
శ్రీశైలం బ్యాక్ వాటర్లో బోటు నిలిచిపోవడంతో బిక్కుబిక్కుమంటున్న పర్యాటకులు
కొత్తపల్లి : శ్రీశైలం డ్యాం బ్యాక్వాటర్ మధ్యలో ఓ బోటు నిలిచిపోయింది. దాదాపు గంటన్నర పాటు 25 మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. లైఫ్ జాకెట్లు కూడా లేకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. వివరాలు.. గురువారం మధ్యాహ్నం తెలంగాణలోని వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం చెర్లోపల్లికి చెందిన 25 మంది శివ స్వాములతో ఇంజిన్ బోట్ సోమశిలఘాట్ నుంచి సంగమేశ్వరం ఘాట్కు బయలుదేరింది. కృష్ణా జలాల నడి మధ్యకు చేరుకోగానే ఇంజన్కు వల తగిలి బోటు నిలిచిపోయింది. ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో గంటన్నర పాటు శివస్వాములు బోటులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. విషయం తెలుసుకున్న కర్నూలు ఆర్డీవో హుసేన్ సాహెబ్ వెంటనే ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, కొత్తపల్లి తహసీల్దారు రామకృష్ణను సంగమేశ్వరం పంపించారు. వారు మరో బోటును పంపించి శివస్వాములను ఒడ్డుకు చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment