ముంబై మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటు. దీని ద్వారా భారతీయ రైల్వే సాంకేతికంగా పురోగతి సాధించటంతోపాటు తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది. ► రైళ్లలో వినోదాన్ని అందించేందుకు ఎఫ్ఎం రేడియో స్టేషన్లను ఆహ్వానించటం, అన్ని భారతీయ భాషల్లో ‘రైలు బంధు’ను అన్ని రిజర్వ్డ్ క్లాసులకు వర్తింపచేయటం. ► ‘క్లీన్ మై కోచ్’ సేవ ద్వారా ఎస్ఎంఎస్ పంపగానే.. బోగీని శుభ్రపరిచే వ్యవస్థ. ► హైటెక్ హంగులతో స్మార్ట్ కోచ్ల ఏర్పాటు ► సామాన్యుడికి లాభం చేకూర్చేలా పనిచేస్తున్న అన్ని రైల్వే స్టేషన్లలో రైలు ఆగేలా చర్యలు పెట్టుబడుల ‘సూత్ర’ం..ప్రభు మంత్రం న్యూఢిల్లీ: రైల్వే శాఖలో పెట్టుబడులు ఆకర్షించేందుకు విశ్లేషించి నిర్ణయించేందుకు ఆ శాఖ ఓ కొత్త బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృం దంలోని ఉద్యోగులకు వేతనాలు, స్టార్టప్ కంపెనీల కోసం రైల్వే బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించింది. స్పెషల్ యూనిట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ రీసెర్చ్, అనలిటిక్స్ (సూత్ర) పేరుతో ఓ బృందాన్ని నియమించినట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. సూత్రలో ప్రముఖ విశ్లేషకులు ఉంటారని చెప్పారు. రైల్వే శాఖకు ఏటా 100 టెరా బైట్ల సమాచారం వస్తుందని, అయితే దీన్ని వ్యాపారపరంగా విశ్లేషించి లబ్ధిపొందే పరి స్థితి ఇప్పటి వరకూ లేదన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సూత్ర కోసం కేటాయించిన నిధులు వినియోగిస్తామన్నారు. భారత రైల్వే ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలకు కొత్త ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలు కనుగొంటామని పేర్కొన్నారు. రతన్ టాటా నేతృత్వంలో రైల్వేల పర్యవేక్షణకు ‘కాయకల్ప్’ అనే ఇన్నోవేటివ్ కౌన్సిల్ను సురేశ్ ప్రభు ఏర్పాటు చేస్తారు. దేశంలోని ప్రఖ్యాత పెట్టుబడిదారులు, జాతీయ రైల్వే అకాడమీ, రైల్వే బోర్డు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. రైల్వే వ్యవస్థ పనితీరు మెరుగుపడేందుకు ఈ కౌన్సిల్ నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని ప్రభు పేర్కొన్నారు. రైల్వే వర్క్షాప్లు, ఉత్పత్తి కర్మాగారాల్లోని సిబ్బంది సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు వీలుగా ప్రోత్సహించేందుకు ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైల్ డెవలప్మెంట్ అథారిటీ.. మెరుగైన సేవలు, పోటీ తత్వం పెంచటం, వినియోగదారుల హక్కులను కాపాడటం, సేవల్లో ప్రమాణాలు పాటించటం వంటి అంశాలపై భాగస్వామ్య పక్షాలతో చర్చించాక నిర్ణయం తీసుకోవటం. ► నవారంభ్, నవీనీకరణ్: రైల్వే బోర్డును పునర్వ్యవస్థీకరించటంతోపాటు బోర్డు చైర్మన్కు విశేషాధికారాలను కల్పించాలని నిర్ణయం. బోర్డులో దేశవ్యాప్త డెరైక్టరేట్లను ఏర్పాటుచేసి వెనకబడ్డ జోన్లలో లాభాలు తెచ్చే యత్నాలను ప్రోత్సహించటం. రైల్వేల్లో అధికారుల నియామకాలు చేపట్టడంతోపాటు రైల్వేల వ్యాపారం పెరిగేందుకు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించటం. ► సశస్తీకరణ్: రైల్వేల్లో దీర్ఘకాల(10 ఏళ్లు), మధ్యమ ప్రణాళికలను నిర్దేశించుకుని వాటిని ప్రణాళికాబద్ధంగా అమలు చేసేందుకు ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ఆర్గనైజేషన్ను స్థాపించటం. దేశవ్యాప్తంగా రైలు సేవలను మెరుగుపరిచేందుకు నేషనల్ రైల్ ప్లాన్ను రూపొందించుకోవటం. ► ఏకీకరణ్: రైల్వే శాఖ నిర్వహిస్తున్న అన్ని కంపెనీలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావటం. ► శోధ్ ఔర్ వికాస్: భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వేల అభివృద్ధి కోసం ప్రయోగాలు చేసేందుకు.. వ్యూహాత్మక సాంకేతికత, సమగ్రాభివృద్ధికి ప్రత్యేక రైల్వే వ్యవస్థ (శ్రేష్ఠ)ను ఏర్పాటుచేసుకోవటం ఇందులో భాగం. ప్రస్తుతమున్న ఆర్డీఎస్వో రోజువారీ విషయాలను చూసుకుంటే.. శ్రేష్ఠ దీర్ఘకాలిక అవసరాలపై దృష్టి సారిస్తుంది. ► విశ్లేషణ్: వ్యూహాత్మక పెట్టుబడులు, కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు స్పెషల్ యూనిట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ (సూత్ర)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ► నవ్చ్రన: సంస్థ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, స్టార్టప్లకోసం రూ. 50 కోట్ల మూలధనాన్ని సమకూర్చటం ఈ రైళ్లు యమా ఫాస్ట్... ప్రపంచంలో అత్యంత వేగంగా దూసుకెళ్లే రైళ్లు ఏయే దేశాల్లో ఉన్నాయి? అవి గంటకు ఎంత స్పీడుతో వెళ్తాయి? ఓ లుక్కేద్దామా? 430 కి.మీ షాంఘై మగ్లేవ్- చైనా లోంగ్యాంగ్లోని మెట్రోలైన్ స్టేషన్ నుంచి షాంఘై పుడాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మధ్య ఈ రైలు దూసుకెళ్తుంది. ఏప్రిల్ 2004 నుంచి పట్టాల ‘పైన’ పరుగులు పెడుతోంది. 380 కి.మీ హార్మోనీ సీఆర్హెచ్- చైనా ఈ సూపర్ఫాస్ట్ రైలు బీజింగ్-షాంఘై మధ్య పరుగులు పెడుతుంది. 2010 అక్టోబర్లో పట్టాలెక్కింది. చైనాలోనే వుహాన్-గ్వాంగ్జో మధ్య కూడా ఈ రకానికి చెందిన రైలు నడుస్తుంది. 360 కి.మీ ఏజీవీ ఇటాలో- ఇటలీ యూరోప్లో అత్యంత అధునాతనమైన రైలు ఇదే. ప్రస్తుతం ఈ రైలు ఇటలీలోని నపోలీ-రోమా- ఫిరెంజ్- బొలాగ్నా- మిలాన్ కారిడార్ మధ్య నడుస్తోంది. 2012 నుంచి ఇది సేవలు అందిస్తోంది. 350 కి.మీ సీమెన్స్ వెలారో ఇ-స్పెయిన్ ఇది స్పెయిన్లోని బార్సిలోనా-మాడ్రిడ్ మధ్య పరుగెడుతోంది. ఈ ట్రెయిన్ను తయారు చేసివ్వాలని స్పెయిన్ రైల్వే.. సీమెన్స్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. 2007 నుంచి ఈ రైలు పరుగులు తీస్తోంది. మన ‘బుల్లెట్’ ఎప్పుడో? దేశంలోనే తొలిసారిగా ముంబై-అహ్మదాబాద్ మధ్య (534 కి.మీ.) బుల్లెట్ రైలును కిందటి బడ్జెట్లో ప్రకటించారు. ఇది గంటకు 320 కి.మీ. వేగంతో ప్రయాణించనుంది. ఈ ప్రత్యేక కారిడార్ నిర్మాణానికి రూ.90 వేల కోట్లు అవసరమని అంచనా. ఈ చరిత్ర రైలు పట్టాలపై.. చరిత్రలో కొన్ని మరుపురాని సంఘటనలు ఉంటాయి. మరికొన్ని చరిత్రనే మలుపు తిప్పిన ఘటనలు ఉంటాయి! అలా రైల్వే కూడా చరిత్రపుటల్లో తనకంటూ ఓ పేజీని లిఖించింది. అలాంటి కొన్ని సంఘటనల సమాహారం.. 1893 అది జాత్యహంకారానికి పరాకాష్ట! నల్లవాడన్న ఒకే ఒక్కకారణంతో మహాత్మా గాంధీకి దక్షిణాఫ్రికాలో 1893లో జరిగిన అవమానం!! ఆ అవమానమే ఆయన్ను.. జీవితాంతం అన్యాయాన్ని ప్రశ్నించేలా చేసింది. డర్బన్ నుంచి ప్రిటోరియా వెళ్లే రైల్లో ఫస్ట్క్లాస్ బోగీలో ఎక్కారంటూ గాంధీని పీటర్మారిట్జ్బర్గ్ వద్ద నిర్దాక్షిణ్యంగా ప్లాట్ఫాంపైకి తోసివేశారు. అలా ఆ రైలు ఘటన చరిత్రలో నిలిచిపోయింది! 1901 ‘‘నా జీవితంలో ఇకపై ఎప్పుడు రెలైక్కినా.. నిరుపేదలు వెళ్లే మూడో తరగతి కంపార్టుమెంటుల్లోనే ప్రయాణం చేస్తా...!’’ కలకత్తాలో కాంగ్రెస్ మహాసభల అనంతరం మహాత్మాగాంధీ తీసుకున్న గొప్ప నిర్ణయమిదీ! అన్నట్టుగానే బతికి ఉన్నంతకాలం దేశంలో రైల్లో ఎక్కడికి వెళ్లినా మూడో తరగతిలోనే ప్రయాణం చేశారు. చివరికి ఆయన చితాభస్మాన్ని కూడా అలహాబాద్కు మూడో తరగతిలోనే తరలించారు. 1947 రైల్లో జనం.. రైలుపైన జనం.. డోర్లు.. కిటికీలు పట్టుకుని వేలాడుతూ జనం.. ఒక్క మాటలో చెప్పాలంటే అది రైలు కాదు.. జనప్రవాహం! దేశ విభజన సమయంలో కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ వెళ్లేందుకు.. ఆ దేశం నుంచి భారత్ వచ్చేందుకు ప్రజలు పోటెత్తారు. 1975 జనవరి 2. బిహార్లోని సమస్తిపూర్. అప్పటి రైల్వేమంత్రి ఎల్ఎన్ మిశ్రా ఓ రైల్వేలైన్ ప్రారంభించడానికి వచ్చారు. ఒక్కసారిగా భారీ పేలుడు. శర్మతోపాటు చాలామంది చనిపోయారు. అసలు ఈ బాంబు పేలుడుకు కారణ మెవరు? మంత్రిని ఎందుకు హతమార్చారు? ఈ మిస్టరీ ఇప్పటికీ తేలలేదు. -
టీఆర్ఎస్ ఎంపీల అసమర్థత వల్లే: పొన్నం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీల చేతకానితనంతోనే రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైల్వేల అవసరాలను కేంద్రప్రభుత్వానికి చెప్పడంలో వారు విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. రైల్వే ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఎంపీలతో కనీసం ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేదన్నారు. ఇప్పటికైనా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సూచించారు. -
రైల్వే బడ్జెట్ పై ఎవరేమన్నారంటే..
ఈసారి పరిస్థితి మారింది.. రైల్వే బడ్జెట్ లో పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వే లైనుకు రూ. 70 కోట్లు కేటాయించడం సంతోషకరం. బోధన్-బీదర్ రైల్వే లైను మంజూరైంది. మౌలిక సదుపాయాలకు కేటాయింపులు బాగున్నాయి. మహిళల భద్రత కోసం చేపట్టిన చర్యలు బాగున్నాయి. సాధారణంగా ఏ రాష్ట్రానికి చెందిన మంత్రి ఉంటే ఆ రాష్ట్రానికి రైళ్లు కేటాయించుకుంటారు. ఈ సారి పరిస్థితి కొంచెం మారింది. -కవిత, నిజామాబాద్ ఎంపీ ఇదేనా బాబు పలుకుబడి రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా సాధించిందేమీ లేదు. చంద్రబాబును బీజేపీ తురుపుముక్కగా వాడుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏ ప్రాజెక్టునూ కేంద్రం ఆమోదించనందుకు చంద్రబాబు సిగ్గు పడాలి. విభజన సమయంలో విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామన్న హామీని కేంద్రం తుంగలో తొక్కింది. దీన్ని బట్టే చంద్రబాబుకు కేంద్రంలో ఉన్న పలుకుబడి ఏపాటిదో అర్థమవుతోంది. - కె.రామకృష్ణ, పి.మధు (వామపక్ష నేతలు) నిరాశపరిచింది రైల్వే బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ ప్రకటించకపోవడం నిరాశ కలిగించింది. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు కొత్త రాజధాని నుంచి వివిధ జిల్లాలకు, హైదరాబాద్కు రైల్వే మార్గాలను అనుసంధానించాల్సి ఉండగా.. అది కనిపించలేదు. - మేకపాటి రాజమోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత బాబు అసమర్థతకు రుజువు ప్రధాని మోదీ మోసకారితనానికి, సీఎం చంద్రబాబు చేతకాని తనానికి రైల్వే బడ్జెట్ ప్రతీకగా నిలిచింది. కనీసం ఒక్క కొత్త రైలు, ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ప్రకటించని రైల్వే బడ్జెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు టీడీపీ, బీజేపీ నామమాత్రపు ప్రయత్నం కూడా చేయలే దు. విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న ప్రత్యేక రైల్వే జోన్ను ప్రకటించకుండా ద్రోహం చేశారు. ఎన్డీఏ తీరును వ్యతిరేకిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తాం. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై నిలదీయలేని చంద్రబాబు తీరే ఇందుకు కారణం. - రఘువీరారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఫలిస్తున్న బాబు కృషి కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి సీఎం చంద్రబాబు చేస్తు న్న కృషికి ఫలితంగా రైల్వే బడ్జెట్ లో ప్రాధాన్యత లభించింది. ఏపీకి కేంద్రం విడతల వారీగా సాయం అందిస్తోంది. - తోట నరసింహం, టీడీపీ లోక్సభా పక్ష నేత తెలంగాణపై వివక్ష: పొంగులేటి రైల్వే బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. కేంద్రం వివక్ష చూపింది. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు దేశం నలు మూలల నుంచి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం పాండురంగాపురం-సారపాక రైల్వే లైన్ ఊసేలేదు. ఈ విషయంపై రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నిస్తాం. అవసరమైతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించి కేంద్రానికి కనువిప్పు కలిగేలా చేస్తాం. -
రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం: చాడ
సాక్షి, హైదరాబాద్: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా, కేవలం రాజకీయ అవసరాలకు అనువుగా రైల్వే బడ్జెట్ కేటాయింపులు జరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి కొత్త రైళ్లు, లైన్లు, బోగీలకు నిధులు కేటాయించకుండా కేంద్రం వివక్ష చూపిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల విషయాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. -
బడ్జెట్ బండి.. ఆగలేదండి!
రాష్ట్రానికి ఒక్క రైలు లేదు.. కొత్త ప్రాజెక్టుల ఊసు లేదు * పాత ప్రాజెక్టులకు అత్తెసరు నిధులతో సరి * మరోసారి మొండిచేయి చూపిన రైల్వేశాఖ * కాజీపేటలో వ్యాగన్ వర్క్షాపునకు ఓకే * యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు * సికింద్రాబాద్పై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లిలో రైల్ టెర్మినల్ * ఇవి మినహా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు * కాజీపేట-విజయవాడ మూడో లైన్కు కేవలం రూ.50 కోట్లు * మణుగూరు-రామగుండం మార్గానికి రూ. లక్ష విదిలింపు సాక్షి, హైదరాబాద్: కొత్త రైలు ఒక్కటీ లేదు.. ఒక్క భారీ ప్రాజెక్టు రాలేదు.. పెద్ద స్టేషన్లకు కొత్త రూపునిచ్చే ప్రయత్నం లేదు.. చిన్న స్టేషన్లను ‘ఆదర్శం’గా మార్చే ఊసు లేదు..! కోటి ఆశలతో ఎదురుచూసిన ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ సురేశ్ప్రభు బడ్జెట్ రైలు ‘తెలంగాణ’లో ఆగకుండా దూసుకెళ్లి దుమ్ము మిగిల్చింది!! వరుసగా రెండో ఏడాది కూడా సంస్కరణల హోరులో రాష్ట్రం చిన్నబోయింది. ఆంగ్లేయుల కాలంలో వేసిన లైన్లు మినహా పెద్దగా కొత్త మార్గాలు లేని తెలంగాణను కేంద్ర ప్రభుత్వం మరోసారి విస్మరించింది. కొత్త ప్రాజెక్టులు ఇవ్వకున్నా.. ప్రజల డిమాండ్ మేరకు ఐదారు కొత్త రైళ్లు ఇవ్వటం పరిపాటి. కానీ ఈసారి అవీ లేవు. సంప్రదాయ బడ్జెట్కు భిన్నంగా గత సంవత్సరం ఒక్క కొత్త రైలు ప్రకటించని రైల్వేమంత్రి సురేశ్ప్రభు ఈసారి కూడా అదే పంథా అనుసరించారు. ఉన్న లైన్లు రద్దీగా మారిన నేపథ్యంలో కొత్త రైళ్లు ఇవ్వటం సరికాదనుకున్న మంత్రి.. వాటిని మంజూరు చేయటానికి ససేమిరా అన్నారు. భవిష్యత్తులో కొత్త రైళ్లు రావాలంటే ఇప్పుడు కొత్త లైన్ల నిర్మాణం అవసరమన్న విషయాన్ని విస్మరించారు. దశాబ్దాల క్రితం మంజూరై నత్తతో పోటీ పడుతూ పనులు సాగుతున్న లైన్లకు అరకొర నిధులు విదిల్చటం మినహా బడ్జెట్లో కొత్త మార్గాలపై దృష్టి సారించలేదు. కాజీపేటలో వ్యాగన్ పిరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్షాపు ఏర్పాటుకు పచ్చజెండా ఊపటం, హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణలో భాగంగా ఘట్కేసర్ వరకు నిర్మించునున్న మార్గాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి (రాయిగిరి) వరకు పొడిగించడం, రైళ్ల రద్దీతో ఇరుగ్గా మారిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పై భారం తగ్గించేందుకు శివారులోని చెర్లపల్లిలో శాటిలైట్ రైల్ టెర్మినల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం.. ఈ మూడు తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. బడ్జెట్ రోజు వరకు ఆశల పల్లకిలో ఊరేగి ఒక్కసారి ఉస్సూరుమనిపించకుండా సురేశ్ప్రభు గతంలోనే స్పష్టమైన సంకేతాలిచ్చారు. దీంతో ఈ బడ్జెట్లో పెద్దగా ఏమీ ఉండదన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి ముందే అర్థమైంది. అందుకే కనీసం బడ్జెట్ ముందు ప్రతిపాదనల జాబితాను కూడా రైల్వే శాఖకు పంపలేదు. ఇలాగైతే ఎప్పుడు పూర్తయ్యేది? దక్షిణ మధ్య రైల్వేలో బిజీగా ఉండే కాజీపేట-విజయవాడ మార్గంలో మూడో లైను నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాల్సి ఉంది. కానీ ప్రతి బడ్జెట్లో అత్తెసరు నిధులు మాత్రమే కేటాయిస్తుండటంతో ఈ పనులు సాగటం లేదు. 220 కి.మీ. నిడివి ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.1,630 కోట్లు అవసరం. 2014-15 నాటికి ఖర్చు చేసింది కేవలం రూ.16 కోట్లు మాత్రమే. గత బడ్జెట్లో రూ.100 కోట్లు ప్రకటించినా తుదకు కేటాయించింది మాత్రం రూ.68 కోట్లే. ఈసారి రూ.50 కోట్లతోనే సరిపుచ్చారు. ఈ మార్గంలో లైన్ను గరిష్ట స్థాయిని మించి 175 శాతం మేర వినియోగిస్తుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఫలితంగా డిమాండ్ ఉన్నా అదనపు రైళ్లు నడిపేందుకు అధికారులు జంకుతున్నారు. అలాంటి కీలకమైన మార్గంపై మరోసారి నిర్లక్ష్యం చూపారు. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి కాజీపేట వరకు ట్రిప్లింగ్ది కూడా ఇదే దుస్థితి. దీనికి కూడా అత్తెసరుగా రూ.50 కోట్లు కేటాయించారు. సీఎం కలల ప్రాజెక్టుకూ అత్తెసరు నిధులే.. రాష్ట్రంలో మరో కీలక మార్గం పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్. దీనికి బడ్జెట్లో రూ.70 కోట్లు విదిల్చారు. గత బడ్జెట్లో రూ.141 కోట్లు మంజూరు చేయగా తుదకు రూ.169 కోట్లకు పెంచారు. ఈసారి అందులో సగం కూడా ఇవ్వలేదు. మునీరాబాద్-మహబూబ్నగర్ లైన్కు గత బడ్జెట్లో రూ.34 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.180 కోట్లే కేటాయించారు. కరీంనగర్ను రైల్వేతో అనుసంధానం చేసే ముఖ్యమైన మనోహరాబాద్-కొత్తపల్లి లైన్కు రూ.30 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్లో రూ.20 కోట్లు కేటాయిస్తే చివరికొచ్చేసరికి రూ.కోటి మాత్రమే విడుదలైంది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు అయినప్పటికీ రైల్వే శాఖ నిర్లక్ష్యం చూపింది. ఫలితంగా ఈ సంవత్సరం కూడా ప్రాజెక్టులో పెద్దగా పురోగతి ఉండే అవకాశం లేదు. హవ్వ... రూ.లక్ష? బొగ్గు రవాణాలో కీలకంగా మారనున్న మణుగూరు-రామగుండం లైన్కు బడ్జెట్లో రూ.లక్ష కేటాయించారు! గత బడ్జెట్లో రూ.10 లక్షలు ప్రకటించి రూ.8.2 లక్షలు ఖర్చు చేసిన రైల్వేశాఖ.. ఈసారి రూ.లక్ష ఇవ్వటం విస్మయం కలిగించింది. అక్కన్నపేట-మెదక్ మార్గానికి రూ.10 కోట్లు, భద్రాచలం-కొవ్వూరుకు రూ.10 కోట్లు, భద్రాచలం-సత్తుపల్లి రోడ్డుకు రూ.25 కోట్లు కేటాయించారు. రద్దు చేసి.. జీవం పోసి.. రాష్ట్రంలో అతిపురాతన ప్రాజెక్టుగా రికార్డుల్లోకెక్కింది మాచెర్ల-నల్లగొండ లైను. ఇది 1997లో మంజూరైనా ఇప్పటివరకు పనులే మొదలు పెట్టలేదు. ఇటీవల ఏకంగా ఆ ప్రతిపాదననే రద్దు చేసుకుంటున్నట్టు స్వయంగా రైల్వే శాఖ ప్రకటించింది. స్థానిక ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి పార్లమెంటులో ప్రశ్నించగా.. ఈ మేరకు సమాధానం వచ్చింది. దీంతో అదెలా కుదురుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎంపీలతో నిర్వహించిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో ఈ విషయమై వాకౌట్ కూడా చేశారు. విచిత్రంగా తాజా బడ్జెట్లో ఆ ప్రాజెక్టుకు రూ.20 లక్షలు కేటాయించారు. దీన్ని చూసి ఎంపీ సుఖేందర్రెడ్డే ఆశ్చర్యపోయారు. రద్దు చేసిన ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసిన రైల్వే శాఖ మరీ రూ.20 లక్షలు కేటాయించటం విడ్డూరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
రిక్తహస్తం
బడ్జెట్లో గుంటూరు డివిజన్కు నూతన కేటాయింపులు శూన్యం రైల్వే జోన్ ప్రస్తావనే లేదుమౌలిక వసతులకంటే టెక్నాలజీకే ప్రాధాన్యం పెండింగ్ ప్రాజెక్టులకే నిధులుసామాన్య ప్రయాణికుల్లో తీవ్ర నిరాశ నవ్యాంధ్రరాజధానిలో బడ్జెట్ రైలు ఆగలేదు. గుంటూరు రైల్వే డివిజన్కు నూతన కేటాయింపుల ఊసే లేదు. ఇప్పుడిప్పుడే రాజధాని అమరావతి నిర్మాణ పనులు పుంజుకుంటున్న నేపథ్యంలో గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారికి కనెక్టవిటి అత్యవసరం. బడ్జెట్ కేటాయింపుల్లో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు మినహా నూతన రైళ్లు, రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు కేటాయింపులు లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. నగరంపాలెం (గుంటూరు) కేంద్రమంత్రి సురేష్ప్రభు గురువారం పార్లమెంట్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ గుంటూరు డివిజన్ ప్రజలను నిరాశకు గురిచేంది. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై చేస్తున్న హడావుడి కార్యరూపం దాల్చేందుకు చాలాకాలం పట్టేలా ఉందని భావించారో ఏమో కనీసం రాజధాని ప్రాంతంలో రైల్వేలైన్ల అభివృద్ధిపై హామీలు కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదు. మౌలిక వసతుల కంటే టెక్నాలజీకే ప్రాధాన్యమిచ్చారు. వీటికి నిధులొచ్చే అవకాశం.. గుంటూరు - విజయవాడకు రాజధాని ప్రాంతమైన అమరావతి మీదుగా సుమారు 85 కి.మీ, నల్లపాడు-బీబీనగర్కు 243 కి.మీ డబ్లింగ్ సర్వేకు అనుమతించింది. ఇక విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా నూతన రైల్వేజోన్ ఊసేలేదు. డివిజన్లో ప్రధానమంత్రి ప్రయార్టీ ప్రాజెక్టుల కింద నడుస్తున్న నడికుడి-శ్రీకాళహస్తి పనులకు రూ.182 కోట్లు, గతంలో పనులు ప్రారంభించి ఆగిపోయిన మాచర్ల-నల్లగొండ రైల్వే లైన్కు రూ.20 కోట్లు కేటాయించారు. దేశం మెత్తంలోని పెండింగ్ ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలపడం ద్వారా డివిజన్లో ప్రస్తుతం జరుగుతున్న తెనాలి-గుంటూరు డబ్లింగ్, గుంటూరు- నంద్యాల విద్యుదీకరణ పనులకు బడ్జెట్ నిధులు వచ్చే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధుల సమర్థతను బట్టే సౌకర్యాలు రాష్ట్రప్రభుత్వ కేంద్రమంత్రి సురేష్ప్రభు గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో భాగస్వామ్యంతో గుంటూరు-నంద్యాల డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు. మేళచెర్వు-జగ్గయ్యపేట పెండింగ్ ప్రాజెక్టుకు రూ.110 కోట్లు కేటాయింపు ద్వారా భవిష్యత్తులో గుంటూరు డివిజన్కు విష్ణుపురం మీదుగా సరుకురవాణా పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేక వివరాలు లేకుండా దేశవ్యాప్తంగా 400 రైల్వేస్టేషన్లకు వైఫై, 311 స్టేషన్లులో సీసీ కెమేరాల ఏర్పాటు, అన్ రిజర్వుడ్, సూపర్ఫాస్ట్ అంత్యోదయ ట్రైన్లు, దీన్దయాళ్ కోచ్లు, రిజర్వేషన్, పర్యటకరంగ ప్రయాణికుల కోసం హమ్సఫర్, తేజస్, ఉదయ్, రైళ్లు నడపాలని ప్రకటించారు. దీని వలన జోన్ స్థాయిలో అధికారుల సమర్థతను బట్టి, ప్రజప్రతినిధులు రైల్వే బోర్డుపై తెచ్చే ఒత్తిడి వలనే ఈ సౌకర్యలు డివిజన్కు సమకూరే అవకాశం ఉంది. భద్రతకు ఆన్లైన్ టెక్నాలజీ రైల్వే శాఖలో ఆన్లైన్ టెక్నాలజీని ప్రయాణికులకు, భద్రతకు విస్తృతంగా వినియోగించేలా పథకాల రూపకల్పన చేయనున్నారు. ప్లాట్ ఫాం టికెట్ను యాప్ ద్వారా అందించాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం. సగటు రైల్వే ప్రయాణికుడికి మేలు చేయలేని బడ్జెట్గా దీనిని రూపొందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బడ్జెట్లో 2016-17 సాధించనున్న లాభాలు ప్రస్తావించటం, పీపీపీ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించడం ద్వారా, రైల్వేశాఖలో భవిష్యత్తులో జరిగే ప్రయివేటీకరణకు ఇది నాంది బడ్జెట్ అవుతుందంటున్నారు. ఇక ఉద్యోగుల సంక్షేమంపై కనీస ప్రస్తావనే లేదు. మంగళగిరికీ మొండిచేయి.. మంగళగిరి : నవ్యాంధ్ర నూతన అమరావతి రాజధానిలో ప్రధాన స్టేషన్గా వున్న మంగళగిరిలోనే బడ్జెట్ రైలు కూత వినిపించలేదు. అధికారులు,అధికారపార్టీనేతలు గొప్పగా చెప్పిన రైల్యే లైన్లు విస్తరణ,దేశనలుమూలలకు నూతన రైళ్లు దక్కకపోగా సామాన్య ప్రయాణికులు కోరుకుంటున్న కనీస మౌలిక వసతులుకు బడ్జెట్లో స్థానం దక్కకపోవడం స్థానికులను విస్మయానికి గురి చేసింది. స్టేషన్లో కనీసం రెండో రిజర్యేషన్ కౌంటర్, ప్రయాణికుల విశ్రాంతి గదులతో పాటు మరుగుదొడ్లు, తాగునీరు ఏర్పాటుకు దిక్కు లేకపోవడం విశేషం. గత ఏడాది దక్షిణ మధ్య రైల్యే జీఎం పర్యటించిన సమయంలోనూ స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రయాణికుల సంక్షేమసంఘం ప్రతినిధులు కలిసి పలు వినతులు చేశారు.రాజధాని స్టేషన్లో మరిన్ని మౌలికవసతులతో పాటు స్టేషన్ అభివృద్ధికి మరిన్ని ప్రతిపాదనలు చేశామని బడ్జెట్లో నిధులు కెటాయించిన వెంటనే స్టేషన్ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని చెప్పిన అధికారులు ఆమేరకు చేతలలో సాధించలేకపోవడం గమనార్హం. -
రైల్ వెవ్వె...వ్వె...వ్వే!
♦ రైల్వే బడ్జెట్లో విశాఖకు.. ఉత్తరాంధ్రకు ♦ తీవ్ర అన్యాయం విశాఖ జోన్ ఊసే ఎత్తని ♦ రైల్వే మంత్రి టీడీపీ, బీజేపీ పాలకుల ♦ హామీలు గాలికి.. భగ్గుమన్న ప్రతిపక్షాలు, ♦ ప్రజాసంఘాలు వీటితోనే సరిపెట్టుకోండి ♦ ఖరగ్పూర్-విజయవాడ సరుకు రవాణా కారిడార్ ♦ వడ్లపూడి వ్యాగన్ వర్క్షాప్కు రూ.30 కోట్లు ♦ కొత్తవలస-సింహాచలం 4వ లైన్కు రూ.2.71 కోట్లు ♦ సింహాచలం నార్త్-గోపాలపట్నం డబ్లింగ్ బైపాస్కు రూ.4.24 కోట్లు ♦ ఖరగ్పూర్-విజయవాడ ట్రిప్లింగ్ లైన్ ♦ విశాఖ స్టేషన్లో త్వరలో వైఫై సౌకర్యం బడ్జెట్ రైలు వచ్చింది.. వెళ్లింది.. కాదు కాదు.. మెరుపులా మాయమైంది!.. విశాఖ అనే నగరమే లేదన్నట్లుగా హైస్పీడ్లో దూసుకుపోయిన బడ్జెట్ రైలు కింద నగర ఆశలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. కలలన్నీ చెదిరిపోయాయి... హామీలన్నీ కొట్టుకుపోయాయి. అదిగో జోన్.. ఇదిగో జోన్.. అంటూ పాలక టీడీపీ, బీజేపీ నేతలు నిన్నటి వరకు చేసిన ప్రచారం ఉత్త పటాటోపమేనని సురేష్ ప్రభువు తేల్చిపారేశారు. అంతేనా.. ఒక కొత్త రైలు లేదు.. ఫ్రీక్వెన్సీ పెంపూ లేదు.. కొత్త ప్రాజెక్టులు లేవు... అసలు రైల్వే బడ్జెట్లో విశాఖ అన్న ఊసే లేకుండా రైల్వే మంత్రి బడ్జెట్ పాఠాన్ని అప్పజెప్పేశారు. తూర్పు కోస్తా జోన్ పరిధిలో ఉన్న వాల్తేర్ డివిజన్కు ఈ బడ్జెట్లో వెయ్యి కోట్ల పైచిలుకు నిధులు కేటాయించారని డీఆర్ఎం చంద్రలేఖ ఉవాచించినా.. వాటిలో విశాఖేతర ప్రాంతాలకు.. ప్రత్యేకించి ఒడిశా, చత్తీస్గఢ్ ప్రాంతాలకు పోయేవే ఎక్కువగా ఉన్నాయి.. ఇంతకాలం హామీలతో ఊరించి.. బడ్జెట్లో మొండిచెయ్యి చూపడం కళ్లు మూసి జెల్ల కొట్టినట్టుగా ఉందని.. ప్రజా, ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. రైల్వే బడ్జెట్లో విశాఖకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నిరసనలకు దిగాయి. ♦ అన్యాయం చేశారు ♦ రైల్వే బ డ్జెట్పై వైఎస్సార్ సీపీ మండిపాటు ♦ రైల్వేస్టేషన్ ముందు ధర్నా అనకాపల్లి: రైల్వే జోన్ విషయంలో విశాఖకు మరోసారి అన్యాయం జరిగింది.. దీనికి బాధ్యత వహిస్తూ రాష్ట్రానికి చెందిన బీజేపీ, టీడీపీ ఎంపీలు, కేంద్రమంత్రులు రాజీనామా చేయాలి అనివైఎస్సార్ సీపీ అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు డిమాండ్ చేశారు. గురువారం అనకాపల్లి రైల్వేస్టేషన్ ముందు పార్టీ నాయకు, కార్యకర్తలతో కలసి ధర్నాకు దిగారు. రైల్వే బడ్జెట్ నిరాశ మిగిల్చిందన్నారు. మాయమాటలు చెప్పి రైల్వేజోన్ విషయాన్ని పక్కన పెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యల గురించి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పోరాడుతున్నారని పేర్కొన్నారు. పట్టణ కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు మాట్లాడుతూ రెండేళ్ల నుంచి రైల్వేజోన్ వస్తుందని విశాఖ ఎంపీ హరిబాబు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు మభ్యపెట్టారని.. కాని రైల్వేబడ్జెట్లో ఈ ప్రస్తావనే రాలేదన్నారు. మండల అధ్యక్షుడు గొర్లి సూరిబాబు, పట్టణ అధికార ప్రతినిధి ఆళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి న్యాయం చేయడంలో వైఫల్యం చెందుతున్నాయని చెప్పేందుకు రైల్వేజోన్ ఉదాహరణ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల నివాళులు అర్పించారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఏవీ రత్నకుమారి, మండల కార్యదర్శి భీశెట్టి జగన్, మామిడి నూకరాజు, సమ్మంగి కనకారావు, పొట్ల అప్పారావు, పెట్ల నాగేశ్వరరావు, ఏడువాకల నారాయణరావు, పిట్టా అప్పలరాజు, మట్టా కుమార్, కె.అత్తిరికుమార్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి, విశాఖపట్నం : ఊహించిందే జరిగింది. కేంద్రం విశాఖకు మరోసారి అన్యాయం చేసింది. ఈసారి కూడా రైల్వే బడ్జెట్ నిరాశపరిచింది. తూర్పు కోస్తా రైల్వేలో అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న వాల్తేరు డివిజన్కు రైల్వే బడ్జెట్లో మొండిచెయ్యే చూపింది. ఏళ్ల తరబడి ఎన్నో ఆశలు పెట్టుకున్న జోన్ ఆశలను కూడా ఆవిరి చేసేసింది. అదిగో జోన్, ఇదిగో జోన్ అంటూ కొన్నాళ్ల నుంచి అధికార టీడీపీ, బీజేపీ నేతలు ఊదరగొడ్తూ వచ్చారు. తీరా గురువారం నాటి బడ్జెట్లో వైజాగ్ ఊసే లేదు. విశాఖపై రైల్వేశాఖకున్న నిర్లక్ష్యం, నేతల ఉదాసీనతలను చూసి విశాఖ వాసులు నివ్వెరపోయారు. ఇంతటి అన్యాయం ఎప్పుడూ లేదంటూ నిప్పులు కక్కుతున్నారు. బడ్జెట్ ప్రసంగంలో రైల్వేమంత్రి సురేష్ ప్రభు నోట ‘విశాఖపట్నం’ అన్న మాటే రాలేదంటే ఏమనుకోవాలి? భవిష్యత్లో వాల్తేరుకు వరాలిస్తారని, ప్రత్యేక జోన్ ప్రకటిస్తారంటే ఎవరిని నమ్మాలి? అధికార పార్టీల నేతల చిత్తశుద్ధి లోపమా? లేక వీరిని కేంద్రం పెద్దలు పట్టించుకోకపోవడమా? ఇవీ ఇప్పుడు విశాఖ వాసుల మదిలో మెదులుతున్న ప్రశ్నలు! విశాఖ ఘోష వినపడదా? దాదాపు 50 ఏళ్ల నుంచి విశాఖ రైల్వే జోన్ డిమాండ్ కొనసా....గుతూనే ఉంది. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, జేఏసీలు తరచూ జోన్ కోసం ఉద్యమాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. అయినా రైల్వేశాఖ పెడచెవిన పెడుతూనే వస్తోంది. ఆఖరికి రాష్ట్ర విభజన చట్టంలో రైల్వే జోన్ ఇవ్వాలన్న ప్రస్తావించారు కూడా. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ జతకట్టి అధికారంలోకి వచ్చాక ఇక జోన్ ఖాయమన్న ప్రచారం ఉధృతమైంది. గత ఏడాది రైల్వే బడ్జెట్లోనూ జోన్ ప్రకటన వెలువడుతుందనుకుంటే నిరాశే మిగిలింది. జోన్ ఇవ్వడానికి రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆమోదం తెలిపారని పక్షం రోజుల క్రితం కేంద్రమంత్రులు ప్రకటనలు చేశారు. దీంతో ఈ బడ్జెట్లో జోన్ ఇచ్చేస్తారన్న భావన కలిగించారు. తాజా బడ్జెట్లో ఎప్పటిలాగానే జోన్ జోలికెళ్లకుండా ఆశలపై నీళ్లు చల్లారు. మరోవైపు విశాఖలో ఏళ్ల తరబడి ఉన్న డిమాండ్లను రైల్వే బడ్జెట్లో పట్టించుకోలేదు. కొత్త రైళ్ల ప్రస్తావనే లేదు. కనీసం 2015 బడ్జెట్లో కేటాయింపులకూ మోక్షం లేదు. కావలసినవి ఇవీ.. జ్ఞానాపురం వైపు మల్టీపర్పస్ కాంప్లెక్స్ నిర్మాణానికి 2013-14లో ప్రకటన చేశారు. కానీ ఈ బడ్జెట్లో నిధులపై స్పష్టతలేదు. ట్రాక్ల నవీకరణకు రూ.299 కోట్లు కేటాయించినా నిధులివ్వలేదు. రైళ్ల ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఆధునికీకరణ పనులకు రూ.17.78 కోట్లు, 335 కిలోమీటర్ల దువ్వాడ-విజయవాడ కొత్త సర్వే లైన్కు రూ.3.34 కోట్లు, దువ్వాడ-విజయవాడ లైను కొత్త పనులకు రూ. 76.60 కోట్లు గత బడ్జెట్లో ప్రకటించారు. కానీ ఈ బడ్జెట్లో వాటి ఊసే లేదు. రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారాలు 8 నుంచి 12కి పెంపుదల ప్రతిపాదనలను పట్టించుకోలేదు. కనీసం ప్రముఖ పర్యాటక కేంద్రం అరకుకు అద్దాల విస్టాడాం కోచ్ రైలు ప్రస్తావనే లేదు. విశాఖలో వ్యాగన్ తయారీ కేంద్రాన్ని, ఆర్ఆర్బీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ జోలికెళ్లలేదు. ప్లాట్ఫారాల విస్తరణ మాటేలేదు. విశాఖ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి ప్రాంతాలకు ఈఎంయూ, విశాఖపట్నం-విజయవాడకు రాత్రి వేళ రైళ్లు నడపాలన్న ప్రతిపాదనను పట్టించుకోలేదు. విశాఖ వచ్చే రైళ్లు ఔటర్లోనే నిలిచి పోతున్నందున మరో రెండు ట్రాక్లు నిర్మించాలన్న డిమాండ్ను పెపడచెవిన పెట్టేశారు. రిజర్వేషన్ కేంద్రాల సంఖ్యను పెంచలేదు. రద్దీ దృష్ట్యా తిరుపతికి రోజూ మరిన్ని రైళ్లు నడపాలని, విశాఖ-హైదరాబాద్ దురంతో వారానికి మూడుసార్లకు బదులు రోజూ నడపాలని, విశాఖ-వారణాసి, విశాఖ-ఢిల్లీ మధ్య నడిచే రైళ్ల సమయం తగ్గించాలని, విశాఖ-తిరుపతి మధ్య గరీబ్థ్ ్రనడపాలన్న డిమాండ్లను గాలికొదిలేశారు. నేతలూ ఎందుకీ సన్నాయి నొక్కులు...! తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా ఆదాయం ఏటా సుమారు రూ.10 వేల కోట్లు. ఇందులో దాదాపు సగం రూ.6500 కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. విశాఖ రైల్వే స్టేషన్కు రోజూ 112 రైళ్ల ద్వారా రోజుకు లక్షా 20 వేల మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు 25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్కంటే రెట్టింపన్న మాట. ఇంతగా కాసులు తె స్తున్న వాల్తేరు డివిజన్కు బడ్జెట్లో ప్రాధాన్యమే లేకుండా పోయింది. ఇంత జరుగుతున్నా అటు టీడీపీ, ఇటు బీజేపీ నేతలు కిమ్మనడం లేదు. పైగా ఒకరిద్దరు బడ్జెట్ బాగుందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇచ్చినవి ఇవీ.. వాల్తేరు డివిజన్లో ఈ బడ్జెట్లో 15 డబ్లింగ్ పనులకు 1088.95 కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. ఖరగ్పూర్-విజయవాడ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 400 స్టేషన్లలో వైఫై సదుపాయం కల్పిస్తామని ఈ బడ్జెట్లో ప్రకటించారు. వాస్తవానికి గత బడ్జెట్లోనూ ప్రకటించినా ఇప్పటిదాకా అతీగతీ లేదు. వడ్లపూడి వ్యాగన్ పీవోహెచ్ వర్క్షాపునకు రూ.213.71 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది రూ.30 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఇంకా చిన్నా చితక పనులకు నిధులు కేటాయించినట్టు చెబుతున్నా అవేమిటో స్పష్టత లేదు. డివిజన్కు రూ.1009 కోట్లు 15 చోట్ల డబ్లింగ్ పనులు జోన్పై సమాచారం లేదు డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ సాక్షి, విశాఖపట్నం : రైల్వే బడ్జెట్లో వాల్తేరు డివిజన్కు రూ. 1008.95 కోట్లను కేటాయించినట్టు డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ తెలిపారు. ఈ నిధులతో డివిజన్ పరిధిలోని 15 చోట్ల డబ్లింగ్ పనులు చేపడతామన్నారు. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందులో విజయనగరం-కొత్తవలస 3వ లైన్కు రూ.8 కోట్లు. కొత్తవలస-సింహాచలం 4వ లైన్కు రూ.2.71 కోట్లు, సింహాచలం నార్త్-గోపాలపట్నం డబ్లింగ్ బైపాస్కు రూ.4.24 కోట్లు, కిరండోల్-జగదల్పూర్ లైన్కు రూ.120 కోట్లు, జగదల్పూర్-కోరాపుట్ లైన్కు రూ.120 కోట్లు, విజయనగరం- సంబల్పూర్ 3వ లైన్కు రూ.225 కోట్లు, కొత్తవలస-జగదల్పూర్ లైన్కు రూ.350 కోట్లు, కోరాపుట్-సింగపురం రోడ్డుకు రూ.39 కోట్లు, విజయనగరం బైపాస్ లైన్కు రూ.10 కోట్లు, భద్రక్, విజయనగరం 3వ లైన్కు రూ.210 కోట్లు కేటాయించిన ట్టు వివరించారు. బడ్జెట్లో ఖరగ్పూర్-విజయవాడ ట్రిప్లింగ్ లైన్ మంజూరైందన్నారు. కాగా వాల్తేరు డివిజన్లో 18 ఆటోమేటిక్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంగవికలురకు ఈ-టిక్కెట్టు పొందడానికి వీలుగా వెయ్యిమందికి గుర్తింపు కార్డుల జారీ చేస్తున్నామన్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో త్వరలో వైఫై సదుపాయం కల్పిస్తామని తెలిపారు. డివిజన్లో 60 కాపలాలేని లెవెల్ క్రాసింగ్ల్లో 56 మూసివేశామన్నారు. అరకు వెళ్లే విస్టాడాం కోచ్ను జులై నాటికి ప్రారంభించే అవకాశం ఉందన్నారు. విజయనగరం-రాయగడ ఎలక్ట్రికల్ లైన్ వచ్చే నెలలో పూర్తవుతందని చెప్పారు. జోన్ సమాచారం లేదు.. విశాఖపట్నం ప్రత్యేక జోన్ ఏర్పాటుపై తనకు సమాచారం లేదని డీఆర్ఎం తెలిపారు. ఆ విషయం రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలో ఉందన్నారు. డబుల్ డెక్కర్ రైళ్ల నిర్వహణ సదుపాయం ప్రస్తుతానికి విశాఖలో లేనందున ఇప్పట్లో అవి వచ్చే అవకాశం లేదని చెప్పారు. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే స్వర్ణజయంతి, సమత ఎక్స్ప్రెస్ రైళ్లపై వినైల్ ర్యాపింగ్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేసుకునేందుకు విశాఖ స్టీల్ప్లాంట్తో ఒప్పందానికి చర్చలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. హామీలకు పరిమితం అనకాపల్లిరూరల్ (మునగపాక): రెల్వేబడ్జెట్లో విశాఖకు న్యాయం జరగలేదని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు దూళం గోపీ పేర్కొన్నారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖకు రైల్వేజోన్ హామీలకే పరిమితమైందని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులు ఎన్ని లేఖలు ఇచ్చినా రైల్వేజోన్ విషయమై కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచాకరమన్నారు. తమిళనాడుకు రైల్వేహబ్ కేటాయించిన ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రం కనిపించలేదా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీకి రాష్ట్రంలో సభలు, సమావేశాలు పెట్టే హక్కులేదన్నారు. మంత్రి వెంకయ్యనాయుడు ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తారన్నారు. విశాఖ రైల్వేజోన్ విషయమై ఎంపీలను నిలదీస్తామని తెలిపారు. ప్రజా ఉద్యమం ద్వారా జోన్ సాధనకు సిద్ధం కావాలన్నారు. ఆశలు వమ్ము చేశారు... అక్కయ్యపాలెం : ప్రత్యేక రైల్వేజోన్ ఆశలపై రైల్వే మంత్రి నీళ్ళు చల్లారని వైఎస్సార్సీపీ 13వ వార్డు అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ అన్నారు. ప్రత్యేక రైల్వే జోన్ వస్తే పిల్లలకు ఉద్యోగాలోస్తాయని, ఉత్తరాంధ్రా అభివృద్ధి చెందుతుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన కోటి మంది ప్రజానీకానికి బడ్జెట్లో మొండిచేయి చూపించారన్నారు. రైల్వే బడ్జెట్ప్రవేశ పెడుతుండడంతో మీడియాతో మాట్లాడడానికి వెళ్ళిన హేమంత్ కుమార్, ఏపీ స్టూడెంట్ జేఏసీ చైర్మన్ లగుడు గోవింద్, పొలిటికల్ జేఏసీ చైర్మన్ జె.టి.రామారావు, అట్టాడ అవినాష్లను పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేసి ఫోర్త్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సాయంత్రం 4:30 గంటలకు సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. బయటకు వచ్చిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లగుడు గోవింద్ మాట్లాడుతూ ప్రత్యేక జోన్, ప్రత్యేక ైరె ళ్ళు, ప్రత్యేక ప్రాజెక్టులు ఏమీ లేకుండా రైల్వే బడ్జెట్ నిరాశపర్చిందన్నారు. రూ.లక్షా 25 వేల కోట్ల బడ్జెట్లో రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఉత్తరాంధ్రాకు మొండిచేయి చూపించారన్నారు. పాలకులకు, ఎంపీలు, కేంద్ర మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే ఈనెల 29 లోగా ప్రత్యేక జోన్పై ప్రకటన చేయించాలన్నారు. లేదంటే ఎంపీలను, మంత్రులను అడుగడుగునా అడ్డుకొని నల్ల బాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తామన్నారు. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని బీజేపీ జిల్లా కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. జేటీ రామారావు మాట్లాడుతూ ప్రత్యేక జోన్ ప్రకటన లేకుండా ఒట్టి చేతులతో వస్తే ఎంపీలను, మంత్రులను ఎయిర్పోర్టులో ఘెరావ్ చేసి టమాటో, కోడి గుడ్లతో కొడతామని హెచ్చరించారు. నిరాశపరిచింది... విశాఖ కేంద్రంగా ైరె ల్వే జోన్ ఏర్పాటు చేస్తారని ఆశగా ఎదురు చూసిన ఉత్తరాంధ్ర ప్రజలకు నిరాశమిగిలింది. 2014 రాష్ట్ర విభజన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అగౌరవపరిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నరేంద్రమోడి వద్ద తాకట్టు పెట్టారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అరకొర కేటాయింపులు తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏమీ లేవు. దీనికి రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, రాష్ట్ర ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత. -ద్రోణంరాజు శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోన్పై మోసగించారు... రైల్వే బడ్జెట్ రైల్వేను ప్రెవేటీకరణ చేసే విధంగా ఉంది. అదే కనుక జరిగితే భవిష్యత్తులో రైలు రవాణా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రులతో ఆటలాడుకోవడం అలవాటుగా మారింది. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయటంలో చిత్తశుద్ధి లోపించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో లాలూచి పడి ప్రతిదానికి తల ఊపడం ప్రారంభించింది. ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దానిని కేంద్రం కాళ్ళ వద్ద తాకట్టు పెట్టాడు. బడ్జెట్కు ముందు రైల్వే జోన్ వచ్చేస్తుందంటూ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారు. ఫైలు ప్రధానిమంత్రి కార్యాలయంలో ఉంది, ఇక ఇవ్వడమే తరువాయి అంటూ ప్రజలను మోసం చేయడం దుర్మార్గం. -జె.వి.సత్యనారాయణమూర్తి, విశాఖ రైల్వేజోన్ సాధన సమితి కన్వీనర్ చంద్రబాబు వైఫల్యమే.. కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఒక్క ప్రాజెక్టు కూడా కేటాయించ లేదు. దీనికి కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యమే కారణం. రైల్వే బడ్జెట్ కార్పొరేట్ల కోసమే అన్నట్లు ఉంది. ైరె ల్వే జోన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న విశాఖ ఉత్తరాంధ్ర వాసుల ఆశలు ఆవిరి చేసేలా రైల్వే బడ్జెట్ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అనేక మార్లు హామీలు గుప్పించి వంచనకు పాల్పడ్డారు. 2017-18లో 9వేలు ఉద్యోగాలు తీస్తామని ప్రకటించారు. 2016-17లో నిరుద్యోగుల సంగతేంటి. -సీహెచ్ నరసింగరావు, సీపీయం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు(25వీఎస్సీ33) చంద్రబాబు రాజీనామా చేయాలి కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఆంధ్ర ప్రదేశ్కు తీరని అన్యాయం జరిగింది. 32సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి సాధించింది ఏమిటి? రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. తొమ్మిదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి బడ్జెట్లో రాష్ట్రానికి అరకొర నిధులను మాత్రమే తీసుకురాగలిగారు. దీనికి పూర్తిగా చంద్రబాబు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. - కొయ్య ప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రబాబే కారణం.. విశాఖకు రైల్వే బడ్జెట్లో ప్రత్యేక జోన్గా ప్రకటించకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరే కారణం. ఒడిశా సీఎంకు భయపడి చంద్రబాబు జోన్పై గట్టిగా పోరాడడం లేదు. రైల్వే బడ్జెట్లో విశాఖకు జోన్ ప్రకటించలేదు, ఈ డివిజన్కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇవన్నీ చూస్తే అడిగే వారు లేరని ఇక్కడ వారిని కేంద్రంలోని పెద్దలు గొర్రెలు, మేకలుగాను భావిస్తున్నారు. పదేళ్లుగా విశాఖ ప్రత్యేక రైల్వే జోన్పై అదిగో ఇదిగో అంటూ కళ్లలో దుమ్ము కొడుతున్నారు. జోన్ సాధించలేకపోయిన ఎంపీ హరిబాబును విశాఖ వాసులు ఊళ్లోకి రానీయవద్దు. దేశంలోనే రాబడిలో మూడో స్థానంలో ఉన్న వాల్తేరు డివిజన్పై ఇంతలా నిర్లక్ష్యం తగదు. -సీఎస్ రావు, అధ్యక్షుడు, ప్రజాస్పందన ఆశాజనకం బ్రాడ్ గేజ్ నెట్వర్క్ పరిధిలో ఉన్న మానవరహిత లెవెల్ క్రాసింగ్లపై రైల్వే మంత్రి ప్రత్యేక దృష్టి కనబరిచారు. జీరో ప్రమాదప్రాంతంగా రైల్వేను మార్చాలనే ఉద్దేశం కలిగివుంటడం అభినందనీయం. వీటితోపాటు సీసీ కెమెరా సర్వైవలెన్స్, వైఫై వంటి సదుపాయాల కల్పనకు ప్రాముఖ్యతనివ్వడం ఆనందాన్ని కలుగజేసింది. విశాఖ రైల్వేజోన్, కొత్తరైళ్ల విషయంలో నిరాశ ఎదురైంది. -మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అన్యాయం సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎంతో ఆశగా ఎదురుచూసినా, ఆ ఆశ నిరాశగానే మిగిలింది. కొత్తరైళ్లు, రైళ్ల పొడిగింపు, ప్రాజెక్టుల విషయంలో మొండిచేయి చూపడం దారుణం. ఈ తరహా బడ్జెట్ను గతంలో ఎన్నడూ చూడలేదు. -టి.సుబ్బిరామిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు రైల్వేజోన్ ప్రకటించకపోవడం అన్యాయం రాష్ట్రం విడిపోయిన దగ్గరనుంచి ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న రైల్వే జోన్ను బడ్జెట్లో ప్రకటించకపోవడం అన్యాయం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం, రాష్ట్రం విడదీసినప్పుడు ఇచ్చిన హామీ మేరకు వెంటనే విశాఖను జోన్గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలి -మంత్రి రాజశేఖర్, ఐఎన్టీయుసీ జిల్లా అధ్యక్షుడు భగ్గుమన్న ఆందోళనలు తాటిచెట్లపాలెం : రైల్వేబడ్జెట్లో విశాఖ రైల్వేజోన్ ప్రతిపాదన అంశానికి కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపడంపై వామపక్షపార్టీలు ఆందోళనకు దిగాయి. ఈ మేరకు గురువారం విశాఖ రైల్వేస్టేషన్లో సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారతీరుకి వ్యతిరేకంగా నినాదాలు చేసి, నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.జె.స్టాలిన్ మాట్లాడుతూ ఏపీ పునర్విభజన బిల్లులో పొందుపర్చిన ఏ హామీలనూ కేంద్రప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. రైల్వే బడ్జెట్లో ఇదిగో..జోన్..అదిగో జోన్ అంటూ మభ్యపెట్టిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సవతితల్లి ప్రేమ ప్రతిసారీ ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్ లో కానవస్తోందని దుయ్యబట్టారు. సీపీఎం నగర కార్యదర్శి గంగారాం మాట్లాడుతూ సిగ్గులేని పాలనచేస్తూ, పరమానందయ్య శిష్యగణంతో కాలక్షేపం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం తన కొలువులో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అమాత్య గణం చేత తక్షణం రాజీనామా చేయించాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకత్రాటిపై నిల్చుని కేంద్రప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. ఈ నిరసనలో సీపీఎం నాయకులు శేఖర్, వరలక్ష్మి, మాధవి తోపాటు సీపీఐ నాయకులు విమల, రాంబాబు,మార్కండేయులు పాల్గొన్నారు. -
నిరాశే మిగిలింది నేస్తం
సురేష్ ప్రభు రైల్వేబడ్జెట్ నగరానికి నిరాశే మిగిల్చింది. హైదరాబాదు నగరానికి ఈ సారి ప్రాధాన్యత లభిస్తుందనుకున్న నగరవాసికి నిరాశే మిగిలింది. ప్రధాన రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేస్తామన్నారే కానీ.. ఆ వివరాలేవీ ప్రకటించలేదు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు కాస్త ఊరటనిచ్చింది. రాజేంద్రనగర్ ప్రజల చిరకాల వాంఛ అయిన ఎంఎంటీఎస్ పొడిగింపు అంశం ఈ బడ్జెట్లో కూడా లేదు. గురువారం రైల్వేమంత్రి ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్పై పలువురు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.. ఆ వివరాలు వారి మాటాల్లోనే.. - సికింద్రాబాద్/రాజేంద్రనగర్/పహాడీషరీష్/కాచిగూడ రైల్వే బడ్జెట్ భేష్ ఆడంబరాలు,అబద్దాలు లేకుండా కేంద్ర రైల్వే బడ్జెట్ వాస్తవానికి అద్దం పట్టింది. తెలంగాణాకు మొత్తం 569 కోట్ల ప్రాజెక్ట్లను కేటాయించారు. ఇందులో ముఖ్యంగా మల్కాజిగిరి నియోకజవర్గంలోని చర్లపల్లి టర్మినల్ విస్తరణ, అధునాతన సదుపాయాల కోసం రూ.80 కోట్లను కేటాయించటం సంతోషకరమైన అంశం. చర్లపల్లి టర్మినల్ను విస్తరిస్తే ప్రయాణీకులు రైళ్లలోనే గంటల తరబడి నిరీక్షించే అవసరం లేకుండా పోతుంది. అదే విధంగా సికింద్రాబాద్ స్టేషన్ నుండి వెళ్లే ప్రతి ఎక్స్ప్రెస్ రైలుకు అదనంగా రెండు అన్ రిజర్వుడు బోగీలను వేయాలని నిర్ణయించటం హర్షణీయం. - సీహెచ్ మల్లారెడ్డి, ఎంపీ మల్కాజిగిరి జంట నగరాలకు మొండిచేయి రైల్వే బడ్జెట్ జంట నగరాల ప్రయాణీకులను నిరాశ పరిచింది. గతంలో సికింద్రాబాద్ స్టేషన్ ఎన్డీఏ ప్రకటించిన ప్యాకేజీని పక్కన బెట్టి, కేవలం యాదాద్రికి ఎంఎంటీఎస్ లైన్, చర్లపల్లి టర్మినల్కు నిధులు తప్పితే మరేవీ లేవు. - నగేష్ ముదిరాజ్, రైల్వే సలహా సంఘం మాజీ సభ్యులు ఆమోదయోగ్యం బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉంది. టికెట్ చార్జీలను పెంచకపోగా, ప్రయాణికులకు వసతుల కల్పనలో పెద్దపీట వేశారు. రైలు ప్రయాణాల్లో భద్రత ప్రమాణాలు పెంచేందుకు, బీమా వంటి సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేయడం అభినందనీయం. బడ్జెట్లో ప్రతిపాదించిన అంశాలను త్వరగా అమలులోకి తెస్తే మంచిది. -రమేశ్, ప్రయాణికుడు వసతులు కరువు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ నిరాశ పరిచేలా ఉంది. ఎంఎంటీఎస్ రెండో దశకు అధిక ప్రాధాన్యత ఇస్తారనుకున్నాం. సికింద్రాబాద్ వంటి పెద్ద రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు కూడా ప్రాధాన్యం లభించలేదు. ప్రయాణికులకు వసతులు కరువై ఇబ్బందుల పాలవుతున్నా స్టేషన్ల ఆధునీకరణ కోసం బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం విచారకరం. -ఖాజా మోహినుద్దీన్, ప్రయాణికుడు -
సిక్కోలు ఆశలపై నీళ్లు
ఎన్నో ఆశలను రేకెత్తించిన రైల్వే బడ్జెట్ నిరుత్సాహపర్చింది. జిల్లా ప్రజల ఆశలపై నీళ్లుచల్లింది. రైల్వేపరంగా ఒక్క సమస్యకూ పరిష్కారం లభించలేదు. కనీసం జిల్లా డిమాండ్లపై కన్నెత్తయినా చూడలేదు. కొత్త రైలు కూత కూడా వినిపించలేదు. ఏళ్ల తరబడి ఎదురుచూసిన రైళ్లను పొడించనూ లేదు. ఎంతో ఊరించిన రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడం నిరుద్యోగ యువతను నీరుగార్చింది. ఈ ప్రాంతం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన నేతలు ఒక్క హామీని కూడా నెరవేర్చుకోలేకపోయారు. ప్రతిపాదనల సమర్పణకే పరిమితమయ్యారని జిల్లాప్రజానీకం నిరసిస్తోంది. సదుపాయాల విషయంలో ప్రకటించిన అంశాలు ఆచరణలో కనిపించవని గతం నిరూపించింది. అదే పునరావృతమవుతుందని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. కనీసం వెనుకబడిన జిల్లాపై కూడా కరుణ చూపకపోవడంపై నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం టౌన్: కేంద్రరేల్వేమంత్రి సురేష్ ప్రభు పార్లమెంటులో గురువారం ప్రవేశపెట్టిన రేల్వేబడ్జెట్లో ఉత్తరాంధ్రకు మరోసారి మొండిచేయి చూపారు. విశాఖ రేల్వేజోన్ ఊసేలేకుండా కొత్తబడ్జెట్ను ప్రవేశపెట్టి ప్రయాణికుల ఆశలపైనీళ్లు చల్లారు. దీనికి తోడు శ్రీకాకుళం జిల్లాకు ఈసారి కొత్తగా ఎటువంటి మంజూర్లు తీసుకురాలేకపో యారు. కేంద్రమంత్రిగా అశోక్గజపతిరా జు, ఎంపీలుగా కింజరాపు రామ్మోహననాయు డు, కొత్తపల్లి గీతలు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ జిల్లాలో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కొత్తగా ఏ ఒక్క ప్రాజెక్టును సాధించుకోలేక పోయారు. విశాఖ జోన్ ఏర్పాటైతే కొత్తగా 6 వేలమందికి ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశ మిగిలింది. జిల్లాలను ఉత్తరాది రాష్ట్రాల్లో కలపడం వల్ల ఇక్కడున్న నిరుద్యోగులకు అవకాశాలు రాకుండా పోయాయి. ఉత్తరాది యువకులకు జిల్లా వ్యాప్తంగా గ్యాంగ్ మెన్లు, ట్రాక్మెన్లు, గేట్మెన్లుగా నియమించుకున్నారు. ఈప్రాంతంలో పెద్దసంఖ్యలో వారే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక స్టేషన్ మాస్టరు, టీటీ, రేల్వేకానిస్టేబుళ్లు అంతా వారే పనిచేస్తున్నారు. కొత్తజోన్ వస్తే ఆ అవకాశాలన్నీ తెలుగువారికే దక్కుతాయని ఆశపడ్డా రేల్వే మంత్రి నెరవేర్చలేదు. కొత్త రైళ్ల జాడే లేదు... ఉత్తరాది రాష్ట్రాలను కలుపుతూ కొత్తరైళ్లకు ఈ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. నౌపడా- రాయఘడ్ మార్గాన్ని కలిపేందుకు పర్లాకిమిడినుంచి కొత్తలైన్ మార్గం ఏర్పాటుకు కేటాయింపులు జరగలేదు. జి.సిగడాం నుంచి రాజాం మీదుగా విజయనగరంకు రైలు మార్గం ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. జిల్లాలో కొత్త రేల్వేహాల్ట్లు ఇవ్వలేదు. కేవలం రేల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు, ఎల్సీడీ టీవీలు ఏర్పాటుకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. పలాస, బెండిగేటు, పొందూరు రేల్వే క్రాసింగ్ల వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ల పనులు పూర్తిచేసేందుకు మాత్రమే నిధులు కేటాయించారు. రేల్వేస్టేషన్ల ఆధునీకరణ ఊసేలేదు. కొత్తరైళ్ల మంజూరు లేనట్టే.. జిల్లా మీదుగా ప్రయాణించేందుకు పాతరైళ్లు మినహా కొత్తరైళ్లు ఈ బడ్జెట్లో కేటాయించలేదు. పాతవాటికి హాల్ట్లైనా మంజూరవుతాయని ఆశపడ్డ ప్రయాణికులకు నిరాశే మిగిలింది. రైళ్ల వేగం పెంచుతామని మంత్రి ప్రకటించినప్పటికి ఏఏ రైళ్లు వేగం పెరుగుతాయో అందులో పొందుపరచలేదు. కొత్తగా లైన్ల ఏర్పాటు లేకుండా వేగం పెంచడానికి ఎలా వీలౌతుందని రేల్వే ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. -
కొత్త రైళ్లు నిల్
కొత్త రైళ్లకు రెడ్సిగ్నల్ మూడు ప్రాజెక్టులతో సరి ఉమ్మడి ప్రాజెక్టులకే గ్రీన్సిగ్నల్ స్పష్టతలేని రైల్వేస్టేషన్ల అభివృద్ధి రూ.330 కోట్లతో యాదాద్రికి ఎంఎంటీఎస్ చర్లపల్లి, నాగులపల్లిలో రైల్వేటర్మినళ్లు సిటీబ్యూరో: రైల్వే బడ్జెట్ ఊరించి ఉసూరుమనిపించింది. మరోసారి నిరాశే మిగిలింది. ముచ్చటగా మూడు అరకొర ప్రాజెక్టులు తప్ప నగరానికి పెద్దగా ఒరిగింది శూన్యం. సికింద్రాబాద్ నుంచి జహీరాబాద్ తప్ప కొత్త లైన్ల ఊసే లేదు. సురేష్ ప్రభు బడ్జెట్ రైలు నగరంలో ఆగీ ఆగకుండానే పరుగులు పెట్టింది. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. కానీ నిధుల కేటాయింపు లేదు. ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే అంశంలోనూ స్పష్టత లేదు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయనున్నట్లు గతంలో చేసిన ప్రతిపాదన అటకెక్కింది. వరల్క్లాస్ స్టేషన్ స్థాయిని కాస్తా ప్రస్తుతం ఏ-1 కు హోదాకు పరిమితం చేశారు. మొత్తంగా రూ.330 కోట్లతో యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపు, రూ.80 కోట్లతో చర్లపల్లిలో 4వ రైల్వే టర్మినల్, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో వట్టి నాగులపల్లిలో 5వ రైల్వే టర్మినల్ ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో నగరానికి లభించాయి. ఈ మూడు ప్రాజెక్టుల్లోనూ దక్షిణమధ్య రైల్వే, రాష్ర్టప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో పనులు చేపడుతారు. అయ్యే ఖర్చులో రాష్ర్టం వాటాగా 51 శాతం, రైల్వే వాటాగా 49 శాతం చొప్పున భరిస్తాయి. మొత్తంగా రైల్వే బడ్జెట్ ఈసారి ఒకింత ఆశ..మరింత నిరాశనే మిగిల్చింది. యాదాద్రికి ఎంఎంటీఎస్... లక్షలాది మంది సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్ పరుగులు తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఈ ప్రాజెక్టుకు రైల్వేశాఖ కూడా ప్రాధాన్యతనిచ్చింది. సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వరకు చేపట్టిన రెండో దశ ఎంఎంటీఎస్ పనులు సాగుతుండగా... ఇప్పుడు మూడో దశ కింద ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 34 కిలోమీటర్ల వరకు రైల్వేలైన్లను పొడిగించి విద్యుదీకరిస్తారు. రూ.330 కోట్లతో చేపట్టనున్న ఈ పనుల్లో రాష్ర్టప్రభుత్వం తన వంతు వాటాగా 51 శాతం నిధులను సమకూర్చనుంది. ఈ ఆర్థిక సంవత్సరం పనులు ప్రారంభించి వచ్చే రెండు, మూడేళ్లలో దీనిని పూర్తి చే స్తారు. నగరంలోని ఆరు మార్గాల్లో చేపట్టిన రెండో దశ ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. రెండో దశ పూర్తయిన అనంతరం మూడోదశ కింద యాదాద్రికి ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తారు. దీంతో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్లే భక్తులు సికింద్రాబాద్ నుంచి నేరుగా రాయగిరి వరకు వెళ్లవచ్చు. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల వరకు రోడ్డు మార్గంలో యాదాద్రికి వెళ్లవ లసి ఉంటుంది. నగరం నుంచి నేరుగా యాదగిరిగుట్టకు వెళ్లే రైల్వే సదుపాయం అందుబాటులోకి రావడంతో ఈ మార్గంలో వ్యాపార కార్యకలాపాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి మహర్దశ పట్టనుంది. ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కోరడంతో రైల్వేశాఖ ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిచ్చింది. ఎంఎంటీఎస్ పొడిగింపునకు అయ్యే ఖర్చులో రాష్ర్టం తన వంతు వాటాను భరిస్తుందని సీఎం స్పష్టం చేయడంతో రైల్వేశాఖ తన వంతు వాటాను కూడా అందజేసి ఎంఎంటీఎస్ను పొడిగించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఎంఎంటీఎస్ ప్రస్తానం ఇదీ... 2003లో ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టారు. సికింద్రాబాద్-లింగంపల్లి, ఫలక్నుమా-లింగంపల్లి, నాంపల్లి-ఫలక్నుమా, తదితర మార్గాల్లో లోకల్ రైలు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. {పస్తుతం ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. లక్షా 40 వేల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు.హైదరాబాద్ నగర శివార్లను కలుపుతూ 2013లో ఎంఎంటీఎస్ రెండో దశను ప్రారంభించారు. సికింద్రాబాద్-ఘట్కేసర్, మౌలాలి-సనత్నగర్, పటాన్చెరు-తెల్లాపూర్, ఫలక్నుమా-ఉందానగర్ తదితర మార్గాల్లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు జరుగుతున్నాయి.ఉందానగర్-శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రెండో దశలో పొడిగించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ విమానాశ్రయంలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి జీఎమ్మార్ నిరాకరించడంతో ప్రస్తుతానికి ఆ లైన్ నిర్మాణం వాయిదా పడింది. తగ్గనున్న భారం... ప్రతి రోజు సుమారు 250కి పైగా రైళ్లు నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 4 లక్షల మంది నిత్యం ఈ స్టేషన్లను సందర్శిస్తున్నారు. దీంతో ఈ మూడింటిపైన ఒత్తిడి బాగా పెరిగింది. ఔటర్ రింగురోడ్డుకు అందుబాటులో ఉన్న చర్లపల్లిలో రైల్వే టర్మినల్ ఏర్పాటు చేయడం వల్ల విజయవాడ , కాజీపేట్ మీదుగా వచ్చేరైళ్లను చర్లపల్లిలో నిలుపుతారు. ఎఫ్సీఐ, ఎన్ఎఫ్సీ, హెచ్పీసీఎల్, ఐఓసీ వంటి భారీ పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో ఉండడం రవాణా రంగం అభివృద్ధికి విస్తృత అవకాశంగా రైల్వే భావించింది. ప్రస్తుతం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లలో కనీసం 150 రైళ్లను చర్లపల్లి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఢిల్లీ, ముంబయి, విజయవాడ, విశాఖ, తిరుపతి, చెన్నై తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది. స్టేషన్ల అభివృద్ధికి నిధులే లేవు... దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్ల రీ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా నగరంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా ప్రకటించారు. కానీ ఇందుకోసం ఎలాంటి నిధు లు కేటాయించలేదు. 2010లో ప్రతిపాదించిన సికిం ద్రాబాద్ వరల్డ్క్లాస్ అంశాన్ని పక్కన పెట్టి రీ డెవలప్మెంట్ పేరుతో ఏ తరహా అభివృద్ధి చేస్తారనే అం శంలో స్పష్టత లేదు. నాంపల్లి రైల్వేస్టేషన్లో లిఫ్టులు, ఎస్కలేటర్ల ఏర్పాటు అంశాన్ని పక్కన పెట్టేశారు. కొత్త రైళ్ల ఊసే లేదు... {పయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి పలు మార్గాల్లో కొత్త రైళ్లను నడపాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. మరోవైపు గతంలో ప్రకటించిన రైళ్ల ప్రస్తావన కూడా లేకుండానే ఈ బడ్జెట్ నగర ప్రయాణికులను నిరాశకు గురి చేసింది.సికింద్రాబాద్ నుంచి షిరిడీకి వెళ్లేందుకు ప్రస్తుతం మన్మాడ్ వరకు అజంతా ఎక్స్ప్రెస్ ఒక్కటే ఉంది. సికింద్రాబాద్ నుంచి సాయినగర్ వరకు నేరుగా వెళ్లేందుకు మరో రైలు నడపాలనే ప్రతిపాదకు మోక్షం లభించలేదు.కాచిగూడ నుంచి బెంగళూర్కు ప్రస్తుతం రెండు రైళ్లే అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో 2 కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన సైతం పట్టించుకోలేదు.హైదరాబాద్-గుల్బర్గా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ప్రస్తావన లేదు. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ ప్రీమియం ట్రైన్ ఊసు లేదు. చర్లపల్లిలో భారీ రైల్వే టర్మినల్.. చర్లపల్లి వద్ద భారీ రైల్వే టర్మినల్ మరో అతిపెద్ద ప్రాజెక్టు. సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు కోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.80 కోట్లు కేటాయించారు. మొదట 5 ప్లాట్ఫామ్లతో ప్రారంభించి దశలవారీగా 10 నుంచి 15 ప్లాట్ఫామ్ల వరకు అభివృద్ధి చేస్తారు. వీటిలో రైళ్లను శుభ్రం చేసేందుకు పిట్లైన్లు కూడా ఉంటాయి. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో రాష్ర్టం తన వంతు వాటాను భరిస్తుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లపై పెరుగుతున్న ఒత్తిడి, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి, వట్టినాగులపల్లిలో రైల్వే టర్మినళ్లు నిర్మించాలని చాలాకాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్ల తరువాత నగరంలో ఇది 4వ అతిపెద్ద రైల్వే టర్మినల్ కానుంది. 5వ టర్మినల్గా వట్టినాగులపల్లిలో 250 ఎకరాల్లో పీపీపీ మోడల్లో నిర్మిస్తారు. -
వృద్ధికి రైలు కూత...
కొత్త ఫ్రైట్ కారిడార్లతో తగ్గనున్న రవాణా వ్యయం రూ.1.84 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యం సవాలే... రైల్వే బడ్జెట్పై పారిశ్రామిక వర్గాల స్పందన... న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్.. ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేవిధంగా ఉందని కార్పొరేట్ ఇండియా అభిప్రాయపడింది. 2019కల్లా ఏర్పాటు కానున్న మూడు కొత్త ఫ్రైట్ కారిడార్ల(సరుకు రవాణా)తో రవాణా వ్యయం గణనీయంగా తగ్గుముఖం పడుతుందని పారిశ్రామిక ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే, రూ.1.84 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యం గట్టి సవాలేనని వ్యాఖ్యానించారు. గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో అటు ప్రయాణికుల చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీలను కూడా పెంచలేదు. కొత్తగా మూడు సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రకటించడంతో పాటు నార్త్-సౌత్(ఢిల్లీ-చెన్నై), ఈస్ట్-వెస్ట్(ఖరగ్పూర్-ముంబై), ఈస్ట్కోస్ట్(ఖరగ్పూర్-విజయవాడ).. ఈ మూడు కొత్త ఫ్రైట్ కారిడార్లను 2019 కల్లా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. ‘వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1.84 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యం చాలా ఎక్కువ. జీడీపీ వృద్ధికి ఆటంకాలు, ఇతరత్రా అంశాలను చూస్తే.. ఈ లక్ష్యం పెద్ద సవాలే. పే కమిషన్ సిఫార్సుల ప్రభావం రైల్వేలపై రూ.30 వేల కోట్ల వరకూ పడుతుంది. అయినప్పటికీ 92% నిర్వహణ పనితీరును సాధించాలన్న లక్ష్యం సవాలుతో కూడుకున్నదే. 2019 కల్లా కొత్త ఫ్రైట్ కారిడార్లను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యం గొప్పదే కానీ, అనేక సవాళ్లు ఉన్నాయి’ అని ఎల్అండ్టీ సీఈఓ(రైల్వే బిజినెస్) రాజీవ్ జ్యోతి పేర్కొన్నారు. పోర్టు కనెక్టివిటీ పెంపుపై ఎగుమతిదారుల హర్షం పోర్టులతో మరింత అనుసంధానం అయ్యేవిధంగా రైల్వే నెట్వర్క్ పెంచేందుకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారని ఎగుమతిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇది ట్రేడర్లకు ఉపయోగకరంగా నిలుస్తుందని చెప్పారు. రైల్వే లైన్లకు అనుసంధానంగా గిడ్డంగుల ఏర్పాటు ప్రతిపాదనల వల్ల ఫ్రైట్ టెర్మినళ్ల వద్ద ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో కోల్డ్ స్టోరేజీల అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుందని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య(ఫియో) పేర్కొంది. రైల్వేలకు పోర్టులతో కనెక్టివిటీ పెంపువల్ల ఎగుమతి, దిగుమతిదారులకు వ్యయాలు తగ్గేందుకు దోహదం చేస్తుందని, తద్వారా వ్యాపారాలకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి(ఈఈపీసీ) వ్యాఖ్యానించింది. అదేవిధంగా లాజిస్టిక్ పార్కులు, గిడ్డంగులను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం కూడా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఈఈపీసీ ఇండియా చైర్మన్ టీఎస్ భాసిన్ పేర్కొన్నారు. ఫ్రైట్ కారిడార్లు, స్టేషన్ల అభివృద్ధితో రియల్టీకి బూస్ట్ ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లు, 400 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడానికి వీలుగా బడ్జెట్లో ప్రతిపాదించడాన్ని రియల్ ఎస్టేట్ రంగం స్వాగతించింది. దీనివల్ల రియల్టీ మార్కెట్కు చేయూత లభిస్తుందని ప్రాపర్టీ కన్సల్టెంట్లు పేర్కొన్నారు. అయితే, వీటికి నిధులు సమకూర్చడం, నిర్దిష్ట కాలవ్యవధిలో ప్రాజెక్టులను పూర్తిచేయడం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. ‘400 స్టేషన్లను పీపీపీ విధానంలో ఆధునీకరించనుండటం వల్ల దేశవ్యాప్తంగా స్టేషన్ల పరిధిలో రియల్టీ అభివృద్ధికి వీలు కలుగుతుంది. పెద్ద నగరాల్లో రైల్వే శాఖకు ఉన్న భారీ స్థలాలను వాణిజ్యపరంగా ఉపయోగించుకోవచ్చు’ అని జేఎల్ఎల్ ఇండియా చైర్మన్, కంట్రీ హెడ్ అనుజ్ పురి పేర్కొన్నారు. సాహసోపేతమైన ముందుచూపు.. ప్రధానంగా ప్రాజెక్టుల పూర్తి, అమలుపై బడ్జెట్లో అత్యధికంగా దృష్టిపెట్టడం మంచి పరిణామం. కొత్తగా మూడు రైల్వే ఫ్రైట్ కారిడార్ల ఏర్పాటుతో రవాణా వ్యయాలు తగ్గేందుకు దోహదం చేస్తుంది. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, భద్రతపై దృష్టిపెడుతూ సాహసోపేతమైన ముందుచూపుతో రూపొందించిన బడ్జెట్ ఇది. వృద్ధికి ఊతమిస్తూ.. పారిశ్రామిక రంగానికి అనేక అవకాశాలను కల్పించారు. - సుమిత్ మజుందార్, సీఐఐ ప్రెసిడెంట్ ప్రైవేటు రంగాన్ని ఆకర్షిస్తుంది... సరుకు రవాణా పాలసీని హేతుబద్ధీకరించడం, పీపీపీ విధానాన్ని సమీక్షిస్తామని రైల్వే శాఖ మంత్రి పేర్కొన్న నేపథ్యంలో.. ఈ రంగంలో పెట్టుబడులకు ప్రైవేటు కంపెనీలను ఆకర్షించేలా చేస్తుంది. దీనివల్ల రైల్వే రవాణా మెరుగుపడటంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లు, పోర్టులతో అనుసంధాన్ని మరింత పెంచడం వంటివాటిపై దృష్టిపెట్టడం ఆహ్వానించదగిన విషయం. ఇది అత్యంత ఆచరణాత్మక బడ్జెట్. ముఖ్యంగా దేశ ఆర్థికాభివృద్ధికి రైల్వేలను వెన్నెముకగా మార్చాలన్న లక్ష్యం అత్యంత ప్రధానమైనది. అధునాతన రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్ బాటలు వేసింది. - హర్షవర్ధన్ న్యోతియా, ఫిక్కీ ప్రెసిడెంట్ ఆర్థికపరమైన సవాళ్లు ఉన్నా... పెట్టుబడి వ్యయాల విషయంలో రాజీపడకుండా... చార్జీల పెంపు కూడా లేకుండా రైల్వే శాఖ మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రయాణికులు, సరుకు రవాణా రెండింటి సామర్థ్యాలనూ పెంచే విధంగా చర్యలు ఉన్నా యి. కమోడిటీ రంగాల్లో తీవ్ర మందగమనం కారణంగా ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు పొంచిఉన్నప్పటికీ రైల్వే బడ్జెట్లో వృద్ధికి చేయూతనిచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రశంసనీయం. - సునిల్ కనోరియా, అసోచామ్ ప్రెసిడెంట్ -
రైల్వే బడ్జెట్లో జిల్లాకు జీరో
రైల్వే బడ్జెట్లో ఒరిగిందేమీలేదు తాడేపల్లిగూడెం :ఊరింపులు.. నిరీక్షణలు.. చివరకు ఉసూరుమనిపించాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ జిల్లా ప్రజల ఆశలను నీరుగార్చింది. ప్రజల చిరకాల వాంఛ అయిన కోటిపల్లి-నరసాపురం, కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైన్ల నిర్మాణ ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్కు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో పేర్కొన్నా.. ఆ నిధులు సర్వే పనులకు సైతం సరిపోవు. ఈ లైన్ ప్రతిపాదనను బతికించడానికి చేసిన కేటాయింపులే తప్ప ఎందుకూ అక్కరకు రావన్న విషయం తెలిసి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. మరోవైపు జిల్లా మీదుగా కొత్త రైళ్లు నడిపే ప్రకటనలేవీ లేకపోగా.. కనీసం హాల్టులు కూడా కల్పించలేదు. ‘కోటి’పల్లి ఆశలపై నీళ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం.. ఆ పార్టీ ఎంపీ ఒకరు జిల్లాలో ఉండటం.. అభివృద్ది విషయంలో తరచూ ఢిల్లీ వెళ్లి వినతులు సమర్పించే రాష్ట దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జిల్లాలో బీజేపీ ఆశాజ్యోతిగా ఉండటంతో.. ఈసారి తప్పకుండా రైల్వే పరంగా ఎంతోకొంత ప్రయోజనం కలుగుతుందని అంతా భావించారు. అయినా.. కేంద్రమంత్రి సురేష్ప్రభు ఎప్పటిలా మన జిల్లాను చిన్నచూపు చూశారు. నరసాపురం-కోటిపల్లి రైల్వే లైన్ ఈసారి సాకారం అవుతుందని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఆశించారు. ఈ లైన్ నిర్మాణం కోసం అటు కోనసీమ, ఇటు నరసాపురంలో ఆందోళనలు సైతం జరిగాయి. కేవలం 60 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మిస్తే ఉభయ గోదావరి జిల్లాలకు ప్రయోజనం కలగటంతోపాటు అవసరమైనప్పుడు రైళ్ల దారి మళ్లింపు, దూరప్రాంత రైళ్ల పెంపు సాధ్యమవుతుంది. సుమారు రూ.3 వేల కోట్లు కేటాయిస్తే తప్ప ఆచరణకు నోచుకోని ఈ లైన్ కోసం రూ.200 కోట్లు విదిల్చి చేతులు దులిపేసుకోవడం చర్చనీయాంశమైంది. మూడో లైన్ ముచ్చట లేదు విజయవాడ నుంచి విశాఖై వెపు గల మార్గంలో రైళ్ల ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. కొత్తగా నడుపుతున్న సూపర్ ఫాస్ట్ రైళ్లకు ప్రధాన స్టేషన్లలో కూడా హాల్టు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ట్రాక్ సామర్థ్యానికి మించి రైళ్లను నడుపుతున్నామని.. ఇకపై కొత్త రైళ్లు నడపలేమని, కొత్త హాల్టులు గాని ఇవ్వలేమని రైల్వే ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మూడో లైన్ నిర్మాణమే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన రైల్వే లైన్ మీదుగా మూడో లైన్ అందుబాటులోకి వస్తుందని ఇటీవల ఏలూరులో దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం చెప్పారు. ఖాజీపేట నుంచి విజయవాడ వరకు మూడోలైన్ నిర్మాణం కోసం బడ్జెట్లో రూ.114 కోట్లను కేటాయించారు. ఇదే లైన్ను విశాఖ వరకు విస్తరించి ఉంటే జిల్లాకు ప్రయోజనం కలిగేది. -
23వేల దిగువకు సెన్సెక్స్..
‘ప్రభ’వించని రైల్వే బడ్జెట్ 7,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ స్టాక్ మార్కెట్ డేటా... టర్నోవర్ (రూ.కోట్లలో) బీఎస్ఈ 2,319 ఎన్ఎస్ఈ (ఈక్విటీ విభాగం) 18,483 ఎన్ఎస్ఈ (డెరివేటివ్స్) 5,95,640 ఎఫ్ఐఐ - 1,466 డీఐఐ 807 రైల్వే బడ్జెట్ స్టాక్ మార్కెట్ను మెప్పించలేకపోయింది. ఫిబ్రవరి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపుకు ప్రపంచ మార్కెట్ల బలహీనతలు కూడా తోడవడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 23,000, ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 113 పాయింట్లు నష్టపోయి 22,976 పాయింట్లకు, నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 6,971 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఐటీ, ఇన్ఫ్రా, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టపోగా, లోహ, ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. విదేశీ నిధులు తరలిపోతుండటంతో చైనా స్టాక్ సూచీ 6 శాతానికి పైగా క్షీణించడం, రూపాయి 30 నెలల కనిష్టానికి పతనం కావడం, ప్రతికూల ప్రభావం చూపాయి.సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. 30 నెలల కనిష్టానికి రూపాయి డాలర్తో రూపాయి మారకం గురువారం 30 నెలల కనిష్టానికి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీలనుంచి నిధులు ఉపసంహరించు కోవడం, బ్యాంక్లు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ నేపథ్యంలో రూపాయి 15 పైసలు క్షీణించి 68.72 వద్ద ముగిసింది. నెల చివర కావడంతో దిగుమతిదారులు.. ముఖ్యంగా చమురు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ బాగా ఉందని ఒక ఫారెక్స్ డీలర్ వ్యాఖ్యానించారు. ఫారెక్స్ మార్కెట్లో బుధవారం నాటి ముగింపుతో (68.57)తో పోల్చితే డాలర్తో రూపాయి మారకం గురువారం 68.47 వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. ఎస్డీఆర్ నిబంధనల సవరణ భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వ్యూహాత్మక రుణ పునర్వ్యస్థీకరణ(ఎస్డీఆర్) నిబంధనలను సవరిం చింది. బ్యాంక్లు మొత్తం రుణ విలువలో 15 శాతం వరకూ ఎస్డీఆర్లకు కేటాయింపులు జరపాలని ఆర్బీఐ ఆదేశించింది. బ్యాంకులు తనఖాగా తీసుకున్న ఈక్విటీ విలువ మరింత తగ్గకుండా ఉండేలా ఈ నిబంధనలను ఆర్బీఐ రూపొందించింది. ఎస్డీఆర్ నిబంధనలో మరింత సరళత్వం కావాలని పలువురు కోరడంతో కొత్త నిబంధనలను ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకులు ఎస్డీఆర్ ద్వారా తీసుకున్న కంపెనీల్లోని వాటాను 18 నెలలలోపు కొత్త ప్రమోటర్లకు విక్రయించరాదని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. -
పట్టాలు తప్పిన రైల్ షేర్లు
ఆకట్టుకోని రైల్వే బడ్జెట్ లాభాల్లో లాజిస్టిక్స్ షేర్లు పలు రైల్వే షేర్లకు నష్టాలు ముంబై: దలాల్ స్ట్రీట్లో సురేశ్ ప్రభు ఆధ్వర్యంలోని ట్రైన్ నంబర్ టూజీరోవన్సిక్స్(2016) పట్టాలు తప్పింది. రైల్వే షేర్లు లాభాల ప్లాట్ఫామ్పై ఆగకుండా నష్టాల పట్టాలపై పరుగులు పెట్టాయి. ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీల పెంపుకు సురేష్ ప్రభు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినప్పటికీ, స్టాక్ మార్కెట్... ప్రభు బడ్జెట్కు రెడ్ సిగ్నల్నే ఇచ్చింది. రైల్వే బడ్జెట్ నేపథ్యంలో రైల్వే షేర్లు బాగా నష్టపోయాయి. కొన్ని షేర్లు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి. రైల్వే బడ్జెట్లో మూలధన కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేవని నిపుణులంటున్నారు. రైల్వే బడ్జెట్కు ముందు ఒడిదుడుకుల్లో ట్రేడైన రైల్వే షేర్లు..సురేశ్ ప్రభు బడ్జెట్ ప్రసంగం మొదలైన తర్వాత నష్టాల బాటలో సాగాయి. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత మరింతగా క్షీణించాయి. రైల్వే మంత్రి తన పరిధి మేరకు మంచి బడ్జెట్నే అందించారని డాల్టన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎండీ యూ. ఆర్. భట్ పేర్కొన్నారు. అయితే వ్యాగన్లు తయారు చేసే కంపెనీలకు భారీ ఆర్డర్లేమీ లేవని పెదవి విరిచారు. ప్రతిపాదనలు-షేర్ల ప్రతిస్పందన 2,000 కిమీ రైల్వే లైన్ల విద్యుదీకరించాలని ప్రతిపాదించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ విద్యుదీకరణ బడ్జెట్ 50 శాతం అధికం. అయినప్పటికీ, రైల్వేల విద్యుదీకరణతో సంబంధమున్న షేర్లు మిశ్రమంగా స్పందించాయి. కేఈసీ ఇంటర్నేషనల్ 3 శాతం లాభపడి రూ.106 వద్ద ముగిసింది. సీమెన్స్, ఆల్స్టోమ్ టీ అండ్ డీ ఇండియా షేర్లు క్షీణించాయి. వ్యాగన్లు తయారు చేసే కాళింది రైల్, టెక్స్మాకో రైల్, టిటాఘర్ వ్యాగన్స్ 8-9శాతం రేంజ్లో నష్టపోయాయి.రైల్ సైట్ లాజిస్టిక్ పార్క్ల అభివృద్ధి చేస్తారన్న ప్రతిపాదన, రవాణా చార్జీలు పెంచకపోవడం, ప్రతిపాదిత కొత్త రవాణా కారిడార్ల కారణంగా రవాణా వ్యయం తగ్గడం తదితర కారణాల వల్ల లాజిస్టిక్స్ కంపెనీలైన కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గేట్ వే డిస్ట్రిపార్క్స్, అల్కార్గో లాజిస్టిక్స్ గతి, టిమ్కెన్లు మాత్రం 0.4 శాతం నుంచి 3 శాతం వరకూ పెరిగాయి. మరింత భద్రత కోసం రైల్వే స్టేషన్లలో సీసీటీవీలను ఏర్పాటు చేస్తారన్న ప్రతిపాదన కారణంగా రైల్వే సంబంధిత టెక్నాలజీ కంపెనీలు మిశ్రమంగా ముగిశాయి. మిక్ ఎలక్ట్రానిక్స్ 0.5 శాతం, జికామ్ ఎలక్ట్రానిక్స్ 6.2 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే ఇదే కేటగిరిలోని స్టోన్ ఇండియా 6 శాతం వరకూ క్షీణించింది. రైల్వే ఆర్డర్లపై ఆధారపడి కార్యకలాపాలు నిర్వహించే కంపెనీల షేర్లు క్షీణించాయి. టెక్స్మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్ 8.8 శాతం, కాళింది రైల్ నిర్మాణ్ 9.2 శాతం, టిటాఘర్ వ్యాగన్స్ 8 శాతం, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, 4.8 శాతం, హింద్ రెక్టిఫైర్స్ 7.6 శాతం, భెల్ , బీఈఎంఎల్ 4 శాతం, స్టోన్ ఇండియా 6 శాతం చొప్పున నష్టపోయాయి. వంద స్టేషన్లలో వైఫై సేవలందించనున్న ప్రతిపాదన కారణంగా డి-లింక్ ఇండియా షేర్ ఇంట్రాడేలో 12 శాతం లాభపడి రూ.140ను తాకింది, చివరకు 2 శాతం లాభంతో రూ.126 వద్ద ముగిసింది. స్మార్ట్లింక్ నెట్వర్క్ సిస్టమ్స్ 20 శాతం అప్పర్ సర్క్యూట్ తో రూ.97 వద్ద ముగిసింది. షేర్ల బై బ్యాక్ చేస్తామని కంపెనీ ప్రకటించడం కూడా ఈ కంపెనీ జోరుకు కలసి వచ్చింది -
రైల్వే బడ్జెట్ పై కవిత హర్షం
హైదరాబాద్ : గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పై ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఏడాది రైల్వే బడ్జెట్ లో మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేశారని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని అన్నారు. పెద్ద పల్లి- నిజామాబాద్ లైన్ కు నిధుల కేటాయించినందుకు సంతోషంగా ఉందని కవిత పేర్కొన్నారు. -
రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం: పొన్నం
హైదరాబాద్: రైల్వే బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ స్పందించడం లేదని విమర్శించారు. ముఖ్య మంత్రి ఫాం హౌస్ కే పరిమితయ్యారని పొన్నం ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా రాలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిధుల సాధన కోసం కేంద్రం పై ఒత్తిడి పెంచడంలో టీఆర్ఎస్ ఎంపీలు విఫలమయ్యారని పొన్నం విమర్శించారు. నిధులు రాకపోవడానికి బీజేపీ, టీఆర్ఎస్ లే కారణమన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో టీఆర్ఎస్ ఎంపీలు విఫలమయ్యారన్నారు. ఇప్పుడు పార్లమెంట్లో సహాయ నిరాకరణ చేయాలని, లేదంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
రైల్వే బడ్జెట్పై ఎవరేమన్నారంటే..
రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు లోక్సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్పై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు స్పందించారు. ఎవరేమన్నారంటే వారి మాటల్లోనే.. ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించేలా భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధికి తోడ్పడే విధంగా బడ్జెట్ను రూపొందించిన మంత్రి సురేశ్ ప్రభుకు అభినందనలు. - రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సామాన్యుడి సమస్యలను పరిగణనలోకి తీసుకుని, పన్నులు విధించకుండా, వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తూ సమర్థవంతమైన రైల్వే బడ్జెట్ను రూపొందించాం. - కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ భవిష్యత్ రైల్వే అవసరాలకు అనుగుణంగా, ప్రజాహిత రైల్వే బడ్జెట్ను రూపొందించిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు అభినందనలు. వికలాంగులు, వయోవృద్ధులు, మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారు చేశారు. గుజరాత్లోని నార్గల్, హజిరా నౌకాశ్రయాలకు రైల్వే లైన్లు నిర్మిస్తున్నందుకు కృతజ్ఞతలు. - గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని సంస్కరణలకు అనుగుణంగా రూపొందించిన రైల్వే బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్కి 10 కి 9 మార్కులేస్తా. - కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా రైల్వేలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకెళ్తున్నారు. - కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలా సమతుల్యంగా బడ్జెట్ను రూపొందించినందుకు శుభాకాంక్షలు. భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు వెన్నెముక అని బడ్జెట్ ద్వారా నిరూపించారు. - కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఈ బడ్జెట్ దేశ ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తుంది. - బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి మహిళలను దృష్టిలో పెట్టుకుని, పెట్టుబడులను ఆకర్షించే విధంగా బడ్జెట్ను రూపొందించినందుకు శుభాకాంక్షలు. - కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇది నిరుపయోగమైన బడ్జెట్. క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది కాబట్టి టికెట్ ధరలు కూడా తగ్గాలి. అంతేకానీ టికెట్ రేట్లు పెంచకుండా ఉండటం గొప్పతనం కాదు. - బిహార్ సీఎం నితీశ్ కుమార్ వాణిజ్య, సూపర్ఫాస్ట్ రైళ్లు విమానాలతో పోటీ పడతాయేమో. - జీ చైర్మన్ సుభాష్ చంద్ర ఇది సామాన్యుడి బడ్జెట్. జనని సేవ పథకం ద్వారా రైల్లో ప్రయాణించే చిన్నారులకు ఆహారం సరఫరా చేస్తున్నందుకు కృతజ్ఞతలు. ఎలాంటి చార్జీలను పెంచకుండా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు. - బీజేపీ ఎంపీ పూనం మహాజన్ ఈ బడ్జెట్ నిస్సారంగా ఉంది. ముగిసిపోయే ప్రత్యేక రైల్వే బడ్జెట్కు ఇది ఒక ఫేర్వెల్ బడ్జెట్లా ఉంది. -కాంగ్రెస్ నాయకుడు ఎమ్ సింఘ్వి ప్రభుత్వ కలను బడ్జెట్గా మలచినట్లున్నారు. బడ్జెట్లోని హామీలు ఆచరణసాధ్యం కాదు. వాటిని అమలు చేయడం అసాధ్యం. - లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే ఇది నిరుపయోగమైన బడ్జెట్. గత బడ్జెట్లో ప్రకటించిన ప్రతిపాదనల గురించిన ప్రస్తావనే లేదు. - కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలీ ఒక్క కొత్త రైలు లేదు. కనీసం రైల్వే చార్జీలన్నా తగ్గిస్తారనుకున్నాం అదీ లేదు. ఈ బడ్జెట్ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. - కాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్ శుక్లా బడ్జెట్లో ప్రజలకు హామీలు ఇచ్చారు సరే. కానీ వాటిని అమలు చేయడానికి డబ్బును ఎలా సేకరిస్తారనేది చెప్పలేదు. - రైల్వే శాఖ మాజీ మంత్రి దినేశ్ త్రివేది చాలా కొత్త ప్రకటనలు చేశారు కానీ గత బడ్జెట్లోని ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలు, వాటి అమలు తీరును మంత్రి చెప్పలేదు. - బీఎస్పీ చీఫ్ మాయావతి ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఏటా ముందుచూపుతో కూడిన బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. కానీ దానిని అమలు చేయడంలోనే పూర్తిగా విఫలం అవుతుంది. -ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సల్మాన్ అనీస్సోస్ ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్ చాలా నిరుత్సాహన్ని కలిగించింది. బడ్జెట్లో కొత్తగా చేసిందేమీ లేదు. కేవలం గత బడ్జెట్కు పేర్లు మాత్రం మార్చారు. - ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ మెహతా ఈ బడ్జెట్ నన్ను చాలా నిరాశకు గురిచేసింది. బడ్జెట్లో ఎలాంటి కొత్తదనం లేదు. పాత ప్రాజెక్టుల కొనసాగింపే కనబడుతోంది. కనీసం చార్జీల తగ్గింపైనా ఉంటుందని ఆశించాం. అది కూడా లేకుండా పోయింది. - రైల్వే శాఖ మాజీ మంత్రి పవన్ బన్సాల్ ఈ బడ్జెట్ అసలు నాకు అర్ధం కాలేదు. నేను ప్రభుజీని కలిసి బడ్జెట్ గురించి తెలుసుకోవాలి. -ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలె -
ఈసారి రైల్వే బడ్జెట్ పై
భువనేశ్వర్: 2016 సంవత్సరానికి గాను మంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ మాట ఎలా ఉన్నా.. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మాత్రం పలువురి ఆకట్టుకున్నారు. వివిధ సందర్భాలలో సైకత శిల్పాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆయన మరోసారి తన నైపుణ్యానికి పని చెప్పారు. సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్పై ఇసుకతో చక్కటి శిల్పాన్ని తయారుచేశారు. ఒడిశాలో పూరీ సముద్రతీరంలో పట్టాలు, రైలును ఇసుకతో చెక్కారు. దాని పక్కన ఇండియన్ లైఫ్ లైన్ బడ్జెట్ 2016 అని క్యాప్షన్ రాశారు. అనంతరం దీన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సమాజంలో ఆయా పరిస్థితులకు, పరిణామాలకు సందర్భోచితంగా విలక్షణ శైలిలో సైకత శిల్పాలను రూపొందించడం సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేకత. ఇటీవల మంచుపర్వతాల్లో చిక్కుకున్న హనుమంతప్ప కోమాలోకి వెళ్లిన సందర్భంలో త్వరగా కోలుకోవాలంటూ తన సైకత శిల్పం ద్వారా ఆకాక్షించి పలువురి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. -
ప్రభుకు ప్రధాని మోదీ అభినందన
న్యూఢిల్లీ: రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. రైల్వే మంత్రిని, రైల్వే శాఖ సిబ్బందిని మోదీ అభినందించారు. 'గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లను విమర్శించదలచుకోలేదు. ఈ బడ్జెట్ వ్యయం రెండున్నర రెట్లు పెరిగింది. దేశ పురోభివృద్ధికి దోహదపడుతుంది. దేశాభివృద్ధిలో దీర్ఘకాలం ప్రభావం చూపుతుంది. ఛార్జీలు పెంచకుండా ప్రయాణికులకు ఊరట కలిగించారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా పురోగతి కనిపించింది. ఈ బడ్జెట్ వల్ల మరింత అభివృద్ధి జరుగుతుంది. దేశాభివృద్ధిలో రైల్వే బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుంది' అని మోదీ ట్వీట్ చేశారు. -
కొవ్వూరుకు ‘లైన్’ పడేనా?
♦ బ్రిటీష్ కాలంనాటి రైల్వేట్రాక్లే దిక్కు ♦ ఫలించని ఏళ్ల పోరాటం ♦ రైల్వే బడ్జెట్పై జిల్లావాసుల గంపెడాశలు.. కొత్తగూడెం : స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలైంది. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి లభించింది. కానీ, బ్రిటీష్వారు వేసిన రైల్వే లైన్లే ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. అరవై ఏళ్లుగా మన పాలకులు దేశంలో రైల్వే లైన్లు వేసినవి కొన్నే. కొత్తగూడెం నుంచి కొవ్వూరుకు రైల్వే లైన్ వేయాలని చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతోంది. ఏ ఒక్క ప్రభుత్వం పైసా ఇవ్వకపోవడంతో కొత్త ట్రాక్ల ఊసేలేదు. భద్రాచలం రోడ్-కొవ్వూరు లైన్, సత్తుపల్లి-కొత్తగూడెం లైన్, పాండురంగాపురం-సారపాక లైన్లు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం ఉన్న రైల్వేలైన్ల ద్వారా కోట్లాది రూపాయల మేరకు ఆదాయం వస్తునప్పటికీ కొత్తలైన్లను నిర్మించడానికి, వాటిని అభివృద్ధి చేయడానికి ఇప్పటి వరకు పాలించిన కేంద్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయలేదు. సింగరేణి బొగ్గు సరఫరాపైనే ఎక్కువగా జిల్లా నుంచి రైల్వే శాఖకు ప్రతి ఏటా రూ.800 కోట్ల మేరకు ఆదాయం లభిస్తోంది. దీంతోపాటు పర్యావరణశాఖ బొగ్గు రవాణా కేవలం రైల్వే ద్వారానే చేయాలని, రోడ్డు మార్గం ద్వారా చేయవద్దని నిబంధనలు విధించింది. ఈ నేపథ్యంలో సత్తుపల్లి-కొత్తగూడేనికి కొత్త మార్గం ఏర్పాటు చేసేందుకు సింగరేణి సంస్థ ముందుకు వచ్చినప్పటికీ భూ సేకరణ విషయం జఠిలంగా మారడంతో ఇప్పుడు అదికాస్తా పెండింగ్లోనే ఉంది. సర్వేకే పరిమితం భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు వరకు రైల్వేలైన్ నిర్మాణం చేపట్టాలని ఐదు దశాబ్దాలుగా ప్రజలు కోరుతు న్నా ఫలితం లేదు. ఏటా బడ్జెట్లో కొవ్వూరు లైన్ సర్వేలకు మాత్రమే పరిమితమవుతోంది. ఈ రైల్వేలైన్ నిర్మిస్తే హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లేందుకు 149 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీంతోపాటు జిల్లాలో ఉత్పత్తి అయిన బొగ్గును విశాఖపట్నం తదితర ప్రాంతాలకు రవాణా చేయొచ్చు. సుమారు 150 గిరిజన గ్రామాలకు రైలుమార్గం అందుతుంది. 1969 నుంచి కొవ్వూరు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 2012లో కొవ్వూరు లైన్ను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ నాలుగు బడ్జెట్ సమావేశాలు ముగిసినా ఇప్పటికీ రూపాయి కూడా విడుదల కాలేదు. పెరిగిన సత్తుపల్లి లైన్ వ్యయం.. సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీ, కిష్టాపురం ఓసీపీల ద్వారా ఏటా 2 మిలియన్ టన్నుల మేరకు బొగ్గు సరఫరా చేస్తోంది. పర్యావరణశాఖ నిబంధనల నేపథ్యంలో కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 60 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్న లైన్కు సింగరేణి సంస్థ నిధులు విడుదల చేసేందుకు ముందుకు వచ్చింది. ఫైనల్ సర్వే పూర్తి చేసేందుకు గాను రెండేళ్ల క్రితమే రూ.6 కోట్లు రైల్వే శాఖకు అందించగా సర్వే కూడా పూర్తయింది. రెండేళ్ల క్రితం కేవలం రూ.337.5 కోట్ల మేరకు అంచనా వేసినప్పటికీ జాప్యం కారణంగా సుమారు రూ.900 కోట్ల మేర వ్యయానికి చేరుకుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెండింగ్లోనే ప్రాజెక్టులు.. భద్రాచలం పుణ్యక్షేత్రానికి రైలుమార్గం నిర్మించేందుకు పాండురంగాపురం నుంచి సారపాక వరకు ఏర్పాటు చేయతలపెట్టిన లైన్ కేవలం కాగితాలకే పరిమితమైంది. సింగరేణి సంస్థ ఏర్పాటు చేయనున్న కోల్ కారిడార్లో భాగంగా మణుగూరు-రామగుండం లైన్, సత్తుపల్లి లైన్ పూర్తయితే దానిని అనుసంధానం చేసుకుని కొండపల్లి నుంచి కొత్తగూడెం వరకు రైల్వే లైన్ను నిర్మించే అవకాశాలున్నాయి. గురువారం కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కొత్తగూడెం-కొవ్వూరు, కొత్తగూడెం-సత్తుపల్లి, పాండురంగాపురం-సారపాక, మణుగూరు-రామగుండం రైల్వే లైన్ల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తారా? లేదా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. -
‘ప్రభు’ ఈసారైనా..
రైళ్ల కేటాయింపులో గుంతకల్లు డివిజన్కు ప్రతియేటా అన్యాయం ఈ సారైనా సీమ ఎంపీల ప్రయత్నాలు ఫలించేనా? నేడు రైల్వేబడ్జెట్ గుంతకల్లు :ప్రతియేటా రైల్వే బడ్జెట్లో గుంతకల్లు డివిజన్కు అన్యాయం జరుగుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గుంతకల్లు డివిజన్కు ఆదాయపరంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. అయినా రైళ్ల కేటాయింపు, పొడిగింపు, ప్రాజెక్టుల విషయంలో తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదు.రెండు దశాబ్దాలుగా రైలే ్వ మంత్రులుగా పనిచేసిన వారందరూ తమ రాష్ట్రాలకు, ప్రాంతాలకు రైళ్లను, ప్రాజెక్టులను కేటాయించుకోవడంలో సఫలీకృతులయ్యారు. డివిజన్కు న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాయలసీమ ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. నేడు రైల్వే బడ్జెట్ నిధులను రాబట్టడంలో రాయలసీమ ప్రాంత ఎంపీలు చొరవ ఏమాత్రమూ లేదన్న ఆరోపణలున్నాయి. అనంతపురం, కర్నూలు జిల్లాలను దృష్టిలో ఉంచుకుని నాటి రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి కర్నూలులో రైలుబోగీల మరమ్మతు కర్మాగారాన్ని రూ.110 కోట్లతో మంజూరు చేయించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను పూర్తి చేసి రైల్వే శాఖకు అప్పగించింది. ఈ బడ్జెట్లోనైనా ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంటులో రైల్వే శాఖా మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్లో సీమకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీలు ఢిల్లీలో గట్టిగా కోరుతున్నారు. బోర్డులో నలుగుతున్న ప్రతిపాదనలివీ.. ►పుట్టపర్తి - షిర్డీ మధ్య నూతన ఎక్స్ప్రెస్ రైలు ►హైదరాబాద్ - పుట్టపర్తి (వయా గుంతకల్లు, ధర్మవరం ) నూతన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు ►కడప - షిరిడీ మధ్య నూతన ఎక్స్ప్రెస్ రైలు ►అమరావతి రాజధాని దృష్ట్యా ధర్మవరం-గుంతకల్లు-విజయవాడ మార్గంలో మరో రెండు ఎక్స్ప్రెస్, రెండు ప్యాసింజర్ ైరె ళ్లు ►అనంతపురం-విశాఖపట్నం, గుంతకల్లు-ధర్మవరం-తిరుపతి మధ్య ఎక్స్ప్రెస్ రైలు ►గుంతకల్లు-హైదరాబాద్ మధ్య పగటి పూట ఎక్స్ప్రెస్ రైలు రైళ్ల పొడిగింపు ప్రతిపాదనలు సికింద్రాబాద్ - కర్నూలు మధ్య నడుస్తున్న తుంగభద్ర ఎక్స్ప్రెస్ను గుంతకల్లు లేదా మంత్రాలయం నిలయం వరకు పొడిగింపు కాచిగూడ - గుంటూరు - కాచిగూడ ప్యాసింజర్ను ఫాస్ట్ ప్యాసింజర్గా మార్పు అత్యంత కీలకమైన డబ్లింగ్ మార్గాల ప్రతిపాదన గుంతకల్లు డివిజన్లోని డోన్-పెండేకల్లు, కల్లూరు-ధర్మవరం అత్యవసర డబ్లింగ్ మార్గాలు. ఈ మార్గాల గుండా రైళ్ల రద్దీ అధికం. ఈ పనులు పూర్తి చేస్తే రైళ్ల క్రాసింగ్ సమస్య తీరుతుంది.నత్తనడకన డబ్లింగ్ పనులుగుంతకల్లు-కల్లూరు వయా గూళ్యపాళ్యం, కల్లూరు-ధర్మవరం మధ్య డబ్లింగ్ పనులకు రూ.50 కోట్లు కేటాయించారు. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి.గుంటూరు-గుంతకల్లు డబుల్లైన్ పనులకు రూ.1,400 కోట్లు అవసరమని రైల్వేబోర్డు నివేదికలు తయారు చేసింది. ఈ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాల్సి ఉంది. ►ధర్మవరం-పాకాల మధ్య డబ్లింగ్ పనులకు రూ.10 కోట్లు కేటాయించినా సర్వేలో జాప్యం . ►హోస్పేట-గుంతకల్లు మధ్య డబ్లింగ్ పనులు నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి. ►రేణిగుంట-తిరుపతి మధ్య డబ్లింగ్ పనులకు రూ.1.10 కోట్లు కేటాయించారు. ► రాయచూర్-గుంతకల్లు మార్గంలో పెండింగ్లో ఉన్న 13 కి.మీల డబ్లింగ్ పనులకు రూ.6 కోట్లు కేటాయించారు. -
కరుణించవా...ప్రభూ!
జిల్లాలో కలగానే రైల్వే సేవలుఅసంపూర్తిగా పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ సర్వేలకే పరిమితమైనకొత్తలైన్ల నిర్మాణం ఎంపీల ప్రతిపాదనలకుమోక్షం కలిగేనా? నేడు రైల్వే బడ్జెట్ రైల్వేపరంగా జిల్లా వెనుకబాటు వీడడం లేదు. ఏళ్లు గడుస్తున్నా జిల్లా ప్రజలకు పూర్తిస్థాయి రైల్వే సేవలు కలగానే మిగిలాయి. ఏటా రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో గంపెడాశలు పెట్టుకోవడం, తీరా జిల్లాకు సంబంధించిన అంశాలు లేకపోవడంతో నిరాశ చెందడం రివాజుగా మారింది. అప్పుడప్పుడు అరకొరగా నిధులు విదిల్చుతున్నా, ఏ మూలకు సరిపోవడం లేదు. నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైను పూర్తికాకుండా వెక్కిరిస్తోంది. కొత్తగా ప్రతిపాదించిన కొత్తపల్లి-మనోహరబాద్ రైల్వే లైను కాగితాలు దాటడం లేదు. కరీంనగర్ -హుస్నాబాద్- హైదరాబాద్ ప్రతిపాదనైతే కనీసం కాగితాలకు కూడా ఎక్కలేదు. గురువారం రైల్వేశాఖ మంత్రి సురేశ్ప్రభు రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతుండగా, ఈ బడ్జెట్లోనైనా ప్రభు కనికరం చూపుతారేమోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ రైల్వే లైన్ పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ లైను ఇంకా కొనసాగుతూనే ఉంది. శ్రద్ధ చూపి సరిపడా నిధులు కేటాయిస్తే సంవత్సరాల క్రితమే పూర్తయ్యేది. 178 కిలోమీటర్ల దూరం కాగా, చచ్చీచెడీ 150 కిలోమీటర్లు పూర్తి చేయగలిగారు. పాలకుల అలక్ష్యం ఫలితంగా ఇంకా 28 కిలోమీటర్ల మేర దూరం మిగిలే ఉంది. ఇది కూడా పూర్తి చేస్తే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు లింక్ ఏర్పడుతుంది. గత బడ్జెట్లో ఈ రైలుమార్గానికి కేంద్రప్రభుత్వం రూ.141 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయిస్తే వచ్చే సెప్టెంబర్ కల్లా కరీంనగర్-నిజామాబాద్ నడుమ రైళ్లు తిరుగుతాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కాగితాలు దాటని కొత్తపల్లి-మనోహరాబాద్ అప్పటి కరీంనగర్ ఎంపీ, ప్రస్తుత సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు వెళ్లేలా 2004లో ప్రతిపాదించిన కొత్తపల్లి-మనోహరాబాద్ రైలు మార్గం కాగితాలను దాటడం లేదు. ఎంపీ వినోద్కుమార్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కాస్త కదిలిన కేంద్ర ప్రభుత్వం భూసేకరణ, ఐదేళ్లపాటు నిర్వహణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ షరతు విధించింది. రూ.వెయ్యి కోట్ల వ్యయంతో పూర్తయ్యే ఈ మార్గానికి ఇప్పటివరకు మంజూరైన రూ.20 కోట్లతో సీఈ కార్యాలయం, మానవ వనరుల లభ్యత తదితర మౌలిక వసతులకు ఖర్చుచేయాలని ఆదేశాలున్నా, ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. మంత్రులైనా ఆగాల్సిందే... ఉప్పల్, బిజిగిరి షరీఫ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంపీల ప్రతిపాదనల మేరకు గత బడ్జెట్లో ఉప్పల్ వంతెనకు రూ.53.64 కోట్లు, బిజిగిరి షరీఫ్కు రూ.50.01 కోట్లు కేటాయించినప్పటికీ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో రైలు వ స్తుందంటే చాలు హుజూరాబాద్-జమ్మికుంట మార్గంలోని ఉప్పల్ గేటు వద్ద గంటలకొద్ది ప్రయాణికులు పడిగాపులు పడాల్సిన దుస్థితి. చివరకు మంత్రులకు సైతం ఇదే పరిస్థితి ఎన్నోసార్లు ఏర్పడుతోంది. కరీంనగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని కరీంనగర్-రాయపట్నం రహదారిలో సైతం ఇదే పరిస్ధితి. ఫ్లైఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి ఇంకా అవసరమైన నిధులు కేటాయించడంతోపాటు పనులు త్వరగా పూర్తి చేస్తే తప్ప ఈ బాధ నుంచి ఆ ప్రాంత ప్రజలు విముక్తికారు. సా...గుతున్న పనులు నిధులుండి కొన్ని, సరిపడా నిధులు రాక మరికొన్ని ప్రతిపాదిత రైల్వే పనులు సా...గుతున్నాయి. పెద్దంపేట-మంచిర్యాల మూడో లైను మార్గం కోసం రూ.58 కోట్లు కేటాయించగా పనులు ఇంకా పూర్తి కాలేదు. రాఘవాపూర్-మందమర్రి మూడో మార్గం కోసం రూ.24.90 కోట్లు మంజూరు చేయగా పనులు నడుస్తున్నాయి. రామగుండం-మణుగూరు లైన్ సర్వేకు రూ.50 లక్షలు, కరీంనగర్-హసన్పర్తి లైన్ సర్వేకు రూ.14.73 లక్షలు కేటాయించినా సర్వే మొదలు కాలేదు. మణుగూరు-భూపాల్పల్లి-కమాన్పూర్, రామగుండం కోల్ కారిడార్ రైల్వేనిర్మాణం సర్వే కోసం గత బడ్జెట్లో రూ.50 లక్షలు కేటాయించగా పనులు ప్రారంభించలేదు. రూ.1500 కోట్లు నిర్మాణ వ్యయమయ్యే ఈ లైన్కు అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు కావాల్సి ఉండడంతో రైల్వేశాఖ ముందుకురావడం లేదని సమాచారం. కరీంనగర్-తిరుపతి రైలును ప్రతీరోజు నడిపించాలనే డిమాండ్ ఆచరణకు నోచుకోవడం లేదు. రామగుండం, పెద్దపల్లి స్టేషన్లలో చెన్నై-ఢిల్లీ గరీబ్థ్నవజీవన్, జైపూర్, స్వర్ణజయం తి ఎక్స్ప్రెస్ రైళ్లను నిలపడం లేదు. రామగుండం-పెద్దపల్లి, కరీంనగర్-జగిత్యాల లైన్లో ప్యాసింజర్ రైళ్లు నడిపించాలనే ఎంపీ ల విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోవడం లేదు. ఎంపీల ప్రతిపాదనలకు మోక్షం లభించేనా? జిల్లాలో రైల్వే సేవల విస్తృతి కోసం ఎంపీలు ప్రతిపాదనలు చేస్తున్నా, అవి అమలుకు నోచుకోడం లేదు. పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి విన్నవిస్తున్నా, కేంద్ర సర్కారు కనికరించడం లేదు. ఒకటీ అరా ప్రతిపాదనలు అంగీకరిస్తున్నా, అవి కూడా అసంపూర్తిగా మిగిలిపోతున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ కోసం కరీంనగర్, పెద్దపల్లి ఎంపీలు బి.వినోద్కుమార్, బాల్క సుమన్లు ఇప్పటికే ప్రతిపాదనలు అందచేశారు. ఇందులో ఎన్ని ప్రతిపాదనలు గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో అమలుకు నోచుకొంటాయో వేచి చూడాలి. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ప్రతిపాదనలు ఇంటర్ ఎక్స్ప్రెస్లో ఏసీకోచ్ సదుపాయం కల్పించాలి. రామగిరి ప్యాసింజర్, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, కాగజన్నగర్ ఎక్స్ప్రెస్, సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్లకు అదనపు కోచ్ల సదుపాయం కల్పించాలి.తెలంగాణ ఎక్స్ప్రెస్, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్, నవజీవన్ ఎక్స్ప్రెస్, స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్, కేర ళ ఎక్స్ప్రెస్, ఎస్సీ-ఎన్జీపీ ఎక్స్ప్రెస్, జీటీ ఎక్స్ప్రెస్లను పెద్దపల్లి రైల్వేస్టేషన్లో నిలపాలి. కరీంనగర్-తిరుపతి రైలును ప్రతిరోజు నడిపేలా చర్యలు తీసుకోవాలి. పెద్దపల్లి రైల్వేస్టేషన్ కౌంటర్లో 24 గంటల రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా బల్లార్షా-విజయవాడకు ప్రత్యేక రైళ్లు నడిపించాలి. పెద్దపల్లి రైల్వేస్టేషన్లో గూడ్స్షెడ్కు మరమ్మతు చేపట్టాలి. సిమెంట్ ప్లాట్ఫాం నిర్మించాలి. కూనారం, కొలనూరు రైల్వేక్రాసింగ్ల వద్ద ఫ్లైఓవర్బ్రిడ్జీలు నిర్మించాలి. సిర్పూర్ కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు ఇంట్రాసిటీ రైలు ప్రవేశపెట్టాలి. ఉదయం 5.30కు కాగజ్నగర్లో బయలుదేరి, 9.30కు సికింద్రాబాద్ చేరుకునేలా, సాయంత్రం 5.30కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 9.30కు కాగజ్నగర్ చేరేలా ఈ రైలు నడిపించాలి. మానిక్గర్ నుంచి సికింద్రాబాద్ల నడుమ కొత్త రైలు సర్వీసు ప్రవేశపెట్టాలి.భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లో 16 కోచ్ల నుంచి 24 కోచ్లకు, కాజీపేట నాగ్పూర్ ప్యాసింజర్కు 12 నుంచి 20 కోచ్లకు పెంచాలి.ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా, రోడ్డుమార్గం వైపు మళ్లకుండా, రైల్వేకు ఆదాయం సమకూర్చుకునేందుకు రామగుండం రూట్లో సమయానుకూలంగా ప్రత్యేక రైళ్లు నడిపించాలి. ప్రయాణికులను ఆకర్షించేందుకు సింగరేణి ప్యాసింజర్లో పరిశుభ్రత ఉండాలి. మంచి కోచ్లు ఏర్పాటు చేయాలి. ఏసీ చైర్ , స్లీపర్ ఏర్పాటుచేయాలి.రామగుండం రైల్వేస్టేషన్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలి. వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం స్టేషన్లో ఎక్స్లేటర్లు ఏర్పాటు చేయాలి.అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం శబరిమలై వెళ్లేందుకు కరీంనగర్, సిర్పూర్ కాగజ్నగర్ నుంచి కొల్లంకు రెండు ప్రత్యేక రైళ్లు నడిపించాలి.స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్, నవజీవన్ ఎక్స్ప్రెస్, జైపూర్ మద్రాస్ ఎక్స్ప్రెస్, కొంగు ఎక్స్ప్రెస్, తమిళనాడు ఎక్స్ప్రెస్, దర్భంగా ఎక్స్ప్రెస్, మిలీనియం(ఎర్నాకులం) రైళ్లకు రామగుండం స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వాలి. కమాన్పూర్ మండలం రాణాపూర్లో లోలెవల్ క్రాసింగ్ బ్రిడ్జి, కన్నాలలో హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించాలి.కాజీపేట జంక్షన్ నుంచి భూపాల్పల్లి, తాడిచర్ల, మంథని మీదుగా రామగుండం వరకు కొత్త రైల్వేలైను నిర్మించాలి.రామగుండం రైల్వేస్టేషన్ నుంచి మంథని, తాడిచర్ల, భూపాలపల్లి, ఏటూరునాగారం, కమలాపూర్ మీదుగా మణుగూరు రైల్వేస్టేషన్ వరకు కొత్త రైల్వేై లెను నిర్మించాలి. కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ ప్రతిపాదనలు మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి. ఆర్మూరు-నిజామాబాద్ మధ్యలో రైల్వేలైను పూర్తిచేయాలి. కరీంనగర్ నుంచి ముంబై వరకు ఎక్స్ప్రెస్ను ప్రారంభించాలి. బిజిగిరిషరీఫ్, ఉప్పల్రైల్వే ఓవర్బ్రిడ్జి డిజైన్ ఆమోదించి, వెంటనే పనులు ప్రారంభించాలి. కరీంనగర్-తిరుపతి రైలు సర్వీసును ప్రతిరోజు నడపాలి. తిరుపతి ఎక్స్ప్రెస్ను కరీంనగర్-తిరుపతి ఎక్స్ప్రెస్గా పేరు మార్చాలి. -
సబర్బన్కు గ్రీన్ సిగ్నల్ పడేనా?
