
సిరికొండ (నిజామాబాద్ రూరల్): నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వేర్వేరుగా ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మైలానికి చెందిన సల్ల మోహన్రెడ్డి మూడున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. ఆరు బోర్లు వేయగా, ఒక్కదాంట్లోనూ సరిపడా నీళ్లురాలేదు. దీంతో వరి పూర్తిగా ఎండిపోయింది. గల్ఫ్ వెళ్లగా, ఏజెంట్ మోసంతో నెల రోజులకే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో రూ. 10 లక్షల వరకు అప్పులు అయ్యాయి.
భూమి అమ్మినా అప్పు తీరడం లేదని, ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు ఎలా చేయాలనే ఆందోళనకు గురైన మోహన్రెడ్డి సోమవారం ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అయ్యవారిపల్లికి చెందిన నాగయ్యల రాములు(45) ఉపాధి కోసం దుబాయికి వెళ్లి పని లేక తిరిగి వచ్చాడు. గల్ఫ్ వెళ్లేందుకు, కూతురి పెళ్లి చేసేందుకు అప్పు చేసిన రాములు.. అవి తీర్చే దారి కనిపించక మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.