బైక్ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి
Published Sat, Aug 31 2013 3:56 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
తుమ్మపూడి(దుగ్గిరాల),న్యూస్లైన్: ఇంటి ముందు రోడ్డుపై నిలబడిన మూడేళ్ల చిన్నారి బైక్ ఢీకొట్టడంతో మృతిచెందింది. ఈ ఘటన శుక్రవారం మండలంలోని తుమ్మపూడి గ్రామంలో విషాదం నింపింది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరంకి శివరామకృష్ణ ఆటో నడుపుకుంటూ జీవిస్తాడు. అతనికి భార్య తిరుపతమ్మ, కుమార్తె జ్యోతీమహాలక్ష్మి(3), మరో బాబు ఉన్నారు.
శుక్రవారం ఇంటి ముందు రోడ్డుపై నిలిపిన ఆటోను శుభ్రం చేస్తున్న తండ్రి పక్కన మహాలక్ష్మీ నిలబడి ఉంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన యువకుడు షేక్ బర్కత్ బైక్పై వేగంగా వెళ్తూ చిన్నారిని ఢీకొట్టాడు. 30 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లగా చిన్నారి మట్టిగుట్టపై పడింది. తీవ్రంగా గాయపడిన బాలికను ఆటోలో తెనాలి ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఆస్పత్రికి తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. ఎస్ఐ చరణ్ వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం కుటుంభ సభ్యులకు అందజేశారు. చిన్నారి మృతితో శివరామకృష్ణ కుటుంబం సోకసంద్రంలో మునిగిపోయింది. సర్పంచ్ రాయపూడి ప్రభావతి, మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
Advertisement
Advertisement