రైల్వే బడ్జెట్పై అందరి చూపు సబర్బన్ ఏర్పాటైతే ట్రాఫిక్ సమస్యలకు చెక్ బెంగళూరు: ట్రాఫిక్ కష్టాలను తీర్చడంతో పాటు బెంగళూరుకు దగ్గరగా ఉన్న పట్టణాలను కలుపుతూ నిర్మించే సబర్బన్ రైలుకు నేడు కేంద్రం ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో మోక్షం దక్కక పోతుందా అని నగర ప్రజలతో పాటు ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తోంది. ఒకవేళ అదే జరిగితే దశాబ్ధకాలం నాటి ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. రూ.9వేల కోట్ల వ్యయం కాగల ఈ బృహత్ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి కానుంది. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ద్వితీయ స్థాయి నగరాలు, పట్టణాల నుంచి నిత్యం ఉద్యోగ, వ్యాపార, ఉపాధి నిమిత్తం 12 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్ల్లు పట్టణాభివద్ధి శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీరు ప్రధానంగా సొంతవాహనాలు, లేదా బస్సుల ద్వారా బెంగళూరుకు వస్తుంటారు. రానున్న పదేళ్ల్లలో ఇది మరింతగా పెరిగి ట్రాఫిక్ సమస్య రెట్టింపు అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించే దిశగా బెంగళూరుకు 100 కిలోమీటర్ల పరిధిలోని ఏడు జిల్లా కేంద్రాలను, వాటి మధ్య ఉన్న 23 చిన్నచిన్న నగరాలు, పట్టణాలను కలుపుతూ రైలు వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 440 కిలోమీటర్ల రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. రూ.3,400 కోట్లు ఖర్చుకాగల మొదటి దశలో బెంగళూరు-చిక్కబళ్లాపుర,దొడ్డబళ్లాపుర, రెండోవిడతలోరూ.2,300 కోట్ల నిధులతో బెంగళూరు-రామనగర,మండ్యా, రూ.1,300 కోట్లు ఖర్చుతో మూడో విడతలో బెంగళూరు-బంగారుపేట మధ్యలో ఉన్న అన్ని చిన్నచిన్న నగరాలకు రైలు సౌకర్యం కల్పిస్తారు. మెట్రోతో పోలిస్తే ఈ నూతన ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు తక్కువ. మెట్రోకు కిలోమీటరుకు సగటున రూ.300 కోట్లు ఖర్చవుతుంది. నూతన ప్రాజెక్టులో కిలోమీటరుకు అయ్యే ఖర్చు రూ. 18 కోట్లు మాత్రమే. నూతన ప్రాజెక్టుకు కొత్తగా భూమిని సేకరించాల్సిన అవసరం లేదు. ఆధునికత సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవ వనరులను పెంచితే సరిపోతుంది. -
కరుణించు ప్రభు!
♦ కృష్ణా- వికారాబాద్ రైల్వేలైన్పై ఆశ ♦ శివార్లకు ఎంఎంటీఎస్ వచ్చేనా? ♦ శంషాబాద్లో ఎయిర్కార్గోకు మోక్షం లభించేనా? ♦ నేటి రైల్వేబడ్జెట్పై జిల్లావాసుల గంపెడాశ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వికారాబాద్- కృష్ణా బ్రాడ్గేజ్ రైల్వేలైన్ కేంద్రం కరుణ కోసం నిరీక్షిస్తోంది. నాలుగేళ్ల క్రితం సర్వే పూర్తిచేసుకున్న ఈ లైను పట్టాలెక్కేందుకు నిధులు విదిల్చకపోతారా? అని ఆశగా చూస్తోంది. 121.70 కిలోమీటర్ల ప్రతిపాదిత ఈ రైలు మార్గానికి రూ.787.80 కోట్లు అవసరమని రైల్వేశాఖ అంచనా వేసింది. అదేసమయంలో సరుకు రవాణాకు ఈలైను అంతగా ఉపయోగపడదని, ప్రయాణికుల నిష్పత్తి కూడా నిర్ధేశితశాతం నమోదు కావడం అసాధ్యమని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా భారంగా మారే ఈ ప్రాజెక్టును చేపట్టడం సాధ్యపడదని స్పష్టం చేసింది. సగటున 14శాతం రేట్ ఆఫ్ రిటర్న్(ఆర్ఓఆర్) ఉన్నవాటికే ప్రాధాన్యమిస్తామని, ఈ మార్గంలో కేవలం 6.9 శాతం మాత్రమే వచ్చే వీలుందని రైల్వే ఇంజినీరింగ్ శాఖ తేల్చిచెప్పింది. ఈ ప్రాంత సామాజిక అవసరాల దృష్ట్యా నిర్మాణ వ్యయంలో సగం వాటాను రాష్ర్ట సర్కారు భరిస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత ఉమ్మడి ప్రభుత్వం భూసేకరణ సహా ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం వెచ్చించేందుకు ముందుకొచ్చింది. అందులో భూసేకరణకు రూ.3,683 కోట్లను కూడా విడుదల చే సేందుకు అంగీకరించింది. అయినప్పటికీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రైల్వేబోర్డు ఈ లైన్ నిర్మాణానికి ఆసక్తి చూపడంలేదు. 2019 నాటికి ఈ మార్గాన్ని అందుబాటులోకి తెస్తామని నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి సురేశ్ప్రభు పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లో కృష్ణా- వికారాబాద్ రైల్వేలైనుకు పచ్చజెండా ఊపుతారో లేదో వేచి చూడాల్సిందే! రైల్వేమంత్రి సురేశ్‘ప్రభు’ రైలుబండిపై జిల్లా ప్రజానీకం గంపెడాశలు పెట్టుకుంది. గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో ‘రైలు కూత’ వినిపించకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తోంది. పెండింగ్ ప్రాజెక్టులకు లైన్క్లియర్, కొత్త మార్గాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇస్తుందా? లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. శంషాబాద్ విమానాశ్రయం ఎయిర్కార్గో హబ్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమం లో సరుకు రవాణాకు అనువుగా రైల్వేలైన్లను విస్తరించాలని భావించినా.. ఇప్పటికీ అతీగతిలేకుండా పోయింది. ఎయిర్పోర్టు నుంచి నేరుగా విజయవాడకు ప్రత్యేక రైల్వేలైన్ను నిర్మించాలని గతంలో జీఎంఆర్ సంస్థ ప్రతిపాదించిన ఫైలు అటకెక్కింది. వికారాబాద్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్ఓబీ) నిర్మించాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. రాజ్కోట్, గరీబ్థ్ ్రతదితర ఎక్స్ప్రెస్ రైళ్లను ఇక్కడ ఆపాలనే డిమాండ్ ఉంది.ఆదర్శ స్టేషన్ల నిర్మాణంలోనూ రైల్వేశాఖ అంతులేని జాప్యం చేస్తోంది. అరకొర నిధుల కేటాయింపులతో నిర్మాణ పనులను ఏళ్ల తరబడి సాగదీస్తోంది. 2011-12లో ప్రకటించిన పనులు కూడా ఇప్పటికీ పూర్తికాలేదు. వికారాబాద్, శంకర్పల్లి, మల్కాజ్గిరి, శేరిలింగంపల్లి ఆదర్శ స్టేషన్లు అధికారుల నిర్లక్ష్యానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ రైలుబండి.. రాలేదండీ! ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్) రైళ్లను శివారు ప్రాంతాలకు పొడగించాలని 2006లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా రెండో దశ విస్తరణ పనులకు రూ.324 కోట్లను కేటాయించింది. ఈ నిధుల్లో మూడోవంతు నిధులను రైల్వేశాఖ భరిస్తుండగా, మిగతా నిధులను రాష్ర్టం వ్యయం చేస్తోంది. ఈ నిధులతో శివారు ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో రెండో, మూడు లైన్ ను కొత్తగా వేయాలని ప్రతిపాదించారు. రెండో దశ కింద సికింద్రాబాద్ -మేడ్చల్ (28కి.మీ), ఫలక్నుమా -శంషాబాద్ (20కి.మీ), సికింద్రాబాద్- ఘట్కేసర్ (19కి.మీ), అలాగే మౌలాలి -సనత్నగర్ (21కి.మీ), మౌలాలి -కాచిగూడ(10కి.మీ), తెల్లాపూర్ -పటాన్చెరు (8కి.మీ) రూట్లలో ఎంఎంటీఎస్ను విస్తరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా సిగ్నలింగ్, విద్యుద్ధీకరణ, స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కొత్త ప్రాంతాలకు ఎంఎంటీఎస్ రైళ్లను పొడగించాలనే ఉద్ధేశంతో విడుదల చేసిన నిధులు మూలుగుతున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడంలేదు. ఇప్పటివరకు కనీస భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు. -
రాజధాని రైలు’ కూత పెట్టేనా..!
25 రైల్వే బడ్జెట్పై డివిజన్ ప్రజల ఆశలు నడికూడి-శ్రీకాళహస్తికి రెండో విడత నిధుల కోసం ఎదురుచూపులు నూతన రైళ్ల కోసం, డివిజన్లో డబ్లింగ్, విద్యుదీకరణకు నిధులు మంజూరయ్యేనా..! రాష్ట్రానికి నూతన రాజధాని ఏర్పాటు చేశాక మొదటిసారి కేంద్రప్రభుత్వం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. డివిజన్కు కేటాయించే నిధులు, నూతన రైల్వే లైన్లు, కేటాయించే ట్రైన్ల పైనే రాజధాని ప్రాంత అభివృద్ధి ఆధారపడి ఉంది. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా నవ్యాంధ్రప్రదేశ్ పరిధి వరకూ ఏర్పాటు చేసే నూతన రైల్వే జోన్పై అనిశ్చితి కొనసాగుతోంది. నగరంపాలెం : నూతన రైల్వేజోన్ కేంద్ర కార్యాలయం రాజధానికి సమీపంలోని గుంటూరు జిల్లాలోనే ఏర్పాటు చేసేలా బడ్జేట్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రధానమంత్రి ప్రయార్టీ ప్రాజెక్టు కింద డివిజన్లో జరగుతున్న భారీ ప్రాజెక్టు నడికుడి - కాళహస్తి నూతన రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తి కావాలంటే రెండో దశ పనులకు ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరగాలి. రీసర్వే జరిగాలి గుంటూరు- నంద్యాల విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నందున డబ్లింగ్పనులకు, నల్లపాడు -బీబీనగర్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. మాచర్ల నుంచి మహబూబ్నగర్ మీదుగా రాయచూర్ వరకూ నూతన రైల్వే లైన్కు గతంలో సర్వే జరిగి ఆగిపోయింది. దీనికి రీసర్వే చేసి పనులు చేపడితే ముంబయికి దగ్గర మార్గంగా మారుతుంది. అన్ని ప్రాంతాల నుంచి.. : నూతన రాజధాని ప్రాంతానికి రైల్వే కనెక్టవీటి కోసం సత్తెనపల్లి పెదకూరపాడు నుంచి హెరిటేజ్ అమరావతి మీదుగా రాజధాని అమరావతిని కలుపుతూ మంగళగిరికి ఒక మార్గం, కృష్ణా జిల్లాలోని కొండపల్లికి ఒక మార్గం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి నేరుగా రాజధాని ప్రాంతానికి రావడం వీలవుతుంది. ప్రయాణికుల రద్దీ మేరకు..: రాజధాని ఏర్పాటుతో డివిజన్లో గుంటూరుకు ప్రయాణికుల రద్దీ పెగుతుంది. దీంతో డివిజన్ పరిధిలో సర్కులర్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లు పెంచాల్సిన అవసరం ఉంది. విజయవాడ-మంగళగిరి-గుంటూరు - తెనాలికి, వినుకొండ-గుంటూరు-తెనాలికి ఎక్కువ సర్కులర్ రైళ్లు నడపాల్సిన అవసరం ఉంది. దీనికోసం గుంటూరు రేపల్లే వరకూ డబ్లింగ్ విద్యుదీకరణకు నిధులు మంజూరు చేయాల్సి ఉంది. విజయవాడ నుంచి తెనాలి మీదుగా వెళుతున్న నవజీవన్, టాటా తదితర సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను మంగళగిరి మీదుగా న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా నడపాలి. గుంటూరు- తిరుపతి, గుంటూరు-చెన్నైకి పగటిపూట ఇంటర్సిటి ఎక్స్ప్రెస్, గుంటూరు-మైసూరుకు బెంగళూరు మీదుగా ఎక్స్ప్రెస్, గుంటూరు- మాచర్ల, వినుకొండ-గుంటూరుకు ఫాస్ట్ ప్యాసింజర్లు, గతంలో తెనాలి- సికింద్రాబాద్కు నడిచే నాగార్జున ఎక్స్ప్రెస్ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు మచిలీపట్నం-యశ్వంతపూర్, కాకినాడ-ముంబయి లోకమాన్యతిలక్, నర్సాపూర్-నాగర్సోల్ బై వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు రోజూ నడపాలి. కోట్ పిట్లు పెంచాలి : గుంటూరు స్టేషన్ నుంచి నూతన రైళ్లు నడపాలంటే కోచ్ పిట్లు కావాల్సి ఉంది. ప్రస్తుతం గుంటూరు స్టేషన్లోని రెండు కోచ్ పిట్లలో ఆరు రైళ్ల వరకూ శుభ్రం చేసే అవకాశం ఉంది. వీటి సంఖ్య పెంచి మరిన్ని రైళ్లకు అందుబాటులోకి తేవాల్సి ఉంది. మాచర్ల, రేపల్లే స్టేషన్లను నూతన రైళ్లు నడిపేలా అభివృద్ధి పర్చాల్సి ఉంది. నిధులు భారీగా అవసరం : డివిజన్ ప్రధాన రైల్వేస్టేషన్ అయిన గుంటూరు రైల్వేస్టేషన్ను ఎ-గ్రేడ్ నుంచి ఎ-1 గ్రేడ్ స్థాయికి పెంచేందుకు నిధులు మంజూరుచేయాల్సి ఉంది. డివిజన్లో ఉద్యోగుల వైద్య సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన రైల్వే హెల్త్ యూనిట్ను 25 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయాలి. ఉద్యోగుల క్వార్టర్ల కోసం నిధులు మంజూరుచేయాల్సి ఉంది. నూతన రైళ్లు నడపాలి : డివిజన్లో నూతన రైళ్లు ఎక్కువుగా కేటాయించాలని సౌత్సెంట్రల్ రైల్వే మజ్దూరు యూనియన్ గుంటూరు డివిజను సెక్రటరీ హనుమంతరావు కోరారు. గుంటూరు-తిరుపతి, గుంటూరు-చెన్నైకు పగటిపూట ఎక్స్ప్రెస్ రైళ్లు నడపటం వలన నిత్యం 2,000 మంది ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలిపారు. గుంటూరు రాజధాని ప్రాంతంగా మారడంతో అద్దెలు పెరిగాయని, ఉద్యోగులు తమ జీతంలో 60 శాతం అద్దెలకే ఖర్చుచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం గుంటూరులోనే 2000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా 220 క్వార్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. గత బడ్జెట్లో క్వార్టర్ల మెయింటనెన్స్ నిధులు మంజూరు చేయకపోవడంతో 100 క్వార్టర్ల వరకూ శిథిలావస్థకు చేరుకున్నట్లు తెలిపారు. -
కరుణించు.. ప్రభూ!
సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జిల్లాకు కొత్త రైల్వే లైన్ ఏ ఒక్కటీ రాలేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో రైల్వే మార్గం నిడివి కేవలం 135 కిలో మీటర్లే. అందుకే కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ సాధనకు కోనసీమ యువత ఉద్యమబాట పట్టారు. కాకినాడ-పిఠాపురం రైల్వే లైన్ కోసం డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏటా రూ.వెయ్యి కోట్ల వరకూ దక్షిణ మధ్య రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చుతున్నా రైల్వే బడ్జెట్లో జిల్లాకు మొండిచెయ్యి మిగులుతోంది. ఈ ఖర్చులో సగం భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ఆయా ప్రాజెక్టులను ముందుగా చేపడతామని రైల్వే శాఖ గతంలోనే ప్రకటించినా ఇప్పటివరకూ ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారైనా కలల ప్రాజెక్టులు సాకారం అవుతాయో లేదోనని ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరో కొద్ది గంటల్లో ఆ విషయం ఏమిటనేదీ తేలిపోతుంది! ఉన్న రైళ్లు మరింత సౌకర్యం కావాలంటే... జిల్లాలో రాజమండ్రి తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న నగరం కాకినాడే అయినా రైలు సౌకర్యంలో వెనుకంజలోనే ఉంది. ఇప్పటికే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కొన్ని రైళ్లను కొన్ని మార్పులు చేస్తే మరింత సౌకర్యవంతంగా ఉంటాయని ప్రయాణికులు కోరుతున్నారు. కాకినాడ నుంచి ముంబైకి వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ను బుధ, శనివారాల్లో మాత్రమే వెళ్తోంది. దీన్ని మంగళ, శుక్రవారాలకు మార్చితే కాకినాడ నుంచి సికింద్రాబాద్కు ప్రతిరోజూ అదీ ఉదయం పూట రైలు సౌకర్యం లభిస్తుంది. వారానికి మూడు రోజులు తిరుగుతున్న కాకినాడ-షిర్డీ ఎక్స్ప్రెస్ను రోజువారీ తిప్పాలనే డిమాండు ఉంది. కాకినాడ నుంచి సికింద్రాబాద్కు వారానికి మూడ్రోజులు తిరుగుతున్న కోకనాడ ఏసీ ఎక్స్ప్రెస్ను ప్రతిరోజూ తిప్పితే ఉపయోగకరంగా ఉంటుంది. పశ్చిమభారత రాష్ట్రాలకు వెళ్లడానికి కాకినాడ నుంచి వారానికి ఒకరోజు మాత్రమే ఉన్న ఏకైక రైలు భావనగర్ ఎక్స్ప్రెస్ను వారంలో రెండు లేదా మూడు సార్లు తిప్పితే జిల్లాలో ఉన్న మార్వాడీలు, పర్యాటకులకు ప్రయాణ వెసులుబాటు లభిస్తుంది. కాకినాడ నుంచి చెన్నైకు వెళ్లే సర్కారు ఎక్స్ప్రెస్ను పుదుచ్ఛేరి వరకూ పొడిగించాలనే డిమాండు కూడా ఎప్పటినుంచో ఉంది. అన్నవరంలో గరీబ్థ్,్ర కోణార్క్ ఎక్స్ప్రెస్లకు కూడా హాల్ట్ కల్పించాలి. కాకినాడ-విశాఖపట్నం, కాకినాడ-విజయవాడ ఫాస్ట్ పాసింజర్ రైళ్లు, శేషాద్రి, సర్కారు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు వేయాలనే డిమాండు ఉంది. అలాగే కోల్కతా, న్యూఢిల్లీ (వయా విశాఖపట్నం, వారణాసి), జోథ్పూర్ ప్రాంతాలకు కాకినాడ నుంచి కొత్తగా రైళ్లు వేయాలని దీర్ఘకాలంగా డిమాండు వినిపిస్తోంది. ఇక హాల్ట్ల విషయానికొస్తే సామర్లకోట, పిఠాపురం, అనపర్తి, అన్నవరం తదితర ముఖ్య పట్టణాల స్టేషన్లలో కొన్ని ప్రధాన రైళ్లకు హాల్ట్ ఇస్తే రైలు సౌకర్యం మరింత మందికి అందుబాటులోకి వస్తుంది. సౌత్కోస్టల్ రైల్వే జోన్ వస్తే... యానాం-ఎదుర్లంక వంతెన పూర్తయ్యిన తర్వాత కోనసీమ స్వరూపమే మారిపోయింది. అలా రైల్వే ప్రాజెక్టుల విషయంలోనూ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా సౌత్కోస్టల్ రైల్వే జోన్ అత్యవసరం. ఈ బడ్జెట్లోనైనా ప్రకటించాలనే డిమాండు అన్ని వర్గాల నుంచి ఇప్పటికే రైల్వే శాఖకు వినిపించారు. ఇది సాకారమైతే చాలా పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుంది. తీర ప్రాంతం వెంబడి పోర్టులను అనుసంధానిస్తూ రైల్వేలైను వేస్తే వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి. అలాగే కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైను వేస్తే హైదరాబాద్, వరంగల్ వైపు ప్రయాణసమయం తగ్గుతుంది. - వైడీ రామారావు, అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా-కోకనాడ ప్రయాణికుల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా... కోనసీమను కలిపే సుమారు 60 కిలోమీటర్ల కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను ప్రాజెక్టు గత 15 ఏళ్లుగా పెండింగ్లోనే ఉంది. రూ.345 కోట్ల అంచనా వ్యయంతో 2002, నవంబరు 16న అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ అమలాపురంలో పునాదిరాయి వేశారు. ముక్తేశ్వరం నుంచి అమలాపురం వరకూ లైన్కు దాదాపు 85 ఎకరాల భూమిని రైల్వే శాఖ సేకరించింది. అమలాపురం సమీప భట్నవిల్లిలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి 2005లో అప్పటి రైల్వే సహాయ మంత్రి తంగవేలు శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకూ దీనికి కేటాయించింది రూ.70 కోట్లు మాత్రమే. ఈ లైనులో గౌతమి, వైనతేయ, వశిష్ట నదులపై భారీ రైలు వంతెనలు, కాలువలపై 15 పెద్దవి, 150 వరకూ చిన్నచిన్న వంతెనలు నిర్మించాల్సి ఉంది. దీనివల్ల కిలోమీటరుకు రూ.50 కోట్ల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా. ఆమోదముద్ర పడి ఆగిపోయిన ప్రాజెక్టుల్లో కాకినాడ-పిఠాపురం లైన్ మరొకటి. ఏటా బడ్జెట్లో కొంతమొత్తంలో రైల్వేశాఖ కేటాయిస్తూ వస్తోంది తప్ప పూర్తిస్థాయి కేటాయింపులు లేవు. ఇప్పుడు దీన్ని పూర్తి చేయాలంటే సుమారు రూ.200 కోట్ల వరకూ నిధులు అవసరం. ఈ లైన్ సాకారమైతే కాకినాడకు హౌరా-చెన్నై రైల్వే మార్గంతో అనుసంధానం ఏర్పడుతుంది. దీన్నే ప్రస్తుతం విస్తరణ జరుగుతున్న 216 నంబరు జాతీయ రహదారికి సమాంతరంగా నిర్మించాలనే సూచనలు వస్తున్నాయి. ఇది మరింత ఉపయోగకరం కావాలంటే ఈలైన్ను పిఠాపురం దగ్గర గాకుండా కాకినాడ నుంచి తీరం వెంబడి ఎస్ఈజడ్ మీదుగా అన్నవరం వద్ద అనుసంధానం చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. -
తెలంగాణపై రైల్వే నిర్లక్ష్యం
సందర్భం బ్రిటిష్ ఇండియా 96 ఏళ్ల (1853 -1947) హయాంలో 53 వేల కిలో మీటర్ల రైలుమార్గం నిర్మించారు. 68 ఏళ్ల స్వతంత్ర భారతంలో నిర్మించిన రైలుమార్గం 10 వేల కి.మీ. మన పాలకులు రైల్వే వ్యవస్థ మీద ఎంత నిర్లక్ష్యం వహి స్తున్నారో చెప్పడానికి ఈ ఉదాహ రణ చాలు. ఇక భద్రత, పరిశుభ్రత కూడా అంతంత మాత్రమే. ఈ అంశాల పరిశీలన కోసం అనిల్ కకోద్కర్, శాంపిట్రోడా ఇచ్చిన నివేదికలు కూడా అమలుకు నోచుకోలేదు. 2004-2011 మధ్య రైల్వే ప్రయాణికుల చార్జీలు ఏమీ పెంచకుండా ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. నడికుడి-బీబీనగర్ మధ్య కొత్త రైలుమార్గం మినహా, మరో మార్గమేదీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 బడ్జెట్లో బులెట్ రైళ్లను ప్రవేశపెడతామని చెప్పింది. తొమ్మిది ప్రధాన మార్గాలలో 160- 200 కి.మీ. వేగంతో రైళ్లను నడిపేందుకు కూడా ఆ బడ్జెట్ ఆమోదించింది. 2015-16 రైల్వే బడ్జెట్ మరీ ప్రత్యేకమైనది. ఒక్క కొత్త రైలును కూడా అది ప్రవేశ పెట్టలేదు. తొమ్మిది హైస్పీడ్, సెమీ హైస్పీడ్ మార్గాలలో ఏ ఒక్క దానికీ పనులు ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల దశాబ్దా లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. కొత్త రైలు మార్గాలు అందుబాటులోకి రాకుండా, పారిశ్రామికోత్పత్తులు, వ్యవసా యోత్పత్తులు అధికంగా జరిగే ప్రాంతాలకు విస్తరించకుండా ఆదాయం ఎలా పెరుగుతుంది? 1947 నాటి దేశ జనాభా 35 కోట్లు. నేటి జనాభా 120 కోట్లు పైనే. పెరిగిన 85 కోట్ల జనాభాకు అనుగుణంగా రైల్వేలు విస్తరించలేదు. ప్రాజెక్టు లలో తీవ్ర జాప్యం, అధిక వ్యయం, అవినీతి వంటి వాటితో రైల్వే సతమతమవుతోంది. రైలు ప్రయాణం కూడా రోజురోజుకూ భారమవు తోంది. 2014, జూన్ నుంచి ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం, సరుకు రవాణా చార్జీలను 6.5 శాతం పెంచారు. అదే సంవత్సరం అక్టోబర్ నుంచి ప్రీమియర్ తత్కాల్ విధానంతో 50 శాతం టికెట్లను అధిక ధరలకు అమ్ముతున్నారు. సంవిధ రైళ్ల పేరుతో 20 శాతం టికెట్ల మీద 50 శాతం ధర పెంచి అమ్ముతున్నారు. అంటే 20 శాతం ప్రయాణికులకు మూడు రెట్ల చార్జీని వసూలు చేస్తూ ఆదాయం పెంచుకుంటున్నారు. ఇది 2015 జూలై నుంచి అమలవుతున్నది. ప్లాట్ఫాం టికెట్ను కూడా రూ. 5 నుంచి రూ.10లకు పెంచారు. రిజర్వేషన్ వ్యవధిని 120 రోజులు ముందుకు తెచ్చి, రద్దు చార్జీలను భారీగా పెంచారు. ఇలా టికెట్ల రద్దు ద్వారా రూ. 4 వేల కోట్ల ఆదాయం వస్తోంది. చిత్రంగా ప్రభుత్వాలు కొత్త మార్గాల నిర్మాణం, కొత్త రైళ్లు నడపడం, అదనపు బోగీలను జత చేయడం, కేటరింగ్ సదుపాయాలు వంటి అంశాలను నిర్లక్ష్యం చేస్తూనే, ఈ- కేటరింగ్, వైఫై, వేగవంతంగా రిజర్వేషన్, మొబైల్ యాప్; టెక్నాలజీ వెబ్సైట్, బయో టాయ్లెట్స్ అంటూ చిన్న చిన్న అంశాలను బడ్జెట్లో హైలైట్స్గా చూపుతున్నారు. గత దశాబ్ద కాలంలో కాట్రా-ఉదంపూర్ మార్గాన్ని (345 కి.మీ.) 2014 జూలైలో ప్రారంభించడం తప్ప, మరో మార్గమేదీ పూర్తి చేసిన దాఖలాలు లేవు. ఒక్కొక్క రాష్ట్రానికి సంవత్సరా నికి రూ. 1,000 కోట్ల వంతున కేటాయిస్తే ప్రతి రాష్ట్రంలో నాలుగేసి కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఇందు కోసం నాలుగేళ్ల కాలంలో రూ.28,000 కోట్ల వంతున కేటా యిస్తే 112 కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. అలాగే వేల కోట్లతో వ్యాపారాలు నిర్వహించే పారిశ్రామిక వేత్తలు కార్పొరేట్ సామాజిక బాధ్యతతో రూ. 500 కోట్లు వెచ్చించి ఒక్కొక్క మార్గాన్ని నిర్మించి జాతికి అంకితం చేయ వచ్చు. అలాగే ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి కొత్త మార్గాల నిర్మాణానికి నిధులు కేటాయించవచ్చు. అలాగే గ్రీన్ స్టేషన్లు, మోడల్ స్టేషన్లు, గ్రానైట్ స్టేషన్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఆపాలి. తెలంగాణ దుస్థితి నిజాం పాలన తరువాత 1966లో సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వేను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నడికుడి నుంచి సికింద్రాబాద్ శివార్లలోని బీబీనగర్ మధ్య 163 కి.మీ. మార్గాన్ని నిర్మించడం మినహా మరో మార్గమేదీ తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రాలేదు. పెద్దపల్లి- కరీంనగర్-నిజామాబాద్ మధ్య 177 కి.మీ. మార్గానికి 1994లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు అనుమతిం చారు. ఇందులో పెద్దపల్లి-కరీంనగర్ మార్గం నిర్మాణం 2001 నాటికే పూర్తయింది. కానీ కరీంనగర్-నిజామాబాద్ మార్గం పనులు నేటికీ పూర్తి కాలేదు. భద్రాచలం -కొవ్వూరు మధ్య కొత్త మార్గం నిర్మాణ ప్రతిపాదనకు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మోక్షం లభించలేదు. 2010లో అను మతి లభించినా ఇంతవరకు నిర్మాణం ఆరంభం కాలేదు. మణుగూరు-రామగుండం, అక్కన్నపేట-మెదక్-మేడ్చల్, కొండపల్లి-కొత్తగూడెం, గద్వాల్-మాచర్ల మార్గాల నిర్మా ణానికి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందే ఒప్పందం జరిగింది. 50:50 ఖర్చు భరించేందుకు అంగీకారం కుదిరింది. అయినా నిర్మాణం ఆరంభం కాలేదు. వీటిని 2010-11 బడ్జెట్లో ఆమోదించారు. 2011-12 బడ్జెట్లో అక్కన్నపేట-మెదక్, భద్రాచలం- కొవ్వూరుల ప్రస్తావన ఉంది. మహబూబ్నగర్-గుత్తి, సికింద్రాబాద్-మద్కేడ్- ఆది లాబాద్ మార్గాలలో రెండవ మార్గం నిర్మాణానికి ఆమోదం లభించింది. మనోహరాబాద్-కొత్తపల్లి మార్గానికి ఆమోదం లభించినా కేటాయింపులు లేవు. కరీంనగర్- నిజామాబాద్ మార్గం పూర్తయితే ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలా బాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. చెన్నై, ముంబై, తిరుపతి వెళ్లేవారికి సౌకర్యం పెరుగుతుంది. భద్రాచలం-కొవ్వూరు మార్గం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు బెంగాల్ వైపు నేరుగా రాక పోకలు సాగించవచ్చు. సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రమే కాదు, పెద్ద కూడలి. నిత్యం 130 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. కానీ పది ప్లాట్ఫారమ్లు మాత్రమే ఉండడం వల్ల కొన్ని రైళ్లు గంటల తరబడి స్టేషన్ బయట వేచి ఉండవలసిన పరిస్థితి నెలకొంది. కానీ ఈ ప్లాట్ఫారాల సంఖ్య పెంచే సూచన ఏదీ లేదు. దీనితో నిత్యం గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో ప్లాట్ఫారాల సంఖ్య పెంచి కొన్ని రైళ్లను నేరుగా అక్కడకు పంపడం వల్ల సికింద్రాబాద్కు ఒత్తిడి తగ్గుతుంది. చర్లపల్లిని టెర్మినల్గా పెట్టాలని భావిస్తున్నా, అది సమస్యను పరిష్కరించేది కాదు. అన్ని ప్రధాన స్టేషన్లలో లిఫ్ట్ సౌకర్యం, మెడికల్ షాపుల ఏర్పాటు, పరిశుభ్రమైన ఆహారం అందుబాటులోకి తేవాలి. 50:50 ప్రాతిపదికన ప్రాజెక్టుల పూర్తికి కృషి చేయాలి. (రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా) వ్యాసకర్త సోషల్ అవేర్నెస్ కాంపెయిన్ సభ్యురాలు ఎం. రోజాలక్ష్మి మొబైల్: 94410 48958 -
ప్రభూ కరుణించవా...
రైల్వే బడ్జెట్ను గురువారం ప్రవేశపెడుతున్నారు. ఏటా బడ్జెట్లో ఎలాంటి ప్రయోజనాలు పొందని ఈ జిల్లావాసులు మరోసారి ఆశగా నిరీక్షిస్తున్నారు. ఈసారైనా రైల్వే మంత్రి సురేష్ ప్రభు తమ ఆకాంక్షలను నెరవేరుస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. ఉత్తర దక్షిణాది రాష్ట్రాలకు వారధిగా నిలుస్తున్న శ్రీకాకుళం జిల్లాను ముక్కలు చేసి రేల్వేశాఖ విభజించి పాలిస్తోంది. బ్రిటీష్కాలం నాటి రైల్వే లైన్లే కొనసాగుతూ భద్రత తీరును ప్రశ్నిస్తున్నాయి. పగలూ రాత్రి విరామం లేకుండా ఎక్స్ప్రెస్లు సూపర్ఫాస్టుగా పరుగులు తీస్తున్నా ఆగేవి కొన్ని మాత్రమే. దీంతో ప్రయాణికులది ప్రేక్షక పాత్రే. దేశంలోని ఏ ప్రధాన నగరానికి వెళ్లాలన్నా కష్టపడి విశాఖ చేరుకోవల్సిందే. ఆఖరుకు తిరుపతి వెళ్లాలన్నా విశాఖ చూడాల్సిందే. తమ ప్రాంతానికి పొడిగించారని సంబరపడితే విశాఖ ఎక్స్ప్రెస్ను భువనేశ్వర్ వరకూ తీసుకుపోయి ఆశలపై నీళ్లు చల్లారు. శ్రీకాకుళం టౌన్: రైల్వే బడ్జెట్పై జిల్లా కోటి ఆశలను పెట్టుకుంది. ఈసారైనా తమపై రైల్వే మంత్రి కరుణ చూపుతారని ఆశపడుతోంది. చాలాకాలంగా నెరవేరకుండా పోతున్న డిమాండ్లను తీరుస్తారని ఆకాంక్షిస్తోంది. శ్రీకాకుళం పేరుతో ఉన్న ఆమదాలవలస రేల్వేస్టేషన్ మీదుగా ప్రయాణిస్తున్న 22రైళ్లకు ఇక్కడ హాల్ట్ లేదు. విశాఖ ఎక్స్ప్రెస్ను అతికష్టం మీద పలాసవరకు పొడిగించారు.. కాని ఈ ఆనందం మిగలకుండా భువనేశ్వర్ వరకు పొడిగించారు. గోదావరి ఎక్స్ప్రెస్ శ్రీకాకుళం వరకు పొడిగించాలనే దీర్ఘకాలిక కోరిక తీరడం లేదు. యశ్వంతపూర్,తిరుచ్చి వంటి రైళ్లకు ఇక్కడ హాల్ట్ లేకుండా చేశారు. ఆధునీకీకరణ నిధుల మంజూరు అరకొరే. శ్రీకాకుళం రేల్వేస్టేషన్లో వికలాంగులు, హృద్రోగులు రెలైక్కాలంటే అవస్థలే. ర్యాంపుల నిర్మాణం కలగానే మిగులుతోంద. పలాస నుంచి ప్రపంచ వాణిజ్య మార్కెట్లో గిరాకీ ఉన్న జీడిపప్పు రవాణా అవుతోంది. అయినా అదనపు ప్లాట్ఫారాల డిమాండ్ నెరవేరడం లేదు. లైన్పై ఒక రైలు పట్టాలెక్కని హామీలు ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ జిల్లాలోనే పెద్దది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది. ప్రయాణికుల తాకిడి ఎక్కువ. ఆదాయం ప్రతినెల రూ.1.60 కోట్లు వస్తున్నట్టు రైల్వేశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇంత పెద్దమొత్తం లో ఆదాయం వస్తున్నా సౌకర్యాలు మృగ్యమే. నిత్యం ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. స్టేషన్లో నాలుగు ఫ్లాట్ఫాంలు ఉన్నాయి. ఒకటో నంబర్ ప్లాట్ఫాంకు పూర్తిగా పైకప్పు లేదు. మిగతా మూడు ప్లాట్ఫాంలకు సగభాగం మాత్రమే పైకప్పు ఉంది. ప్రయాణీకులకు ఎండ, వాన కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఫ్లాట్ఫాంలపై ఉన్న తాగునీటి కుళాయిలు, మరుగుదొడ్ల నిర్వహణ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రమే సక్రమంగా నిర్వహిస్తారు. ఆ తరువాత ఆ సేవలు ప్రయాణుకులకు అందని ద్రాక్షగానే ఉంటున్నాయి. రైల్వేస్టేషన్ను మోడల్ రైల్వే స్టేషన్గా తీర్చి దిద్దుతానని ఎంపీ కింజరావు రామ్మోహన్నాయుడు పలుమార్లు స్టేషన్లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా హామీలు కార్యరూపం దాల్చలేదు. విశాఖ పట్టణానికి అతి సమీపంలో ఉన్నప్పటికీ ఈ స్టేషన్ భువనేశ్వర్ జోన్లో ఉండడం వల్లే స్టేషన్ అభివృద్ధి మసకబారుతోందని స్థానిక రైల్వే అధికారులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. స్టేషన్లో అటు విశాఖపట్టణం వైపు, ఇటు పలాస వైపు వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లు 29 (వీక్లీలతోపాటు), నాలుగు పాసింజర్లు నిలుపుదల చేస్తారు. మరో 13 రైళ్లకు ఇప్పటికీ హాల్ట్లేదు. దీంతో అటు విజయనగరం, ఇటు భువనేశ్వర్ వెళ్లి రైళ్లను ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. స్టేషన్లో ఆగని రైళ్లు వివరాలు.... భువనేశ్వర్-రామేశ్వరం, విశాఖపట్టణం-డిగా, చెన్నయ్-న్యూజయపూర్, మైసూర్-హౌరా, చెన్నయ్-హల్దియా, విల్లిపురం-పురీలియా, విల్లిపురం-ఖరగ్పూర్, ఎర్నాకులం-హౌరా, యశ్వంత్పూర్-భగల్పూర్, పూనే-భువనేశ్వర్, తిరుచునాపల్లి-హౌరా, ఇగ్మోర్- గౌహతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు నిలుపుదల చేయడం లేదు. టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలికి సుమా రు 5 కిలోమీటర్ల దూరంలోని నౌపడ రైల్వే స్టేషన్ను పట్టించుకునే నాథుడే కరువయ్యా డు. గ్రానైట్ పరిశ్రమకు ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారు ల రాకపోకలు పెరుగుతున్నా రైల్వే అధికారు లు మాత్రం స్టేషన్పై నిర్లక్ష్యం చూపుతున్నారు. నౌపడ రైల్వే స్టేషన్లో ఫలక్నుమా, కోణార్క్, హౌరా-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సదుపాయం కల్పించాలని పలుమార్లు కేంద్రమంత్రి స్థాయి పాలకులకు విన్నవించినా ఫలితం శూన్యమే. ఇక్కడ సాధారణ రిజర్వేషన్, తత్కాల్ రిజర్వేషన్లకు ప్రత్యేక కౌంటర్లు లేకపోవడం సమస్యగా మారింది. కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్లో సమస్యల కూత వినిపిస్తోంది. స్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన విశ్రాంతి షెడ్లు లేవు.విశాఖ-గుణుపూర్ ప్యాసింజర్ రైలుతో పాటు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఈ స్టేషన్లో హాల్టింగ్ కల్పించాలని పలుమార్లు విన్నవించినా ఫలితం లేదు. మరుగుదొడ్లు, మంచినీటి కొరత ప్రయాణికులను వెంటాడుతున్నాయి.