విజయవాడ: కాపుల రిజర్వేషన్లపై చంద్రబాబుది మోసపూరిత విధానమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికలు, ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో కాపులను ప్రభావితం చేసేందుకు ప్రభుత్వం మరో వంచనకు దిగిందని ఆయన ధ్వజమెత్తారు. మంజునాథ్ కమిషన్ నివేదిక ఏమైంది..? కమిషన్ ఎటువంటి సిపార్సులు చేసిందో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఏ ప్రతిపాదికన చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశ్నించారు.
మంజునాధ్ కమిషన్ నివేదిక రాకుండానే కాపులకు విద్య, ఉద్యోగాలల్లో రిజర్వేషన్ అని చంద్రబాబు చెప్పడం కాపులను మరోసారి మోసం చేయడమేనని మండిపడ్డారు. మంజునాథ్ కమిషన్ నివేదిక ఎప్పటిలోగా పూర్తి అవుతుందో సృష్టం చేయాలని కోరారు. కాపుల రిజర్వేషన్ అంశంపై బీజేపీ, ఎన్డీఏ తన అభిప్రాయం సృష్టం చేయాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా కాపులకు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఏమీలేదన్నారు. ముద్రగడ్డ పద్మనాభంపై నిర్బంధం ఎత్తివేయాలని రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు.