
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలోని కరకట్ట రహదారిపై ఓ కారు తగులబడిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్ట వద్ద కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న మహీంద్ర XUV వాహనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో కారు డ్రైవర్ అప్రమత్తమై... వాహనంలో ఉన్నవారిని దించివేశాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అయితే కారు మాత్రం పూర్తిగా దగ్ధమైంది. వీరంతా రాయపూడి నుంచి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీఎం నివాసానికి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తగలబడిన కారు వివరాలుతో పాటు మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment