సెల్ఫీ పిచ్చి పరాకాష్టకు చేరింది. ఎప్పుడు, ఎక్కడ సెల్ఫీ దిగాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. నటుడు, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం సంభవించిన సమయంలో ఆయన్ని నార్కట్పల్లి కామెనేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. అయితే అక్కడ పనిచేసి సిబ్బంది హరికృష్ణ ట్రీట్మెంట్ సమయంలో సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా సోషల్మీడియాలో షేర్ చేసి రాక్షసానందం పొందారు. దీంతో ఆగ్రహానికి గురైన నెటిజన్లు వారిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఎలాంటి సందర్భాల్లో సెల్ఫీలు దిగాలో కూడా తెలియదా అంటూ చివాట్లు పెడుతున్నారు. మానవత్వం చనిపోయిందంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి.