బంగారు కొనుగోళ్లపై సీబీఐ ఆరా | CBI inquires gold purchases | Sakshi
Sakshi News home page

బంగారు కొనుగోళ్లపై సీబీఐ ఆరా

Published Sat, Feb 8 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

CBI inquires gold purchases

ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: పోస్టల్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని బంగారం దుకాణాల్లో జరిగిన కొనుగోళ్లపై సీబీఐ అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన సీబీఐ సీఐ రాఘవేంద్రకుమార్‌తోపాటు సిబ్బంది స్థానిక పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విచారణ చేస్తున్నారు. ప్రొద్దుటూరు పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం పరిధిలోని వివిధ బ్రాంచి కార్యాలయాల్లో పోస్టల్ ఉద్యోగులు కోట్ల రూపాయల నిధులు స్వాహా చేశారు. ఈ డబ్బుతో వారు ప్లాట్లు, భూములు, బంగారం కొనుగోలు చేసినట్లు సమాచారం.
 
 డిపాజిట్ల రూపంలో ఉన్న ప్రభుత్వ నిధులను వివిధ ఖాతాల్లో జమ చేర్చి స్వాహా చేశారు.  ఒక్క ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని పోస్టాఫీసులోనే రూ.5కోట్ల వరకు స్వాహా జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. మిగతా బ్రాంచి కార్యాలయాల పరిధిలో కూడా నిధులు స్వాహా అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న 10 మంది సిబ్బందిని గతంలోనే పోస్టల్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ కేసును  సీబీఐకి అప్పగించారు. మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు గురువారం స్థానిక సూపరింటెండెంట్ కార్యాలయానికి సీబీఐ అధికారులు వచ్చారు.
 
 సస్పెండ్ అయిన పలువురు ఉద్యోగులను పిలిపించి స్వయంగా విచారించారు.  ఈ వ్యవహారమంతా ఎక్కువగా రాత్రివేళల్లో జరిగిందని నిర్ధారణకు వచ్చిన సీబీఐ అధికారులు నైట్‌వాచ్‌మెన్లను కూడా పిలిచి విచారించారు. పోస్టల్ నిధులను స్వాహా చేసిన కొంత మంది ఉద్యోగులు స్థానికంగా బంగారం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి  ఆయా దుకాణాల బిల్లులను కూడా సేకరించారు.  పట్టణ షరాబు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు రామ్‌మనోహర్, కార్యదర్శి నామా శ్రీధర్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్ బుశెట్టి రామ్మోహన్‌రావు, ధర్మకాటా అటెండర్ లక్షుమయ్య తదితరులను పిలిపించి విచారించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లులు ప్రొద్దుటూరువా కాదా అన్న విషయంపై వారిని అడిగి తెలుసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement