
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గతేడాది కొత్త ప్రాజెక్టుల ధరలు సగటున 9 శాతం మేర పెరిగినట్లు డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. 2024–25లో ప్రాపర్టీ ధరలు సగటున 9 శాతం పెరిగి చ.అ.కు రూ.13,197కు చేరినట్లు పేర్కొంది. ఏడాది కాలంలో కోల్కతాలో ఇళ్ల ధరలు అత్యధికంగా 29 శాతం మేర పెరిగాయి. ఆ తర్వాత థానేలో 17 శాతం, బెంగళూరులో 15 శాతం, పుణెలో 10 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 5 శాతం, హైదరాబాద్లో 5 శాతం, చెన్నైలో 4 శాతంగా ఉన్నాయి.
ముంబై, నవీ ముంబైలో ఇళ్ల ధరలు 3 శాతం తగ్గాయి. కాగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల ధరలు 18 శాతం పెరిగాయి. అత్యధికంగా బెంగళూరులో 44 శాతం వృద్ధి నమోదయ్యింది. కోల్కత్తాలో 29 శాతం, చెన్నైలో 25 శాతం, థానేలో 23 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 20 శాతం, పుణేలో 18 శాతం, నవీ ముంబైలో 13 శాతం, ముంబైలో 11 శాతం, హైదరాబాద్లో 5 శాతం పెరుగుదల నమోదు చేసింది. మరోవైపు ఈ ఏడాది జనవరి–మార్చిలో గృహాల అమ్మకాలు 23 శాతం తగ్గి, 1,05,791 యూనిట్లకు చేరుకోగా.. సరఫరా 34 శాతం తగ్గి 80,774లకు చేరుకుంది.
ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్లలో ధరలను పరిశీలిస్తే.. బెంగళూరులో గతేడాది చ.అ. సగటున ధర రూ.8,577 ఉండగా.. ప్రస్తుతం అది రూ.9,852కు పెరిగింది. కోల్కత్తాలో చ.అ. ధర రూ.6,201 నుంచి రూ.8,009కి పెరిగింది. చెన్నైలో రేట్లు చ.అ.కు రూ.7,645 నుంచి రూ.7,989కు పెరిగాయి. హైదరాబాద్లో చ.అ.కు రూ.7,890 నుంచి రూ.8,306కు పెరిగాయి. పుణెలో చ.అ.కు రూ.9,877 నుంచి రూ.10,832కు పెరిగాయి. థానేలో సగటు చ.అ. ధర రూ.11,030 నుంచి రూ.12,880కు పెరిగాయి. ఢిల్లీలో చ.అ.కు రూ.13,396 నుంచి రూ.14,020కు పెరిగాయి.