
మహారాణిపేట (విశాఖ దక్షిణ): నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే 24 గంటల్లో దేశంలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు మధ్య ప్రాంతం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఛత్తీస్గఢ్ పరిసరాల్లో 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వడగాలుల ప్రమాదం
రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినా వచ్చే మూడు రోజలపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఎండ నిప్పుల వానలా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వడగాలులు వీస్తాయని, 41 నుంచి 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావొద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment