బేస్‌బాల్ పురుషుల చాంపియన్ ఏఎన్‌యూ | Baseball Men's Champion eenyu | Sakshi
Sakshi News home page

బేస్‌బాల్ పురుషుల చాంపియన్ ఏఎన్‌యూ

Published Thu, Jan 8 2015 1:56 AM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM

బేస్‌బాల్ పురుషుల చాంపియన్ ఏఎన్‌యూ - Sakshi

ఏఎన్‌యూ: జాతీయ స్థాయి అంతర్ విశ్వవిద్యాలయ బేస్‌బాల్ టోర్నమెంట్‌లో పురుషుల విభాగం చాంపియన్‌షిప్‌ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జట్టు కైవసం చేసుకుంది. ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించిన టోర్నమెంట్ బుధవారంతో ముగిసింది. మొదటి నాలుగు స్థానాల కోసం చివరి రోజైన బుధవారం ఏఎన్‌యూ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, పంజాబ్ యూనివర్సిటీ(చండీగఢ్), యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ జట్లు పోటీపడ్డాయి.

కాలికట్ యూనివర్సిటీ జట్టుపై 5-0 స్కోరుతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జట్టు విజయం సాధించి మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. పంజాబ్ వర్సిటీ జట్టుపై 5-0 స్కోరుతో గెలిచిన ఢిల్లీ వర్సిటీ జట్టు రెండో స్థానంలో నిలిచింది. మూడు, నాలుగు స్థానాలను పంజాబ్ వర్సిటీ, కాలికట్ వర్సిటీ జట్లు దక్కించుకున్నారుు. మహిళల విభాగంలో మొదటి నాలుగు స్థానాల కోసం ఢిల్లీ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ (పాటియాల), గురునానక్‌దేవ్ యూనివర్సిటీ(అమృత్‌సర్), పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్) జట్లు పోటీపడ్డాయి.

గురునానక్ దేవ్ వర్సిటీ జట్టుపై ఢిల్లీ వర్సిటీ జట్టు 1-0 స్కోరుతో విజయం సాధించి చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. పంజాబ్ వర్సిటీ (చండీగఢ్) జట్టుపై పంజాబ్ వర్సిటీ(పాటియూల) జట్టు 14-04 స్కోరుతో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. గురునానక్ దేవ్ వర్సిటీ, పంజాబ్ వర్సిటీ (చండీగఢ్) జట్లు మూడు నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నారుు.
 
జాతీయ జట్ల ఎంపికలో ఏఎన్‌యూకు కీలకపాత్ర
ప్రపంచ విశ్వవిద్యాలయూల బేస్‌బాల్ పోటీల్లో పాల్గొనే జాతీయ పురుషులు, మహిళల జట్ల ఎంపిక, ప్రాతినిధ్యంలో ఏఎన్‌యూ కీలకపాత్ర పోషించనుందని వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు చెప్పారు. ఏఎన్‌యూలో బుధవారం నిర్వహించిన బేస్‌బాల్ టోర్నీ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న భారత దేశ వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు ఏఎన్‌యూలో జరిగాయని గుర్తుచేశారు.

జాతీయ స్థాయి బేస్‌బాల్ టోర్నీ విజేతలు అంతర్జాతీయ టోర్నమెంట్‌లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఏఎన్‌యూలో విద్యాబోధన కొనసాగుతోందన్నారు. శాంతి, సౌభ్రాతృత్వాలకు ప్రతీకైన బుద్ధుడు నడయాడిన ప్రాంతంలో ఏర్పాటైన ఏఎన్‌యూ ఆ విలువల పరిరక్షణకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య వై.కిషోర్ నివేదికను సమర్పించారు.

బేస్‌బాల్ టెక్నికల్ అధికారి నాగరాజు, గుంటూరు కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ శివశంకర్, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ సెక్రటరీ పి.శ్రీనివాసులు, అధ్యాపకులు డి.సూర్యనారాయణ తదితరులు ప్రసంగించారు. అనంతరం విజేతలకు వీసీ వియ్యన్నారావు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వివిధ విశ్వవిద్యాలయాల క్రీడాకారులు, టెక్నికల్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement