
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా (Prabhu Deva) జీవితంలో ఇద్దరు మహిళలు భార్య స్థానాన్ని పొందారు. గతంలో ఈయన రామలతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం కాదా అందులో ఓ అబ్బాయి టీనేజ్లో మరణించాడు. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. అవి విడాకుల వరకూ వెళ్లాయి. నయనతార వల్లే విడిపోయామని ఆమధ్య రమాలత్ మీడియా ముందే తేల్చేసింది.
పిల్లలంటే ప్రాణం
అనంతరం ప్రభుదేవా 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. 2020లో ఫిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్ను వివాహం చేసుకోగా వీరికి ఓ పాప కూడా పుట్టింది. తాజాగా ప్రభుదేవా మాజీ భార్య రమాలత ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రభుదేవాకు మా పిల్లలంటే ప్రాణం. వారిని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. నా ఇద్దరు కొడుకులకు కూడా తండ్రితో మంచి అనుబంధం ఉంది. వారు బయటకు వెళ్లాలనుకున్నప్పుడు నాతో పాటు ప్రభుదేవా అనుమతి అడుగుతారు.
అదే రక్తం..
ప్రభుదేవా సంగీత కచేరిలో నా పెద్ద కొడుకు రిషి డ్యాన్స్ అద్భుతంగా చేశాడు. తండ్రి రక్తమే తనలోనూ ప్రవహిస్తోంది. అందరూ వాడి డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు. అలా ఎలా చేయగలిగాడు? అని అడుగుతున్నారు. అతడు కేవలం రెండేళ్ల నుంచే డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు. హీరోగానూ అవకాశాలు వస్తున్నాయి. చిన్నవాడికి మాత్రం సినిమాలపై ఏమాత్రం ఆసక్తి లేదు. తను డాక్టర్ అవుతానంటున్నాడు. విదేశాలకు పంపించి బాగా చదివించాలనుకుంటున్నాం.
అతడే సపోర్ట్..
ప్రభుదేవాకు, నాకు విడాకులయ్యాయి. అంతమాత్రాన మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. పైగా నాకు, నా పిల్లలకు అతడే సపోర్ట్గా నిలబడ్డాడు. ఎన్నడూ నా గురించి ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడలేదు. అందుకే ఆయన్ని ఎప్పటికీ వదులుకోలేను. అయితే ఒంటరిగా పిల్లల్ని పెంచడం అనేది కష్టమే! ఆ కష్టాల్ని నేను అధిగమించాను. మంచి తండ్రిగా ప్రభుదేవా నా పిల్లల కోసం ఎప్పుడూ నిలబడ్డాడు అని లత చెప్పుకొచ్చింది.
చదవండి: కమెడియన్ సత్య కాళ్లు మొక్కిన రామ్చరణ్.. వీడియో వైరల్