మంథని, న్యూస్లైన్ : మంథని ప్రజలకు ఇక బొక్కలవాగు వరద ముం పు నుంచి విముక్తి లభించనుంది. వాగు నుంచి మూడు కిలోమీటర్ల వరకు వరద కట్టల నిర్మాణం, మరమ్మతులకు ప్రభుత్వం రూ.34.08 కోట్ల నిధులు కేటాయిస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. నియోజక వర్గాన్ని ఆనుకుని ప్రవహించే బొక్కలవాగు ఏటా ఓ మోస్తరు వర్షానికే ఉప్పొంగుతూ పరివాహక ప్రాంత ప్రజలను ముంపునకు గురి చేస్తోంది. ముంపు ప్రాంతాల పరిశీలనకు వచ్చే మంత్రి శ్రీధర్బాబుకు బాధితులు తమ సమస్యను ఏకరువుపెడుతున్నారు. దీన్ని మినీ ట్యాంక్ బండ్ చేస్తామని ఆయన ప్రతిసారీ హామీ ఇస్తున్నా ఆలస్యమవుతూనే ఉంది.
ఎట్టకేలకు వాగు ఫ్లడ్బ్యాంక్ అభివృద్ధికి భారీ నీటిపారుదల శాఖ రూ.34.08 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో వాగు వంతెన నుంచి ఇరువైపులా మూడు కిలోమీటర్ల వరకు వరద కట్టల నిర్మాణం, మరమ్మతు చేయనున్నారు. మంథని పట్టణం వైపు అరకిలోమీటరు మేర కట్ట అభివృద్ధి, సైడ్వాల్స్ నిర్మాణం, అలాగే లైన్గడ్డ వైపు నూతనంగా కట్ట నిర్మాణం, మరమ్మతులు, రిటైనింగ్ వాల్ నిర్మాణం, హైదరాబాద్ ట్యాంకుబండ్ తరహాలో ఈ మూడు కిలోమీటర్ల మేర కట్టపై, నీటిలో అభివృద్ధి పనులు చేపడతారు. కాగా, పాత వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో రూ.3.21 కోట్లతో కొత్తగా హైలెవల్ వంతెన నిర్మాణం జరుగుతోంది.
ఆ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. నెల క్రితం బోయిన్పేటలో రూ.కోటితో ఏకో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఫ్లడ్బ్యాంక్ అభివృద్ధి, పార్కు పనులు పూర్తయితే బొక్కలవాగుకు మహర్దశ పట్టనుంది. ఇక్కడి ప్రజలకు ఆహ్లాదం, ఆనందం అందుబాటులోకి రానుంది. బొక్కలవాగు అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బొక్కలవాగుకు మహర్దశ
Published Sat, Dec 21 2013 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement