సాక్షి, తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు కస్టడీకి అనుమతించాలని దాఖలు చేసి పిటిషన్ను పరిశీలించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఒక్కరోజు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఓ దళిత పోలీస్ అధికారిని దూషించిన కేసులో ఇటీవల అరెస్ట్ అయిన జేసీని శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవు దినం కావడంతో పోలీసులు ఆదివారం కస్టడీకి తీసుకున్నారు.
త్రీటౌన్ పీఎస్లో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు విచారణ చేస్తున్నారు. దళిత సీఐ దేవేంద్రను ఎందుకు దూషించారు? పోలీసు అధికారులపై పదేపదే ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తున్నారు? కోవిడ్ నిబంధనలు ఎందుకు పాటించలేదు? జనంతో ఎందుకు ర్యాలీ నిర్వహించారు? అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు ప్రశ్నలు సంధించారు. తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు విచారణ చేస్తున్నారు.