on time
-
కుప్పలు తెప్పలు : రెట్టింపైన ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం
అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ముంబైలో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం తగ్గడం లేదు. వాటర్ బాటిళ్లు, ఆయిల్ బాటిళ్లు, ఫినాయిల్, బాత్రూంలు శుభ్రంచేసే యాసిడ్, ఇతర రసాయనాల బాటిళ్ల వినియోగం విచ్చల విడిగా జరుగుతోంది. వివిధ అవసరాలకు వాడి పారేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లవల్ల పర్యావరణానికీ హాని జరుగుతోంది. 2023తో పోలిస్తే 2024లో ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. 2023లో 67 లక్షల కేజీల ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం జరగ్గా అదే 2024లో ఏకంగా 1,42,23,000 కేజీలకు చేరుకుంది. దీన్ని బట్టి రెట్టింపునకుపైగా ప్లాస్టిక్ వినియోగం జరిగినట్లు స్పష్టమవుతోంది. వన్ టైం యూజ్ బాటిళ్లే ఎక్కువ.. ముంబైలోని వివిధ చెత్త కుండీలలో లభించిన ప్లాస్టిక్ బాటిళ్లను బట్టి ఇందులో అధికంగా ఒకసారి వినియోగించే (వన్ టైం యూజ్) బాటళ్లే అధికంగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో వివిధ రకాల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, తినుబండారాల పార్శిల్ ప్యాకింగులు ఉన్నాయి. ఒకప్పుడు గల్లీలలొ, ఫూట్పాత్లపై, రోడ్ల పక్కన, ఖాళీ మైదానాలలో బీఎంసీ ఏర్పాటుచేసిన కుండీలలో చెత్త అధికంగా కనిపించేది. కానీ ఇప్పడు అదే చెత్త కుండీలలో ప్లాస్టిక్ బాటిళ్లు, క్యారీ బ్యాగులు అధికంగా కనిపిస్తున్నాయి. ఇలా చెత్త కుండీలలో లభించిన ప్లాస్టిక్ బాటిళ్లను నిర్వీర్యంచేసి మళ్లీ కొత్తగా తయారుచేయడానికి వీలున్న బాటిళ్లను బీఎంసీ పారిశుద్ధ్యం విభాగం సిబ్బంది పోగు చేస్తున్నారు. బాటిళ్లతోపాటు భోజనం చేసే ప్లేట్లు, నీటి గ్లాస్లు, స్పూన్లు, పార్శిల్ కంటైనర్లు, స్ట్రాలు, కప్లు, సంచులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఏ మాత్రం తగ్గలేదు. 2023లో నిర్వీర్యం చేసి మళ్లీ వినియోగించే వీలున్న 85–90 లక్షల కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించగా అదే 2024లో 96.6 లక్షల కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించింది. అదే 2022లో 67,12,557 కేజీల ప్లాస్టిక్ సామగ్రి లభించింది. రోజూ 7–8 వేల మెట్రిక్ టన్నుల చెత్త ముంబైలో ప్రçస్తుతం చెత్త నిర్వీర్యం చేసే 48 కేంద్రాలు పని చేస్తున్నాయి. ముంబైలో రోజూ 7–8 వేల మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. పొడి చెత్తలో ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులు, పేపర్లు, కార్డు బోర్డులు, థర్మకోల్, పుట్ట బాక్స్లు, గాజు బాటిళ్లు, పాత దుస్తులు, ఈ–చెత్త ఉంటున్నాయి. 2024లో 6,15,513 కేజీల ఈ–చెత్త పోగుచేశారు. ఇందులో థర్మకోల్ కూడా అధికంగా ఉంది. ఇదిలాఉండగా 2005 జూలై 26వ తేదీన ముంబైలో వచి్చన వరదల్లో 200 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోగా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అప్పట్లో వరదలకు ప్రధాన కారణం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగమేనని తేలింది. దీంతో తేరుకున్న బీఎంసీ 50 మైక్రాన్లకంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై నిషేధం విధించింది. ఆ తరువాత 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్టాస్టిక్ క్యారీ బ్యాగులు తయారుచేసే కంపెనీలపై, నిల్వచేసే గోడౌన్లపై, విక్రయించే వ్యాపారులపై వినియోగదారులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఆ సమయంలో 833 మంది విక్రయించే వ్యాపారులు, వినియోగదారుల నుంచి 3,148 కేజీల ప్టాస్టిక్ను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రూ.41.70 లక్షల జరిమానా వసూలు చేశారు. ప్రస్తుతం ప్లాస్టిక్ తయారు, విక్రయం, వినియోగించే వారిపై అంతగా చర్యలు తీసుకోవడం లేదు. నామమాత్రంగా దాడులు చేసి కంపెనీలకు సీలు వేయడం, విక్రయించే వ్యాపారులు, వినియోగించే సామాన్యులపై చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ వినియోగం భారీగానే జరుగుతోంది. -
చల్లటి కబురు.. మూడు రోజుల్లో నైరుతి!
సాక్షి, హైదరాబాద్: నైరుతి పులకరించనుంది. అతి త్వరలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని కొంత భాగంలోకి వ్యాపించాయి. రానున్న రెండుమూడు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రానికి దక్షిణ దిశలో ఉన్న జిల్లాల్లో రుతుపవనాలు ముందుగా ప్రవేశించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైంది. అయితే, రాష్ట్రంలో రుతుపవనాల సీజన్ అప్పుడే కనిపిస్తోంది. నైరుతి ప్రవేశానికి ముందుగానే వానలు కురుస్తున్నాయి. సాధారణ వర్షపాతం నుంచి భారీ, అతిభారీ వానలు గత రెండుమూడు రోజులుగా నమోదవుతున్నాయి. సీజన్కు ముందే వర్షాలు కురవడంతో రైతాంగంలో నూతనోత్సాహం నిండుతోంది. మరోవైపు వేసవి ఉష్ణోగ్రతలతో ఉక్కపోతకు గురైన ప్రజలు కాస్త చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా, రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా నైరుతి, ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈసారీ భారీ వర్షాలే... రాష్ట్రంలో ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గతేడాది రుతుపవనాల రాక ఆలస్యమైనా... చివరి రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర సాధారణ వర్షపాతం 72.04 సెంటీమీటర్ల వర్షపాతం ఉండగా సీజన్ ముగిసేనాటికి 107.83 సెం.మీ వర్షపాతం నమోదైంది. సాధారణంకంటే 50 శాతం అధికంగా వానలు కురిశాయి. గత సీజన్తో పోలిస్తే 5 శాతం తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ లెక్కన సాధారణ వర్షపాతాన్ని మించి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి మొదలుకుని భారీ వర్షాలు కురిసాయి. వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. చదవండి: థర్డ్వేవ్ తీవ్రత: ఆ మూడే కీలకం! -
అన్నదాతకు ‘వర్షా’నందం
భువనేశ్వర్: దేశంలో రుతు పవనాల ఆగమనానికి సానుకూల సంకేతాలు లభిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి వానలు దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సామాన్యంగా ఉంటాయి. వర్షాధార పంట పొలాల ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా వర్షం కురుస్తుంది. జూన్ నెలలో రాష్ట్రంలో సాధారణం కంటే అధికంగా వర్షం కురుస్తుందని భారత వాతావరణ విభాగం సోమవారం ముందస్తు (లాంగ్ రేంజ్ ఫోర్కాస్టు) సమాచారం జారీ చేసింది. రాష్ట్రంలో నైరుతి వానలు ప్రారంభమయ్యే తేదీ ఇంకా స్పష్టం కానట్లు వాతావరణ విభాగం తెలిపింది. దేశవ్యాప్తంగా సాధారణం నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఈ ఏడాది దేశ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుంది. అత్యధిక ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుందని భావిస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 96 శాతం నుంచి 104 శాతం సమగ్ర వర్షపాతం ముందస్తు అంచనాగా వాతావరణ విభాగం పేర్కొంది. పిడుగుపాటు హెచ్చరిక రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పిడుగుపాటు ప్రమాదాలు ఉన్నట్లు స్థానిక వాతావరణ విభాగం ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. రానున్న 3 రోజుల్లో మారుమూల ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. బాలాసోర్, భద్రక్, సుందరగడ్, కెంజొహార్, మయూర్భంజ్, సోన్పూర్, బౌధ్, నువాపడా, కలహండి, కందమాల్, నవరంగపూర్, రాయగడ, కొరాపుట్, మల్కన్గిరి, గజపతి, గంజాం, ఖుర్దా, నయాగడ్ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో వాతావరణంలో మార్పు సంభవిస్తుందని ఉరుములు, మెరుపులతో పిడుగుపాటు సంఘటనలకు ముందస్తు సమాచారం జారీ అయింది. సమగ్రంగా 21 జిల్లాల్లో కాల వైశాఖి వాతావరణం తాండవిస్తుందని ఎల్లో వార్నింగ్ జారీ అయింది. ఈ నెల 2వ తేదీ నుంచి 3వ తేదీ ఉదయం వరకు ఇటువంటి వాతావరణం బాలాసోర్, భద్రక్, జాజ్పూర్, కేంద్రాపడా, జగత్సింగ్పూర్, కటక్, ఢెంకనాల్, కెంజొహార్, మయూర్భంజ్, నువాపడా, కలహండి, కందమాల్, నవరంగపూర్, రాయగడ, కొరాపుట్, మల్కన్గిరి, గజపతి, గంజాం, పూరీ, ఖుర్దా, నయాగడ్ జిల్లాల్లో నెలకొని ఉంటుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 4వ తేదీ ఉదయం వరకు బాలాసోర్, భద్రక్, దేవ్గడ్, అనుగుల్, కెంజొహార్, మయూర్భంజ్, సోన్పూర్, బౌధ్, నువాపడా, బలంగీరు, కలహండి, కందమాల్, నవరంగపూర్, కొరాపుట్, మల్కన్గిరి జిల్లాలకు పిడుగుపాటు వాతావరణం నెలకొంటుంది. -
ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాలేదు!
కొందరు పిల్లలు స్కూలుకు వెళ్లేందుకు మారాం చేస్తారు. మరికొందరు ఆటలు పోతాయన్న బాధతో, చదువంటే భయంతో ఏడుస్తారు. కొందరు మాత్రం స్కూలంటే ఎంతో ఉత్సాహంగా ఉరకలేస్తారు. ఇప్పుడు దుబాయ్లోని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్లో చదువుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విద్యార్థి.. ఆ మూడో కోవకు చెందినవాడే. ఐదేళ్ళపాటు ఒక్కరోజు కూడా స్కూలుకు ఆలస్యంగా వెళ్లకపోగా.. ఏరోజూ స్కూలు మానకుండా నూరు శాతం హాజరుతో ఏకంగా ఐదు మెడల్స్ సంపాదించి అందర్నీ అబ్బురపరిచాడు. చిన్నవయసు నుంచే పాఠశాలపై మక్కువ ఉండటంతో పాటు.. వందశాతం హాజరు ఉండాలన్న ఆశయంతో స్కూలుకు వెళ్లిన గల్ఫ్ విద్యార్థి... ఐదేళ్లకు గాను ఐదు మెడల్స్, ఐదు సర్టిఫికెట్లు సంపాదించి ఏ విద్యార్థికీ సాధ్యం కాని ప్రత్యేకతను సాధించాడు. ఇప్పుడు తనకు వచ్చిన సర్టిఫికెట్లు, మెడల్సే తన కచ్చితత్వానికి నిదర్శనమని, ఇది ఏ ఇతర విద్యార్థులనూ కించపరిచే విషయం కాదని అతడు ఆనందంగా చెప్తున్నాడు. ఒక విద్యార్థి ప్రతిరోజూ పది నిమిషాలు స్కూలుకు ఆలస్యమైతే ఏడాదిలో 30 గంటల పాఠాలను కోల్పోతాడన్న విషయాన్ని చిన్నతనంలో ఎక్కడో చదివానని, అప్పట్నుంచీ తాను చదువులో ముందున్నా లేకున్నా స్కూలుకు మాత్రం ఆలస్యంగా వెళ్ళకూడదని నిశ్చయించుకున్నానని చెప్తున్నాడు. అనుకున్నది సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, అయితేనేం మెడల్స్ సాధించగలగడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్తున్నాడు. తన కష్టానికి ఈ మెడల్సే నిదర్శనమంటున్నాడు. ఐదు అంకె తన లక్కీ నెంబర్ అని చెప్తున్న సదరు విద్యార్థి, ఐదో తరగతి నుంచి ప్రారంభించిన తన దీక్షను విజయవంతంగా కొనసాగించి ఐదు మెడల్స్ సాధించగలగడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటున్నాడు. తన కష్టాన్ని, కచ్చితత్వాన్ని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్ గుర్తించిందని, అదే తన ఆనందానికి ప్రధాన కారణమైందని చెబుతున్నాడు.