Temperatures
-
భానుడి ప్రతాపం.. జనవరిలో రికార్డు ఉష్ణోగ్రతలు
వాతావరణంలో రికార్డు స్థాయిలో జనవరి 2025లో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (సీ3ఎస్) తెలిపింది. లా నినా, తూర్పు పసిఫిక్లో ఏర్పడే ఉష్ణోగ్రతల వల్ల వాతావరణ మార్పుల్లో తేడాలొస్తున్నట్లు పేర్కొంది. జనవరిలో సాధారణంగా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. కానీ అందుకు భిన్నంగా జనవరి 2025లో సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 13.23 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు సీ3ఎస్ తెలిపింది. ఇది 2024 జనవరిలో నమోదైన రికార్డు కంటే 0.09 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉంది.‘లా నినా’ అనేది మధ్య పసిఫిక్ మహాసముద్రంలో చల్లని ఉపరితల జలాలతో ఏర్పడే వాతావరణాన్ని సూచిస్తుంది. ఇది పసిఫిక్ చుట్టు పక్కల ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. ప్రపంచ ఉష్ణోగ్రతలపై లా నినా ప్రభావం ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. తూర్పు పసిఫిక్లో మాత్రం సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ పరస్పర విరుద్ధం వాతావరణంలో మార్పు అధికంగా ఉండడంతోనే ఉష్ణోగ్రతలు పెరుగతున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.గ్లోబల్ వార్మింగ్ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. ఉష్ణమండల పసిఫిక్లో ఏర్పడే ఉష్ణోగ్రతలు లా నినాపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు సీ3ఎస్ డిప్యూటీ డైరెక్టర్ సమంత బర్గెస్ పేర్కొన్నారు. ప్రపంచ ఉష్ణోగ్రతలపై లా నినా తాత్కాలిక శీతలీకరణ ప్రభావం ఉన్నప్పటికీ గత రెండు సంవత్సరాలుగా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు. అయితే ఈ ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా ఓకే ప్రభావాన్ని చూపలేదన్నారు. యునైటెడ్ స్టేట్స్లోని కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా చల్లని ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కెనడియన్ ఆర్కిటిక్ వంటి ప్రాంతాల్లో 30 డిగ్రీ సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత రికార్ట్ అయింది. ఈ తేలికపాటి వాతావరణం ఆర్కిటిక్లో సముద్ర మంచు మట్టాన్ని ప్రభావితం చేసిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. నారాయణమూర్తి ఏమన్నారంటే..2025 జనవరిలో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలు గ్లోబల్ వార్మింగ్పై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. జనవరిలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైతే రాబోయే వేసవికాలంలో ఏమేరకు ఉష్ణోగ్రతలు చూడాల్సి వస్తుందోనని నిపుణులు ఆందోళనలు చెందుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉష్ణోగ్రతల్లో స్థిరమైన పెరుగుదల ఇబ్బందికరమైన అంశాన్ని సూచిస్తుంది. వాతావరణ మార్పుల ప్రభావాలతో ప్రపంచం సతమతమవుతున్న తరుణంలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల రాబోయే వేసవిలో వ్యవసాయ దిగుబడులు ప్రభావితం చెందే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అది వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడే కంపెనీల బ్యాలెన్స్షీట్లను ఎఫెక్ట్ చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. -
మానవాళికి ప్రకృతి శాపం!
‘వాతావరణం కూడా ప్రభుత్వాల వంటిదే. అదెప్పుడూ చెడ్డగానే ఉంటుంది’ అంటాడు బ్రిటిష్ వ్యంగ్య రచయిత జెరోమ్ కె. జెరోమ్. అది ముమ్మాటికీ నిజం. దేశంలో గత 123 ఏళ్లలో కనీవినీ ఎరగనంత స్థాయి ఉష్ణోగ్రతలు నిరుడు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) చేసిన ప్రకటన హడలెత్తిస్తోంది. అంతేకాదు... వచ్చే ఏడాది సైతం రికార్డులు బద్దలయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తోంది. మనదేశం మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుటి ఉష్ణో గ్రతలు అధికంగానే ఉన్నాయని వివిధ దేశాల వాతావరణ విభాగాల ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది. మన పొరుగునున్న చైనాలో 1961 నుంచీ పోల్చిచూస్తే గత నాలుగేళ్ల ఉష్ణోగ్రతలు చాలా చాలా ఎక్కువని అక్కడి వాతావరణ విభాగం తెలియజేసింది. నిజానికి 2024లో ప్రపంచ ఉష్ణో గ్రతల స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఇంకా అధికారిక నివేదిక విడుదల చేయలేదు. అందుకు మార్చి వరకూ సమయం ఉంది. కానీ ఈలోగా కొన్ని కొన్ని అంశాల్లో వెల్లడైన వాతావరణ వైపరీత్యాలను అది ఏకరువు పెట్టింది. అవి చాలు... మనం ఆందోళన పడటానికి! వాటి ప్రకారం– నిరుడు జనవరి నుంచి సెప్టెంబర్ నెలలమధ్య ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు కాలం నాటికంటే సగటున 1.54 డిగ్రీల సెల్సియస్ అధికం. అలాగే అంటార్కిటిక్ సముద్రంలో మంచు పలకలు మునుపటితో పోలిస్తే అధికంగా కరుగుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన వాతావరణం వల్ల నిరుడు మరణాలు, ఆర్థిక నష్టాలు కూడా బాగా పెరిగాయి. సాగర జలాల ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. సముద్ర మట్టాలు ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి. నిరుడు ప్రపంచవ్యాప్తంగా రికార్డయిన 29 వాతావరణ ఘటనలను విశ్లేషిస్తే అందులో 26 కేవలం వాతావరణ మార్పులవల్ల జరిగినవేనని తేలిందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ఈ ఉదంతాల్లో 3,700 మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని వివరించింది.స్వర్గనరకాలు మరెక్కడో లేవు... మన ప్రవర్తన కారణంగా ఆ రెండూ ఇక్కడే నిర్మితమవుతా యంటారు. వాతావరణం విషయంలో ఇది ముమ్మాటికీ వాస్తవం. మానవ కార్యకలాపాలే వాతా వరణ వైపరీత్యాలకు మూలకారణం. నూతన సంవత్సర సందేశంలో గత దశాబ్దకాలపు వార్షిక ఉష్ణోగ్రతలన్నీ రికార్డు స్థాయివేనని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. ఈ వినాశకర దోవ విడనాడాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన శాస్త్రం విస్తరిస్తోంది. వినూత్న ఆవిష్కర ణలు అందుబాటులోకొస్తున్నాయి. కానీ వీటిని చూసి విర్రవీగి, ప్రకృతి చేస్తున్న హెచ్చరికలను పెడ చెవిన పెట్టిన పర్యవసానంగా అది ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రకృతి చెప్పినట్టు వింటూ అది విధించిన పరిమితులను శిరసావహించాలి తప్ప దాన్ని నిర్లక్ష్యం చేస్తే వినాశనం తప్పదని ఏటా వెలువడే నివేదికలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ వినేదెవరు? లాభార్జనే తప్ప మరేమీ పట్టని పరిశ్రమలు, అభివృద్ధి పేరిట ఎడాపెడా అనుమతులు మంజూరు చేస్తున్న పాలకులు, వాతావరణం నాశనమవు తున్నదని గ్రహించే చైతన్యం లోపించిన ప్రజలు పర్యావరణ క్షీణతకు దోహదపడుతున్నారు. అయి దేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పర్యావరణ పరిరక్షణ అంశం ఏనాడూ ప్రస్తావనకు రాదు. మన దేశంలోనే కాదు... ప్రపంచంలో వాతావరణ శిఖరాగ్ర సదస్సుల వంటివి నిర్వహించినప్పుడు తప్ప మరెక్కడా పర్యావరణం గురించి చర్చ జరగటం లేదు. ఇది ప్రకృతి విధ్వంసానికి పాల్పడే పారిశ్రామికవేత్తలకూ, పాలకులకూ చక్కగా ఉపయోగపడుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగాల్సిందే. అందుకవసరమైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ అభివృద్ధి అవసరాల కోసం పర్యావరణాన్ని బలిపెట్టే విధానాలు మొత్తంగా మానవాళికే ప్రమాదకరం. పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్నదనే విషయంలో ఎవరూ పెద్దగా విభేదించటం లేదు. కానీ దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలే నత్తనడకన ఉంటున్నాయి. ప్రపంచంలో కర్బన ఉద్గా రాల తగ్గింపునకు 2015 పారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. చెప్పాలంటే ఆ దిశగా ఎంతోకొంత అడుగులేస్తున్నది మనమే. ఆ శిఖరాగ్ర సదస్సు 2050 నాటికి భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ నిలువరించాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. అయితే దాన్ని చేరుకోవటానికి వివిధ దేశాలు ఇచ్చిన హామీలు ఏమాత్రం సరిపోవన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణానికి తూట్లు పొడవటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంపన్న రాజ్యాలు బడుగు దేశాలకు హరిత ఇంధన సాంకే తికతలను అందించటంలో, అందుకవసరమైన నిధులు సమకూర్చటంలో ముఖం చాటేస్తున్నాయి. వాతావరణ మార్పుపై చెప్తున్నదంతా బోగస్ అనీ, పారిస్ ఒడంబడిక నుంచి తాము వైదొలగు తున్నామనీ అమెరికాలో క్రితంసారి అధికారంలోకొచ్చినప్పుడే ప్రకటించిన ట్రంప్... ఈసారి కూడా ఆ పనే చేస్తారు. ప్రపంచ దేశాల మాటెలావున్నా ఈ ఏడాది సైతం ఉష్ణోగ్రతలు భారీగా నమోదుకావొచ్చన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ మొదలుకొని అన్ని ప్రభుత్వ శాఖలూ, విభాగాలూ అట్టడుగు స్థాయివరకూ తగిన వ్యూహాలు రూపొందించుకోవాలి. మండే ఎండలు మాత్రమే కాదు... జనావాసాలను ముంచెత్తే వరదలు కూడా ఎక్కువే ఉంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను గరిష్ట స్థాయిలో ఉంచటానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేసుకోవాలి. బాధిత ప్రజానీకానికి సాయం అందించటానికి అవసరమైన వనరులను సమీకరించుకోవాలి. -
చలికాలంలోనూ ‘ఎండలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలికాలం కొనసాగుతున్నప్పటికీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే స్వల్పంగా పెరిగాయి. ఇటీవలి తుపానుతోపాటు బంగాళాఖాతంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో రాష్ట్ర వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో తేమ శాతం కూడా వేగంగా పెరిగింది. దీంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఖమ్మంలో అత్యధికంగా 33.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇది సాధారణం కంటే 4.5 డిగ్రీలు అధికం. అలాగే భద్రాచలం, హనుమకొండ, హైదరాబాద్, నిజామాబాద్లలో రెండు డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రామగుండం, మెదక్, దుండిగల్లలో సాధారణం కంటే 7 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవడం గమనార్హం. మిగిలిన చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
వణికిస్తున్న చలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రివేళ చలి పెరిగిపోతోంది. కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల చోటు చేసుకుంటోంది. ప్రస్తుత సమయంలో సాధారణంగా నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతల కంటే తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దిగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతుండడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 2 డిగ్రీల సెల్సియస్ తక్కువగా, కనిష్ట ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. మరో మూడు రోజుల పాటు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్టం నిజామాబాద్ ః 32.4 శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్లో 32.4 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట అదిలాబాద్లో 8.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.రాష్ట్రంలోని దాదా పు 30 ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదు అయ్యింది. ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కాగా, మెదక్, హనుమకొండల్లో 3 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదైంది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు తాజా పరిస్థితుల్లో కుమ్రుంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో శీతలగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించింది. శని, ఆదివారాల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఉదయం పూట పొగమంచుకు అవకాశం ఉంటుందని సూచించింది. -
Andhra Pradesh: ఏజెన్సీ గజగజ
ఏజెన్సీ ప్రాంతంలో సాయంత్రం 4గంటల నుంచే చలిగాలులు విజృంభిస్తున్నాయి. పాడేరు ఘాట్లో చలితీవ్రత మరింత ఎక్కువైంది. శనివారం పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 10 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 14డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 14.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీవ్యాప్తంగా ఉదయం 10గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. సాయంత్రం నుంచే అన్ని వర్గాల ప్రజలు చలిమంటలను ఆశ్రయించారు. ఘాట్ ప్రాంతాల్లో చలి మరింత ఇబ్బంది పెడుతోంది.– సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) -
మొదలైన ‘గజగజ’!.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుత సమయంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ వరకు తక్కువ నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు తగ్గడం, మరోవైపు రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకోవటంతో జ్వరాలు, జలుబు, దగ్గులాంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు వైద్యారోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రమంతా పడిపోతున్న ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 9.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధాన పట్టణాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం నిజామాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 32.1 డిగ్రీలు నమోదుకాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 11.8 డిగ్రీల సెల్సియస్గా రికార్డయ్యింది. ఆదిలాబాద్, హనుమ కొండ, మెదక్, పటాన్చెరు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు.. హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. రానున్న మూడురోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
ఈసారి వణికించే చలి!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత శీతాకాలంలో చలితీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. డిసెంబర్, జనవరి నెలల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా నమోదవుతాయని సూచించింది. లానినొ పరిస్థితుల కారణంగా వాతావరణంలో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రాథమిక అంచనాలను భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా విడుదల చేసింది. సాధారణంగా వర్షాకాలం ముగిసిన తర్వాత అక్టోబర్ నెలలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే తక్కువ స్థాయిలో నమోదవుతుంటాయి. కానీ ప్రస్తుతం అందుకు భిన్నమైన వాతావరణం రాష్ట్రంలో ఏర్పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు చాలాచోట్ల సాధారణం కంటే అధికంగా నమోదు కావడంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ఉష్ణోగ్రతలు పెరగడం, ఆ తర్వాత ఒక్కసారిగా పతనం కావడంలాంటి పరిస్థితులు ఈ సీజన్లో కనిపించే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తూర్పు, మధ్య పసిఫిక్ ప్రాంతంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు (లానినొ) నమోదవుతుండడమే ఇందుకు కారణమని వివరిస్తున్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని, ఉదయం వేళల్లో తీవ్రమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. గతంలో, తాజాగా 2022లో కూడా రాష్ట్రంలో ఈ తరహా లానినొ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ నగర శివారుల్లోని కొన్ని ప్రాంతాల్లో 8 డిగ్రీ సెల్సీయస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయని, ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 4 డిగ్రీలకు పడిపోయిందని గుర్తుచేస్తున్నారు.సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలుసోమవారం రాష్ట్రంలోని పలు ప్రధాన కేంద్రాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. నిజామాబాద్లో 35.6 డిగ్రీ సెల్సీయస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా దుండిగల్లో 20.7 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీ సెల్సీయస్ అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది. పలు జిల్లాలకు వర్ష సూచనరాష్ట్రంలో రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ, మధ్య బంగాళాఖాతం సమీపంలోని ఏపీ తీర ప్రాంతంలో చక్రవాతపు ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావం ఏపీలో అధికంగా ఉన్నప్పటికీ, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని సూచించింది. పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. -
రాష్ట్రంలో మూడేళ్లుగా చలి తక్కువే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత మూడేళ్లుగా అత్యంత చలి రోజులు నమోదు కాలేదు. అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా గత ఐదేళ్లతో పోలిస్తే 2023లోనే నమోదయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో సంవత్సరాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజులు, అత్యధిక చలి నమోదైన రోజుల వివరాలను కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక–2024 వెల్లడించింది.2014లో సగటున మూడ్రోజులు మాత్రమే అత్యంత చలి నమోదైందని, 2018లో సగటున ఏనిమిది రోజులు అత్యంత చలి నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2019లో కేవలం ఒకరోజు మాత్రమే అత్యంత చలి నమోదైతే.. 2020లో ఆరు రోజులపాటు అత్యంత చలి నమోదైంది. అదే 2021 నుంచి 2023 వరకు ఒక్కరోజు కూడా అత్యంత చలి నమోదు కాలేదుఇక 2023లో దేశంలో ఢిల్లీ, హరియాణ, రాజస్థాన్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అత్యధిక చలి రోజులు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. 2023లో ఢిల్లీలో అత్యధికంగా సగటున ఐదు రోజులు అత్యంత చలి రోజులు నమోదైంది. వరుసగా రెండ్రోజులు 45 డిగ్రీలుంటే హీట్ వేవ్..ఎక్కడైనా రెండ్రోజులపాటు గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే హీట్వేవ్ పరిస్థితులుగా పరిగణిస్తారు. రాష్ట్రంలో 2016 మే 2న ప్రకాశం జిల్లా వెలిగండ్లలో అత్యధికంగా 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, 2017 మే 17న ప్రకాశం జిల్లా టంగుటూరులో అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 31 2018లో నెల్లూరు జిల్లా మర్రిపాడు, డిచ్చిపల్లిలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2019 మే 26న కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2020 మేలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2021 మేలో ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 45.9 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఇక 2022లో అత్యధికంగా తిరుపతిలో 45.9 డిగ్రీలు, 2023లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం గ్రామీణ ప్రాంతంలో 2023 మే 16న అత్యథికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.అత్యధిక ఉష్ణోగ్రతల తీరూతెన్ను ఇలా..ఇక రాష్ట్రంలో 2014లో సగటున 16 రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వగా ఆ తరువాత 2023లోనే సగటున 15 రోజుల పాటు ఇవి నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2023లో దేశంలోకెల్లా బిహార్లో 18 రోజులపాటు అత్యధిక వేడి రోజులు నమోదయ్యాయి. ఆ తరువాత ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛతీస్గఢ్ తమిళనాడు రాష్ట్రాలున్నాయని నివేదిక పేర్కొంది. -
నేడు మరో అల్పపీడనం!
మహారాణిపేట (విశాఖ): బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉపరితల అవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇది 15న పశ్చిమ బెంగాల్కు ఆనుకుని బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని వెల్లడించారు. దీని ప్రభావం ఏపీపై ఉండబోదని స్పష్టం చేశారు. ఏపీలో పెరిగిన ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాతావరణంలో వేడి ఎక్కువవుతోంది. గురువారం అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కావలిలో 38.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.మరో వారం ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు తెలిపారు. -
కుండపోత.. ఉక్కపోత!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వాన.. కానీ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తాపూర్లో మాత్రం మండే ఎండ, ఆపై ఉక్కపోత. పక్కపక్కనే ఉన్న రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోటార్ సైకిల్పైనో, కారులోనో అటునుంచి ఇటు, ఇటునుంచి అటు ప్రయాణించిన వారికి ఈ వింతైన అనుభవం ఎదురవుతోంది. గతంలో ఒకచోట వర్షం పడుతుంటే ఆ పక్కనున్న ప్రాంతం కాస్త చల్లగా ఉండేది. కానీ ఇప్పుడు అలా ఉండటం లేదు. వేడి, ఉక్కపోత కొనసాగుతోంది. కొన్నేళ్లుగా భారీ స్థాయిలో చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులతోనే ఒక్కసారిగా అతివృష్టి, లేకుంటే తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొంటున్నారు. ప్రణాళికలు లేని పట్టణీకరణ, పరిమితులు లేని వనరుల వినియోగం, సహజ వనరుల విధ్వంసం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని, జీవన ప్రమాణాలు మరింత దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ప్రపంచంలోని పర్యావరణ నిపుణులు గొంతెత్తి చెబుతున్న ఒకేఒక్క మాట ‘ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్’. సీజన్కు అనుగుణంగా ఉష్ణోగ్రతలు, వర్షాలు నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పుడు పర్యావరణంలో నెలకొన్న భారీ మార్పులతో ఎండ, వానలు గతి తప్పాయి. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి నెలకొంది. సీజన్లో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రత, సాధారణ వర్షపాతం గణాంకాల్లో భారీ వ్యత్యాసం నమోదవుతూ వస్తోంది. ఉదాహరణకు అదిలాబాద్లో ప్రస్తుత సీజన్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీ సెల్సీయస్ నమోదు కావాల్సి ఉండగా.. సోమవారం ఏకంగా 34.3 డిగ్రీ సెల్సీయస్గా నమోదైంది. అదేవిధంగా ఖమ్మంలో ఈ సీజన్ సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత 31.5 డిగ్రీ సెల్సీయస్ కాగా..సోమవారం 34.6 డిగ్రీ సెల్సీయస్గా నమోదైంది. రామగుండంలో 31.1 డిగ్రీ సెల్సీయస్ సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతకు గాను 34.2 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. ఈ మూడు ప్రాంతాల్లోనూ సోమవారం నాడు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. ఆగస్టు నెలలో సాధారణ ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమోదు కావాల్సి ఉండగా, ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వాటికి తీవ్ర ఉక్కపోత తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రంలో 49.62 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. సోమవారం నాటికి 56.07 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్ర సగటును పరిశీలిస్తే సాధారణం కంటే 13 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు కనిపిస్తున్నప్పటికీ.. చాలా జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. అంటే కొన్ని జిల్లాల్లో కురిసిన అతి భారీ వర్షాలే గణాంకాలను గణనీయంగా పెంచేశాయన్న మాట. ఉమ్మడి మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో ఈ అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. అంటే కొన్నిచోట్ల అతి తక్కువ వర్షాలు లేదా అసలు వర్షమే లేకపోగా కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు నమోదయ్యాయన్న మాట. వాతావరణంలోనూ ఇదే తరహా భిన్నమైన పరిస్థితులు నెలకొంటుండటం గమనార్హం. పట్టణీకరణ పేరిట వనరుల విధ్వంసం పట్టణీకరణ పేరిట ఇప్పుడు వనరుల విధ్వంసం విపరీతంగా పెరుగుతోంది. పట్టణీకరణ వల్ల నీటివనరులు పెద్దయెత్తున ఆక్రమణలకు గురవుతుండగా.. చెట్లు, పుట్టలను ఇష్టారాజ్యంగా తెగనరికేస్తున్నారు. మొదట్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్గా ప్రారంభమై ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెంది అంతకంతకకూ విస్తరిస్తున్నా.. నగరీకరణపై సరైన వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడంతో నష్టం వాటిల్లుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వందలాది చెరువులతో కళకళలాడిన హైదరాబాద్, ఇప్పుడు నీటి సమస్యతో సతమతమవుతోందని, చెరువులు కబ్జాల పాలుకావడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీటి వనరులు కబ్జాలపాలు కావడంతో నీటి ప్రవాహం దెబ్బతిని వరదలు పెరుగుతున్నాయని, చివరకు నిల్వ చేయాల్సిన నీరు సముద్రం పాలుకావడంతో నీటి సమతుల్యత దెబ్బతింటోందని వివరిస్తున్నారు. అదేవిధంగా ఓపెన్ స్పేస్ నిబంధనలు గాలికొదిలి అనేక అంతస్తులతో భారీ నిర్మాణాలు చేపట్టడం, విచ్చలవిడి లేఅవుట్లతో పచ్చదనం పూర్తిగా తగ్గిపోతోందని అంటున్నారు. దేశంలో అత్యంత తక్కువ ఓపెన్ స్పేస్ ఏరియా ఉన్న నగరంగా హైదరాబాద్ రికార్డుల్లోకి ఎక్కడాన్ని గుర్తు చేస్తున్నారు. పెరగని సాగు విస్తీర్ణం సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం, ఉక్కపోతతో కూడిన విభిన్న వాతావరణం నెలకొనడం పంటల సాగుపైనా ప్రభావం చూపించింది. వానాకాలం సీజన్ చివరి దశకు చేరుకున్నా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగలేదు. ఈ సీజన్లో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా.. ఈ నెల 14వ తేదీ వరకు 1.03 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు వేయాల్సి ఉంది. కానీ 94 లక్షల ఎకరాల మేర మాత్రమే పంటలు సాగవడం గమనార్హం. నీటి వనరుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి హైదరాబాద్ లాంటి నగరానికి అతి త్వరలో తీవ్ర నీటి సమస్య ఎదురు కానుంది. ఒకప్పుడు వేలల్లో ఉన్న చెరువులు ఇప్పుడు వందల్లోకి పడిపోయాయి. నీటి నిల్వలకు కేంద్రంగా ఉండే చెరువుల సంఖ్య తగ్గిపోతుండగా కాలువలన్నీ కబ్జాలపాలవుతున్నాయి. ఉదాహరణకు ఫిరంగిరనాలా అనే కాలువతో శివారు ప్రాంతాల్లోని 22 చెరువులు నీటితో నిండేవి. కానీ ఈ నాలా కబ్జాకు గురైంది. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కానీ ఫలితం లేదు. ఆ నాలాను పునరుద్ధరిస్తే దాని కింద ఉన్న గొలుసుకట్టు చెరువులు నీటితో కళకళలాడుతాయి. అదేవిధంగా నగరంలో ఉన్న చెరువులు, ప్రధాన కాలువలను పునరుద్ధరించి పరిరక్షిస్తే నీటి సమస్యకు కొంతైనా పరిష్కారం లభిస్తుంది. – ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త సమగ్ర ప్రణాళికతోనే సాధ్యం... నగరీకరణలో అత్యంత కీలకం సమగ్ర ప్రణాళిక. కానీ ఇప్పుడు కేవలం కట్టడాలతోనే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన ఉంది. అడ్డగోలు కట్టడాలతో కాంక్రీట్ జంగిల్గా మారడం తప్ప మెరుగైన జీవావరణం ఏవిధంగా సాధ్యమవుతుంది. అందకే పక్కా ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పుడు హైదనాబాద్లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ గత కొన్ని రోజులుగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇదే చిత్తశుద్ధితో పూర్తిస్థాయిలో కట్టడాల తొలగింపుతో పాటు ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను వ్యూహాత్మకంగా అమలు చేయాలి. – సుబ్బారావు, పర్యావరణ నిపుణులు వర్షాకాలంలోనూ ఎండ వేడిమి...పగటిపూటే కాకుండా రాత్రిళ్లు కూడా ఉక్కపోత కొనసాగుతుండటంతో ఏసీలు, కూల ర్లను రోజంతా వాడక తప్పని పరిస్థితి నెలకొంది దీంతో ఈ నెలలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఆదివారం (ఆగస్టు 18న) 273.665 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగ్గా.. గతేడాది ఇదే రోజున 254.123 మిలియన్ యూనిట్ల వినియోగమే నమోదు కావడం ప్రస్తుత పరిస్థితిని స్పష్టం చేస్తోంది. వాస్తవానికి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి 17 వరకు అధిక విద్యుత్ వినియోగం నమోదు కావడం గమనార్హం. -
హీట్ వేవ్స్.. హాట్ సేల్స్
అల్పపీడన ద్రోణి కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. దీనికితోడు విపరీతమైన ఉక్కపోతతో జనం ‘చల్ల’దనం కోసం పరుగులు తీస్తున్నారు. ఇందుకోసం ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. సాక్షి, అమరావతి: సాధారణంగా వేసవి తరువాత ఏసీల అమ్మకాల్లో తగ్గుదల సహజం. కానీ సెప్టెంబర్ వస్తున్నా రికార్డు స్థాయిలో ఏసీల అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో తయారీ కంపెనీలు భారీ లాభాల బాట పడుతున్నాయి. ఈ వేసవిలో ఏసీ అమ్మకాల్లో 60 నుంచి 70 శాతం వృద్ధి నమోదు కాగా జూలై నుంచి జరుగుతున్న అమ్మకాల్లో కూడా 30 నుంచి 40 శాతం వృద్ధి నమోదవుతున్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) నెలల్లో పలు ఏసీ కంపెనీలు ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో లాభాలు రెండు రెట్లు పెరిగాయంటే అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కంపెనీలకు భారీ లాభాలు అత్యధిక వాటా కలిగిన వోల్టాస్ లాభం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రెండు రెట్లు పెరిగి రూ.355 కోట్లకు చేరింది. ఈ మూడు నెలల కాలంలో వోల్టాస్ రికార్డు స్థాయిలో 10 లక్షల యూనిట్లు విక్రయించింది. బ్లూస్టార్ లాభం కూడా రెండు రెట్లు పెరిగి రూ.169 కోట్లకు చేరింది. గతేడాది రూ.62 కోట్ల నష్టాలను ప్రకటించిన హావెల్స్ ఈ ఏడాది రూ.67 కోట్ల లాభాలను ప్రకటించడం గమనార్హం. 2023లో దేశవ్యాప్తంగా 1.1 కోట్ల ఏసీల అమ్మకాలు జరిగితే 2024లో 1.5 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లియన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీమా) ప్రెసిడెంట్ సునిల్ వచాని తెలిపారు.ఆన్లైన్ రిటైల్ సంస్థల పోటీ ప్రస్తుత మార్కెట్ డిమాండ్ను క్యాష్ చేసుకోవడానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్వంటి ఆన్లైన్ రిటైల్ సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో అవకాశాన్ని సది్వనియోగం చేసుకోలేకపోతున్నామంటూ కొన్ని కంపెనీలు వాపోతున్నాయి. 2037 నాటికి ప్రతి 15 సెకన్లకు ఒక ఏసీ 2011 తర్వాత ఈ స్థాయిలో ఏసీల అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారని, 2037 నాటికి ప్రతీ 15 సెకన్లకు ఒక ఏసీ విక్రయించే స్థాయికి ఇండియా ఎదుగుతుందని ప్రపంచబ్యాంకు అంచనా వేస్తోంది. 95 శాతం తొలిసారి కొంటున్నవారే దేశవ్యాప్తంగా వేడిగాలుల ప్రభావం అధికంగా ఉండటంతో వినియోగదారులు ఏసీలు, రిఫ్రిజరేటర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని, ఇప్పుడు ఏసీ అన్నది లగ్జరీ సాధనంగా కాకుండా బతకడానికి తప్పనిసరి వస్తువుగా మారిపోయిందని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రపంచ సగటుతో పోలిస్తే దేశంలో సొంత ఏసీ వినియోగం చాలా తక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం కుటుంబాల్లో కేవలం 8 శాతం మందికి మాత్రమే సొంత ఏసీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సగటున చల్లదనం కోసం ప్రతీ వ్యక్తి 272 కేడబ్ల్యూహెచ్ విద్యుత్ను వినియోగిస్తుంటే, మన దేశంలో అది కేవలం 69 కేడబ్ల్యూహెచ్గా ఉంది. ఈ ఏడాది తమ సంస్థ అమ్మిన ఏసీల్లో 95 శాతం మంది తొలిసారిగా కొన్నవారే ఉన్నారని బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. ఇందులో 65 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే ఉన్నారు. -
AP: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. వర్షాలు అధికంగా ఉన్న కోస్తా జిల్లాలతో పాటు కనీస వర్షపాతం నమోదు కాని రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాయలసీమ జిల్లాల్లో సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రత.. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. తాజా ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నట్టు జనం వాపోతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఉక్కపోత మరింత ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. ఉక్కపోత కారణంగా వేసవి తరహాలో గృహ విద్యుత్ వినియోగం పెరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీల వినియోగం ఆగస్టులో తీవ్రంగా పెరిగినట్టు తేలింది. రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుపానుకు రెండు రోజుల ముందు ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పులు ఉంటాయని చెబుతున్నారు. బంగాళాఖాతంలో పీడనం తగ్గినప్పుడు గాలిలో తేమ శాతం పెరుగుతుంది. దీనివల్ల ఉష్ణోగ్రతలు ఓ మోస్తరుగా ఉన్నా ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల విపరీతంగా చెమటలు పట్టడం, ఎక్కువ దాహంగా ఉండటం కనిపిస్తుందంటున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనంతపురంలోని రేకుల కుంట వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాతావరణ శాఖ కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. తుపాను అనంతరం ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. “గాలిలో తేమ శాతం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఉక్కపోత ఉంటుంది. దీనికి ప్రధాన కారణం బంగాళాఖాతంలో వాయు గుండం ప్రభావమే. వాతావరణంలో మార్పులు కూడా కొంత మేరకు ఈ పరిస్థితికి కారణం’ అని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త విజయశంకర్ బాబు తెలిపారు. -
మండుటెండల మహోపద్రవం
గత దశాబ్దిన్నరగా ఎన్నడెరుగని పరిస్థితి. మే నెలలో మండే ఎండలు తెలిసినవే అయినా, ఏప్రిల్ మొదలు జూన్ సగం దాటినా మాడు పగిలేలా దీర్ఘకాలిక ఉష్ణపవనాల దెబ్బ ఇప్పుడే అనుభవంలోకి వచ్చింది. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులతో ఢిల్లీ సహా ఉత్తరాది అంతా ఇప్పుడు అగ్నిగుండమైంది. మొన్న మంగళవారం 1969 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో 35.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతతో ఢిల్లీ మలమల మాడిపోయింది. ఒక్క జూన్లోనే ఇప్పటిదాకా ఏడు రోజులు తీవ్ర ఉష్ణపవనాలతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరి కాగా, పగలే కాదు రాత్రి ఉష్ణోగ్రతలూ గణనీయంగా పెరిగిపోవడంతో అవస్థలు హెచ్చాయి. మే 12 తర్వాత ఇప్పటి వరకు ఢిల్లీలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు రాత్రి పొద్దుపోయినా 40 డిగ్రీల కన్నా తగ్గనే లేదు. నిరాశ్రయులు 192 మంది ఈ జూన్ నెల 11 నుంచి 19 మధ్య కాలంలో వడదెబ్బ తగిలి మరణించారట. మునుపెన్నడూ చూడని ఇన్ని మరణాల సంఖ్య పరిస్థితి తీవ్రతకు మచ్చుతునక. నగరంలో నీటి కొరత మరో పెద్ద కథ. అధిక జనాభాతో దేశరాజధాని చాలాకాలంగా తల్లడిల్లుతోంది. సమీప ప్రాంతాల నుంచి వందలాది మంది వలస రావడంతో గత పాతికేళ్ళలో ఢిల్లీలో డజన్లకొద్దీ శిబిరాలు చట్టవిరుద్ధంగా వెలిశాయి. అసలే శిథిలమైన నగర జలవ్యవస్థ కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలకు, మరీ ముఖ్యంగా ఈ మురికివాడలకు కనీసం తాగునీటిని కూడా అందించలేని పరిస్థితి. దానికి తోడు యమునా నదీజలాలు తగ్గిపోయి, నీటి కోసం అల్లాడే ఎండాకాలం వస్తే వాటర్ ట్యాంకర్లతో నీటి పంపిణీ పెద్ద వ్యాపారమైంది. ఇదే అదనుగా జలవనరుల్ని యథేచ్ఛగా కొల్లగొడుతున్న ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల మాఫియా బయలుదేరింది. పెరిగిన ఎండలతో ఉత్తరాదిన రోజువారీ విద్యుత్ వినియోగం 89 గిగా వాట్ల పతాకస్థాయికి చేరి, ఢిల్లీ విమానాశ్రయం అరగంట సేపు కరెంట్ కోతలో మగ్గాల్సి వచ్చింది. మిగతా దక్షిణ, పశ్చిమ, తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి ఉత్తరాదికి 25 నుంచి 30 శాతం విద్యుత్ దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఎండల్లో ఇన్ని సమస్యల ముప్పేటదాడితో రాజధాని ప్రజలకు కష్టాలు వర్ణనాతీతం. సందట్లో సడేమియాగా వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. పొరుగున హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించినా, యమునలోని నీళ్ళొదలడం లేదన్నది ఢిల్లీ ఆప్ సర్కార్ ఆరోపణ. మాకే తగినంత లేవన్నది హర్యానా జవాబు. నీళ్ళైనా అందించలేకపోవడం ఆప్ వైఫల్యమేనంటూ ఢిల్లీ బీజేపీ నేతలు రోడ్డు పైకొచ్చి నిరసనలకు దిగడం ఒక ఎత్తయితే... ట్యాంకర్ల మాఫియా రెచ్చిపోవడం, ఢిల్లీ నీటి సరఫరా పైపులకు సైతం దుష్టశక్తులు చిల్లులు పెడుతున్నాయంటూ ఆప్ సర్కార్ ఆ పైపులకు పోలీసు రక్షణ కోరడం పరాకాష్ఠ. దేశ రాజధానిలో నీటి కొరతపై ప్రధాని మోదీ స్పందించకపోతే శుక్రవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానంటూ ఢిల్లీ మంత్రి ఆతిశి ప్రకటించడంతో మహానగరం మరింత వేడెక్కింది. నిజానికి, ఈసారి రుతుపవనాలు త్వరగానే కేరళను తాకి, ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. తీరా జూన్ 12 నుంచి మధ్యభారతంలో అవి స్తంభించేసరికి, దేశమంతా ఇటు వర్షాలు లేవు. అటు ఎండలు, ఉక్కపోత. దక్షిణాదితో పోలిస్తే ఉత్తర, పశ్చిమ భారతావనిలో మరీ దుర్భరం. ఇలాంటి దీర్ఘకాలిక వేసవిని ప్రకృతి విపత్తుగా పరిగణించాలంటున్నది అందుకే!నిజానికి ఇదంతా ఎక్కడో ఢిల్లీలో వ్యవహారమనీ, అది అక్కడికే పరిమితమనీ అనుకోవడానికి వీల్లేదు. వాతావరణ మార్పులు, మన స్వయంకృతాపరాధాల కారణంగా భవిష్యత్తులో దేశంలోని నగరాలన్నిటికీ ఇదే దుఃస్థితి దాపురించడం ఖాయం. ఆ మధ్య బెంగుళూరులో ఇలాంటివే చూశాం. దేశానికి అభివృద్ధిఇంజన్లయిన బొంబాయి, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, పుణే లాంటి నగరాల్లోనూ రేపు ఇవే పరిస్థితులు వస్తే, పరిస్థితి ఏమిటి? దేశ ఆర్థికపురోగతికి వెన్నెముక అయిన వీటిని నివాసయోగ్యం కాకుండా చేస్తే, జనం ఉద్యోగ, ఉపాధుల మాటేమిటి? పొంచివున్న నీటికొరత నివారణకు పాలకులు ఏం ప్రణాళిక వేస్తున్నారు? హైదరాబాద్ సహా అనేక నగరాల్లో వందల కొద్దీ చెరువులు, కుంటలు కబ్జాకు గురై, పర్యావరణానికీ, పెరుగుతున్న జనాభా అవసరాలకూ తీరని నష్టం వాటిల్లింది. ఇప్పటికైనా మొద్దునిద్ర వదిలి, దీర్ఘకాలిక వ్యూహంతో ప్రభుత్వాలు ముందుకు రాకపోతే కష్టం. మానవాళికి శాపంగా మారిన ఈ అధిక ఉష్ణోగ్రతల వెనక వాయుకాలుష్యం, శరవేగంగా పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అడవుల నరికివేత... ఇలా చాలా కారణాలున్నాయి. విపరీతంగా నిర్మాణాలు పెరిగి, పట్టణాలన్నీ కాంక్రీట్ జనారణ్యాలుగా మారేసరికి, పచ్చని చెట్లు, ఖాళీ ప్రదేశాలున్న ప్రాంతాలతో పోలిస్తే కొద్ది కి.మీ.ల దూరంలోనే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పైగా, దీనివల్ల రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం చల్లబడడం కూడా పాతికేళ్ళ క్రితంతో పోలిస్తే బాగా నిదానించిందట. ‘పట్టణ ఉష్ణద్వీప’ ప్రభావంగా పేర్కొనే ఈ పరిస్థితిని నివారించడం అత్యవసరం. అలాగే, నిలువ నీడ లేని వారితో సహా సమాజంలోని దుర్బల వర్గాలను ఈ వేడిమి బాధ నుంచి కాపాడే చర్యలు చేపట్టాలి. ఒంట్లో నీటి శాతం తగ్గిపోనివ్వకుండా ప్రభుత్వాలు సురక్షిత తాగునీటి వసతి కల్పించాలి. శీతల కేంద్రాలు, ఎండబారిన పడకుండా తగినంత నీడ ఏర్పాటు చేయాలి. గత ఏడాది, ఈసారి ఎన్జీఓ ‘స్వయం ఉపాధి మహిళా సంఘం’ (సేవ) అమలు చేసిన ‘ఎండల నుంచి బీమా సౌకర్యం’ లాంటి వినూత్న ఆలోచనలు అసంఘటిత కార్మికుల జీవనోపాధిని కాపాడతాయి. ఇప్పటికే ఈ 2024 మానవచరిత్రలోనే మండుటెండల వత్సరంగా రికార్డు కెక్కింది. వచ్చే ఏడాది ఈ రికార్డును తిరగరాయక ముందే ఈ మహోపద్రవం పట్ల కళ్ళు తెరవడం మంచిది. -
మూడు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉన్నాయి. నాలుగు రోజులుగా అక్కడక్కడా తేలికపాటి వానలు, జల్లులు పడుతుండగా... మంగళ, బుధ, గురువారాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. రుతుపవనాలు రాష్ట్రం మీదుగా సోమవారం మహారాష్ట్రలోని నాసిక్, సుకుమా తదితర ప్రాంతాలకు సైతం విస్తరించాయి. దీంతో అటు దక్షిణ మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని తెలిపింది. యాదాద్రి–భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణ్పేట, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదవుతాయని హెచ్చరించింది. వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో జీహెచ్ఎంసీ హెల్ప్ డెస్క్ (ఫోన్ నంబర్లు: 040–21111111, 9001136675)ను ఏర్పాటు చేసింది. సోమవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 40.4 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 22.4 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. -
తెలంగాణ రాష్ట్రమంతా నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈనెల 3న రాష్ట్రంలోని ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. రెండ్రోజుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ లోని నారాయణపేట, ఆంద్రప్రదేశ్లోని నర్సాపూర్ గుండా రుతుపవనాలు కదులుతున్నట్లు చెప్పింది. 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని, కదలికలు ఇదే తరహాలో ఉంటే వారం రోజుల్లో రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తాయని అంచనా వేస్తోంది. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగటి పూట కొంతసేపు గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నప్ప టికీ.. ఆశాశం మేఘావృతం కావడంతో క్రమంగా ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గుతూ వస్తోంది. సాయంత్రానికి పూర్తిగా చల్లని వాతావరణం ఏర్పడుతోంది. రెండు రోజులు రాష్ట్రంలో ఉష్ణో గ్రతలు సాధారణం, అంతకంటే తక్కువగా నమోదు కావొచ్చని ఆ శాఖ అంచనా వేసింది. నిజామాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత: దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాలను పరిశీలిస్తే నిజామాబాద్లో 40.1 డిగ్రీ సెల్సీయస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 22.5 డిగ్రీ సెల్సీయస్గా నమోదైంది. -
సెన్సార్ల లోపం వల్లే ఎక్కువ ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాగ్పూర్లో మే 30వ తేదీన నమోదైన 56, వాయవ్య ఢిల్లీలోని ముంగేష్ పుర్లో మే 29వ తేదీన నమోదైన 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తప్పు అని భారత వాతావరణ శాఖ శనివారం స్పష్టంచేసింది. మే 29న ముంగేష్ పుర్లో వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 45.2 ఉంటే సెన్సార్ దానిని 52.9 డిగ్రీల సెల్సియస్గా చూపించింది. ముంగేష్ పుర్, నాగ్పూర్ స్టేషన్లలో ఉష్ణోగ్రతను లెక్కగట్టే సెన్సార్లలో లోపాలు తలెత్తడం వల్లే అసాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వివరణ ఇచి్చంది. ‘‘ ఈ రెండు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్(ఏడబ్ల్యూఎస్)లో బిగించిన సెన్సార్లను త్వరలోనే పరిశీలిస్తాం. ఢిల్లీలోని ఇతర ఆటోమేటిక్, మాన్యువల్ అబ్జర్వేటరీల్లో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ముంగేష్ పుర్ ఏడబ్ల్యూఎస్లో అసాధారణ ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడికి ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపించాం. ముంగేష్పుర్లో స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ నమోదుచేసిన దానికంటే ఈ సెన్సార్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎక్కువ చూపించింది. లోపాలున్న సెన్సార్ను త్వరలోనే మార్చేస్తాం’’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. -
చల్లని రేయే వేడెక్కెనులే!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా చల్లని రాత్రులు కరువవుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దేశంలోని 140కి పైగా భారత నగరాల్లో 60 శాతానికి పైగా రాత్రులు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు భువనేశ్వర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బృందం జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. నేచర్ సిటీస్ జర్నల్లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం.. రాత్రిళ్లు పెరుగుతున్న వేడిమి వర్షపాతం, కాలుష్యంతో సహా వాతావరణంలోని ఇతర అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అహ్మదాబాద్, జైపూర్, రాజ్కోట్ నగరాలు తీవ్ర పట్టణ ప్రభావ రాత్రులను అనుభవిస్తున్నాయి. ఢిల్లీ–ఎన్సీఆర్, పూణే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో హైదరాబాద్, బెంగళూరు నగరాలకు కూడా వేడి రాత్రుల తాకిడి బాగానే ఉంది. అర్బన్ హీట్ ఐలాండ్కు పట్టణీకరణే కారణం అర్బన్ హీట్ ఐలాండ్కు విపరీతమైన పట్టణీకరణే ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకంటే పట్టణాల్లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు గుర్తించారు. పట్టణీకరణలో భాగంగా కాంక్రీటు, తారు (రోడ్లు, పేవ్మెంట్లను నిర్మాణాలతో) ఉపరితలాలు పగటిపూట వేడిని గ్రహించి నిల్వ చేసి, సాయంత్రం ఆ వేడిమిని తిరిగి బయటకు విడుదల చేస్తాయి. తద్వారా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. గత రెండు దశాబ్దాలుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడానికి పట్టణీకరణ, స్థానిక వాతావరణ మార్పు ఎంతవరకు దోహదపడిందో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నిచారు. 37.73 శాతం పట్టణీకరణ జరిగితే దశాబ్దానికి సగటున 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వాయువ్య, ఈశాన్య భారతంలోనే.. దేశంలోని వాయువ్య, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లోని నగరాల్లో రాత్రి ఉష్ణోగ్రతలలో ఎక్కువ పెరుగుదల కనిపించింది. వేగవంతమైన అభివృద్ధి, పట్టణాల విస్తరణ వేగంగా జరుగుతున్న తూర్పు, మధ్య భారతీయ నగరాల్లో కూడా రాత్రిపూట వేడి పెరుగుతోందని తేల్చారు. రాత్రి ఉష్ణోగ్రతలు ప్రతి దశాబ్దానికి సగటున 0.53 డిగ్రీలు పెరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. రాత్రి ఉష్ణోగ్రతల పెరుగుదల నగరాలకే పరిమితం కాలేదు.. దేశవ్యాప్తంగా ప్రతి దశాబ్దానికి సగటున 0.26 డిగ్రీలు పెరుగుతున్నట్లు గుర్తించారు. అంటే దేశం మొత్తం వేడెక్కుతున్న రేటు కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో నగరాలు వేడెక్కుతున్నాయని నివేదిక సూచిస్తోంది. 2050 నాటికి పట్టణాల్లో 80 కోట్ల మందిపెరిగిన మానవ కార్యకలాపాలు, వాహన ఉద్గారాలు, పారిశ్రామిక ఉత్పత్తి అధిక స్థాయిలో గ్రీన్హౌస్ వాయువులకు దోహదం చేస్తున్నాయి. ఇవి పట్టణాల్లో పగటితో పాటు రాత్రిళ్లు వేడిమిని మరింత పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే 2050 నాటికి దేశ జనాభాలో పట్టణ జనాభా 68 శాతానికి చేరుతుందని అధ్యయనం పేర్కొనడం మరింత ఆందోళన కలిగించే అంశం. వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (డబ్ల్యూఆర్ఐ) ఇండియా రాస్ సెంటర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఏడుగురు 2050 నాటికి పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారని అంచనా. ప్రస్తుతం దేశ జనాభాలో 36 శాతం అంటే దాదాపు 40 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉంటే.. ఇది 2050 నాటికి 80 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. ఇది రాత్రి వేడిమి మరింత పెరగడానికి దోహదం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరాల్లోనూ పచ్చదనం పెంపు ద్వారా పగటి వేడిని నిరోధించవచ్చని, రాత్రిపూట వేడిని నిరోధించడానికి ఈ విధానం పనికిరాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పట్టణాల్లో ఎక్కడ చూసినా భారీ భవంతులు, తారు, సిమెంట్ రోడ్లతో కాంక్రీట్ జంగిల్గా మారిపోవడం, చెరువులు కనుమరుగు కావడంతో రాత్రిపూట నగరాలు అస్సలు చల్లబడట్లేదని న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక సైతం వెల్లడించడం గమనార్హం. -
ప్రకృతి వికృతి
రికార్డులు బద్దలవుతున్నాయి. వారం రోజుల్లోనే అటు రాజస్థాన్లో, ఇటు దేశ రాజధానిలో తాపమానం తారాజువ్వలా పైకి ఎగసింది. ఒక్క బుధవారమే రాజస్థాన్లో ఉష్ణోగ్రతలు పలుచోట్ల 50 డిగ్రీల సెంటీగ్రేడ్ను దాటేశాయి. వాయవ్య ఢిల్లీలోని ముంగేశ్పూర్లో దేశచరిత్రలోనే అత్యధికంగా 52.9 డిగ్రీలు నమోదైనట్టు స్థానిక వాతావరణ కేంద్రం నుంచి వెలువడ్డ వార్త సంచలనమైంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) లెక్కల్లో ఏమన్నా తప్పు దొర్లిందేమో అని అమాత్యులు అత్యుత్సాహమూ చూపారు. సరిచూసుకోవడంలో తప్పు లేదు కానీ, అన్నిటికీ ప్రామాణికమని ప్రభుత్వమే చెప్పే ఐఎండీని పక్కనబెట్టినప్పటికీ ఈ వేసవిలో దేశంలో ఉష్ణోగ్రతలు ఎన్నడెరుగని స్థాయికి చేరిన మాట చెమటలు పట్టిస్తున్న నిజం. క్రమంగా ఈ ప్రచండ ఉష్ణపవనాలు తగ్గుతాయని చెబుతూనే, ఉత్తర భారతావనికి ఐఎండీ ‘రెడ్ ఎలర్ట్’ జారీ చేయడం గమనార్హం. గత రెండున్నర నెలల్లో దేశవ్యాప్తంగా కనీసం 16.5 వేల మందికి పైగా వడదెబ్బకు గురైతే, పదుల మరణాలు సంభవించాయి. ఒకపక్క ఈశాన్యంలో రెమాల్ తుపాను బీభత్సం, మరోపక్క పశ్చిమ, ఉత్తర భారతావనుల్లో ఉష్ణోగ్రతల నిప్పులగుండం ఒకేసారి సంభవించడం ప్రకృతి వికృతికి చిహ్నం. ఒక్క మనదేశంలోనే కాదు... ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, అసాధారణ వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. 2013 నుంచి 2023 మధ్య పదేళ్ళ కాలంలో అంటార్కిటికాతో సహా ప్రపంచంలో దాదాపు 40 శాతం ప్రాంతంలో అత్యధిక రోజువారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా గత రెండు మూడేళ్ళలో వివిధ దేశాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2021లో యూరప్లోకెల్లా అత్యధికంగా ఇటలీలోని సిసిలీలో తాపమానం 48.8 డిగ్రీలు చేరింది. 2022 జూలైలో అమెరికాలో ఉష్ణోగ్రత తొలిసారిగా 40 డిగ్రీలు దాటింది. నిరుడు చైనా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ పట్టణంలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది మన దేశంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా సాధారణం కన్నా 5 నుంచి 10 డిగ్రీలు పెరగడం ఆందోళనకరం. ఇది మన స్వయంకృతం. పచ్చని చెట్లు, నీటి వసతులు లేకుండా కాంక్రీట్ జనారణ్యాలుగా మారుతున్న నగరాలతో మీద పడ్డ శాపం.గత 2023 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన వత్సరమైతే, ఈ 2024 కూడా అదే బాటలో నడుస్తోంది. నిజానికి, ప్రకృతి విపత్తుల స్వరూప స్వభావాలు గత 20 ఏళ్ళలో గణనీయంగా మారాయి. దేశంలో నిరుడు శీతకాలమైన ఫిబ్రవరిలోనే వడగాడ్పులు చూశాం. అనూహ్య వాతావరణ పరిస్థితులు, అందులోనూ తీవ్రమైనవి ఇవాళ దేశంలో తరచూ ఎదురవుతున్నాయి. భరించలేని ఎండలు, భారీ వరదలకు దారి తీసేటంత వానలు, బయట తిరగలేనంత చలి... ఒకదాని వెంట మరొకటిగా బాధిస్తున్నాయి. గతంలో భరించగలిగే స్థాయిలో ఉండే ప్రకృతి సిద్ధమైన వేసవి ఎండ, వడగాడ్పులు ప్రకోపించి... సరికొత్త విపత్తులుగా పరిణమించాయి. ఒకప్పుడు అసాధారణమైన 45 డిగ్రీలు సర్వసాధారణమై, ఇక 50 డిగ్రీల హద్దు తాకుతున్నాం. దేశవ్యాప్త ప్రచండ గ్రీష్మం అందులో భాగమే. పైగా, అధిక వర్షపాతంతో పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం, లోతట్టున ఆకస్మిక వరదలు రావడం... భరించలేని గ్రీష్మతాపంతో కార్చిచ్చులు రేగడం... ఇలా గొలుసుకట్టు చర్యలా ఒక వైపరీత్యం మరొకదానికి దారి తీయడమూ పెరుగుతోంది. మరో వారం పదిరోజుల్లో ఋతుపవనాల ప్రభావంతో ఎండలు తగ్గాక అనూహ్యమైన తుపానుల బెడద ఉండనే ఉంది. ఇప్పటికే ఆదివారం బెంగాల్ తీరం తాకిన రెమల్ తుపానుతో నాలుగైదు ఈశాన్య రాష్ట్రాలు దెబ్బతిన్నాయి. పెరుగుతున్న భూతాపం, దరిమిలా వాతావరణ మార్పుల వల్ల రానున్న రోజుల్లో ఇలాంటివి మరింత తీవ్రస్థాయిలో సంభవించే ప్రమాదం ఉంది. అందులోనూ ఇప్పటి తుపానులకు రెండింతల విధ్వంసం సృష్టించగలిగినవి వస్తాయని పలు అధ్యయనాల అంచనా. ఈ ముప్పు నుంచి తప్పించుకొనేందుకు అస్సామ్, మిజోరమ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ సహా రాష్ట్రాలన్నీ సన్నద్ధం కావాలి. తుపాను వస్తుందంటే ఒడిశా లాంటివి ప్రజల్ని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నమూనా ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని, ప్రాణనష్టాన్నీ, ఆస్తినష్టాన్నీ తగ్గించుకుంటున్న తీరు నుంచి అందరూ పాఠాలు నేర్వాలి. అసలు మన దేశంలో జాతీయ విపత్కాల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) దాదాపు రెండు దశాబ్దాలుగా ఉంది. 1999లో ఒరిస్సాలో భారీ తుపాను, 2004లో సునామీ అనంతరం 2005లో దాన్ని స్థాపించారు. అప్పటి నుంచి జాతీయ విపత్తుల అంచనా, నివారణ, విపత్కాల పరిస్థితుల నిర్వహణ, బాధితుల సహాయ పునరావాసాలకు అది కృషి చేస్తోంది. ఎక్కడ ఏ మేరకు పనిచేస్తున్నాయన్నది పక్కనపెడితే, ప్రస్తుతం దాదాపు ప్రతి రాష్ట్రమూ దేనికది విపత్కాల నిర్వహణ సంస్థ పెట్టుకుంది. అయితే, ఇది చాలదు. అంతకంతకూ పెరుగుతున్న విపత్తుల రీత్యా కొత్త అవసరాలకు తగ్గట్టుగా ఈ వ్యవస్థలలో సమూలంగా మార్పులు చేర్పులు చేయాలి. వేడిమిని తట్టుకొనేందుకు శీతల కేంద్రాల ఏర్పాటు, విస్తృతంగా చెట్ల పెంపకం, పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్ళడం లాంటివి ఇక తప్పనిసరి. థానే లాంటి చోట్ల ఇప్పటికే అమలు చేస్తున్న పర్యావరణహిత ప్రణాళికల లాంటివి ఆదర్శం కావాలి. ఎండ, వాన, చలి... ఏది పెచ్చరిల్లినా తట్టుకొనేలా ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పన సాగించాలి. వేసవి ఉక్కపోత పోయిందని సంబరపడే లోగా భారీ వర్షాలు విపత్తుగా పరిణమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకనైనా ప్రకృతి ప్రమాదఘంటిక వినకుంటే కష్టమే! -
Monsoon 2024: నేడు కేరళకు నైరుతి ఆగమనం.. 2 రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఒక రోజు ముందుగా అంటే గురువారానికే అవి కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత రెండు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ నెల 31 లేదా వచ్చే నెల ఒకటో తేదీకల్లా రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లో విస్తరించాయి. వీటి పురోగమనం ఆశాజనకంగా ఉండడంతో గురువారం లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉంది. వారం ముందుగానే రుతుపవనాలు పురోగమిస్తుండడంతో ఈ సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల పురోగమనం, రెమల్ తుఫాన్ కారణంగా ప్రస్తుతం రోహిణీ కార్తె ఉన్నా దాని ప్రభావం పెద్దగా రాష్ట్రంపై పడలేదు. స్వల్పంగానే ఉష్ణోగ్రతలు పెరిగాయి. బుధవారం పలుచోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా పోయిమలలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 42.5, గరికపాడులో 42 డిగ్రీలు, విజయవాడలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రెండు రోజులు కూడా వాతావరణం ఈ మాదిరిగానే ఉండవచ్చని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.ఒకటి నుంచి వర్షాలు..రాష్ట్రంలో జూన్ ఒకటో తేదీ నుంచి వర్షాలు కురవనున్నాయి. జూన్ ఒకటిన అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను, జూన్ 2న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు కూడా సంభవిస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
రోహిణి భగభగలు అంతంతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిత్రమైన వాతావరణ పరిస్థితి కొనసాగుతోంది. పగలంతా ఎండలు మండిపోతుండగా, రాత్రికి మాత్రం కాస్త చల్లని వాతావరణం నెలకొంటోంది. సాధారణంగా రోహిణి కార్తెలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీనికి తోడు తీవ్రమైన ఉక్కపోత చిరాకు కలిగిస్తుంటుంది. అయితే ప్రస్తుతం రోహిణి కార్తె ప్రవేశించి 5 రోజులు కావస్తున్నా ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణానికి కాస్త అటుఇటుగానే నమోదవుతున్నాయి. రోహిణి కార్తెలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ అధికంగా..అంటే 43 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదవుతాయి. కానీ ఈసారి కాస్త తక్కువగా నమోదవుతుండటం గమనార్హం. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..అత్యధికంగా ఆదిలాబాద్లో 44.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రెండు మూడు చోట్ల 43కు అటుఇటుగానే నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. హనుమకొండ, నల్లగొండ, నిజామాబాద్, రామగుండం ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు అయ్యాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తక్కువగానే నమోదవుతుండటం గమనార్హం. రోహిణి కార్తెలో సాధారణంగా 30 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సి ఉండగా చాలా ప్రాంతాల్లో తక్కువగా 25, 26, 27 డిగ్రీల మేరకే నమోదు అవుతున్నాయి. బుధవారం కనిష్టంగా నల్లగొండలో 25.0 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. వాతావరణంలో నెలకొన్న మార్పుల ప్రభావంతోనే గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రానున్న రెండ్రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలావుండగా రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్లో 46.4 డిగ్రీ సెల్సీయస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, బెల్లంపల్లిలో 45.8, ఆసిఫాబాద్లో 45.2 డిగ్రీ సెల్సీయస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు కేరళను తాకనున్న నైరుతి బంగాళాఖాతంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు గురువారం కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు తెలిపింది. కేరళను తాకిన వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు విస్తరించి ఆ తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వివరించింది. -
రోహిణి తీవ్రత లేనట్టే!
సాక్షి, విశాఖపట్నం: రోహిణి కార్తె వేళ రోళ్లు పగిలే ఎండలు కాస్తాయన్న నానుడి ఎప్పట్నుంచో ఉంది. ఈ కార్తె వస్తోందంటేనే జనం బెంబేలెత్తి పోయే పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఏప్రిల్ నుంచే మొదలవడంతో రోహిణి కార్తె ప్రవేశిస్తే ఇంకెంతలా ఉష్ణతాపం పెరిగిపోతుందోనని అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ ఏడాది రోహిణి కార్తె ఈనెల 25న ప్రవేశించింది. ఆ సమయానికి బంగాళాఖాతంలో ‘రెమాల్’ తుపాను కొనసాగుతుండడంతో రోహిణి తీవ్రత కనిపించ లేదు. మరోవైపు రాష్ట్రంలో తుపాను ప్రభావంతో ఏర్పడిన గాలిలో కొద్దిపాటి తేమ ఇంకా ఉంది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంపైకి గంటకు 30–40 కి.మీల వేగంతో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఇవి భానుడి ప్రతాపాన్ని అదుపు చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటున్నాయి. వాస్తవానికి రోహిణి కార్తె రోజుల్లో ఉష్ణోగ్రతలు 42–46 డిగ్రీల మధ్య నమోదవుతాయి. దీంతో పలు చోట్ల వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల లోపే రికార్డవుతున్నాయి. ఇవి సాధారణంకంటే 2–3 డిగ్రీలు మాత్రమే అధికం. రానున్న మూడు రోజులు కూడా దాదాపు ఇవే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు స్వల్పంగానే పెరగడం వల్ల వడగాడ్పులు గాని, తీవ్ర వడగాడ్పులు కూడా వీచే పరిస్థితులు లేవని చెబుతున్నారు. భారత వాతావరణ విభాగం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పశ్చిమ గాలుల ప్రభావంతో ఈదురు గాలులు వీస్తున్నాయని, నెలాఖరు వరకు వడగాడ్పులకు ఆస్కారం లేదని వెల్లడించింది. రోహిణి కార్తె ఎండలపై భీతిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు ఇది ఊరటనివ్వనుంది. సీమలో పిడుగుల వాన.. మరోవైపు దక్షిణ తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నెలాఖరు వరకు రాయలసీమలోని అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. -
ఐదు రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు మధ్య బంగాళాఖాతంలో చురుకుగా కదులుతున్నాయి. రానున్న 5 రోజుల్లో రుతుపవనాలు బంగాళాఖాతంలో పూర్తిగా విస్తరించి కేరళను తాకేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వారాంతంలోగా కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఆరు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. రుతుపవనాల కదలికల ఆధారంగా రాష్ట్రంలోకి ప్రవేశించే సమయం ఆధారపడి ఉంటుందని పేర్కొంది. దేశంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. చాలా చోట్ల సాధారణం.. కొన్నిచోట్ల అత్యధికం..ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనవల్ల రానున్న రెండ్రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయన్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవగా కొన్నిచోట్ల సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అత్యధికంగా 45.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జంబూగలో 45.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా హాజీపూర్లో 44.9, జగిత్యాల జిల్లా తిర్యాణిలో 44.9, ఆసిఫాబాద్ జిల్లా వెల్గటూరులో 44.8, జగిత్యాల జిల్లా జైనలో 44.7, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 44.7 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఆదిలాబాద్లో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
సాక్షి, నెట్వర్క్: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో పెనుగాలులు వీచాయి. దీంతో అనేకచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, నాగర్కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి నల్లగొండ, సిద్దిపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో గాలివాన హడలెత్తించింది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క నాగర్కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు మరణించారు. మరోవైపు తగ్గేదేలే అన్నట్టు పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోయాయి. 45 డిగ్రీ సెల్సీయస్కు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. నాగర్కర్నూల్ జిల్లాలో విషాదం నాగర్కర్నూల్ జిల్లాలో అకాల వర్షాలు పెను విషాదం నింపాయి. ఆదివారం సాయంత్రం వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. తాడూరుకు చెందిన రైతు బెల్లె మల్లేష్ (38) గ్రామ శివారులోని తన సొంత పొలంలో రేకుల షెడ్ నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మల్లేష్, పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన కూలీలు చెన్నమ్మ (45), రాములు (53) షెడ్పై పని చేస్తుండగా ఈదురుగాలులతో కూడిన వర్షానికి షెడ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. దీంతో ఈ ముగ్గురు, అదే సమయంలో తండ్రి వద్దకు వచి్చన మల్లేష్ కూతురు అనూష (12) అక్కడికక్కడే చనిపోయారు. అక్కడే పనిచేస్తున్న మరో నలుగురు.. చిన్న నాగులు, పార్వతమ్మ, బి.రాజు, రాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే పార్వతమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు. మరోవైపు నాగర్కర్నూల్ మండలంలోని మంతటి గేట్ వద్ద ఈదురు గాలుల ప్రభావంతో రేకుల షెడ్పై ఉన్న రాయి వచ్చి వికారాబాద్ జిల్లా బషీర్బాగ్ మండలం నలవెల్లి గ్రామానికి చెందిన క్రూజర్ వాహన డ్రైవర్ వేణుగోపాల్ (38)కు తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వేణుగోపాల్ కిరాయికి శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే జిల్లాలోని తెలకపల్లికి చెందిన దండు లక్ష్మణ్ (12), మారేపల్లికి చెందిన వెంకటయ్య (52) పొలంలో పిడుగుపాట్లకు గురై మరణించారు. ఇలావుండగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామంలో శనివారం రాత్రి ఎడ్ల బండిపై పిడుగు పడింది. ఈ ఘటనలో రెండు దుక్కిటెడ్లు మృతిచెందగా రైతు ఎల్కరి సత్తన్నకు గాయాలయ్యాయి. ఇద్దరు మిత్రుల విషాదాంతం మేడ్చల్ జిల్లా కీసరలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి మోటార్ సైకిల్పై పడటంతో దానిపై ఉన్న యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన నాగిరెడ్డి రాంరెడ్డి (60), అదే మండలంలోని దన్రెడ్డిగూడెంలో ఉంటున్న ఏపీలోని తూర్పు గోదావరిజిల్లాకు చెందిన ధనుంజయ్ (46) అనే ఇద్దరు స్నేహితులు మరణించారు. శామీర్పేటలో ఉన్న తమకు తెలిసిన వారికి మామిడికాయలు ఇచ్చేందుకు వెళ్తుండగా..కీసర మండలం తిమ్మాయిపల్లి గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గోడలు కూలి బాలుడు, వ్యాపారి మృతి హైదరాబాద్లోని మియాపూర్, ఓల్డ్ హాఫిజ్పేట సాయినగర్లో ఆదివారం గాలివానకు గోడ కూలి పడటంతో అబ్దుల్ సమద్ (3) మృతి చెందాడు. డ్రై క్లీనింగ్ చేయడంతో పాటు రోడ్ల ప్రక్కన దుస్తులను అమ్ముకుంటూ జీవించే యూపీకి చెందిన నసీముద్దీన్ కనోదియా, షబానా దంపతుల కుమారుడు సమద్ ఆదివారం సాయంత్రం రేకుల గదిలో నిద్రిస్తుండగా, పక్కనే ఉన్న రఫీయుద్దీన్ బిల్డింగ్పై నుండి ఇటుక గోడకూలి రేకులపై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సమద్ను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మరో ఘటనలో ఓ భవనం పై నుండి ఇటుక గోడకూలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యాపారి రషీద్ (45)పై పడటంతో తీవ్రంగా గాయపడిన అతను స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొదుతూ మరణించాడు. ఈ దుర్ఘటన కూడా ఆదివారం మియాపూర్ ఓల్డ్ హాఫిజ్పేటలోని సాయినగర్ కాలనీలోనే చోటు చేసుకుంది. నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, ఘట్కేసర్ ప్రాంతాల్లో కూడా గాలివాన బీభత్సం సృష్టించింది. హయత్నగర్ ఆర్టీసీ డిపోలో పెద్ద వృక్షం కూలిపడటంతో బస్సు ధ్వంసమైంది. కోళ్లఫారం గోడ కూలి ఇద్దరు మృతి సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి కోళ్ల ఫారం గోడకూలడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తూప్రాన్ మండలం ఘన్పూర్కు చెందిన గంగ గౌరిశంకర్ (30), గంగ మాధవి, విభూతి శ్వేత, ఇంద్రజ, చంద్రిక, చంద్రాయణగుట్టకు చెందిన భాగ్యమ్మ(40) క్షీరసాగర్ గ్రామంలోని శ్రీనివాస్ ఇంటికి చుట్టం చూపుగా వచ్చారు. అంతా కలిసి సరదాగా పొలంలోని బావి వద్దకు వెళ్లారు. తిరిగి వస్తుండగా వర్షం కురవడంతో తల దాచుకునేందుకు దారిలో ఉన్న ఓ కోళ్ల ఫారం వద్దకు వెళ్లారు. గాలుల ధాటికి ఫారం గోడ కూలి వీరిపై పడింది. ఈ ఘటనలో గంగ గౌరిశంకర్, భాగ్యమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు మాధవి, శ్వేత, ఇంద్రజ, చంద్రిక తీవ్రంగా గాయపడ్డారు.అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలకు అంతరాయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో రుద్రూర్, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రుద్రూర్లో కారుపై, అంబం శివారులో ఆటో, రెండు బైకులపై చెట్లు విరిగిపడ్డాయి. బాన్సువాడలోని కల్కి చెరువు కట్టపై ఉన్న హైమాస్ట్ విద్యుత్ స్తంభంతో పాటు పలు కరెంటు స్తంభాలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. హస్నాపూర్ గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపై భారీ వృక్షం పడిపోవడంతో 3 గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ఇళ్లు, కోళ్ల ఫారాల రేకులు లేచిపోయాయి. కరెంట్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ధర్మారెడ్డి పల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో కాంటా చేసిన వెయ్యి బస్తాల ధాన్యం పాక్షికంగా తడిసింది. కొండమల్లేపల్లి మండ లం గుమ్మడవెల్లిలో పిడుగుపాటుకు 2 గడ్డివాములు దగ్ధమ య్యాయి. వికారాబాద్ జిల్లాలో గాలివానకు పలు ప్రాంతాల్లో రహదారులు, ఇళ్లపై చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. పరిగి మండల పరిధి రూప్సింగ్ తండాలో పిడుగుపాటుకు ఓ ఎద్దు మృత్యువాత పడింది. -
రాష్ట్రంలో మళ్లీ పెరిగిన వేడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. శనివారం నిర్మల్ జిల్లా కుబీర్లో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 44.9 డిగ్రీల సెల్సియస్, కామారెడ్డి జిల్లా డోంగ్లి 44.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 44.7 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్ జిల్లా వయల్పూర్ 44.6 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది.రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ చొప్పున అధికంగా నమోదయ్యే అవకాశముందని వివరించింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే....గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 44.0 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండ, మహబూబ్నగర్లో 25.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదైంది. తీవ్ర వాయుగుండంగా మారిన వాయుగుండం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం శనివారం తూర్పు, మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు తెలిపింది. రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు తెలిపింది.శనివారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్లలో) కేంద్రం గరిష్టం అదిలాబాద్ 44.0 మెదక్ 42.7 నిజామాబాద్ 42.4 హైదరాబాద్ 39.9 హకీంపేట్ 39.8 నల్లగొండ 39.5 దుండిగల్ 39.5 రామగుండం 38.8 హనుమకొండ 38.0 మహబూబ్నగర్ 37.5 ఖమ్మం 36.0 భద్రాచలం 31.6 -
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా 25వ తేదీ ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుపానుగా, ఆ తర్వాత తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 26 నాటికి బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నట్లు వివరించింది. గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్టంగా ఆదిలాబాద్లో 42.3 డిగ్రీ సెల్సీయస్, కనిష్టంగా హనుమకొండ 21.0 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. ప్రణాళికా విభాగం వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా అర్లి ప్రాంతంలో గరిష్టంగా 44.4 డిగ్రీ సెల్సీయస్, కామారెడ్డి జిల్లా డొంగ్లిలో 43.1 డిగ్రీ సెల్సీయస్, నిజామాబాద్ జిల్లా కల్దుర్కిలో 42.9 డిగ్రీ సెల్సీయస్, మంచిర్యాల జిల్లా వెల్గటూరులో 42.8 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు శుక్రవారం నుంచి మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. అయితే గురువారం సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ మేర తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మళ్లీ అధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగనున్నాయి. అకాల వర్షాల నేపథ్యంలో గత పది రోజులుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతూ వచ్చాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారడం, నైరుతి సీజన్కు సమయం అనుకూలంగా మారుతున్న తరుణంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. ఉక్కపోత కూడా తీవ్రం కానుందని తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరానికి సమీప నైరుతి ప్రాంతంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్ప పీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్ప పీడనం ఈశాన్య దిశలో కదిలి ఈ నెల 24వ తేదీ నాటికీ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత ఈ వాయుగుండం ఈశాన్య దిశలో కదులుతూ మరింత బలపడి ఈ నెల 25న ఈశాన్య, దానికి ఆనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండబోదని తెలిపారు. రుతుపవనాలకు అనుకూలంగా..నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచిమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు. బుధవారం రాష్ట్రంలో చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ మేర తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా ఆదిలాబాద్లో 41.8 డిగ్రీ సెల్సీయస్, కనిష్టంగా మెదక్లో 24.3 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
దారి మళ్లనున్న తుపాను!
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను దారిమళ్లి, రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లనుంది. ఈ తుపాను ఆంధ్రప్రదేశ్పై ప్రభావం చూపుతుందని తొలుత భావించారు. అయితే తాజా వాతావరణ పరిస్థితులనుబట్టి అది బంగ్లాదేశ్ వైపు వెళ్తుందని తేలింది. దీంతో రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పనుంది. ఈనెల 22న (బుధవారం) నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది 24 నాటికి వాయుగుండంగా, ఆపై తుపానుగాను బలపడుతుందని వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. తొలుత వాయుగుండం వాయవ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ తుపానుగా మారితే దాని ప్రభావం కోస్తాంధ్ర, ముఖ్యంగా ఉత్తరాంధ్ర పైన ఉంటుందని పేర్కొన్నాయి. అయితే ఐఎండీ తాజా అంచనాల ప్రకారం.. అల్పపీడనం దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత మరింత బలపడి అదే దిశలో బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది. దీని ఫలితంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరానికి మధ్య బంగాళాఖాతం సుమారు వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటుంది. అంటే రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోనే వాయుగుండం/తుపాను బంగ్లాదేశ్ వైపు మళ్లుతుండడం వల్ల దాని ప్రభావం ఏపీపై ఉండదు. అదే మధ్య బంగాళాఖాతంలో కాకుండా వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉంటే రాష్ట్రంలో భారీ వర్షాలకు ఆస్కారం ఉండేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.మళ్లీ కొన్నాళ్లు అధిక ఉష్ణోగ్రతలు..రాష్ట్రంలో వారం రోజులుగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. వడగాడ్పులు కూడా తగ్గాయి. తాజా అంచనాల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను గాలిలో తేమను బంగ్లాదేశ్ వైపు లాక్కునిపోతుంది. దీనివల్ల మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు 3 – 4 డిగ్రీల వరకు పెరుగుతాయని, కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.మూడు రోజులు తేలికపాటి వానలుప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. బుధవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
20 వరకు వర్షాలే
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు వడగాడ్పులకు విరామం లభించనుంది. ఇప్పటికే ఐదారు రోజుల నుంచి ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రం మొత్తమ్మీద ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించడం లేదు. ఫలితంగా వడగాడ్పులు వీయడం లేదు. ప్రస్తుతం ఈ నెల 20వ తేదీ వరకు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అప్పటివరకు వడగాడ్పులకు ఆస్కారం ఉండదని పేర్కొంటున్నారు. 20వ తేదీ తరువాత వర్షాలు తగ్గుముఖం పట్టి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయంటున్నారు. మరోవైపు దక్షిణ అంతర్భాగ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కేరళ నుంచి కర్ణాటక మీదుగా మరఠ్వాడా వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉన్న ద్రోణితో విలీనమైంది. అదే సమయంలో రాష్ట్రంపై ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న ఐదు రోజులు (20వ తేదీ వరకు) కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం నివేదికలో తెలిపింది. వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. కాగా.. మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి వరకు గోగులదిన్నె (ప్రకాశం)లో 4.1, గవరవరం (ఏలూరు)లో 3.9, పైడిమెట్ల (తూర్పు గోదావరి)లో, ఫిరంగిపురం (గుంటూరు)లో 3.4 సెం.మీ. చొప్పున, జీకే వీధి (అల్లూరి సీతారామరాజు) 3, ఆత్మకూరు (నంద్యాల)లో 2.5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
3 రోజులు ముందుగానే ‘నైరుతి’!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కాస్త ముందుగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా దక్షిణ అండమాన్ సముద్రంలోకి ఏటా మే 22న నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. తర్వాత వారం, పది రోజుల్లో కేరళను తాకుతాయి. ఈ ఏడాది నైరుతి మూడు రోజులు ముందే.. మే 19న దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ సోమవారం వెల్లడించింది. వచ్చే నెల ఒకటి నాటికి కేరళకు!: వచ్చే నెల ఒకటో తేదీలోగా నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సానుకూల పరిణామమని అంటున్నారు. అయితే రుతుపవనాలు కేరళకు సకాలంలో చేరాలంటే అరేబియా సముద్రంలో అనుకూల వాతావరణం ఉండాలి. వాటి ఆగమనానికి ముందు అరేబియా సముద్రంలో అల్పపీడనం గానీ, వాయుగుండం గానీ ఏర్పడకూడదు. అలా ఏర్పడితే నైరుతి రాకను ఆలస్యం చేస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల మేరకు.. ఈ నెలాఖరులోగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కొంత కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. మరికొన్ని రోజులైతే స్పష్టత వస్తుందని అంటున్నారు. నిజానికి గత ఏడాది నైరుతి రుతుపవనాలు మే 19నే దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. కానీ ప్రతికూల పరిస్థితుల వల్ల ఆలస్యంగా జూన్ 8న కేరళను తాకాయి. రాష్ట్రంలో రెండు రోజులు వానలు: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశంఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రానికి దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. -
రెండ్రోజులు వానలు
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరఠ్వాడ, కర్ణాటక, తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో అత్యధికంగా 40.5 డిగ్రీ సెల్సియస్గా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో అత్యధికంగా 24.8 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. ఈనెల 14 నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని ఆ శాఖ తెలిపింది. -
47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత ఏడాది మే నెలాఖరులో పెద్దపల్లి జిల్లాలో ఏకంగా 47.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతగా నమోదవగా.. ఈసారి మే మొదటివారంలోనే దానికి సమీపానికి చేరింది. ఆదివారం జగిత్యాల జిల్లా వెల్గటూరులో 47.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే విధంగా జగిత్యాల జిల్లా గొదురులో 46.8, అల్లీపూర్లో 46.7, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ విభాగం వెల్లడించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. ఎండల వేడి తార స్థాయికి చేరడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో రెండు రోజులు ఇలాగే.. వానలకూ చాన్స్ రాష్ట్రంలో మరో రెండు రోజులు ఇలాగే ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని.. వడగాడ్పులు తీవ్రంగా వీచే అవకాశమూ ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కొనసాగుతున్నా.. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చని వెల్లడించింది. మంగళ, బుధ, గురువారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. వర్షాలకు సంబంధించి.. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
నెల ముందే గరిష్టానికి..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరాయి. సాధారణంగా మే నెల చివరివారంలో ఉండే స్థాయిలోని గరిష్ట ఉష్ణోగ్రతలు.. మే తొలివారంలోనే నమోదవుతుండటం గమనార్హం. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల జిల్లా అల్లిపూర్, కరీంనగర్ జిల్లా వీణవంకలలో గరిష్ట ఉష్ణోగ్రత 46.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా 26 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ప్రధాన పట్టణాల్లో చూస్తే.. మహబూబ్నగర్లో సాధారణం కంటే 4.5 డిగ్రీలు, హైదరాబాద్, ఖమ్మంలలో 4 డిగ్రీలు అధికంగా ఉన్నాయి. మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే అధిక స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాడ్పుల తీవ్రత పెరిగే చాన్స్ శనివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయని.. ఆది, సోమవారాల్లో వడగాడ్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తక్షణ సహాయక చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఉరుములు, మెరుపుల వానలకు చాన్స్ మరాఠ్వాడ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో ఆది, సోమవారాల్లో అక్కడక్కడా వానలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వానలు పడే అవకాశం ఉందని వివరించింది. -
నేడు, రేపు తీవ్ర వడగాడ్పులు
సాక్షి, విశాఖపట్నం: భానుడి భగభగలు తగ్గడం లేదు. ఎండ మంటలు చల్లారడం లేదు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. గురు, శుక్రవారాల్లో వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 234 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 15, పార్వతీపురం మన్యంలో 8, శ్రీకాకుళంలో 5, ప్రకాశంలో 2, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. పల్నాడు జిల్లాలో 21, ప్రకాశం 18, ఏలూరు 18, తూర్పుగోదావరి 17, నెల్లూరు 16, గుంటూరు 16, అనకాపల్లి 15, శ్రీకాకుళం 15, కాకినాడ 13, తిరుపతి 12, కృష్ణా 11, ఎన్టీఆర్ 11, బాపట్ల 11, విజయనగరం 10, అల్లూరి సీతారామరాజు 9, కోనసీమ 9, పార్వతీపురం మన్యం 7, వైఎస్సార్ 5, విశాఖపట్నం 1, అనంతపురం 1, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు. శుక్రవారం 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 121 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపారు. నిప్పులుగక్కిన ఎండ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కూడా ఎండ నిప్పులుగక్కింది. పల్నాడు జిల్లా కొప్పునూరులో 46.2 డిగ్రీలు, తిరుపతి జిల్లా మంగానెల్లూరులో 46, ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 45.8, నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7, చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.6, ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 45.5, వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 44.9, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 44.6, అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 44.5, కర్నూలు జిల్లా పంచలింగాలలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వివరించారు. 21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 118 మండలాల్లో వడగాల్పులు వీచాయని తెలిపారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. -
మరింత పెరగనున్న ఎండలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులు బుధవారం నుంచి తీవ్రతరం కానున్నాయి. మూడోతేదీ నుంచి మరింత ఉధృతం కానున్నాయి.కొన్నిచోట్ల 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు, మూడురోజుల్లో ఇవి 47 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. -
రెండ్రోజులు మండే ఎండలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తేమ శాతం పెరగడం, పొడి వాతావరణంతో వడగాడ్పుల తీవ్రత కూడా అధికమవుతోంది. మాడుతున్న నల్లగొండ..: సోమవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోకెల్లా నిజామాబాద్లో 43.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో సాధారణం కంటే 4.4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవగా భద్రాచలం, మహబూబ్నగర్, హైదరాబాద్లలో 2–3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా మతూర్లో 45.5 డిగ్రీలు, ములుగు జిల్లా మంగపేటలో 45.2 డిగ్రీలు, నల్లగొండ జిల్లా తిమ్మాపూర్లో 45.1 డిగ్రీలు, అదే జిల్లాలోని మాడుగులపల్లిలో 45.0 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పలుచోట్ల తీవ్రంగా వడగాడ్పులు రానున్న రెండ్రోజులు పలుచోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఈ నెల 30 నుంచి మే 2వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందంటూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. తక్షణ చర్యలు చేపట్టేలా ఆయా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
ఉష్ణతాపం ఉగ్రరూపం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణతాపం మరింత ఉగ్రరూపం దాల్చనుంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో ఎండ కాక పుట్టిస్తోంది. తీవ్ర వడగాడ్పులు దడ పుట్టిస్తున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. రానున్న ఐదు రోజులు వడగాడ్పులు మరింత ఉధృతం కానున్నాయి. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశాలున్నాయి. బుధవారం అత్యధికంగా విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. బలపనూరు (వైఎస్సార్)లో 44.9, దొనకొండ (ప్రకాశం)లో 44.3, మహానంది (నంద్యాల)లో 44.2, రావికమతం (అనకాపల్లి)లో 44.1, కంభంపాడు (ఎన్టీఆర్), రావిపాడు (పల్నాడు)లలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.69 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 105 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. గురువారం 54 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 154 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటిలో తీవ్ర వడగాడ్పులు వీచే మండలాలు శ్రీకాకుళం జిల్లాలో 13, విజయనగరం జిల్లాలో 23, పార్వతీపురం మన్యంలో 12, ఏఎస్సార్ జిల్లాలో 2, అనకాపల్లిలో 3, విశాఖలో 1 (పద్మనాభం) మండలాలు ఉన్నాయని పేర్కొంది.శ్రీకాకుళం జిల్లాలో 15 మండలాలు, విజయనగరం జిల్లాలో 4, పార్వతీపురం మన్యంలో 3, ఏఎస్సార్ జిల్లాలో 12, విశాఖపట్నంలో 3, అనకాపల్లిలో 15, కాకినాడలో 17, కోనసీమలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 19, పశి్చమ గోదావరి జిల్లాలో 4, ఏలూరులో 14, కృష్ణాలో 9, ఎన్టీఆర్లో 5, గుంటూరులో 14, పల్నాడులో 5, బాపట్లలో 1, నెల్లూరులో 1, ప్రకాశంలో 1, తిరుపతి జిల్లాల్లో 3 మండలాల్లో వడగాడ్పులు వీయవచ్చని వివరించింది. శుక్రవారం 36 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 157 మండలాల్లో వడగాడ్పులు వీచే ఆస్కారం ఉందని తెలిపింది. కొనసాగుతున్న ఆవర్తనం, ద్రోణి మరోవైపు తెలంగాణ, కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ద్రోణి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో గురువారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉక్కపోత, తేమతో కూడి అసౌకర్య వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. -
కుతకుత..!
సాక్షి, హైదరాబాద్: వేసవి అయినా అధిక ఉష్ణోగ్రతల నమోదులో అంతరం ఉంటుందని వాతావరణశాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గరిష్టంగా నాలుగు లేదా ఐదురోజుల తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి, తిరిగి పెరుగుతాయి. కానీ ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్టు విశ్లేíÙస్తున్నారు. హైదరాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో గత ఆరురోజులుగా సగటున 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడం గత పదేళ్లలో ఇది రెండోసారి. గడిచిన పది సంవత్సరాల్లో 2015, 2016, 2019 సంవత్సరం ఏప్రిల్ నెలలో వరుసగా ఐదు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా... ఈసారి ఆరో రోజు కూడాఅధిక ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండురోజులు... రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించింది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది. వచ్చే రెండ్రోజులు కూడా ఇలాగే ఉంటుందని అంచనా వేసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడెం 44.9 డిగ్రీల సెల్సియస్, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా వీణవంకలో 44.8 డిగ్రీల సెల్సియస్ మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.బుధవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు(సెల్సియస్లలో)కేంద్రం గరిష్టం కనిష్టం భద్రాచలం 42.8 27.5 ఖమ్మం 42.7 25.6 నల్లగొండ 42.5 24.4 విజయవాడ 42.0 27.0 నిజామాబాద్ 41.4 26.7 రామగుండం 41.4 25.0 హనుమకొండ 41.0 24.0 మెదక్ 40.6 23.0 మహబూబ్నగర్ 40.5 27.6 హైదరాబాద్ 39.9 26.6 ఆదిలాబాద్ 38.8 22.7విశాఖపట్నం 38.8 26.8 -
వడగాడ్పుల విజృంభణ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. సాధారణం కంటే 3–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఫలితంగా గురువారం రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాల్లో వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచాయి. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయి. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కాగా.. గురువారం అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేట, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడల్లో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. నందవరం (నంద్యాల)లో 45.6, జామి (విజయనగరం)లో 45.5, కొవిలం (శ్రీకాకుళం), కొంగలవీడు (వైఎస్సార్)ల్లో 45.4, రేణిగుంటలో, దరిమడుగు (ప్రకాశం)లో 45.3, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు 16 జిల్లాల్లో నమోదైనట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం 84 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 120 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శుక్రవారం 91 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 245 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. శనివారం 39 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 215 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తేలికపాటి వానలు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి గురువారం కొమరిన్ ప్రాంతం నుంచి దక్షిణ తెలంగాణ, అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా కొనసాగుతోంది. ఫలితంగా శుక్ర, శనివారాలు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడా పిడుగులకు ఆస్కారం ఉందని, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. -
AP: ఆగని భగభగలు.. 46 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. పలుచోట్ల 42 నుంచి 45 డిగ్రీలకుపైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంకంటే 3–6 డిగ్రీలు అధికంగా ఇవి రికార్డవుతుండడంతో అనేక మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం అత్యధికంగా వైఎస్సార్ జిల్లా కొంగలవీడులో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దదేవళాపురం (నంద్యాల జిల్లా) 44.9, రావికమతం (అనకాపల్లి), రామభద్రపురం (విజయనగరం), దొనకొండ (ప్రకాశం), మంగనెల్లూరు (తిరుపతి)ల్లో 44.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 16 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 67 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 125 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. గురువారం 76 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. విజయనగరం జిల్లాలో 22, పార్వతీపురం మన్యం 13, శ్రీకాకుళం 12, అనకాపల్లి 11, పల్నాడు 7, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ 3, తూర్పు గోదావరి 2, ఎన్టీఆర్ 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయి. ప్రకాశం 24, గుంటూరు 17, తూర్పు గోదావరి 17, పల్నాడు 16, ఎన్టీఆర్ 14, శ్రీకాకుళం 14, కృష్ణా 13, కాకినాడ 12, బాపట్ల 12, ఎస్పీఎస్సార్ నెల్లూరు 11, అల్లూరి సీతారామరాజు 11, ఏలూరు 9, తిరుపతి 7, కోనసీమ 7, అనకాపల్లి 6, విజయనగరం 5, విశాఖ పట్నం 3, పశ్చిమ గోదావరి 3 మండలాల్లోను, పార్వతీపురం మన్యం, నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో ఒక్కో మండలంలోను వడగాడ్పులు వీచే అవకాశాలున్నాయి. శుక్రవారం 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 229 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మూడురోజులు తేలికపాటి వర్షాలు మరోవైపు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు తమిళనాడు, రాయలసీమల మీదుగా వ్యాపించి ఉన్న ద్రోణి సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడురోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించవచ్చని పేర్కొంది. అందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, శుక్రవారం ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, శనివారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. -
భద్రాచలం జిల్లా చుంచుపల్లిలో 44.2 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత నాలుగైదు రోజులుగా కాస్త చల్లబడ్డ గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ వేగంగా పెరిగాయి. మంగళవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడుగా ఉక్కపోత... పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 42.6 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 22.3 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5.1 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదు కాగా, భద్రాచలంలో 3 డిగ్రీలు, నల్లగొండతో పాటు పలు ప్రాంతాల్లో 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కావడం గమనార్హం. పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. రాష్ట్ర ప్రణాళిక శాఖ వాతావరణ పరిశీలన కేంద్రాల్లో నమోదైన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలం జిల్లా చుంచుపల్లిలో గరిష్ట ఉష్ణోగ్రత 44.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలో ఇదే అత్యధికం. ఆ తర్వాత నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 43.8 డిగ్రీలు, ములుగు జిల్లా మంగపేటలో 43.8డిగ్రీలు, నిజామాబాద్లో 43.3 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా వీణవంకలో 43.2 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా మంథనిలో 43.1 డిగ్రీలు, మహబూబా బాద్ జిల్లా మరిపెడలో 43.0 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేటి నుంచి మరింతగా బుధవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదుకావొచ్చని అంచనా వేసింది. రాష్ట్రానికి దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వివరించింది. గరిష్ట ఉష్ణోగ్రతలకు తోడుగా రెండు రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని సూచించింది. -
సమ్మర్.. కాస్త కూల్! ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండలు తగ్గాయి. కొన్నిరోజుల పాటు భారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. వడగాడ్పుల తీవ్రత సైతం తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. దాదా పు పదిరోజులుగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతూ వచ్చాయి. ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు.. మరోవైపు ఉక్కపోత.. వీటికి తోడు వడగాడ్పుల ప్రభావంతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మున్ముందు వేసవి తీవ్రతను తలుచుకుని ఆందోళనకు గురయ్యారు. కానీ బుధవారం నుంచి వాతావరణం చల్లబడటం ప్రారంభించింది. బుధవారం రాత్రి చల్లటి గాలులు వీయగా, గురువారం కూడా దాదాపుగా అలాంటి వాతావరణమే కొనసాగింది. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. సగటున 2 డిగ్రీల సెల్సీయస్ నుంచి 5 డిగ్రీల సెల్సీయస్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. గురువారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 39 డిగ్రీల సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 20.2 డిగ్రీల సెల్సీయస్గా నమోదైంది. ఆదిలాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 9.6 డిగ్రీల సెల్సీయస్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. కాగా మరో రెండ్రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. తేలికపాటి నుంచి మోస్తరు వానలు రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు మరఠ్వాడ నుంచి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది సముద్రమట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉష్ణోగ్రతల్లో క్షీణత చోటు చేసుకుందని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు.. ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురవొచ్చని సూచించింది. కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కీలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. -
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో వడగాడ్పులు కొనసాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. బుధవారం గరిష్టంగా 42 డిగ్రీలకు మించలేదు. అత్యధికంగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా గోకవరం, విజయనగరం జిల్లా కొత్తవలసల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో 19 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 63 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. గురువారం 11 మండలాల్లో తీవ్ర, మరో 129 మండలాల్లో వడగాడ్పులు, శుక్రవారం 13 మండలాల్లో తీవ్ర, 79 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు గురువారం నుంచి మూడు రోజులపాటు ఉత్తర కోస్తాలోను, శుక్రవారం నుంచి రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నాటి బులెటిన్లో వెల్లడించింది. దక్షిణ కోస్తాలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వానలతో పాటు ఉరుములు, మెరుపులు, అక్కడక్కడా పిడుగులు సంభవించవచ్చని పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలో ఒకింత వేడి, ఉక్కపోత, అసౌకర్య వాతావరణం నెలకొంటుందని వివరించింది. చల్లని కబురు చెప్పిన స్కైమేట్ మండే ఎండలో ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమేట్ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. రుతుపవనాల సీజన్లో 102 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు “స్కైమెట్’ ఎండీ జతిన్సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎల్నినో వాతావరణ పోకడ లానినాగా మారుతోందని పేర్కొన్నారు. దీనివల్ల రుతుపవనాల కదలికలు బలపడొచ్చని, ఫలితంగా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. -
డిమాండ్కు తగ్గట్లు కరెంట్ కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది అనడానికి నిదర్శనంగా కనిపించే సూచికల్లో విద్యుత్ వినియోగం కూడా ఒకటి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఏపీలో విద్యుత్ డిమాండ్ ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. 2022లో తలసరి విద్యుత్ వినియోగం 1,234 యూనిట్లు ఉంటే 2023లో అది 1,357 యూనిట్లకు పెరిగింది. ఇలా ఏ ఏటికాయేడు కిందటి ఏడాదికి మించి కరెంటు రికార్డులు నమోదు చేస్తూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 236.73 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. ఇది గతేడాది ఇదే సమయానికి జరిగిన వినియోగం 231.05 మిలియన్ యూనిట్ల కంటే 2.46 శాతం ఎక్కువ. పగలు పీక్ డిమాండ్ 11,926 మెగావాట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 11,358 మెగావాట్లు ఉండేది. అంటే 5 శాతం పెరిగింది. ఈ ఏడాది వేసవి ఆరంభం కాకముందే ఎండలు ముదిరినప్పటికీ.. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా ఉంటున్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కొరత రాకుండా, కోతలు విధించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రజలకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాయి. కొనుగోలుకు వెనుకాడకుండా.. రాష్ట్ర ప్రజలకు విద్యుత్ అందించేందుకు ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్ నుంచి 94.427 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 4.528 మి.యూ, ఏపీ జెన్కో సోలార్ నుంచి 2.419 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 31.868 మి.యూ, సెయిల్, హెచ్పీసీఎల్, గ్యాస్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 29.849 మి.యూ, సోలార్ నుంచి 21.635 మి.యూ, విండ్ నుంచి 20.535 మిలియన్ యూనిట్లు చొప్పున సమకూరుతోంది. నెల రోజుల్లో పవన విద్యుత్ ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయ్యింది. దీనితో పాటు బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.7.754 చొప్పున రూ. 20.634 కోట్లతో 30.211 మిలియన్ యూనిట్ల విద్యుత్ను కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక ఆర్టిఫిషియల్ఇంటిలిజెన్స్(ఏఐ) సాంకేతికతను వినియోగిస్తున్నారు. డిమాండ్ ఫోర్కాస్ట్ విధానం ద్వారా ప్రతి పదిహేను నిమిషాలకూ విద్యుత్ డిమాండ్ను అంచనా వేయగలిగే సామర్థ్యం మన విద్యుత్ సంస్థలకు ఉంది. దాని సాయంతో షార్ట్టెర్మ్ టెండర్ల ద్వారా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కోసం ముందస్తు బిడ్లు దాఖలు చేస్తున్నాయి. తద్వారా అప్పటికప్పుడు ఏర్పడే విద్యుత్ కొరత నుంచి బయటపడుతున్నాయి. రాష్ట్రంలో మునుపెన్నడూ ఇలాంటి ఏర్పాటు లేదు. గత ప్రభుత్వంలో అత్యవసర సమయాల్లో కరెంటు కొనేవారే కాదు. అనవసరంగా చేసుకున్న దీర్ఘకాల విద్యుత్ ఒప్పందాల వల్ల ఒరిగేదేమీ ఉండేది కాదు. ఫలితంగా రాష్ట్రంలో అన్ని కాలాల్లోనూ ప్రజలు విద్యుత్ కోతలతో అల్లాడిపోయేవారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు ప్రణాళికల కారణంగా విద్యుత్ వినియోగదారులకు అప్పటి ఇబ్బందులు ఇప్పుడు ఎదురవ్వడం లేదు. -
బాప్రే.. భగభగలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో వేసవి ఉష్ణోగ్రతలు ఏప్రిల్లోనే రికార్డు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం ఏడు జిల్లాల్లో దాదాపు 45 డిగ్రీలకు చేరువలోకొచ్చి మంట పుట్టించాయి. రాష్ట్రంలోని 670 మండలాలకు గాను 358 మండలాల్లో (సగానికి పైగా) వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు దడ పుట్టించాయి. 127 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 231 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం చూపాయి. శనివారం అనకాపల్లి జిల్లా రావికమతం, నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు, పల్నాడు జిల్లా రావిపాడు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, ప్రకాశం జిల్లా తోకపల్లె, వైఎస్సార్ జిల్లా బలపనూరుల్లో రికార్డు స్థాయిలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా రెంటచింతలలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ 40 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఆదివారం 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 222 మండలాల్లో వడగాడ్పులు, సోమవారం 22 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో 15, విజయనగరం 24, పార్వతీపురం మన్యంలో 11, విశాఖపట్నం 1, అనకాపల్లి 7, కాకినాడ 4, తూర్పుగోదావరి జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ఎండలు, వడగాడ్పుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రేపట్నుంచి కాస్త చల్లదనం.. కొద్దిరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఒకింత చల్లని వార్తను మోసుకొచి్చంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడేందుకు కూడా ఆస్కారం ఉందని పేర్కొంది. ఫలితంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి కాస్త ఊరటనిస్తాయని తెలిపింది. ఉష్ణతాపం తగ్గినా పలు ప్రాంతాల్లో ఉక్కపోత, అసౌకర్య వాతావరణం మాత్రం ఉంటుందని వివరించింది. -
రాష్ట్రం నిప్పుల కుంపటి!
సాక్షి, విశాఖపట్నం: వేసవి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. మే మధ్యలో నమోదు కావలసిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డవుతున్నాయి. అనేక చోట్ల వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. ఫలితంగా జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వడగాడ్పులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. కొన్ని చోట్ల 44 డిగ్రీలకు మించిపోగా, పలు చోట్ల 40 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యాయి. ముఖ్యంగా రాయలసీమలోని నంద్యాల, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తాంధ్రలోని ప్రకాశం, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఉష్ణతీవ్రత అధికంగా ఉంది. శుక్రవారం అత్యధికంగా నంద్యాల జిల్లా ఆలమూరులో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. లద్దగిరి (కర్నూలు) 44.2, మద్దూరు (వైఎస్సార్), గురజాల (పల్నాడు)ల్లో 44.1, తిప్పాయపాలెం (ప్రకాశం) 44, జి.సిగడాం (శ్రీకాకుళం) 43.8, మాడుగుల (అనకాపల్లి) 43.7, నిండ్ర (చిత్తూరు) 43.6, గుర్ల (విజయనగరం) 43.5, పెదమాండ్యం (అన్నమయ్య) 43.4, ఎం.నెల్లూరు (తిరుపతి), తలుపుల (సత్యసాయి)ల్లో 43, రెంటచింతల (పల్నాడు) 42.6 డిగ్రీలు డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు, రేపు మరింత తీవ్రం రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఎండలు, వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని 94 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 159 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఈ సంస్థ అంచనా ప్రకారం.. శనివారం 179 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 208 మండలాల్లో వడగాడ్పులు, ఆదివారం 44 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 193 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. శనివారం శ్రీకాకుళం జిల్లాలో 26, విజయనగరం 25, పార్వతీపురం మన్యం 15, అనకాపల్లి 16, అల్లూరి సీతారామరాజు 9, కాకినాడ 13, కోనసీమ 7, తూర్పు గోదావరి 16, ఏలూరు 4, కృష్ణా 4, ఎన్టీఆర్ 6, గుంటూరు 14, పల్నాడు 17, బాపట్ల 1, తిరుపతి 1, ప్రకాశం జిల్లాలోని 2 మండలాల్లోను తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు ఈనెల 8, 9 తేదీల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఫలితంగా ఆ రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గి ఉష్ణతాపం నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించనుంది. -
తెలంగాణకు హెచ్చరిక.. బయటకు రావొద్దు..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అడుగు తీసి బయట పెట్టాలంటే జంకుతున్నారు. శుక్రవారం నల్గొండ జిల్లాలోని ఇబ్రహీంపేటలో 43.5, కనగల్లో 43.4, మాడుగులపల్లిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్తో పాటు తెలంగాణలో వచ్చే రెండురోజులు(శని, ఆది) వడగాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఎండల తీవ్రత సైతం రెండు, మూడు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఎండలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని.. ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటలకు ప్రజలు బయటకు రావొద్దని పేర్కొంది.. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ వడగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. అలాగే, ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి: కరీంనగర్లో కేసీఆర్ పొలంబాట.. రైతులకు పరామర్శ -
భగ్గుమంటున్న భానుడు
సాక్షి, విశాఖపట్నం: అదుపు తప్పుతున్న ఉష్ణోగ్రతలతో భానుడు భగ్గుమంటున్నాడు. రానున్న రెండు రోజులు మరింతగా ఉగ్రరూపం దాల్చనున్నాడు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఇన్నాళ్లూ రాయలసీమలోనే ఉష్ణోగ్రతలు అత్యధికంగా రికార్డయ్యాయి. శుక్ర, శనివారాల్లో ఉత్తర కోస్తాలో అంతకు మించి నమోదు కానున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం శుక్ర, శనివారాల్లో రాయలసీమలోని వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గరిష్టంగా 41 నుంచి 43 డిగ్రీలు, దక్షిణ కోస్తాలోని పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో 41నుంచి 44, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో 41నుంచి 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని 109 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 206 మండలాల్లో వడగాడ్పులు, శనివారం 115 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 245 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. చాగలమర్రిలో 44.1 డిగ్రీలు కాగా, గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 44.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. చిన్నచెప్పల్లి (వైఎస్సార్)లో 43.9, లద్దగిరి (కర్నూలు)లో 43.8, దరిమడుగు (ప్రకాశం)లో 43.6, తెరన్నపల్లి (అనంతపురం)లో 43.5, మనుబోలు (నెల్లూరు), చియ్యవరం (తిరుపతి)లలో 43.2, కుటగుల్ల (శ్రీసత్యసాయి)లో 43.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 18 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. 21 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 97 మండలాల్లో వడగాడ్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో రానున్న మూడు రోజులు వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. -
సమ్మర్ సలసల!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల తొలివా రం నుంచి క్రమంగా పెరగాల్సిన గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4.3 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డవుతున్నాయి. దీంతో ఇక నడి వేసవి పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన అందరిలో కలుగుతోంది. వాతావరణంలో నెలకొంటున్న మార్పు లతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితిలో తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గతేడాది కంటే 2.5 డిగ్రీలు అధికంగా... నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే రోజున 41 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గురువారం రాష్ట్రంలోని 30 ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఈ ప్రాంతాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతతో పోలిస్తే ప్రస్తుతం సగటున 1 డిగ్రీల సెల్సీయస్ నుంచి 2.5 డిగ్రీల సెల్సీయస్ అధికంగా నమోదైంది. ఖమ్మంలో సాధారణం కంటే 4.3 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రత నమోదవగా హైదరాబాద్లో 2.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్లలో 2 డిగ్రీల సెల్సియస్ చొప్పున అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
TS: మండుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెదపల్లి, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
Weather: జాగ్రత్త.. ఈసారి ఎండల మంటలే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేడి సెగలు రేగుతున్నాయి. గత రెండు నెలలకు సంబంధించి ఈ రాష్ట్రాల్లో అత్యంత లోటు వర్షపాతం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తీవ్ర వర్షాభావం,అధిక వేడి ఉండే ఎల్నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని.. అంటే వచ్చే రెండు నెలలు ఎండల మంటలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఈసారి భగభగలు తప్పనట్టే.. దేశవ్యాప్తంగా ఈ వేసవికాలంలో భానుడి భగభగలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆసియా ఖండంలోని దేశాల్లో తీవ్ర వర్షాభావం, అధిక వేడికి కారణమయ్యే ఎల్నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగవచ్చని పేర్కొంటున్నారు. భారత వాతావరణ శాఖ కూడా దీనిపై ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఈసారి సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు వీయవచ్చని కూడా అంచనా వేసింది. పరిస్థితులు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం (మార్చి చివరివారంలో) ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీలకుపైనే నమోదు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ, పశి్చమ భారత రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తీవ్రమవుతున్న ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేసింది. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. ఉత్తర భారతంలోనూ పలు ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోత.. ఆరు బయట జాగ్రత్త అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో తేమ శాతం పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీనికితోడు పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తుండటం మరింత సమస్యగా మారిందని నిపుణులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయట తిరగకూడదని, ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత మేర నీటిని తాగుతూ ఉండాలని, శరీరం చల్లగా ఉండేలా చూసుకోవాలని వివరిస్తున్నారు. జిమ్లు, బయటా వ్యాయామాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని.. డీహైడ్రేషన్, ఇతర పరిస్థితుల వల్ల ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతినవచ్చని హెచ్చరిస్తున్నారు. ‘దక్షిణం’లో తీవ్ర వర్షాభావం.. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్లతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కాస్త లోటు నుంచి సాధారణ వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీలు అదనంగా నమోదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమశాతం పెరగడంతో ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో.. రాత్రిపూట కూడా వేడిగా ఉంటున్న పరిస్థితి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. కాగా.. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటినట్టు రాష్ట్ర ప్రణాళిక–అభివృద్ధిశాఖ పేర్కొంది. ఈ మేరకు ఉష్ణోగ్రతల అంచనాలను విడుదల చేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏప్రిల్లో మరింత ఎక్కువ ఎండలు.. గతేడాది కంటే వేగంగా ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే వారం రోజుల పాటు ఎండ వేడి ఎక్కువగా ఉన్నా వడగాడ్పులు వీచే అవకాశం లేదు. ఏప్రిల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఉష్ణోగ్రతల అంచనాలను ఏప్రిల్ 1న విడుదల చేస్తాం. గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా మూడు రోజులపాటు సాధారణం కంటే 2, 3 డిగ్రీలు అధికంగా నమోదై, మరింత పెరిగే అవకాశం ఉన్నప్పుడు అలర్ట్లను జారీ చేస్తాం. ఏప్రిల్ నుంచి వేసవి ముగిసేవరకు ఉష్ణోగ్రతల అంచనాలు, జాగ్రత్తలపై రోజువారీగా బులిటెన్ విడుదల చేస్తాం. – నాగరత్న, ఐఎండీ డైరెక్టర్ ప్రధాన కేంద్రాల్లో ఉష్ణోగ్రతల తీరు (డిగ్రీల సెల్సియస్లలో) కేంద్రం గరిష్టం కనిష్టం ఆదిలాబాద్ 40.8 25.5 భద్రాచలం 40.0 25.0 నిజామాబాద్ 39.9 25.0 ఖమ్మం 39.6 24.0 నల్లగొండ 39.5 24.2 హైదరాబాద్ 39.2 24.6 మహబూబ్నగర్ 39.2 25.0 మెదక్ 39.2 21.1 దుండిగల్ 39.1 22.2 హకీంపేట్ 39.0 20.1 రామగుండం 38.6 24.6 హన్మకొండ 38.0 22.5 ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరుబయట పనిచేసేవారు, ఏదైనా పని కోసం బయటికి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. తరచూ నీళ్లు తాగాలని, డీహైడ్రేషన్ తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇంకా వైద్యులు సూచనలు ఇవీ.. బయటికి వెళ్లేవారు తెలుపు, లేత రంగుల పలుచటి కాటన్ వ్రస్తాలు ధరించాలి. తలపై టోపీ పెట్టుకోవాలి. లేదా రుమాలు చుట్టుకోవాలి. నీళ్లు, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగుతూ ఉండాలి. ఎండ వేడిలో అధికంగా పనిచేయకూడదు. ఇబ్బందిగా అనిపిస్తే చల్లని ప్రదేశంలో సేదతీరాలి. అధిక వేడి వల్ల ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటివి తింటే డయేరియాకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు మధ్యాహ్నం పూట బయటికి వెళ్లొద్దు. -
రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 36.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత హకీంపేట్లో 18.3 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. చాలాచోట్ల గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సీయస్ అధికంగా నమోదు కాగా...ఆదిలాబాద్లో 2 డిగ్రీల సెల్సియస్, మిగతాచోట్ల ఒక డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఉంటుందని, తేమశాతం తగ్గడంతో ఉక్కపోత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ వివరించింది. -
కరెంట్ ‘కట్’ కట!
సాక్షి, హైదరాబాద్: నగరంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం గరిష్టంగా 31.4 డిగ్రీలు నమోదైంది. కేవలం పగలే కాదు రాత్రి ఉష్ణోగ్రతల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు చలితో వణికిన వారంతా ప్రస్తుతం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు మళ్లీ ఆన్ చేస్తున్నారు. ఫలితంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఇక అనధికారిక కోతలు అమలవుతుండటంతో సిటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవికి ముందే పరిస్థితి ఇలా ఉంటే...ఏప్రిల్, మే మాసాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఇదే రోజు 2308 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా, తాజా గా సోమవారం 2833 మెగావాట్ల వరకు చేరడం ఆందోళన కలిగిస్తుంది. డిమాండ్కు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం నమోదవుతుండటం, సబ్ స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయి. ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. 65 ఎంయూలకు చేరిన డిమాండ్ గ్రేటర్ పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉండగా, వీటి పరిధిలో 58 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 52 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మరో ఏడు లక్షల వరకు వాణిజ్య, లక్షకుపైగా ఇతర కనెక్షన్లు ఉన్నాయి. ప్ర స్తుతం విద్యుత్ డిమాండ్ 65 మిలియన్ యూనిట్లకు చేరింది. ఈ నెల మొదటి వారంలో రోజు సగటు డిమాండ్ 55 ఎంయూలు ఉండగా, ప్రస్తుతం 65 ఎంయూలకు చేరింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే పది ఎంయూలు పెరగడం విశేషం. భగ్గున మండుతున్న ఎండలకు ఉక్కపోత తోడవడంతో గృహ, వాణిజ్య విద్యుత్ మీటర్లు అప్పుడే గిర్రున తిరుగుతున్నాయి. ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో రైతులు పంటల సాగుకు పూర్తిగా వ్యవసాయ మోటార్లపైనే ఆధారపడి ఉన్నారు. గృహ వినియోగంతో పాటు వ్యవసాయ వినియోగం కూడా పెరగడంతో లోడ్బ్యాలెన్స్ను పాటించాల్సి వస్తుంది. పలు ఫీడర్ల పరిధిలో అర్థరాత్రి తర్వాత సరఫరా నిలిచిపోతుంటే..మరికొన్ని ఫీడర్ల పరి ధిలో తెల్లవారుజాము నుంచి ఉదయం ఏడు గంటల వరకు నిలిచిపోతోంది. ఆ సమయంలో చలిగాలులు వీస్తుండటం, ఆ సమయంలో ఉక్కపోత కూడా లేకపోవడం ఊరట కలిగించే అంశమే అయినప్పటికీ..భవిష్యత్తు డిమాండ్ డిస్కం ఇంజనీర్లకు ఆందోళనకు గురి చేస్తుంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మాత్రం ఈ అనధికారిక కోతల అంశాన్ని కొట్టిపారేస్తుంది. డిమాండ్కు తగినంత సరఫరా ఉందని, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. -
ముందే వచ్చిన వేసవి!
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది వేసవి ఆరంభానికి ముందే ఉష్ణతాపం భయపెడుతోంది. శీతాకాలం సీజను ముగియక ముందే సూర్య ప్రతాపం మొదలైంది. ఫిబ్రవరి రెండో వారంలోనే ఏప్రిల్ నాటి ఎండలు చుర్రుమనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు పైనే రికార్డవుతున్నాయి. ఇవి రానున్న వేసవి తీవ్రతను ఇప్పట్నుంచే తెలియజేస్తున్నాయి. సాధారణంగా ఫిబ్రవరిలో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు మించవు. కానీ అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా కర్నూలులో 38.5 డిగ్రీలు, అనంతపురం, నంద్యాల, వైఎస్సార్ కడపల్లో 38 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు కూడా కొన్ని ప్రాంతాల్లో మినహా పలు చోట్ల క్రమంగా పెరుగుతున్నాయి. ఇవి కూడా సాధారణంకంటే 2, 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. పెరగనున్న వేసవి తీవ్రత రానున్న వేసవి తీవ్రంగానే ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వేసవి తాపంతో పాటు తీవ్ర వడగాడ్పులు కూడా ఉంటాయని, కొన్ని రోజులు అసాధారణ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని చెబుతున్నారు. పసిఫిక్ మహా సముద్రంలో బలంగా ఉన్న ఎల్నినోతో పాటు ఆకాశంలో మేఘాలు తక్కువగా ఉండట, కాలుష్య కారక వాయువులు ఉపరితలంలోకి వెళ్లకుండా పొగమంచు అడ్డుకోవడం వంటివి పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణమని వాతావరణ శాఖ రిటైర్డ్ అ«దికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. అలాగే సాధారణంగా ఫిబ్రవరిలో చిరుజల్లులు కురుస్తూ ఉష్ణతాపాన్ని అదుపు చేస్తాయని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వివరించారు. గత సంవత్సరానికంటే ఈ వేసవి ఎక్కువగా ఉంటుందన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెప్పారు. జూన్ నాటికి ఎల్నినో బలహీనపడి, లానినా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉన్నందున మే ఆఖరు వరకు ఉష్ణతాపం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు -
చలిగాలుల జాడలేదు
సాక్షి, విశాఖపట్నం: డిసెంబర్, జనవరి నెలల్లో ఎముకలు కొరికేస్తున్నట్టుగా చలి తీవ్రత ఉంటుంది. కానీ.. ఈ ఏడాది అలాంటి పరిస్థితి కనిపించలేదు. ఈ శీతాకాలం సాదాసీదాగానే ప్రభావం చూపించిది తప్ప జనాన్ని గజగజలాడించ లేదు. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర వడగాడ్పులు (సివియర్ హీట్æవేవ్స్) వీస్తుంటాయి. అదే శీతాకాలంలో కొన్ని రోజులు అతి శీతల గాలులు (సివియర్ కోల్డ్ వేవ్స్) వీచి గడ్డ కట్టించే చలికి కారణమవుతాయి. అలాంటి రోజుల్లో కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతాయి. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తుంది. విశాఖ ఏజెన్సీ (అల్లూరి సీతారామరాజు జిల్లా)లోని లంబసింగి, చింతపల్లి, అరకు, పాడేరు వంటిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా క్షీణిస్తాయి. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 5–6 డిగ్రీలకు దిగజారిపోతాయి. లంబసింగిలో అయితే ఏటా జనవరిలో ఏకంగా ఉష్ణోగ్రత జీరో డిగ్రీలకు పడిపోతుంది. కానీ.. ఈ శీతాకాలం సీజన్ అందుకు భిన్నంగా సాగింది. ఈ సీజన్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ రోజులు 8–15 డిగ్రీల మధ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకంటే (చింతపల్లి, లంబసింగిల్లో) తక్కువగా రాష్ట్రంలో ఎక్కడా నమోదు కాలేదు. మన్యం సహా రాష్ట్రంలో ఒక్క రోజూ అతి శీతల గాలులు (కోల్డ్ వేవ్స్) వీయలేదు. శీతల తీవ్రత అధికంగా ఉండే జనవరిలోనూ చలి ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. ఫలితంగా చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందే అవసరం ఏర్పడ లేదు. గడచిన కొన్నేళ్లలో ఇలాంటి పరిస్థితి లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తూర్పు, ఈశాన్య గాలులే ఇందుకు కారణం సాధారణంగా శీతాకాలంలో దక్షిణాదికంటే ఉత్తర, వాయవ్య భారతదేశంలో శీతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అటునుంచి మన రాష్ట్రం వైపు ఉత్తర, వాయవ్య గాలులు బలంగా వీస్తుంటాయి. దీంతో చలి తీవ్రత ఆంధ్రప్రదేశ్పై కూడా కనిపిస్తుంది. అయితే.. ఈ ఏడాది రాష్ట్రంపైకి తూర్పు, ఈశాన్య గాలులు బలంగా వీస్తున్నాయి. ఫలితంగా ఈ గాలులు ఉత్తర, వాయవ్య గాలులకు ఒకింత అడ్డుకట్ట వేశాయి. ఈ ఏడాది చలి తీవ్రత అంతగా లేకపోవడానికి, అతిశీతల గాలులు వీయకపోవడానికి తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావం అధికంగా ఉండటమే కారణమని భారత వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు 17–23 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. దీంతో చలి ప్రభావం ఏమంత ఉండటం లేదు. గతంలో ఫిబ్రవరి ఆరంభంలో ఇలాంటి పరిస్థితి లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఇవి 30–35 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మరో 10 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆపై చలి నిష్క్రమిస్తుందని పేర్కొంటున్నారు. -
జనవరి చలి ఏదీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో ఎముకలు కొరికే చలి ఉండాలి. కానీ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండడంతో చలికి బదులు ఉక్కపోత ఉంటోంది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. సగటున 3 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మేర అధికంగా నమోదవుతుండడం గమనార్హం. రాష్ట్రంలోని వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఈ పరిస్థితి కొనసాగుతోందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వచ్చే మూడురోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతటా అధికమే... రాష్ట్రంలో అంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఐఎండీ అధికారుల గణాంకాల ప్రకారం అదిలాబాద్లో సాధారణం కంటే 9.1 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదైంది. ఈ సమయంలో 10 డిగ్రీల నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 19 డిగ్రీలు నమోదవుతోంది. నిజామాబాద్లో సాధారణం కంటే 5.7 డిగ్రీ సెల్సియస్, రామగుండంలో 5.5 డిగ్రీ, భద్రాచలంలో 4.3 డిగ్రీ, మెదక్లో 3.8 డిగ్రీ, హైదరాబాద్లో 3 డిగ్రీ సెల్సియస్ చొప్పున అధికంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుత వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో రానున్న మూడు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో రాత్రిపూట చలి ప్రభావం పెరిగే అవకాశం ఉంది. గురువారం ఖమ్మంలో 31 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 18 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. -
భూగోళం భగ్గుమంటోంది!
మరో శాస్త్రీయ నివేదిక బయటకొచ్చింది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని మళ్ళీ గుర్తు చేసింది. గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరం 2023 అని తేలిపోయింది. ఆ మధ్య వెలువడ్డ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాత్కాలిక నివేదికతో పాటు తాజాగా మంగళవారం ఐరోపా యూనియన్కు చెందిన వాతావరణ పర్యవేక్షక సంస్థ ‘కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్’ (సీసీసీఎస్) సైతం ఆ సంగతి నిర్ధారణ చేసింది. ఒకప్పుడు 2016 ‘భుగభుగల నామ సంవత్సరం’గా రికార్డ్ సృష్టిస్తే, తాపంలో అంతకన్నా గణనీయమైన తేడాతో ఆ అపకీర్తి కిరీటాన్ని ఇప్పుడు 2023 దక్కించుకుంది. భూవిజ్ఞాన సాక్ష్యాధారాలు, ఉపగ్రహ సమాచారాలను క్రోడీకరించి చూస్తే, దాదాపు లక్ష సంవత్సరాల్లో అధిక వేడిమి గల ఏడాది ఇదేనట. ఇది పెనునిద్దుర వదిలించే మాట. యథేచ్ఛగా సాగుతున్న గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల వల్ల భూతాపం ఇంతగా పెరిగిందని శాస్త్రవేత్తలకు తెలుసు. ఈ ధోరణి ఇలాగే కొనసాగనుందా? రానున్న సంవత్సరాల్లో భూగోళం అంతకంతకూ వేడెక్కనుందా? పాత రికార్డ్లు తుడిచిపెట్టుకు పోనున్నాయా అన్నది ప్రశ్న. 2024 సైతం అత్యధిక భూతాప వత్సరం కావచ్చన్న అంచనాలు పారా హుషార్ అంటున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటితో పోలిస్తే 2 డిగ్రీల సెల్సియస్కు మించి ప్రపంచ ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలన్నది లక్ష్యం. ఎనిమిదేళ్ళ క్రితం ప్యారిస్లో జరిగిన ‘కాప్–21’లో ఈ మేరకు ప్రపంచ దేశాలు ప్రతిన బూనాయి. వీలుంటే 1.5 డిగ్రీల సెల్సియస్ లోపలే ఉండేలా శ్రమించాలనీ తీర్మానించాయి. ప్యారిస్ ఒప్పందం తర్వాత వరుసగా పెరుగుతున్న వాతావరణ విపరిణామ ఘటనలు ప్రపంచాన్ని అప్రమత్తం చేశాయి. ఫలితంగా పర్యావరణ మార్పుకు సంబంధించి ఈ 1.5 డిగ్రీల సెల్సియస్ అనే హద్దు అలిఖిత శాసనమైంది. అయితే, ఇప్పుడు ఆ హద్దును దాటిపోయే పరిస్థితి వచ్చింది. గడచిన 2023లో భూగోళం భుగభుగలాడింది. ఉష్ణోగ్రతలో పెంపు ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రతి రోజూ 1850 – 1900 మధ్య కాలం కన్నా కనీసం ఒక డిగ్రీ అధిక తాపం ఉంది. గత జూన్లో మొదలై డిసెంబర్ దాకా ప్రతి నెలా గరిష్ఠ వేడిమి మాసంగా రికార్డవుతూ వచ్చాయి. ఏడాదిలో సగం రోజులు ఎప్పటికన్నా 1.5 డిగ్రీలు ఎక్కువ వేడి ఉన్నాయి. నవంబర్లో రెండు రోజులైతే ఏకంగా 2 డిగ్రీల చెలియలికట్టను దాటేశాయి. భూతాపం లెక్కలు రికార్డ్ చేయడం మొదలుపెట్టాక గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత వేడిమి గల వత్సరంగా 2023 రికార్డుకెక్కింది. గతంలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయిన ఏడాది 2016. సగటున 0.17 డిగ్రీల హెచ్చు ఉష్ణో గ్రతతో 2023 ఆ రికార్డును తిరగరాసింది. ఈ సంగతి ఆందోళన కలిగిస్తుంటే, ఇంత కన్నా భయ పెడుతున్న విషయం ఉంది. వచ్చే 12 నెలల్లో భూగోళం 1.5 డిగ్రీల మార్కును సైతం దాటేసే ప్రమాదం ఉందట. సీసీసీఎస్ శాస్త్రవేత్తలే ఆ మాటన్నారు. అంటే ఈ 2024 మరింత వేడిమితో ఉడుకెత్తించనుందన్న మాట. ఒక పక్క రికార్డు స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు, మరోపక్క సహజ వాతావరణ పరిణామమైన ఎల్ నినో... ఈ రెండూ భూగోళంపై ఉష్ణోగ్రతలు ఇంతగా పెరగడానికి ప్రాథమిక కారణమని శాస్త్రవేత్తల మాట. ఈ అధిక ఉష్ణోగ్రతల దెబ్బతో వడగాడ్పులు, వరదలు, కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా ప్రాణికోటి ఆయువు తీస్తున్నాయి. జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. అమెరికా, ఐరోపాలలో ఆ మధ్య చెలరేగిన వేడిగాలుల లాంటి వాతావరణ విపరిణామాలు సైతం మానవ తప్పిదాలతో పెరిగిన భూతాపంతోనే సంభవించాయి. డబ్ల్యూఎంఓ, సీసీసీఎస్లే కాదు... వందలాది శాస్త్రీయ అధ్యయనాలూ ప్రమాదాన్ని అద్దంలో చూపుతున్నాయి. జపాన్కు చెందిన మరో వాతావరణ సంస్థ విడిగా చేసిన మరో విశ్లేషణ ఫలితాలూ ఇలానే ఉన్నాయి. డిగ్రీలో పదో వంతు మేర భూతాపం పెరిగినా... వడగాడ్పులు, తుపానులు తీవ్ర మవుతాయి. సముద్రమట్టాలు పెరుగుతాయి. హిమానీనదాలు త్వరగా కరిగి నీరవుతాయి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా మనం నిరుడు చూసినవే. భూతాపంతో ఇరాన్, చైనా, గ్రీస్, స్పెయిన్, టెక్సాస్, అమెరికా దక్షిణ ప్రాంతాలు ఉడికిపోయాయి. కెనడాలో విధ్వంసకరమైన కార్చిచ్చు చెలరేగింది. సముద్ర ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంత పెరిగి, సముద్ర వడగాడ్పులు వీచాయి. వేసవిలోనూ, శీతకాలంలోనూ అంటార్కిటికా సముద్ర తీరాల వెంట హిమ ఘనీభవనం చాలా తక్కువైంది. రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇవన్నీ ప్రకృతి మోగిస్తున్న ప్రమాద ఘంటికలని గ్రహించాలి. పెరుగుతున్న భూతాపాన్ని నివారించడానికి ఇకనైనా చిత్తశుద్ధితో సంకల్పించాలి. విపరీత ఘట నల్ని నివారించాలంటే, అత్యవసరంగా ఆర్థిక వ్యవస్థను కర్బన రహిత దిశగా నడిపించాలి. పర్యావ రణ సమాచారాన్నీ, జ్ఞానాన్నీ ఆసరాగా చేసుకొని భవిష్యత్తు వైపు అడుగులేయాలి. భూగోళంపై జీవకోటి ప్రాణాధార వ్యవస్థలు అమితంగా దెబ్బతిన్నాయనీ, ఇప్పటికే సురక్షిత వలయం బయట మానవాళి గడుపుతోందనీ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. భూతాపం, వాతావరణ మార్పులు హద్దు మీరితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది 2023 రుచి చూపింది. ఇకనైనా ప్రపంచ దేశాలు తమ నిర్లక్ష్యాన్ని వీడి, వాతావరణ మార్పులపై కార్యాచరణకు దిగాలి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంలో మీనమేషాలు లెక్కించడం మానవాళికి శ్రేయస్కరం కాదు. అగ్ర రాజ్యాలు సహా అన్నీ ఆ పనికి దిగాలి. వీలైనంత త్వరగా నెట్ జీరో స్థాయి చేరి, జీవనయోగ్యమైన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి. మన జీవితంలో రాబోయే వత్సరాలన్నీ ఇంతకింత భూతాపంతో ఉంటాయనే భయాలూ లేకపోలేదు. అదే నిజమై, వాటితో పోలిస్తే గడచిన 2023వ సంవత్సరమే చల్లగా ఉందని భావించాల్సిన పరిస్థితి వస్తే, అది ఘోరం. చేతులారా చేస్తున్న పాపానికి ఫలితం! -
చేసిన బాసలు చెదిరిపోతే ఎలా?
‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’ (కాప్) సమావేశాలు దుబాయ్లో ప్రారంభమయ్యాయి. భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకునే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సమావేశాలు ఇవి. ఈ మధ్యే విడుదలైన ‘యూఎన్ఈపీ గ్యాప్ రిపోర్ట్’ సైతం ప్యారిస్ ఒప్పందంలో భాగంగా దేశాలు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరినా పుడమి సగటు ఉష్ణోగ్రతలు లక్ష్యంగా నిర్ణయించుకున్న 1.5 డిగ్రీ సెల్సియస్గా కాకుండా 2.9 డిగ్రీ సెల్సియస్కు చేరతాయని చెప్పడం ఆందోళనకరం.అంత స్థాయికి చేరడం భూమిని కాష్ఠం చేసినట్లే. ప్రకృతి వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. ఫలితంగా ఎన్నో ప్రకృతి ఉపద్రవాలకు బీజం పడుతుంది. పైగా రికార్డుల్లో ఎన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఏడాదే నమోదయ్యాయి. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలోనే మొదలైన కాప్–28కు ప్రాధాన్యం మరింత పెరిగింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏదైనా శంఖనాదం చేస్తుందా అని ప్రపంచం ఎదురు చూస్తోంది. వాతావరణం విషయంలో ఎన్నో రికార్డులు బద్ధలైన సంవత్సరం ఇది.ఇంకో నెల మాత్రమే ఉన్న 2023లో వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షించుకునేందుకు ఉద్దేశించిన ‘కాప్– 28’ సమావేశాలూ మొదలయ్యాయి. అంతర్జాతీయ సమాజం ఏదో ఒక అత్యవసర చర్య తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటి పోతుందన్న ప్రమాద ఘంటికలూ వినిపిస్తున్న తరుణమిది! ఐక్యరాజ్య సమితి సమావేశం (కాప్–28) ఇంకోటి దుబాయ్లో నవంబరు 30వ తేదీ మొదలైంది. ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’ (కాప్) అని పిలుస్తున్న ఈ సమావేశాలు భూమిని వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకునే ఉద్దేశంతో నిర్వహిస్తున్నవి. ఇప్పటివరకూ తీసుకున్న నిర్ణయాలూ, వాటి అమలు వంటి అంశాలపై ప్రపంచదేశాలన్నీ కూర్చుని సమీక్షి స్తారిక్కడ. మూడు దశాబ్దాలుగా వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల పుణ్యమా అని ఇప్పటివరకూ మూడు అంతర్జాతీయ చట్టాలు ఏర్పాటయ్యాయి. ఇందులో ఒకటి 2015 నాటి ‘ప్యారిస్ ఒప్పందం’. అత్యవసరంగా పరిష్కార చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాలు కోకొల్లలు. అన్నింటి లక్ష్యం మాత్రం ఒక్కటే. సురక్షితమైన భూమి! ఈ అంతర్జాతీయ నిర్ణయాలు, చట్టాలు లేకపోయి ఉంటే భూమి సగటు ఉష్ణోగ్రతలు 2,100 నాటికి కనీసం నాలుగు డిగ్రీ సెల్సియస్ వరకూ పెరిగి పోతాయి. అయితే ఇప్పుడేదో చాలా గొప్పగా జరిగిపోతుందని కాదు. ఎందుకంటే భూమి ఇప్పటికీ ప్రమాదం నుంచి బయటపడలేదు మరి!ఈ మధ్యే విడుదలైన ‘యూఎన్ఈపీ గ్యాప్ రిపోర్ట్’ కూడా ప్యారిస్ ఒప్పందంలో భాగంగా దేశాలు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరినా భూమి సగటు ఉష్ణోగ్రతలు లక్ష్యంగా నిర్ణయించుకున్న 1.5 డిగ్రీ సెల్సియస్గా కాకుండా 2.9 డిగ్రీ సెల్సియస్కు చేరతాయని చెప్పడం ఆందోళనకరం. 2021 నాటి ‘గ్లాస్ గౌ’ సమావేశాల్లోనూ సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీ సెల్సియస్కు పరిమితం చేస్తామని ప్రపంచం ప్రతిన బూనింది! షరతుల్లేని వాగ్దానాల విషయానికి వస్తే... ఇవి కూడా పూర్తిస్థాయిలో అమలైన పక్షంలో ఉష్ణోగ్రత పెరుగుదల అనేది 2.5 డిగ్రీ సెల్సియస్కు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఐపీసీసీ 2022 నాటి నివేదిక కూడా దేశాల ఆర్థికసాయంలో మూడు నుంచి ఆరు రెట్లు తక్కువగా అందినట్లు చెప్పడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. భూమి సగటు ఉష్ణోగ్రతలు 2.9 డిగ్రీ సెల్సియస్కు పెరగ డమంటే భూమిని కాష్ఠం చేసినట్లే! ప్రకృతి వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. ఫలితంగా ఎన్నో ప్రకృతి ఉపద్రవాలకు బీజం పడుతుంది. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా మనిషిపై వీటి ప్రభావం కూడా అంతకంతకూ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఊహించుకుంటేనే ఉలిక్కిపడాల్సిన పరిస్థితి ఇది. పైగా రికార్డుల్లో ఎన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఏడాదే నమోదయ్యాయి. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలోనే దుబాయ్లో మొదలైన కాప్–28కు ప్రాధాన్యం మరింత పెరిగింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏదైనా శంఖనాదం చేస్తుందా అని ప్రపంచం ఎదురు చూస్తోంది. ఐరాస వాతావరణ చర్చలే సరిపోవు... వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే కేవలం చర్చలు సరిపోవు. ప్యారిస్ ఒప్పందం ఏకాభిప్రాయంపై ఏర్పడని కారణంగా... నిర్ణయాలు తీసుకునే విషయంలో సరైన వ్యవస్థ లేక పోవడం వల్ల మనం అనుకున్నంత వేగంగా పురోగతి సాధించ లేకపోయాం. ఈ ఒప్పందంలో కేవలం కొన్ని వాగ్దానాలూ, ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి. కొంత వినూత్నంగా ఆలోచించ గలిగితే ఇంతకంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునని అప్పట్లోనే చాలామంది నిపుణులు చెప్పుకొచ్చారు కానీ పట్టించు కున్నది కొందరే! ఏదో ప్రజల ఆందోళనను కొంత నెమ్మదింప జేసేందుకా అన్నట్లు గొప్ప గొప్ప ప్రకటనలైతే జారీ అయ్యాయి. ఈ ప్రకటనలు మఖలో వచ్చి పుబ్బలో పోయే రకాలు. 2021లో జరిగిన గ్లాస్గౌ సమావేశాల్లో... ‘దశల వారీగా బొగ్గు వాడకాన్ని తగ్గించాలి’ అని ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా తొలగించాలన్న విషయానికి భారత్ అభ్యంతరం తెలిపింది. ఫలితంగా దశలవారీగా అన్న పదం వచ్చి చేరింది. అయితే భారత్లోనే కాదు... చాలా దేశాల్లోనూ బొగ్గు వాడకం తగ్గనూ లేదు. పూర్తిగా నిలిచిపోనూ లేదు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకునే చర్యలు ప్రభావవంతంగా ఉండాలంటే దానికి సర్వతోముఖ ప్రయత్నాలు అవసరం. భాగస్వాములందరూ కలిసికట్టుగా పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఐరాస చర్చలు ఈ అంశంపై నియమ నిబంధనలను ఖరారు చేయడంపై దృష్టి పెట్టడం మంచిది. దుబాయ్లో జరిగే చర్చలు మన లక్ష్యానికి సంబంధించిన స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించాలి. అలాగే దేశాలు తగిన చర్యలు తీసుకునేలా చేయాలి. కాప్–28 లక్ష్యం ఇదే కావాలి. తొలిసారి ప్రపంచస్థాయి సమీక్ష... దుబాయ్లో జరుగుతున్న కాప్–28 సమావేశాల్లో మొట్ట మొదటిసారి ప్రపంచవ్యాప్త వాతావరణ పరిస్థితిపై తాజా సమీక్ష ఒకటి చేపట్టనున్నారు. ‘గ్లోబల్ స్టాక్ టేక్’ ద్వారా ప్యారిస్ ఒప్పందం అమలు విషయంలో ఇప్పటికి మనం సాధించింది ఏమిటి? సాధించాల్సింది ఏమిటన్న స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందన్నమాట. ఈ ఏడాది సెప్టెంబరులో దీనికి సంబంధించిన నివేదికలు సిద్ధ మయ్యాయి. ఆశయాలకు, ఆచ రణకు మధ్య అంతరాన్ని విస్ప ష్టంగా ఈ నివేదికల్లో పేర్కొ న్నారు. కాప్–28 ఇంకో ముంద డుగు వేసి ప్రపంచం నిర్దేశిత లక్ష్యానికి దూరంగా ఉన్న విష యాన్ని స్పష్టం చేయాలి. ప్రస్తుత వాగ్దానాలు సరిపోవని, ఆర్థిక సహకారం తగినంత అందని నేపథ్యంలో వీటి అమలు కూడా అసాధ్యమన్న విషయాన్ని సుస్పష్టం చేయాలి. కాప్–28 ద్వారా ప్రపంచానికి అందించాల్సిన సందేశం ఇంకోటి కూడా ఉంది. కర్బన ఉద్గారాల తగ్గింపు, అందుకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించడంపై ఎక్కువ దృష్టి పెట్టక పోవడం మంచిది. ఎందుకంటే గతంలో కాప్ సమావేశాలు మిగిలిన విషయాలను పక్కనబెట్టి కేవలం ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకన్నట్లు భారీ భారీ లక్ష్యాలు ప్రకటించి చతికిలబడ్డాయి కాబట్టి! ఈ రకమైన భారీ లక్ష్యాలు చాలాసార్లు ఆయా దేశాల ఆశయాలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. జాతీయ రాజకీయాలు పరిస్థి తులు (కొన్ని సందర్భాల్లో చట్టపరమైన అంశాల) అసలైన, ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను నిర్దేశిస్తాయే కానీ.. అంతర్జాతీయ ఒత్తిడి కాదు. ఈ లక్ష్యాలకు అంతర్జాతీయ ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞాన, మానవ వనరుల పరమైన సాయం లభించినప్పుడు మాత్రమే వాస్తవంగా అమలు చేయడం సాధ్యమవుతుంది. తద్వారా మన విశ్వాసం మరింత పెరుగుతుంది. మరింత ఉన్నత స్థాయి లక్ష్యాల కోసం పనిచేసే స్థైర్యం లభిస్తుంది. లక్ష్యాలకన్నా ఆచరణ మిన్న వాతావరణ మార్పులను తట్టుకునేందుకు చేయాల్సిన పనుల విషయంలోనూ కొంచెం పట్టువిడుపు ధోరణి అవసరం. మరింత కఠినమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం కంటే సంప్ర దాయేతర ఇంధన వనరుల వాడకాన్ని పెంచాలని, ఇంధన సామర్థ్యాన్ని పెంచుకోవాలని కాప్–28 వేదికగా పిలుపునివ్వాలి. దీనికీ శిలాజ ఇంధనాల వాడకం తగ్గేందుకూ మధ్య పొంతన కుదిరేలా చూడాలి. అంటే.. లక్ష్యాలను నిర్దేశించడం కాకుండా మార్పు జరిగేందుకు, సక్రమ అమలుకు పూనికగా నిలవాలి అని అర్థం. దీనికి అదనంగా కాప్–28 బాధ్యతల పంపిణీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దేశాల అంతర్గత లక్ష్యాలు కావచ్చు. దేశాల మధ్య కావచ్చు అన్నింటి విషయంలో సమదృష్టి పాటించడం అవసరం. వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించాలంటే వ్యవస్థలకు వ్యవస్థలు మారాల్సి ఉంటుంది. ఇది కొంత విధ్వంసాన్నయితే సృష్టిస్తుంది. దీని ప్రభావం కూడా దిగువ వర్గాలపైనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారి ప్రయోజనాలు దెబ్బతినకుండా న్యాయమైన, అందరినీ కలుపుకొనిపోయే ఏర్పాట్లు అవసరం. ప్రత్యామ్నాయ జీవ నోపాధులతో పాటు తమదన్న భావనను కల్పించడం కీలక మవుతుంది. కాప్–28 సమా వేశాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా.. వాటి అమలును చురు కుగా పర్యవేక్షించడం ముందుకు తీసుకెళ్లడం ప్రస్తుత తక్షణ కర్తవ్యం కావాలి. ఐక్యరాజ్య సమితి పరిధిలో.. బయట కూడా చేసిన వాగ్దానాలు నెరవేరేలా చూసేందుకు ఒక ప్రణాళిక కూడా అవసరం. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలనేవి ప్రభుత్వాల్లోని అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకుని ఆచరించినప్పుడు వాటికి సార్థకత. అలాగే ఈ చర్యలు ప్రభావశీలంగా ఉండాలంటే భాగస్వాములందరి చర్యలూ, తోడ్పాటు అత్యవసరం. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాతావరణ సంబంధిత వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. అంతర్జాతీయ కోర్టుల్లోనూ హై ప్రొఫైల్ కేసులు విచారణలో ఉన్నాయి. ఇదంతా బాధ్యత ఎవరిదన్న విషయంపైనే! దేశాలు, ఐక్యరాజ్య సమితి కూడా తాము చేసిన వాగ్దానాలు కచ్చితంగా, సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలి. తద్వారా మానవాళిని పరిరక్షించాలి. లావణ్యా రాజమణి వ్యాసకర్త ప్రొఫెసర్,ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ లా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ -
పగలు భగభగ.. రాత్రి గజగజ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గతవారం వరకు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా... ఇప్పుడు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పూర్తి కావడంతో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం తోడుకావడం, రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పతనం కావడంతో పాటు ఈశాన్య దిశల నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లో తక్కువగా.. సెప్టెంబర్ నెలాఖరుతో వానాకాలం ముగిసినప్పటికీ... అక్టోబర్ రెండో వారం వరకు నైరుతి ప్రభావం ఉంటుంది. తాజాగా నాలుగో వారం వరకు చలి తీవ్రత పెద్దగా లేకపోగా... రెండ్రోజులుగా వాతావరణంలో వేగంగా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో కని ష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల నమోదవుతోంది. మెదక్, వరంగల్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్యన నమోదయ్యాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే దక్షిణ ప్రాంత జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... ఉత్తర ప్రాంతంలో మాత్రం సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 35.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 15 డిగ్రీ సెల్సియస్గా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. -
చలికాలంలో భగభగలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భగభగమంటున్నాయి. సాధారణంగా చలికాలంలో క్రమంగా తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు వేసవి కాలం మాదిరి నమోదవుతున్నాయి. ప్రస్తుతం నైరుతి సీజన్ ముగిసి, ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలిస్తుంటాయి. ఇంకా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనప్పటికీ సాధారణంగా ఈపాటికి వాతావరణం చల్లబడుతుంది. కానీ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలను మించిపోతున్నాయి. సగటున 3–5 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో రాష్ట్రంలో వాతావరణం వేసవి సీజన్ను తలపిస్తోంది. వాతావరణంలో తేమ తగ్గడంతో ఉక్కపోత పెరుగుతుండగా.. ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా ఉంటుండటంతో ఉష్ణోగ్రతలు సైతం అధికంగా నమోదవుతున్నాయి. మరో వారం ఇంతే... రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసినప్పటికీ... తిరోగమన ప్రక్రియ చివరి దశలో ఉంది. మరో మూడు రోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత వారం రోజులకు ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో వాతావరణంలో మార్పులు ఉంటాయని, దీంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం రాష్ట్రంలో నమోదైన ఉషోగ్రతలను పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 36.2 డిగ్రీ సెల్సియస్ నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత అత్యల్పంగా మెదక్లో 18.3 డిగ్రీలుగా నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు చాలాచోట్ల సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా నమోదవుతోంది. ఖమ్మం జిల్లాలో సాధారణం కంటే 4.6 డిగ్రీలు అధికంగా నమోదు కాగా, భద్రాచలంలో 3.5 డిగ్రీలు, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, హనుమకొండలో 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడివాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
మబ్బులు చెదిరి..నిప్పులు కురిసి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం మళ్లీ ఎండాకాలంలా మారిపోయింది. ఈసారి వానాకాలం మొదట్లో చినుకు జాడ లేక, తర్వాత భారీ వర్షాలు కురిసి.. ఆగస్టులో అయితే నెలంతా వానలు పడక చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ నెల మొదట్లో మంచి వర్షాలే పడినా.. మళ్లీ వాతావరణం భిన్నంగా మారిపోయింది. సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు ఉక్కపోతతోనూ ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే నాలుగు రోజులుగా ఈ పరిస్థితి ఉండగా.. మరో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. మబ్బులు మాయమై.. సాధారణంగా వానాకాలం చివరిలో తేలికపాటి వర్షాలే కురిసే పరిస్థితి ఉన్నా.. ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంటుంది. రుతుపవనాల కదలిక ఎక్కువగా ఉంటే భారీ వర్షాలు కూడా పడుతుంటాయి. కానీ ఇప్పుడు వాతావరణం ఇందుకు భిన్నంగా ఉంది. ఆకాశంలో మబ్బులు కానరావడం లేదు. ఎక్కువై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణంలో తేమశాతం ఎక్కువై ఉక్కపోత పెరిగిందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఈ నెల 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుందని, ఆ తర్వాత వానలు పడే అవకాశం ఉందని వివరిస్తున్నారు. గణనీయంగా ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో ఎండాకాలంలో నమోదయ్యే స్థాయిలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. బుధవారం అత్యధికంగా నల్లగొండలో 36.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సెపె్టంబర్ మూడో వారంలో సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల మేర.. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల మేర ఉండాలని..కానీ ఇప్పుడు 3 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. రెండు మూడు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరవచ్చని అంటున్నారు. -
చంద్రుడిపై ఉష్ణోగ్రతల్లో వేగంగా మార్పులు
సూళ్లూరుపేట: చంద్రయాన్–3 ప్రయోగం ద్వారా చంద్రుడికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. చంద్రయాన్–3 మిషన్లో అంతర్భాగమైన విక్రమ్ ల్యాండర్లో అమర్చిన చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను ఇస్రోకు పంపిస్తోంది. ‘చంద్రుడి ఉపరితలంపై 20 లేదా 30 డిగ్రీల సెంటీగ్రేడ్కు కాస్త అటూఇటూగా ఉష్ణోగ్రతలు ఉండొచ్చని అంచనా వేశాం. కానీ, ఆశ్చర్యకరంగా 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అక్కడున్నాయి. మేం ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువ’అని ఇస్రో శాస్త్రవేత్త బీహెచ్ఎం దారుకేశ ఆదివారం పీటీఐకి చెప్పారు. ‘అదేవిధంగా, ఈ పేలోడ్లో అమర్చిన కంట్రోల్డ్ పెన్ట్రేషన్ మెకానిజం ద్వారా ఉపరితలానికి 10 సెంటీమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలను సెన్సార్లతో కొలవచ్చు. ఉపరితలంపై 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండగా కేవలం రెండు, మూడు సెంటీమీటర్ల లోతు కెళ్లే సరికి రెండు మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇంకాస్త లోతుకెళితే –10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలున్నాయి. ఉపరితలంతో పోలిస్తే రమారమి 50 డిగ్రీలు తేడాతో ఉండటం చాలా ఆసక్తికరమైన అంశం’అని ఆయన తెలిపారు. ‘కేవలం 8 సెంటీమీటర్ల లోతుకు వెళ్లగానే అది 10 డిగ్రీలకు పడిపోయింది. మరింత లోతుకు వెళితే మంచు ఆనవాళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా పరిశోధనలను బట్టి చంద్రుడిపై ఉష్ణోగ్రతలు చాలా వేగంగా మారుతున్నట్లు స్పష్టమవుతోందని ఇస్రో పేర్కొంది. దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఇలాంటి వివరాలను తెలుసుకోవడం ఇదే మొదటిసారని తెలిపింది. ఈ పేలోడ్ను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో స్పేస్ ఫిజిక్స్ లా»ొరేటరీ, అహ్మదాబాద్లోని స్పేస్ అప్టికేషన్ సెంటర్ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. రోవర్పై జాతీయ జెండా, ఇస్రో సింబల్ ల్యాండర్ నుంచి విడిపోయి రోవర్ చంద్రుడిపై నెమ్మదిగా అడుగులు వేస్తూ చంద్రుడిపై పరిశోధనలు ఇప్పటికే ప్రారంభించేసింది. చంద్రుడిపై రోవర్ దిగిన వెంటనే భారత ప్రభుత్వం మూడు సింహాలు గుర్తు, ఇస్రో సింబల్ను చంద్రుడిపై ముద్రించింది. జాతీయ జెండా, ఇస్రో సింబల్ రోవర్ మీదున్న ఛాయాచిత్రాన్ని ఇస్రో విడుదల చేసింది. ప్రస్తుతం ల్యాండర్లో అమర్చిన పేలోడ్స్, రోవర్లో అమర్చిన పేలోడ్స్ తమ పనిని చేసుకుంటూ ఇ్రస్టాక్ కేంద్రానికి సమాచారాన్ని అందిస్తున్నాయి. -
భూగోళం.. ఇక మండే అగ్నిగోళం.. ముంచుకొస్తున్న మరో ప్రమాదం
సాక్షి, అమరావతి: భూగోళం మండే అగ్నిగోళంగా మారుతోంది. శీతల దేశాల్లో సూర్యుడు సెగలు పుట్టిస్తున్నాడు. ఎండల ధాటికి ఓ వైపు అడవులు దగ్ధమైపోతుండగా.. మరోవైపు మంచు కరిగిపోయి వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ యుగం ముగిసిపోయిందని.. ఇక గ్లోబల్ బాయిలింగ్ శకం వచ్చేసిందని ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే ఈ ఏడాది జూలైలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని యూరోపియన్ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్, ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించాయి. సాధారణంగా జూలైలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యేదని.. కానీ, ఈ ఏడాది దాదాపు 17 డిగ్రీలకు పెరిగిందని వెల్లడించాయి. 1.20 లక్షల సంవత్సరాల్లో భూమి ఇంత వేడెక్కడం ఎప్పు డూ లేదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. విపరీత వేడి కారణంగా మంచు కరిగి వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే చైనా, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికా ఈశాన్య ప్రాంతాలు, జపాన్, భారత్, పాకిస్తాన్లో ఆకస్మిక వరదలు సంభవిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో పగటిపూటతో పోలిస్తే రాత్రి సమయాల్లో వాతావరణం కాస్త చల్లబడుతుంది. కానీ, కాలిఫోర్నియాలోని ‘డెత్ వ్యాలీ’లో రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. అక్కడ జూలై నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే వాయవ్య చైనాలోనూ రికార్డు స్థాయిలో 52.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఉత్తరార్ధ గోళంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో వడగాడ్పులు వీచాయి. ఫలితంగా అంటార్కిటికాలో కూడా పెద్ద ఎత్తున మంచు కరిగిపోయింది. అలాగే ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, పోలాండ్ దేశాలను వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేశాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పొంచి ఉన్న కరువు ముప్పు..! దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, ఆసియా దేశాలు వసంత కాలం చివరి నుంచి అత్యధిక వేడిని ఎదుర్కొన్నాయని యూరోపియన్ కోపర్నికస్ నివేదిక చెబుతోంది. అమెరికాలోని దక్షిణ రాష్ట్రాల్లో క్రమం తప్పకుండా 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. గ్రీస్, ఇటలీ, క్రొయేషియా, అల్జీరియా, కెనడాలో కార్చిచ్చులు చెలరేగి అడవులను దహించాయి. నాడాలో ఏకంగా నాలుగు వారాల్లో 46 వేల చదరపు మైళ్ల అడవులు బూడిదయ్యాయి. 60 శాతం దేశాల్లోని అడవుల్లో మంటలు చెలరేగాయని నివేదిక తెలిపింది. వీటి ఫలితంగా 1950తో పోలిస్తే ప్రపంచ భూభాగంలో దాదాపు మూడో వంతు ఏటా కరువు సంభవిస్తుందని.. ఇది 10 లక్షల మందిని తీవ్ర ఆకలిలోకి నెడుతుందని శాస్త్రవేత్తల నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఏడాది చివరితో పాటు 2024లో ఎల్నినో ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా బ్రిటన్, ఐర్లాండ్, బాల్టిక్ సముద్రం, జపాన్ సముద్రం, పసిఫిక్, పశ్చిమ హిందూ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. కాగా, ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ మేర కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలతో కలిసి ఐక్యరాజ్యసమితి చర్యలు చేపడుతోంది. -
వేధిస్తున్న విపరిణామాలు
వందేళ్లలో ప్రపంచ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. ఫలితంగా వ్యవసాయోత్పత్తులు దెబ్బతింటున్నాయి. దీనివల్ల ఆహోరోత్పత్తుల ధరలు చుక్కలనంటి, ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే, వందేళ్లలో మారిన ప్రకృతి విపరిణామాల గురించి ఆలోచిస్తున్నాం సరే, మరి సమాజంలో ఇంకా మారని దుష్పరిణామాల గురించి ఆలోచిస్తున్నామా? మనుషుల మధ్య ఉన్న పెక్కు సామాజిక అసమానతలు ఇప్పటికీ తొలగిపోవడం లేదు. అంటరానితనమనే రుగ్మత ఇంకా పీడిస్తున్న పెను‘రోగం’గానే ఉంది. ‘ఎల్నినో’ వాతావరణాన్ని ప్రభావితం చేస్తే... కుల వ్యవస్థ, మత వ్యవస్థలు సంఘ జీవనాన్ని ఇప్పటికీ కలుషితం చేస్తూనే ఉన్నాయి. ‘‘గత వందేళ్లలోనే ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయి. 2100 సంవ త్సరానికల్లా అనూహ్యంగా 4 సెంటిగ్రేడ్ డిగ్రీలు పెరగనున్నాయి. కాగా, ఇంతవరకు ప్రపంచ వాతావరణ రికార్డులో లేని వేడిమి 2022లో నమోదైంది. అంతేగాదు, తరచుగా దక్షిణ ఆసియాలో బిళ్లబీటుగా ఉధృతమవుతున్న వేడిగాలులు రానున్న సంవత్సరాల్లో కూడా కొనసాగ బోతున్నాయి. ఇంతగా వేడి గాలులు భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రా లలోనే గాక, దక్షిణాది రాష్ట్రాలను కూడా అమితంగా పీడిస్తున్నాయి. ఢిల్లీని 72 ఏళ్ల చరిత్రలో ఎరగని ఉష్ణోగ్రతలు ఈ ఏడాది కుదిపేశాయి. ప్రపంచ వాతావరణంలో అనూ హ్యమైన స్థాయిలో (40 డిగ్రీల సెంటి గ్రేడ్కు మించి) వేడిగాలులు వీచే ఈ పరిస్థితుల్లో, భారత్, చైనా, పాకిస్తాన్, ఇండోనేసియా లాంటి దేశాల్లో బయటి పనిచేసుకుని బత కాల్సిన దినసరి కార్మికులు యమ యాతనలకు గురికావల్సి వస్తుంది. 1971–2019 సంవత్సరాల మధ్య ఇండియాను చుట్టబెట్టిన అసాధా రణ వేడిగాలుల ఫలితంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.’’ – ప్రొఫెసర్స్ వినోద్ థామస్, మెహతాబ్ అహ్మద్ జాగిల్,నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఈ ‘మిడిమేల’మంతా భారతదేశాన్ని ఎలా చుట్టబెడుతోంది? మరో వైపు, గత ఏడేళ్లుగా పసిఫిక్ మహాసముద్రం నుంచి ఏనాడూ ఎరుగ నంతటి వేడి గాలులకు నిలయమైన ‘ఎల్నినో’ వాతావరణ దృశ్యం భారత దేశాన్ని ‘కుమ్మేస్తూ’ ముంచుకొస్తోంది. ఫలితంగా వ్యవసాయో త్పత్తులు దెబ్బతింటున్నాయి. దీనివల్ల తీవ్రమైన సామాజిక పరిస్థి తులు తలెత్తి, ఆహోరోత్పత్తుల ధరలు చుక్కలనంటి, ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని సిడ్నీ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్రాచార్యులు డేవిడ్ యుబిలావా హెచ్చరిస్తున్నారు. ‘ఎల్నినో’ ప్రభావం అన్ని చోట్లా ఒకే తీరుగా ఉండదు. కాకపోతే, పెక్కు దేశాలకు వర్తక వ్యాపారాల సంబంధ బాంధవ్యాలున్నందువల్ల ఆర్థికపరమైన ఒడిదు డుకులు అనివార్యమవుతాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలతో పాటు, సామాజిక ఒడిదుడుకులు అనివార్యమనీ అంచనా! ఇప్పటికే మనుషుల మధ్య పెక్కు సామాజిక అసమానతలు ఉన్నాయి. అంటరానితనమనే రుగ్మత పెక్కుమందిని ఇంకా పీడిస్తున్న పెను‘రోగం’గానే ఉంది. ‘ఎల్నినో’ లాంటి వాతావరణం వల్ల వారి జీవితాలకు మరిన్ని అవాంతరాలు తోడవుతున్నాయి. ఈ జాఢ్యం ఇప్పుడే గాదు, ‘ఏలినాటి శని’గా మనదాకా దాపురించి ఉన్నందుననే – మహాకవి జాషువా ఏనాడో ఇలా చాటాడు: ‘‘అంటరాని తనంబునంటి భారత జాతి భువన సభ్యత గోలుపోయె... నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయు’’ అంతేనా? తాను ‘పుట్టరాని చోట పుట్టినందుకు’ అసమానతా భారతంలో ఎన్ని అగచాట్లకు గురయ్యాడో వెలిబుచ్చిన గుండె బాధను అర్థం చేసుకోగల మనస్సు కావాలని ఇలా కోరుకున్నాడు: ‘‘ఎంత కోయిల పాట వృథయయ్యెనొ కదా చిక్కు చీకటి వన సీమలందు ఎన్ని వెన్నెల వాగు లింకి పోయెనొ కదా కటికి కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింక లీడేరెనొ కదా మురికి తిన్నెల మీద పరిమళించి ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనొ కదా పండిన వెదురు జొంపములలోన ఎంత గంధవహన మెంత తంగెటి జున్ను యెంత రత్నకాంతి యెంత శాంతి ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనొ పుట్టరాని చోట బుట్టుకతన...’’ ‘ఎల్నినో’ వాతావరణాన్ని ప్రభావితం చేస్తే... కుల వ్యవస్థ, మత వ్యవస్థలు సంఘ జీవనాన్ని ఇప్పటికీ ఎలా కలుషితం చేస్తున్నాయో ‘గబ్బిలం’ దీనావస్థ ద్వారా జాషువా వ్యక్తం చేశారు. ‘పూజారి’ లేని సమయం చూసి నీ బాధను శివుడి చెవిలో విన్నవించుకోమంటాడు. అప్పటికీ ఇప్పటికీ – పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రంగా వ్యవస్థ అవస్థ పడుతూనే ఉంది. కనుకనే జాషువా ‘ముప్పయి మూడు కోట్ల దేవతలు ఎగబడ్డ దేశంలో భాగ్యవిహీనుల కడుపులు చల్లారుతాయా’ అని ప్రశ్నించాడు! అలాగే అనేక ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవుల్ని క్షేమంగా గట్టెక్కించే ఔషధాలు, వాటి విలువల్ని తొలిసారిగా ప్రపంచానికి వెల్లడించిన 18వ శతాబ్ది కవి చెళ్లపిళ్ల నరస కవి. ఒక్క ‘కరణి’ అన్న పదంతోనే (ఒక రీతి, ఒక పద్ధతి) ధరణిని శ్వాసించి, శాసించిన కవి! ఆయన గ్రంథం ‘యామినీ పూర్ణతిలకా విలాసం’ ఎన్ని రకాల ఔషధాలనో వెల్లడించింది: చనిపోయిన వారిని బతికించే ఔషధి – ‘సంజీవకరణి’, విరిగిపోయిన ఎముకల్ని అతికించేది– ‘సంధాన కరణి’, తేజస్సును కోల్పోయిన మనిషికి తేజస్సు ప్రసాదించే ఔషధం– ‘సౌవర్ణకరణి’, మనిషి శరీరంలో విరిగి పోయిన ఎముక ముక్కల్ని తొలగించేసేది – ‘విశల్యకరణి’. ఇవన్నీ నరస కవి చూపిన ప్రకృతి లోని పలు రకాల ఔషధాలు! కళల్ని మెచ్చుకుని వాటికి కాంతులు తొడిగే శిల్పుల్ని నిరసించడం తగదు గదా! ఎందుకని? ‘వానతో వచ్చే వడగండ్లు’ నిలుస్తాయా?! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఉడికి ఉక్కిరిబిక్కిరవుతున్న జనం.. మొత్తం 9 దేశాలు.. టాప్లో మనమే!
ఏటేటా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల తీవ్రత నుంచి రక్షించుకోగలిగే శీతల సదుపాయాల్లేక కోట్లాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు ప్రమాదంలో జీవిస్తున్నారు. 54 దేశాల్లో 117 కోట్ల మంది ఈ ముప్పును ఎదుర్కొంటున్నట్లు ‘సస్టెయినబుల్ ఎనర్జీ ఫర్ ఆల్’లెక్కతేల్చింది. ఇది 2022 నాటి అంచనా. ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ ప్రతి ఏటా బాధితుల సంఖ్య ఆ మేరకు పెరుగుతోంది. చాలా మంది మానసిక, శారీరక అనారోగ్యాల పాలవుతున్నారు. వడదెబ్బతో మృత్యువాతపడుతున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. అంతేకాదు రెక్కాడితేగాని డొక్కాడని పేదలు ఎండలో మాడుతూనే పనులు చేసుకోక తప్పటం లేదు. ఎండకు భయపడిన వారు పనిదినాలను, దినసరి ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బాధితులు మన దేశంలోనే ఎక్కువ అధిక ప్రభావం గల దేశాల్లో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లో పేదరికం, విద్యుత్ సదుపాయంలో అంతరాల కారణంగా శీతలీకరణ సదుపాయాలకు నోచుకోని జనాభా గణనీయంగా ఉంది. అత్యంత ఎక్కువ ప్రభావిత దేశాలు 9. ఈ జాబితాలో 32.3 కోట్ల మందితో మన దేశానిదే అగ్రస్థానం. 15.8 కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో నైజీరియా (14.2 కోట్లు), బంగ్లాదేశ్ (5 కోట్లు), ఇండోనేసియా (4.4 కోట్లు), పాకిస్తాన్ (3.4 కోట్లు), బ్రెజిల్ (3.2 కోట్లు), మొజాంబిక్ (2.7 కోట్లు), సూడాన్ (1.7 కోట్లు) ఉన్నాయి. ఈ దేశాల్లో అధిక ఎండల కారణంగా అత్యధిక పేద, మధ్యతరగతి ప్రజలు ఎయిర్ కూలర్లు, ఏసీలు లేక ఫ్యాన్లతో సరిపెట్టుకుంటూ అష్టకష్టాలు పడుతున్నారు. పేద దేశాల్లో కొందరికైతే ఫ్యాన్ కూడా లేదు. విద్యుత్ సదుపాయమే లేని నిరుపేదలూ లేకపోలేదు. 2021కన్నా 2022లో ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ, పట్టణవాసుల్లో అధిక ఎండల బాధితుల సంఖ్య 2.86 కోట్లు పెరిగిందని సస్టెయినబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ తెలిపింది. ఇళ్లన్నిటికీ విద్యుత్ ఉంది కానీ.. ప్రజల ఆదాయం స్థాయినిబట్టి శీతల సదుపాయాలు కల్పించుకొనే స్తోమత ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 140 కోట్ల జనాభా కలిగిన భారత్లో విద్యుత్ సదుపాయం 100 శాతం ఇళ్లకు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ ఇళ్లలో శీతలీకరణ ఉపకరణాల వాడకం తక్కువగానే ఉంది. 19.6 కోట్ల ఫ్యాన్లు, 16.2 కోట్ల రిఫ్రిజిరేటర్లు, 4 కోట్ల ఎయిర్ కండిషనర్లు భారత్లో వినియోగంలో ఉన్నట్లు అంచనా. సుస్థిర శీతల సాంకేతికతలు ఏసీల వల్ల ప్రజలకు వేడి నుంచి తాత్కాలికఉపశమనం దొరుకుతున్నప్పటికీ వీటి నుంచి వెలువడే ఉద్గారాల వల్ల వాతావరణంఇంకా వేడెక్కుతోంది. అందువల్ల, సుస్థిర శీతల సదుపాయాలతో కూడిన ప్రత్యామ్నాయాలపై ముఖ్యంగా అధికోష్ణ ప్రభావిత 9 దేశాలుమరింతగా దృష్టి సారించాల్సి ఉంది. నాలుగేళ్ల క్రితం భారత్ తొలి అడుగు వేసింది. ప్రత్యేక నేషనల్ కూలింగ్ యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. అడవుల పెంపకం, పట్టణాల్లో పచ్చదనం పెంపొందించటం ఉష్ణోగ్రతలను తగ్గించటంలో ఉపయోపడతాయి. గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలపై మరింత పెట్టుబడి పెట్టడం ద్వారా సుస్థిర శీతల సాంకేతికతలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. – సాక్షి సాగుబడి డెస్క్ -
ఈసారి మరీ లేట్
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. సాధారణంతో పోల్చితే ఇప్పటికే వారం, పది రోజులకుపైగా ఆలస్యంకాగా.. నైరుతి ఆగమనానికి మరో వారం వరకూ సమయం పట్టవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 20–22వ తేదీ నాటికి రావొచ్చని పేర్కొంటోంది. ఇది గత పదేళ్లతో పోల్చితే ఏకంగా పది, పన్నెండు రోజులు ఆలస్యం కావడం గమనార్హం. రుతుపవనాలు రాకపోవడంతో వానలు పడక వ్యవసాయంపై ప్రభావం పడు తోంది. పంటల సాగు మొదలుపెట్టేందుకు జాప్య మవుతోందని, ఇలాగైతే పంటల దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వచ్చి.. మందకొడిగా మారి.. ప్రస్తుత సీజన్కు సంబంధించి ఈ నెల 8న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు తర్వాత క్రమంగా తమిళనాడుతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల్లోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. కానీ ఆ తర్వాత మందకొడిగా మారిపోయాయి. రుతుపవనాలు చురుకుగా కదిలేందుకు బంగాళాఖాతంపై నెలకొనే వాతావరణ పరిస్థితులే కీలకం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి, అల్పపీడనాలు వంటివి ఏర్పడితే రుతుపవనాలు వేగంగా వ్యాప్తి చెందుతాయని అధికారులు చెప్తున్నారు. కానీ ఈసారి బంగాళాఖాతంలో అలాంటి పరిస్థితులేవీ నెలకొనలేదని.. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుపాను ప్రభావంతో నైరుతి మందకొడిగా మారిందని అంటున్నారు. ఇంతకు ముందు కాస్త లేటయినా.. నైరుతి రుతుపవనాలు మే చివరివారం నుంచి జూన్ తొలివారం మధ్య కేరళలో ప్రవేశిస్తాయి. తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. అల్పపీడనాలు, తుఫానులు వంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రుతుపవనాల కదలికలు ఉంటాయి. గత పదేళ్లలో రుతుపవనాల రాకను పరిశీలిస్తే 2014, 2016, 2019 సంవత్సరాల్లో ఆలస్యంగా వచ్చాయి. చివరిసారిగా 2019లో లేటుగా ప్రవేశించినా.. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో, వేగంగా పది రోజుల్లోనే దేశంలోని మెజారిటీ రాష్ట్రాలకు విస్తరించాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ► ప్రస్తుతం ఈనెల 8న కేరళను తాకిన రుతుపవనాలు తదుపరి మూడు రోజుల్లోనే తమిళనాడు, ఏపీ, కర్ణాటకల్లోకి ప్రవేశించాయి. ఈ నెల 15 నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు తొలుత అంచనా వేశారు. కానీ రుతుపవనాల కదలిక మందకొడిగా ఉందని.. తెలంగాణలోకి రావడానికి మరో వారం పడుతుందని వివరిస్తున్నారు. తొలకరి వానల కోసం ఎదురుచూడక తప్పదని అంటున్నారు. రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఒకట్రెండు వర్షాలకే విత్తనాలు నాటితే.. సాగుకు అనుకూలించే అవకాశాలు తక్కువగా ఉంటాయని సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత.. ఉక్కపోత.. నైరుతి మందగమనంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇంకా అధికంగానే నమోదవుతున్నాయి. సాధారణంగా జూన్ రెండో వారం తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తగ్గిపోతాయి. కానీ ఈసారి చాలాచోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనికితోడు వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల ఉక్కపోత కొనసాగుతోందని.. ఈ పరిస్థితి మరో వారంపాటు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
రాయలసీమను తాకిన రుతుపవనాలు
సాక్షి, అమరావతి/తిరుమల: నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఆదివారం రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు తాకాయి. రుతు పవనాలు కేరళను తాకిన తర్వాత ఏపీకి రావడానికి సాధారణంగా నాలుగు రోజుల సమయం పడుతుంది. ఈ నెల 8వ తేదీన అవి కేరళలో ప్రవేశించగా.. 12వ తేదీ నాటికి ఏపీకి వస్తాయని భావించారు. కానీ.. బిపర్జోయ్ తుపాను కారణంగా అవి చురుగ్గా కదలడంతో ఒకరోజు ముందుగానే ఏపీని తాకాయి. ఆదివారం తిరుపతి జిల్లా శ్రీహరికోట మీదుగా ఏపీలోకి ప్రవేశించాయి. వచ్చే 48 గంటల్లో అవి రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలు, కోస్తాలోని పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. వారం రోజుల్లో మొత్తం రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రుతు పవనాల వల్ల ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. మరో వారం ఎండల తీవ్రతే రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించే వరకు ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. అంటే మరో వారం రోజులపాటు పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత, వడగాలులు ఉండనున్నాయి. సోమవారం 134 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 220 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇదిలావుండగా ఆదివారం అనకాపల్లి జిల్లా అనకాపల్లి, కాకినాడ జిల్లా కరప, విజయనగరం జిల్లా జామిలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ జిల్లా పద్మనాభంలో 44.7, మన్యం జిల్లా భామిని, కోనసీమ జిల్లా శివలలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 86 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 110 మండలాల్లో వడగాల్పులు వీచాయి. మరోవైపు పలుచోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. మబ్బుల ‘సన్’దడి తిరుమలలో ఆదివారం ఉదయం నుంచే నీలాకాశం మబ్బులతో నిండిపోయింది. వెండి మబ్బులు దోబూచులాడుతూ భానుడితో ఆటలాడడం ప్రారంభించాయి. సాయంత్రానికి మరిన్ని మబ్బులు చేరి సందడి చేశాయి. దాదాపు రెండు నెలలపాటు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగినట్టయ్యింది. -
ఏపీకి చల్లని కబురు.. మరో రెండు రోజుల్లో..
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : కేరళలోకి ప్రవేశించిన రుతు పవనాలు వేగంగా కదులుతున్నాయి. గత 24 గంటల్లో వాటి గమనంలో వేగం పెరగడంతో రెండు రోజుల్లోనే అవి రాయలసీమను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కేరళ నుంచి రుతుపవనాలు ఆంధ్రా ప్రాంతానికి రావడానికి సాధారణంగా 4 రోజులు పడుతుంది. ఇప్పుడు ఒకరోజు ముందుగానే అంటే ఆదివారానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను ప్రభావంతో రుతుపవనాలు బంగాళాఖాతంలో శ్రీలంక కింది భాగం నుంచి విస్తరిస్తున్నాయి. 3 రోజుల్లోనే అవి పైభాగానికి వచ్చి శుక్రవారం తమిళనాడు, కర్ణాటక వరకు విస్తరించాయి. వచ్చే రెండు రోజుల్లో ఆంధ్రాకి వచ్చే అవకాశం ఉంది. నిప్పుల వానలా రాష్ట్రంలో ఎండలు రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి పూర్తిగా విస్తరించే వరకు ఎండల తీవ్రత కొనసాగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు నిప్పుల వానను తలపిస్తున్నాయి. జూన్ రెండో వారం మొదలైనా భానుడి ప్రతాపం కొనసాగుతోంది. రోహిణి కార్తె వెళ్లాక వచ్చే మృగశిర కార్తెతో వాతావరణం చల్లబడుతుంది. కానీ ప్రస్తుతం మృగశిర కార్తె ప్రవేశించినా రోహిణి కార్తె ఎండలనే తలపిస్తోంది. శుక్రవారం రాష్ట్రంలో అనేక జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43–45 డిగ్రీల వరకు రికార్డయ్యాయి. ఆయా ప్రాంతాల్లో సాధారణంకంటే ఐదారు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పలుచోట్ల వడగాడ్పులు, మరికొన్ని చోట్ల తీవ్ర వడగాడ్పులు వీచాయి. కోస్తాలో ప్రధానంగా కృష్ణా, గుంటూరు తీరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణం ఎగువ ప్రాంతంలో ఉన్న గాలుల్లో కూడా పొడి శాతం ఎక్కువ ఉంది. దీనివల్లే ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి. ఏప్రిల్లో వచ్చిన మోకా తుపాను బంగాళాఖాతంలో ఉన్న తడి గాలులన్నింటినీ లాగేసుకోవడంతో ఉష్ణోగ్రతలు, ఉక్కపోత తీవ్రమయ్యాయి. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను వల్ల కొంత వేడి వాతావరణం ఉంటుంది. దీనికితోడు రాజస్థాన్ నుంచి వచ్చే గాలులు కూడా పొడిగానే ఉంటున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం అన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో అత్యధికంగా 45.5 డిగ్రీలు నమోదైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల, కాకినాడ జిల్లా కరపలో 45.3, తూర్పు గోదావరి జిల్లా చిట్యాలలో 45.2, అల్లూరి సీతారామరాజు జిల్లా కొండాయిగూడెంలో 45.2 డిగ్రీలు, గుంటూరు జిల్లా జంగమహేశ్వరపురంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
దేశంలో రుతుపవనాల కోసం ఎదురుచూపులు
-
‘నైరుతి’ దోబూచులాట.. మరో 10 రోజుల పాటు ఉష్ణతాపం
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: నైరుతి రుతుపవనాలు ఊరిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. ఏటా సాధారణంగా జూన్ 1వ తేదీకల్లా నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. అయితే.. ఈ ఏడాది ఒకింత ఆలస్యంగా జూన్ 4 నాటికి కేరళను తాకుతాయని ఐఎండీ తొలుత అంచనా వేసింది. కానీ ‘నైరుతి’ కేరళను తాకకుండా దోబూచులాడుతూనే ఉంది. వాస్తవానికి రుతుపవనాలు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి మే 20–22 మధ్య ప్రవేశిస్తాయి. అనంతరం నాలుగైదు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలతో పాటు పరిసర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అక్కడ నుంచి జూన్ 1వ తేదీకి కేరళను తాకుతాయి. కానీ.. ఈ ఏడాది అండమాన్ సముద్రంలోకి సకాలంలో అంటే మే 20 నాటికే ప్రవేశించాయి. కానీ.. అప్పటినుంచి వాటి విస్తరణలో మాత్రం మందగమనం చోటుచేసుకుంటోంది. ఫలితంగా రుతుపవనాలు కేరళలో ప్రవేశించడానికి జాప్యం జరుగుతోంది. దీంతో ఐఎండీ ముందుగా ఊహించినట్టుగా జూన్ 4వ తేదీ కంటే మరో నాలుగైదు రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నాయి. అంటే సాధారణం కంటే వారం రోజుల ఆలస్యంగా ఇవి కేరళలోకి ప్రవేశించనున్నాయి. ఆలస్యం ఎందుకంటే..! నైరుతి రుతుపవనాల ఆగమనంలో జాప్యానికి గత నెలలో సంభవించిన ‘మోచా’ తుపాను, ఉత్తరాదిన ఏర్పడిన పశ్చిమ ఆటంకాలు (వెస్టర్న్ డిస్టర్బెన్స్) ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత నెల 9న బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుపాను ఆ తర్వాత అత్యంత తీవ్ర తుపానుగా మారి 15న బంగ్లాదేశ్, మయన్మార్ల మధ్య తీరాన్ని దాటింది. దీంతో ఈ తుపాను బంగాళాఖాతంలోని తేమను మయన్మార్ వైపు లాక్కెళ్లిపోయింది. మరోవైపు కొద్దిరోజుల నుంచి ఉత్తరాదిన వెస్టర్న్ డిస్టర్బెన్స్లు చురుగ్గా ప్రభావం చూపిస్తున్నాయి. ఇవి దిగువన బంగాళాఖాతంపై ఉన్న తూర్పు గాలులను బలహీన పరిచాయి. ఫలితంగా అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు విస్తరించడకుండా వెస్టర్న్ డిస్టర్బెన్స్ అడ్డుపడుతున్నాయి. ఈ కారణాల వల్ల నైరుతి రుతుపవనాలు సకాలంలో కేరళలోకి ప్రవేశించకుండా జాప్యానికి కారణమయ్యాయని వాతావరణ శాఖ మాజీ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. కొన్నాళ్లు ఎండలు.. వానలు! రుతుపవనాల రాక ఆలస్యం కానుండటంతో రాష్ట్రంలో ఉష్ణతాపం మరికొన్నాళ్లు కొనసాగనుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశానికి మరో 10 రోజులు పట్టవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటివరకు పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2–4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయి. అప్పుడప్పుడూ వడగాడ్పులకు ఆస్కారం ఉంది. అదే సమయంలో మధ్యమధ్యలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. రుతుపవనాల ఆగమనానికి ముందు ఇలాంటి పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. 10 రోజులు ఎండల తీవ్రతతో పాటు వర్షాలు కూడా కురవనున్నాయని చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మండిన ఎండలు.. నేడు వడగాడ్పులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 43.3 డిగ్రీలు, ఏలూరు జిల్లా శ్రీరామవరంలో 43.1, తిరుపతి జిల్లా గొల్లగుంటలో 42.9, కృష్ణా జిల్లా కాజలో 42.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 21 మండలాల్లో వడగాడ్పులు వీచినట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. మంగళవారం అల్లూరి జిల్లా నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 212 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మంగళవారం అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వెల్లడించారు. -
మరో రెండ్రోజులు ఉక్కపోతే..
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులపాటు రాష్ట్రంలో సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య, గ్రేటర్ హైదరాబాద్ సమీప జిల్లాల్లో మాత్రం 38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు సూచించింది. కాగా, ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నల్లగొండ జిల్లా నిడమనూరులో 46.1 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే...గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 42.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 24.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఉపరితలద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు మరోవైపు విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితలద్రోణి ఏర్పడిందని ఇది సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు సూచించింది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు ప్రాంతం జిల్లా గరిష్ట ఉష్ణోగ్రత నిడమనూరు నల్లగొండ 46.1 దామెరచర్ల నల్లగొండ 45.6 బయ్యారం మహబుబాబాద్ 45.5 తంగుల కరీంనగర్ 45.5 కేతెపల్లి నల్లగొండ 45.3 రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్లో) కేంద్రం గరిష్టం కనిష్టం ఖమ్మం 42.4 30.0 భద్రాచలం 42.2 28.0 నల్లగొండ 42.2 24.8 ఆదిలాబాద్ 41.5 26.2 రామగుండం 41.4 25.0 హనుమకొండ 41.0 25.0 నిజామాబాద్ 40.9 29.5 మెదక్ 40.6 24.0 మహబూబ్నగర్ 40.5 28.5 హైదరాబాద్ 39.4 26.6 దుండిగల్ 38.5 24.9 హకీంపేట్ 37.5 23.9 -
ప్రకృతి ఒడి.. ప్రశాంత లోగిలి!
కరోనా మహమ్మారి జీవనాన్ని కొత్త దారిలో తీసుకెళ్తోంది. పట్టణాల్లో చిన్న పని దొరికితే చాలు.. అపార్ట్మెంట్ ఎన్నో అంతస్తు అయినా పరవాలేదు.. సర్దుకుపోదాం అనే ధోరణి ఇప్పుడు తగ్గుతోంది. కాస్తంత రెంటు ఎక్కువైనా.. వ్యక్తిగత ఇల్లు మేలు అనే భావన ఇప్పుడు అధికమవుతోంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం.. కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో పట్టణానికి కాస్త దూరమైనా ప్రశాంతమైన వాతావరణంలో నివసించేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొక్కలు నాటేందుకు ఇష్టపడని వారు కూడా.. ఇప్పుడు ప్రకృతితో మమేకమై జీవించేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం. – సాక్షి, కర్నూలు డెస్క్ నంద్యాల పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఓ వెంచర్ రూపుదిద్దుకుంటోంది. మహానంది మండలం బుక్కాపురం వద్ద 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ వెంచర్లో 12 విల్లాలను ఒక్కొక్కటి 25 సెంట్ల స్థలంలో నిర్మించనున్నారు. మిగిలిన స్థలం అంతా పచ్చదనానికి కేటాయిస్తున్నారు. అంటే.. ప్రశాంత జీవనానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ వెంచర్ను చూస్తే అర్థమవుతోంది. జిల్లాలోని ప్రధాన పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పిల్లల చదువులు, ఉద్యోగం, ఇతరత్రా అవసరాల దృష్ట్యా చాలా మంది పల్లెల నుంచి పట్టణాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాలు పట్టణాల్లో కలిసిపోతున్నాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ ఎక్కడా ఖాళీ స్థలం కనిపించని పరిస్థితి. అంతో ఇంతో స్థలం ఉందంటే అపార్ట్మెంట్, లేక షాపింగ్ కాంప్లెక్స్ కడదామనే ఆలోచన వస్తోంది. ఈ కారణంగా కనుచూపు మేరలో కాంక్రీటు వనాలే కనిపిస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు ఏడాదికేడాది విపరీతంగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి . అపార్ట్మెంట్ సంస్కృతి ఇటీవల కాలంలో అధికమైంది. ఉపాధి, ఉద్యోగంలో భాగంగా పట్టణాల్లో ఉండాల్సి రావడంతో ఎక్కడికక్కడ అపార్ల్మెంట్లు పుట్టుకొచ్చాయి. ఐదు అంతస్తులతో, వందలాది నివాసాలతో కూడిన ఈ కాంక్రీటు వనాలు మనుషులను దగ్గర చేస్తున్నా, మనసులను దూరంగా ఉంచుతున్నాయి. పక్కపక్కనే ఉంటున్నా ఎవరికి వారుగా బతికేస్తున్నారు. ఇక ఇటీవల కరోనా సృష్టించిన విలయం నేపథ్యంలో ఇలా ఇరుకిరుకు ప్లాట్లలో కాకుండా ఊరికి దూరంగా విశాలమైన వ్యక్తిగత ఇళ్లలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పచ్చని చెట్లు కనుమరుగు పట్టణాల పరిధి పెరుగుతున్న కొద్దీ చుట్టుపక్క గ్రామాలు అందులో విలీనం అవుతున్నాయి. ఈ కారణంగా అభివృద్ధి విస్తరిస్తుండటంతో గ్రామీణ వాతావరణం కనుమరుగవుతోంది. శివారు కాలనీల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు పుట్టుకొస్తుండగా.. ఆ ప్రాంతంలోని చెట్లు తొలగించక తప్పని పరిస్థితి. కొంత స్థలం ఉందంటే చాలు.. రెండు ఇల్లు కట్టుకొని, ఒకటి బాడుగకు ఇచ్చుకోవడమో.. లేదంటే అపార్ట్మెంట్ కడితే జీవనానికి కాస్త ఊరట కలిగిస్తుందనే ఆశ పచ్చని చెట్లకు శాపమవుతోంది. పల్లెకు పోదాం.. పట్టణాల్లో వాతావరణం రోజురోజుకూ కాలుష్యంతో నిండుకుంటోంది. ఇంటి నుంచి బయటకు వచ్చి ఎక్కడన్నా సేదతీరుదామంటే చెట్టు నీడను వెతుక్కోవాల్సిందే. సెంటు స్థలం ఉందంటే చాలు రోడ్డు పక్కనైతే దుకాణం కడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో అయితే ఇంటి ఆలోచన చేస్తున్నారు. ఈ కారణంగా మధ్య తరగతి ప్రజలు తమ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని నగరానికి దూరంగా, పల్లెలకు సమీపంలోని వెంచర్లలో ప్లాట్లు కొంటున్నారు. పదవీ విరమణ వయస్సు తర్వాత పల్లె వాతావరణంలో సేద తీరేందుకు ఇష్టపడుతున్నారు. అభిరుచికి అనుగుణంగా వెంచర్లు కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ కూడా తన స్వరూపాన్ని మార్చుకుంటోంది. ఇప్పటి వరకు 3 నుంచి 5 సెంట్ల స్థలాలతో వెంచర్లు ఉండగా.. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా 25 సెంట్ల స్థలాలతో వెంచర్లు వెలుస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారులు, అధికారులు, వైద్యులు ఈవిధమైన వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. రియల్టర్లు ఇలాంటి వాళ్లను ఎంపిక చేసుకొని అందుకు అనుగుణంగా వెంచర్లలో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలాంటి వెంచర్లలో ప్లాట్లు కూడా పరిమితంగా ఉంటుండటం విశేషం. ఇంటిల్లిపాది ఆహ్లాదంగా గడుపుతాం పట్టణాల్లో వాయు, శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. అందుకే ఎమ్మిగనూరుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా సొంత పొలంలోనే ఫాంహౌస్ కట్టుకున్నాం. ఉన్న ఇద్దరు కుమారులు మెట్రో నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ ప్రశాంతత లేదని చెబుతుంటారు. చిన్నబ్బాయి హర్ష ఉద్యోగం వదిలేసి ఇక్కడికొచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. యాంత్రిక జీవనం నుంచి బయటపడేందుకు, ఇంటిల్లి పాది సంతోషంగా గడిపేందుకు ఈ ప్రాంతం మాకు ఎంతో అనువుగా ఉంది. ప్రకృతి ఒడిలో సేదతీరితే ఎంతో ఆరోగ్యం. – మాచాని నాగరాజు ప్రశాంతత కోసం నగరానికి దూరంగా ఇల్లు కరోనా నేర్పిన పాఠం ఎప్పటికీ మర్చిపోలేం. నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. జనాభా అధికం కావడంతో ఇరుకు ప్రాంతాల్లో సర్దుకుపోయి జీవించాల్సిన పరిస్థితి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఊరి బయట ప్రశాంత వాతావరణంలో ఇటీవల వ్యక్తిగత ఇల్లు నిర్మించుకున్నాం. గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రాంతంలో నివాసం ఉంటే వ్యాధుల బారి నుంచి కొంతవరకైనా బయటపడొచ్చు. – హరగోపాల్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కర్నూలు -
ఎండలు.. మండే మంటలు
సాక్షి, హైదరాబాద్: వేసవి సీజన్ చివరి దశలో ఉష్ణోగ్రతలు భగభగమంటున్నాయి. శనివారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా లక్కవరంలో 46.1 డిగ్రీల సెల్సియస్గా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా జూన్ మొదటి వారమంతా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి వాయవ్య. పశ్చిమ దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు చెప్పింది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 42.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 24.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. -
అధిక ఉష్ణోగ్రతలతో ఆక్వా రంగం ఉక్కిరిబిక్కిరి
కైకలూరు: ఆక్వా రంగాన్ని అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి తోడు రోహిణికార్తెతో గురువారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. చేపలు శీతల జలాచరాలు. వీటికి అనుకూల స్థాయి నీటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేట్ నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేట్ మధ్య ఉంటాయి. ఇటీవల జిల్లాలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెంటీగ్రేట్ వరకు పెరిగాయి. ఈ పరిణామం చేపల, రొయ్యల రైతులను కలవరపెడుతోంది. చెరువుల్లో నీరు ఆవిరవడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి ఆక్సిజన్ లేమి, నీటి కాలుష్యం, విషవాయువుల ఉత్పతి వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 2.60 లక్షల ఎకరాల్లో సాగు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో చేపలు, 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావానికి చెరువుల్లో ఆక్సిజన్ సమస్యత తలెత్తుతోంది. సేంద్రియ పదార్థాలు చెరువు అడుగు భాగానికి చేరి విషతుల్యమవుతున్నాయి. ప్రధానంగా రాత్రి వేళల్లో కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. చేపల్లో శ్వాసక్రియ సమస్య ఏర్పడి ముట్టెలు పైకెత్తి మృత్యువాతపడుతున్నాయి. వేసవిలో మూడు అడుగుల కంటే నీటిమట్టం తక్కువ ఉన్న చెరువుల్లో చేపల మరణాలు అధికమవుతాయి. సమ్మర్ కిల్ ఎండాకాలంలో వాతావరణంలో సంభవించే మార్పుల వల్ల చేపలు చనిపోవడాన్ని సమ్మర్ కిల్ అంటారు. వేసవిలో సూర్యరశ్మి వల్ల చెరువుపై భాగంలో రెండడుగుల మేర నీరు వేడెక్కుతోంది. వేడి నీరు తేలికగా ఉంటుంది. అడుగు భాగాన చల్లగా ఉన్న నీరు బరువుగా ఉంటుంది. సమ్మర్ కిల్కి దారితీసే ప్రధాన అంశం ఇదే. చెరువుల్లో భౌతిక, రసాయన గుణాలున్న నీటి ఉష్ణోగ్రత, ప్లాంక్టాన్, ఆక్సిజన్, ఉదజని సూచిక విలువలు, కార్బన్ డయాక్సైడ్, అమ్మోనియా వంటి హానికర వాయువులు వివిధ లోతులలో వివిధ స్థాయిల్లో ఉంటాయి. నీటి ఉపరితలం నుంచి అడుక్కు వెళ్లే కొలదీ నీటి ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతాయి. దీంతో చేపలు మృత్యువాత పడతాయి. నీటి పరీక్షలు చేయించాలి వేసవిలో ఉష్ణోగ్రతల ప్రభావం చేపల సాగుపై పడుతోంది. ప్రధానంగా ఆక్సిజన్ సమస్య ఉత్పన్నమవుతోంది. రైతులు ఆక్సిజన్ మాత్రలను అందుబాటులో ఉంచుకోవాలి. నీటి పరీక్షలు తరచుగా చేయించాలి. పీహెచ్ విలువలు తెలుసుకోవాలి. ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో మత్స్యశాఖ సహాయకులను నియమించింది. అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి. – ఎం.భవిత, మత్స్యశాఖ అభివృద్ధి అధికారిణి, కైకలూరు వేసవి వ్యాధులతో జాగ్రత్త వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగటంతో ఆక్సిజన్ సమస్య చెరువుల్లో కనిపిస్తోంది. దీంతో చేపలకు శంఖుజలగ, రెడ్ డిసీజ్, పేను వంటి వ్యాధులు ఎక్కువుగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కోళ్ల ఎరువులను వేసవిలో మానివేయాలి. రొయ్యల చెరువుల మాదిరిగా చేపల చెరువుల్లోనూ ఆక్సిజన్ ఏరియాటర్లను ఏర్పాటు చేసుకోవాలి. – దండు రంగరాజు, ఆక్వారైతు, కైకలూరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ చెరువులో మూడు అడుగులు లోతులో నీరు తగ్గకుండా చేయాలి. ♦ చేపల చెరువులో ఆక్సిజన్ సమస్య పరిష్కారానికి తెల్లవారుజామున మూడు నుంచి ఆరు గంటల వరకు నీటిని కలయతిప్పుతూ ఉండాలి. ♦ చెరువుల్లో కూడా ఆక్సిజన్ ఉత్పిత్తి చేసే ఏరియాటర్లును ఉపయోగించాలి. ♦ జియోలైట్, కాల్షియం పెరాక్సైడ్, ఆక్సిజన్ డబ్లెట్లు వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. ♦ చెరువుల్లో మేతలను సగానికి తగ్గించుకోవాలి. ♦ చెరువుల్లో పాతనీటి స్థానంలో అవకాశాన్ని బట్టి కొత్త నీటిని నింపుకోవాలి. ♦ చెరువుపై పక్షులు ఎక్కువుగా సంచరిస్తుంటే ఎక్కడైనా చేపల మరణించాయా అనే విషయాన్ని గమనించాలి. ♦ ఆక్సిజన్ సమస్యను అధికమించడానికి చెరువులో నీటిని యంత్రాల ద్వారా తిరిగే అదే చెరువులోకి నింపే పద్ధతిని అనుసరించవచ్చు. ♦ చెరువులో నీటి, మట్టి పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించాలి. -
జూన్ మొదటి వారం వరకూ మంటలే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత జూన్ మొదటి వారం వరకూ కొనసాగనుంది. నైరుతి రుతు పవనాలు నెమ్మదిగా కదులుతుండటమే దీనికి కారణమని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు గత మూడు రోజుల నుంచి బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ సమయానికి బంగాళాఖాతంలో ఎక్కువ ప్రాంతాలకు విస్తరించి అండమాన్ నికోబార్ దీవులను తాకాల్సి ఉంది. కానీ ఇంకా అవి బంగాళాఖాతంలోనే నెమ్మదిగా కదులుతుండడంతో నెలాఖరుకు కేరళను తాకే అవకాశం తక్కువేనంటున్నారు. వాతావరణం అనుకూలించి రెండు, మూడు రోజుల్లో రుతు పవనాలు ముందుకు కదిలితే వచ్చే 3, 4 తేదీల్లో కేరళలో ప్రవేశించి.. ఆ తర్వాత జూన్ రెండో వారానికి రాష్ట్రాన్ని తాకే అవకాశముంటుందని భావిస్తున్నారు. ఎల్నినో పరిస్థితుల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దీన్నిబట్టి జూన్ 8వ తేదీ వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలకు కారణం అరేబియన్ సముద్రం నుంచి వస్తున్న గాలులేనని వాతావరణ శాఖ చెబుతోంది. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్లో 44.7, ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జువ్విగుంటలో 44.5, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో 44.4, బాపట్ల జిల్లా బల్లికురువు మండలం కొప్పెరపాడులో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, పెనుగంచిప్రోలు, గుంటూరు జిల్లా గుంటూరు, దుగ్గిరాల, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు, పల్నాడు జిల్లా అమరావతి, అచ్చంపేట, పెదకూరపాడు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. -
అయిదేళ్ళలో ఉష్ణగుండమేనా?
అంచనాలు నిజమవుతాయా, లేదా అంటే... ఎవరి విశ్లేషణ వారికి ఉండవచ్చు. కానీ, అంచనాలు అప్రమత్తం కావడానికి పనికొస్తాయనడంలో మాత్రం ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండే అవకాశమే లేదు. ఐరాస ప్రపంచ వాతావరణసంస్థ తాజా అంచనాలు అప్రమత్తం చేస్తున్నాయి. అత్యవసర పరి స్థితిని తలపిస్తున్నాయి. ఉష్ణతాపాన్ని ఒడిసిపట్టుకొనే గ్రీన్హౌస్ వాయువులు, ఎల్నినో ఫలితంగా అయిదేళ్ళలో ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకొనే అవకాశం ఎక్కువుందన్న తాజా అంచనా అలాంటి ప్రమాద ఘంటికే. మన భూగోళ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పెరిగే అవకాశం మూడింట రెండొంతులుందని ఆ అంచనా సారాంశం. ఈ బీభత్స ప్రభావం భవిష్య త్తులో ఆర్థికంగానూ అపారంగా ఉంటుందని సోమవారం ఆ సంస్థ చేసిన హెచ్చరిక తీవ్రమైనదే. కొన్నేళ్ళ క్రితం ఊహించినదాని కన్నా పరిస్థితి దిగజారింది. గత శతాబ్దిన్నరలో పర్యావరణానికి మనం చేసిన నష్టం అలాంటిది. పారిశ్రామికీకరణ కాలాని కన్నా ముందు (1850–1900 మధ్య) సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే, 1.5 డిగ్రీల గరిష్ఠ భూతాపోన్నతిని చరమావధిగా పెట్టుకున్నారు. ఆ లక్ష్మణరేఖ దాటితే ఉత్పాతం తప్పదని శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. 1.5 డిగ్రీలనే గరిష్ఠంగా ఎందుకు పెట్టుకున్నారంటే, అది దాటితే ఈ అదనపు ఉష్ణం కారణంగా జీవావరణ దుష్ప్ర భావం శరవేగంగా వ్యాపిస్తుంది. తారాజువ్వలా దూసుకుపోతుంది. అందుకే, భూతాపోన్నతిని ఆ గీత దాటకుండా నియంత్రించాలని 2015 నాటి ప్యారిస్ ఒప్పందంలోనే తీర్మానించారు. ఈ గీతను చేరే అవకాశం తక్కువని 2015లో అనుకున్నారు. తీరా 2020కి వచ్చేసరికి అయిదింట ఒక వంతు ఛాన్సుందని తేలింది. నిరుడు ఆ ముప్పు 50 శాతం ఉండేది. ఇప్పుడు పరిమితిని దాటేసే ప్రమాదం 66 శాతానికి పెరిగిపోయింది. అంటే వచ్చే 2027 రెడ్ ఎలర్ట్ నామవత్సరం. ప్రపంచం ఉష్ణగుండమే. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత 2016లో రికార్డయింది. ప్రాతిపదికగా తీసుకున్న 1900 నాటి ముందు కాలంతో పోలిస్తే, ఆ ఏటి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.3 డిగ్రీలు ఎక్కువ నమో దైంది. ఆ ఉష్ణరికార్డును దాటేరోజు ఎంతో దూరంలో లేదన్నదే ఇప్పుడున్న ఆందోళన. పర్యావరణ మార్పుతో పాటు చక్రభ్రమణమైన ఎల్నినో ప్రభావమూ అగ్నికి ఆజ్యం పోస్తోంది. ఈ ఏడాది ఆసియా ప్రాంతాన్ని సాధారణంగా అధికంగా ఈ సెగ వేగిస్తుందని అంచనా. నిజానికి 1970 నుంచి 2021 మధ్య దుర్భర వాతావరణ మార్పులతో దాదాపు 12 వేల ఉత్పాతాలు జరిగాయని లెక్క. వాటి వల్ల 20 లక్షల మందికి పైగా మరణిస్తే, 4.3 లక్షల కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టాలు జరిగాయి. మరోలా చెప్పాలంటే, ఆ మొత్తం నష్టాలు భారతదేశ జీడీపీలో 25 శాతానికి పైమాటే! మన దేశం సంగతికొస్తే.. వార్షిక సగటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. 1901 నుంచి ప్రతి రెండు దశాబ్దాల కాలాన్ని పోల్చి చూస్తే, గత 20 ఏళ్ళ కాలంలో ఎన్నడూ లేనంతగా హెచ్చాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజా పరిశోధనా పత్రమే ఆ సంగతి వెల్లడించింది. 1975 నుంచి తుపానులు, వరదలు అధికమయ్యేసరికి వ్యవసాయ ఉత్పత్తి, దరిమిలా ఆహార ధరలు విపరీతంగా ప్రభావితమయ్యాయి. వాతావరణ ఉత్పాతాలకు ప్రభావితమయ్యే దేశాల జాబితా వేస్తే... ‘ప్రపంచ పర్యావరణ మార్పు ప్రమాద సూచి 2021’లో భారత్ 7వ స్థానంలో ఉంది. స్వాతంత్య్ర కాలంతో పోలిస్తే ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ, అనుబంధ రంగాల కన్నా సేవారంగం పాలు గణనీయంగా పెరిగినా, ఉష్ణతాపంతో అన్ని రంగాలకూ తిప్పలు తప్పవు. వచ్చే 2030 నాటికి ఎండ వేడిమికి ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల ఉద్యోగాల్ని నష్టపోవాల్సి వస్తుందట. అందులో 3.4 కోట్లు భారత్లోనే సంభవిస్తాయని 2020లోనే ప్రపంచ బ్యాంక్ మాట. అలాగే, పెరిగే సముద్రమట్టంతో ప్రపంచంలో అత్యధికంగా చిక్కుల్లో పడేదీ మన దేశమే! ‘పర్యావరణ మార్పుపై ఏర్పాటైన అంతర్ ప్రభుత్వ సంఘం’ (ఐపీసీసీ) నిరుడు ఆ సంగతి కుండ బద్దలు కొట్టింది. ఈ శతాబ్ది మధ్యకల్లా 3.5 కోట్ల భారతీయులు ఏటా సముద్రతీర ముంపు బారిన పడతారు. ఈ శతాబ్దాంతానికి ఆ సంఖ్య 4.5 నుంచి 5 కోట్లవుతుందని అంచనా. అందుకే, పర్యావ రణంపై అంతంత మాత్రపు విధానాలనే అనుసరిస్తే కష్టమే. 2070 నాటికి ‘నెట్ జీరో’ లక్ష్య సాధన పెట్టుకున్నప్పటికీ 2050 కల్లా భారత జీడీపీ 8.5 నుంచి 10 శాతం దాకా తగ్గే ముప్పుంది. విధానపర మైన లోచూపును అందించే నేషనల్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ ఎకనామెట్రిక్ మోడల్ వేసిన లెక్క ఇది. ఈ లెక్కలు, చెబుతున్న మాటలు అంచనాలే కదా అని అలక్ష్యం చేస్తే కష్టమే. పర్యావరణ విశ్లేషణకు దీర్ఘకాలాల్ని ఎంచుకోవాలి గనక, ప్యారిస్లో చేసుకున్న బాసల్ని నిలిపామా, చెరిపామా అన్నది 2040కి కానీ నిర్ధరించలేం. అప్పటికి తెలిసినా పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే దేశాలన్నీ చేతులు కలిపి, ప్రమాద నివారణకు ప్రయత్నించడమే ఏకైక మార్గం. తక్షణమే హరిత ఇంధనం వైపు మరలాలి. భావి బాధితులకు సురక్షిత ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలి. అలా చేయాలంటే ధనిక దేశాలు తమ కర్బన ఉద్గారాల పాపాల శాపాలను అనుభవిస్తున్న అమాయక వర్ధమాన దేశాలకు నష్టపరిహారం చేయాలి. మునుపు మాట ఇచ్చిన వందల కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించాలి. పాశ్చాత్య ప్రపంచం పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేస్తే సరిపోదు. సత్వరమే ఆ మార్పుల నుంచి వెనక్కుమళ్ళి యథాపూర్వ స్థితికి వాతావరణం వచ్చేలా కృషిచేయాలి. ఉష్ణోగ్రతనూ, తద్వారా పర్యావరణ ఉత్పాతాన్నీ, ఆర్థికనష్టాలనూ తగ్గించడమే ఇక కర్తవ్యం. -
చల్లని కబురు.. నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రెండ్రోజులపాటు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. గురువారం గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 44.0 డిగ్రీలు నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 23.0 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో మండుతున్న సూరీడు సాక్షి, అమరావతి: ఏపీలో అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగత్ర నమోదైంది. పల్నాడు, శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యల్పంగా విశాఖపట్నం (గంభీరం)లో 38.9, కోనసీమ అంబేడ్కర్ జిల్లా(అంగర)లో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం, వల్లూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచాయని, మరో 27 మండలాల్లో వడగాడ్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 29 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండనుంది. అనకాపల్లి జిల్లాలో 5, గుంటూరులో ఒకటి, కాకినాడలో ఒకటి 1, ఎన్టీఆర్ జిల్లాలో 2, పల్నాడులో 2, మన్యంలో 5, విజయనగరంలో 5, వైఎస్సార్ జిల్లాలో 8 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. శనివారమూ 33 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. -
రోజురోజుకు పెరుగుతున్న ఎండలు
రోజురోజుకు పెరుగుతున్న ఎండలు -
వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో రెండు రోజులు భగభగలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని, సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో దూరప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని శాఖ అధికారులు సూచించారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని పేర్కొంది. బుధవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధి మినహా రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 46.4 డిగ్రీ సెల్సియస్ నమోదుకాగా, ఖమ్మం జిల్లా ఖానాపూర్లో 45.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే...ఖమ్మం జిల్లా ఖానా పూర్లో 45.4 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో 43.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 23.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఏపీలో ఠారెత్తిస్తున్న ఉష్ణోగ్రతలు ఏపీలో సూర్యుడి ప్రతాపం కొనసాగుతోంది. బుధవారం రాయలసీమ జిల్లాల్లో ఎండ నిప్పులు చెరిగింది. తిరుపతి జిల్లా పల్లాం, నెల్లూరు జిల్లా కసుమూరులో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట అనేక ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
తెలుగు రాష్ట్రాలపై సూర్య ప్రతాపం: భరించలేని వేడి, ఉక్కపోత.. భయం భయంగా జనం (ఫొటోలు)
-
ఉదయం నుంచే భగభగ.. తీవ్రమైన ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం 6 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం 9 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు, మరో 10 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. 13 మండలాల్లో 46 డిగ్రీలు, 39 మండలాల్లో 45 డిగ్రీలు, 255 మండలాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 40 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 148 మండలాల్లో వడగాడ్పులు వీచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడులో 46.7 శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు మండుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ కోరారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేడు 20 మండలాల్లో వడగాడ్పులు బుధవారం 20 మండలాల్లో వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి జిల్లాలో 2 మండలాలు, గుంటూరు జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో ఒకటి, ఎన్టీఆర్ జిల్లాలో 3, పల్నాడులో 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. -
సూరీడు 40+ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండల తీవ్రత కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటలు దాటి నా వేడిగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమో దవుతుండగా వచ్చే మూడు రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... కొన్ని జిల్లాల్లో 42ని–44 డిగ్రీల సెల్సియస్ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే మంగళవారం నుంచి హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38–41 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని వివరించింది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. సోమ వారం నల్లగొండలో 43.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవగా భద్రాచలంలో 43.2 డిగ్రీలు, ఖమ్మంలో 43 డిగ్రీల చొప్పు న ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు వడదెబ్బకు గురై హనుమ కొండ జిల్లాలో ముస్కుపెంటు(52)అనే ఉపాధి హామీ కూలీ, మంచిర్యాల జిల్లాలో సంతోష్కుమార్ (36) అనే కానిస్టేబుల్ మృతి చెందారు. మరోవైపు రాష్ట్ర ప్రణాళికా విభా గం విడుదల చేసిన గణాంకాల ప్రకారం నల్లగొండ జిల్లా దామరచర్ల 45.3 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ 45.1 డిగ్రీలు, నల్లగొండ జిల్లా నిడ మానూరులో 44.9 డిగ్రీలు, ములుగు జిల్లా తాడ్వాయి, రామగుండంలో 44.4 డిగ్రీల చొప్పున, జగిత్యాల జిల్లా జైనా, కరీంనగర్ జిల్లా వీణవంక, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 44.3 డిగ్రీల చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపట్నంలో 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఏపీలో కూడా వడగాడ్పులు, ఎండల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. -
‘సెగ’దరగ.. ఇదేం భగభగ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మరింతగా మండనున్నాయి. ఈ నెల మొదటి వారమంతా ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతుండగా రానున్న మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత అధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో 42–44 డిగ్రీల సెల్సియస్ సగటు ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అంచనా వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఉష్ణోగ్రతలు 40–42 డిగ్రీల సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండాపూర్లో 45.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా అదే జిల్లాలోని జన్నారంలో 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికం... వేసవి సీజన్ చివరి దశలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని, ప్రస్తుతం సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతల మధ్య హెచ్చుతగ్గులుంటాయని ఐఎండీ అధికారులు వివరిస్తున్నారు. ఆదివారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఖమ్మంలో ఈ సీజన్ సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. అలాగే నల్లగొండ, భద్రాచలంలో సాధారణంకంటే 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండటంతో దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. బలహీన పడుతున్న ‘మోక’ అతి తీవ్ర తుపానుగా కొనసాగిన ‘మోకా’తుపాను మయన్నార్ సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దాటడంతో బలహీనపడుతుందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వివరించింది. -
Andhra Pradesh: రాష్ట్రం భగభగ
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో ఎండలు తీవ్ర ప్రతాపం చూపుతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు భగభగమండగా కోస్తా జిల్లాల్లో వాటి ప్రభావం ఇంకా ఎక్కువ కనిపించింది. అనేక ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉ.11 గంటలకే చాలా ప్రాంతాల్లో 40–41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు బయటకురావడానికే బెంబేలెత్తిపోయారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, పల్నాడు, కాకినాడ, ప్రకాశం జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఈ జిల్లాల్లో దాదాపు అన్నిచోట్లా 40–44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమో దయ్యాయి. అనకాపల్లి, విశాఖ జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో అత్యధికంగా 44.8 డిగ్రీలు నమోదైంది. ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.7, కామవరపుకోటలో 44.5, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో 44.4, ఏలూరు జిల్లా రాజుపోతేపల్లిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మోకా తుపాను ప్రభావమే మోకా తుపాను ప్రభావంవల్లే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళాఖాతం నుంచి ఏపీకి వీచే గాలులను తుపాను లాగేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో మన ప్రాంతంలో గాలిలో తేమ శాతం తగ్గిపోయింది. కేవలం తేమలేని పొడిగాలులు వీస్తుండడంతో తీవ్రమైన ఉక్కపోత, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. రాజస్థాన్, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం లేకపోవడంతో ఉక్కపోత, ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. తుపాను ప్రభావం తగ్గేవరకు అంటే నాలుగైదు రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని.. ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. -
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. వచ్చే 3 రోజులు ఎండ మంటే
సాక్షి, అమరావతి: వచ్చే 3 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలకంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి ఎండ తీవ్రత ఇంకా పెరగనుంది. ఆదివారం కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 136 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం నంద్యాల జిల్లా గోస్పాడులో అత్యధికంగా 42.2, తూర్పుగోదావరి జిల్లా నందరాడ, ముగ్గుళ్లలో 41.9, బాపట్ల జిల్లా అమృతలూరులో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యంత తీవ్ర తుపానుగా ‘మోకా’! సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అతి తీవ్ర తుపాను అత్యంత తీవ్ర తుపానుగా బలపడింది. ప్రస్తుతం ఇది గంటకు 22 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోంది. శనివారం రాత్రికి పోర్టుబ్లెయిర్కు వాయవ్యంగా 610 కి.మీలు, బంగ్లాదేశ్లోని కాక్స్బజార్కు దక్షిణ నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ కాక్స్బజార్ (బంగ్లాదేశ్) – క్యాక్ప్యూ(మయన్మార్)ల మధ్య సిట్వే వద్ద ఆదివారం మధ్యాహ్నం అత్యంత తీవ్ర తుపానుగా తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో గరిష్టంగా గంటకు 210 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ శనివారం రాత్రి ప్రత్యేక బులెటిన్లో వెల్లడించింది. -
రెండ్రోజులపాటు పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్లో భగభగ
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బుధవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమంగా బలపడి అర్ధరాత్రికల్లా తుపానుగా బలపడే అవకాశం ఉందని వివరించింది. అనంతరం గురువారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. అది క్రమంగా బలపడుతూ ఈనెల 12వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపానుగా మారనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత దిశను మార్చుకుంటూ క్రమంగా బలహీ నపడుతుందని వాతావరణ శాఖ అంచనావేసింది. దీని ప్రభా వంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో తేలిక పాటి, ఒకట్రెండు చోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. రానున్న రెండ్రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరు గుతాయ ని గరిష్ట ఉష్ణోగ్రత 43డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకా శముందని వాతావరణశాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 40డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవు తాయని తెలిపింది. బుధవారం రాష్ట్రంలో... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 41.3డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 24.0 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. -
విస్తృతంగా వర్షాలు... 11 నుంచి మళ్లీ వడగాడ్పులు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కూడా వర్షాలు విస్తృతంగా కురిశాయి. పశ్చిమ గోదావరి, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. బాపట్ల జిల్లా కవురులో 8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కసుమూరులో 7.5, బాపట్ల జిల్లా లోవలో 6.6, తిరుపతి జిల్లా చిలమన్నూరులో 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు ఏపీఎస్డీపీఎస్ డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. దక్షిణ అంతర్గత కర్ణాటక, దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో నాలుగైదు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం రాత్రి వెల్లడించింది. ఇక శనివారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశముంది. నేడు ఉపరితల ఆవర్తనం.. మరోవైపు.. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 7వ తేదీ నాటికి ఇది అల్పపీడనంగా, 8వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఉత్తర దిశగా కదులుతూ తుపానుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ తుపాను బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల దిశగా వెళ్లే అవకాశముందని చెబుతున్నారు. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండే అవకాశంలేదని వాతావరణ శాఖ తెలిపింది. కానీ, అల్పపీడనం, వాయుగుండం ప్రభావం మాత్రం ఉండవచ్చని చెబుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, వేటకు వెళ్లిన వారు శనివారంలోగా తిరిగి రావాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తమ కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటుచేసినట్లు ఆయన వివరించారు. అత్యవసర సాయం, సమాచారం కోసం టోల్ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101కు ఫోన్చేయాలని సూచించారు. 11 నుంచి మళ్లీ వడగాడ్పులు ఇక రాష్ట్రంలో ఈనెల 10 వరకు సాధారణ లేదా అంతకంటే తక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. తుపాను బలహీనపడిన తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దీంతో ఈనెల 11వ తేదీ తర్వాత నుంచి పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు ఉధృతమవుతూ కోస్తాంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.) -
ఎల్లుండి నుంచి మళ్లీ మంటలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వారం రోజులు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా... మారిన వాతావరణ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని వివరించింది. ఈనెల 8వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 6న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 7వ తేదీన అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనావేసింది. ఇది ఈనెల 8న వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం రాష్ట్రంలో.. గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 35.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 21.8 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. -
ఇక ఎండలు మండవు
సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వేసవిలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. తీవ్రమైన ఎండలు తగ్గిపోయి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మే మొదటి వారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అప్పటివరకు మోస్తరు వర్షాలతోపాటు అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం, ఆగ్నేయ/నైరుతి గాలుల వల్ల వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు కురుస్తున్నాయి. గత మూడేళ్లుగా ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదైనా మధ్యలో 2, 3 రోజులు అకాల వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత మే నాటికి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలలోపే నమోదయ్యాయి. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ మూడోవారం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మూడోవారం చివర్లో వర్షాలు మొదలవడంతో వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడుతున్నాయి. అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మే మొదటి వారం వరకు ఇదే రకరమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ తర్వాత కూడా ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే అవకాశాలు తక్కువేనని అధికారులు చెబుతున్నారు. మే 9, 12 తేదీల మధ్య బంగాళాఖాతంలో అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది మయన్మార్ వైపు వెళ్లినా ఇక్కడి ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీన్నిబట్టి మే రెండోవారం కూడా వాతావరణం ఇలాగే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యలో ఒకటి, రెండురోజులు ఎండలు పెరిగినా వర్షాలు మాత్రం కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీవర్షం ఉమ్మడి కర్నూలు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు భారీవర్షం కురిసింది. సగటున కర్నూలు జిల్లాలో 27 మిల్లీమీటర్లు, నంద్యాల జిల్లాలో 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కల్లూరు, కర్నూలు, గోనెగండ్ల తదితర మండలాలు, నంద్యాల జిల్లాలోని బనగానపల్లి, బేతంచెర్ల, పాణ్యం, పగిడ్యాల, జూపాడుబంగ్లా మండలాల్లో ఒక్కరోజు కురిసిన వర్షాలకే వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆస్పరి, కొత్తపల్లి, పెద్దకడుబూరు మండలాల్లో పిడుగులు పడ్డాయి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బైలుపత్తికొండ గ్రామంలో పిడుగుపడటంతో 13 జీవాలు మరణించాయి. ఎమ్మిగనూరు మండలంలో 108.2 మిల్లీమీటర్లు, బనగానపల్లిలో 88, బేతంంచెర్లలో 75.2, కల్లూరులో 70.4, గోనెగండ్లలో 65, పాణ్యంలో 62.4, పగిడ్యాలలో 60.8, కర్నూలు అర్బన్లో 54.6, కర్నూలు రూరల్లో 53.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
వారం వరకు వడగాడ్పులుండవు
సాక్షి, విశాఖపట్నం: మూడు వారాల నుంచి కొద్దిరోజుల కిందటి వరకు దడపుట్టించిన వడగాడ్పులు తగ్గుముఖం పట్టాయి. మరో వారం పాటు వడగాడ్పులు ఉండవని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ సమాచారం ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఇటీవలి వరకు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైనే ఉండటంతో పలుచోట్ల వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులు కూడా వీచాయి. నిప్పులు చెరిగే ఎండలకు జనం అల్లాడిపోయారు. 4 రోజుల కిందటి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. అల్పపీడన ద్రోణి, విండ్ డిస్కంటిన్యూటీ (గాలికోత)ల కారణంగా అకాల వర్షాలు మొదలయ్యాయి. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ఆకాశంలో మబ్బులు కమ్మి ఒకింత చల్లదనాన్ని పంచుతున్నాయి. ఈ పరిణామాలతో పగటి ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం వరకు ఒకింత ప్రభావం చూపుతున్నా ఆ తర్వాత తగ్గుముఖం పడుతూ ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం పలుచోట్ల సాధారణంగాను, కొన్నిచోట్ల సాధారణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగాను, అక్కడక్కడ 1–2 డిగ్రీలు ఎక్కువగాను నమోదవుతున్నాయి. ఫలితంగా నాలుగైదు రోజుల నుంచి రాష్ట్రంలో ఎక్కడా ఎండలు విజృంభించడం లేదు. వడగాడ్పులు లేవు. ప్రస్తుతం అల్పపీడన ద్రోణి/గాలులకోత పశ్చిమ విదర్భపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు వ్యాపించి ఉంది. ఇది సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు మునుపటికంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులు వారం రోజులపాటు కొనసాగుతాయని, అందువల్ల అప్పటివరకు వడగాడ్పులు వీచే అవకాశాల్లేవని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. మే నెల సమీపిస్తున్న తరుణంలో ఏప్రిల్ ఆఖరి వరకు ఇంకెంత ఉష్ణతీవ్రతను భరించాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్న ప్రజలకు ఈ సమాచారం ఊరటనిచ్చే అంశమని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద ‘సాక్షి’తో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల మధ్యాహ్నం వేళ వరకు ఒకింత ఉష్ణ తీవ్రత అనిపించినా ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ వాతావరణం చల్లబడుతోందని చెప్పారు. -
Andhra Pradesh: వర్షాలు.. పిడుగులు
సాక్షి, అమరావతి/పాతమల్లాయపాలెం (ప్రత్తిపాడు)/అవనిగడ్డ/చల్లపల్లి/ఎటపాక: తీవ్ర ఎండలతో అల్లాడుతున్న రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. పిడుగులు పడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆరుగురు మరణించారు. వర్షాలతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లగా మారడంతో ప్రజలు సేదతీరారు. కృష్ణాజిల్లా బంటుమిల్లిలో 10.1 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చినపవనిలో 9.3 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బాతుపురం, గుంటూరు జిల్లా ప్రత్తిపాడుల్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలుచోట్ల 3 నుంచి 7 సెంటీమీటర్ల వర్షం పడింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురిసింది. వచ్చే మూడురోజులు ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏపీ, యానాం మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్ ఆవరణలో దక్షిణ, ఈశాన్య గాలులు వీస్తున్నట్లు చెప్పారు. వీటి ప్రభావంతో వచ్చే మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములతో జల్లులు పడతాయని పేర్కొన్నారు. ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పిడుగుపాటుకు ఆగిన గుండెలు కృష్ణాజిల్లాలో పిడుగులు పడి నలుగురు మరణించారు. అవనిగడ్డ మండలం రామచంద్రపురంలో మొక్కజొన్న పంట తడవకుండా పట్టాలు కప్పుతుండగా సమీపంలో పిడుగుపడటంతో రైతు మత్తి వెంకటరామయ్య (53) అక్కడికక్కడే మరణించాడు. చల్లపల్లి మండలం రామానగరం క్లబ్రోడ్లో పిడుగుపాటు శబ్దానికి కె.నాంచారమ్మ (90), కమలా థియేటర్ దగ్గర సైకిల్షాపు మస్తాన్ గుండె ఆగి చనిపోయారు. కృత్తివెన్ను మండలం సంగమూడిలో కూనసాని వెంకటేశ్వరరావు(55) పొలంలో పశువులు మేపుతుండగా పిడుగుపడి మృతిచెందాడు. కోడూరు మండలం పిట్టల్లంక, బడేవారిపాలెం, మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో, కోడూరు మండలం బావిశెట్టివారిపాలెంలో పిడుగులు పడి నాలుగు వరికుప్పలు కాలిపోయాయి. కోడూరు మండలం లింగారెడ్డిపాలెం శివారు నక్కవానిదారి, ఉల్లిపాలెంలో పిడుగులు పడి రెండు పాడిగేదెలు మృత్యువాతపడ్డాయి. మిర్చిని రక్షించుకునేందుకు వెళ్లి.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంలో పిడుగుపాటుకు ఇద్దరు మరణించారు. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో అకాల వర్షం మొదలవడంతో కల్లాల్లో ఉన్న మిర్చిపై పట్టాలు కప్పేందుకు స్థానిక దళితవాడకు చెందిన చాట్ల శ్యామ్బాబు (50), కొరివి కృపానందం (55) వెళ్లారు. కల్లంలో పట్టాలు కప్పుతుండగా, సమీపంలో పిడుగుపడింది. స్పృహ కోల్పోయిన వారిని స్థానికులు ప్రత్తిపాడులోని ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా అప్పటికే మృతిచెందినట్లు సిబ్బంది నిర్ధారించారు. మృతదేహాలను గుంటూరు జీజీహెచ్కి తరలించారు. -
అత్యంత ‘వేడి’ సంవత్సరం ఏదంటే..! ఆ నివేదిక ఏం చెబుతోంది?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. పారిశ్రామిక విప్లవ కాలం(1850–1900) ముందు నాటి ఉష్ణోగ్రత కంటే 2022లో ప్రపంచ ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యింది. 2022 సంవత్సరం ఇప్పటిదాకా ఆరో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుకెక్కిందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఈ మేరకు ‘స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్–2022’ నివేదికను శుక్రవారం విడుదల చేసింది. నివేదికలో ఏం వెల్లడించారంటే.. ► 2015 నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తద్వారా కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు పెరిగాయి. ఈ గ్రీన్హౌజ్ వాయువులు 2021లో రికార్డు స్థాయిలో వెలువడ్డాయి. ► అంటార్కిటికాలో, యూరప్ల్లో హిమానీనదాలు కరిగిపోతున్నాయి. ► 2013 నుంచి 2022 దాకా సముద్రాల నీటిమట్టం ప్రతిఏటా సగటున 4.62 మిల్లీమీటర్ల చొప్పున పెరిగింది. 1993– 2022 మధ్య రెట్టింపైంది. ► 2022లో అధిక ఉష్ణోగ్రతల వల్ల భారత్లో పంటల ఉత్పత్తి పడిపోయింది. పలు రాష్ట్రాల్లో అడవుల్లో కార్చిచ్చు వ్యాప్తించింది. ► పంటల ఉత్పత్తి పడిపోవడం, అదే సమయంలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభం కావడంతో భారత్ నుంచి గోధుమలు, బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించాల్సి వచ్చింది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బందులు తీవ్ర ఎదుర్కొన్నాయి. ► వాతావరణ మార్పుల వల్ల భారత్లో గతేడాది వరదలు కొండ చరియలు విరిగిపడడం వల్ల 700 మంది మరణించారు. వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 900 మంది బలయ్యారు. ► అస్సాంలో వరదల వల్ల 6.63 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ళీ గ్రీన్హౌజ్ వాయువుల ఉద్గారాలు పెరుగుతున్న కొద్దీ వాతావరణంలో ప్రతికూల మార్పులు కొనసాగుతూనే ఉంటాయని, అవి భూగోళంపై మానవళికి ముప్పుగా పరిణమిస్తాయని డబ్ల్యూఎంఓ సెక్రెటరీ జనరల్ ప్రొఫెసర్ పెటిరీ తలాస్ చెప్పారు. ► కరువు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను తట్టుకొనే శక్తి ప్రపంచంలో 100కుపైగా దేశాలకు ఏమాత్రం లేదని అధ్యయనంతో తేలింది. -
తగ్గనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు.. నేడు, రేపు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలుప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 39.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 21.3 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. -
నిప్పులకొలిమి.. ఎండకు వెళ్తే మండిపోతారు! డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పులకొలిమిపై మండుతోంది. తీవ్రమైన ఎండలతో జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటితేచాలు ఎండ తీవ్రతతో బెంబేలెత్తిపోతున్నారు. ఆరుబయట పనిచేసే కూలీలు, ఇతర కార్మి కులు, ఉద్యోగులు వడదెబ్బ బారినపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకూ ఎండల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఎంత తీవ్రమైన ఎండ ఉన్నా రోజువారీ పనులు, శుభకార్యాలు, ఇతరత్రా కార్యకలాపాల కోసం ప్రజలు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకోసం పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తారు. ఎండలు దంచికొడుతున్నా ఉపాధి కూలీలు పని మానుకునే పరిస్థితి ఉండదు. దీంతో వేలాది మంది వడదెబ్బకు గురవుతున్నారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, వీరోచనాలకు గురవుతున్నారు. తలనొప్పి, వికారం ఉంటాయి. ఇలాంటి రోగాలతో వడదెబ్బ బాధితులు అనేక ఆసుపత్రులకు క్యూలు కడుతున్నారు. వేసవిలో జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు వడదెబ్బ, డయేరియా బారిన పడే ప్రమాదముంది. ఆహారం, తాగునీరు కలుషితమైతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక అధిక వేడి, వడదెబ్బలతో మానవులపై శారీరక ప్రభావం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. కొందరిలో అకాల మరణం, వైకల్యం సంభవిస్తుందని హెచ్చరించింది. అధిక వేడి కారణంగా శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, మూత్రపిండ వ్యాధులు కూడా సంభవిస్తాయి. పగటి పూట గది ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి సమయంలో 24 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ఎండ తీవ్రతకు గురయ్యే వారు కఠినమైన శారీరక శ్రమను నివారించాలి. తప్పనిసరిగా శ్రమతో కూడిన పని చేయాల్సి వస్తే, సాధారణంగా వేకువజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య ఉండేలా చూసుకోవాలి. వేసవిలో చల్లగా ఉండడం ఎలా... ఫ్లూయిడ్స్ పుష్కలంగా తాగాలి: వేడి వాతావరణంలో, పనితో సంబంధం లేకుండా ద్రవపదార్థాలు తీసుకోవాలి. దాహం వేసే వరకు వేచి ఉండకూడదు. రోజూ 8–10 గ్లాసుల కంటే ఎక్కువ నీరు తాగాలి. కొబ్బరి నీరు, తాజా పండ్ల రసాలు, మజ్జిగ, లస్సీ, నిమ్మకాయ నీరు, ప్రత్యేకంగా నీటితో ఎలక్ట్రోలైట్ తీసుకోవచ్చు. ఆల్కహాల్ లేదా పెద్ద మొత్తంలో చక్కెర ఉన్న ద్రవాలను తాగవద్దని నిపుణులు చెబుతున్నారు. మసాలాలు మానుకోవాలి తాజా పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినాలి. వేడి ఆహారాలు తీసుకోవద్దు. అధిక మోతాదులో భోజనం చేయొద్దు. పుచ్చకాయ, ద్రాక్ష, పైనాపిల్, క్యారెట్, దోసకాయ వంటి చల్లని పదార్థాలను తీసుకోవాలి. రోజువారీ వంటలో మసాలాలు, ఆవాలు, ఎర్ర మిరపకాయలను ఉపయోగించడం మానుకోవాలి. ఎందుకంటే ఇవి వేడి లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. పుల్లని, మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలి. తగిన దుస్తులు ధరించండి ♦ తేలికైన, లేత రంగు, వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోవాలి. ముదురు రంగు బట్టలను ధరించవద్దు. ♦ చర్మాన్ని తేమగా ఉంచుకుని సంరక్షించుకోవాలి. ఆరుబయటకి వెళ్లాల్సి వస్తే సన్ గ్లాసెస్తోపాటు టోపీని ధరించడం ద్వారా సూర్యుని నుండి రక్షించుకోండి. సాధారణంగా వేసవిలోవచ్చే వ్యాధులు ♦ నీటి ద్వారా వచ్చే వ్యాధులు: అతిసారం, విరోచనాలు, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ తదితరాలు ♦ అంటువ్యాధులు: దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు డెంగీ, మలేరియా, చికున్గున్యా ♦ వేడి సంబంధిత వ్యాధులు: వడదెబ్బ, డీహైడ్రేషన్, తలనొప్పి వంటివి ♦ చర్మ వ్యాధులు: సన్ బర్న్, టానింగ్, చర్మ కేన్సర్ వంటివి ♦ కంటి వ్యాధులు: కండ్లకలక వంటివి -
రాష్ట్రంలో మంటలు కంటిన్యూ.. గ్రేటర్ మినహా రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్ జారీ
ఎండలు మండుతుండటంతో వేరుశనగ పంట తీసేందుకు వెళ్లిన కూలీలు.. ఆ మొక్కలనే గుడిసెగా మార్చు కుని పనిచేసుకుంటున్న దృశ్యమిది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామశివార్లలో ఈ దృశ్యం కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్ , ఆదిలాబాద్ సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలన్నా భయపడేలా వడగాడ్పులు వీస్తున్నాయి. గాలిలో తేమశాతం బాగా పెరగడంతో విపరీతంగా ఉక్కపోత ఉంటోంది. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడగాడ్పులు సైతం వీస్తాయని వివరించింది. 22 నుంచి కొన్నిరోజులు ఉపశమనం శనివారం (ఈ నెల 22వ తేదీ) నుంచి ఎండలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. కొన్నిచోట్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గవచ్చని అంచనా వేసింది. వాతావరణంలో నెలకొంటున్న పలు మార్పులే దీనికి కారణమని వివరించింది. దాదాపు నాలుగైదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వాయవ్య తెలంగాణ, శుక్రవారం తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలి.. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బయటికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఇంట్లోనే ఉండాలని పేర్కొంది. ఇక బుధవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 42.3 డిగ్రీలుగా నమోదైనట్టు తెలిపింది. సాధారణం కంటే అధికంగా.. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మంలో సాధారణం కంటే ఏకంగా 3.2 డిగ్రీలు అధికంగా నమోదవడం గమనార్హం. నల్లగొండలో 2.4 డిగ్రీలు.. భద్రాచలం, మెదక్లలో 1.9 డిగ్రీలు, హన్మకొండలో 1.7 డిగ్రీలు, నిజామాబాద్, రామగుండంలలో 1.6 డిగ్రీల మేర అధికంగా నమోదైనట్టు తెలిపింది. – పగటి ఉష్ణోగ్రతలకు తగినట్టుగా రాత్రి ఉష్ణోగ్రతలూ సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు అధికంగా ఉంటున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలాచోట్ల అర్ధరాత్రి దాటే వరకు కూడా ఉక్కపోత కొనసాగుతోందని వివరించింది. – ఇక జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 44.5 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో 44.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం తమ వెబ్సైట్లో తెలిపింది. – ఎండ తీవ్రత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం పది, పదకొండు గంటల సరికే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఏప్రిల్లోనే ఈ పరిస్థితి ఉంటే.. మే నెలలో ఎండల తీవ్రత మరెలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా భగభగలు న్యూఢిల్లీ: భానుడి ప్రతాపంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో, ఒడిశాలోని బారిపడలో 44.5 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీలో కొన్ని రోజులుగా 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఎండ ప్రచండంగా ఉంది. దాంతో త్రిపురలో ‘స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్’ ప్రకటించారు. కేరళలోనూ ఎండలు మండుతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఏపీ, బిహార్ తదితర రాష్ట్రాల్లో తీవ్ర వడగాడ్పులు రెండు రోజులుంటాయని ఏపీలో ఈ నెల 21, 22ల్లో వర్షం పడొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. -
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా 40 డిగ్రీల సెల్సియస్పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా చాప్రాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుల్లో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు గురై ముగ్గురు మృతిచెందారు. వారిలో మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, నిర్మల్ జిల్లాలో ఒక ఉపాధి కూలీ ఉన్నారు. ఎండల తీవ్రతకు వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎండ వేడి కారణంగా అనేక చోట్ల వరి కోతలు నిలిచిపోయాయి. కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది. వరి కోత యంత్రాలు సైతం అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాలిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని, మే నెలాఖరు వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు తెలిపింది. వేసవి ప్రణాళిక అమలులో నిర్లక్ష్యం... ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వేసవి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని విపత్తు నిర్వహణ శాఖ ఆదేశించినా సంబంధిత శాఖలు మాత్రం దీనిపై పెద్దగా దృష్టిపెట్టడంలేదన్న ఆరోపణలున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి, ఆశ వర్కర్లు, పారామెడికల్ సిబ్బందికి ఎండల తీవ్రత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కల్పించడంతోపాటు వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇవేవీ పెద్దగా అమలు కావట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. వడదెబ్బ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్న విపత్తు నిర్వహణశాఖ సూచనలను పట్టించుకొనే పరిస్థితి కనిపించట్లేదు. అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం దాదాపు ఎక్కడా అమలుకావడంలేదని ప్రజలు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు పనిచేసే చోట షెల్టర్లు కట్టించాలన్న నిబంధన కాగితాలకే పరిమితమైంది. కార్మికులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరుబయట పనిచేయకూడదన్న నిబంధనను అనేక కంపెనీలు ఉల్లంఘిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. ఎంత ఎండకు ఏ అలర్ట్? ► రెడ్ అలర్ట్ (సాధారణం కంటే 6 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులు ఉంటే జారీ చేసేది) ► ఆరెంజ్ అలర్ట్ (సాధారణం కంటే 4–5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే) ► ఎల్లో అలర్ట్ (హీట్వేవ్ వార్నింగ్. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కాస్త ఎక్కువ నమోదైతే) ► వైట్ అలర్ట్ (సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే జారీ చేసేది) ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ► తరచూ నీళ్లు తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీళ్ల సీసాను వెంట తీసుకెళ్లాలి. ► తెలుపు, లేతవర్ణంగల పలుచటి కాటన్ వస్త్రాలు ధరించాలి. ► తలకు వేడి తగలకుండా టోపీ లేదా రుమాలు చుట్టుకోవాలి. ► వడదెబ్బ తగిలిన వారిని నీడలో ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు తడిగుడ్డతో తుడవాలి. ► ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. ► వడగాడ్పులు వీస్తుంటే భవన నిర్మాణ కార్మికులకు యాజమాన్యాలు నీడ కల్పించాలి. తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ► ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. నీటి వసతి కల్పించాలి. ► బస్టాండ్లలో, దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలి. -
సవాలుకు సిద్ధమవుదాం!
గ్రీష్మ ఋతువు ఇంకా మొదలుకానే లేదు. కానీ శిశిరంలోనే, ఇంకా చెప్పాలంటే ఫిబ్రవరిలోనే గ్రీష్మ తాపం మొదలైపోయింది. 1901 నుంచి గత 122 ఏళ్ళలో ఎన్నడూ లేనంతటి సగటు పగటి ఉష్ణో గ్రత (29.54 డిగ్రీలు) ఫిబ్రవరిలో నమోదైంది. నిరుడు మార్చి కూడా ఇలాగే భారత ఉపఖండమంతటా చండ్రనిప్పులు చెరిగింది. దీన్ని బట్టి ఇక ఈ వేసవి ఎలా ఉండనుందో ఇప్పటికే అర్థమైపోయింది. దేశంలో ఇటు వేసవిలో, అటు శీతకాలంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దేశంలో వాతావరణంపై అధ్యయనం చేసే ‘సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ’ (సీస్టెప్) ఈ సంగతి వెల్లడించింది. ఒక్కమాటలో వాతావరణ సంక్షోభం ఇక ఎప్పుడో నిజమయ్యే జోస్యం కానే కాదు. ఇప్పటికే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వర్షాలతో తరచూ సంభవిస్తున్న సంఘటన. ఈ వేసవిలో భానుప్రతాపం తీవ్రంగా ఉండనుందన్న హెచ్చరికలతో, స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి, ఈ సోమవారం నిపుణులతో సమావేశం జరపడం గమనార్హం. గత రెండు దశాబ్దాల (2000 – 2019) డేటా చూస్తే, కనివిని ఎరుగని ఉష్ణోగ్రతలతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా సగటున 50 లక్షల మంది మరణిస్తున్నారు. ఇది 2021 జూలైలో ప్రచురితమైన ‘ది లాన్సెట్’ అధ్యయనం తేల్చిన మాట. మన దేశంలోనే 7.4 లక్షల మంది చనిపోతున్నారు. దేశంలో వాతావరణ మార్పులతో దుర్మరణాలు 55 శాతం పెరిగాయి. ఇక, కేవలం 30 ఏళ్ళలో (1990 – 2019) వేసవిలో మన కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల నుంచి 0.9 డిగ్రీల మేర పెరిగాయి. దేశంలో నూటికి 54 జిల్లాల్లో చలికాలంలోనూ ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. చర్మాన్ని చీల్చే ఎండతో వ్యవసాయం సహా వాతావరణ ఆధారిత రంగాలు ప్రభావితమై, జీవనోపాధి దెబ్బ తింటోంది. దాదాపు 167.2 బిలియన్ పని గంటలు నష్టం. తక్కువ వర్షపాతం, ఎక్కువ ఉష్ణోగ్రతలతో గోదుమల దిగుబడి 2020–21తో పోలిస్తే 2021–22లో దాదాపు 30 లక్షల టన్నులు పడిపోయింది. రానురానూ భూతాపోన్నతితో పాటు వడగాడ్పులు, పర్యవసానాలూ పెరుగుతాయని వాతావ రణ మార్పులపై అంతర్ ప్రభుత్వ సంఘం ఆరో అంచనా నివేదిక సారాంశం. ఈ నేపథ్యంలోనే ప్రకృతి వైపరీత్యాల ముప్పు తగ్గింపు జాతీయ వేదిక (ఎన్పీడీఆర్ఆర్) సైతం ఈసారి ‘మారుతున్న వాతావరణానికి తగ్గట్టు స్థానిక సంసిద్ధత’ అనే అంశాన్ని చేపట్టింది. రేపు శుక్రవారం జరిగే ఈ 3వ సదస్సును ప్రధానే ప్రారంభిస్తుండడం విశేషం. జోషీమఠ్ లో భూపాతాలు సహా పలు అంశాలపై చర్యల్ని ఇందులో చర్చించనున్నారు. ముంచుకొస్తున్న మార్పులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం స్వాగత నీయం. వాతావరణ సవాలుపై చర్యలకు ప్రభుత్వనిధుల కేటాయింపు తగ్గిందన్న వార్తలే విషాదం. పసిఫిక్ మహాసముద్రంలో పవనాల సహజ మార్పు వల్ల ఈ ఏడాది ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగి, వాతావరణ ధోరణుల్లో సంక్షోభం తప్పకపోవచ్చని శాస్త్రవేత్తల హెచ్చరిక. ఈ 2023లో ఉష్ణవాతావరణ ధోరణి అయిన ఎల్ నినో మళ్ళీ విరుచుకుపడే ప్రమాదం నూటికి తొంభై పాళ్ళుందట. అదే జరిగితే, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల మేర పెరుగుతాయి. అంటే, ఈ శతాబ్దం చివరికి భూతాపోన్నతిని ఏ స్థాయికి నియంత్రించాలని ప్రపంచ నేతలు అంగీకరించారో ఆ చెలియలికట్టను ఇప్పుడే చేరుకుంటాం. దీనివల్ల 70 – 90 శాతం మేర పగడపు దిబ్బలు కనుమరుగై పోతాయట. ఇవన్నీ యావత్ ప్రపంచానికి, వ్యవసాయ ఆధారిత భారత్కు ప్రమాద ఘంటికలు. ఈ అత్యవసర పరిస్థితిని తట్టుకోవాలంటే 2030 కల్లా వర్ధమాన దేశాలు ఏటా 30 వేల కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని ఐరాస అంచనా. ప్రపంచ జనాభాలో 12 శాతమే ఉన్నా, గ్రీన్ హౌస్ వాయువుల్లో 50 శాతానికి బాధ్యులైన ధనిక దేశాలు వర్ధమాన దేశాలకు అండగా నిలవాలి. మన వద్ద మార్చి, మే మధ్య ఉష్ణపవనాలకు తోడు మరో సమస్య రానుంది. వినియోగం బాగా పెరిగే వేసవిలో విద్యుత్ కొరత సహజం. గత అయిదేళ్ళలో దేశంలో సౌర విద్యుదుత్పత్తి 4 రెట్లు పెరిగింది గనక నడిచిపోయింది. అది పగటివేళ వరకు ఓకే. కొత్తగా థర్మల్, హైడ్రోపవర్ సామర్థ్యా లను పెంచుకోనందు వల్ల రాత్రి వేళల్లో కష్టం కానుంది. ఈ వేసవి రాత్రుళ్ళలో గిరాకీ, సరఫరాల మధ్య 1.7 శాతం లోటు రానుంది. ఒక్కమాటలో, ఈ వేసవిలో రాత్రిపూట దేశంలో కరెంట్ కష్టాలు తీవ్రం కానున్నాయి. ఆందోళన పడాల్సింది లేదని ప్రభుత్వాధికారులు పైకి అంటున్నా, త్వరితగతిన థర్మల్, హైడ్రో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోకుంటే ఈ వేసవిలో ప్రజలకు కష్టాలు తప్పవు. ముఖ్యంగా రాత్రింబవళ్ళు నడిచే ఆటో, ఉక్కు, ఎరువుల తయారీ పరిశ్రమలు చిక్కుల్లో పడతాయి. ముందే ఒక అంచనా రావడంతో నగర వ్యూహకర్తల మొదలు గ్రామీణ రైతుల దాకా అందరూ ఇప్పుడిక నష్టనివారణ చర్యలకు దిగాలి. భూ, జల నిర్వహణల్లో తగు మార్పులు చేసుకోవాలి. త్వరిత దిగుబడినిచ్చే కొత్త పంట రకాలపై రైతులకు మార్గదర్శనం చేయాలి. స్థానిక పాలనాయంత్రాంగాలు ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు చేయాలి. నీడనిచ్చే ఉద్యానాలు, నీటి వసతి లాంటి పరిష్కార మార్గాలు చూపాలి. అహ్మదాబాద్లో 2010లో గాడ్పులకు 1300కు పైగా మరణించాక, సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళిక ఏటా 1200 మరణాల్ని నివారిస్తున్నట్టు అంచనా. అలాంటివి అంతటా అమలు చేయాలి. ఉష్ణతాపంతో తలెత్తే ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొనేలా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను సమాయత్తం చేయాలి. వాతావరణ సంక్షోభాలు ఇక నిత్యకృత్యం కానున్నందున వీటి దుష్ప్రభావాన్ని దీటుగా ఎదుర్కొనేలా పటిష్ఠమైన విధాన రూపకల్పనే పాలకుల తక్షణ కర్తవ్యం. -
ఈ వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతలే
సాక్షి, అమరావతి: ఈ వేసవిలో రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది. తీవ్రమైన ఎండలు ఉండే అవకాశాలు తక్కువేనని తెలిపింది. ఎల్నినో పరిస్థితుల వల్ల ఎండల తీవ్రత పెరుగుతుందని, వర్షాభావం నెలకొంటుందని కొన్ని ప్రైవేటు వాతావరణ సంస్థలు అభిప్రాయపడ్డాయి. కానీ భారత వాతావరణశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో ఎల్నినో ప్రభావం ఉన్నట్లు నిర్థారించలేదు. గత మూడు, నాలుగేళ్లుగా కొనసాగుతున్న లానినో బలహీనపడుతోందని, అదే సమయంలో ఎల్నినో న్యూట్రల్గా ఉందని స్పష్టం చేసింది. లానినో ఉంటే విస్తృతంగా వర్షాలు పడతాయి. ఎల్నినో ఉంటే వర్షాభావం నెలకొని కరువు పరిస్థితులు ఏర్పడతాయి. వాతావరణశాఖ తాజా నివేదికలో ఎల్నినో న్యూట్రల్గా ఉందని చెప్పిన నేపథ్యంలో ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయి. అంటే గత సంవత్సరంలో ఉన్న వాతావరణ పరిస్థితులే ఈసారి ఉండే అవకాశం ఉంది. 44 నుంచి 46 డిగ్రీల మేర అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. గత సంవత్సరం కూడా ఇవేస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాది ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే సమయంలో హీట్వేవ్ ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. అంటే మొత్తంగా చూసుకున్నప్పుడు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనా అక్కడక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. చలిగాలులు కూడా ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే ఉంటున్నాయి. వచ్చే 10–15 రోజుల్లో ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంది. అలాగే వడగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. -
దక్షిణాదిలో మార్చి ఎండలు తక్కువే!
సాక్షి, హైదరాబాద్: హమ్మయ్య! ఈ నెలలో దక్షిణాది రాష్ట్రాలు కొంచెం నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకంటారా? దేశం మొత్తమ్మీద మార్చి నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. కానీ, దేశ ద్వీపకల్ప ప్రాంతంలో మాత్రం వేడి సాధారణం నుంచి అంతకంటే తక్కువ ఉండనుంది. భారతీయ వాతావరణ విభాగం (ఐఎండీ) ఈ విషయం తెలిపింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి మాత్రం ఎన్నడూ లేనంతగా, స్పష్టంగా చెప్పాలంటే 1877 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా రికార్డు సృష్టించింది. వేసవి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐఎండీ మంగళవారం వర్చువల్ పద్ధతిలో విలేకరుల సమావేశం నిర్వహించింది. మార్చి నుంచి మే నెల వరకూ వేసవి తీరుతెన్నులపై తన అంచనాలను వెలువరించింది. దీని ప్రకారం.. మార్చిలో గరిష్ట ఉష్ణోగ్రతలు దేశ ఈశాన్య, తూర్పు, మధ్య ప్రాంతాలతోపాటు వాయువ్య ప్రాంతాల్లో కొన్ని చోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉండనున్నాయి. మిగిలిన ప్రాంతాలు అంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం తక్కువగా ఉంటాయి. కనిష్ట ఉష్ణోగ్రతల్లోనూ ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు మినహా మిగిలిన అన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. మార్చి నుంచి మే నెల మధ్యభాగంలో దేశ మధ్య ప్రాంతం దానికి అనుకుని ఉండే వాయవ్య ప్రాంతాల్లో వడగాడ్పులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉండనుంది. మార్చిలో దేశంలోని మధ్య ప్రదేశంలో వడగాడ్పుల ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. సాధారణ స్థాయిలోనే వర్షాలు.. మార్చి నెలలో వర్షపాతం కూడా దేశం మొత్తమ్మీద సాధారణంగానే ఉండనున్నట్లు ఐఎండీ తెలిపింది. దీర్ఘకాలిక అంచనాలతో పోల్చినప్పుడు ఈ నెల వర్షాలు 83 –117 శాతం మధ్యలో ఉంటాయని తెలిపింది. దేశ వాయవ్య ప్రాంతాల విషయానికి వస్తే అక్కడ సాధారణం కంటే తక్కువ స్థాయి వర్షాలు నమోదు కావచ్చునని, సెంట్రల్ ఇండియా పశ్చిమ దిక్కున, ఈశాన్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. దేశ ద్వీపకల్ప ప్రాంతంలో మార్చి నెల వానలు సాధారణం లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉంటాయని తెలిపింది. ఎల్నినో, లానినాలపై ఇప్పుడే చెప్పలేం ఈ ఏడాది రుతుపవనాల పరిస్థితులపై స్పష్టంగా చెప్పడం ప్రస్తుతానికి వీలుకాదని ఐఎండీ తెలిపింది. ‘‘పసఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని ఉపరితల జలాల ఉష్ణోగ్రతల దృష్ట్యా లానినా పరిస్థితులున్నాయి. రానున్న రోజుల్లో ఇది బలహీనపడి ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది’’ అని వివరించింది. రుతుపవనాల సీజన్కు ముందు ఈ పరిస్థితులు ఏర్పడవచ్చంది. అంతేకాకుండా... రుతుపవనాలపై ప్రభా వం చూపగల హిందూ మహాసముద్ర ఉపరి తల జలాల ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థితిలోనే ఉండే అవకాశమున్నట్లు చెప్పారు. -
ఆదిలోనే అధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, అమరావతి: వేసవి ప్రారంభంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ప్రతాపం చూపుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 36 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో అత్యధికంగా 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో 37 నుంచి 38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తా జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో 36–38 డిగ్రీల ఉష్ణోగ్రతలొచ్చాయి. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న నాలుగైదు రోజుల్లో ఎండల తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో 3– 5, రాయలసీమలో 2–3 డిగ్రీల మేర సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పొడి గాలుల కారణంగా ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. -
ఏపీలో గ్రీష్మతాపం.. హీట్వేవ్స్ ప్రతాపం.. ఎందుకిలా!?
ఆంధ్రప్రదేశ్ హీటెక్కిపోతోంది. వేసవిలో వడగాడ్పుల రోజుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోకెల్లా ఎక్కువ రోజులు వడగాడ్పులు వీచే రాష్ట్రంగా రాజస్థాన్ నిలుస్తుండగా.. రెండో స్థానంలో ఒడిశా ఉండేది. దశాబ్దకాలంగా పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒడిశాను పక్కకు నెట్టేసి ఆ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించింది. దక్షిణ భారతదేశంలో ఏపీ మొదటి స్థానంలో నిలుస్తోంది. సాక్షి, విశాఖపట్నం: పదేళ్లుగా రాష్ట్రంలో వేసవి గరిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల కొనసాగుతోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అంతేకాదు.. వడగాడ్పులు కొనసాగే రోజులూ అధికమవుతున్నాయి. 2011–2021 సంవత్సరాల మధ్య వేసవి ఉష్ణోగ్రతల గణాంకాలను బట్టి రాజస్థాన్ తర్వాత అత్యధిక హీట్వేవ్స్ రోజులు ఆంధ్రప్రదేశ్లోనే రికార్డవుతున్నాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూవిజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి జితేంద్రసింగ్ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. గడచిన దశాబ్ద కాలంలో నడి వేసవి కాలంలో రాజస్థాన్లో 119, ఆంధ్రప్రదేశ్లో 106, ఒడిశాలో 103 వడగాడ్పుల రోజులు నమోదయ్యాయి. ఈ దశాబ్దంలోని ఆరేళ్లలో సగటున ఏడాదికి పది కంటే ఎక్కువ హీట్వేవ్స్ రోజులు నమోదైన ఏకైక రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ రికార్డులకెక్కింది. ఈ దశాబ్దంలో పొరుగున ఉన్న తెలంగాణాలో 69, తమిళనాడులో 56 వడగాడ్పుల రోజులు నమోదయ్యాయి. వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతలకంటే 4.5 డిగ్రీలకు మించి అధికంగా రికార్డయితే వడగాడ్పులు వీస్తాయి. రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదైతే వేసవి తాపం ప్రభావం మొదలవుతుంది. అలా అవి పెరిగే కొద్దీ వడగాడ్పుల తీవ్రత కూడా పెరుగుతుంది. మరోవైపు 2014–17 మధ్య రాష్ట్రంలో వడదెబ్బకు 2,776 మంది మృత్యువాతపడ్డారు. కాకినాడ, కళింగపట్నాల్లో భిన్నంగా.. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ పరిధిలో 8 వాతావరణ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 6 స్టేషన్లలో వేసవి సీజన్లో హీట్వేవ్ సరళి పెరుగుదల నమోదైంది. కానీ.. కాకినాడ, కళింగపట్నం స్టేషన్లలో మాత్రం అందుకు భిన్నంగా హీట్వేవ్ రోజులు తగ్గుతున్నట్టు గుర్తించారు. 1961 నుంచి 2021 సంవత్సరాల మధ్య వేసవిలో (ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను బట్టి ఈ నిర్ధారణకు వచ్చారు. మరోవైపు అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, మచిలీపట్నం, విశాఖపట్నం ప్రాంతాలలో హీట్వేవ్ ట్రెండ్ పెరుగుతున్నట్టు తేల్చారు. ప్రకాశం జిల్లా వెలిగండ్లలో 2016 మే రెండో తేదీన 48.6 (49) డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయినట్టు రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికల సంస్థ పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం విశేషం. దేశవ్యాప్తంగా 103 వాతావరణ స్టేష్టన్లలో వేసవి తాపం, వడగాడ్పుల తీవ్రతపై సమీక్షించగా కేవలం 20 స్టేషన్ల పరిధిలోనే హీట్వేవ్ తగ్గుదల నమోదవుతున్నట్టు నిర్ధారించారు. వేసవిలో వడగాలులు (హీట్వేవ్స్) రాజస్థాన్ నుంచి తెలంగాణ మీదుగా రాష్ట్రంపైకి వీస్తాయి. ఆంధ్రప్రదేశ్లో 974 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. వేసవిలో మధ్యాహ్నం తర్వాత సముద్రం నుంచి గాలులు వీస్తుంటాయి. అవి ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి. కానీ.. కొన్నేళ్లుగా ఈ గాలులు సక్రమంగా వీయకపోవడం, ఆలస్యంగా వీయడం వంటివి జరుగుతున్నాయి. ఫలితంగా ఉష్ణ తీవ్రత పెరిగి వడగాడ్పుల ఉధృతిని, ఉక్కపోత తీవ్రతను పెంచుతున్నాయని భారత వాతావరణ విభాగం రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. అదే సమయంలో ఏప్రిల్కు కొద్దిరోజుల ముందు నుంచే వేసవి ఛాయలు మొదలవడం, నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం వంటివి రాష్ట్రంలో హీట్వేవ్స్ రోజులు పెరగడానికి దోహదపడుతున్నాయని వివరించారు. -
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖను ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అనంతరం అదే దిశలో కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో వెల్లడించింది. వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఫిబ్రవరి 1న శ్రీలంక తీరానికి చేరుకుంటుందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 30వ తేదీ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. మరోవైపు రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. పలు ప్రాంతాల్లో పొగమంచు కూడా ఏర్పడుతుందని తెలిపింది. కాగా.. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతల క్షీణత కొనసాగుతోంది. అరకు లోయలో 7.1, పెద ఉప్పరాపల్లి (చిత్తూరు) 8.8, ఆర్.అనంతపురం (శ్రీసత్యసాయి) 9, బెలుగుప్ప (అనంతపురం) 9.5, పెద్ద తిప్పసముద్రం (అన్నమయ్య) 10.3, హలహర్వి (కర్నూలు) 10.5, వల్లివేడు (తిరుపతి)ల్లో 10.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా మూడు రోజులపాటు నెమ్మదిగా పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో తెలిపింది. ఫలితంగా ఈ నెల 29, 30 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా జనవరి మొదటి వారం తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనాలు అరుదుగా ఏర్పడుతుంటాయి. అంతకుముందే ఈశాన్య రుతుపవనాలు కూడా నిష్క్రమిస్తాయి. దీంతో వర్షాలకు ఆస్కారం ఉండదు. కానీ, ప్రస్తుతం సముద్రంపై తేమ అధికంగా ఉండడం వల్ల ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ఏర్పడడానికి దోహదపడుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. క్షీణిస్తున్న కనిష్ట ఉష్ణోగ్రతలు.. మరోవైపు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతల క్షీణత కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజుల నుంచి ఏజెన్సీ ఏరియాతోపాటు రాయలసీమలో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు (ఏఎస్సార్), శ్రీకాకుళం, అనకాపల్లి, చిత్తూరు, కాకినాడ, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా క్షీణిస్తున్నాయి. అక్కడ 4 నుంచి 12 డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. రాష్ట్రంలో గురువారం వేకువజామున అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమల్లో రానున్న రెండు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. -
Hyderabad: నగరవాసులకు ఎల్లో అలర్ట్.. పడిపోనున్న ఉష్టోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను చలి పులి గజ గజ వణికిస్తోంది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోతున్నాయి. రోజు రోజుకూ రాత్రి , పగలు తేడా లేకుండా దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొండ ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 26 నుంచి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. సుమారు 11 డిగ్రీల సెంటిగ్రేడ్ కనిష్ట ఉష్ణోగ్రతకు పడిపోయే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 26 నుంచి విపరీతమైన పొగమంచు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే హైదరాబాద్లోని సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, వంటి ఐదు జోన్లలో విపరితమైన మంచు కురిసే అవకాశ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పొగమంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున్న వాహనదారులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతేనే ఉదయం వేళ బయటకు వెళ్లాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ వెల్లడించింది. (చదవండి: డెక్కన్ మాల్ కూల్చివేతకు జీహెచ్ఎంసీ గ్రీన్ సిగ్నల్) -
అబ్బా.. చలి చంపుతోంది!
సాక్షి, హైదరాబాద్/కోహీర్(జహీరాబాద్): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని హెచ్చరించింది. ఈశాన్యం వైపు నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్న నేపథ్యంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో కనిష్ట ఉష్ణోగ్రత 4.6 డిగ్రీల సెల్సియస్గా నమో దైంది. రాష్టంలో ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొమురం భీమ్ జిల్లా సిర్పూర్(యు)లో 4.8 డిగ్రీలు రెండో అత్యల్ప ఉష్ణోగ్రత కాగా, రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి, వికారాబాద్ జిల్లా మర్పల్లి 5 డిగ్రీలతో మూడో స్థానంలో నిలిచాయి. చలి తీవ్రత పెరగడంతో ఉదయం 8 గంటల వరకు ప్రజలు బయటికి రాలేకపోతున్నారు. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్లో... కనిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ గజగజలాడుతోంది. సోమవారం తెల్లవారుజామున శివరాంపల్లిలో కనిష్టంగా 7.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కాగా నగరం మొత్తంగా సరాసరిన 11.3 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేసింది. ఉదయం 10దాటినా తొలగని మంచు పాల్వంచ రూరల్: కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల సమీపాన ఉండే గ్రామాల్లో ఆదివాసీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాయంత్రం ఐదు గంటల నుంచే చలి మొదలవుతుండటం, ఉదయం 10 గంటల వరకూ మంచు తెరలు వీడకపోవడంతో రాత్రంతా నెగడు (చలిమంటలు) వద్దే గడుపుతున్నారు. పడుకునే సమయాన కూడా పక్కన నెగడుకు తోడు దుప్పట్లు కప్పుకుని నిద్రిస్తున్నారు. కొత్తగూడెం జిల్లాలోని చిరుతానిపాడులో, పెద్దకలశ, రాళ్లచెలక, బుసురాయి, ఎర్రబోరు తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. -
ఏపీలో క్షీణిస్తున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంపైకి వీస్తున్న ఈశాన్య గాలుల వల్ల రానున్న రెండు రోజులు దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. మరోవైపు ఏపీలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. చలి క్రమంగా పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆయా జిల్లాల్లో 11 నుంచి 14 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జి.మాడుగులలో 11.6 డిగ్రీలు, వాల్మీకిపురం(అన్నమయ్య)లో 12.6, ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు)లో 13.1, మడకశిర (శ్రీసత్యసాయి)లో 13.2, సోమాల (చిత్తూరు)లో 13.7, బెలుగుప్ప (అనంతపుర)లో 14.9 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
చలితో గజ గజ! రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడంటే?
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత ఉధృతమవుతోంది. సాధారణం కంటే కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతలు మూడు, నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియా, పర్వత ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గిపోతున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యల్పంగా రికార్డవుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఆ జిల్లాలోని హుకుంపేటలో 3.7, చింతపల్లిలో 4.9, అరకులోయలో 5.1 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజనులో హుకుంపేటలో నమోదైన 3.7 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యల్పం. అల్లూరి సీతారామరాజు జిల్లాతోపాటు శ్రీ సత్యసాయి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, నంద్యాల, కాకినాడ, వైఎస్సార్ జిల్లాలు చలితో వణుకుతున్నాయి. ఈశాన్య, ఉత్తర గాలుల వల్లే... ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత అధికంగా ఉంది. అటు నుంచి ఉత్తర గాలులు మన రాష్ట్రంపైకి వీస్తున్నాయి. వీటికి ఈశాన్య దిశ నుంచి వీస్తున్న చల్ల గాలులు కూడా తోడవుతున్నాయి. వీటి ప్రభావంతోనే రాష్ట్రంలో చలి ఉధృతి పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత ఈ నెలాఖరు వరకు ఇలాగే కొనసాగుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద శనివారం ‘సాక్షి’కి తెలిపారు. వాయవ్య గాలులు కూడా మొదలైతే కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత క్షీణిస్తాయని, జనవరి ఆరంభం నుంచి చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. చలికి పొగమంచు తోడు... ప్రస్తుతం చలి ఉధృతికి పొగమంచు కూడా తోడవుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. సముద్రం పైనుంచి ఈశాన్య దిశగా వీస్తున్న గాలుల వల్ల పొగమంచు ఏర్పడుతోంది. ఈ పొగమంచు దట్టంగా అలముకోవడం వల్ల రోడ్లపై ముందు వెళుతున్న వాహనాలు కనిపించక ఒకదానికొకటి ఢీకొని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనచోదకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. -
మన్యం గజగజ! భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. అరకులోయలో 8.6 డిగ్రీలు..
సాక్షి, పాడేరు: చలి తీవ్రతకు మన్యం ప్రాంతం గజగజ వణుకుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పొగమంచు, చలిగాలుల తీవ్రత పెరగడంతోపాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. అరకులోయలోని కేంద్ర కాఫీబోర్డు వద్ద సోమవారం ఉదయం 8.6 డిగ్రీలు, పాడేరుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 9డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మినుములూరులో ఆదివారం 10 డిగ్రీలు, అరకులోయలో 15.2 డిగ్రీలు, చింతపల్లిలో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఒక్కరోజులోనే మినుములూరు మినహా, అరకులోయ, చింతపల్లి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గి చలిగాలులు పెరిగాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి చలి తీవ్రత పెరగడంతో స్థానికులతోపాటు ఏజెన్సీని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏజెన్సీ అంతటా పొగమంచు దట్టంగా కురుస్తోంది. సోమవారం ఉదయం 10గంటల వరకు అరకులోయ, పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, చింతపల్లి ప్రాంతాల్లో పొగమంచు కురిసింది. పది గంటల తర్వాతే సూర్యుడు కనిపించాడు. పొగమంచు కారణంగా లంబసింగి, పాడేరు, అనంతగిరి, దారకొండ, రంపుల, మోతుగూడెం, మారేడుమిల్లి ఘాట్రోడ్లలో వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
వాయుగుండం కాదు.. వచ్చేది తుపానే
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: కొద్దిరోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడుతుందనుకుంటున్న వాయుగుండం అంచనా తప్పి బలపడనుంది. తుపానుగా మారి తమిళనాడు–దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించనుంది. దీని ప్రభావం మన రాష్ట్రంపై కూడా పడనుంది. కాగా.. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అదే దిశలో పయనిస్తూ తుపానుగా బలపడి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఈ నెల 8న ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి–దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం తెలిపింది. దక్షిణ కోస్తా.. రాయలసీమపై అధిక ప్రభావం ఈ తుపాను ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఎక్కువగాను.. ఉత్తర కోస్తాలో స్వల్పంగాను ఉంటుందని తెలిపింది. బుధవారం దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం దక్షిణ కోస్తాలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే రోజున ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ వివరించింది. వాయుగుండం, తుపాను ప్రభావంతో ఈ నెల 8, 9 తేదీల్లో కోస్తాలో తీరం వెంబడి గంటకు 40నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని పేరు ‘మాండూస్’ ఈ తుపానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సూచించిన ‘మాండూస్’ అనే పేరు పెట్టనున్నారు. ఈ పేరును వాయుగుండం తుపానుగా మారిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. 15న మరో అల్పపీడనం ఈ నెల 15వ తేదీన అండమాన్ సముద్రం లేదా దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావం 20వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది. ఏపీ తీరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో అల్పపీడనాలు ఏపీ తీరంవైపు కదలడం లేదని అంచనా వేస్తున్నారు. -
చలి తీవ్రత పెరిగే అవకాశం!
సాక్షి, విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో కొద్దిరోజుల నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అల్పపీడనం గానీ, ఉపరితల ఆవర్తనం గానీ, ద్రోణుల జాడ గానీ లేవు. దీంతో వర్షాలు తగ్గుముఖం పట్టి మళ్లీ పొడి వాతావరణం నెలకొనే పరిస్థితులేర్పడ్డాయి. సోమవారం గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని, మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ మంగళ, బుధ, గురువారాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలోకి దిగువ స్థాయి నుంచి తూర్పు, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా క్షీణిస్తూ చలి తీవ్రతను పెంచుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఒకట్రెండు డిగ్రీలు తక్కువగా, రాయలసీమలో పలుచోట్ల సాధారణ కంటే 2–4 డిగ్రీలు అధికంగాను నమోదవుతున్నాయి. కాగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా కళింగపట్నంలో 16.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
మన్యంలో చలి విజృంభణ
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా చలి గాలులు అధికమయ్యాయి. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకులోయలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం అరకులోయ కేంద్ర కాఫీ బోర్డు వద్ద 9.8 డిగ్రీలు నెలకొనగా గురువారం ఉదయం 6.8 డిగ్రీలకు పడిపోవడంతో చలి అధికమైంది. ఒక్కరోజు వ్యవధిలోనే 3 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గడంతో అరకు ప్రాంత వాసులు చలితో ఇబ్బందులు పడుతున్నారు. పొగ మంచు దట్టంగా కురవడంతో పాటు చలి పెరగడంతో స్థానికులు, పర్యాటకులు అవస్థలు పడ్డారు. ఉదయం 10 గంటల వరకు మంచు కమ్ముకుంది. అలాగే పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 10 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో కూడా పొగ మంచు దట్టంగానే కురిసింది. -
మన్యం గజగజ
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు): ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలిపులితో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మంగళవారంతో పోల్చుకుంటే బుధవారం మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 13 డిగ్రీల నుంచి 8.2 డిగ్రీలకు, పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో 12 డిగ్రీల నుంచి 9 డిగ్రీలకు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 12.7 డిగ్రీల నుంచి 9.7 డిగ్రీలకు పడిపోయింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఏజెన్సీ గ్రామాల్లో చలిగాలులు అధికమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి చలి తీవ్రతకు ప్రజలు తాళలేకపోయారు. ఒక వైపు బంగాళాఖాతంలో అల్పపీడనంపై వాతావరణ శాఖ ప్రచారం చేసినా మన్యంలో మాత్రం పొగమంచు దట్టంగా కురిసి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం విశేషం. బుధవారం ఉదయం 9.30 గంటల వరకు ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురిసింది. సూర్యోదయం ఆలస్యమైంది. మన్యంలో వృద్ధులు, చిన్నారులు చలితో అవస్థలు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు పొగమంచు, చలితీవ్రతతో వణుకుతున్నారు. మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల, మోతుగూడెం, చింతూరు ప్రాంతాల్లో కూడా చలితీవ్రత నెలకొంది. ఘాట్ ప్రాంతాల్లో పొగమంచు తీవ్రతతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. అయితే చలిగాలులు విజృంభించినప్పటికీ పర్యాటకుల తాకిడి మన్యానికి ఏమాత్రం తగ్గలేదు. పొగమంచు ప్రకృతి అందాలను తనివితీరా వీక్షిస్తూ మధురానుభూతి పొందుతున్నారు. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 8.2 డిగ్రీలు మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో 9.0 డిగ్రీలు అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 9.7 డిగ్రీలు -
9న అల్పపీడనం.. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో 9న ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దక్షిణ కోస్తా, రాయలసీమపై కొద్దిపాటి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అధికారుల అంచనా. శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం.. వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. 48 గంటల్లోనే బలహీనపడి పుదుచ్చేరి, చెన్నై మధ్య 11, 12 తేదీల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం తమిళనాడు చెన్నై పైనే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఏపీలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కెల్లా కర్నూలులో అత్యధికంగా 33.8(+2.2) డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. -
మీ ఇల్లు చల్లగుండ!
సాక్షి, అమరావతి: కూల్ రూఫ్ పెయింట్ ద్వారా జగనన్న కాలనీల్లోని ఇళ్లలో ఉష్ణోగ్రతలు తగ్గించడంపై ప్రయోగం చేపడుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఇండో–స్విస్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ (బీఈఈపీ) ద్వారా జగనన్న కాలనీల్లోని ఇళ్లల్లో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం), అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) చేపడుతున్న కూల్ రూఫ్ ప్రాజెక్టుపై మంగళవారం విజయవాడలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. దీనికి అజయ్జైన్ వర్చువల్గా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం వార్షిక విద్యుత్ డిమాండ్ 60,943 మిలియన్ యూనిట్లు ఉంటే, అందులో భవనాలకు వాడుతున్నది 17,514 మిలియన్ యూనిట్లు (28 శాతం) ఉందన్నారు. దీన్ని తగ్గించేందుకు జగనన్న ఇళ్లల్లో విద్యుత్ ఆదా చర్యలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కూల్ రూఫ్ను విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ జిల్లాల్లోని పన్నెండు ఇళ్లపై వేసి వచ్చే ఫలితాలను అధ్యయనం చేస్తామన్నారు. -
దేశంలో మళ్లీ బొగ్గు సంక్షోభం.!
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా బొగ్గు సంక్షోభం మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గతేడాది అక్టోబర్లో మొదలైన బొగ్గు సంక్షోభం ఆ తరువాత కాస్త తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ ఏడాది మార్చి నుంచే ఉష్ణోగ్రతలు పెరగడంతో వేసవిలో మరోసారి బొగ్గు కొరత ఏర్పడింది. వర్షాలు కురిసే వరకూ సాధారణ స్థితికి చేరలేదు. మూడోసారి వచ్చే ఆగస్టులో బొగ్గు సంక్షోభం ముంచుకురానుందని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేయడంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో ఇదీ పరిస్థితి: దేశ వ్యాప్తంగా 180 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుండగా ప్రస్తుతం వాటిలో 74 కేంద్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. కేవలం సొంత బొగ్గు గనులున్న కేంద్రాలు మాత్రమే 92 శాతం నిల్వలతో ఉన్నాయి. దిగుమతిపై ఆధారపడే కేంద్రాల్లో అవసరమైన దానిలో 45 శాతం మాత్రమే బొగ్గు ఉంది. ఆగస్టులో వర్షాలతో బొగ్గు తవ్వకాలకు ఆటంకం, రవాణాలో తలెత్తే ఇబ్బందుల వల్ల ఈ నిల్వలు మరింత తగ్గిపోనున్నాయి. బొగ్గు ద్వారా జరిగే విద్యుత్ ఉత్పత్తి 204.9 గిగావాట్లు కాగా, దీనిలో 17.6 గిగావాట్లు విదేశీ బొగ్గుతో జరుగుతోంది. ఇందుకోసం 64.89 మిలియన్ టన్నుల బొగ్గును జూన్లో సరఫరా చేశారు. గతేడాది కంటే ఇది 30.8 శాతం ఎక్కువ. అయితే దేశంలో బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం 1,500 మిలియన్ టన్నులుంటే దానిలో సగమే జరుగుతోంది. రాష్ట్రంలో ఇదీ పరిస్థితి రాష్ట్రంలో ప్రస్తుతం 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. గతేడాది ఇదే సమయానికి రోజు 140 మిలియన్ యూనిట్లు వినియోగం జరిగింది. ఈ ఏడాది 35 శాతం డిమాండ్ పెరిగింది. జెన్కో థర్మల్ కేంద్రాల నుంచి 50 మిలియన్ యూనిట్లు మాత్రమే వస్తోంది. బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ. 6.45 చొప్పున 21.81 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా, ఇక్కడ ప్రస్తుతం 68,457 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఇవి సుమారు 3 రోజులకు సరిపోతాయి. శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ (కృష్ణపట్నం)లో రోజుకి 19 వేల మెట్రిక్ టన్నులు ఖర్చవుతుండగా 3,25,129 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. దీంతో దాదాపు 17 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఏపీ సన్నద్ధం ఆగస్టులో బొగ్గు సంక్షోభం, విద్యుత్ డిమాండ్ వల్ల వచ్చే విద్యుత్ ఇబ్బందులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఇంధన శాఖ సన్నద్ధమవుతున్నాయి. ఏపీ జెన్కో, ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్)లు 31 లక్షల టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నాయి. దీనిని నిల్వ చేసి సంక్షోభం తలెత్తే సమయానికి వినియోగించనున్నారు. అదే విధంగా రాష్ట్రానికి బొగ్గును సరఫరా చేసేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. స్వాపింగ్ విధానంలో ఇతర రాష్ట్రాలకు విద్యుత్ను ఇచ్చిపుచ్చుకునేలా ఇంధన శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఆగస్టులో బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనేందుకు వీలుగా షార్ట్టెర్మ్ టెండర్లు పిలిచారు. -
చల్లటి పవనం పలకరించింది..
సాక్షి, అమరావతి: ఎండ వేడిమితో ఉడికిపోతున్న రాష్ట్రాన్ని నైరుతి రుతు పవనం చల్లగా పలకరించింది. సోమవారం రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు ఇవి విస్తరించాయి. రుతు పవన గాలులు బలంగా ఉండటంతో వచ్చే రెండు రోజుల్లో రాయలసీమలోని మిగిలిన ప్రాంతాలకు, ఆ తర్వాత రెండు రోజుల్లో కోస్తా ప్రాంతాలకు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. చల్లని గాలులు వీస్తూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. రాబోయే ఐదు రోజుల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు ఈ వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 566 మిల్లీ మీటర్లు. ఈసారి దీనికంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈసారి అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఈ నెలలో రెండు, మూడు వారాల నుంచి వర్షాలు బాగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. నైరుతి సీజన్లో సాధారణంగా జూన్, జూలై నెలల్లో ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడతాయి. జులై, ఆగస్టు నెలల్లో మధ్య కోస్తా జిల్లాలు, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. వారం రోజులు ఆలస్యం నైరుతి రుతు పవనాలు ఈసారి వారం రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి వచ్చాయి. అసని తుఫాను ప్రభావంతో కొంచెం ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. గత నెల 28న (సాధారణంగా జూన్ 1న తాకాలి) కేరళను తాకాయి. అదే వేగంతో ముందుకు కదిలి ఈ నెల 3, 4 తేదీల్లో (సాధారణంగా జూన్ 5న) ఏపీలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ రాజస్థాన్ వైపు నుంచి పశ్చిమ గాలుల ప్రభావం తీవ్రమవడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో రుతు పవనాలు కర్ణాటక నుంచి ఏపీ వైపు కదలకుండా ఉండిపోయాయి. ఎట్టకేలకు అనుకూల వాతావరణం ఏర్పడడంతో వారం రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. -
24 గంటల్లో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు వచ్చే 24 గంటల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. ప్రస్తుతం పుణే, బెంగళూరు, పుదుచ్చేరి ప్రాంతాల్లో రుతుపవనాలు కొనసాగుతున్నట్లు పేర్కొంది. సోమవారానికి రాయలసీమ ప్రాంతంతోపాటు తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ మధ్య–వాయవ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లోకి రుతుపవనాలు విస్తరించే అవకాశముందని తెలిపింది. ఆ తర్వాత మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. రుతు పవనాలు విస్తరిస్తున్న క్రమంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 4 నాటికే రుతుపవనాలు రాయలసీమను తాకాల్సి ఉంది. అయితే పశ్చిమ గాలుల ప్రభావం, ఉపరితల ఆవర్తనం వల్ల ఉష్ణోగ్రతలు పెరగడంతో ఏపీలోకి విస్తరించడం ఆలస్యమైంది. ప్రస్తుతం పశ్చిమ గాలుల ప్రభావం తగ్గి ఉష్ణోగ్రతలూ తగ్గడంతో రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయని, 24 గంటల్లో రాయలసీమను తాకుతాయని అధికారులు వివరించారు. -
వడగాడ్పులు.. రెండ్రోజుల్లో రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రుతుపవనాలు రాకపోవడంతో వారం రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోయాయి. శనివారం రాష్ట్రంలోని పలు చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ నమోదైనప్పటికీ... గత నాలుగు రోజుల ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే తక్కువగా నమోదయ్యాయి. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 41.6 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 24 డిగ్రీ సెల్సియస్గా నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రెండ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రాక నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సము ద్రంలోని చాలా భాగాలు, కొంకణ్లోని చాలా ప్రాంతాలు (ముంబైతో సహా), మధ్య మహా రాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ, మధ్య, వాయవ్య బం గాళాఖాతంలో రుతుపవనాలు మరింత ముం దుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నట్లు వివరించింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్న కారణంగా రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఆదివారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని సూచించింది. -
రుతుపవనాల మందగమనం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ముందుకు కదలడంలేదు. ఈ నెల 4వ తేదీనే రాయలసీమను తాకాల్సి ఉన్నా కర్ణాటకలోనే కదలకుండా స్థిరంగా ఉండిపోయాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతి సంవత్సరం జూన్ ఒకటో తేదీన కేరళను తాకి 5వ తేదీకల్లా ఏపీకి విస్తరిస్తాయి. అంటే కేరళను తాకిన నాలుగైదు రోజుల్లో ఏపీలోకి ప్రవేశిస్తాయి. ఈ సంవత్సరం నాలుగు రోజుల ముందుగానే మే 28వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. అక్కడి నుంచి వేగంగా కదిలి 31వ తేదీకి కర్ణాటక, ఏపీ సరిహద్దు వరకు వచ్చాయి. అప్పటి నుంచి బెంగళూరు, ధర్మపురి ప్రాంతంలోనే కదలకుండా ఉండిపోయాయి. మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో రుతుపవనాలు మన రాష్ట్రం వైపు కదలడంలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఒకటి, రెండు రోజుల్లో రుతుపవనాలు రాయలసీమను తాకే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవి ఒకసారి కదిలితే వేగంగా విస్తరిస్తాయని చెబుతున్నారు. అప్పటివరకు కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. -
రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. గత రెండ్రోజులుగా కొనసాగిన భగభగలు శనివారం నాటికి కాస్త చల్లబడ్డాయి. కొన్నిచోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా నమోదు కాగా, మరికొన్ని చోట్ల మాత్రం 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదైంది. మరో రెండ్రోజుల తర్వాత వాతావరణం ఇంకా చల్లబడనుంది. రామగుండంలో 44.4 డిగ్రీల సెల్సియల గరిష్ట ఉష్ణోగ్రత న మోదుకాగా, హైదరాబాద్లో 24.0 డిగ్రీల సెల్సియస్ల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది.ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీ స్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రానున్న రెం డ్రోజులు రాష్ట్రంలోని ఒకట్రెండు జిల్లాల్లో అక్క డక్క డా వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది. -
రానున్న మూడు రోజులు ‘మంట’లే.. వీలైతేనే బయటకు రండి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో మూడు రోజల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటించింది. 83 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 157 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 46ని– 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని జిల్లాల్లో 43ని నుంచి 45, మరికొన్ని జిల్లాల్లో 40–42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఈ మూడు రోజులు ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వడదెబ్బ తగలకుండా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్), లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ తెలిపారు. చదవండి: పందులకూ ఓ పందెం! విజేతలకు రూ.2 లక్షల బహుమతి -
వాతావరణ మార్పులతో నిద్రలేమి
న్యూఢిల్లీ: నిద్రలేమి.. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీనికి ఎన్నో కారణాలుంటాయి. వాతావరణ మార్పులు కూడా మన నిద్రపై ప్రభావం చూపిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. భూగోళం ఇంకా ఇంకా వేడెక్కిపోతూ ఉంటే ఈ శతాబ్దం చివరికి ఒక వ్యక్తి ఏడాది కాలంలో పోయే నిద్రలో 50 నుంచి 58 గంటలు తగ్గిపోతుందని జర్నల్ వన్ ఎర్త్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. అంటే మనం పడుకునే సమయంలో రోజుకి పది నిముషాలు తగ్గిపోతుంది. మనం ఎంత సేపు, ఎంత గాఢంగా నిద్రపోతున్నామో చెప్పే రిస్ట్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్ల ద్వారా సేకరించిన గణాంకాలతో ఈ అధ్యయనం రూపొందించారు. మొత్తం 68 దేశాల్లో 47 వేల మంది రాత్రిపూట ఎంతసేపు నిద్రపోయారో రెండేళ్ల పాటు వివరాలు సేకరించారు. ‘‘వాతావరణంలో వస్తున్న మార్పులతో రాత్రిళ్లు వేడిగా మారుతున్నాయి. దీని ప్రభావం వ్యక్తుల నిద్రపై పడుతోంది. వారు నిద్రపోయే సమయం క్రమక్రమంగా తగ్గిపోతోంది.’’ అని ఈ అధ్యయనం సహరచయిత కెల్టన్ మినార్ చెప్పారు. ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయేవారి సంఖ్య 3.5% పెరిగినట్టు ఆ అధ్యయనం వెల్లడించింది. మనుషులు నిద్రపోయే సమయంలో మనుషుల శరీరం వేడిని నిరోధిస్తూ చల్లగా, హాయిగా ఉండేలా చేస్తుంది. బయట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటే అలా వేడిని నియంత్రించడం కష్టంగా మారుతుందని ఆ అధ్యయనం వివరించింది. -
ఠారెత్తిస్తున్న ఎండలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల నుంచి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రత కొనసాగుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వేడితోపాటు ఉక్కపోత పెరిగిపోతోంది. ఉదయం 9 గంటలకే.. మధ్యాహ్నం 12 గంటలకు ఉండే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఉష్ణోగ్రతలు పెరగడం, మరోవైపు గాలిలో తేమ శాతం తగ్గడంతో తీవ్ర వేడి వాతావరణం ఉంటోంది. ఎండ, వడ గాల్పులు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బుధవారం రోహిణి కార్తె కావడంతో రెండు, మూడు రోజులు ఎండ తీవ్రత ఇంకా పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. వచ్చే వారం పాటు ఎండలు ఎక్కువగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, ఉండ్రాజవరం, అత్తిలిలో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కామవరపుకోటలో 45.6, కృష్ణా జిల్లా నందివాడ, గుడివాడల్లో 45.3, తాళ్లపూడి, గోపాలపురంల్లో 44.9, ఉంగుటూరులో 44.8, రాజమహేంద్రవరంలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, దక్షిణ, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో ఇవి మరింత ముందుకు సాగేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది. ఈ నెల 26న శ్రీలంకను, జూన్ 1న కేరళను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలున్నాయి. -
సమృద్ధిగా వర్షాలు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది కూడా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవనున్నాయి. గత సంవత్సరానికంటే మెరుగ్గా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతు పవనాలు ముందే దేశంలోకి ప్రవేశిస్తుండటం, అవి బలంగా ఉండడంతో ఈ సీజన్లో వర్షాలు బాగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారానికి నైరుతి రుతు పవనాలు ఈశాన్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయి. ఈ నెల 27వ తేదీకి కేరళను తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత వారంలోనే.. అంటే జూన్ 4, 5కల్లా రాష్ట్రంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో కేరళను తాకుతాయి. గత ఏడాది జూన్ 3న కేరళలో ప్రవేశించి 10న ఏపీలోకి వచ్చాయి. ఈ సంవత్సరం ఇంకా ముందే వస్తుండటం వ్యవసాయానికి అనుకూలమని భావిస్తున్నారు. మండుతున్న ఎండల నుంచి కూడా ఉపశమనం లభించనుంది. అసని తుపానుతో అనుకూల పరిస్థితులు ఇటీవల వచ్చిన అసని తుపాను వల్ల వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. భూమధ్య రేఖ వద్ద ఉండే గాలులు, ఉత్తర, పశ్చిమ భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడం, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే గాలులు బలంగా ఉండడం వంటి పలు అంశాలు నైరుతి రుతు పవనాలకు అనుకూలంగా మారాయి. దీనికి సముద్రంలో లానినో పరిస్థితులు కూడా కలిసి వచ్చింది. మామూలుగా మే 22కి దక్షిణ అండమాన్, ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లోకి నైరుతి రుతు పవనాలు వస్తాయి. అయితే ప్రస్తుతం ఉన్న అనుకూల పరిస్థితుల వల్ల 15వ తేదీకే అవి అక్కడకు చేరాయి. అక్కడి నుంచి కేరళకు తర్వాత ఏపీకి రానున్నాయి. ఎండలు కొద్ది రోజులే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరో వారం, పది రోజులు మాత్రమే కొనసాగుతాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు వరకు 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. జూన్ మొదటి వారం నుంచి వాతావరణం చల్లబడి, వర్షాలు కురిసేందుకు అనువైన పరిస్థితులు నెలకొంటాయి. -
యుద్ధ ప్రాతిపదికన బొగ్గు సేకరణ
సాక్షి, అమరావతి: భానుడి ఉగ్రరూపంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. విద్యుత్కు విపరీతంగా డిమాండ్ ఏర్పడడంతో.. దేశంలోని అనేక రాష్ట్రాలు విద్యుదుత్పత్తిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగానూ, అంతర్జాతీయంగానూ బొగ్గు సమస్య తీవ్రమై ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభావం దిగుమతులపైనా పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలుగకుండా బొగ్గు నిల్వలు పెంచుకోవాలని ఇంధన శాఖను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో దాదాపు 32 లక్షల టన్నుల బొగ్గును సమకూర్చుకోవడానికి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రికార్డు స్థాయిలో వినియోగం.. రాష్ట్ర్రంలో పీక్ డిమాండ్ రికార్డులు సృష్టిస్తోంది. ఏప్రిల్ 8న అత్యధికంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 12,293 మెగావాట్లకు చేరింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్. ఈ నెల ప్రారంభంలో దాదాపు 11,767 మెగావాట్లుగా ఉన్న డిమాండ్ ప్రస్తుతం 9,711 మెగావాట్లుగా ఉంది. ఇక రోజువారీ విద్యుత్ డిమాండ్కు తగ్గట్టుగా 200 మిలియన్ యూనిట్లను విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సరఫరా చేస్తున్నాయి. దీనిలో బుధవారం రూ.56.75 కోట్లతో 40.32 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్నుంచి యూనిట్ రూ.14.07 చొప్పున కొనుగోలు చేశారు. నెలలోపే టెండర్లు ఖరారు.. కొరతను అధిగమించేందుకు బొగ్గును దిగుమతి చేసుకోవటానికి అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ జెన్కోను ఆదేశించింది. దీంతో కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల ఉత్పత్తిని పెంచడానికి ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లక్ష టన్నుల దిగుమతి చేసుకున్న మెరుగైన గ్రేడ్ బొగ్గు కోసం టెండర్లు పిలిచింది. అదే విధంగా ఏపీజెన్కో 18 లక్షల టన్నుల కోసం, ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) 13 లక్షల టన్నుల కోసం తాజాగా టెండర్లు ఆహ్వానించాయి. ఈ మొత్తం టెండర్ల ప్రక్రియను నెల రోజుల్లోపే పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎక్కడా దొరకని బొగ్గు, విద్యుత్.. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో 0.83 రోజులు, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో 2.10 రోజులు, కృష్ణపట్నంలో 6.02 రోజులు, హిందుజాలో 4.24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మన రాష్ట్రంలో బొగ్గు క్షేత్రాలు లేకపోవడంతో మహానది కోల్ ఫీల్డ్స్, సింగరేణి కాలరీస్పై ఆధారపడాల్సి వస్తున్నది. అక్కడి నుంచి కూడా తగినంత బొగ్గు సరఫరా జరగడం లేదు. ఈ నేపథ్యంలో అవసరమైన బొగ్గును అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మరోవైపు విద్యుత్ ఎక్సే్ఛంజీల్లోనూ కరెంటు పరిమితంగానే దొరుకుతోంది. కొనుగోలు వ్యయం గత పదేళ్లలో లేనంతగా రికార్డు స్థాయికి చేరుకుంది. యూనిట్ రూ.12 నుంచి 16 వరకు పలుకుతోంది. పీక్ అవర్స్లో రూ.20కి కూడా కొనాల్సి వస్తోంది. -
వడగాలి.. చల్లబడుతోంది
సాక్షి, అమరావతి: గత రెండేళ్లుగా రాష్ట్రంలో అధిక వేడి (వడ గాలి, హీట్ వేవ్) నమోదవుతున్న రోజుల సంఖ్య తగ్గుతున్నట్లు కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక – 2022 వెల్లడించింది. ఇదే సమయంలో చలి వాతావరణం ఉండే రోజుల సంఖ్య పెరుగుతోంది. అయితే, చలి రోజుల్లో కొంత హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సంవత్సరాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజులు, చలి వాతావరణం ఉన్న రోజుల వివరాలను నివేదిక వివరించింది. ► రాష్ట్రంలో 2014 సంవత్సరంలో 16 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవగా, ఆ తర్వాతి సంవత్సరాల్లో కొంత తగ్గాయి. 2019 సంవత్సరంలో 13 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2020లో 3 రోజులు, 2021లో నాలుగు రోజులు మాత్రమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదిక తెలిపింది. ► అత్యల్ప ఉష్ణోగ్రతలు 2014లో మూడు రోజులు మాత్రమే. 2021లో ఒక రోజే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. కానీ ఈ సంఖ్య 2018లో 8 రోజులు, 2020లో 6 రోజులుగా ఉంది. ► ఇతర రాష్ట్రాల్లో 2014లో ఒడిశాలో అత్యధికంగా 17 రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 12 రోజులు చొప్పున, రాజస్థాన్లో 11 రోజులు, మధ్యప్రదేశ్లో 10 రోజులు, తెలంగాణలో రెండు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత 2019లో ఎక్కువ రాష్ట్రాల్లో ఎక్కువ రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. గత రెండేళ్లుగా అన్ని రాష్ట్రాల్లోనూ వేడి రోజులు తగ్గిపోయినట్లు తెలిపింది. హీట్ వేవ్ అంటే.. ఏదైనా ప్రదేశంలో వరుసగా రెండు రోజులు 45 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే హీట్ వేవ్ పరిస్థితులుగా పరిగణిస్తారు. రాష్ట్రంలో 2016 మే 2వ తేదీన ప్రకాశం జిల్లా వెలిగండ్లలో అత్యధికంగా 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2017 మే 17వ తేదీన ప్రకాశం జిల్లా టంగుటూరులో అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2020 మే 23న ప్రకాశం జిల్లా కనిగిరిలో 47.8 డిగ్రీలు, 2021 మార్చి 31 ప.గో. జిల్లా పెదపాడులో 45.9 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సమయంలో వేడిగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. -
మూడు రోజులు మంటలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని.. ఈ నెల 6, 7, 8 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 42.8 డిగ్రీలుగా.. అతితక్కువగా కనిష్ట ఉష్ణోగ్రత హైదరాబాద్లో 20.4 డిగ్రీలుగా నమోదైనట్టు వెల్లడించింది. విదర్భ నుంచి తెలం గాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఉందని.. దాని ప్రభావంతో రెండ్రోజుల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయంది. -
ఎండలు ‘మండే’న్
సాక్షి, అమరావతి: భానుడి భగభగలు నిప్పుల కొలిమిని తలపించాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండాయి. వేడి తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో సోమవారం 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా చందర్లపాడు, కంచికచర్లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నందలూరు, పెనగలూరు, చిట్వేల్, ప్రకాశం జిల్లా దోర్నాలలో 43.4 డిగ్రీలు, కర్నూలు జిల్లా కల్లూరు, వెల్దుర్తి, నెల్లూరు జిల్లా గూడూరు, తిరుపతి అర్బన్లో 43.1 డిగ్రీలు, కర్నూలు, కృష్ణా జిల్లా తిరువూరు, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, పుల్లల చెరువు, ముండ్లమూరులో 43 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, రాజమండ్రి, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 42.9 డిగ్రీలు, చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో 42.8, కర్నూలు జిల్లా పాణ్యం, బనగానపల్లె, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 42.6, పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట, కిర్లంపూడి, ప్రకాశం జిల్లా తర్లపాడులో 42.5, చిత్తూరు జిల్లా చిత్తూరు, గుడిపలలో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 152 మండలాల్లో తీవ్రమైన వేడి రాష్ట్రంలో 670 మండలాలు ఉండగా.. 514 మండలాల్లో సోమవారం బాగా వేడి వాతావరణం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 152 మండలాల్లో మాత్రం తీవ్రమైన వేడి గాలులు ఉన్నట్లు పేర్కొంది. నెల్లూరు, వైఎస్సార్, తిరుపతి, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఎక్కువ మండలాల్లో ఎండ ప్రభావం అధికంగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో ఎండ వేడి, ఉక్కపోత వాతావరణంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మంగళ, బుధవారాలు కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. విశాఖ ఏజెన్సీలోనూ అక్కడక్కడా జల్లులు పడ్డాయి. వడదెబ్బకు ఇద్దరు మృతి నారాయణవనం (తిరుపతి): తిరుపతి జిల్లా నారాయణవనంలో వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. స్థానిక కోమటి బజారువీధికి చెందిన దొరస్వామి కుమారుడు ప్రేమ్(12) ఆదివారం వడదెబ్బ బారినపడి తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. అరుణానది సమీపంలోని డంపింగ్ యార్డు వద్ద ప్లాస్టిక్, ఇనుప వ్యర్థాలను సేకరిస్తున్న పళనిస్వామి (47) వడదెబ్బకు గురై అక్కడికక్కడే మరణించాడు. -
ఎండలు తగ్గేదేలే.. ఏకంగా 122 ఏళ్ల గరిష్ట ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: వేసవి రాగానే భానుడు తగ్గేదేలే అన్నట్లు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రత్యేకంగా దేశంలోని వాయువ్య, మధ్య భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు వేసవి తాపాన్ని నుంచి బయటపడేందుక ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వరుసగా 35.9, 37.78 డిగ్రీల సెల్సీయస్ నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ స్థాయి సగటు ఉష్ణోగ్రతలు నమోదు కావడం 122 ఏళ్లలో ఇది నాలుగో సారి. మార్చి, ఏప్రిల్లలో అధిక ఉష్ణోగ్రతలు నిరంతర తక్కువ వర్షపాతం కారణంగా ఉన్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. దేశంలోని వాయువ్య, పశ్చిమ మధ్య భాగాలైన గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు. మే నెలలో ఎండ వేడి మరింత పెరిగే అవకాశమున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా.. పలు ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. వాయువ్య, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు అలాగే తీవ్ర ఆగ్నేయ ద్వీపకల్పంలో మేలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. చదవండి: ఇండియన్ అబ్బాయి.. ఆఫ్రికా అమ్మాయి.. అలా ఒకటయ్యారు! -
నిప్పుల కుంపటి.. జర జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పులకుంపటిలా మారింది. మండు టెండలు, వడగాడ్పులు, ఉక్కబోత రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తున్నాయి. వీటిని తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. మే నెలలో ఎండలు మరింత ముదిరి 45 నుంచి 48 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని వాతావరణ శాఖ సైతం హెచ్చరిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల ఉష్ణోగ్రతలు 42, 43 డిగ్రీలకు చేరుకున్నాయి. హైదరాబాద్సహా మరికొన్ని చోట్ల ఎండ తక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నా, వడగాడ్పుల వేడి, ఉక్కబోత వంటివి జనాలను హడలెత్తిస్తున్నాయి. రాత్రి అయినా చల్లబడని వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మే నెలలో భానుడి భగభగలతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో వడదెబ్బతోపాటు జలుబు, దగ్గు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, మెదడు లాగినట్లు ఉండటం వంటివి చోటుచేసుకుంటాయని పేర్కొంటున్నారు. బరువులు ఎత్తడం, ఇతర శారీరక అలసట కలిగించే పనులేవీ చేయకపోయినా చెమటలు పట్టి శరీరం నుంచి సోడియం, పొటాషియం, క్లోరైడ్స్ తగ్గిపోతాయని, ఆ విధంగా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఇళ్లలో ఉండే వృద్ధులు, చిన్నపిల్లలపైనా అధిక ప్రభావం వృద్ధులు, చిన్నపిల్లలు ఇళ్లలోనే ఉన్నా అధిక ఉష్ణోగ్రతలు వారిపై అధిక ప్రభావం చూపుతాయి. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధుల్లో సోడియం స్థాయిలు తగ్గిపోవడం వల్ల అయోమయం, ఎటూ తోచని తీరుతోపాటు కోమాలోకి వెళ్లే అవకాశాలుంటాయి. వడగాల్పులు చెవుల్లోకి వెళ్లి కళ్లు మంటలెక్కడం, మెదడు ప్రభావితమై, ఒళ్లునొప్పులతో జ్వరమొచ్చినట్టుగా అవుతుంది. ఆహారాన్ని అరిగించే ఎంజైమ్స్ పొడిబారిపోయి నీళ్ల విరేచనాలు వంటి వాటికి దారితీయవచ్చు. అందువల్ల తరచూ నీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు తాగాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఇళ్ల నుంచి బయటకు వెళ్లకపోవడం మంచిది. ఆఫీసుల్లో, ఇళ్లలో ఏసీలు, కూలర్లతో 18–20 డిగ్రీల వాతావరణంలో ఉండి 40 డిగ్రీలకు పైబడిన బయటి ప్రాంతాలకు వెళ్లొద్దు. కొద్దిసమయం 30–35 డిగ్రీలున్న ప్రదేశంలో ఉండి వేడికి అలవాటు పడ్డాక బయటకు వెళ్లాలి. ఒక్కసారిగా వాతావరణ మార్పు సంభవించే చల్లటి ప్రదేశం నుంచి వేడి ప్రాంతానికి, వేడి ప్రదేశం నుంచి చల్లని ప్రాంతాలకు రావడం, పోవడం వంటివి చేస్తే వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ. ఇళ్లలోనే తాజా పండ్లరసాలు, నిమ్మకాయ నీళ్లు, ఉప్పు, చక్కెర కలిపిన పలుచటి మజ్జిగ తాగడం మంచిది. ఎలక్ట్రాల్ నీళ్లు, ఓఆర్ఎస్, ఇతర పానీయాలు తీసుకోవాలి. బయట రంగునీళ్లు, ఈగలు వాలే చెరుకురసాలు, శుభ్రత లేని పానీయాలు, ఎనర్జీ డ్రింకులు తీసుకోవడం వల్ల ఉపయోగం లేకపోగా ఆరోగ్యం పాడయ్యే ప్రమాదముంది. – డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, జనరల్ ఫిజీషియన్, లైఫ్ మల్టీస్పెషాలిటీస్ క్లినిక్ -
వేడెక్కుతున్న మన్యం
సాక్షి,పాడేరు : చల్లని ప్రాంతమైన జిల్లాలో ఎండ తీవ్రత నెలకొంది. శుక్రవారం సూర్యోదయం తరువాత నుంచి ఎండ చుర్రుమంది. పాడేరులో 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఏజెన్సీ వ్యాప్తంగా ఎండ తీవ్రత నెలకొనడంతో అన్ని వర్గాల ప్రజలు ఉష్ణ తాపంతో ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ, ఉపాధిహామీ పనులకు వెళ్లే గిరిజనులతో పాటు పశువుల కాపరులు కూడా అధిక ఎండతో అవస్థలు పడ్డారు. పాడేరు వారపుసంతలో కూడా ఎండతో గిరిజనులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వరకు వేడిమి వాతావరణం నెలకొంది. మండల కేంద్రాలు ప్రధాన జంక్షన్లు, గ్రామాల్లో శీతల పానీయాల అమ్మకాలు జోరందుకున్నాయి. -
14 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం (నేడు)14 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 102 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బయటకు వెళ్లేటప్పుడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఆ.. మండలాలివే.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ, అడ్డతీగల, అనకాపల్లి జిల్లాలోని నాతవరం, నర్సీపట్నం, కాకినాడ జిల్లాలో కోటనంమూరు, పల్నాడు జిల్లాలో అమరావతి, పార్వతీపురం మన్యం జిల్లాలో భామిని, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు, విజయనగరం జిల్లాలో డెంకాడ, వేపాడ, లక్కవరపు కోట మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో 16, నంద్యాలలో 12, అనకాపల్లిలో 11, పల్నాడులో 11, వైఎస్సార్లో 11, పార్వతీపురం మన్యంలో 9, విజయనగరంలో 8 మండలాలతో పాటు మిగిలిన చోట్ల మొత్తం 102 మండలాల్లో వడ గాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. -
నాలుగురోజులు... వడగాల్పులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో వడగాల్పులు నమోదవుతున్నాయి. రానున్న నాలుగు రోజులు పలుచోట్ల వడగాల్పుల తీవ్రంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సూచనలు ఇవ్వాలని సూచించింది. -
4 రోజులు 40 డిగ్రీలకుపైనే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయ్. సోమవారం 40 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపరితల ద్రోణి ప్రభావం, పలుచోట్ల కురిసిన తేలికపాటి వానలతో వాతావరణం చల్లబడటంతో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 39 డిగ్రీల మధ్యనే నమోదయ్యాయి. వాతా వరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతల పెరుగుదల వేగంగా కనిపిస్తోంది. సోమవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా ఆదిలాబాద్లో 43.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సగటున 40డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది. కాగా, ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరఠ్వాడల మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. -
అగ్నిగుండంలా అనకాపల్లి
అనకాపల్లి: భానుడు సెగలు కక్కుతున్నాడు. ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40.5 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఎండవేడి, ఉక్కపోత కారణంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం భయపడుతున్నారు. సాయంత్రం యలమంచిలి పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, చిరుజల్లులు పడడంతో వాతావరణం చల్లబడింది. -
రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు
సాక్షి, అమరావతి: వచ్చే రెండు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దాని ప్రభావంతో ఆదివారం, సోమవారం వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆదివారం ప్రకాశం, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, వివరించారు. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల జల్లులు పడతాయని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పగటిపూట మామూలు వాతావరణమే ఉండి సాయంత్రానికి వర్షాలు పడతాయని, ఉష్ణోగ్రతలు యధావిధిగా కొనసాగే పరిస్థితి ఉందని వివరించారు. కాగా, రాష్ట్రంలో పగటిపూట 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట కూడా సాధారణంగా కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. మూడు రోజుల తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. పిడుగుపడి బాలుడి మృతి మంత్రాలయం రూరల్: పిడుగుపాటుకు గురై ఓ బాలుడు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చమర్రిలో శనివారం చోటుచేసుకుంది. రచ్చమర్రికి చెందిన వేమన్న, నాగమ్మ దంపతుల ద్వితీయ కుమారుడు హరిజన సురేష్ (12) తాత జానయ్య దగ్గర ఉంటూ స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. బాలుడు శనివారం తాతయ్యతో కలిసి పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో పిడుగుపడటంతో సురేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. తాత జానయ్య దూరంగా ఉండటంతో పిడుగు నుంచి తప్పించుకున్నాడు. -
వడదెబ్బ.. తస్మాత్ జాగ్రత్త
మంచిర్యాలటౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మార్చి మాసంలోనే ఎండలు తీవ్రంగా మండుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరిగి పోతుండడంతో బయటకు వెళితే ముచ్చెమటలు పడుతున్నాయి. ఇక వచ్చేది ఏప్రిల్, మే నెలల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో, ఎండలపై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న ఎండ తీవ్రత నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరగనున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారినపడి చిన్నా,పెద్దా అల్లాడిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అసలు వడదెబ్బ అంటే ఏమిటి? దాని లక్షణాలు... నివారణ మార్గాలు మీ కోసం. వడదెబ్బ అంటే.. ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైతే శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై ప్రాణాపా య పరిస్థితి ఏర్పడడాన్ని వడదెబ్బ అంటారు. వేడి వాతావరణం లేదా చురుకైన పనులతో కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలతో శరీర ప్రాథమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తుంది. లక్షణాలివీ... కాళ్ల వాపులు రావడం, కళ్లు తిరగడం, శరీర కండరాలు పట్టుకోవడం, తీవ్ర జ్వ రం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక చెమట పట్ట డం, తల తిరిగి పడిపోవడం వంటి వి జరిగితే వెంటనే స్థానిక ఆసుపత్రికి త రలించి వైద్యం అందించాలి. ప్రాథమిక చికిత్స ►వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడకు తీసుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్తో ఒళ్లంతా తుడవాలి. వదులుగా ఉన్న నూలు దుస్తులు వేయాలి. ►ఫ్యాను గాలి/ చల్లని గాలి తగిలేలా ఉంచాలి. ►ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరిబోండాం లేదా చిటికెడు ఉప్పు, చక్కర కలిపిన నిమ్మరసం, గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణము (ఓ.ఆర్.ఎస్) తాగించవచ్చు. ►వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలి. బారిన పడకుండా ►వేసవి కాలంలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది. రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి. భోజనం మితంగా చేయాలి. ►ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడన/చల్లని ప్రదేశంలో ఉండేందుకు ప్రయత్నించండి. ►గుండె/ఊపిరితిత్తులు/మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారి శరీరాలకు అధిక సూర్యరశ్మి ప్రభావించే వారి శరీరం త్వరగా డీ హైడ్రేషన్కు గురై వ్యాధి తీవ్రతలు అధికంగా ఉంటాయి. ►ఆల్కాహాల్/సిగరేట్/కార్పొనేటెడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. ►ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్, తలకు టోపీ వంటివి ధరించండి. ►వేసవిలో ఉదయం/సాయంత్రం సమయాల్లో బయటికి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. ►వేడి వాతావరణంలో శారీరక శ్రమ కార్యక్రమాలు చేయడం మంచిది కాదు. ఒకవేళ చేస్తే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఒక 5 నిమిషాలు నీడలో ఉండేలా చూసుకోవాలి. ►ఆహారంలో ఎక్కువగా ద్రవపదార్థాలు ఉండేలా చూసూకోవాలి. ►ప్రయాణాల్లో సోడియం, ఎలక్ట్రోలైట్ వంటి ద్రావణాలను తాగడం మంచిది. చేయకూడని పనులు ►మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు. ►రోడ్లపై చల్లని రంగు పానీయాలు తాగవద్దు. ►రోడ్లపై విక్రయించే కలుషిత ఆహారం తినకుండా, ఇంట్లో వండుకున్నవే తినాలి. ►మాంసాహారం తగ్గించి, తాజా కూరగాయల్ని ఎక్కువగా ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం మేలు ►నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చ, కీర, కర్బూజ, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో కడుపు నిండినట్లుగా ఉండి, డైట్ కంట్రోల్ అవుతుంది. ►శీతల పానీయాలు, అధికంగా షుగర్ వేసిన జ్యూస్లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా, కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. ►వేసవిలో ఆకలి తక్కువగాను, దాహం ఎక్కువగాను ఉంటుంది. డైట్ పాటించాలి. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి. అత్యవసరమైతేనే బయటకు.. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడం ఒక్కటే వడదెబ్బ నివారణకు ఏకైక మార్గం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అత్యవసరం అయితే మాత్రమే తలకు టోపి ధరించి వెళ్లాలి. చెమట రూపంలో శరీరంలోని లవణాలు బయటకు పోతాయి. అందుకే లవణాలతో కూడిన ద్రవాన్ని తీసుకోవాలి. కొబ్బరి నీరు, ఉప్పు, చెక్కర, నిమ్మరసంతో కలిపిన నీటిని తాగాలి. – డాక్టర్ కొమ్మెర వినయ్, జనరల్ ఫిజిషీయన్, జిల్లా ఆసుపత్రి వైద్యుడు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలను ఎండ వేడికి బయటకు పంపించవద్దు. 3 లీటర్లకు పైగా నీటిని తాగాలి. నవజాత శిశువులను పూర్తిగా కప్పి ఉంచకుండా, పల్చటి గుడ్డతో సగం వరకు కప్పి ఉంచాలి. పుట్టిన బిడ్డకు 6నెలల వరకు తల్లిపాలనే ఇవ్వాలి. ఇంట్లోనే ఉండే పిల్లలకు వేడి తగలకుండా, చల్లగా ఉండేలా జాగ్రత్తలను తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులను వేయాలి. కాచి చల్లార్చిన నీరు, ఫిల్టర్ నీటినే పిల్లలకు ఇవ్వాలి. – డాక్టర్ బొలిశెట్టి కళ్యాణ్కుమార్, పిల్లల వైద్యుడు, జిల్లా ఆసుపత్రి -
పెరుగుతున్న విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి బ్యూరో: ఎండలతో పాటే విద్యుత్ వాడకం కూడా పెరిగిపోతోంది. ఈ ఏడాది మార్చి మొదటి వారం నుంచే మండుటెండలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సాధారణం కంటే 2–4 డిగ్రీలు అధికంగా (40 డిగ్రీలకు పైగా) ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యలో ఒకింత తగ్గినట్లు అనిపించినా పది రోజులుగా మళ్లీ సెగలు మొదలయ్యాయి. సరఫరాకు మించి డిమాండ్ నెలకొనడంతో పవర్ ఎక్చేంజ్లో యూనిట్ రూ.8–20 వరకు వెచ్చించి అత్యవసరంగా అప్పటికప్పుడు విద్యుత్ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది ప్రభుత్వానికి ఎంతో భారమైనప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వెచ్చిస్తోంది. గత సంవత్సరం కోవిడ్ ప్రభావం వల్ల డిమాండ్ లేకపోవడంతో మార్కెట్లో కాస్త చౌకగానే విద్యుత్ లభ్యమైంది. లభ్యత ఇదీ.. రాష్ట్రంలో ఏపీ హైడెల్ నుంచి 1,728 మెగావాట్లు, ఏపీ థర్మల్ నుంచి 5,010, జాయింట్ సెక్టార్ నుంచి 34, సెంట్రల్ సెక్టార్ నుంచి 2,403, ప్రైవేటు సెక్టార్ (గ్యాస్) నుంచి 1,492, ప్రైవేటు సెక్టార్ (విండ్) నుంచి 4,179, ప్రైవేటు సెక్టార్ (సోలార్) నుంచి 3,800, స్టేట్ పర్చేజెస్ ద్వారా 631, ఇతరుల ద్వారా 585 వెరసి 19,862 మెగావాట్ల విద్యుత్ లభ్యత ఉంది. ఈ సంవత్సరం 11,991 మెగావాట్ల డిమాండ్ ఉంటుందని, సగటున మార్చిలో రోజుకు గ్రిడ్ డిమాండ్ 228 మిలియన్ యూనిట్ల వినియోగం అవుతుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. గత ఏడాది మార్చి 26న పవర్ గ్రిడ్ డిమాండ్ 219.334 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఈ ఏడాది మార్చి 26న 228.428 మిలియన్ యూనిట్లు ఉంది. వృథా నివారించాలి.. సరఫరాకు మించి డిమాండ్ పెరుగుతున్నందున వినియోగదారులు విద్యుత్ వృథా నివారించాలి. అత్యవసరమైనవి మినహా ఇతర విద్యుత్ ఉపకరణాలను వాడవద్దు. సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు విద్యుత్ వాడకంలో నియంత్రణ పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. –జె.పద్మ జనార్దనరెడ్డి, సీఎండీ, ఏపీసీపీడీసీఎల్ ఏప్రిల్ 15 తర్వాత ఊరట! విద్యుత్ డిమాండ్కు ఏప్రిల్ 15 తర్వాత కాస్త ఉపశమనం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అప్పటికి వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. రోజుకు సగటున వినియోగం 223 మిలియన్ యూనిట్లకు తగ్గవచ్చని పేర్కొంటున్నారు. అయితే వేసవి తీవ్రత పెరిగితే మళ్లీ డిమాండ్ అధికమయ్యే పరిస్థితి తలెత్తే అవకాశం లేకపోలేదంటున్నారు. -
ఆదిలాబాద్లో 42 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: మార్చి చివరి నాటికే ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. మంగళవారం ఆదిలాబాద్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, రామగుండంలలో 41 డిగ్రీలు రికార్డయింది. హైదరాబాద్లో సాధారణం కంటే 2.8 డిగ్రీలు, నిజామాబాద్లో 2.6 డిగ్రీలు, మెదక్ 2.5 డిగ్రీలు, రామగుండం 2.4 డిగ్రీలు నమోదైంది. మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయని.. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితేంటని ఆందోళన వ్యక్తమవుతోంది. బుధవారం నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముంది. ఏప్రిల్ ఒకట్రెండు తేదీల్లో రాష్ట్రంలోని వాయువ్య జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
ఎండలు మండుతాయ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రెండ్రోజుల క్రితం వరకు సాధారణ వాతావరణం ఉండగా.. వాతావరణ మార్పులతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. మంగళవారం పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల నుంచి 5.2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కావడం గమనార్హం. రానున్న అయిదు రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే అత్యధికంగా నల్గొండ కేంద్రంలో 41.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 డిగ్రీల సెల్సియస్ అధికమని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. రానున్న ఐదురోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలో సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీలు అధికంగా, మిగతా జిల్లాల్లో 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. -
AP: ఎండ 'మండింది'
సాక్షి, అమరావతి: వేసవి ప్రారంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత పెరిగింది. ప్రస్తుతం 37 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత సంవత్సరం పలుచోట్ల ఇదే సమయానికి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నా ఎండ వేడి మాత్రం గతంకంటె తీవ్రంగా ఉంది. ఉదయపు ఉష్ణోగ్రతలు పెరగడమే ఇందుకు కారణమని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. గతంలో ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండేవి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ఇప్పుడు ఉదయపు ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 2, 3 డిగ్రీల వరకు పెరుగుతున్నాయి. దీంతో రోజులో ఎండ వేడి ఎక్కువవుతోంది. మరోవైపు గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం వల్ల కూడా ఎండ వేడిమి పెరగడానికి కారణమవుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఉదయం, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ప్రభావంతో భూమి త్వరగా వేడెక్కుతోంది. ఫలితంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనా ఎక్కువ గంటలు ఎండలు కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువే ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెలలో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రత 45.9 డిగ్రీలు. ఈ సంవత్సరం 1, 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగి 47 దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. బుధవారం కర్నూలు జిల్లా అవుకులో 39.3 డిగ్రీలు, నందవరంలో 39.2, తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో 39.1, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 39, గుంటూరులో 38, విజయవాడలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
రెండ్రోజులు తగ్గనున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: బిహార్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు ఏర్పడిన ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి శనివారం బలహీన పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నట్టు వివరించింది. ఉపరితల ద్రోణి బలహీనపడిన ప్పటికీ రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ మేర తగ్గుదల నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతుందని సూచించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 8.2 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 32.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. -
మన్యంలో విజృంభిస్తున్న చలి
పాడేరు/అరకులోయ: విశాఖ ఏజెన్సీలో మళ్లీ చలి గాలులు విజృంభిస్తున్నాయి. మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం తెల్లవారుజామున చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 5.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యల్పమని పరిశోధన స్థానం ఇన్చార్జి చెప్పారు. జి.మాడుగులలో 5.58, జి.కె.వీధిలో 5.72, అరకులోయలో 6.45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నెలకొన్నాయి. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 9 డిగ్రీలు, అరకులోయ కేంద్రం కాఫీబోర్డు వద్ద 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అర్ధరాత్రి నుంచే పొగమంచు దట్టంగా కురవడంతో ఉదయం 9.30 గంటల వరకు ఏజెన్సీలోని అరకులోయ, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో సూర్యోదయం కాలేదు. మంచు తీవ్రత చలిగాలులతో వ్యవసాయ పనులు, వారపుసంతలకు వెళ్లే గిరిజనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచుతో పాడేరు, చింతపల్లి, అనంతగిరి ఘాట్ రోడ్లలో వాహన చోదకులంతా లైట్లు వేసుకునే వాహనాలు నడిపారు. -
మన్యంలో చలి పులి
పాడేరు: విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతుండడంతో పాటు పొగమంచు దట్టంగా కురుస్తున్నది. చింతపల్లిలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు దిగజారాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లి ప్రాంతంలో సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వ్యాప్తి చెందుతుండడంతో మన్యం వాసులు చలిపులితో ఇబ్బందులు పడుతున్నారు. గురువారం పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 10 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీబోర్డు వద్ద 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఎముకలు కొరకని చలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణస్థితికి చేరుకుంటున్నాయి. వారంరోజులుగా సాధారణం కంటే 5 డిగ్రీల మేర పతనమైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు పెరుగుతున్నాయి. శుక్రవారం మెదక్లో కనిష్ట ఉష్ణోగ్రత 8.8 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత దుండిగల్, నల్లగొండలో 32 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రానున్న రెండ్రోజులు సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
వణుకుతున్న తెలంగాణ.. ఈ సీజన్లోనే అత్యల్పం నమోదైంది అక్కడే..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో చలిగాలులు వణుకు పుట్టిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో సాయంత్రం ఆరేడు గంటల నుంచే చలి ప్రభావం చూపిస్తోంది. హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలులతో రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఒక్కరోజులోనే కనిష్ట ఉష్ణోగ్రత దాదాపు మూడు డిగ్రీలు తగ్గిపోవడం చలి తీవ్రతను స్పష్టం చేస్తోంది. సోమవారం ఈ సీజన్లోనే అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరు(యూ)లో 6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. మంగళవారం ఇదే జిల్లాలోని గిన్నెదరిలో 3.5 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. సిర్పూరు(యూ)లో 3.8 నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లా బేలాలో కూడా 3.8, అర్లి(టీ)లో 3.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీనికి ముందు 2015 జనవరి 10న సంగారెడ్డిలోని కోహిర్లో తెలంగాణ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. అంతకుముందు 2014 డిసెంబర్ 18న కామారెడ్డి జిల్లా మద్నూర్లో 2.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆ తర్వాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే మొదటిసారి. దీంతో అత్యవసరం అయితే తప్ప రాత్రి, ఉదయం పూట ప్రజలు బయటికి రావడం లేదు. తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంటోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరో వారం రోజుల పాటు గణనీ యంగా పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతా వరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొ న్నారు. బుధవారం రాత్రి కొన్ని ప్రాంతాల్లో సాధా రణ ఉష్ణోగ్రతల కన్నా 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశముందని నాగరత్న తెలిపారు. ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం చలికాలంలో చాలామందిలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఎక్కువగా కన బడుతుంటాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదముంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు రెండు పూటలా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ కాలంలో చర్మంపై దద్దుర్లు, అలర్జీలు వస్తుం టాయి. కాబట్టి ఉన్ని దుస్తులు ధరించాలి. చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ వాడాలి. వాహ నదారులు స్వెటర్లు, సాక్స్, గ్లౌజ్లు వాడాలి. వేపుడు పదార్థాలు, మసాలాలు కాకుండా పోష కాలు ఉండే ఆహారం, కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తాగాలి. ఆహారం కూడా వేడివేడిగా తీసుకోవాలి. అస్తమా, టీబీ వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. గుండె జబ్బులు ఉన్నవారు ఉదయం చలిగాలిలో వాకింగ్ చేయకూడదు. ఉదయం 8 గంటలకు ముందు, సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వెళ్లకూడదు. వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. –డాక్టర్ హెఫ్సిబా, హైదరాబాద్ -
రాష్ట్రం గజగజ
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. విశాఖ ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్పంగా మంగళవారం విశాఖ జిల్లా జి.మాడుగులలో 3.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు లోయలో 3.9, డుంబ్రిగూడ 4.4, జీకే వీధి 4.8, ముంచంగిపుట్టు 5.1, పెదబయలు 5.2, హుకుంపేట 5.9, పాడేరులో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్లో 7.1 డిగ్రీలు నమోదైంది. విజయవాడలోనూ చలి తీవ్రత పెరగడంతో మంగళవారం 13.8 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 13.6 నమోదైంది. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరులో 14.2, తిరుపతిలో 15.9, విశాఖలో 18.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఆరు.. వణికారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇప్పటివరకు సీజన్లో నమోదైన అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత ఇదే. ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 6.2 డిగ్రీల సెల్సియస్, ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 6.4 డిగ్రీల సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధాన నగరాల వారీగా పరిశీలిస్తే.. మెదక్లో గరిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 7.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. సోమవారం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదయ్యాయని, రానున్న రెండ్రోజులూ ఇదే తరహాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. -
వణికిస్తున్న చలి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో చలి పులి పంజా విసురుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఈ నెల 21న వాయుగుండంగా మారనుంది. ఇది థాయ్లాండ్ వైపుగా ప్రయాణించనుంది. దీని ప్రభావంతో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరో 10 రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణం కంటే.. 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గడం, దీనికి తోడు గాలులు వీస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు పడిపోతే అతి శీతల గాలులు(కోల్డ్వేవ్స్)గా ప్రకటిస్తారు. ఏజెన్సీలో పలు చోట్ల ఈ తరహా కోల్డ్ వేవ్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్టులో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల కనిష్టానికి పడిపోయాయి. డుంబ్రిగుడలో 8, అరకు, జి.మాడుగుల, లంబసింగిలో 9, పెదబయలులో 9.5, పాడేరులో 11, చింతపల్లిలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నిష్క్రమించిన ఈశాన్య రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం నుంచి ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించాయి. దీనికి తోడు మధ్య భారతదేశం నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టనున్నాయి. బుధవారం నుంచి చలి గాలుల తీవ్రత పెరుగుతుందని, మొత్తంగా శీతాకాలం పూర్తిగా ప్రవేశించినట్లేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ శీతాకాలంలో రాష్ట్రంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా సాధారణ పరిస్థితులే కనిపిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతల ప్రభావం మామూలుగా ఉన్నట్లు కనిపించినా.. ఈశాన్య గాలులు వీస్తుండటం, మంచు ప్రభావంతో చలి వణికించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. రెండు రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. -
విశాఖ ఏజెన్సీలో చలి పులి
పాడేరు: విశాఖ ఏజెన్సీలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో పాటు అర్ధరాత్రి నుంచే పొగ మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. నాలుగు రోజుల నుంచి ఏజెన్సీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతున్నాయి. గురువారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 10.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 11 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 14.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం వేళల్లో కూడా 24 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదవుతోంది. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు అధికమవుతున్నాయి. ఏజెన్సీలోని అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, పాడేరు, చింతపల్లి, సీలేరు ప్రాంతాలను సందర్శిస్తున్న పర్యాటకులంతా ఏజెన్సీలోని శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.