poduturu
-
కార్మికుల ఆందోళనతో అట్టుడికిన ప్రొద్దుటూరు
మున్సిపల్ కార్మికుల ఆందోళనతో శుక్రవారం ప్రొద్దుటూరు పట్టణం అట్టుడికింది. అధికారులు సులభ్ సిబ్బందితో పనులు చేయిస్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్మికులను బలవంతంగా ఈడ్చిపడేశారు. సీఐటీయూ జిల్లా నేత అన్వేష్ను బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఓ మహిళా కార్మికురాలి జాకెట్ చిరిగిపోయింది. పోలీసుల తీరును నిరసిస్తూ కార్మికులు పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించి పరకలను రోడ్డుపై వేసి తగులబెట్టారు. ప్రొద్దుటూరు టౌన్ : మున్సిపల్ కార్మికుల ఆందోళన, పోలీసుల రంగ ప్రవేశంతో ప్రొద్దుటూరు పట్టణం శుక్రవారం అట్టుడికింది. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారానికి 8వ రోజుకు చేరుకుంది. పాలక వర్గం సులభ్ సిబ్బందితో పనులు చేయిస్తుంటే కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి పరకలను తీసుకొని నిప్పు పెట్టారు. పోలీసుల రంగ ప్రవేశంతో గాంధీరోడ్డులో అరగంట పాటు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వన్టౌన్ సీఐ మహేశ్వరరెడ్డి సిబ్బందితో కలిసిన కార్మికులను అడ్డుకున్నారు. పోలీస్ వాహనాల్లో ఎక్కించే క్రమంలో కార్మికులు తిరగబడ్డారు. సీఐటీయూ జిల్లా నాయకుడు అన్వేష్తోపాటు కార్మిక సంఘం, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్న చేయగా, మహిళా కార్మికులు అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా లేరు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పడేశారు. ఇంతలో అక్కడికి వచ్చిన అర్బన్ సీఐ టీవీ సత్యనారాయణ, ఎస్ఐలు మహేష్, వెంకటేశ్వర్లు, సిబ్బంది.. కార్మిక సంఘాల నాయకులను జీపులో ఎక్కించారు. మహిళా కార్మికులు వాహనానికి అడ్డుపడ్డారు. మగ పోలీసులు వారిని పక్కకు లాగేశారు. ఈ సమయంలో ఓ కార్మికురాలి రవిక చినిగి పోయింది. పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయింపు.. దీంతో కార్మికులు పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించారు. మా నాయకులను విడిచి పెట్టాలని, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మహిళా కార్మికులు పోలీస్ స్టేషన్లోకి వెళ్లారు. అక్కడ మహిళా కానిస్టేబుల్స్ కార్మికులను లోనికి తోసేశారు. ఎమ్మెల్యే చర్చించడంతో పరిస్థితి అదుపులోకి.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికులపై ప్రభుత్వం అణచి వేసే ధోరణి వ్యవహరిస్తుంటే.. స్థానిక పాలకవర్గం కూడా అదే విధానాన్ని పాటిస్తోందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. వన్టౌన్ పోలీస్స్టేషన్కు చేరుకొని డీఎస్పీ పూజితా నీలం, సీఐలతో చర్చించారు. అరెస్టు అయిన కార్మిక సంఘం నాయకులు అన్వేష్, అక్కడికి వచ్చిన ఏఐటీయూసీ నాయకులు రామయ్యతో చర్చించారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా మసీదు, ఈద్గాల వద్ద శుభ్రం చేసి కార్మికులు ఆదర్శంగా నిలవాలని పోలీస్ అధికారులు కోరారు. అందుకు రాష్ట్ర కమిటీ ఒప్పుకోదని, ప్రైవేటు వారితో చేయించుకుంటే అభ్యంతరం లేదని కార్మిక సంఘం నేతలు తెలిపారు. పోలీస్స్టేషన్కు తీసుకొచ్చిన వారిని విడిచి పెట్టడంతో ఎమ్మెల్యే, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ముక్తియార్తోపాటు వైఎసార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈవీ సుధాకర్రెడ్డి, కార్మిక సంఘం నాయకులు, కార్మికులు ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వరకు వచ్చారు. -
పచ్చ నేతలా.. మజాకా!
ప్రొద్దుటూరు: ఎలాంటి అనుమతులు లేకుండా అధికార పార్టీ నేతలు విచ్చల విడిగా అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. మండలంలోని శంకరాపురం గ్రామ పరిధిలో ఉన్న పెన్నా నదిలో కొద్ది రోజులుగా యథేచ్చగా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు సుమారు రూ.2 కోట్ల 70 లక్షలతో ప్రొద్దుటూరు-చౌడూరు గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు నిర్మాణం కోసం సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పెన్నానదిలో అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఏకంగా పొక్లైయినర్ను నదిలోకి దింపి తవ్వకాలు సాగించి ట్రాక్టర్లతో గ్రావెల్ను తరలిస్తున్నారు. ఇప్పటి వరకు వందల ట్రాక్టర్ల గ్రావెల్ను రోడ్డు నిర్మాణానికి తరలించారు. రాత్రిళ్లే ఈ రవాణా సాగుతోంది. ఎక్కువ సంఖ్యలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని అక్రమ రవాణా చేస్తుండటంతో పరిసరాల్లో నివాసం ఉంటున్న ప్రజలు నిద్రలేని రాత్రిళ్లు గుడుపుతున్నారు. ఈ కారణంగా పెన్నానదిలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ సమస్యపై గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎర్రగుంట్లలోని మైన్స్ అండ్ జియాలజీ అధికారులు గురువారం దాడులు చేశారు. గ్రావెల్ రవాణా చేస్తున్న 11 ట్రాక్టర్లతోపాటు నదిలో తవ్వకాలు సాగిస్తున్న పొక్లెయినర్ యంత్రాన్ని మైన్స్ అధికారులు సీజ్ చేశారు. అసిస్టెంట్ జియాలజిస్టు సుధాకర్, ఆర్ఐలు నాగరాజు, రామసుబ్రమణ్యం, వీఆర్ఓలు నరసింహులు, బాదుల్లా తదితరులు దాడుల్లో పాల్గొన్నారు. తహశీల్దార్ రాంభూపాల్రెడ్డికి మైన్స్ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఆయన వీఆర్ఓలను పంపి ట్రాక్టర్లను ఎక్కడికక్కడే పట్టుకున్నారు. అయితే సాయంత్రానికే నామమాత్రపు జరిమానా చెల్లించి నేతలు వాహనాలను విడిపించుకు పోవడం కొసమెరుపు. -
సివిల్స్కు ఎంపికైన ముగ్గురు
ప్రొద్దుటూరు, వీరబల్లి, నందలూరు : సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో జిల్లాకు చెందిన ముగ్గురు మంచి ర్యాంకులు సాధించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీ సత్యనారాయణస్వామి ఆలయం వద్ద నివసిస్తున్న పాతకోట విజయభాస్కర్రెడ్డి 462వ ర్యాంక్ సాధించాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన విజయభాస్కర్రెడ్డి 10వ తరగతి వరకు స్థానిక సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో చదివాడు. 2001లో పదవ తరగతి పరీక్షలో 468 మార్కులు సాధించాడు. తర్వాత విజయవాడలోని గీతాంజలి జూనియర్ కళాశాలలో (ఎంపీసీ) ఇంటర్ చదివి 921 మార్కులు పొందాడు. నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో 77 శాతం మార్కులతో బీటెక్ (ఈసీఈ) పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పూర్తయిన అనంతరం చెన్నైలోని సీటీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రెండేళ్లు పనిచేశాడు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టుదలతో చదివాడు. దిల్లీలోని వాజీరామ్ అండ్ రవి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందాడు. మూడేళ్లుగా వరుసగా సివిల్స్పరీక్షలు రాస్తున్నాడు. సోషియాలజి సబ్జెక్టును ఆప్షనల్గా ఎంచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలువడిన ఇండియన్ ఫారెస్టు సర్వీస్ పరీక్ష ఫలితాలలో ఆలిండియాలో 85వ ర్యాంక్ సాధించాడు. శనివారం వెలువడిన సివిల్స్ పరీక్ష ఫలితాల్లో 462వ ర్యాంక్ సాధించాడు. ఈ ర్యాంక్ ఆధారంగా ఈయనకు ఐపీఎస్, ఐఆర్ఎస్, కస్టమ్స్ ఆఫీసర్లలో ఏదో ఒక పోస్టు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విజయభాస్కర్రెడ్డి తల్లిదండ్రులు పెద్ద సుబ్బారెడ్డి, వెంకటమ్మలు మైలవరం మండలంలోని బాక్రాపేట గ్రామానికి చెందిన వారు. వీరిది వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబం. అయితే మైలవరం రిజర్వాయర్ నిర్మాణ సమయంలో గ్రామం ముంపునకు గురికావడంతో ప్రొద్దుటూరుకు వచ్చి స్థిరపడ్డారు. తర్వాత కాలంలో పెద్ద సుబ్బారెడ్డి వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించాడు. సివిల్ ర్యాంకర్ విజయభాస్కర్రెడ్డికి విజయలక్ష్మిదేవి, ప్రమీల దేవి, శశిరేఖ అనే అక్కచెల్లెల్లు ఉన్నారు, వారికి వివాహం అయింది. వైద్య వృత్తి నుంచి సివిల్స్లోకి.. వీరబల్లి మండలం పెద్దివీడు గ్రామం రూకావాండ్లపల్లెకు చెందిన డాక్టర్ ఏ.సురేష్రెడ్డి సివిల్ సర్వీసెస్లో 525వ ర్యాంకు సాధించారు. రైతు కుటుంబానికి చెందిన సూర్యనారాయణరెడ్డి, ధర్మాదేవిల కుమారుడు. ప్రస్తుతం వీరు రాయచోటిలోని ఎన్జీఓ కాలనీలో ఉంటున్నారు. ఈయన విద్యాభ్యాసం ఒకటి నుంచి నాలుగవ తరగతి వరకు శ్రీనికేతన్(రాయచోటి), ఐదు నుంచి ఎనిమిదవ తరగతి వరకు (ఆంగ్లో ఇండియన్, రాయచోటి), తొమ్మిదవ తరగతి(రాజు స్కూల్), పది నుంచి ఇంటర్ వరకు(రత్నం కళాశాల, నెల్లూరు), ఎంబీబీఎస్ కర్నూలు మెడికల్ కళాశాలలో పూర్తి చేశారు. రెండు సంవత్సరాలుగా రోయచోటిలో బీడీ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యశాలలో డాక్టర్గా పని చేస్తూ సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యారు. ఇతను సివిల్ సర్వీసెస్కు ఎంపిక కావడం పట్ల తన సొంత గ్రామమైన నూకావాండ్లపల్లెలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. యువత ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలన్నారు. ఆ లక్ష్యం సాధనకు సమయం కేటాయించుకుని పట్టుదలతో కృషి చేయాలని చెప్పారు. ప్రణాళిక బద్ధంగా చదివితే లక్ష్యం చేరడం కష్టం కాదని చెప్పారు. ఐఏఎస్ కోసం మరోసారి ప్రయత్నిస్తా : డా.ధీరజ్ నందలూరు మండలం అరవపల్లె గ్రామానికి చెందిన డాక్టర్ బి.ధీరజ్కుమార్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 1177వ ర్యాంకు సాధించారు. ధీరజ్కుమార్ తండ్రి బి.జయభాస్కర్రావ్ వృత్తి రీత్యా రైల్వేలో వైద్యుడిగా పనిచేస్తూ పేరు ప్రఖ్యాతులు సాధించారు. ప్రస్తుతం ఈయన గుంటకల్ రైల్వే డివిజన్లో అసిస్టెంట్ చీప్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ధీరజ్ తల్లి ఎం.విజయభారతి రాష్ట్రప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో అసిస్టెంట్ డి.ఎమ్.డబ్లు.ఒ.గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో వైద్య వృత్తిలో అడుగుపెట్టి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పట్టుదలతో ప్రయత్నించి సివిల్స్లో విజయం సాధించారు. ఇతని సోదరుడు దీపక్కుమార్, సోదరి దీప్తిలు సైతం ఎంబీబీఎస్ పూర్తి చేశారు. నందలూరులోని శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ స్కూల్లో పదవ తరగతి, నెల్లూరులోని రత్నం కళాశాలలో ఇంటర్, తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. సివిల్స్ కోసం హైదరాబాద్, ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఈ ఫలితం పట్ల తాను పెద్దగా సంతృప్తి పడటం లేదన్నారు. ఈ ర్యాంక్తో ఐఆర్ఎస్ రావచ్చని, తన లక్ష్యం ఐఏఎస్ అని చెప్పారు. ఆ లక్ష్యం కోసం మరోసారి ప్రయత్నిస్తానని చెప్పారు. తన విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహకం అధికంగా ఉందని అన్నారు. -
మా గోడు ఆలకించండి
ప్రొద్దుటూరు : ‘మేము ఏ సమస్య చెప్పినా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదా అని చిన్నచూపు చూడొద్దు.. సామాన్యుల తరఫున మాట్లాడుతున్నాం.. కొన్ని సమస్యలను పదే పదే విన్నవించినా న్యాయం జరక్కపోవడంతో పదే పదే ప్రశ్నిస్తున్నాం.. అంతే కానీ మాకు అధికారులెవరిపై వ్యక్తిగత కక్షలేదు.. ఈ విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించి ప్రజలకు న్యాయం చేయాల’ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి పేర్కొన్నా రు. శుక్రవారం సాయంత్రం ఆయన స్థానిక జిల్లా ఆస్పత్రిలో కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించలేదని ఆత్మహత్యకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బం దిని పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణ ఏజెన్సీ తరఫున అధికార పార్టీకి చెందిన సబ్ కాంట్రాక్టర్ 18 మంది సెక్యూరిటీ సిబ్బందితో పనిచేయిస్తూ వారికి ఆరు నెలలుగా వేతనాలు చెల్లించలేదన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం సరిగా లేదని, అతని తీరు సరిగా లేదని గతంలో జరిగిన అడ్వైజరి కమిటీ సమావేశంలో తనతోపాటు కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డిలతో కలిసి ఫిర్యాదు చేశామన్నారు. కాం ట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పినా ఫలితం లేదన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు చెప్పినాపని కాలేదంటే తమ విలువ ఏమేడ్చిందన్నారు. వేతనాల కోసం ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది గత వారం ఆత్మహత్యకు ప్రయత్నిస్తే వారికి వేతనాలు చెల్లించలేదు కదా కనీసం వారిని పరామర్శించేందుకు కూడా కాంట్రాక్టర్ బాలనారాయణరెడ్డి ఆస్పత్రికి రాకపోవడం విచారకరమన్నారు. గతంలోనే జిల్లా కలెక్టర్ స్పందించి ఉంటే ఈ సమస్య పరిష్కారమయ్యేదన్నారు. కష్టాల్లో ఉన్న వారికి జిల్లా కలెక్టర్ దేవుడని, కనిపించని దేవుడు వారి సమస్యను పరిష్కరించకపోగా కళ్లేదుటే కనిపిస్తున్న కలెక్టర్ దేవుడు కూడా వీరిని పట్టించుకోకపోవడం తనకు ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆస్పత్రిలో మరో ముగ్గురు గైనకాలజిస్టులను నియమించాలని, మం దుల కొరత తీర్చాలని, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని తాము పదే పదే కలెక్టర్ను వేడుకుంటున్నా పరిస్థితి మారలేదన్నారు. ఇప్పటికే ఆస్పత్రి సమస్యలపై తనతోపాటు సీపీఐ, సీపీఎం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కలిసి పలుమార్లు ఆందోళన చేశామన్నారు. అయినా ఆయన మనసు కరగలేదన్నారు. కాలేకడుపుతో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక మానసిక ఆవేదనకు గురవుతున్న సెక్యూరిటీ సిబ్బంది చివరికి ఆత్మహత్యే శర ణ్యమని భావించారన్నారు. పొరపాటున కార్మికులకు ఏమైనా జరిగితే కలెక్టర్ ఇంటి వద్ద తిష్ట వేస్తామన్నారు. కేసులకు, అరెస్టులకు భయపడబోమన్నారు. స్వయంగా జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పినా కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం కాంట్రాక్టర్కు వేతనాలు చెల్లించకపోవడం ఒక తప్పు అయితే బాధ్యతగా ఆ కాంట్రాక్టర్ ప్రతినెల వీరికి వేతనాలు ఇవ్వకపోవడం మరో తప్పిదమన్నారు. -
ఊరంతా పందిళ్లు.. ఇంటింటా సందడి
కొత్తపేట(ప్రొద్దుటూరు) : ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లె గ్రామ పంచాయతీలో ఉన్న కొత్తపేట గ్రామంలో ఆదివారం భారీ ఎత్తున పెద్దమ్మతల్లి దేవర మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 1000 ఓట్లు గల ఈ గ్రామంలో ఈ ఉత్సవాల నిర్వహణకు గ్రామస్తులు రూ.కోటికిపైగా వెచ్చిస్తున్నారు. వివరాలిలావున్నాయి. ప్రొద్దుటూరు పట్టణానికి కూతవేటు దూరంలో జమ్మలమడుగు రోడ్డులో కొత్తపేట గ్రామం ఉంది. పూర్వం గ్రామంలో ప్రతి ఏటా పెద్దమ్మతల్లి దేవరను నిర్వహించేవారు. అయితే గ్రామ పరిస్థితుృ దష్ట్యా దేవరను నిలిపివేశారు. 1958లో చివరగా ఈ ఉత్సవం నిర్వహించారు. కాగా గ్రామస్తులంతా చర్చించుకుని మళ్లీ గ్రామంలో ఈ ఉత్సవాలను నిర్వహించాలని ప్రయత్నించారు. మూడేళ్లుగా ఈ విషయం నానుతోంది. అయితే ఎన్నికల నేపథ్యంలో రెండేళ్లుగా ఉత్సవాన్ని పోలీసుల సూచన మేరకు నిలిపివేశారు. ఏది ఏమైనా ఈ మారు నిర్వహించాలని పూనుకున్నారు. ఈ మేరకు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయానికి సున్నాలు వేశారు. ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవానికి హాజరు కావాలని గ్రామంలోని పలువురు ఆహ్వాన పత్రాలను కూడా పంచిపెట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఊరంతా పందిళ్లు వేసి ఏర్పాట్లు చేశారు. ఇంటింటా అమ్మవారికి సమర్పించేందుకు పొట్టేళ్లు సిద్ధం చేసుకున్నారు. 10 పొట్టేళ్లను కూడా ఏర్పాటు చేసుకున్న వారు ఉన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి 500కుపైగా పొట్టేళ్లను గ్రామానికి తీసుకురాగా మొత్తం ఖర్చు కోటి రూపాయలకుపైగా వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. బంధుమిత్రుల రాకతో ప్రతి ఇంటా సందడి నెలకొంది. ప్రముఖుల రాక దేవర ఉత్సవానికి హాజరు కావాలని గ్రామస్తులు ప్రముఖులను ఆహ్వానించారు. ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఆదినారాయణరెడ్డి, రఘురామిరెడ్డి, అంజాద్బాష, రవీంద్రనాథ్రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, టీడీపీకి సంబంధించి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లేల లింగారెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి తదితరులు హాజరు కానున్నారు. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఉత్సవం నిర్వహించారు తాను ప్రొద్దుటూరు పట్టణంలోని ఆర్ట్స్ కాలేజిలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో గ్రామంలో చివరగా దేవర ఉత్సవాన్ని నిర్వహించారు. 1958 నుంచి దేవర నిర్వహించలేదు. చాలా కాలం తర్వాత నిర్వహిస్తుండటంతో అంతా సందడిగా ఉంది. - గుద్దేటి వెంకటసుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ విదేశాల్లో ఉన్నవారు సైతం వచ్చారు గ్రామానికి సంబంధించి పలువురు విదేశాల్లో ఉద్యోగ రీత్యా స్థిరపడ్డారు. ఎందరో హైదరాబాద్లాంటి నగర ప్రాంతాల్లో ఉన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటివారు తమ కుటుంబ సభ్యులను, బంధుమిత్రాదులను ఆహ్వానించారు. విదేశాల్లో ఉన్న వారు సైతం వచ్చారు. - వెల్లాల కుమార్రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ అందరినీ ఆహ్వానించాం దేవర మహోత్సవానికి హాజరు కావాలని ఇరు పార్టీల వారిని ఆహ్వానించాం. గ్రామస్తులంతా బంధు మిత్రులను పిలుచుకున్నారు. గ్రామ కమిటీ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అందరూ ఆహ్వానితులే. - రామిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, గ్రామ కమిటీ సభ్యుడు గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది దేవర మహోత్సవంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. చాలా రోజులుగా ప్లాన్ చేసి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. వాహనాల పార్కింగ్కు కూడా ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేశాం. -కృష్ణారెడ్డి -
ఎంత కష్టం.. ఎంత నష్టం...
ఈ మహిళా రైతు పేరు సానె చంద్రమ్మ. ప్రొద్దుటూరు మండలం సీతంపల్లె గ్రామానికి చెందిన ఈమె 10 ఎకరాల్లో వరి పంట సాగు చేసింది. ఎకరాకు రూ.25 వేలు చొప్పున పంట సాగుకు రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టింది. పంట పొట్ట దశకు చేరుకుంది. రేపోమాపో కోత కోయాల్సి ఉండగా అకస్మాత్తుగా వచ్చిన గాలి వానతో పంట మొత్తం నేలవాలింది. నాలుగు రోజులుగా అలాగే ఉండటంతో నేలవాలిన పంట నుంచి మోసులు వచ్చాయి. ‘పంట చేతికి వచ్చి ఉంటే రూ.4 లక్షల దాకా వచ్చేది. మోసులొచ్చి అంతా కుళ్లిపోయింది. పశుగ్రాసానికి కూడా పనికొచ్చేలా లేద’ంటూ ఆమె వాపోయింది. ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మండలం సీతంపల్లెలో ఆదివారం గాలి వానకు 300 ఎకరాల్లో వరి పంట పాడైంది. వరికి ధర బాగా పలుకుతుండటంతో అందరూ 555 రకానికి చెందిన వరి ధాన్యాన్ని సాగు చేశారు. అకాల వర్షంతో పాటు భారీ స్థాయిలో వీచిన గాలులకు పంట నేల వాలింది. ఈ గ్రామం ప్రొద్దుటూరు మండల పరిధిలో ఉండగా, పొలాలు చాపాడు మండల పరిధిలోకి వస్తాయి. ఈ గ్రామంలో రైతులంతా చాలా ఏళ్లుగా కర్బుజా పంటను సాగు చేస్తున్నారు. జనవరిలో రెండో పంటగా వరి సాగు చేశారు. గ్రామానికి చెందిన రైతులు కుందూ పరివాహక ప్రాంతాలైన కుచ్చుపాప, వెదురూరు, సన్నపల్లె తదితర గ్రామాలకు వెళ్లి.. పొలం కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రకృతి విపత్తు కారణంగా అటు వరి, ఇటు కర్బుజా పంటలు నాశనం అయ్యాయి. భారీ నష్టం వాటిల్లినా ఇప్పటి వరకు అధికారులెవ్వరూ ఇటు వైపు తొంగి చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమె పేరు జగతి వెంకటమ్మ. సీతంపల్లె గ్రామానికి చెందిన ఈమె కుటుంబం తొమ్మిది ఎకరాల్లో వరి పంట, ఐదు ఎకరాల్లో కర్బుజా పంటను సాగు చేశారు. గాలి వాన కారణంగా అటు వరి, ఇటు కర్బుజా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతినడంతో ఈమె లబోదిబో మంటోంది. చేతికొచ్చిన పంటలు ఇలా ఎన్నడూ దెబ్బతినలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆరు ఎకరాల్లో నష్టపోయా ఆరు ఎకరాల్లో వరి పంట సాగు చేసి నష్టపోయాను. గతంలో ఎప్పుడు మా గ్రామంలో ఇలా జరగలేదు. మిగతా గ్రామాలకంటే ముందుగా పంటను సాగు చేయడంతో ఎక్కువ నష్టం జరిగింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. - పేట చెండ్రాయుడు, సీతంపల్లె కోలుకోలేని దెబ్బ ఇటీవల వర్షం, గాలితో మా గ్రామం కోలుకోలేని విధంగా దెబ్బ తినింది. రైతులంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. నేను ఆరు ఎకరాల్లో వరి, 12 ఎకరాల్లో కర్బుజా పంట సాగు చేశాను. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నష్టపోయాను. అధికారులు పరిశీలనకు కూడా రాలేదు. - జగతిపుల్లయ్య, సీతంపల్లె రెండు మండలాల్లో ఉన్నాం ప్రొద్దుటూరు మండలంలో నివాసం ఉన్న రైతుల పొలాలు చాపాడు మండల పరిధిలోకి వస్తాయి. గ్రామంలో కూడా రెండు మండలాల వారు కలిసి ఉంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి. పంటకు ఇలా మోసులు రావడం ఈ ప్రాంతంలో ఎన్నడూ చూడలేదు. - వరికూటి నాగన్న, సీతంపల్లె -
లక్ష్య సాధన కోసం శ్రమించాలి
- ఐఐటీ ప్రొఫెసర్ మూర్తి ప్రొద్దుటూరు: లక్ష్యసాధన కోసం విద్యార్థులు శ్రమించాలని ఐఐటీ చెన్నై ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు. స్థానిక వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలను మంగళవారం సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో నిష్ణాతులుగా ఎదగాలంటే కృషి, పట్టుదల ఉండాలన్నారు. యువత పరిశోధన రంగంవైపు అడుగులు వేయాలని, పరిశోధనపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు దేశంలోని ఎన్నో విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు ద్వారాలు తెరచి ఉంచాయన్నారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.జయచంద్రారెడ్డి, ప్రొఫెసర్ బీ.జయరామిరెడ్డి, ఎంఎంటీ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ డాక్టర్ ఏ.అశోక్ పాల్గొన్నారు. నేడు జాతీయ సదస్సు వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ మెటలర్జి అండ్ మెటీరియల్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కు సంబంధించి యూజీసీ ఆధ్వర్యంలో రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ మెటలర్జి అండ్ మెటీరియల్ సైన్స్ రామ్ -2కే15 జాతీయ సదస్సు బుధవారం నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ఏ.అశోక్కుమార్ తెలిపారు. -
ఆడ ‘బిడ్డ’ను గెంటేశారు
ప్రొద్దుటూరు ధర్మాసుపత్రిలో అధర్మం రాజ్యమేలుతోంది. మానవత్వం మంటగలిసిపోతోంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్య సిబ్బంది పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పురిటినొప్పులతో ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన నిండుచూలాలిని నిర్దయగా గెంటేశారు. రాత్రి వేళ.. దిక్కుతోచని స్థితిలో అమ్మా.. నిరుపేదలం.. మాకు పెద్దాసుపత్రే దిక్కు.. పెద్ద మనసు చేసుకుని దయచూపండమ్మా అంటూ కాళ్లావేళ్లాపడినా వారి హృదయాలు కరగలేదు. యావత్ ప్రపంచం మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఓ అబల పురుడుపోసుకునేందుకు పడిన వేదన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ప్రొద్దుటూరు: పురిటి నొప్పులతో ప్రసవం కోసం వెళ్లిన నిండు చూలాలిని జిల్లా ఆస్పత్రి సిబ్బంది గెంటివేసిన హృదయ విదారక సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వీరపునాయునిపల్లి మండలం పాయసంపల్లె గ్రామానికి చెందిన వెంకటలక్షుమ్మకు పురిటి నొప్పులు రావడంతో అక్కడి ఆస్పత్రి సిబ్బంది సలహా మేరకు ప్రసవం కోసం 108 వాహనంలో శుక్రవారం రాత్రి జిల్లా ఆస్పత్రికి వచ్చారు. వీరిని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు సిబ్బంది నిరాకరించారు. అవి పురిటి నొప్పులు కాదుపొమ్మన్నారు. పైగా ఇక్కడ డాక్టర్లు అందుబాటులో లేరని, ఉదయాన్నే రండి అచి చెప్పి వెనక్కు పంపారు. రాత్రి వేళలో సుమారు 30 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వెంకటలక్షుమ్మతోపాటు ఆమె భర్త, బంధువులు తీవ్ర ఆందోళన చెందారు. కడుపేదలమైన తాము ఎంతో నమ్మకంతో పెద్దాసుపత్రికి వచ్చామని.. తీరా ఇక్కడికి వచ్చాక తమను ఏమాత్రం పట్టించుకోకుండా బయటికి పంపితే ఎలా అని ప్రశ్నించారు. ఈ రాత్రివేళ తాము ఎక్కడికి వెళ్లాలి.. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లేందుకు తమ వద్ద డబ్బులు కూడా లేవని ప్రాధేయపడ్డారు. వీరి మాటలను ఏమాత్రం పట్టించుకోని సిబ్బంది వారిని వార్డులో కూడా ఎక్కువ సేపు ఉంచకుండా బయటికి పంపారు. తొలి కాన్పు కావడంతో కుటంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. ఏమవుతుదోనని భయపడ్డారు. కనీసం కడప రిమ్స్కు వె ళ్లాలని సిద్ధపడినా ఆస్పత్రి వైద్యుల సంతకం లేనిదే వెళ్లలేమని 108 సిబ్బంది తెలిపారు. ఇలా చాలాసేపు తర్జనభర్జన పడ్డాక చివరకు ఆసుపత్రి ఉన్నతాధికారుల అనుమతితో రాత్రి 11 గంటల ప్రాంతంలో గ ర్భిణిని 108 వాహనంలో వల్లూరు దాటేంత వరకు తీసుకెళ్లి అక్కడినుంచి చింతకొమ్మదిన్నెకు చెందిన 108 వాహనంలో రిమ్స్కు తరలించారు. శనివారం రాత్రి ఆమెకు సిజేరియన్ చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారని ఆమె వెంట వచ్చిన బంధువులు ఫోన్ ద్వారా తెలిపారు. ఈ విషయంపై మెడికల్ సూపరింటెండెంట్ బుసిరెడ్డిని వివరణ కోరగా ఆస్పత్రిలో మొత్తం నలుగురు గైనకాలజిస్టులకు గాను ఇద్దరే పనిచేస్తున్నారన్నారు. ఇందులో డాక్టర్ భాగ్యమ్మ తమ పిల్లల పరీక్షల కోసం సెలవు పెట్టారన్నారు. ఉన్న ఒక్క డాక్టర్ పగలు ఆపరేషన్లు చేయడంతోపాటు ఓపీని చూస్తున్నారన్నారు. చాలా దారుణం ఎంతో నమ్మకంతో ప్రసవం కోసం మా గ్రామం నుంచి వచ్చాం. 108 సిబ్బంది ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడి సిబ్బంది మమ్మల్ని వెళ్లిపోవాలని బయటికి పంపారు. రాత్రి వేళ ఇలా చేస్తే మాలాంటి పేదల పరిస్థితి ఏమిటి. వెంకటేశు, బాధితురాలి భర్త -
నీళ్ల కోసం రోడ్డెక్కిన మహిళలు
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక మైదుకూరు రోడ్డులోని బాలాజీ నగర్-1లో మంచి నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కారు. రెండు నెలల నుంచి వీధిలో నీరు రావడం లేదంటూ గురువారం మహిళలంతా సీపీఐ ఆధ్వర్యంలో ఖాలీ బిందెలతో మైదుకూరు రోడ్డుపై బైఠాయించారు. రెండు నెలల నుంచి కుళాయిల ద్వారా నీరు రావడం లేదని దీంతో మోడంపల్లె, నడింపల్లె ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందని మహిళలు తెలిపారు. వీధిలో ఉన్న ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లకు మాత్రం నీరు సరఫరా అవుతోందన్నారు. అయితే వీధి కుళాయిలకు మాత్రం 4-5 బిందెలు మాత్రమే వచ్చి తర్వాత ఆగిపోతున్నాయని వాపోయారు. గతంలో నాలుగైదు సార్లు మున్సిపల్ అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని తెలిపారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న వేసవి కాలంలో తమ పరిస్థితి ఏమిటని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు, పాలకులు మా వార్డును గాలికి వదిలేశారన్నారు. నినాదాలతో హోరె త్తించిన మహిళలు.. రహదారిపై బైఠాయించిన మహిళలు కమిషనర్ డౌన్ డౌన్..చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న ఛైర్మన్ ఉండేల గురివిరెడ్డి, కమిషనర్ ప్రమోద్కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. నీటి ఎద్దడి ఉండటం వల్లనే ప్రతి రోజూ బాలాజీనగర్కు ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నామని తెలిపారు. 10 రోజుల్లో ప్రతి రోజూ నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చాలా సేపు మహిళలు వినిపించుకోలేదు. ఇక నుంచి వార్డులో మంచి నీటి ఎద్దడి రాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు, మునిరెడ్డి, రామకృష్ణ, మున్ని, మురళి, జయరామిరెడ్డి, సులోచన, స్వర్ణ, ఎస్ఎం షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
భూమాయ
రూ.కోట్ల విలువైన కళాశాల స్థలం ఇది. మూడేళ్ల క్రితమే బెంగుళూరుకు చెందిన ఇద్దరికి విక్రయించారు. స్థలం కొన్న వారు చదును కూడా చేయించారు. అంత వరకు బాగానే ఉంది. ఆ సొమ్ము ఇంత వరకు కళాశాల అకౌంట్లకు చేరలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కళాశాల అభివృద్ధికి నోచుకోవడంలేదు. ప్రొద్దుటూరు టౌన్: అది కోట్లు విలువ చేసే స్థలం. ఈ స్థలాన్ని అతి తక్కువ ధరకు చేజిక్కించుకున్నారే కానీ ఒక్క రూపాయి కూడా స్థలానికి సంబంధించిన కళాశాల అకౌంట్లలో జమ కాకపోవడం చూస్తుంటే ఈ రిజిస్ట్రేషన్లు బోగస్ అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడు రోడ్డులో ఉన్న డీఏడబ్ల్యూ కళాశాలకు చెందిన 11 ఎకరాల స్థలాన్ని ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ మోహన్రావు 2011లో ఇద్దరికి విక్రయించారు. ఈ స్థలాలను కొనుగోలు చేసిన బెంగళూరు సిటీకి చెందిన ఎం.ఆంజనేయరెడ్డి రూ.4కోట్ల 41 లక్షల 90వేలకు బెంగళూరు విజయనగరం బ్రాంచి కరూర్ వైశ్యాబ్యాంక్ పేరున చెక్కులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇందుకుగాను ఇతనికి 8.30 ఎకరాల స్థలాన్ని సర్వే నెంబర్లు 636, 666, 667 ఏలో రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే హైదరాబాద్ సిటీకి చెందిన శివగణేష్ సర్వే నెంబర్ 667 ఏ లో ఉన్న 20 సెంట్ల స్థలానికి సంబంధించి రూ.67 లక్షల 76వేలు సికింద్రాబాద్ బ్రాంచి చార్టెడ్ బ్యాంక్ పేరున చెక్కులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే సర్వే నెంబర్లు 636, 666, 667 ఏలో 1.30 ఎకరాల స్థలానికి రూ. కోటి 22 లక్షల 46వేలకు అదే బ్యాంక్ పేరున చెక్కులను ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తం 11 ఎకరాలకు గాను రూ.6కోట్ల 99 లక్షల 88 వేలకు కొనుగోలు చేసినట్లయింది. ఆంజనేయరెడ్డి స్థలం మరికొందరికి విక్రయం బెంగళూరు సిటీకి చెందిన ఆంజనేయరెడ్డి తాను కొనుగోలు చేసిన స్థ లాన్ని ద్వారకచర్ల రాఘవరెడ్డి, ద్వారకచర్ల ఈశ్వరరెడ్డిలకు చెరో 25సెంట్లు రూ. 26లక్షల 62వేలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మార్కెట్ విలువ రూ.50కోట్ల పైమాటే అయితే ప్రస్తుతం కొర్రపాడు రోడ్డులో రిజిస్ట్రేషన్ విలువే సెంటు రూ.5లక్షలుపైగా పలుకుతోంది. హౌసింగ్ బోర్డు ఏరియాలోకి వచ్చే స్థలం కూడా సెంటు రూ.3-4లక్షలకు పైగా ఉంది. ఇక మార్కెట్ విలువ చూసుకుంటే రిజిస్ట్రేషన్ విలువకు రెండింతలు ఉంటుందన్నది అందరికి తెలిసిన విషయమే. ఈ విధంగా చూస్తే 11 ఎకరాల స్థలం రూ.50 నుంచి రూ. 60 కోట్లకుపైగా ధర పలుకుతోంది. విక్రయించి మూడేళ్లవుతున్నా కళాశాల అభివృద్ధి ఏదీ... స్థలాన్ని విక్రయించి డీఏడబ్ల్యూ కళాశాలను అభివృద్ధి చేస్తామని యాజమాన్యం ఇప్పటి వరకు ఒక్క భవన నిర్మాణం చేపట్టలేదు. స్థలం విక్రయించగా వచ్చిన కోట్ల రూపాయల డబ్బు ఏమైందన్న విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎక్కడేకానీ రిజిస్ట్రేషన్లో డబ్బు చెల్లించినట్లు లేదు. అన్ని బ్యాంక్ చెక్కులపైనే కోట్ల రూపాయల విలువ చేసే స్థలం రిజిస్ట్రేషన్ ఎలా చేయిస్తారన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలో స్థలాన్ని కొనుగోలు చేసిన వారి నుంచి ఒక్క రూపాయి కూడా జమ కానట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా కళాశాల అభివృద్ధికి ఒక్కరూపాయి అయినా ఖర్చు పెట్టారా డీఏడబ్ల్యూ కళాశాలకు చెందిన 11 ఎకరాల స్థలాన్ని విక్రయించామని చెబుతున్న కళాశాల యాజమాన్యం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కళాశాలకు ఖర్చు చేయలేదు.విక్రయాలన్నీ చెక్కులపైనే జరిగాయి. రూ.60 కోట్లకుపైగా విలువ చేసే స్థలం రూ.6కోట్ల 99 లక్షలకు విక్రయించడం చూస్తుంటే ఇదంతా బోగస్ అనిపిస్తోంది. భూమి అమ్మి కళాశాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన యాజమాన్యం ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఇప్పటి వరకు దరఖాస్తు పెట్టారా? అంటే అదీలేదు. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
రోగం కుదిరేదెలా..!
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు ధర్మాసుపత్రికి అవినీతి జ్వరం పట్టుకుంది. ఇక్కడి సిబ్బంది ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారు. డెలివరీతో పాటు ఇతర కేసులను డాక్టర్ లేరంటూ కడప రిమ్స్కు రెఫర్ చేస్తున్నారు. ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి 2012 ఆగస్టులో జిల్లా స్థాయి ఆస్పత్రిగా స్థాయి పెరిగింది. ఇక్కడికి ప్రొద్దుటూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వైద్యం కోసం వస్తుంటారు. ఆస్పత్రిలో సివిల్ సర్జన్ పోస్టులు 9 ఉండగా కేవలం ఇద్దరు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 21 ఉండగా 12 మంది రెగ్యులర్, ముగ్గురు కాంట్రాక్ట్ బేసిక్ డాక్టర్లు ఉన్నారు. ఇద్దరు దంత వైద్యులు ఉన్నారు. అయితే రేడియాలజితో పాటు పలు విభాగాలకు సర్జన్లు లేరు. కాసులు ఇవ్వందే కాన్పు కాలేరు జిల్లా ఆస్పత్రిలోని కాన్పుల వార్డులో గతంలో నెలకు 120-130 దాకా కాన్పులు జరిగేవి. అయితే గత ఆరు నెలల నుంచి కాన్పుల సంఖ్య నెలకు 30-40 మాత్రమే నమోదవుతోంది. గతంలో నలుగురు గైనకాలజిస్టులు ఉండేవారు. ఇద్దరు దీర్ఘకాలంగా సెలవులో ఉండటం వల్ల కాన్పుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఉన్న డాక్టర్లు ఇద్దరూ ఓపీ చూడటమే గాక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇళ్లలో కాన్పులు జరగరాదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరగాలని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. అయితే ఇక్కడికి ఎంతో ఆశతో వస్తున్న పేదలకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. కాఫీ, టీ ఖర్చులకు డబ్బులు తెచ్చుకున్న బాధితులను డబ్బు ఇవ్వాల్సిందేనని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే ముందు ఒక సారి, కాన్పు అయ్యాక మరో సారి వేలల్లో డబ్బు ఇవ్వాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ఆపరేషన్ థియేటర్లో కూడా సిబ్బంది డబ్బు ఇవ్వనిదే పసికందును చేతిలో పెట్టడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసులు తగ్గడంతో సీ గ్రేడుకు ఆస్పత్రిలోని పలు విభాగాలలో పరికరాలున్నప్పటికీ డాక్టర్లులేరు. కొన్ని విభాగాల్లో వైద్యులు ఉన్నారే కానీ ఆపరేషన్ చేయడానికి పరికరాలు లేవు. ఆర్థో విభాగంలో డాక్టర్లు ఉన్నారు. అయితే తగినన్ని పరికరాలు లేకపోవడంతో ఆపరేషన్లు సరిగా జరగడం లేదు. ఆస్పత్రిలో గత కొన్నేళ్ల నుంచి అల్ట్రాసౌండ్ మిషన్ ఉంది. అయితే రేడియాలజిస్టు లేకపోవడంతో లక్షలు విలువ చేసే స్కానింగ్ మిషన్ మూలన పడిఉంది. దీంతో ప్రజలు రూ. వందలు చెల్లించి బయట స్కానింగ్ చేయించుకుంటున్నారు. అలాగే ఈసీజీ విభాగంలో కూడా కొన్ని నెలల నుంచి టెక్నీషియన్ లేడు. దీంతో ఈసీజీ విభాగం మూతపడి ఉంది. గుండెకు సంబంధమైన ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలన్నా రోగులు ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ విధంగా ఆస్పత్రిలో అనేక సమస్యలు రోగులను పట్టి పీడిస్తున్నాయి. నేడు ఆస్పత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా స్థానిక జిల్లా ఆస్పత్రి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పరిరక్షణకమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించనున్నారు. -
భగవంతుడా.. నన్ను తీసుకెళ్లు..!
ప్రొద్దుటూరు క్రైం: ఎర్రగుంట్ల మండలం మాలెపాడు గ్రామానికి చెందిన ఇల్లూరి నాగమ్మకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులుండేవారు. భర్త చాలా ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుమార్తెకు కూడా వివాహం చేసింది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. కొన్నేళ్ల తర్వాత కుమార్తె మృతి చెందింది. నాగమ్మ కుమారులు బాలచెరువు, వెంకటస్వామిలు గనులలో ట్రాక్టర్కు కూలీలుగా వెళ్లేవారు. ఈ క్రమంలో సుమారు 15 ఏళ్ల క్రితం ట్రాక్టర్లో రాళ్లు తీసుకొని వెళ్లే సమయంలో తిప్పలూరు వద్ద లారీ ఢీ కొన్న సంఘటనలో మృతి చెందారు. కుమారుల మరణంతో కుంగిపోయి.. భర్త, కుమార్తె చనిపోయినా కుమారులున్నారనే ధైర్యంతో జీవిస్తున్న నాగమ్మ చెట్టంత కొడుకులు కూడా మృత్యువాత పడటంతో మానసికంగా కుంగిపోయింది. తన కళ్ల ముందే కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా రాలిపోతుండటంతో ఆమె ఎంతగానో కలత చెందింది.‘ నా అనే వాళ్లందరూ చనిపోయారు.. ఇక నేనుఎవరి కోసం బతకాలనుకొని చావాలని ప్రయత్నం చేశాను.. కానీ దేవుడు నా చావును ఒప్పుకోలేదు’ అని నాగమ్మ కనీళ్లపర్యంతమైంది. నాకు ఎన్నేళ్లు ఉన్నాయో తెలియదు.. చావు రావాలని రోజూ కోరుకుంటున్నా.. భగవంతుడు మరచిపోయినట్టుండాడు.. అని ఆమె అంటుంటే ఆమె దీన స్థితిని చూసిన వారు అయ్యోపాపం అంటున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి ఆమె జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉంటోంది. నాలుగు రోజుల క్రితం ఆమెకు కాలు విరిగింది. దీంతో నడవలేని స్థితిలో ఉండిపోయింది. బుధవారం మానవ హక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ నాగమ్మను పరామర్శించారు. ఆపరేషన్ చేయించేందుకు ఆమె వైద్యులతో మాట్లాడారు. అనాథ శరణాలయంలో చేర్పిస్తాం ఉంటావా అని ప్రశ్నించగా.. ఎందుకమ్మా.. నా కష్టం ఇంకొకరి మీద వెయ్యాలా.. వద్దులేమ్మా..అని సున్నితంగా తిరస్కరించింది. ఆస్పత్రికి వచ్చే సందర్శకులు ఆమెకు సమయానికి ఇంత అన్నం పెడుతూ, తమకు తోచింది చేతిలో పెట్టి వెళ్తున్నారు. అందరినీ కోల్పోయి వృద్ధాప్యంలో కష్టమైన జీవితాన్ని నెట్టుకొస్తున్న నాగమ్మను మానవతావాదులు చేరదీయడం అవసరం. -
గొంతెండుతున్న పల్లెలు
అంగట్లో అన్నీఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా తయారైంది జిల్లాలోని గ్రామపంచాయతీల పరిస్థితి.రాష్ట్రప్రభుత్వ నిర్వాకం కారణంగా పంచాయతీలు సొంత నిధులను సైతం వాడుకోలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా గ్రామాల్లో జనం తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నారు. వీధి దీపాలు వెలగక చీకటిలో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నచిన్న మరమ్మతు పనులు కూడా చేసుకునే పరిస్థితిలేక సర్పంచులు చేతులెత్తేశారు. ప్రొద్దుటూరు: నగదు చెల్లింపులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఏర్పడిన ఇబ్బంది పంచాయతీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వేసవి కంటే ముందుగానే గ్రామాల్లో తలెత్తిన తాగునీటి సమస్య భయపెడుతోంది. నిధుల లేమి ఫలితంగా సర్పంచ్లు చర్యలు తీసుకోలేకపోవడంతో సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. జిల్లాలో మొత్తం 761 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించి నవంబర్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన వనరుగా ఉన్న 13వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. వాటితో అభివద్ధి పనులు చేపట్టాలని సర్పంచ్లు భావించేలోపే విద్యుత్ బిల్లులకు సంబంధించి ట్రెజరీలో ఆంక్షలు విధించారు. విద్యుత్ బకాయిలు చెల్లించే వరకు నిధులు విడుదల చేయవద్దని డీపీఓ అపూర్వ సుందరి ఏకంగా ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సుమారు రెండు నెలలపాటు ఈ సమస్య వెంటాడగా చివరికి సర్పంచులు అంగీకరించడంతో పరిష్కారమైంది. ఇక ఏ ఇబ్బందులు ఉండవు త్వరత్వరగా పనులు చేయాలనుకునే సమయంలో రాష్ట్రప్రభుత్వం గత నెల 27 నుంచి ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని జారీ చేసిన ఉత్తర్వులు గ్రామ పంచాయతీలకు గుదిబండగా మారాయి. కరువు పరిస్థితుల నేపథ్యంలో నదీపరివాహక గ్రామాల్లో సైతం అప్పుడే తాగునీటి సమస్య మొదలైంది. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నా సర్పంచుల చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రొద్దుటూరు మండలం గోపవరం, కొత్తపల్లె, సోములవారిపల్లె గ్రామ పంచాయతీలు మేజర్ పంచాయతీల జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే ఈ గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తింది. గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించి ఉన్న 8 బోర్లల్లో రెండు బోర్లు పూర్తిగా ఎండిపోగా మరో రెండింటిలో అంతంత మాత్రమే నీరు వస్తోంది. దీంతో 2 రోజులకోమారు నీరు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే చేసిన పనులకు సైతం లక్షల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అలాగే కొత్తపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించి మరింత పెద్ద మొత్తంలో నిధులు విడుదల రావాల్సి ఉంది. ఇటీవల తాగునీటి సమస్య పరిష్కారం కోసం కొత్తగా ఉపసర్పంచ్ గురుస్వామి బోర్లతోపాటు పైపులైన్ వేశారు. పనులు చేసి ప్రస్తుతం రోజూ నిధుల కోసం రోజు ట్రెజరీ చుట్టు తిరుగుతున్నారు. సోములవారిపల్లె గ్రామ పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వీరికి ప్రభుత్వ నిధులే ఆధారం. కేంద్ర ప్రభుత్వ నిధులపై పెత్తనం తగదు గ్రామ పంచాయతీలకు విడుదలైన టీఎఫ్సీ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం విచారకరం. ఇలా అయితే ఆర్థిక వనరులు లేని గ్రామ పంచాయతీల పరిస్థితి ఏమిటి. కుళాయి బిగించాలన్నా డబ్బు లేకపోవడం సర్పంచ్లను ఆందోళనకు గురిచేసే అంశం. - మోపూరి ప్రశాంతి, సర్పంచ్, సోములవారిపల్లె గ్రామ పంచాయతీ ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పడం లేదు గత నెల నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా నిలిపేసింది. కనీసం ఎప్పుడు నిషేధం ఎత్తివేస్తారో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. దీంతో ఆర్థికంగా సర్పంచ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. - కే.దేవీ ప్రసాదరెడ్డి, సర్పంచ్, గోపవరం గ్రామ పంచాయతీ -
గుడ్డూ లేదు.. ఫుడ్డూ లేదు
ఈమె పేరు ఎ.ప్రసన్నకుమారి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరంలో ఉన్న 33వ ఎస్సీ అంగన్వాడీ కేంద్రంలో బాలింతగా పేరు నమోదు చేసుకుంది. నిబంధనల ప్రకారం ప్రతి రోజు ఆమెకు గుడ్డుతో కూడిన భోజనాన్ని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేయాలి. అయితే గత నెల 21వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రంలో భోజనం పెట్టకుండా నిలిపేశారు. ఇదిలావుండగా 30వ తేదీ నుంచి గుడ్డు కూడా ఇవ్వడం లేదు. - ఎ.ప్రసన్న కుమారి ప్రొద్దుటూరు: అమృత హస్తం పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి బియ్యంతోపాటు గుడ్ల సరఫరా నిలిచిపోవడమే దీనికి కారణం. సరైన పోషణ అందనట్లయితే గర్భస్థ దశ నుండే శిశువులో పోషకాహార లోపం మొదలై బిడ్డ పుట్టిన తర్వాత ఆ ప్రభావం ఎదుగుదలపై ఉండకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం అమృత హస్తం పథకాన్ని ఏర్పాటు చేసింది. మొదటి విడతగా 2012 డిసెంబర్ 1, రెండో విడత 2013 డిసెంబర్ నెల నుంచి జిల్లాలో అమృత హస్తం పథకం అమలు చేశారు. నిబంధనల ప్రకారం గర్భవతి అయిన మూడో నెల నుంచి 6వ నెల బాలింత వరకు అంగన్వాడీ కేంద్రంలో భోజనం ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ప్రొద్దుటూరు రూరల్, పులివెందుల, ముద్దనూరు, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, పోరుమామిళ్ల, బద్వేలు ఐసీడీఎస్ ప్రాజెక్టులలో పథకం అమలవుతోంది. ఆగిన బియ్యం సరఫరా... గత నెల రోజులుగా జిల్లా అంతటా బియ్యం సరఫరా నిలిచిపోయింది. అలాగే గుడ్ల సరఫరాలో కూడా జాప్యం జరుగుతోంది. కేవలం పాలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రంలోని లబ్ధిదారులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావంతో అంగన్వాడీ కేంద్రాలు మధ్యాహ్నానికే మూతపడుతున్నాయి. అమృత హస్తం మినహా జిల్లాలో మరో 7 ప్రాజెక్టులు ఉండగా అన్నింటిలో 3-6 ఏళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే బియ్యం కొరత కారణంగా ఈ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా భోజనం పెట్టడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత నవంబర్ నుంచి బాలామృతం సరఫరా ఆగిపోయింది. ప్రత్యామ్నాయంగా బియ్యం, గుడ్లు, ఇతర వస్తువులు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఇంత వరకు జిల్లాకు బియ్యం కేటాయించలేదు. సరఫరా లేకపోవడంతోనే... అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పై నుంచి సరఫరా కాలేదు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంది. దీంతో అమృత హస్తం అమలుకు సమస్యలు ఏర్పడుతున్నాయి. వచ్చిన వెంటనే సరఫరా చేస్తాం. గుడ్లు సరఫరా అవుతున్నాయి. - శ్రీదేవి, సీడీపీఓ, ప్రొద్దుటూరు రూరల్ ప్రాజెక్టు భోజనం పెట్టలేకపోతున్నాం .. బియ్యం సరఫరా లేకపోవడం వల్ల భోజనం పెట్టలేకపోతున్నాం. మా అంగన్వాడీ కేంద్రంలో 14 మంది గర్భవతులు, బాలింతలు ఉన్నారు. జనవరి 21 నుంచి వీరికి భోజనం లేదు. ప్రస్తుతం గుడ్లు కూడా లేవు. శోభారాణి, అంగన్వాడీ కార్యకర్త ఈమె పేరు గురులక్ష్మి. ప్రొద్దుటూరు మండలంలోని ఈశ్వరరెడ్డినగర్ 3వ అంగన్వాడీ కేంద్రంలో గర్భవతిగా పేరు నమోదు చేసుకుంది. అయితే ప్రస్తుతం ఈమెకు అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం పెట్టకుండా ఆపేశారు. కారణం బియ్యం లేకపోవడమేనని అంగన్వాడీ కార్యకర్త చెప్పార ని వాపోతోంది. గురులక్ష్మి -
బిడ్డా.. వెళ్లిపోయావా
ప్రొద్దుటూరులో ఆదివారం బాలకృష్ణ పర్యటన ఓ కుటుంబానికి కడుపుకోతను మిగిల్చింది. ‘లెజెండ్’ విజయోత్సవ సభకు బాలకృష్ణ వస్తుండటంతో ఆయనను చూడటానికి గంగాధర్, నాగశేషుడు, రమేష్ అనే వారు బైక్లో బయల్దేరారు. ఇంతలో పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఢీ కొనడంతో గంగాధర్ మృతి చెందాడు రమేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ప్రొద్దుటూరు క్రైం: లెజండ్ విజయోత్సవ సభ విషాదాన్ని మిగిల్చింది. అతి వేగంగా వస్తున్న పోలీసు ఎస్కార్ట్ వాహనం ఢీ కొనడంతో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు వాహనం ఢీ కొన్న సంఘటనలో పొట్టిపాడు రోడ్డులోని కాల్వకట్టకు చెందిన దిద్దిగారి గంగాధర్ (11) మృతి చెందగా ఎర్రబల్లి నాగశేషుడు, మిద్దె రమేష్ గాయపడ్డారు. వారిలో మిద్దె రమేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. లెజండ్ చిత్రం విజయోత్సవ సభను ఆదివారం పట్టణ శివారులో ఉన్న రాయల్ కౌంటీ రిసార్ట్స్లో నిర్వహించాలని భావించారు. బాలకృష్ణకు రక్షణ కల్పించేందుకు కడప నుంచి ఎస్కార్ట్ వాహనం రాయల్ కౌంటీ మార్గంలో వెళుతోంది. పట్టణంలోని కాల్వకట్టకు చెందిన గంగాధర్, నాగశేషుడు, మిద్దె రమేష్ అదే సమయంలో రాయల్ కౌంటీకి బయల్దేరారు. రాయల్ కౌంటీ సమీపంలోని మైలవరం కెనాల్ వద్దకు వెళ్లగానే వెనుకవైపు నుంచి వస్తున్న పోలీస్ ఎస్కార్ట్ వాహనం వారి మోటార్బైక్ను ఢీకొంది. గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే దిద్దిగారి గంగాధర్ మృతి చెందాడు. ఎర్రబల్లి నాగశేషుడుకు కాలు విరిగింది, మిద్దె రమేష్ ప్రమాదం జరిగినప్పటి నుంచి అపస్మారక స్థితిలో ఉన్నాడు. రమేష్ను కర్నూలు ఆస్పత్రికి తరలించగా నాగశేషుడిని కడప రిమ్స్కు తరలించారు. మధ్యతరగతి కుటుంబాల్లో విషాదం గంగన్న పొట్టిపాడు రోడ్డులోని కాల్వకట్టలో నివాసం ఉంటున్నాడు. అతనికి గంగాధర్, గణేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గంగాధర్ ఒలివియా స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. గంగన్న రాయల్ కౌంటీలో పనిచేస్తున్నాడు. బాలకృష్ణ అక్కడికి రానుండటంతో గంగాధర్, నాగశేషుడు కలిసి రాయల్ కౌంటీకి బయల్దేరారు. విషయం తెలియడంతో రమేష్ కూడా వారితోపాటు వెళ్లాడు. అతను గంగాధర్ను ఉన్నత చదువులు చదివించాలని తపించాడు. అయితే విధి మరోలా తలిచింది. కుమారుడు మృతి చెందాడన్న విషయం తెలియడంతో తల్లిదండ్రులు నాగలక్షుమ్మ, గంగన్నలు ఆస్పత్రికి చేరుకున్నారు. కుమారుని పరిస్థితిని చూసి వారు సొమ్మసిల్లిపోయారు. ఐదు నెలల క్రితమే వివాహం అయింది మిద్దె రమేష్ పట్టణంలోని గాంధీరోడ్డులో టైలర్గా పనిచేస్తున్నాడు. అతనికి ఐదు నెలల క్రితం అమృతానగర్కు చెందిన లక్ష్మిదేవితో వివాహం అయింది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు ఈ వార్తను భార్యకు తెలియనివ్వలేదు. వెంటనే అతన్ని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఎర్రబల్లి నాగశేషుడు గంగాధర్కు సమీప బంధువు. ఇద్దరు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. అతని తండ్రి నాగమయ్య బేల్దారి పనికి వెళ్లేవాడు. నాగమయ్యకు నాగశేషుడితోపాటు నాగమల్లేశ్వరి, నాగమ్మ అనే కుమార్తెలు ఉన్నారు. విషయం తెలియడంతో డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి సంఘటన స్థలికి చేరుకున్నారు. ఎర్రగుంట్లలో.. ఎర్ర గుంట్ల: సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన అభిమానులలో, టీడీపీ కార్యకర్తలతో నిరాశ మిగిల్చింది. అంతేకాక అపశృతి దొర్లింది. బాలయ్యను చూడడానికి వచ్చిన ఓ కార్యకర్తపై లెజండ్ బస్సు ఎక్కింది. దీంతో ఆ కార్యకర్త కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ముద్దనూరు మండలం కొత్తపల్లెకు చెందిన ప్రవీణ్ బాలయ్య చూడడానికి ఎర్రగుంట్లకు వచ్చాడు. పోలీస్స్టేషన్ వద్దకు రాగానే అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ రద్దీలో ప్రవీణ్ను బస్సు ఢీకొంది. 108 వాహనంకు సమాచారం అందించి గాయాలపాలైన ప్రవీణ్ను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా బాలయ్య వస్తున్నారని తెలిసి చూడడానికి వచ్చిన అబిమానులలో ప్రత్యేకించి మహిళలలో టీడీపీ కార్యకర్తలలో నిరాశ మిగిలింది. -
యూ అల్లా..!
ఆ యువజంటపై ఏ దుష్టశక్తి కళ్లు పడ్డాయో ఏమో.. అత్యంత పవిత్ర స్థలమైన మక్కాకు బయలు దేరిన వారు శాశ్వతంగా అల్లా వద్దకే చేరుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన హసద్(25), షేక్ రిహానా (21)లకు ఏడు నెలల క్రితమే వివాహమైంది. సౌదీలో వ్యాపారం చేస్తున్న హసద్ భార్య, తల్లి, సోదరుడు నూర్తోపాటు మదీనా వెళ్లి అక్కడి నుంచి మక్కా యూత్రకు బయలుదేరారు. ఇంతలోనే విధి చిన్నచూపు చూసింది. చీకట్లో మృత్యురూపంలో ఆగి ఉన్న ఓ ట్యాంకర్ ఆ యువజంటను కాటేసింది. ఈ ప్రమాదంలో హసద్ తల్లి జిలాన్ బేగం కూడా మృత్యువాతపడగా.. సోదరుడు నూర్ తీవ్ర గాయూలతో చికిత్స పొందుతున్నాడు. ప్రొద్దుటూరు క్రైం: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని కబళించింది. నిలిచి ఉన్న ట్యాంకర్ను కారు ఢీ కొన్న సంఘటనలో ఒకే కుటుం బానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో మక్కాకు 150 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెం దిన దంపతులు షేక్ రిహానా (21), హసద్ (25)తోపాటు హసద్ తల్లి జిలాన్బేగం (51)లు మృతి చెందగా నూర్ అనే యువకుడు గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు స్థానిక ఆర్ట్స్కాలేజి రోడ్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ అమీర్ కుమార్తె రిహానాకు ఏడు నెలల క్రితం శ్రీనివాసనగర్లో ఉన్న హసద్తో వివాహం జరిగింది. రెండు నెలల తర్వాత దంపతులిద్దరూ సౌదీకి వెళ్లిపోయారు. 10 ఏళ్ల నుంచి సౌదీ అరేబియాలోనే.. హసద్ సౌదీ అరేబియాలోని రియాద్లో సూపర్మార్కెట్ నిర్వహిస్తున్నాడు. అతనితోపాటు తల్లిదండ్రులు జిలాన్బేగం, ఖాసిం, సోదరులు ఇబ్రహిం, నూర్లు కూడా అక్కడే ఉన్నారు. ఇటీవలే తల్లి జిలాన్బేగం నూర్తో కలిసి ఇండియాకు వచ్చింది. కొన్ని రోజులపాటు ఇక్కడ ఉన్న జిలాన్బేగం చిన్న కుమారుడు నూర్తో కలసి 12 రోజుల క్రితం సౌదీకి వెళ్లింది. రెండు రోజుల క్రితం హసద్ దంపతులతోపాటు జిలాన్బేగం, నూర్లు కలిసి కారులో మదీనాకు బయలుదేరారు. తర్వాత అక్కడి నుంచి గురువారం రాత్రి మక్కాకు బయలుదేరారు. అయితే వారి వాహనం మదీనాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉండగా శుక్రవారం ఉదయం 4.15 (భారత కాలమానం ప్రకారం) సమయంలో నిలిచి ఉన్న ట్యాంకర్ను ఢీ కొంది. ఈ సంఘటనలో రిహానా, హసద్, జిలాన్బేగంలు మృతి చెందగా నూర్కు గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో స్పృహ కోల్పోయిన నూర్ సుమారు రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చాడు. వెంటనే అతను సౌదీలో ఉంటున్న బంధువులతోపాటు ప్రొద్దుటూరులో ఉన్న వారికి సమాచారం అందించాడు. కాగా రిహానా 7 నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపారు. మక్కా యాత్ర అనంతరం కొద్ది రోజుల్లోనే కూతురు, అల్లుడు ఇండియాకు వచ్చేవారని చెప్పుకుంటూ అమీర్ రోదించసాగాడు. పరామర్శించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విషయం తెలియడంతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మునిసిపల్ ఛైర్మన్ గురివిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు వీఎస్ ముక్తియార్, ఈవీ సుధాకర్రెడ్డి తదితరులు ఆర్ట్స్ కాలేజి రోడ్డులోని అమీర్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. రోడ్డు ప్రమా దం ఎలా జరిగిందో వారు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే రాచమల్లు అమీర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. గోపవరం సర్పంచ్ దేవీ ప్రసాద్రెడ్డి, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, కౌన్సిలర్లు చక్రకోళ్ల రాందాసు, జయశంకర్, కోనేటి సునంద, వైఎస్సార్సీపీ నాయకులు పోసా భాస్కర్, కుతుబుద్దీన్, రాయల్గౌస్ తదితరులు అమీర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
నకిలీ బాబా కోర్టుకు హాజరు
ప్రొద్దుటూరు టౌన్/ఎర్రగుంట్ల: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తితోపాటు అతనికి సహకరించిన లోమడ సుబ్బారెడ్డిని ఎర్రగుంట్ల పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా సుబ్బారెడ్డికి వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్ విధించారు. స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తికి మతిస్థిమితం సరిగాలేదన్న కారణంతో వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు తిరిగి ఎర్రగుంట్లకు తీసుకెళ్లారు. స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తి వద్ద సుబ్బారెడ్డితోపాటు మరో ఇద్దరు అక్కడే ఉండి స్వామీజీని నమ్ముకుంటే ఎలాంటి సమస్యలున్నా తీరుతాయని, పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుందని, స్వామి వద్దకు వస్తే దెయ్యాలు పోతాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇటీవల అయ్యప్పస్వామి దేవాలయంలో జరిగిన లక్షార్చన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న చాలా మంది స్వామీజీ వేషంలో ఉన్న మతిస్థిమితం లేని వ్యక్తిని చూసి ప్రలోభాలకు గురయ్యారు. స్వామీజీ వేషంలో ఉన్న వ్యక్తిని కోర్టు తిరిగి పోలీసులకు అప్పగించడంతో పోలీసులకు ముప్పుతిప్పలు తప్పలేదు. అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం కష్టంగా మారింది. ఏ క్షణంలో అతను ఏం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో పోలీసులు కాపలాగా సిబ్బందిని ఉంచి పర్యవేక్షిస్తున్నారు. గురువారం క్రిస్మస్ పండుగ కావడంతో కడప రిమ్స్కు తరలించినా అక్కడ వైద్యులు అందుబాటులో ఉండకపోవచ్చని పోలీసులు శుక్రవారం వరకు స్టేషన్లోనే ఉంచుకునే అవకాశం ఉంది. -
దొంగ బాబా అరెస్ట్
ప్రొద్దుటూరు టౌన్: అతను మతిస్థిమితం లేని వ్యక్తి. కొద్ది రోజుల క్రితం వరకూ ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రి వద్ద, సార్వకట్టవీధిలోని ఉన్న చెత్త కుండీల వద్ద కూర్చుని ఉండేవాడు. అలాంటి వ్యక్తికి కొందరు స్వామీజీ వేషం వేశారు. పిల్లలు లేని వారు స్వామీజీ వద్దకు వస్తే పిల్లలు పుడతారని, ఎలాంటి సమస్యలు ఉన్నా తీరుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతే ఇక దోచుకోవడం వారి వంతైంది. ఎర్రగుంట్ల రోడ్డులో అయ్యప్పస్వామి దేవాలయం వెనుక ఉన్న ఓ చెట్టును ఆసరాగా చేసుకున్నారు. అక్కడ స్వామీజీ వేషం వేసి ఓ కుర్చీలో కూర్చోబెట్టి వచ్చిన వారికి ఆ వ్యక్తితో(స్వామీజీ) మట్టి ఇప్పిస్తున్నారు. ఈ స్వామీజీ మోసాన్ని పసిగట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున పూజలు.. ఇంకేముంది మహిళలు పెద్ద ఎత్తున స్వామీజీ వద్దకు రావడం, హారతులు ఇవ్వడం, పూలమాలలు వేయడం మొదలుపెట్టారు. ఈ తతంగం రెండు నెలలుగా జరుగుతోంది. అయితే స్వామి వేషంలో ఉన్న వ్యక్తి వచ్చిన వారిని చూస్తూ కూర్చుంటాడు. అక్కడ స్వామీజీ శిష్యులుగా చెప్పుకుంటున్న వారు మహిళల పట్ల స్వామీజీ స్పర్శ పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆ ప్రాంతంలో ఉన్న రైతులు చెబుతున్నారు. హుండీ ఏర్పాటు... అక్కడే ఓ హుండీ ఏర్పాటు చేశారు. స్వామి వారికి ఆశ్రమం నిర్మించాలని వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్కడే ఆ మతిస్థిమితం లేని వ్యక్తికి పరుపు, మంచం ఏర్పాటు చేశారు. వంట సామాన్లు, అన్నదానాల పేరుతో పెద్ద ఎత్తున నిత్యావసరాలు వసూలు చేస్తున్నారు. స్వామీజీ పేరుతో జరుగుతున్న అసాంఘిక చర్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు అరెస్టు ఎర్రగుంట్ల: పెన్నానది సమీపంలోని య్యప్పస్వామి దేవస్థానం వెనుక భాగంలో దెయ్యాలు వదిలిస్తానంటూ మహిళలను ప్రలోభాలకు గురిచేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. అలాగే ఇతిన్న ప్రోత్సహించిన లోమడ సుబ్బారెడ్డిని కూడా అరెస్టు చేశామన్నారు. అయ్యప్పస్వామి దేవస్థానం వెనుక భాగంలో స్వామి అనే వ్యక్తి మహిళలకు దెయ్యాలు ఉన్నాయంటూ వారిని లోబరుచుకొని అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని భూమిరెడ్డి భాస్కర్రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో కేసు నమోదు చేసి దొంగ స్వామిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అమ్మాలంటే.. పాతాళంలో
ప్రొద్దుటూరు: దళారుల ప్రమేయం లేకుండా రైతుల నుంచి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. ఆ డబ్బును కూడా రైతులకు 48 గంటల్లో చెల్లించడం జరుగుతుందని స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ప్రస్తుతం పంట నూర్పిళ్ల సీజన్ ప్రారంభమైనా జిల్లాలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దీంతో గత్యంతరం లేక రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోతున్నారు. వారు చెప్పిన ధరలకు ధాన్యాన్ని అమ్మక తప్పడంలేదు. కనీసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా ప్రభుత్వం గ్రామాల్లో రైతులకు ఇంతవరకు వెల్లడించలేదు. తమకు దళారులే దిక్కు అని రైతులు భావిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ఈ ఏడాది సరికొత్త నిబంధనలను అమలు చేసింది. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ గత నెల 25న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గ్రేడ్ ఏ ధర క్వింటాలు రూ.1400, కామన్ వెరైటీ ధర రూ.1360లుగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి నిర్ణయించింది. ఇందుకు సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో డ్వాక్రా సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 48 గంటల్లో ఆ రైతులకు డబ్బు ఇవ్వాలని నిబంధనలు విధించారు. ఈ విషయంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. అసలు నిబంధనలు ఎలా ఉంటాయో తెలియకపోయినా ఇప్పటి వరకు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఊసే లేదు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, మీరు అధైర్య పడాల్సిన అవసరం లేదని రైతులకు భరోసా ఇచ్చేవారు లేరు. వాస్తవానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతుకు గిట్టుబాటు కాకపోయినా ఈ కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వ ధర కన్నా మార్కెట్ ధరే అధికంగా ఉండేది. అయితే వ్యాపారులు క్రమేపి ధరలు తగ్గిస్తూ వస్తున్నారు. వారం రోజుల క్రితం గ్రేడ్ ఏ ధాన్యం (జిలకర మసూర) 8 బస్తాల ధర రూ. 9,500 ఉండగా శుక్రవారం రూ.8,800లకు తగ్గించారు. ప్రస్తుతం వర్షం ప్రభావం కనిపిస్తుండటంతో రైతులు త్వరితగతిన పంట నూర్పిళ్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు, దళారులు ధాన్యం ధరలు తగ్గించారు. పైగా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో దళారులు చెప్పిందే గ్రామాల్లో సాగుతోంది. గతంలో రైతులు చాలా మంది నేరుగా అమ్మకుండా నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో ధరలు పెరుగుతాయని రైతులు విశ్వసించడం లేదు. ఉన్న వరకు పండిన వెంటనే అమ్ముకోవడమే మేలని భావిస్తున్నారు. జనవరి నెలాఖరులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం జిల్లాకు సంబంధించి 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తమ టెక్నికల్ సిబ్బంది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లకు వెళ్లారు. ఈనెలాఖరులో వారు తిరిగి వస్తారు. జిల్లాలో ఇంకా ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదు. వచ్చే నెలాఖరులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. - బుల్లారావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దళారులను ఆశ్రయించాల్సిందే అధికారులెవ్వరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పలేదు. గ్రామంలోకి దళారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. నాలుగు ఎకరాల్లో పండిన ధాన్యాన్ని బస్తా రూ.1100లతో అమ్ముకున్నా. ధర గిట్టుబాటు కాక నష్టపోతున్నాం. - గంజికుంట వెంకట సుబ్బారెడ్డి, రైతు అడిగేవారు లేరని ... ప్రస్తుతం పండించిన ధాన్యానికి డిమాండ్ లేదు. వ్యాపారులు పెద్దగా రావడం లేదు. దీంతో ఉన్న ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. ఒక్కో రోజు ఒక్కో ధరను మార్కెట్లో నిర్ణయిస్తున్నారు. - సహదేవరెడ్డి, రైతు -
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దొంగలు పడ్డారు
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దొంగలు పడ్డారు.. రూ. లక్షలు విలువ చేసే జనరేటర్తో పాటు ఏసీని మాయం చేశారు. దీనిపై పోలీసు కేసు నమోదు చేయాలని స్వయంగా అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే మున్సిపల్ చైర్మన్ను కోరుతున్నారు. అయితే నిర్ణయం తీసుకునే విషయంలో చైర్మన్ తటపటాయిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని గురువయ్యతోటలో నివాసం ఉంటున్న శివనాగప్రసాదరెడ్డి ఇంటిపై (26/284-25) రిలయన్స్ సెల్ టవర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2008లో ఇందుకు సంబంధించి రిజిష్టర్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే అప్పట్లో చుట్టుపక్కల వారు ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అనుమతి లేకుండా ఎలా టవర్ నిర్మిస్తారని మున్సిపల్ అధికారులు టవర్ దగ్గర ఏర్పాటు చేసిన జనరేటర్తోపాటు ఎయిర్ కండీషన్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5లక్షలు ఉంటుందని అంచనా. అప్పటి నుంచి ఇవి మున్సిపల్ కార్యాలయ ఆవరణంలోనే ఉండేవి. అప్పటి కౌన్సిలర్ బద్వేలి శ్రీనివాసులరెడ్డి, ప్రస్తుత కౌన్సిలర్ మార్కాపురం గణేష్బాబు వీటిని క్రేన్ సహాయంతో మున్సిపల్ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. కొత్తగా పాలకవర్గం ఏర్పాటు కావడంతో తన సమస్యను శివనాగప్రసాదరెడ్డి సతీమణి రాజేశ్వరి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ల ద్వారా విన్నవించారు. శివనాగప్రసాదరెడ్డి తనకు సహచరుడు కావడంతో 32వ వార్డు కౌన్సిలర్ కోనేటి సునంద భర్త భాస్కర్రెడ్డి కొద్ది రోజుల కిందట మున్సిపల్ అధికారులను కలిసి జనరేటర్, ఏసీ మిషన్లను అప్పగించాలని కోరారు. అందుకు సంబంధించిన పత్రాలు వెతికి అప్పజెప్పుతామని టౌన్ప్లానింగ్ సెక్షన్లోని నాగేంద్ర తెలిపారు. ఈ విషయంపై ఈనెల 2వ తేదీన రాజేశ్వరి మున్సిపల్ చైర్మన్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా సమస్యను నాన్చుతుండటంతో భాస్కర్రెడ్డి స్వయంగా చైర్మన్కు ఫిర్యాదు చేశారు. కార్యాలయ ఆవరణంలో ఉన్న జనరేటర్, ఏసీ మిషన్లు కన్పించడంలేదని సిబ్బంది చైర్మన్కు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికార పార్టీ కౌన్సిలర్లు ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు చేయాలని స్వయంగా చైర్మన్కు విన్నవించారు. నేడో రేపో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డిని వివరణ కోరగా జనరేటర్, ఏసీ మిషన్లు కనిపించని మాట వాస్తవమేనన్నారు. -
కొందామా.. వద్దా..!
ప్రొద్దుటూరు కల్చరల్ : మార్కెట్లో పుత్తడి ధరలు ఊగిసలాడుతున్నాయి. కొన్ని రోజులు గా బంగారు ధరలు పెరగడం అంతలోనే తగ్గుతూ రావడంతో కొందామా.. వద్దా అని వినియోగదారులు ఊగిసలాడుతున్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో బంగారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారాన్ని ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది. కొన్నేళ్లుగా బంగారం ధర చుక్కలను అంటుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనే పరిస్థితి కనిపించడంలేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం, తగ్గడం, రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు ఉండటంతో బంగారు ధరలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.2680, 22 క్యారెట్ల బంగారం ధర రూ.2467 ఉండగా వెండి కిలో రూ.36800గా ఉంది. డిసెంబర్ 1వ తేదీన 24క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.2,620, 22 క్యారెట్లు రూ.2,410, వెండి కిలో ధర రూ.34,400గా ఉంది. 2వ తేదీనాటికి 10 గ్రాముల మీద దాదాపు రూ.850 వరకు పెరిగి 24 క్యారెట్ల గ్రాము ధర రూ.2705, 22 క్యారెట్ల ధర రూ.2488కు చేరింది. వెండి కిలో మీద రూ.2500 పెరిగి రూ.36,900కు చేరింది. పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ... పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికి బంగారం కొనుగోలు అంతంత మాత్రంగా జరుగుతుండటంతో షరాబు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ధరలు కాస్త దిగి రావడంతో పసిడి విక్రయాలు పుంజుకుంటాయని వధూవరులకు అవసరమైన బ్రాస్లెట్, చైను, గాజులు, హారాలు, ఉంగరాలు వంటి నూతన డిజైన్లను తయారు చేయించి అమ్మకానికి సిద్ధం చేశారు. అయితే రెండేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వ్యాపారాలు పడిపోయాయని వ్యాపారులు వాపోతున్నారు. పుత్తడి ధరలు భారీగా దిగిరావచ్చనే భావన ఉండటమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ప్రజలలో ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, పెట్టుబడులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని, ఇళ్లు, వాహన కొనుగోళ్లకు ఇచ్చినట్లు బంగారానికి రుణాలు ఇవ్వక పోవడం వంటి కారణాలను వ్యాపారులు చెబుతున్నారు. సీజన్ అయినా... పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ వ్యాపారాలు లేవు. గతంతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా కొనుగోళ్లు చాలా వరకు పడిపోయాయి. వివాహాలు ఉన్నా అవసరమైన మేరకే ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. - బుశెట్టి రామ్మోహన్రావు, బులియన్ మార్కెట్ మెంబర్ ధరలు తగ్గుతాయని చూస్తున్నారు బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలుసుకుంటుండటంతో ప్రజలు కొనుగోలు చేసేందుకు వేచిచూస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ అయినా అంతంతమాత్రంగానే కొనుగోళ్లు ఉన్నాయి. - రామమనోహర్, షరాబు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు ఆర్డర్లు తగ్గాయి... బంగారం ధరల హెచ్చుతగ్గుల వల్ల ప్రజలు కొనేందుకు ఆసక్తి కనపరచడం లేదు. దీంతో ఆర్డర్లు తగ్గాయి. కొందరు వ్యాపారస్తులు ఇతర ప్రాంతాల నుంచి ఆభరణాలు దిగుమతి చేసుకుంటున్నారు. - రమణాచారి, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు -
బయోమెట్రిక్ విధానం..అదో ఆర్భాటం
ప్రొద్దుటూరు: సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో బోగస్ అటెండెన్స్ నివారణకు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన బయో మెట్రిక్ విధానం అమలు ప్రశ్నార్థకంగా మారింది. లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్ సామగ్రి నిరుపయోగంగా ఉంది. వాస్తవానికి చాలా రోజుల క్రితమే సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కొత్తగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాగానే విద్యార్థుల హాజరునుబట్టి వసతి గృహ సంక్షేమాధికారులకు ల్యాప్టాప్లతోపాటు బయోమెట్రిక్ మిషన్లు సెప్టంబర్లో సరఫరా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 998 వసతి గృహాలకు ఈ సామగ్రి చేరింది. జిల్లాకు సంబంధించి 140 వసతి గృహాలకుగాను 99 వాటికి సరఫరా చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన సాఫ్ట్వేర్తో వీటిని రూపొందించడంతో ఒక్కో వసతి గృహానికి సంబంధించిన ల్యాప్టాప్ బయోమెట్రిక్ మిషన్ కొనుగోలుకు ప్రభుత్వం సుమారు రూ.లక్ష వరకు వెచ్చించినట్లు అధికార వర్గాల సమాచారం. ప్రతి రోజు ఉదయం, రాత్రి వేళల్లో విద్యార్థుల అటెండెన్స్ను బయోమెట్రిక్ ద్వారా సేకరించాల్సి ఉంది. ప్రధానంగా బోగస్ను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అయితే సంబంధిత ల్యాప్టాప్ కంపెనీ ప్రతినిధులు ఆయా డివిజన్లకు వచ్చి ల్యాప్టాప్లు అందించారే కానీ వినియోగంపై సరైన అవగాహన కల్పించలేదు. పూర్వం నుంచి రిజిష్టర్లపైన ఆధారపడిన హెచ్డబ్ల్యూఓలకు ఈ విధానంపై అవగాహన లేక ఆ సామగ్రిని తీసుకెళ్లి ఇళ్లల్లో దాచుకున్నారు. ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడితే మీరే బాధ్యులవుతారని ఉన్నతాధికారులు హెచ్చరించడంతో హెచ్డబ్ల్యూఓలు వీటిని భద్రంగా దాచి ఉంచారు. ఇదిలావుండగానే సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ జి.జయలక్ష్మి డిసెంబర్ 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ విధానాన్ని వసతి గృహాల్లో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అవగాహన లేని కారణంగా జిల్లాలో ఎక్కడా ఈ విధానం అమలుకు నోచుకోలేదు. -
ఐపీ.. బాంబులు
పసిడిపురిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణంలో బంగారు వ్యాపారులు ఐపీ పెడుతుండడంతో రుణదాతలు ఆందోళన చెందుతున్నారు. ఏకంగా కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పెట్టాబేడా సర్దుకుంటున్నారు. ఎప్పుడు ఎవరు ఐపీ పెడతారోననే ఖాతాదారులు భయపడుతున్నారు. కొందరు బంగారు దుకాణాల వద్ద ఆందోళనకు దిగుతున్నారు. పసిడి పురిగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణం ఐపీ బాంబులతో వణికిపోతోంది. మార్కెట్లో బాగా పేరున్న వ్యాపారులే ఐపీ బాట పట్టడంతో రుణదాతలు ఆందోళన చెందుతున్నారు.వ్యాపారులు వరుసగా దివాళా తీస్తుండటం మార్కెట్ వర్గాలను కలవరపరుస్తోంది. ఈ ప్రభావం బంగారు వ్యాపారంపై పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రొద్దుటూరు క్రైం: నాలుగు రోజుల కిందట పట్టణంలోని మెయిన్బజార్లో కరిష్మా జ్యూవెలర్స్ దుకాణ యజమానులు రూ. 7.50 కోట్లకు ఐపీ పెట్టారు. మరికొందరు అదే బాటలో పయనిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రొద్దుటూరు బంగారం అంటే రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. ఇక్కడ ప్రతి రోజూ కోట్లలో వ్యాపారం జరుగుతోంది. రాయలసీమతో పాటు ఇతర జిల్లాల వాసులు కూడా ఇక్కడి బంగారు కొనుగోలు చేస్తుంటారు. ఒకప్పుడు మెయిన్బజార్లో మాత్రమే ఉన్న దుకాణాలు ఇప్పుడు నాలుగైదు వీధులకు విస్తరించాయి. ప్రస్తుతం మోక్షగుండం వీధి, పాత మార్కెట్, రాజబాటవీధి, కోటవీధి, దర్గాబజార్ తదితర వీధుల్లో దుకాణాలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా బంగారు వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తున్నారు. నమ్మకం పోతోంది... బజార్లో చాలా మంది నమ్మకమే పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసేవారు. కొన్ని నెలల వరకూ చెన్నై, సేలం, కోయంబత్తూరు, నెల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసేవారు. తమ వద్ద నున్న బంగారు వస్తువులు పట్టణంలోని దుకాణాలకు వేసి కొన్ని రోజుల తర్వాత వచ్చి డబ్బు తీసుకెళ్లేవారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. బయటి ప్రాంతాలకు చెందిన వ్యాపారులు స్థానికంగా ఉన్న బంగారు దుకాణాలకు ఒక్క నగ కూడా ఇవ్వడం లేదు. డబ్బు ఇస్తే గానీ వారు నగలు ఇవ్వడం లేదు. దీనికి ఇటీవల కాలంలో చాలా మంది వ్యాపారులు ఐపీ పెట్టడమే కారణమని తెలుస్తోంది. బంగారు దుకాణం వద్ద ఆందోళన మోక్షగుండం వీధిలోని శ్రీనివాసా జ్యువెలరీ షాపు, కటింగ్ మిషన్ వద్ద గురువారం పలువురు వ్యక్తులు గుమికూడారు. షాపు యజమానులు మన్నేపల్లి వేణు, శివకుమార్లు తమకు డబ్బు ఇవ్వాలంటూ పలువురు రుణదాతలు దుకాణం వద్ద గుమికూడారు. చీటీల వ్యాపారులు, కార్పొరేషన్, బంగారు నగల తయారీ దారులతో పాటు 22 మందికి దుకాణ దారులు సుమారు రూ. 1.50 కోట్లు దాకా ఇవ్వాలని ఆందోళన కారులు తెలిపారు. మిట్టమడి వీధిలో ఉన్న ఇంటిని ఇది వరకే విక్రయించారని వారన్నారు. పెద్ద మనుషులు పంచాయితీ చేసి రూ 60 లక్షలు రుణ దాతలకు ఇచ్చేలా పంచాయతీ చేశారన్నారు. వేణు, శివకుమార్లు మాత్రం డబ్బు ఇవ్వకుండా ఐపీ దాఖలు చేసే యోచనలో ఉన్నారని వారు పేర్కొన్నారు. విషయం తెలియడంతో వేణు, శివకుమార్లు వన్టౌన్ పోలీస్టేషన్కు వెళ్లారు. విషయం తెలుసుకున్న బాకీదారులు స్టేషన్ వద్దకు వెళ్లి డబ్బు ఇప్పించాల్సిందిగా పోలీసులను కోరారు. మరో నలుగురు ఐపీ ! పట్టణంలో మరో నలుగురు బంగారు వ్యాపారులు ఐపీ పెట్టే యోచనలో ఉన్నట్లు మెయిన్బజార్లో చర్చించుకుంటున్నారు. ఓ బంగారు వ్యాపారి ఇప్పటికే రూ.25 కోట్లకు ఐపీ సిద్ధం చేసుకోగా మరో ము గ్గురు తొందరలోనే ఐపీ బాంబు పేల్చనున్నట్లు సమాచారం. మెయిన్బజార్లో ఒకరు, పాత మార్కెట్ ప్రాంతంలో మరో ఇద్దరు వ్యాపారులు ఐపీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఎవరి రూల్ వారిది
ఇది ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న భారతీయ స్టేట్బ్యాంక్ టౌన్ బ్రాంచి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. రుణమాఫీకి సంబంధించి రైతులు పట్టాదారు పాస్పుస్తకంతోపాటు 1-బి ఒరిజనల్, రేషన్, ఆధార్కార్డు, లోన్ తీసుకున్న రశీదు జిరాక్స్లు ఇవ్వాలని ఇందులో పేర్కొన్నారు. ప్రత్యేకంగా దరఖాస్తును కూడా బ్యాంక్ అధికారులు ముద్రించారు. చివరితేదీ ఈనెల 3వ తేదీ అని బ్యాంక్ నోటీసు బోర్డులో పెట్టారు. రుణమాఫీ కోసం గత నెల 25వ తేదీ చివరి రోజుగా ప్రొద్దుటూరు పట్టణంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ అధికారులు ప్రకటించడంతో రైతులు గ్రామాల నుంచి తరలి వచ్చి క్యూలో నిల్చొని ఒరిజనల్ పుస్తకాలను చూపించి జిరాక్స్ పత్రాలను ఇవ్వాల్సి వచ్చింది. ఈ బ్యాంక్లో 1-బి పత్రాలు మాత్రం అడగలేదు. అది ప్రొద్దుటూరు పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ అభివృద్ధి శాఖ బ్రాంచి. ఇక్కడ 1-బి ఒరిజనల్తోపాటు పట్టాదారుపాస్పుస్తకం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్ పత్రాలను ఇవ్వాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇప్పటికిప్పుడు 1-బి తయారు చేసి ఇవ్వడం కుదరదని రెవెన్యూ అధికారులు చెప్పడంతో దానిని తొలగించారు. ఎర్రగుంట్లలోని ఎస్బీఐలో ఏకంగా రైతుల నుంచి టైటీల్ డీడ్ ఒరిజనల్ పుస్తకాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ పుస్తకం తీసుకున్నట్లు రైతులకు రశీదులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఎదురు ప్రశ్నిస్తే బ్యాంక్ అధికారులు ఏమంటారోనని బ్యాంక్ అధికారులు అడిగిన వాటిని రైతులు సమర్పిస్తున్నారు. -
జిల్లాలో దొంగలు పడ్డారు
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణం మోడంపల్లె పరిధిలోని రాజేశ్వరి నగర్లో నివాసం ఉంటున్న వ్యాపారి కర్నాటి వీరశేఖర్రెడ్డి ఇంటిలో భారీ చోరీ జరిగింది. దొంగలు బంగారు, వెండి నగలతోపాటు నగదును అపహరించారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు ... వీరశేఖర్రెడ్డి తన సతీమణి శ్రీదేవి, పిల్లలు విశ్వనాథరెడ్డి, శివకుమార్రెడ్డి, జ్యోతిలతో కలిసి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలంకు వెళ్లారు. ఇంటిలో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన దొంగలు అదే రోజు రాత్రి చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని నెక్లస్లు, చైన్లు, బ్రాస్లైట్లు తదితర 25 తులాల బంగారు నగలు, వెండి ప్లేట్లు, చెంబు తదితర మూడున్నర కిలోల వెండి నగలను చోరీ చేశారు. వీటితోపాటు బీరువాలోనే ఉంచిన రూ.2.15లక్షల నగదును తీసుకెళ్లారు. సుమారు లక్ష రూపాయల విలువ గల మూడు పట్టు చీరెలను కూడా అపహరించారు. సోమవారం మధ్యాహ్న సమయంలో పక్కింటిలో నివశిస్తున్న మహిళ వీరశేఖరరెడ్డి ఇంటి తలుపులు తెరచిన విషయాన్ని గమనించింది. వెంటనే వీరశేఖర్రెడ్డికి ఫోన్ ద్వారా తెలిపింది. ఆయన తమ బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు ఇంటి వద్దకు వెళ్లి చోరీ జరిగినట్లు గుర్తించారు. సోమవారం సాయంత్రానికి ఇంటికి వచ్చిన వీరశేఖర్రెడ్డి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం క్లూస్ టీం అధికారులతోపాటు టూటౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి విచారించారు. సినీ హబ్ అధినేత బసిరెడ్డి రాజేశ్వరరెడ్డి, కౌన్సిలర్ నారాయణరెడ్డితోపాటు పలువురు వీరశేఖరరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారంలో రెండో సంఘటన ప్రొద్దుటూరులో వారంలో రెండో భారీ చోరీ సంఘటన వెలుగు చూడటం గమనార్హం. ఈనెల 23న వైఎంఆర్ కాలనీలోని డీఏడబ్ల్యూ కళాశాల కరస్పాండెంట్ దేవరశెట్టి నాగరాజు కుటుంబ సభ్యులతో బెంగుళూరుకు వెళ్లారు. ఆ సందర్భంగా ఇంటి తాళాలు పగులగొట్టి రూ.12.50 లక్షల విలువైన బంగారు, నగదును అపహరించుకెళ్లారు. 26వ తేదీన చోరీ సంఘటనను గుర్తించారు. ఇదే తరహాలో ప్రస్తుతం వీరశేఖర్రెడ్డి ఇంటికి తాళం వేసి శ్రీశైలంకు వెళ్లగా చోరీ జరగింది. దీనిని బట్టి తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఈసంఘటనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. -
నిర్లక్ష్యం
ప్రొద్దుటూరు టౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులు కంపచెట్లల్లో పడేశారు. ఇందులో చాలా వరకు మందులు ఇంకా కాలం చెల్లనివి, ఉండగా మరి కొన్ని కాలం చెల్లినవి కూడా కనిపిస్తున్నాయి. ప్రొద్దుటూరు పట్టణంలోని మడూరు రోడ్డు వీదుగా హౌసింగ్ బోర్డుకు వెళ్లే రహదారి పక్కన ఉన్న కంపచెట్లలో పెద్ద ఎత్తున మందులు కనిపించాయి. కాలం తీరిన మందులు ఎవరైనా ఎజెన్సీల వారు పడేసి ఉంటారని వాటిని పరిశీలించగా అందులో అన్నీ ప్రభుత్వం సరఫరా చేసిన మందులే ఉన్నాయి. విటమిన్ మాత్రలు, సిర ప్లు, గర్భం నిర్ధారణ చేసే స్లిప్లు, సిరంజిలు ఎక్కువగా కనిపించాయి. ప్యారాసిటమాల్ ఓరల్ సస్పెన్షన్ ఐపీ బ్యాచ్ నెంబర్ 15033బీజీ139 ఉన్నాయి. ఇవి 2015 ఏప్రిల్ నెల వరకు ఉపయోగించగలిగినవి ఉన్నాయి. అలాగే ఆల్బిల్డాజోల్ ట్యాబ్లెట్లు, విటమిన్ బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు, విటమిన్ ఏ అండ్ డీ ట్యాబ్లెల్లు పెద్ద ఎత్తున పడేసి ఉన్నాయి. వీటన్నిటికి ఈ ఏడాది డిసెంబర్ వరకు కాలపరిమితి ఉంది. కంపచెట్లలోకి ఎలా వచ్చాయి.... ప్రభుత్వం ఆసుపత్రులకు సరఫరా చేస్తున్న మందులు రోడ్లపై, కంపచెట్లల్లోకి ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు విచారణ చే యాల్సి ఉంది. ప్రభుత్వం సరఫరా చేసే మందుల బ్యాచ్ నెంబర్ల ఆధారంగా అవి జిల్లా ఆసుపత్రి మందులా లేక, అర్బన్ హెల్త్ సెంటర్లకు సరఫరా చేసిన మందులా, మండల పరిధిలోని ఆసుపత్రులకు సరఫరా చేస్తున్న మందులా అన్న విషయాన్ని తేల్చాల్సి ఉంది. కాలం ఉన్నా రోడ్లపై పడేయడానికి గల కారణాలపై కూడా అధికారులు నిగ్గు తేల్చాల్సి ఉంది. ప్రభుత్వం సరఫరా చేసిన మందులు కాలం తీరినా కూడా అవి రోడ్లపై పడేయటానికి వీలు లేదని వైద్యులు చెబుతున్నారు. వాటిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించి వేరే మందులు పొందాలని నిబంధన ఉంది. అలాంటి ది మందులను రోడ్లపాలు చేసిన వారిని ఉన్నతాధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. -
చేయి చేయి కలిపారు...
ప్రొద్దుటూరు: రోడ్డులో కంకర రాళ్లను ఏరివేస్తున్న వీరంతా కూలీలు కాదు.. ప్రొద్దుటూరు మండలం మీనాపురం గ్రామస్తులు.. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ఆదివారం తమ గ్రామానికి చెందిన రోడ్డును బాగు చేసుకున్నారు. ప్రభుత్వం నంగనూరుపల్లె నుంచి ఈ గ్రామం మీదుగా గండ్లూరు కొట్టాలు వరకు రోడ్డు నిర్మించేందుకు గత ఏడాది రూ.30లక్షల నిధులు మంజూరు చేసింది. 16 ఏళ్ల తర్వాత మళ్లీ రోడ్డు నిర్మాణానికి అధికారులు సిద్ధపడ్డారు. అయితే కాంట్రాక్టర్ ముందుగా మెటల్రోడ్డును నిర్మించి మధ్యలో వదిలేశారు. ఇందుకు గాను రూ.20లక్షల వరకు బిల్లు చేసుకున్నట్లు సమాచారం. తర్వాత ఈ రోడ్డు గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ల బెడద కారణంగా మెటల్రోడ్డు దెబ్బతిని గులకరాళ్లు లేచాయి. దీంతో నడవలేని పరిస్థితి. సైకిల్ ఎక్కడ పంచర్ అవుతుందోనని విద్యార్థుల ఆందోళన. ఆటోడ్రైవర్లు కూడా గ్రామానికి వచ్చే వారు కాదు. ప్రాధేయపడితే రూ. 200 డిమాండ్ చేసేవారు. గ్రామస్తులు ప్రత్యామ్నాయంగా పక్కనున్న రైతు పొలంలో దారి తయారు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ రైతు పొలం సాగు కోసం రోడ్డును పూడ్చివేశాడు. ఇక లాభం లేదనుకుని గ్రామస్తులు ఒక్కసారిగా చేయి చేయి కలిపారు. ఆదివారం అందరూ ఏకమై కిలోమీటరు పొడవునా ఉన్న గులకరాళ్లను ఏరివేసి రోడ్డును బాగు చేసుకున్నారు. -
ఇదేం దుస్థితి..
ప్రొద్దుటూరు క్రైం: ఇప్పటికే అర్ధమాసం దాటింది.. ప్రతి ఒకటో తేదీన జీతాలు తీసుకునే వైద్య విధానపరిషత్ ఉద్యోగులకు జూన్ జీతం ఇంత వరకూ అందలేదు.దీంతో ఆ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లా వైద్య విధాన పరిషత్ కింద డీసీహెచ్ఎస్ కార్యాలయంతోపాటు ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి, పులివెందుల, రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లెల ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో సుమారు 447 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 234 మంది రెగ్యులర్ ఉద్యోగులు కాగా 213 మంది ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది పని చేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.1.20 కోట్లు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.60 లక్షల మేర ప్రతి నెలా జీతాల రూపంలో చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 447 మంది ఉద్యోగులు ఉండగా ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రిలో 213 మంది ఉన్నారు. ఇక్కడ రెగ్యులర్ ఉద్యోగులు 93 మంది ఉండగా ఔట్సోర్సింగ్ కింద 110 మంది పని చేస్తున్నారు. జీతాలు రాక సిబ్బంది ఆందోళన ఉద్యోగులందరికీ మే నెలాఖరులో జీతాలు ఇచ్చారు. అయితే జూన్కు సంబంధించిన జీతం జూలై 1న రావల్సి ఉంది. అయితే ఇప్పటికే 16 రోజులు గడిచింది. కానీ జీతం డబ్బులు మాత్రం ఇవ్వలేదు. జీతం డబ్బునే నమ్ముకొని ఉన్న ఆఫీసు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. జీతం ఎప్పుడు వస్తుందా అని వారు ఎదురు చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. వీరిలో సుమారు 213 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. జీతం రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఎందుకు జీతాలు మంజూరు చేయడం లేదో అర్థంకాక ఉద్యోగులు సతమతమవుతున్నారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ప్రారంభంలోనే ఇలా ఉంటే పోనుపోనూ ఎలాంటి గడ్డుపరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. బడ్జెట్ లేదంటున్నారు ప్రతి నెల 3, 4 తేదీలలో జీతాలు వచ్చేవి. అయితే రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులో ఆలస్యమవుతోందని అధికారులు అంటున్నారు. జూన్ జీతం ఇంత వరకు రాలేదు. ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తాం. - రామ్మోహన్రావు, ఏపీ డాక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు ప్రతి విషయంలోనూ అలసత్వమే ప్రభుత్వం తమకు జీతాలు ఇవ్వడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. బడ్జెట్ కేటాయింపు జరగలేదనే సాకుతో ఆలస్యం చేస్తున్నారు. రావాలసిన ఏ బిల్లు అడిగినా బడ్జెట్ లేదని చెబుతున్నారు. జూన్ జీతం విడుదల చేయాలి. - సాయిలీల, నర్సెస్ అసోషియేషన్ తాలూకా ప్రెసిడెంట్ ఆందోళన చేస్తాం ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జీతాలు సక్రమంగా రావడం లేదు. జీతం ఆలస్యం అవుతుండటంతో చిరు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులను అడిగితే రెగ్యులర్ ఉద్యోగులైన మాకే దిక్కు లేదు. మీకు అప్పుడే ఎలా వస్తాయని అంటున్నారు. - రాజు, ఏపీమెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జూన్ జీతం వెంటనే ఇవ్వాలి జూన్ నెలకు సంబంధించి జీతం వెంటనే మంజూరు చేయాలి. పెరిగిన నిత్యావసర వస్తువులతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకుని జీతాలు మంజూరు చేయాలి. - శివకృష్ణ, ఏపీమెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు -
సబ్‘ప్లాన్’ లేదు!
ప్రొద్దుటూరు: జిల్లాలో ఎస్సీ,ఎస్టీ విద్యుత్ సబ్ప్లాన్ పథకం వల్ల అర్హులైన వారికి ఏమాత్రం ప్రయోజనం కలగడం లేదు. ఈ పథకం అమలై ఏడాది దాటినా ఇంత వరకు ఒక్కరికి కూడా పథకం వర్తించలేదు. దీంతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి బాబుజగ్జీవన్రామ్ జయంతి రోజైన గత ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్లో భాగంగా ఇందిరమ్మ కలలు పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 50 యూనిట్లలోపు గృహ విద్యుత్ ఉచితం, రూ.268కోట్ల గృహ విద్యుత్ బకాయిల రద్దు, ఇందిరమ్మ గృహ నిర్మాణ సహాయం రూ.1.05లక్షలకు పెంపు, భూమి కొనుగోలు వ్యయం రూ.5లక్షలకు పెంపు, విదేశాల్లో ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు రూ.10లక్షలు పెంచుతూ వరాలను ప్రకటించారు. అయితే ఈ పథకం నిధులుండి కూడా నీరుగారిపోయింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పథకం అమలుకు నోచుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం 50 యూనిట్లలోపు విద్యుత్ వాడకందారులకు అధికారులు ఈ విషయాన్ని తెలియజేయాల్సి ఉంది. అయితే విద్యుత్ అధికారులు మాత్రం 50 యూనిట్లలోపు విద్యుత్ వాడకందారులు కుల ధ్రువీకరణ పత్రాలు తమకు సమర్పించాలని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. లబ్ధిదారుల్లో ఎక్కువ మంది చదువులేనివారు కావడంతో ఈ విషయం వారికి తెలియలేదు. లబ్ధిదారులు కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన తర్వాత విచారణ చేసి విద్యుత్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపాల్సి ఉంది. అయితే ఇంత వరకు జిల్లాలో లబ్ధిదారుల వివరాల సేకరణే జరగలేదని తెలుస్తోంది. దీంతో ఇప్పుడిప్పుడే ఈపథకం అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఆయా ప్రాంతాల్లోని తమ అధికారులకు కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంది. దీంతో జాప్యం అవుతోంది. వారి నుంచి వచ్చిన నివేదికను అప్లోడ్ చేసి సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు పంపితే నిధులు విడుదల అవుతాయి. - గంగయ్య, ఎస్ఈ, జిల్లా ట్రాన్స్కో మాకు వివరాలు సమర్పించలేదు విద్యుత్ అధికారుల నుంచి మాకు లబ్ధిదారుల వివరాలు అందాల్సి ఉంది. ఆ నివేదికను మేము ఉన్నతాధికారులకు పంపితే నిధులు మంజూరవుతాయి. మొదట్లో నిధులు వచ్చి వెనక్కి వెళ్లాయి. - పీఎస్ఏ ప్రసాద్, జాయింట్ డెరైక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కులధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని తెలియదు కరెంటు ఉచితంగా పొందాలంటే కులధ్రువీకరణ పత్రం పొందాలని మాకు ఎవ్వరూ చెప్పలేదు. రుణ మాఫీ పత్రాన్ని మాత్రం ఇచ్చారు. పథకం ఎప్పుడు అమలవుతుందో ఏమో. మా లాంటి పేదలు కూడా డబ్బు కట్టాలా. - టి.జయమ్మ ఈమె పేరు బయమ్మ. ఈమె కూడా సుందరయ్య కాలనీలో గుడిసె వేసుకుని నివాసం ఉంటోంది. ఎస్టీ కులానికి చెందిన ఈమెకు అధికారులు విద్యుత్ రుణమాఫీ పత్రాన్ని రచ్చబండ కార్యక్రమంలో అందించారు అయితే ఇంత వరకు ఈ పథకం మాత్రం వర్తించకపోవడంతో యథావిధిగా బిల్లు చెల్లిస్తోంది. ఈ పథకం వివరాలను చెప్పేవారు కూడా కరువయ్యారు. -
ప్రొద్దుటూరు టు ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు క్రైం: ‘గతంలో మాదిరే ఇప్పుడు కూడా మేము మీకు విధేయులుగా ఉంటాం.. మాకు ప్రొద్దుటూరులో పోస్టింగ్ ఇప్పించండి సార్’ అంటూ పలువురు సీఐలు నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. త్వరలో పోలీసు శాఖలో బదిలీలు జరగనున్న నేపథ్యంలో పోస్టింగ్ల కోసం వారు నాయకులతో పైరవీలు చేయించుకుంటున్నారు. ప్రొద్దుటూరు పట్టణం వాణిజ్యానికి ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ బంగారు వ్యాపారంతో పాటు వస్త్ర వ్యాపారాలు కూడా ప్రతి రోజూ రూ.కోట్లలో జరుగుతాయి. రాజకీయ పరంగా కూడా పోలీసు అధికారులకు మిగతా ప్రాంతాల మాదిరిగా పెద్దగా ఒత్తిళ్లు ఉండక పోయినప్పటికీ పోలీసు అధికారులే స్వామిభక్తి ప్రదర్శిస్తుంటారు. అందువల్ల ఇక్కడ పని చేసేందుకు పోలీసు అధికారులు ఇష్టపడుతుంటారు. గతంలో పని చేసి వెళ్లిన అధికారులు మిగతా వారికి అవకాశం ఇవ్వకుండా తిరిగి వారే ఇక్కడికి బదిలీలు, ప్రమోషన్లపై రావడం పరిపాటిగా మారింది. గతంలో కూడా చాలా మంది ఎస్ఐలు, సీఐలు ఇక్కడిక్కడే బదిలీ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొందరు సీఐలైతే పట్టణంలోని అన్ని స్టేషన్లలో పని చేశారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బదిలీలు జరగనున్నాయి. దీంతో చాలా మంది సీఐలు ప్రొద్దుటూరు రావడానికి పోటీ పడుతున్నారు.కొన్ని రోజుల క్రితం ఇక్కడికి రావడానికి సంకోచించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఎంతో ఉత్సాహం చూపుతున్పట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సీఐలు అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడిని కలిసి వెళ్లిన ట్లు సమాచారం. గతంలో సునీల్ గ్యాంగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ పోలీసు అధికారి వారం రోజుల క్రితం జాతీయ రహదారికి సమీపంలో ఉన్న గ్రామానికి వెళ్లి నాయకుడిని కలిసినట్టు తెలిసింది. అంతేగాక గతంలో బద్వేల్ ప్రాంతంలో పని చే సి వివాదాస్పదుడుగా పేరు తెచ్చుకున్న సీఐ కూడా ఆ నాయకుడిని కలిసి వెళ్లినట్లు సమాచారం. కడపలో పని చేస్తున్న ఓ సీఐ ప్రొద్దుటూరు రావడానికి ఉత్సాహం చూపుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పట్టణంలో సీనియర్ నాయకుడికి ప్రధాన అనుచరుడిగా ఉన్న మాజీ కౌన్సిలర్ కుటుంబం కూడా కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న తమ బంధువైన సీఐకి ప్రొద్దుటూరులో పోస్టింగ్ ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు సీఐలైతే పోట్లదుర్తికి చెందిన టీడీపీ నాయకులను కలుస్తున్నట్లు తెలిసింది. వారి ద్వారా ప్రొద్దుటూరులో పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి పోస్టింగ్లు తీసుకునే అధికారులు ప్రజలకు ఏం సేవ చేస్తారో వేచి చూడాల్సిందే. -
కుందూ-పెన్నా కాలువపనులు రద్దు
ప్రొద్దుటూరు: ప్రభుత్వ ఆదేశాల కారణంగా ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీటిని అందించేందుకు మంజూరు చేసిన కుందూ-పెన్నా వరదకాలువ నిర్మాణ పనులు రద్దయ్యాయి. దీంతో ఈ పనులను అధికారులు నిలిపివేశారు. నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈపనులు మంజూరుకాగా త్వరలో టెండర్లు నిర్వహించాల్సి ఉంది. అయితే మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి హయాంలోమంజూరు చేసిన పనులను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్.కృష్ణారావు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో ఈనెల 4వ తేదీన జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం చిన్న నీటిపారుదల శాఖ పరిధిలోని కుందూ పెన్నా కాలువ నిర్మాణ పనులురద్దయ్యాయి. ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీరు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రివైఎస్ రాజశేఖరరెడ్డి తొలుతగా 2007 మే24న రూ.72.53 కోట్ల నిధులు మంజూరుచేయగా రూ.60.59 కోట్లతో కాంట్రాక్టుఅగ్రిమెంట్ జరిగింది. అయితే అసంబద్ధంగా అలైన్మెంట్ మార్చి చేపడుతున్నఈ పనులను నిలిపివేయాలని రైతులుకోర్టును ఆశ్రయించడంతోపాటు ఇందుకురాజకీయ కారణాలు కూడా తోడయ్యాయి. ఈ కారణంగా పనులు సగం కూడా కాకముందే ఆగిపోయాయి. మొత్తం పెద్దముడియం మండలంలోని నాగరాజుపల్లెనుంచి 33.907 కిలోమీటర్ల పరిధిలోపనులు జరగాల్సి ఉండగా కేవలం 12.80కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యాయి.ఇంకా 21.107 కిలోమీటర్లు పనులు చేపట్టాల్సి ఉంది. అలాగే కాలువ నిర్మాణంలోభాగంగా 44 స్ట్రక్చర్లకుగాను రెండు కూడాపూర్తిగా నిర్మించలేదు. 924.95 ఎకరాలుభూసేకరణ చేయాల్సి ఉండగా కేవలం503.28 ఎకరాలు మాత్రమే పూర్తయింది.ఇంకా 421.67 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు అయినపనులకు రూ.28.327 కోట్ల నిధులు ఖర్చుచేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేనంద్యాల వరదరాజులరెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి హయాంలో ఈపనులను పునరుద్ధరించేలా మళ్లీ కొత్తగాపనులు ప్రారంభించేందుకు అనుమతిమంజూరు చేయించుకున్నారు. జీఓ ఆర్టీనెంబర్ 118 ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి6వ తేదీన రూ.183.2197 కోట్లతో ఈ పథకాన్ని పునరుద్ధరించారు. వెంటనే ఎన్నికలురావడంతో పనులు ముందుకు సాగలేదు.త్వరలో ఇందుకు సంబంధించి టెండర్లుపిలవాల్సి ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు దీనిపై ఆంక్షలువిధించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యద ర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు గత ఏడాది సెప్టెంబర్ నుంచిమంజూరైన పనులు ఆగిపోయాయి. మిగతా పనులతోపాటే ఆగిపోయాయి..ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మిగతా పనులతోపాటే కుందూ-పెన్నా వరద కాలువపనులు ఆగిపోయాయి. పనులు తిరిగిప్రారంభించాలంటే ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిఉంటుంది. - పట్టాభి రామిరెడ్డి, ఇన్చార్జి డీఈ -
ఏం సెట్టో!
ప్రొద్దుటూరు: జిల్లాలో ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష రాసిన వేలాది మంది విద్యార్థులపరిస్థితి అగమ్యగోచరంగా మారింది.నిబంధనల ప్రకారం ప్రతి ఏటా జూలైఆఖరు నాటికి ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తిచేసి ఆగస్టు 1 నుంచి ఇంజినీరింగ్ తరగతులను ప్రారంభించాల్సి ఉంది. సుప్రీంకోర్టుకూడా గతంలో ఈ ఆదేశాలను జారీచేసింది. అయితే ఈ ఏడాది ఇంజినీరింగ్కౌన్సెలింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈపరిస్థితి ఏర్పడింది. ఫీజు రీయింబర్స్మెంట్పై తెలంగాణ రాష్ట్రం విధిస్తున్న ఆంక్షలుసర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఎలాచెల్లిస్తామనే విషయంపై ఇంకా స్పష్టతలేదు. ఈ కారణంగా ఉమ్మడి ప్రవేశపరీక్షకుసంబంధించిన ఎంసెట్ కౌన్సెలింగ్ను నిర్వహించడంలో జాప్యం జరుగుతోంది. తొలి విడత, రెండో విడత కౌన్సెలింగ్పూర్తి అయిన తర్వాత తరగతులను ప్రారంభించాల్సి ఉంది. ఈ ప్రకారం అక్టోబర్లోకానీ తరగతులు ప్రారంభమయ్యే అవకాశంలేదని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈ అయోమయ పరిస్థితుల కారణంగావిద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనచెందుతున్నారు. కొందరు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు డిగ్రీకూడా చేరే ఆలోచనలో ఉన్నారని పలువురువిద్యార్థులు చెబుతున్నారు. అడ్మిషన్లుఆలస్యంగా జరిగితే సిలబస్ పూర్తికాకఇబ్బందులు పడాల్సి వస్తుందని, తద్వారావిద్యార్థి భవిష్యత్తుకు పునాది అయినఇంజనీరింగ్లో నష్టపోతామని విద్యార్థులుచెబుతున్నారు. మరికొంత మంది విద్యార్థులు పొరుగు రాష్ట్రాల్లో చదివేందుకుప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఏ కళాశాల ఎలా ఉంది అనే విషయంపై అధ్యాపకులతో చర్చిస్తున్నారు. ఈ ఏడాది ఎక్కువమంది విద్యార్థులు పొరుగు రాష్ట్రాల్లోని కళాశాలల్లో చేరేందుకే మొగ్గు చూపుతున్నట్లుతెలుస్తోంది. తల్లిదండ్రుల్లోనూ విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.జిల్లాలో 22 కళాశాలలు జిల్లాలో ప్రొద్దుటూరులోని వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల, పులివెందులలోని జేఎన్టీయూఇంజనీరింగ్ కళాశాలతోపాటు మరో 20ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. కడపపరిధిలో 8, ప్రొద్దుటూరు పరిధిలో 6 ఇంజనీరింగ్ కళాశాలు నడుస్తున్నాయి. ఈ ప్రకారందాదాపు వీటిలో 10వేల సీట్లు ఉన్నాయి. గతఏడాది మాత్రం 5500 సీట్లు భర్తీ అయినట్లుతెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది మే 22నఎంసెట్ పరీక్ష నిర్వహించగా 7100 మందివిద్యార్థులు హాజరయ్యారు. హైదరాబాద్పరిధిలో 170 ఇంజనీరింగ్ కళాశాలలు నడుస్తున్నాయి. ప్రతి ఏడాది ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు ఎక్కువగా అక్కడ చేరేవారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందని జిల్లాలోని ప్రైవేటుకళాశాలల యాజమాన్యాలు ఆశలు పెట్టుకున్నాయి. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో వీరు కూడాఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఇం‘ధనం’ ఉంటే ఇంజనీర్
ఆ విద్యార్థికి చదువంటే చాలా ఇష్టం. కానీ చదువు‘కొనడమే’ పెద్ద కష్టంగా మారింది. వెక్కిరిస్తున్న పేదరికం.. వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు.. వెరసి చదువు భారంగా మారుతోంది. ఇంజినీరింగ్ విద్యను కొనసాగిస్తూనే సెలవుల్లో కూలి పనులకు వెళ్తూ అమ్మానాన్నలకు ఆసరాగా ఉంటున్నాడు. ఫీజులు చెల్లించలేక.. చదువును మధ్యలో ఆపేయలేక.. దిక్కు తోచని స్థితిలో దిక్కులు చూస్తున్నాడు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్కలాం రూపొందించిన లీడ్ ఇండియా 2020లో పాల్గొన్న ఈ విద్యార్థి భవిష్యత్తులో ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. దాతలు కరుణిస్తే విద్యాభ్యాసం కొనసాగిస్తానంటున్నాడు. ప్రొద్దుటూరు: రాజుపాళెం మండలం గాదెగూడూరు గ్రామానికి చెందిన సాత్రి శ్యాంకుమార్ది నిరుపేద కుటుంబం. తలదాచుకునేందుకు కాసింత గూడు కూడా లేకపోవడంతో పెద్దశెట్టిపల్లెలో బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ప్రొద్దుటూరు సరస్వతీ విద్యామందిరంలో 5వ తరగతి వరకు చదివాడు. అనంతరం 6-10వ తరగతి వరకు గండి గురుకుల పాఠశాలలో చదివాడు. 10వ తరగతిలో 510 మార్కులు సాధించాడు. అక్కడి ఉపాధ్యాయుల సూచన మేరకు హైదరాబాద్లోని న్యూ నాగోల్లో ఉన్న ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ ఐఐటీఎల్టీసీడీలో చదివేందుకు పోటీ పరీక్ష రాయగా జిల్లా నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల తరపున ఈ ఒక్క విద్యార్థే ఎంపికయ్యాడు. న్యూనాగోల్ కళాశాలలో రెండేళ్లపాటు ఇంటర్మీడియట్ పూర్తి చేసి 914 మార్కులు సాధించాడు. అనంతరం గత ఏడాది జేఈఈ మెయిన్ పరీక్ష రాయగా జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫౌండరి అండ్ ఫోర్జ్ టెక్నాలజీ కళాశాలలో సీటు వచ్చింది. జాతీయ స్థాయిలో ఈ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. న్యూ నాగోల్ కళాశాల నుంచి గత ఏడాది ఎంపికైన విద్యార్థులకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి రూ.45వేలు చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించారు. దీంతో ఫస్ట్ ఇయర్ పూర్తయింది. కాగా ప్రస్తుతం రెండో సంవత్సరం ఫీజు చెల్లించేందుకు విద్యార్థి ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్నాడు. కళాశాల నిబంధనల ప్రకారం మొత్తం 8 సెమిస్టర్లలో ఇప్పటి వరకు రెండు సెమిస్టర్లు మాత్రమే పూర్తయ్యాయి. ప్రస్తుతం రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల కాకపోగా ఫస్ట్ సెమిస్టర్లో 7.2 ఎస్జీపీఏ సాధించాడు. ఈనెల 17 నుంచి 3వ సెమిస్టర్ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రతి సెమిస్టర్కు రూ.25,800 ఫీజుతోపాటు ఏడాదికి రూ.25వేలు చొప్పున మెస్ చార్జీలను విద్యార్థి చెల్లించాల్సి ఉంది. పేదరికం కారణంగా ఏమి చేయా లో అర్థం కాని స్థితిలో విద్యార్థి ఉన్నాడు. విద్యార్థి తండ్రి చిట్టిబాబు త న ఆరోగ్యం సహకరించకున్నా రోజూ జమ్మలమడుగుకు వెళ్లి అక్కడి వెల్డింగ్షాపులో కూలీగా పనిచేస్తున్నాడు. తల్లి పద్మావతికి చెవుడు. ఈమె ఇంటిలోనే కుట్టుమిషన్ కుట్టుకుంటూ నాలుగు రూకలు సంపాదిస్తోంది. సోదరి అనిత స్కాలర్షిప్ కింద ఎస్వీడీ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చేరింది. సోదరుడు సాల్మన్ గండి గురుకుల పాఠశాలలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ ఏడాది మే నెలలో సెలవుల కారణంగా ఇంటికి వచ్చిన శ్యాంకుమార్ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కూలి పనికి వెళుతున్నాడు. నెలన్నరపాటు ముందుగా స్థానిక రామయ్య మిల్లులో పొద్దుతిరుగుడు విత్తన బస్తాలను మోసేందుకు రూ.270తో దినసరి కూలికి వెళ్లగా తర్వాత గోకుల్ నగర్లోని సీఎస్ఐ చర్చి నిర్మాణ పనులకు సంబంధించి రూ.300 దినసరి కూలితో పనికివెళ్లాడు. ప్రస్తుతం ఈ పనులు పూర్తికావడంతో గ్రామంలో వ్యవసాయ కూలి పనులకు వెళుతున్నాడు. ఎవరైనా ఆదుకుంటారనే ఆశతో.. ఈనెల 17వ తేదీ నుంచి రెండో విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది. దీంతో ఫీజు చెల్లించేందుకు డబ్బు లేక విద్యార్థి శ్యాంకుమార్ ఆవేదన చెందుతున్నాడు. తొలి ఏడాది సీఎం కిరణ్కుమార్రెడ్డి ఇచ్చిన డబ్బుతో చదువుకున్న విద్యార్థి ప్రస్తుతం ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. దాతలు స్పందించి తనకు ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నాడు. పూర్తి వివరాల కోసం శ్యాంకుమార్ 8897072482 నెంబర్కు ఫోన్ గానీ, లేదా కళాశాల పరిధిలో ఉన్న కెనరా బ్యాంక్లో ఉన్న అకౌంట్ నెంబర్ 2730101008764కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాడు. -
తింటే ఫినిష్
చేపలు తింటే ఆరోగ్యానికి మంచిది.. ఇది డాక్టర్లు చెప్పే మాట క్యాట్ఫిష్ తింటే ఆరోగ్యానికి ముప్పు... ఇదీ డాక్టర్లు చెప్పే మాటే క్యాట్ఫిష్... కోళ్ల వ్యర్థాలు.. ఇంకా చెప్పాలంటే జంతు కళేబరాలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి.. వీటి శరీరంలో సీసంతో పాటు అనేక విషరసాయనాలు ఉంటాయి.. వీటి పెంపకం, విక్రయాలపై ప్రభుత్వం నిషేదం విధించింది. అతి తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరగడంతో చేపల వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రొద్దుటూరు టౌన్ : అవి సాధారణ చేపలు కాదు. రక్త మాంసాలు తిని అనతి కాలంలోనే చాలా బరువు పెరిగే క్యాట్ఫిష్లు. వీటి పెంపకం, విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. నిషేదాజ్ఞలను అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా క్యాట్ ఫిష్లను పెంచే చెరువులు వెలిశాయి. క్యాట్ ఫిష్లతో పాటు వాటి ఆహారంగా తీసుకెళుతున్న చికెన్ వ్యర్థాల వాహనాన్ని ప్రొద్దుటూరు మున్సిపల్ క మిషనర్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ప్రొద్దుటూరు పట్టణం గాంధీరోడ్డులోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట వ్యాపారులు ప్రతి రోజు వివిధ రకాల చేపలను విక్రయిస్తుంటారు. కిలో రూ.100- రూ.200 వరకు విక్రయించే ఈ చేపలకు గిరాకీ ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా చేపల చెరువులు ఏర్పాటు చేసి అక్కడ క్యాట్ఫిష్లను పెంచుతున్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరిగే ఈ చేపల పెంపకానికి ఎలాంటి ఖర్చు లేకుండా చికెన్ వ్యర్థాలను ఆహారంగా వేస్తుంటారు. కళేబరాలను కూడా ఇవి ఆహారంగా తీసుకుంటాయి. దుర్గంధం వెదజల్లే మురికి నీటిలో ఇవి పెరుగుతాయి. గాంధీరోడ్డులోని ఓ చికెన్ దుకాణం ముందు కొద్దిరోజుల క్రితం వాహనంలోని డబ్బాలలో చికెన్ వ్యర్థాలను నింపుతున్న విషయాన్ని గమనించి ‘సాక్షి’ ఆరా తీసింది. చేపలకు ఆహారంగా వేసేందుకు తీసుకెళుతున్నట్లు వాహన డ్రైవర్ తెలిపాడు. క్యాట్ఫిష్ల కోసమే ఈ వ్యర్థాలను తీసుకెళుతున్నట్లు తెలియవచ్చింది. కమిషనర్కు సమాచారంతో దాడులు... గాంధీరోడ్డులో, విజయ్కుమార్ థియేటర్ వద్ద క్యాట్ఫిష్ విక్రయిస్తున్న విషయాన్ని సాక్షి ప్రతినిధి మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణకు ఆదివారం సమాచారం అందిచారు. దీంతో కమిషనర్ వెంటనే అక్కడికి వచ్చి చేపలు విక్రయిస్తున్న వారిని ఆరా తీశారు. డబ్బాల్లో బతికి ఉన్న క్యాట్ఫిష్లను కమిషనర్ చూసి వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని స్వాధీనం చేసుకుని కార్యాలయానికి తరలించారు. ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ రామారావు దృష్టికి తీసుకెళ్లారు. కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేసులు పెట్టాలని జేసీ ఆదేశించారు. వ్యర్థాలను తీసుకెళ్లే వాహనం పోలీసులకు అప్పగింత... ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ02 ఎక్స్ 5784 నెంబర్ గల టాటా వాహనం గాంధీరోడ్డులోని చికెన్ దుకాణాల్లోని వ్యర్థాలను తీసుకెళుతున్న విషయాన్ని సాక్షి ప్రతినిధి తిరిగి కమిషనర్కు సమాచారం ఇచ్చారు. ఆర్ట్స్ కళాశాల రోడ్డు, బీజీఆర్ కాంప్లెక్స్ రోడ్డుల్లో ఉన్న చికెన్ దుకాణాల్లోని వ్యర్థాలను వాహనంలో వేస్తుండగా శానిటరీ ఇన్స్పెక్టర్ సింగ్, మేస్త్రీ మత్తేసు, మున్సిపల్ సిబ్బంది డ్రైవర్ను ప్రశ్నించారు. వాహనాన్ని వన్టౌన్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించారు. ప్రాణాంతకం : ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ క్యాట్ ఫిష్లు ప్రాణాంతకరమైనవని, వీటిని తిని అనారోగ్యం పాలు కావద్దని ఫిషరిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రెడ్డయ్య తెలిపారు. వీటి వల్ల జలకాలుష్యం ఏర్పడటంతో ఇతర జల చరాలు ఏవీ ఆ నీటిలో బతకవన్నారు. వీటి శరీరంలో సీసంతో సహా అనేక విష రసాయనాలు ఉంటాయన్నారు. నీరు లేకున్నా గంటల తరబడి బతికి ఉండే చేప క్యాట్ఫిష్ ఒక్కటేనన్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరగడం వల్ల వీటిని అక్రమంగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. క్యాట్ఫిష్ల పెంపకం, అమ్మకంపై ప్రభుత్వం నిషేధం విధించిందన్నారు. వీటిని తినడం వల్ల క్యాన్సర్, కిడ్నీ తదితర ప్రాణాంతకర వ్యాధులు వస్తాయన్నారు. ఎక్కడైనా వీటిని విక్రయిస్తుంటే తమకు సమాచారం అందించాలన్నారు. కోళ్ల వ్యర్థాలతో క్యాట్ ఫిష్ పెంపకం క్యాట్ ఫిష్ల పెంపకంపై నిషేదాజ్ఞలు ఉన్నా కొందరు వ్యాపారులు వాటిని అక్రమంగా పెంచుతున్నారు. కోళ్ల వ్యర్థాలే కాక జీవాల కళేబరాలను కూడా వాటికి ఆహారంగా అందిస్తుంటారు. ప్రొద్దుటూరులో దాదాపు 100కు పైగా కోళ్ల మాంసం అమ్మే వ్యాపారులు ఉన్నారు. పెద్ద ఎత్తున కోళ్లను కోసి మాంసం విక్రయిస్తుంటారు. కోళ్లను కోయగా వచ్చే వ్యర్థాలను పారేస్తుంటారు. అయితే జమ్మలమడుగు ప్రాంతం నుంచి వచ్చే వాహనాలలో వ్యర్థాలను తీసుకెళుతుండటం పలు అనుమానాలకు తావిచ్చింది. క్యాట్ఫిష్లకు ఆహారంగా వేసేందుకే వ్యర్థాలను తీసుకెళుతున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. పతి రోజు ప్రొద్దుటూరుకు రెండు ప్రత్యేక వాహనాలు వస్తాయి. వాటిలో పెద్ద పెద్ద ప్లాస్టిక్ డబ్బాలు ఏర్పాటు చేసి ఉంటాయి. వ్యర్థాలను వాటిలో వేసి తీసుకెళుతుంటారు. జమ్మలమడుగు, మైలవరం మండలాల్లో అక్రమంగా పెంచుతున్న క్యాట్ఫిష్లకు వీటిని ఆహారంగా వేస్తుంటారు. క్యాట్ ఫిష్లను తింటే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వైద్యులు చెబతున్నారు. ఈ చేపలు కళేబరాలు, కోళ్ల వ్యర్థాలను తిని జీవిస్తాయన్నారు. ఒక విధంగా ఇవి విషంతో సమానమని చెబుతున్నారు. -
బంగారు తల్లికి కష్టకాలం
ప్రొద్దుటూరు: గత ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకం ప్రస్తుతం ఆగిపోయింది. లబ్ధిదారుల ప్రోత్సాహకాలకు సంబంధించిన డబ్బు మంజూరు కాకపోవడంతో పథకం కొనసాగింపుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకానికి సంబంధించి చట్టం చేసినా ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో లబ్ధిపై సందేహాలు లేకపోలేదు. నాటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అసెంబ్లీ ఆమోదంతో బాలికాభ్యుదయ, సాధికారిత చట్టాన్ని తెచ్చారు. గత ఏడాది మే నెల నుంచి ఈ పథకం అమలైంది. తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపికైన వారికి పుట్టిన వెంటనే ప్రసవానికి రూ.2,500 చెల్లించడంతోపాటు తర్వాత వ్యాధి నిరోధక టీకాలు, అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, కళాశాల, ఇలా వివిధ స్థాయిలలో 21వ సంవత్సరం వరకు ప్రతి ఏటా నగదు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి రూ.50వేలు, డిగ్రీ పాస్ అయిన వారికి రూ.లక్ష, మొత్తం రూ.1,55,000 బాలికకు 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత చెల్లిస్తారు. గతంలో ఉన్న లక్పతి పథకం స్థానంలో ఈ పథకాన్ని అమలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఆడపిల్లలు సంతానం కలవారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొదట్లో వెంట వెంటనే ఇందుకు సంబంధించిన నిధులు మంజూరయ్యాయి. కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఈ పథకం కుంటినడక నడుస్తోంది. జిల్లాకు సంబంధించి మొత్తం ఇప్పటి వరకు 8859 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా కేవలం 4,403 మందికి మాత్రమే ప్రోత్సాహకాలను చెల్లించారు. ఈ ప్రకారం జిల్లా రాష్ట్రంలో 9వ స్థానంలో ఉంది. ప్రోత్సాహకాల చెల్లింపులో జాప్యం కావడంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయంపై డీఆర్డీఏ అడిషనల్ ప్రాజెక్టు డైరక్టర్ ఎం.నాగరాజును న్యూస్లైన్ వివరణ కోరగా ఎన్నికల కారణంగా ప్రోత్సాహకాల మంజూరులో జాప్యం జరుగుతోందన్నారు. చిన్నారిని ఎత్తుకున్న ఈమె పేరు దుర్గనబోయిన లక్ష్మీసునీత. ప్రొద్దుటూరు మండలం భగత్సింగ్ కాలనీకి చెందిన ఈమె గత ఏడాది జూన్ 7న అనితా లక్ష్మీకి జన్మనిచ్చింది. ఈమె కాన్పు కోసం పెండ్లిమర్రి మండలంలోని ఉలవలపల్లె గ్రామానికి వెళ్లింది. అది గ్రామం కావడంతో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిమండలానికి వెళ్లగా ఓ నర్సు ఈమెకు పురుడు పోసింది. బంగారుతల్లి పథకం ముందు నెలలోనే ప్రారంభం కావడంతో ఎంతో ఆశగా ఈమె బిడ్డను ఎత్తుకుని కార్యాలయాల చుట్టు తిరిగి దరఖాస్తు చేసుకుంది. లక్ష్మీసునీత అత్తారిల్లు, పుట్టింటిలో కాకుండా మరో చోట పురుడు పోసుకుందని బంగారుతల్లి దరఖాస్తుపై ఎవ్వరు సంతకాలు చేయలేదు. నిబంధనల ప్రకారం ఏఎన్ఎం, డాక్టర్ సంతకాలు చేయాల్సి ఉంది. అయితే ఈమెకు వీరెవ్వరు సంతకాలు చేయకపోవడంతో సుమారు 3 నెలల పాటు ఈమె అధికారుల చుట్టు తిరిగి విసిగి వేసారి చివరికి ఆశలు వదులుకుంది. బంగారుతల్లి పథకానికి సంబంధించిన నిబంధనల కారణంగా పలు చోట్ల ఇలాంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీనికితోడు అన్ని అర్హతలు ఉండి దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ప్రోత్సాహక బహుమతుల మంజూరులో జాప్యం జరుగుతోంది. -
కట్టాల్సిందే!
పొద్దుటూరు: స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన రుణాల మాఫీ జాప్యం కావడంతో ఓ వైపు బ్యాంకర్లు, మరో వైపు సంబంధిత అధికారులు పొదుపు సంఘాల వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం రుణాలు చెల్లిస్తుందో లేదో తమకు సంబంధం లేదని బకాయిలు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. మరికొందరు అధికారులు ఇంకా ముందుకెళ్లి రాజధాని నిర్మాణానికే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, అలాంటప్పుడు మీ బకాయిలు చెల్లిస్తారన్న గ్యారంటీ ఏముందని పొదుపు సంఘాల వారిని నయానా భయానా హెచ్చరిస్తున్నారు. బకాయిలు చెల్లించకపోతే మీ సంఘాలు మనుగడలో లేనట్లేనని చెబుతున్నారు. దీంతో పొదుపు సంఘాలకు చెందిన మహిళలు అధికారుల ఒత్తిడి భరించలేక బకాయిలు చెల్లిస్తున్నారు. కొన్ని సంఘాల వారు బకాయిలు చెల్లించలేదని బ్యాంకర్లు ఏకంగా ఆ సంఘాలకు సంబంధించిన సేవింగ్స్ ఖాతాలోని డబ్బును జమ చేసుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ పేదల నిర్మూలన పథకం (మెప్మా) పరిధిలో 2300 పొదుపు సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.22 కోట్లు, 2014-15 సంవత్సరంలో రూ.20 కోట్లు బ్యాంక్ లింకేజి కింద మహిళలు రుణాలు తీసుకున్నారు. పట్టణ పరిధిలోని 16 బ్యాంక్ల నుంచి వీరు రుణాలు పొందారు. కాగా ఎన్నికల హామీల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నెల నుంచి మహిళలు రుణాలు చెల్లించడం లేదు. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కోసం మహిళలంతా ఎదురు చూశారు. ప్రమాణ స్వీకారం రోజున రుణ మాఫీ సంతకం పెడతారని భావించారు. ఇందులో భాగంగా ఈనెల 8వ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పొదుపు సంఘాల రుణాల మాఫీపై సంతకం చేసినా స్పష్టత లేదు. ఎప్పటి నుంచి రుణ మాఫీ అమలవుతుంది, ఎంత రుణం మాఫీ అవుతుంది తదితర విషయాలు తేలాల్సి ఉంది. ఈ విషయంపై కమిటీ వేయడంతో ఇప్పుడే రుణాల మాఫీ అమలు కాదని స్పష్టమైంది. ఇదిలావుండగా తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. ‘నిబంధనల ప్రకారం 3 నెలలలోగా తీసుకున్న రుణం చెల్లించకపోతే మీ సంఘం నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ (ఎన్పీఏ) కిందికి వెళుతుందని, అలా వెళితే మీ సంఘం నష్టపోతుందని’ చెబుతున్నారు. అలాగే రుణాల మాఫీ తేలకపోవడంతో బ్యాంకర్లు కూడా రుణాలు మంజూరు చేయడం లేదు. కాగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని సంబంధిత అధికారులు కూడా పొదుపు సంఘాలపై బకాయిలు చెల్లించాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. రికవరి 98 శాతం ఉండటంతో గత మూడేళ్లుగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం బ్యాంకర్లు, ఉన్నతాధికారుల సూచన మేరకు స్థానిక అధికారులు రుణాలు చెల్లించాలని మహిళా సంఘాలపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే పలు సంఘాలకు సంబంధించి సేవింగ్స్ ఖాతాలోని సొమ్మును బకాయిల కింద జమ చేసుకున్నారు. సంఘాలు ఎన్పీఏ పరిధిలోకి వెళతాయి తీసుకున్న రుణాన్ని మూడు నెలలలోపు చెల్లించకపోతే సంఘాలు నాన్ ఫర్ఫార్మెన్స్ అకౌంట్ పరిధిలోకి వెళతాయి. దీని వలన ఆ సంఘానికి ఇచ్చే రుణం కూడా తగ్గుతుంది. బకాయిలు చెల్లించాలని సంఘాలకు చెప్పిన మాట వాస్తవమే. - కెజియా జాస్లిన్, పావర్టి రీసోర్స్ పర్సన్ రుణం చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు తీసుకున్న రుణం చెల్లించమని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మాఫీ అవుతుందో లేదో అన్న అనుమానాన్ని అధికారులు వ్యక్తపరుస్తున్నారు. దీంతో రుణం చెల్లించేందుకు సిద్ధమవుతున్నాం. - నాగసుబ్బమ్మ, వీరభద్ర స్వయం సహాయక సంఘం లీడర్ అందరికీ చెప్పారు ఇటీవల స్వయం సహాయక సంఘాల సమావేశంలో అధికారులు బకాయిలు చెల్లించాలని అందరికీ చెప్పారు. అలా చెల్లిస్తేనే రుణాలు ఇస్తారని చెబుతున్నారు. దీంతో రుణం చెల్లించాల్సి వస్తోంది. - జే.వెంకటలక్షుమ్మ, నరసింహ స్వయం సహాయక సంఘం -
పక్కదారిలో పౌష్టికాహారం
ప్రొద్దుటూరు : అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. పౌష్టికాహారాన్ని ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయమై అంగన్వాడీ కార్యకర్తకు మెమో జారీ చేశారు. ప్రతి నెల హైదరాబాద్లో తయారైన పౌష్టికాహారాన్ని జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తుంటారు. అయితే చిన్నారులకు ఉపయోగపడాల్సిన పౌష్టికాహారం అనేక చోట్ల పశువుల దాణాగా మారుతోంది. ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని 118వ అంగన్వాడీ కేంద్రం అసార్ వీధిలో నడుస్తోంది. ఈ కేంద్రానికి సరఫరా చేసిన పౌష్టికాహారాన్ని ఎర్రగుంట్ల మండలం చిన్నదండ్లూరుకు చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి పశుదాణా కోసం కొనుగోలు చేశాడు. అంగన్వాడీ కార్యకర్త ఎస్.శివకళ్యాణి ఈ బస్తాలను అమ్మారు. ఇందులో 31 బస్తాల బాల అమృతం, 3 బస్తాల ఎంటీఎఫ్(10 కేజీలు), 5 బస్తాల పాత ఎంటీఎఫ్(20 కిలోలు) ఉన్నాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం వీటి విలువ సుమారు రూ.20వేలు ఉంటుంది. ఈ బస్తాలను రూ.2వేలకు కొనుగోలుచేసినట్లు రమణారెడ్డి లిఖిత పూర్వకంగా అర్బన్ ప్రాజెక్టు సీడీపీఓ రాజేశ్వరిదేవికి రాయించారు. శుక్రవారం రాత్రి అంగన్వాడీ కేంద్రం నుంచి ఆటోలో వీటిని రవాణా చేస్తుండగా వరలక్ష్మి అపార్ట్మెంట్ వద్ద వన్టౌన్ పోలీసులు పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. విషయం జిల్లా ప్రాజెక్టు డైరక్టర్ లీలావతికి తెలియడంతో ఆమె అర్బన్, రూరల్ ప్రాజెక్టు అధికారులను విచారించారు. అనంతరం అర్బన్ సీడీపీఓ పోలీస్స్టేషన్కు వెళ్లి బస్తాలను తీసుకొచ్చి ప్రాజెక్టు కార్యాలయంలో ఉంచారు. ఈనెల 9వ తేదీ నుంచి శుక్రవారం వరకు పౌష్టికాహారాన్ని ప్రాజెక్టు కార్యాలయం నుంచి సరఫరా చేశారు. రేపోమాపో అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పౌష్టికాహారాన్ని లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. ఆలోపుగానే ఈ సంఘటన వెలుగు చూడటం గమనార్హం. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు కాలేదు. బాల అమృతం రుచి చూడని చిన్నారులు స్త్రీ, శిశుసంక్షేమ శాఖ బాల అమృతమనే పౌష్టికాహారాన్ని కొత్తగా తయారు చేసింది. ఏడు నెలల నుంచి మూడేళ్ల వయసులోపు పిల్లలకు అందించడానికి ఈ ప్యాకెట్లను సరఫరా చేశారు. గోధుమలు, శనగలు, పాలపొడి, నూనె, చక్కెరతో ఈ మిశ్రమాన్ని తయారు చేస్తారు. రోజు 3-5 మార్లు 100 గ్రాముల చొప్పున ఈ పౌష్టికాహారాన్ని తినిపిస్తే పిల్లల్లో సూక్ష్మ పోషకాలు, కాల్షియం అందుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పౌష్టికాహారం వలన ఏడాదికి చిన్నారులు 9 కిలోలు రెండేళ్లకు 12 కిలోలు, 3 ఏళ్లకు 15 కిలోల చొప్పున పెరుగుతారని చెబుతున్నారు. తీవ్ర పోషకాహారం లోపం ఉన్న పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తల పర్యవేక్షణలో బాల అమృతాన్ని అందించాల్సి ఉంది. రెండున్నర కిలోల చొప్పున ఈ ప్యాకెట్లను తయారు చేశారు. ఈ పౌష్టికాహారం పరిశ్రమలో తయారు అయిన అనంతరం తొలిమారు జూన్ నుంచి సరఫరా చేస్తున్నారు. ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్టుకు ఈనెల 8వ తేదీన 850 బస్తాల బాల అమృతం సరఫరా అయింది. శుక్రవారం వరకు ప్రాజెక్టు పరిధిలోని 196 అంగన్వాడీ కేంద్రాలకు వీటిని అందించారు. చిన్నారులు ఈ పౌష్టికాహార రుచిని చూడకముందే పశుదాణాకు తరలి వెళ్లడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి 196 అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించేందుకు పర్యవేక్షకులు లేరు. ప్రాజెక్టు అంతటికీ ఒక్కరు మాత్రమే ఏడాది కాలంగా పనిచేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం నిల్వలు ఏవిధంగా ఉన్నాయి.. ఏవిధంగా సరఫరా చేస్తున్నారన్న విషయాలను కూడా పరిశీలించే వారు లేరు. ఈ కారణంగానే ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. -
పశువైద్య కళాశాలను తనిఖీ చేసిన వీసీఐ బృందం
ప్రొద్దుటూరు: స్థానిక ప్రభుత్వ పశువైద్య కళాశాలను దక్షిణ భారత పశువైద్య మండలి (వీసీఐ) బృందం గురువారం సందర్శించింది. కళాశాల నడుస్తున్న భవనాలతోపాటు గోపవరం సమీపంలో నిర్మించిన నూతన భవనాలను పూర్తిగా పరిశీలించారు. జంతువధశాల, దాణా కేంద్రం, చికిత్స, బోధనశాలలు, కోళ్ల, పశుపెంపకాలతోపాటు అన్ని డిపార్ట్మెంట్లలో తిరిగి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ అంశాలపై కళాశాల డీన్ జగదీశ్వరరావుతో చర్చించారు. అధ్యాపకులు తగినంత మంది ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా డిపార్ట్మెంట్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. 2008లో ప్రారంభించిన ఈ కళాశాలకు ఇప్పటి వరకు వీసీఐ గుర్తింపు లేదు. దీంతో కళాశాల మనుగడే ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో వసతులను పరిశీలించేందుకు ప్రస్తుతం వీరు ఇక్కడికి వచ్చారు. వీసీఐ బృందంలో కలకత్తాకు చెందిన డాక్టర్ గోస్వామి, మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ పురియా, హర్యానా రాష్ట్రానికి చెందిన రాజేష్కుమార్ ఉన్నారు. కళాశాల ప్రిన్సిపాల్తోపాటు అధ్యాపకులు ఆనందరెడ్డి, జగపతిరామయ్య, రవీంద్రారెడ్డి, వరప్రసాదరెడ్డి, సురేష్కుమార్, సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు. వీసీఐ బృందం మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉంటుందని తెలియవచ్చింది. -
నాన్న ఆశయం నెరవేర్చకనే..
ప్రొద్దుటూరు క్రైం : అతనో చిరుద్యోగి.. తనకొచ్చే కొద్దిపాటి జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తూ.. మరోవైపు పిల్లలను ప్రయోజకులు చేయాలని ఆశించారు. పిల్లలు కూడా తండ్రి పెట్టే ప్రతిపైసాకు న్యాయం చేయాలని భావించి పట్టుదలతో చదువుతున్నారు. కుమారుడు అంకయ్య అలియాస్ వినోద్ బీఎస్సీ కంప్యూటర్స్ ఇటీవలే పూర్తి చేశాడు. కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది. డిగ్రీ పాసైన ఆనందంలో ‘అమ్మా.. ఇక మనకు భయం లేదులే.. ఏదో ఒక ఉద్యోగం సాధిస్తా. మన కష్టాలన్నీ తీరిపోతాయ్’ అని చెప్పాడు. అమ్మ ఓబుళమ్మకు ఇచ్చిన మాట నిజం కాకనే.. నాన్న తలారి మత్తయ్య(మున్సిపాలిటీలో డ్వాక్రా వర్కర్) ఆశయం నెరవేరకనే అంకయ్య రోడ్డు ప్రమాదానికి గురై.. ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్ర్కమించాడు. దీన్ని ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలు పగిలే లా రోదిస్తున్నారు. ఈ తీరు చూసిన వారి హృదయాలను బరువెక్కించింది. ఎన్సీసీ సర్టిఫికెట్ కోసం వెళ్తూ.. అంకయ్యకు చదువు మీద ఎంత శ్రద్ధో.. ఎన్సీసీపైనా అంతే శ్రద్ధ. మూడేళ్ల నుంచి అతను ఎన్సీసీలో కొనసాగేవాడు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ కోసం తన మిత్రుడితో కలసి బైక్లో కడపకు బయలుదేరాడు. మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను అకాల మృత్యువాతపడ్డాడు. ఈ విషయం తెలియడంతో రామేశ్వరం వాసులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. అంకయ్య మృతదేహాన్ని చూసి అతని మిత్రులు, అధ్యాపకులు కన్నీటిపర్యంతమయ్యారు. పలువురు ప్రముఖులు సైతం విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
నాన్న ఆశయం నెరవేర్చకనే..
ప్రొద్దుటూరు క్రైం : అతనో చిరుద్యోగి.. తనకొచ్చే కొద్దిపాటి జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తూ.. మరోవైపు పిల్లలను ప్రయోజకులు చేయాలని ఆశించారు. పిల్లలు కూడా తండ్రి పెట్టే ప్రతిపైసాకు న్యాయం చేయాలని భావించి పట్టుదలతో చదువుతున్నారు. కుమారుడు అంకయ్య అలియాస్ వినోద్ బీఎస్సీ కంప్యూటర్స్ ఇటీవలే పూర్తి చేశాడు. కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది. డిగ్రీ పాసైన ఆనందంలో ‘అమ్మా.. ఇక మనకు భయం లేదులే.. ఏదో ఒక ఉద్యోగం సాధిస్తా. మన కష్టాలన్నీ తీరిపోతాయ్’ అని చెప్పాడు. అమ్మ ఓబుళమ్మకు ఇచ్చిన మాట నిజం కాకనే.. నాన్న తలారి మత్తయ్య(మున్సిపాలిటీలో డ్వాక్రా వర్కర్) ఆశయం నెరవేరకనే అంకయ్య రోడ్డు ప్రమాదానికి గురై.. ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్ర్కమించాడు. దీన్ని ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలు పగిలే లా రోదిస్తున్నారు. ఈ తీరు చూసిన వారి హృదయాలను బరువెక్కించింది. ఎన్సీసీ సర్టిఫికెట్ కోసం వెళ్తూ.. అంకయ్యకు చదువు మీద ఎంత శ్రద్ధో.. ఎన్సీసీపైనా అంతే శ్రద్ధ. మూడేళ్ల నుంచి అతను ఎన్సీసీలో కొనసాగేవాడు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ కోసం తన మిత్రుడితో కలసి బైక్లో కడపకు బయలుదేరాడు. మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను అకాల మృత్యువాతపడ్డాడు. ఈ విషయం తెలియడంతో రామేశ్వరం వాసులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. అంకయ్య మృతదేహాన్ని చూసి అతని మిత్రులు, అధ్యాపకులు కన్నీటిపర్యంతమయ్యారు. పలువురు ప్రముఖులు సైతం విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
యువకుడిని చితకబాదిన ఎస్ఐ
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్లైన్: పోలీస్స్టేషన్లో ఉన్న స్నేహితుడిని చూసేందుకు వెళ్లిన యువకుడిని ఎస్ఐ, సిబ్బంది చితకబాదిన సంఘటన చాపాడు స్టేషన్లో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... ఈ నెల 2న మట్కా రాస్తున్నారనే కారణంతో చాపాడు ఐడీ పార్టీ పోలీసులు ప్రొద్దుటూరులోని దస్తగిరిపేటకు చెందిన మహబూబ్బాషా, దస్తగిరి, కుమార్తో పాటు మరో యువకుడిని తీసుకొని వెళ్లారు. కుమార్తో మాట్లాడటానికి ప్రొద్దుటూరులోని హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన నరసింహప్రకాశ్ 3వ తేదీన స్టేషన్కు వెళ్లాడు. అతన్ని బయటికి వదలాలంటే రు.1 లక్ష తీసుకొని రమ్మని ఐడీ పార్టీ పోలీసులతో పాటు ఎస్ఐ గిరిబాబు చెప్పాడు. అంత డబ్బు నా వద్ద లేదు.. నేను అతన్ని చూడటానికి మాత్రమే వచ్చానని చెప్పాడు. రు.20 వేలు మాత్రమే అతని వద్ద ఉందంట.. కావాలంటే తీసుకొని వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఫోన్ చేసి పిలిచి మరీ చితకబాదారు బుధవారం ఉదయాన్నే చాపాడు ఐడీ పార్టీ పోలీసులు నరసింహప్రకాష్కు ఫోన్ చేశారు. మీ ఫ్రెండ్ కుమార్ను కోర్టుకు పెడుతున్నామని చెప్పడంతో రూ.20 వేలు తీసుకొని అతను చాపాడుకు వెళ్లాడు. డబ్బు తీసుకున్న ఎస్ఐ మిగతా రూ.30 వేలు ఏదీ అని అడిగాడు. లేదు సార్ ! నిన్ననే చాప్పాను కదా ..ఉండేది రు.20 వేలేనని.. ఎస్ఐతో అన్నాడు. నిన్ను లోపల వేసి కుమ్మితే డబ్బులు అవే పరుగెత్తుకుంటూ వస్తాయ్ అంటూ ఎస్ఐ అతన్ని లాఠీతో చితకబాదాడు. ఎస్ఐతో పాటు ఐడీపార్టీ సిబ్బంది కాళ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. అతని చెయ్యి విరగడంతో పాటు ఒళ్లంతా రక్తగాయాలయ్యాయి. బంధువులు అతన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్ఐపై ప్రైవేట్ కేసు తనను విచక్షణా రహితంగా కొట్టిన ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లు సుధాకర్, చెన్నయ్యపై గురువారం సాయంత్రం నరసింహప్రకాష్ స్థానిక కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. -
క్రికెట్ బెట్టింగ్పై ఎస్పీ సీరియస్
అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రధాన బుకీలు ప్రొద్దుటూరు క్రైం, న్యూస్లైన్: ప్రొద్దుటూరులో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్పై జిల్లా ఎస్పీ అశోక్కుమార్ సీరియస్ అయ్యారు. ఆదివారం సాక్షి దినపత్రికలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్న తీరుపై ‘ఆడిందే ఆట, పాడిందే పందెం’ అనే కథనం ప్రచురితమైంది. దీనిపై ఎస్పీ స్థానిక పోలీసు అధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతుంటే ఏమి చేస్తున్నారని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సాక్షిలో కథనాన్ని చూసి ప్రొద్దుటూరు పోలీసుల్లో చలనం వచ్చినట్లు కనిపించింది. పట్టణంలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఆదివారం సాయంత్రం నుంచి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. శనివారం సాయంత్రం వరకు స్థానికంగా ఉన్న ప్రధాన బుకీలు ఆదివారం ఉదయం నుంచి రహస్య స్థావరాలకు వెళ్లిపోయారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండటంతో ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు పోలీసులు పట్టణంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ప్రధాన బుకీలతోపాటు సబ్ బుకీలు కూడా జాగ్రత్త పడటంతో పోలీసులకు ఎవరూ దొరకలేదు. -
ప్రొద్దుటూరులో రక్త దోపిడీ
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్లైన్ : ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు రోగులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. రోగులకు రక్తం ఎక్కించాల్సి పరిస్థితి వస్తే ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పెద్దమొత్తంలో డబ్బు చెల్లించే స్తోమత తమకు లేదని, ప్రభుత్వాసుపత్రికి వెళ్తామని రోగులు చెబుతున్నా అక్కడ ఉన్న రక్తం సురక్షితం కాదంటూ పలు నర్సింగ్హోంలకు చెందిన సిబ్బంది రోగులను మభ్యపెడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు రూ.2000-2500 చెల్లించి ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే రక్తం ఎక్కించుకుంటున్నారు. ప్రొద్దుటూరులో 350 పడకల జిల్లా ఆస్పత్రి ఉంది. దానికి అనుబంధంగా బ్లడ్బ్యాంక్ నడుస్తోంది. దాతలు, స్వచ్ఛంద సేవాసంస్థల సహకారంతో రక్తం సేకరిస్తూ నిల్వ చేస్తున్నారు. రోడ్డు ప్రమాద బాధితులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణిలకు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోని రోగులకు బ్లడ్బ్యాంక్లో ఉన్న రక్తం ఇవ్వాలంటే రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు నుంచి లెటర్ తీసుకొని రావాలి. రోగులను భయపెడుతున్న యాజమాన్యాలు రోగులు ఇక్కడే రక్తం ఎక్కించుకోవాలని కొన్ని నర్సింగ్ హోం ల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్బ్యాంక్లో ఉండే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుందని డాక్టర్లు రోగులకు చెప్పడంతో వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే రక్తం ఎక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. డాక్టర్ లెటర్ ఆధారంగా బ్లడ్బ్యాంక్ నుంచి రక్తం తీసుకొని రావాలంటే కేవలం రూ.850 మాత్రమే ఖర్చు అవుతుంది. అయితే నర్సింగ్హోంలలో మాత్రం రక్తపరీక్షల కోసమని రూ.2000-2500 దాకా వసూలు చేస్తున్నట్లు రోగుల బంధువు లు అంటున్నారు. ఎవరైనా రక్తమివ్వాలంటే ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్లకు వచ్చి రక్తం ఇవ్వాలి. రక్తం నిల్వ చేసే బ్యాగులను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. వీటిని బయట మార్కెట్లో ఎక్కడా విక్రయించరాదు. అయితే ప్రొద్దుటూరులో మాత్రం పలు హోల్సేల్ దుకాణాలలో, మందుల షాపుల్లో విచ్చల విడిగా విక్రయిస్తున్నారు. అధికారులకు తెలిసి కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రక్త పరీక్షల్లోనూ చాలా వ్యత్యాసం సాధారణంగా రక్తం ఇచ్చే వ్యక్తికి జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్బ్యాంక్లో హెచ్ఐవీ, హెపటైటిస్ బీ, హెపటైటీస్ సీ, వీడీఆర్ఎల్, మలేరియా లాంటి ఐదు రకాల పరీక్షలను నిర్వహిస్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం కేవలం హెచ్ఐవీ, హెపటైటిస్ బీ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తారు. రక్తం సేకరించడం నేరం జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్బ్యాంక్లో నిల్వ ఉన్న రక్తం చాలా సురక్షితమైంది. ఒకసారి దాత నుంచి రక్తం సేకరించాక అది 45 రోజుల వరకూ సురక్షితంగా ఉంటుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రక్తం సేకరించడం నేరం. రక్తం నిల్వ చేసే బ్యాగులను బయట విక్రయించరాదు. - డాక్టర్ విజయనిర్మల, బ్లడ్బ్యాంక్ వైద్యురాలు -
పడిపోతున్న పసిడి ధర
ప్రొద్దుటూరు, న్యూస్లైన్: పసిడి ధర నానాటికీ పడిపోతోంది. ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో 10 గ్రాముల (24 క్యారెట్లు) బంగారం ధర బుధవారం రూ.27,800లకు పలికింది. ఈనెల 15న రూ.30,130లు ఉన్న ఈ ధర క్రమేణా తగ్గుతూ వస్తోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం మార్కెట్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రధాని మోడీ హయాంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వార్తలు పెద్ద ఎత్తున వస్తుండటంతో బంగారం కొనుగోళ్లపై కొనుగోలు దారులు ఆసక్తి చూపడం లేదు. ధరలు మరింత తగ్గుతాయేమోనని ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల కారణంగా ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్ వ్యాపారాలు లేక డీలా పడింది. రాయలసీమలోనే పసిడి వ్యాపారానికి ప్రొద్దుటూరు ప్రసిద్ధిగాంచింది. వ్యాపారులతోపాటు వేలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు. సాధారణంగా మార్కెట్ ధరలు అప్పుడప్పుడు తగ్గడం మళ్లీ పెరగడం జరుగుతుండేది. ఈనెల 16న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో నరేంద్రమోడీ ప్రభుత్వం రావడంతో మార్కెట్ పరిస్థితులు మారిపోయాయి. బంగారం ధరలు క్రమేణా తగ్గుతూ వస్తున్నాయి. ధరలు మరింత క్షీణిస్తాయని ప్రముఖ వ్యాపారులు ప్రకటిస్తుండటంతో కొనుగోలుదారుల్లో ఆశలు పెరుగుతున్నాయి. తొందరపడి కొనుగోలు చేసేకన్నా మరింత కాలం ఆగితే మేలు ఉంటుందని భావిస్తున్నారు. మార్కెట్ పరిస్థితులను చూసి కొనుగోలుదారులెవ్వరూ దుకాణాలకు రావడం లేదు. కేవలం ధరల గురించి మాత్రం ఆరా తీస్తున్నారు. దీంతో దుకాణాలన్నీ కొనుగోలు దారులు లేక బోసిపోయినట్లు దర్శనమిస్తున్నాయి. పట్టణంలోని ఓ కార్పొరేట్ దుకాణంలో ఒక్క కొనుగోలుదారుడు కూడా లేకపోవడాన్ని చూస్తే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. ఏ దుకాణాన్ని చూసినా బుధవారం ఇదే పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం బంగారంపై దిగుమతి సుంకం 10 శాతం ఉండగా ప్రభుత్వం దీనిని తగ్గించే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే బంగారం దిగుమతులు పెరిగి ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. ధరలు తగ్గడంతో నష్టపోయా గత నెలలో ప్రొద్దుటూరులో బంగారం కొనుగోలు చేశా. గ్రాము రూ.30వేలు చొప్పున కొనుగోలు చేశాను. ఆర్డర్ ఇచ్చిన బంగారాన్ని తీసుకునేందుకు రాగా ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.27,800 ఉందన్నారు. నేను కొనుగోలు చేసిన బంగారంపై రూ.7వేలు నష్టపోయా. - తల్లపురెడ్డి రమణమ్మ, కోగటం రూపాయి విలువ తగ్గడమే కారణం రూపాయి విలువ తగ్గడమే బంగారు ధరల పతనానికి ప్రధాన కారణం. రూపాయి విలువ బుధవారం నాటికి రూ.62.30 నుంచి రూ.58.83కు తగ్గింది. దీనికితోడు దిగుమతి సుంకం ప్రస్తుతం ఉన్న 10 శాతాన్ని తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి. దిగుమతి సుంకం తగ్గితే బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. - హాజీ ఎస్ఎం ఇబ్రహీం, ఇబ్రహీం జువెలర్స్ మార్కెట్ డీలా పడింది బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులు రావడం లేదు. ఇంకా ధరలు తగ్గుతాయని ఆశపడుతున్నారు. వ్యాపారాలు లేక బులియన్ మార్కెట్ డీలాపడింది. - బుశెట్టి రామ్మోహన్రావు, బులియన్ మర్చంట్స్ అసోషియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ -
ప్రశాంతంగా పాలిసెట్
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం బుధవారం నిర్వహించిన పాలిసెట్-2014 జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. కడప నగరంలోని 9 కేంద్రాల్లో 3,281 మంది అభ్యర్థులకు గాను 3,050 మంది పరీక్ష రాశారు. ప్రొద్దుటూరులో 11 కేంద్రాల్లో 3,004 మందికి గాను 2,875 మంది, రాజంపేటలో 3 కేంద్రాల్లో 458 మందికి గాను 429 మంది హాజరయ్యారు. పరీక్షా సమయానికి గంట ముందుగానే విద్యార్థులను అనుమతించడంతో ఎక్కడా ఆలస్యంగా వచ్చిన కేసులు నమోదు కాలే దు. పరీక్ష ఉదయం 11 నుంచి 1 గంట వర కు సాగింది. పరీక్షాకేంద్రాలను అధికారు లు పర్యవేక్షించారు. -
అందరి కృషితోనే ఎన్నికలు ప్రశాంతం
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్లైన్: హోంగార్డు నుంచి డీఎస్పీ వరకు ప్రతి ఒక్కరూ కష్టపడటం వల్లే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలిగామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. స్థానిక ఎస్కేవీ కల్యాణ మండపంలో బుధవారం రాత్రి నిర్వహించిన పోలీసుల గెట్ టు గెదర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లి గ్రామసభ లు, అవగాహన సదస్సులు లాంటివి నిర్వహించడం వల్ల పోలింగ్ శాతం పెరగడమేగాక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నా రు. ఒకేసారి మూడు ఎన్నికలు రావడం దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేదన్నారు. అందరూ బాగా శ్రమించి కడప జిల్లా పోలీసు ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా ఇనుమడింపచేశారని కొని యాడారు. ఇదే తరహాలో ఇక నుంచి రోజు వారి విధులు నిర్వహించాలని సూచించా రు. ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్న మట్కా, క్రికెట్ బెట్టింగ్తోపాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపాలన్నారు. ఓఎస్డీ చంద్రశేఖర్ మాట్లాడుతూ మున్సిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరు కష్టపడటం వల్లే చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రశాతంగా ఎన్నికలు జరిగాయన్నారు. జమ్మలమడుగు ఏఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ తనకు ట్రైనింగ్ అయిపోయిన రెండు నెలలకే ఎన్నికలు వచ్చాయన్నారు. ముందుగా ఎన్నికలు అంటే భయపడ్డానని, ఎస్పీ అశోక్కుమార్ను కలిసిన తర్వాత భయం అనేది లేకుండా పోయిందన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ 20 ఏళ్ల కాలంలో పోలీసు శాఖ తరపున గెట్ టు గెదర్కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు దారెడ్డి భాస్కర్రెడ్డి, మహేశ్వరరెడ్డి, టీవీ సత్యనారాయణ, ఎస్ఐలు మహేష్, వెంకటేశ్వర్లు, చలపతి, జీఎం బాషా, నారాయణ యాదవ్, రెడ్డిశేఖర్రెడ్డి, లక్ష్మినారాయణ, మస్తాన్బాషా తదితరులు పాల్గొన్నారు. -
తెగబడిన ఇసుకాసురులు
మున్సిపల్ సిబ్బందిపై దాడి ప్రొద్దుటూరు టౌన్, న్యూస్లైన్: ఒక పక్క తాగునీటి సమస్యను అధిగమించేందుకు మున్సిపల్ అధికారులు తిప్పలు పడుతుంటే, మరో పక్క ఇసుకాసరులు పెన్నానదిలోని బోర్ల వద్ద నుంచి ఇసుకను అక్రమరవాణా చేస్తు లక్షలు గడిస్తున్నారు. అడ్డుకుంటున్న మున్సిపల్ సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మున్సిపల్ వాటర్ వర్క్సు ఏఈ రాజేష్, సిబ్బంది మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి వస్తున్న నీటిని పరిశీలించేందుకు పెన్నానదిలోకి వెళ్లారు. మైలవరం దక్షిణ కాలువకు గండ్లు కొట్టకుండా వీరు పహారా కాస్తున్నారు. ఈ దశలో పెన్నానది నుంచి రెండు ఇసుక ట్రాక్టర్లు రావడం గమనించారు. ఒక ఇసుక ట్రాక్టర్ను ఆపి మున్సిపల్ కార్యాలయానికి తరలించేందుకు మున్సిపల్ సిబ్బంది హరిని ఏఈ ట్రాక్టర్లో ఎక్కించారు. అయితే ఇసుక రవాణా చేస్తున్న అక్రమార్కులు దాడులకు దిగబడ్డారు. ట్రాక్టర్పైన ఉన్న మున్సిపల్ సిబ్బంది హరిని కిందికి తోసేసి ట్రాక్టర్ను తీసుకెళ్లారు. ఈ ట్రాక్టర్ కొత్తదిగా ఉందని నెంబర్ కూడా లేదని సిబ్బంది చెప్పారు. మత్స్యకాలనీకి చెందిన కొండయ్యకు చెందిన మరో ట్రాక్టర్ను ఆపే ప్రయత్నం చేయడంతో సిబ్బందితో ఘర్షణకు దిగాడని సిబ్బంది చెప్పారు. దీంతో ట్రాక్టర్ను మున్సిపల్ కార్యాలయంలోకి తీసుకురావాలని చెప్పినా కొండయ్య వినిపించు కోకుండా సిబ్బందిని తోసి వేసి ట్రాక్టర్కు తీసుకెళ్లాడు. ఈ విషయంపై మున్సిపల్ ఏఈ రాజేష్, సిబ్బంది ఆదివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కొండయ్యను స్టేషన్కు పిలిపించి విచారణ చేస్తున్నారు. కొండయ్య తనను కూడా సిబ్బంది కొట్టారంటూ పోలీసులకు చెప్పారు. అక్రమార్కులపై కూడా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది అంటున్నారు. వర్క్ ఇన్స్పెక్టర్ల దందా ఇసుక అక్రమ రవాణాదారులతో మున్సిపాలిటీ వర్క్ ఇన్స్పెక్టర్లు కుమ్మక్కై దందా కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు పెన్నా పరివాహక ప్రాంతాల్లో విధుల్లో లేకున్నా పహరా కాస్తూ ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ.5వేలు వసూలు చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదులు అందాయి. ఒక్కో పాయింట్లో 10-15 ట్రాక్టర్లకు వర్క్ ఇన్స్పెక్టర్లు దగ్గరుండి ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ వారి నుంచి ప్రతి రోజు వేలాది రూపాయలు దండుకుంటున్నారు. కాంట్రాక్టుపై పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను తొలగించేందుకు కమిషనర్ చర్యలు చేపట్టారు. -
డిప్యూటీ జైలర్ నుంచి ఎస్ఐ పోస్టుకు..
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్లైన్: తిరుపతిలో డి ప్యూటీ జైలర్గా పనిచేస్తున్న సగిలి వెంకటసుబ్బారెడ్డి ఎస్ఐ పోస్టుకు ఎంపికయ్యారు. రూర ల్ పరిధిలోని సగిలిగొడ్డుపల్లె గ్రామానికి చెంది న చంద్రారెడ్డికి కుమారులు వెంకటసుబ్బారెడ్డి, పవన్కుమార్రెడ్డి. పవన్కుమార్రెడ్డితోపాటు తండ్రి చంద్రారెడ్డి గత కొన్నేళ్ల నుంచి కువైట్లో ఉంటున్నారు. వెంకటసుబ్బారెడ్డి తాళ్లమాపురంలోని జిల్లా ప రిషత్ హైస్కూల్లో 10వ తరగతి, ప్రొద్దుటూరులోని భావన జూని యర్ కాలేజీలో ఇంటర్మీడియట్, ఎస్కేఎస్సీ కాలేజీలో డిగ్రీ చదివా రు. డిప్యూటీ జైలర్గా ఎంపికైన అనంతరం 2013లో ట్రైనింగ్ పూర్తి చేసి 2014 ఏప్రిల్లో తిరుపతి సబ్జైలులో డిప్యూటీ జైలర్గా పనిచేస్తున్నారు. అక్కడ పనిచేస్తూనే ఆయన ఎస్ఐ పరీక్షరాసి ఎంపికయ్యారు. -
భగ్గుమన్న తమ్ముళ్లు
ప్రొద్దుటూరు, న్యూస్లైన్: పార్టీలోకి కొత్తగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి ప్రొద్దుటూరు అసెంబ్లీ టికెట్ను కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి ఇంటి వద్ద శుక్రవారం ఉదయం పార్టీ ప్రచార సామగ్రిని దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు అసెంబ్లీ టికెట్పై కొద్ది రోజులుగా నాన్చుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు 5వ విడత జాబితాలో వరదరాజులరెడ్డికి టికెట్ కేటాయిస్తూ శుక్రవారం ఉదయమే నిర్ణయం తీసుకున్నారు. టీవీల్లో వార్తలు ప్రసారం కావడం ద్వారా విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉదయాన్నే లింగారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇదే విషయంపై చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకునేందుకు గురువారం రాత్రి హైదరాబాద్కు లింగారెడ్డి వెళ్లారు. ఆయన హైదరాబాద్లో ఉండగానే వరదకు టికెట్ కేటాయించారు. దీంతో కార్యకర్తలు మండిపడ్డారు. జిల్లా అధ్యక్షునిగా ఉన్న లింగారెడ్డికి టికెట్ కేటాయించకపోవడం ఏమిటంటూ తీవ్ర ఆగ్రహంతో కార్యకర్తలు లింగారెడ్డి నివాస గృహం కింద ఉన్న పార్టీ కార్యాలయంలోని జెండాలు, టోపీలు, కండువాలు, పోస్టర్లతోపాటు సైకిల్కు కూడా నిప్పంటించారు. పోలీసులు వచ్చి వారించినా వారి ఆగ్రహం చల్లారలేదు. తొలి నుంచి లింగారెడ్డి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాడని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా పార్టీని వీడకుండా కష్టపడి పనిచేశారన్నారు. అలాంటి నేతను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వరదరాజులరెడ్డికి టికెట్ కేటాయించడం ఏమిటని తెలుగుతమ్ముళ్లు ప్రశ్నించారు. కంటతడి పెట్టిన తనయుడు తెలుగుదేశం పార్టీ టికెట్ తన తండ్రికి కాకుండా వరదరాజులరెడ్డికి కేటాయించడంపై మల్లేల లింగారెడ్డి తనయుడు హర్షవర్ధన్రెడ్డి కంటతడిపెట్టారు. మెడిసిన్ చదువుతున్న హర్షవర్ధన్రెడ్డి గడిచిన మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత కాలం పార్టీ కోసం పనిచేసినందుకు ఇదేనా గుర్తింపు అని అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి మా కుటుంబం ఎంతో సేవ చేసిందన్నారు. ఇంత కాలం పార్టీ కోసం పనిచేసిన లింగారెడ్డికి అన్యాయం జరిగిందంటూ పల్లా లక్ష్మిదేవి అనే కార్యకర్త బోరున విలపించారు. నాయకులు ఓదార్చినా ఆమె ఏడుపును ఆపలేకపోయారు. -
అస్తవ్యస్తం
ఔను.. అమ్మహస్తం అస్తవ్యస్తంగా మారింది. కిరణ్కుమార్రెడ్డి తన హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. పథకం పెట్టిన ఏడాదికే దాని ముచ్చట తీరింది. బడుగు, బలహీన వర్గాల వారికి అతి తక్కువ ధరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారు. తొలినాళ్లలో తొమ్మిది రకాల వస్తువులు పంపిణీ చేసిన యంత్రాంగం.. ఆ తరువాత కేవలం మూడు రకాల వస్తువులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రొద్దుటూరు, న్యూస్లైన్: అమ్మహస్తం పథకం కింద ఏప్రిల్ నెల కోటాకు సంబంధించి చౌక దుకాణాలకు పౌర సరఫరాల శాఖ అధికారులు కేవలం బియ్యం, చక్కెర, పామాయిల్ మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఉన్న స్టాక్ను బట్టి అక్కడక్కడ కందిబేడలూ ఇస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసిన తొలి నెలలోనే పథకం పరిస్థితి ఇలా తయారైంది. చౌక దుకాణాల వినియోగదారులకు మార్కెట్ ధరకంటే తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు అందజేయాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టారు. ప్రారంభంలో ఈ పథకం తమదేనని చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఫొటోలను ముద్రించారు. మొత్తమ్మీద పథకానికి సంబంధించి ప్రచారం భారీ ఎత్తున సాగింది. బియ్యంతో పాటు అమ్మహస్తం పథకం కింద తొమ్మిది రకాలైన చింతపండు, గోధుమపిండి, పసుపు, కందిపప్పు, కారం, గోధుమలు, ఉప్పు, పామాయిల్, పంచదారను అందజేయాల్సి ఉంది. ఆది నుంచి అంతే.. పథకం ప్రారంభానికి ముందు అన్ని సరుకులను ప్యాకింగ్ చేసి సరఫరా చేసేందుకు టెండర్లను నిర్వహించారు. అయితే ప్రారంభ సమయం నుంచే పథకం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పలు సందర్భాల్లో సరుకుల కొరత ఏర్పడటంతో మొత్తం చౌకదుకాణాల పని తీరే అస్తవ్యస్తంగా మారింది. మిగతా సరుకుల పరిస్థితి అటుంచితే చింతపండు, కారంపొడి, పసుపు పొడుల నాణ్యతపై వినియోగదారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. చాలా ప్రాంతాల్లో వినియోగదారులు వీటిని తీసుకోకుండా వ్యతిరేకించిన సందర్భాలూ లేకపోలేదు. అయితే కొందరు డీలర్లు బలవంతంగా వినియోగదారులకు వాటిని అంటగట్టారు. ఇవి తీసుకుంటేనే మిగతా సరుకులు ఇస్తామని ముడిపెట్టడంతో బలవంతంగా కొనుగోలు చేశారు. అమ్ముడుపోని సరుకుల వేలం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అమ్మహస్తం పథకంలో భాగంగా మిగతా సరుకులతోపాటు చింతపండు, పసుపు, కారంపొడిలను జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు కొనుగోలు చేశారు. వాటిని వినియోగదారులు తీసుకెళ్లకపోవడంతో అవి గోడౌన్లలో నిల్వ ఉన్నాయి. జిల్లాలో దాదాపుగా 48 టన్నుల చింతపండు, 10 టన్నుల పసుపు, 25 టన్నుల కారంపొడి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నెలల తరబడి నిల్వలు అలాగే ఉండటంతో చేసేదేమిలేక చివరికి వీటిని వ్యాపారులకు అమ్మేందుకు పౌరసరఫరాల శాఖాధికారులు గత నెలలో టెండర్లు నిర్వహించారు. ఎలాగోలా వ్యాపారులతో మాట్లాడి వీటిని అమ్మే ప్రయత్నం చేయాలని గోడౌన్ల అధికారులకు జిల్లా అధికారులు సూచించారు. ఇందుకు సంబంధించి పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ బుల్లయ్య ఏమంటున్నారంటే.. మిగిలిపోయిన సరుకును అమ్మడానికి పేపర్ ప్రకటన ఇచ్చాం. పలు కారణాలతో ప్రస్తుతం సరుకుల కొరత ఏర్పడింది. -
పసిడిపురి.. ఆరోగ్య సిరి
బంగారం వ్యాపారంలో రెండో ముంబైగా ప్రసిద్ధి చెందిన ప్రొద్దుటూరు ‘పసిడి పురి’గా పేరుగాంచింది. అంతటి కీర్తి సంపాదించిన ప్రొద్దుటూరు ‘ఆరోగ్యం’ విషయంలోనూ ఏమాత్రం తీసిపోకూడదనుకున్నారు. 30 పడలక ఆస్పత్రిని వంద.. తరువాత 350కు పెంచారు. జిల్లా స్థాయి ఆస్పత్రి హోదా కల్పించారు. అలా అన్ని హంగులతో రూపుదిద్దుకున్న ఇక్కడి ఆస్పత్రిలో అన్ని రోగాలకూ అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అందుకు ఆరోగ్యశ్రీ తోడ్పడింది. ఒక్కమాటలో చెప్పాలంటే అందరికీ ఆరోగ్యసిరి పంచారు. పురిటి పిల్లలకు కార్పొరేట్ వైద్యం ప్రొద్దుటూరులోని 30 పడకల ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల ఒకప్పుడు ప్రొద్దుటూరుతో పాటు రాజుపాళెం, దువ్వూరు, ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల ప్రజలకు ‘పెద్ద దిక్కు’గా ఉండేది. పైన పేర్కొన్న ప్రాంతాల్లో సాధారణ, మధ్యతరగతి కుటుంబాలే అధికంగా నివసించేవారు. తమకు ఏ చిన్న రోగమొచ్చినా ప్రొద్దుటూరు ఆస్పత్రికి వచ్చి వైద్య చికిత్స చేయించుకునేవారు. జనాభా పెరిగింది. రోగులూ పెరిగారు. ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్యా అంతకంతకు పెరిగింది. వంద పడకలకు పెంచినా... రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆస్పత్రి స్థాయిని పెంచాలని అనేక విన్నపాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రోగులు, వైద్య సిబ్బంది అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2000 సంవత్సరంలో ప్రొద్దుటూరు ఆస్పత్రిని వంద పడకల స్థాయికి పెంచారు. పొద్దుటూరు సహా పరిసర ప్రాంతాల్లో ప్రమాదాలు నిత్యకృత్యం. ఇక్కడి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఘర్షణలు ఇతర కేసుల్లో గాయపడ్డ బాధితుల్నైనా ప్రొద్దుటూరు ఆస్పత్రికే తీసుకువచ్చేవారు. మరోవైపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సైతం తరచూ నిర్వహించేవారు. దీంతో కొన్ని సందర్భాల్లో పడకలు చాలక రోగులు ఇబ్బంది పడేవారు. ఈ పరిస్థితుల్లో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గుర్ని పడుకోబెట్టేవారు. ఎవరెన్ని చెప్పినా.. కడపలో రిమ్స్ ఉండగా.. జిల్లా స్థాయి ఆస్పత్రిని మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఎంతో మంది ఎన్నో విధాలుగా అప్పటి ప్రభుత్వాన్ని కోరారు. ఒత్తిడీ తెచ్చారు. అయితే వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా జిల్లా వాసులకు అవసరమైన మరో పెద్దాస్పత్రిని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం. 350 పడకల ఆస్పత్రిని 2005 ఆగస్టు 3న భూమి పూజ చేశారు. రూ.11 కోట్లతో అధునాతనమైన భవంతులతో దీన్ని నిర్మించారు. 2011 ఆగస్టు 12న దీన్ని ప్రారంభించారు. నాడు మూడు విభాగాలే.. ఏరియా ఆస్పత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కేవలం మూడు విభాగాలు మాత్రమే పని చేసేవి. జిల్లా ఆస్పత్రిగా స్థాయి పెరిగాక అనేక విభాగాలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఆర్థో, ఆప్తాలమిక్, ఈఎన్టీ, మత్తుకు ప్రత్యేక విభాగం, చిన్నపిల్లల విభాగం, ఏఆర్టీ, టీబీతో పాటు అనేక విభాగాలు ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో నడుస్తున్నాయి. ఆయా విభాగాల్లోని వైద్యులు నిత్యం ఇక్కడ శస్త్ర చికిత్సలు చేస్తుంటారు. ఆరోగ్యశ్రీతో అందుబాటులోకి శస్త్ర చికిత్సలు జిల్లా ఆస్పత్రి స్థాయి పెరిగాక ప్రభుత్వం ఇక్కడ ఆరోగ్యశ్రీ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీంతో ప్రతి రోజూ ఆర్థో, స్త్రీల వ్యాధులు, చిన్న పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు కూడా జరగుతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ నియోజక పరిధిలో సుమారు 3,500 ఆపరేషన్లు జరిగాయి. జిల్లా ఆస్పత్రిగా రూపుదిద్దుకున్న ప్రొద్దుటూరు ఆస్పత్రిలో నవజాత శిశు కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఎస్ఎన్సీయూ విభాగాన్నీ ప్రారంభించారు. సాధారణంగా పురిటి పిల్లలకు ప్రొద్దుటూరు సహా పరిసర ప్రాంతాల్లో చికిత్సా విభాగాలు లేవు. అయితే జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఎస్ఎన్సీయూ విభాగం నలుగురు చిన్నపిల్లల వైద్యులు పర్యవేక్షణలో విజయవంతంగా నడుస్తోంది. తాజాగా ఇక్కడ సీ పాప్, వెంటి లేటర్ ద్వారా పురిటి పిల్లలకు చికిత్సలు అందిస్తున్నారు. ఇక్కడ లభిస్తున్న సేవలు చూస్తే కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఇలాంటి సేవలు ఉండవనే అభిప్రాయం అందరిదీ. వైఎస్ చలవతోనే పెద్దాస్పత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చలవతోనే మా ప్రాంతానికి ఇంత పెద్ద ఆస్పత్రి వచ్చింది. ఇక్డకి అస్పత్రి భవనాలు చూస్తుంటే కళ్లు తిరుగుతాయి. వైఎస్ లేకుంటే ఇన్ని లక్షలు పెట్టి ఎవరు కట్టిస్తారు? ఆయన మా జిల్లా వాసి కావడం మా అదృష్టం. అందుకే 350 పడకలతో ఆస్పత్రి వచ్చింది. ఆయనే ఉన్నింటే ఆస్పత్రి ఇంకా అభివృద్ధి చెందేది. - లక్ష్మీదేవి, సంజీవనగర్ ఆరోగ్యశ్రీ కాపాడుతోంది మా ఊరి ఆస్పత్రికి వైఎస్ జిల్లా స్థాయి హోదా కల్పించారు. ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నారు. ఏ ప్రమాదం జరిగినా, ఎంత పెద్ద రోగమొచ్చినా లక్షలు విలువ చేసే వైద్యం ఉచితంగా అందుతోంది. ఇంతకు ముందు ఏ చిన్న ప్రమాదం జరిగినా దూర ప్రాంతాలకు వెళ్లే వాళం. ఇప్పుడా అవసరం లేకుండా పోయింది. జగన్ సీఎం అయితే ఆస్పత్రి ఇంకా బాగుపడుతుంది. - యాడికి సుబ్బమ్మ, ప్రొద్దుటూరు మెడికల్ కాలేజీ వచ్చేది వైఎస్ రాజశేఖర్రెడ్డి బతి ఉన్నింటే ప్రొద్దుటూరుకు మెడికల్ కాలేజీ వచ్చేది. ఆయన అకాల మరణంతో జిల్లా అభివృద్ధితో పాటు ఆస్పత్రి అభివృద్ధి కూడా కుంటుపడింది. వైద్యులు, అనేక వ్యాధుల విభాగాలు ఉన్నా తగినన్ని పరికరాలు లేక, కొన్ని రకాల చికిత్సలకు ఇబ్బంది కలుగుతోంది. జగన్ అధికారంలోకొస్తే ఆ సమస్యా తీరుతుంది. - సిరిశెట్టి నరసింహులు, పెన్నానగర్ వైఎస్ వల్లే బతికా నాకు గుండెజబ్బు వచ్చింది. డాక్టర్లను కలిస్తే స్టంట్స్ వేయాలన్నారు. అందుకు రూ.లక్ష ఖర్చవుతుందన్నారు. అంత స్థోమత నాకు లేదు. ఈ సమయంలో వైఎస్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ నాలో ధైర్యం నింపింది. హైదరాబాద్ నాంపల్లెలోని కేర్ ఆస్పత్రిలో 2008 మే 18న ఆపరేషన్ చేయించుకున్నా. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. ఆయనే లేకుంటే నేనీ రోజు మీతో ఇలా మాట్లాడేవాడ్ని కాదు. అందుకు వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నా. - కుప్పం శ్రీణివాసరావు, కె.రాజుపల్లె, చక్రాయపేట మండలం -
పుర సమరం
ఎన్నికల సంగ్రామంలో నేటి నుంచి తొలిఘట్టం మొదలవనుంది. 41 నెలలుగా వాయిదా పడిన ‘పురపోరు’లో నేడు నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. గత ఎన్నికలు కడప కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో నిర్వహించారు. 2005 వరకూ కడప, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలు మాత్రమే ఉండేవి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం పీఠం అధిరోహించిన తర్వాత కడపను కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేయడంతో పాటు జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, బద్వేలును మున్సిపాలిటీల జాబితాలో చేర్చారు. వీటి పాలకవర్గం గడువు ముగిసిన తర్వాత ఎన్నికలు వాయిదా పడ్డాయి. తర్వాత మునిసిపాలిటీల జాబితాలో మైదుకూరు, ఎర్రగుంట్ల నగరపంచాయతీలు చేరాయి. దీంతో కడప కార్పొరేషన్తో పాటు7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీల విలీనానికి సంబంధించిన కేసు కోర్టులో నడస్తుండటంతో రాజంపేట ఎన్నికలు వాయిదా పడ్డాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో అన్ని అధ్యక్షస్థానాలను కాంగ్రెస్పార్టీ దక్కించుకుంది. తెలుగుదేశం పార్టీకి ఒక్కస్థానం కూడా దక్కలేదు. ప్రస్తుత ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో మూడున్నరేళ్ల తర్వాత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ముఖచిత్రాలను పరిశీలిద్దాం. - సాక్షి, కడప జమ్మలమడుగు జమ్మలమడుగు మున్సిపాలిటీగా 2005లో అప్గ్రేడ్ అయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దీన్ని మున్సిపాలిటీ జాబితాలో చేర్చేలా చొరవచూపారు. జమ్మలమడుగు కూడా వస్త్రవ్యాపారానికి ప్రసిద్ధి. ఇక్కడ చేనేతలు కూడా అధికంగా ఉన్నారు. అద్దకం పరిశ్రమపై ఆధారపడి జీవించేవాళ్లు అధికంగా ఉన్నారు. ఇక్కడ మున్సిపాలిటీని 2005లో కాంగ్రెస్పాలక వర్గం దక్కించుకుంది. గత ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో బండారు రాగుసుధ చైరపర్సన్గా కొనసాగారు. ప్రస్తుతం ఈ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ కూడా మహిళా ఓటర్లే అధికం. మొత్తం ఓటర్లు: 35,485 పురుషులు: 17,139 మహిళలు: 18,346 వార్డులు: 20 మైదుకూరు రెండేళ్ల క్రితం మైదుకూరు మునిసిపాలిటీగా మారింది. ఇక్కడ అమ్మవారిశాలతో పాటు మసీదు, శ్రీ షిర్డిసాయిబాబా ఆలయాలు ప్రసిద్ధి. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ప్రధాన కూడలి మైదుకూరు. ఈ స్థానం బీసీ జనరల్కు రిజర్వ్ అయింది. ఇక్కడా మహిళా ఓటర్లే అధికం. మొత్తం ఓటర్లు: 33,318 పురుషులు: 16,385 మహిళలు: 16,933 వార్డులు: 23 కడప కార్పొరేషన్ కడప పురపాలికకు వందేళ్లపైబడి చరిత్ర ఉంది. 2005లో కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది. జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీ కడప. పట్టణం నుంచి నగరంగా ఉన్నతి సాధించిన కడపలోని దేవుని కడపలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంతో పాటు పెద్దదర్గా, కేథడ్రల్ చర్చి ఉన్నాయి. నగరంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు. అలాగే రాజస్థాన్ నుంచి వలసలు వచ్చి ఇక్కడే స్థిరపడిన మార్వాడీలు ఓటర్లుగా ఉన్నారు. మహావీర్ దేవస్థానం కూడా నిర్మించారు. కడప కార్పొరేషన్ తొలిమేయర్ స్థానాన్ని కాంగ్రెస్పార్టీ మద్దతుతో పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి కైవసం చేసుకున్నారు. కార్పొరేషన్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం మేయర్ స్థానం బీసీ జనరల్కు రిజర్వ్ అయింది. మొత్తం ఓటర్లు: 2,71,532 పురుషులు: 1,35,216 మహిళలు: 1,36,280 ఇతరులు: 36 వార్డులు: 50 ప్రొద్దుటూరు కడప తర్వాత జిల్లాలో మున్సిపాలిటీ హోదా దక్కించుకున్న పట్టణం ప్రొద్దుటూరు. ప్రొద్దుటూ రు పట్టణంలో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. రామేశ్వరం ముక్తిరామలింగేశ్వరస్వామి దేవస్థానంతో పాటు శ్రీ కన్యకాపరమేశ్వరి కొలువై ఉన్న అమ్మవారిశాల, శివాలయం ఉన్నాయి. పసిడిపురిగా కీర్తిగడించిన ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి. ఈ మున్సిపాలిటీని గత ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ దక్కించుకుంది. ఇరగం మల్లీశ్వరి చైర్పర్సన్గా రెండున్నరేళ్లు కొనసాగారు. తర్వాత వీఎస్ సైరాభాను చైర్పర్సన్ పీ ఠం అధిరోహించారు. ఈమె దీర్ఘకాలిక సెలవులో ఉండటంతో వీఎస్ ముక్తియార్ ఇన్చార్జ్ చైర్పర్సన్గా తక్కిన కాలం కొనసాగారు. ప్రస్తుతం చైరపర్సన్ స్థానం అన్రిజర్వ్డ్గా ఉంది. ఇక్కడ మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మొత్తం ఓటర్లు: 55,159 పురుషులు: 27,101 మహిళలు: 28,058 వార్డులు: 26 రాయచోటి రాయచోటి కూడా వైఎస్ హయాంలోనే మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. 2005 ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. అప్పట్లో చైర్మన్ స్థానం బీసీ జనరల్కు రిజర్వ్ అయింది. వీరభద్రయ్య తొలి చైర్మన్గా ఎన్నిక య్యారు. ఐదేళ్లు ఆయన అధ్యక్షతనే పాలకవర్గం కొనసాగింది. ప్రస్తుతం ఈ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ కూడా మహిళా ఓటర్లే అధికం. మొత్తం ఓటర్లు: 60,087 పురుషులు: 30,861 మహిళలు: 31,226 వార్డులు: 31 బద్వేలు బద్వేలు కూడా వైఎస్ హయాంలోనే మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. అయితే దీనికి మున్సిపల్ ఎన్నికలు ఆలస్యంగా జరిగాయి. దీంతో తక్కిన మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసినా బద్వేలు పాలకవర్గం గతేడాది వరకూ కొనసాగింది. గత ఎన్నికల్లో ఆ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయింది. బవనాసి మునెయ్య తొలి చైర్మన్గా కొనసాగారు. ప్రస్తుతం ఈ స్థానం బీసీ జనరల్కు రిజర్వ్ అయింది. ఇక్కడ మహిళా ఓటర్లే అధికం. మొత్తం ఓటర్లు: 52,401 పురుషులు: 26,040 మహిళలు: 26,360 ఇతరులు: 1 వార్డులు: 26 ఎర్రగుంట్ల ఎర్రగుంట్ల నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయింది. నాపరాళ్ల పరిశ్రమకు ఎర్రగుంట్ల ప్రసిద్ధి. సిమెంట్ పరిశ్రమలు కూడా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. ఈ స్థానం బీసీ జనరల్కు రిజర్వ్ అయింది. జమ్మలమడుగు మున్సిపాలిటీతో పాటు ఎర్రగుంట్ల నగర పంచాయతీ కూడా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉంది. జిల్లాలో ఒకే నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉండటం ఇక్కడే. ఇక్కడ కూడా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మొత్తం ఓటర్లు: 23,367 పురుషులు: 11,462 మహిళలు: 11,905 వార్డులు: 20 పులివెందుల పులివెందుల కూడా వైఎస్ హయాంలోనే మున్సిపాలిటీ హోదా దక్కించుకుంది. ఇది పంచాయతీగా ఉన్న సమయంలో కూడా వైఎస్ మద్దతుదారులే గెలిచారు. 2004లో రాష్ట్రముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. వైఎస్ కుటుంబానికి ఇది కంచుకోటగా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. రుక్మిణీదేవి తొలి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ స్థానం జనరల్ మహిళకే రిజర్వ్ అయింది. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఓటర్లు: 55,159 పురుషులు: 27,101 మహిళలు: 28,058 వార్డులు: 26 -
రేపటి నుంచే మున్సిపల్ నామినేషన్లు
కడప కార్పొరేషన్, న్యూస్లైన్ : మున్సిపల్ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ జారీచేయనున్నారు. 10 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మున్సిపాలిటీలలో అయితే 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే కడప కార్పొరేషన్తోపాటు ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, ఎర్రగుంట్ల, రాయచోటి, బద్వేలు మున్సిపాలిటీలలో రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తయింది. కడపలో 13 మంది రిటర్నింగ్ అధికారులను నియమించి ఏయే డివిజన్లకు ఎక్కడ నామినేషన్లు దాఖలు చేయాలనే సమాచారాన్ని కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఇతర మున్సిపాలిటీలలో కూడా ఏ వార్డుకు సంబంధించిన వారు ఎక్కడ నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలనే విషయాన్ని బహిర్గతం చేశారు.ఎన్నికలు సమీపించడంతో అభ్యర్థులు ఆత్మీయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. టీకొట్లు, ప్రధాన కూడళ్లు, రచ్చబండల వద్ద అందరినీ వరుసలు పెట్టి పలుకరిస్తూ ఎన్నికల అంశాన్ని కూడా జోడించి తనకు మద్దతు ఇవ్వాలనే ప్రచారాన్ని ప్రారంభించారు. గతంలో మనస్పర్థలు, అభిప్రాయ బేధాలున్నా వాటన్నింటినీ పక్కనబెట్టి అందరినీ కలుపుకొని పోయేలా సంభాషణలు సాగుతున్నాయి. -
కడపలో భీమవరం బుల్లోడు
కడప, ప్రొద్దుటూరులో శుక్రవారం ‘భీమవరం బుల్లోడు’ సందడి చేశాడు. హీరోయిన్ ఎస్తేర్తో కలిసి స్టెప్పులేశాడు. అభిమానులతో కరచాలనం చేసి ఆటొగ్రాఫ్లిచ్చి.. ఫొటో దిగారు. నిజమైన హీరోలు అభిమానులేనని, ప్రొద్దుటూరు అంటే తనకెంతో ఇష్టమని సునీల్ పేర్కొన్నాడు. కడప కల్చరల్, న్యూస్లైన్ : ‘భీమవరం బుల్లోడు’ సినిమా బృందం శుక్రవారం కడప నగరానికి వచ్చారు. ‘విజయ యాత్ర’ పేరిట వచ్చిన ఈ చిత్రం కథా నాయకుడు సునీల్, నాయిక ఎస్తేర్, దర్శకుడు ఉదయ్ శంకర్, నటుడు ఫృథ్విరాజ్ (30 ఇయర్స్ ఇండస్ట్రీ) తదితరులకు నగర ప్రముఖులు రవీంద్రనాథరెడ్డి (రూ.స్ క్రీం రవి) ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక ఓ హోటల్లో వారు విలేకరులతో ముచ్చటించారు. నటుడు సునీల్ మాట్లాడుతూ శ్రీకాకుళం నుండి విజయ యాత్ర ప్రారంభించామనీ, ప్రతిచోటా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. ఈ సినిమా విజయానికి కారకులైన ప్రేక్షకులందరినీ కలిసి కృతజ్ఞతలు తెలుపుకోవడం బాధ్యతగా భావించి ఈ యాత్ర చేపట్టామన్నారు. కథా నాయిక ఎస్తేర్ మాట్లాడుతూ సురేష్ మూవీస్ లాంటి పెద్ద సంస్థలో, అందునా ఆ సంస్థ 50వ వార్షికోత్సవం సందర్భంగా నిర్మించిన ఈ చిత్రంలో తనకు అవకాశం లభించడం అదృష్టమన్నారు. ఉదయ్ శంకర్ లాంటి విజయవంతమైన దర్శకుని సినిమాలో నటించగలగడం గొప్పగా భావిస్తున్నామన్నారు. దర్శకుడు ఉదయ్శంకర్ మాట్లాడుతూ చిత్రం ఘన విజయం సాధించడానికి కారకులైన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. స్టెప్పులేసి.. సందడి చేసి : అనంతరం ఈ బృందం కడప నగరంలో భీమవరం బుల్లోడు చిత్రం ప్రదర్శిస్తున్న రవి థియేటర్కు వెళ్లి కొద్దిసేపు గడిపారు. అభిమానుల కోరికపై సునీల్ ఒక పాటకు స్టెప్పులేసి సందడి చేశారు. అభిమానులతో కరచాలనం చేసి ఆటోగ్రాఫ్లిచ్చి కలిసి ఫోటోలు దిగారు. -
వరదకు భంగపాటు
ప్రొద్దుటూరు, న్యూస్లైన్: మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆశలు అడియాశలు అయినట్లు తెలిసింది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు.. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి తొలి నుంచి వెన్నంటి వస్తున్న వరదరాజులరెడ్డి తన రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకుగాను తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడుతో వరదరాజులరెడ్డి అల్లుడు రామచంద్రారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే లింగారెడ్డికి చెక్ పెట్టాలని అనుకున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్ లింగారెడ్డికి కాకుండా తనకే ఇవ్వాలన్నది వరదరాజులరెడ్డి ప్రధాన డిమాండ్. అయితే లింగారెడ్డి ఇందుకు ససేమిరా అంగీకరించడం లేదు. లింగారెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పించాలని వరద చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చర్చల నేపథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు బ్రేకులు పడ్డాయి. ఇంత వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అటు లింగారెడ్డి, ఇటు వరదరాజులరెడ్డి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థులను నిర్ణయించడం కానీ, ఎన్నికల ప్రచారం చేయడం కానీ జరగలేదు. ఇరువురు ఒకే పార్టీలోకి వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపిక జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇరువర్గాలకు చెందిన నాయకులు వేచి చూస్తున్నారు. ముందుగా నాలుగు రోజులు ప్రచారం చేసిన లింగారెడ్డి సైతం మధ్యలో విరమించుకున్నారు. ఇదిలావుండగా గురువారం ఎమ్మెల్యే లింగారెడ్డితోపాటు ఎంపీ సీఎం రమేష్ నాయుడు ఈ విషయంపై చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డిని కాదని ఎమ్మెల్యే టికెట్ మరొకరికి ఇవ్వలేమని, అలా ఇవ్వడం వలన పార్టీకి నష్టం వాటిల్లుతుందని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఎన్నికల్లో పార్టీకి సేవ చేస్తే భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని వరదకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రస్తుతం చర్చంశనీయమైంది. అయితే వరద వర్గీయుల్లో మాత్రం టీడీపీలో చేరికపై ఇంకా ఆశ చావలేదు. ఇదిలావుండగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సైతం తన పార్టీలోకి రావాలని వరదరాజులరెడ్డిని గురువారం ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై వరదరాజులరెడ్డి స్పందించలేదని సమాచారం. -
వైఎస్సార్సీపీలో చేరండి
ప్రొద్దుటూరు, న్యూస్లైన్: ప్రస్తుత రాజకీ య పరిస్థితుల దృష్ట్యా మనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మంచిదని పలువురు కార్యకర్తలు మున్సిపల్ ఇన్చార్జి మాజీ చైర్మన్ వీఎస్ ముక్తియార్కు సూచిం చారు. కాంగ్రెస్లో కొనసాగుతున్న ఈయ న రాష్ట్ర విభజన పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీని వీడి తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకుగా ను బుధవారం తన స్వగృహం వద్ద కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ సభ నిర్వహించారు. సభకు అధ్యక్షత వహిం చిన పోలీసు అధికారుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్బాషా మా ట్లాడుతూ కార్యకర్తల అభిప్రాయం మేర కు ముక్తియార్ వైఎస్సార్సీపీలో చేరాలని కోరారు. న్యాయవాది టప్పా అబ్దుల్ రసూల్ మాట్లాడుతూ వైఎస్ నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లింలకు కల్పించి వారి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ముక్తియార్ వైఎ స్సార్ సీపీలో చేరాలని కోరారు. మరో న్యాయవాది సబ్దర్ హుసేన్, ఎస్పీజీ చర్చి కార్యదర్శి భాస్కర్రావు, యూత్ కాంగ్రెస్జిల్లా మాజీ అధ్యక్షుడు, టౌన్ బ్యాంక్ డైరక్టర్ పీఎండీ నజీర్ మాట్లాడుతూ వైఎస్ ఆశయాలకు అనుగుణంగా వైఎస్ జగన్ పార్టీని స్థాపించారన్నారు. జగన్ జిల్లా వాసి కావడంతో ఆ పార్టీలో చేరితే మన భవిష్యత్తు బాగుం టుందన్నారు. అగస్త్యేశ్వర ఆలయ కమి టీ సభ్యుడు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ముక్తియార్ వైఎస్సార్ సీపీలో చేరి రాచమల్లు ప్రసాదరెడ్డి గెలుపుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో మా జీ కౌన్సిలర్లు పాణ్యం సుబ్బరాయుడు, అగ్గారపు శ్రీనివాసులు, గంజికుంట ఆంజనేయులు, షహబుద్దీన్, సాలయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మోతుకూరి సుబ్బారావు, డిపో మహబూబ్సాహెబ్, రిటైర్డు మున్సిపల్ అధికారి ఎస్పీ అహ్మద్హుసేన్, రిటైర్డు డీఎంఅండ్ హెచ్ఓ సాజహాన్, న్యాయవాది దాదాపీర్, పట్ట ణ చీఫ్ ఖాజీ ఇనాయతుల్లా, ప్రభుత్వ ఖాజీ హబీబుల్లా, డాక్టర్ లియాఖత్, డా క్టర్ సత్తార్, మాజీ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ మండి అబ్దుల్ ఖాదర్, రిటైర్డు టీచర్ సులేమాన్, గౌస్లాజం, ఆర్టీసీ ఉద్యోగి బాబా, జయరాజ్లు మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్కు నూకలు చెల్లాయన్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీల్లో బెటర్ ఆప్షన్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్నారు. నేడు నిర్ణయాన్ని ప్రకటిస్తా : ఆత్మీయ సభలో అందరి అభిప్రాయాలు విన్న అనంతరం తన రాజకీయ నిర్ణయాన్ని గురువారం ప్రకటిస్తానని వీఎస్ ముక్తియార్ తెలిపారు. -
అక్రమార్కులకు చెక్!
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్లైన్: ప్రొద్దుటూరు మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీలో నిర్మించిన ఇందిరమ్మ కాలనీలో అక్రమాలపై పీడీ సాయినాథ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ చర్యలు చేపట్టారు ఇందిరమ్మ కాలనీ ఫేజ్-1, 2 అర్బన్ పరిధిలో 524, రూరల్ పరిధిలో 129 గృహాల్లో లబ్ధిదారులు లేకపోవడంతో జనవరి 10వ తేదీన పీడీ నోటీసులు జారీ చేశారు. ఇచ్చిన వారంలోపు లబ్ధిదారులు వారి రికార్డులను సంబంధిత హౌసింగ్ ఈఈ కార్యాలయంలో చూపించి వెంటనే గృహాల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉలిక్కి పడ్డ లబ్ధిదారులు ఉరుకులు పరుగుల మీద ఇందిరమ్మ కాలనీలో మరమ్మతులు ప్రారంభించారు. అయితే 193 మంది లబ్ధిదారులు హౌసింగ్ అధికారులకు ఎలాంటి రికార్డులు సమర్పించలేదు. నెల దాటినా కూడా లబ్ధిదారుల్లో ఎలాంటి స్పందన లేదు. కలెక్టర్కు నివేదిక ఇచ్చిన పీడీ.. దీంతో హౌసింగ్ శాఖలో కదలిక వచ్చింది. స్పందించని లబ్ధిదారుల గృహాలను అక్రమార్కులు ఆక్రమించినట్లు నిర్ధారించుకున్న పీడీ కలెక్టర్కు నివేదిక అందజేశారు. దీంతో కలెక్టర్ 193 గృహాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ కార్పొరేషన్ శాఖ అధికారులు ఈ గృహాలను గురువారం నుంచి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. రికార్డులను పరిశీలించిన పీడీ, రూ.కోటి దాకా రికవరీకి చర్యలు.. ఈ విషయంపై పీడీ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయే వరకు ప్రొద్దుటూరు హౌసింగ్ ఈఈ కార్యాలయంలో ఉండి రికార్డులను పరిశీలించారు. రద్దు చేసిన ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు ఆర్సీ వరకు మంజూరు చేసిన సుమారు రూ.కోటి దాకా బిల్లులను రికవరీ చేస్తున్నట్లు పీడీ తెలిపారు. 585 ప్లాట్లు మార్పులు జరిగాయని తహశీల్దార్ ఇచ్చిన నివేదికను పరిశీలించినట్లు తెలిపారు. ఇందులో 466 గృహాలకు బిల్లులు కూడా మంజూరు చేశామని, మరో 14 గృహాలకు బిల్లులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. వీరందరికీ తహశీల్దార్ ఇచ్చిన స్పీకింగ్ ఆర్డర్స్ను కూడా పరిశీలిస్తున్నామన్నారు. కొందరు అక్రమార్కులు స్పీకింగ్ ఆర్డర్స్కూడా నకిలీవి తయారు చేసి గృహాలు అమ్ముతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. -
కదిలిస్తే..కన్నీరే..
వారంతా రెక్కాడితేగానీ డొక్కాడనివారే.. చిన్నచిన్న పనులకోసం ఆటోలో ప్రయాణిస్తుంటారు. అటువంటివారిపై విధి పగబట్టింది.. ఒకరుకాదు.. ఇద్దరు కాదు ఏకంగా 8 మందిని బలిగొంది. చిన్న సింగనపల్లెకు చెందిన మైసూరారెడ్డి, పాపయ్య ప్రాణస్నేహితులు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళుతుంటారు. బుధవారం కూడా కలిసే ప్రయాణించారు. కలిసే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మరణంలోనూ వారి స్నేహబంధం వీడలేదు. గుడిపాడుకు చెందిన నాగ చంద్ర, నాగేంద్ర తండ్రీ కొడుకులు. క్షౌరవృత్తే జీవనాధారం. ప్రతి రోజూ దువ్వూరుకు వెళ్లివచ్చేవారు. బుధవారం వారికి ఆఖరి ప్రయాణమే అయింది. మనేరాంపల్లెకు చెందిన రామేశ్వరి చదువులతల్లి. ఇటీవలే డిప్లమో పూర్తి చేసింది. ప్రొద్దుటూరులో కంప్యూటర్ శిక్షణ పొందుతోంది. ఇంటికి వస్తుండగా రామేశ్వరికి నూరేళ్లు నిండాయి. గుడిపాడుకు చెందిన ఓబుళరెడ్డిది మరోవిషాదం. 25 ఏళ్ల క్రితం భార్య చనిపోగా పిల్లలకోసం సుశీలమ్మను వివాహం చేసుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న ఓబుళరెడ్డి బాగోగులను సుశీలమ్మే చూసుకునేది. రోడ్డు ప్రమాదంలో సుశీలమ్మ మృతి చెందింది. ‘ భగవంతుడా ఇంత అన్యాయం చేస్తావా’ అంటూ ఓబుళరెడ్డి విలపిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. ఉద్యోగం పొందాలనే కోరిక తీరకుండానే... ప్రొద్దుటూరు క్రైం/దువ్వూరు, న్యూస్లైన్ : వివిధ రకాల పనులు చేసుకునే పలువురు తమ తమ గ్రామాలకు వెళ్లడానికి ఆటో ఎక్కారు.. కొందరు మరో పది నిమిషాలల్లో తమ గ్రామం వస్తుందనుకున్నారు..మరి కొందరు 15 నిమిషాలుంటే ఇంటికి చేరుకోవచ్చులే అనుకున్నారు.. ఇలా ఆటోలో ఐదారు గ్రామాల ప్రజలు ప్రయాణిస్తున్నారు. ఆటోలో ఉన్న ఏ ఒక్కరి గ్రామం రాకముందే రోడ్డు ప్రమాదం జరిగింది. కొద్దిసేపట్లో ఇంటికి వెళ్తారనుకున్న ప్రయాణికులు తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. 8 మందిని పొట్టన పెట్టుకున్న రోడ్డు ప్రమాదం అందరిలోనూ అంతులేని విషాదాన్ని నింపింది. పండుగ పూట ఆనందంగా ఉండాల్సిన ఆ కుటుంబాల్లో మృత్యు రోదనలు వినిపిస్తున్నాయి. వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు..పొలానికి వెళ్లినా, బజారుకు వెళ్లినా తోడు లేనిదే వెళ్లేవారు కాదు..అలాంటి స్నేహితులు మరణంలోనూ తోడుగా వెళ్లారు. చిన్నసింగనపల్లె గ్రామానికి చెందిన గువ్వల మైసూరారెడ్డి(48)కి ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులున్నారు. వారిలో ఇద్దరికి పెళ్లిళ్లు చేశారు. అదే గ్రామంలోని మత్స్యకారుడైన దారుబోయిన పాపయ్య(47)కు భార్య గుర్రమ్మ, వెంకటేశ్ అనే కుమారుడు ఉన్నారు. కుమారుడికి కర్నూలు జిల్లా జమ్ములదిన్నెలో పెళ్లి సంబంధం ఖాయం అయింది. వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత ఏప్రిల్ నెలలో పెళ్లి పెట్టుకోవాలని ఇరువురు మాట్లాడుకున్నారు. ఇదిలా ఉండగా పాపయ్య, మైసూరారెడ్డి చిన్నప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో మైసూరారెడ్డి కుమార్తెకు పెళ్లి సంబంధం మాట్లాడటానికి ఇద్దరూ కలిసి బుధవారం ఉదయాన్నే కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడకు వెళ్లారు. తర్వాత ఇద్దరూ బస్సులో దువ్వూరుకు చేరుకున్నారు. గురువారం శివరాత్రి పండుగ ఉండటంతో ఇద్దరూ దువ్వూరులో సరుకులు తీసుకొని ఆటోలో గ్రామానికి బయలుదేరారు. ఇంటికి చేరకముందే రోడ్డు ప్రమాదంలో మృత్యుపాలయ్యారు. వారిది సాధారణ కుటుంబం.. కులవృత్తే వారికి జీవనాధారం.. కుటుంబ బాధ్యతలు మోసే క్రమంలో తండ్రీ కొడుకులిద్దరినీ మృత్యువు వెంటాడింది. గుడిపాడుకు చెందిన సన్నాయి నాగచంద్ర(45)కు నాగేంద్రప్రసాద్,(23), నాగేంద్రకుమార్ అనే కుమారులతో పాటు శివపార్వతి అనే కుమార్తె ఉంది. కొన్నేళ్ల క్రితమే శివపార్వతికి పెళ్లి చేశారు. కొన్ని కారణాల వల్ల కుమార్తె కుటుంబ పోషణా భారం కూడా తండ్రిపైనే పడింది. దీంతో తండ్రితో పాటు కుమారుడు నాగేంద్ర దువ్వూరులో క్షవరశాల పెట్టుకొని కులవృత్తిని చేసేవారు. పని చేస్తేగాని కుటుంబం గడువకపోవడంతో తండ్రీకొడుకులిద్దరూ కష్టపడేవారు. ఈ క్రమంలోనే దువ్వూరు నుంచి గుడిపాడు గ్రామానికి ఇద్దరూ పయనమయ్యారు. అయితే దారిలోనే వారు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారు. మనేరాంపల్లి గ్రామానికి చెందిన ఇరగంరెడ్డి రామగోవిందరెడ్డికి కుమార్తె రామేశ్వరి(18)తో పాటు రాంప్రశాంత్రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. రామగోవిందరెడ్డి సన్నకారు రైతు. పిల్లలిద్దరినీ బాగా చదివించాడు. కుమారుడు ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి నంద్యాలలో బ్యాంక్ కోచింగ్కు శిక్షణ పొందుతున్నాడు. కుమార్తె రామేశ్వరి గత జూన్లో డిప్లొమో పూర్తి చేసింది. మూడు నెలల నుంచి ఆమె ప్రొద్దుటూరులో కంప్యూటర్ కోర్సు చేస్తోంది. ఇందుకోసం ఆమె ప్రతి రోజూ గ్రామం నుంచి ప్రొద్దుటూరుకు వచ్చి పోతుంటుంది. పదో తరగతితోపాటు ఇంటర్లో కూడా రామేశ్వరి మెరిట్ మార్కులు సాధించింది. ఎలాగైనా ఉద్యోగం సంపాదిస్తానని ఆమె తల్లి ఆదిలక్షుమ్మతో చెబుతూ ఉండేది. అయితే ఆ కోరిక తీరకుండానే తనువు చాలించింది. అలాగే గుడిపాడుకు చెందిన కమతం వెంకటరెడ్డి(55)కి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎరువుల కోసం అతను బుధవారం దువ్వూరుకు వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చిట్వేలుకు చెందిన షేక్ ఖాదర్బాషా(65) కొన్నేళ్ల నుంచి ఆధ్యాత్మిక చింతనతో జీవిస్తున్నాడు. అతని భార్య రసూల్బీ చిట్వేల్లో ఉండగా అతను మాత్రం దువ్వూరు మండలంలోని చింతకుంట సమీపంలో ఉన్న అబ్దుల్ఖాదర్ స్వామి దర్గా వద్దనే ఉండేవాడు. దువ్వూరు వచ్చిన అతను తిరిగి దర్గా వద్దకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ప్రొద్దుటూరుకు వెళ్లి వస్తూ... దువ్యూరు, న్యూస్లైన్: తాను చస్తూ నన్ను చంపిందని బుధవారం రాత్రి ఆటో ప్రమాదంలో మృతిచెందిన గోపిరెడ్డి సుశీలమ్మ భర్త చిన్న ఓబుళరెడ్డి ఆవేదనతో చెప్పాడు. గుడిపాడుకు చెందిన గోపిరెడ్డి చిన్నఓబుళరెడ్డి పోరుమామిళ్ల వద్దనున్న సిద్దాయపల్లెకు చెందిన గురమ్మను వివాహం చేసుకోగా అమె అనారోగ్య కారణంగా గత 25 ఏళ్ల క్రితం మృతి చెందింది. అమెకు ఐదుగురు సంతానం. పిల్లల ఆలనాపాలనా కోసం ప్రొద్దుటూరు మండలంలోని కాకిరేణిపల్లెకు చెందిన సుశీలమ్మను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం కాగా ఆడపిల్ల చిన్నప్పుడే మృతి చెందగా ఒక్కగానొక్క కూమారుడు రమణారెడ్డి ప్రొద్దుటూరులో బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. కుమారున్ని చూసేందుకు ప్రొద్దుటూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా సుశీలమ్మ మృత్యుపాలయ్యారు. మిన్నంటిన రోదనలు ప్రొద్దుటూరు క్రైం, న్యూస్లైన్: ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి ప్రాంగణం మృతుల బంధువుల రోదనలతో హోరెత్తింది. దువ్వూరు మండలంలోని క్రీస్తురాజపురం గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఐదుగురు సంఘటనా స్థలంలో మృతి చెందగా సుశీలమ్మ, పాపయ్యలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రగాయాలైన ఇరగంరెడ్డి రామేశ్వరిని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తుండగా గురువారం మృతి చెందింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఫ్రీజర్ బాక్స్లో నాలుగు మృతదేహాలను మాత్రమే పెట్టడానికి అవకాశం ఉన్నందున మిగతా వాటిని బయటనే ఉంచారు. మృతుల బంధువులు ఒకరినొకరు పట్టుకొని విలపించసాగారు. పోస్టుమార్టం అనంతరం గురువారం మధ్యాహ్నం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. పరామర్శించిన వైఎస్సార్సీపీ నాయకులు మైదుకూరు నియోజక వర్గ వైఎస్సార్సీపీ నాయకుడు శెట్టిపల్లె నాగిరెడ్డి, యూత్కన్వీనర్ ఓబుళరెడ్డి, రైతువిభాగం అధ్యక్షుడు మల్లారెడ్డి, ఇరగంరెడ్డి శంకర్రెడ్డి, పద్మనాభరెడ్డిలతో పాటు పలువురు గురువారం ఉదయం జిల్లా ఆస్పత్రి వద్దకు చేరుకొని మృతదేహాలను సందర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
రాయితీ ఏదీ!
ప్రొద్దుటూరు, న్యూస్లైన్: వ్యవసాయ రుణాలపై రైతులు తీసుకున్న రుణాలపై వడ్డీ రాయితీని ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చాలా ఏళ్ల నుంచి రైతులకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ అధికారులు వడ్డీలో 6 శాతం రాయితీ ఇచ్చేవారు. అయితే ఈ ఏడాది రైతులకు వడ్డీ రాయితీ అమలు కాలేదు. రాజుపాళెం మండలంలోని పీ. టంగుటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ పరిధిలో రైతులకు 90 ట్రాక్టర్లను మంజూరు చేశారు. ఈ మేరకు ప్రతి రైతు అసలుతోపాటు పూర్తి వడ్డీని కూడా చెల్లించాల్సి వస్తోంది. వడ్డీ రాయితీ ఎందుకు కల్పించలేదని సొసైటీ సీఈఓ వెంకటేశ్వరరెడ్డిని న్యూస్లైన్ వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డబ్బు వసూలు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రకారం జిల్లా వ్యాప్తంగా వందల మంది రైతులు ప్రభుత్వం నిర్వాకం కారణంగా నష్టపోతున్నారు. మార్చి 1వ తేదీ లోపు బకాయిలు చెల్లించాలని సొసైటీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసులను చూసిన రైతులు చాలా మంది బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయమై న్యూస్లైన్ ఆరా తీయగా 6శాతం వడ్డీ రాయితీకి సంబంధించి ప్రభుత్వం ఈ ఏడాది జీఓ విడుదల చేయలేదని తెలిసింది. చాలా సంవత్సరాలుగా వడ్డీ రాయితీని అమలు చేస్తుండగా ఈ ఏడాది మాత్రమే మినహాయించారు. కొన్ని చోట్ల సొసైటీ సీఈఓలు మీరు పూర్తి డబ్బు చెల్లిస్తే ప్రభుత్వం తిరిగి ఇస్తుందని చెబుతుండటంతో అధికారుల మాటలు నమ్మి రైతులు డబ్బు చెల్లిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో డబ్బు చెల్లించలేమని చెబుతున్నారు. మొత్తానికి వ్యవసాయ రుణాలపై ప్రభుత్వం ఏటా అమలు చేస్తున్న వడ్డీ రాయితీ ఈ ఏడాది అమలు చేయకపోవడంతో రైతులపై అదనపు భారం పడినట్లయింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే వసూలు చేస్తున్నాం దీర్ఘకాలిక వ్యవసాయ రూణాలపై అసలులోతోపాటు పూర్తి వడ్డీ మొత్తాన్ని చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రకారమే వసూలు చేస్తున్నాం. 6 శాతం వడ్డీ రాయితీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. జిల్లాలో 66 సహకార సంఘాలు ఉన్నాయి. - మనోహర్, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఇన్ చార్జి మేనేజర్ రాజుపాళెం గ్రామానికి చెందిన ఈ రైతు పేరు నారపురెడ్డి వెంకటరమణారెడ్డి. ఈయన పీ.టంగుటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్లో ట్రాక్టర్ కొనుగోలుకు రూ.4లక్షలు రుణం పొందారు. దీర్ఘకాలిక రుణం కింద 2011 జూన్లో కొనుగోలు చేసిన ట్రాక్టర్పై 13.25శాతం ప్రకారం ప్రతి ఏడాది వడ్డీతోపాటు అసలు చెల్లిస్తున్నారు. ఈ ఏడాది ఈ రైతుకు రూ.22,459లు వడ్డీ రాయితీ అమలు కావాల్సి ఉంది. అయితే అధికారులు ఈ ఏడాది వడ్డీ రాయితీ అమలు కాలేదని మీరు అసలు రూ.29,078లతోపాటు వడ్డీ రూ.49,598 కలిపి మొత్తం రూ.78,676ను చెల్లించాలని నోటీసు ఇచ్చారు. దీంతో కంగుతిన్న రైతు ఇన్నేళ్లపాటు సొసైటీలో అమలవుతూ వచ్చిన వడ్డీ రాయితీ ఈ ఏడాది ఎందుకు అమలు కాలేదని అధికారులను ప్రశ్నిస్తే సమాధానం లేదు. -
అమ్మను చంపేశాడు..
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్లైన్: ఆ ఇల్లాలికి అప్పుడే నిండు నూరేళ్లు నిండాయి.. కట్టుకున్న భర్తే క్రూరుడిగా మారాడు.. ఇల్లాలిపై అతను అనుమానం పెంచుకుని నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం రోకలిబడెతో కొట్టి గర్భిణి అయిన భార్యను హత్య చేశాడు. మట్టి మసీదు వీధిలోని వక్కల యాస్మిన్ (25) శనివారం సాయంత్రం భర్త సాదిక్ హుసేన్ చేతిలో దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చక్రాయపేటకు చెందిన అల్లాబకాష్కు ముగ్గురు కుమార్తెలతోపాటు కుమారులు ఉన్నారు. రెండవ కుమార్తె యాస్మిన్ను ఐదేళ్లక్రితం ప్రొద్దుటూరులోని మట్టిమసీదు వీధికి చెందిన సాదిక్ హుసేన్కు ఇచ్చి వివాహం చేశారు. దూరపు బంధువు కావడంతో అతనికి ఇచ్చి వివాహం చేశారు. సాదిక్ హుసేన్ బంగారు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారికి మూడేళ్ల రెహనుమా అనే పాప ఉంది. కాగా యాస్మిన్ ప్రస్తుతం 7 నెలల గర్భణి కూడా. అతను కొద్ది రోజుల నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అంతేగాక అదనపు కట్నం కావాలంటూ తరచూ ఆమెను వేధింపులకు గురిచేసేవాడు. భర్త దుకాణం నుంచి ఇంటికి వస్తున్నాడంటే ఆమె భయంతో వణికిపోయేది. ఏ వంక పెట్టి తనను బేధిస్తాడోనని యాస్మిన్ ఆందోళన చెందేది. కుమార్తెను దుకాణానికి పంపి... ఈ క్రమంలో శనివారం సాయంత్రం సాదిక్ హుసేన్ మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. కుమార్తె రెహనుమాను దుకాణానికి పంపించాడు. అతను రోకలిబడె తీసుకుని భార్యను కొడుతున్న సమయంలో ఇంటికొచ్చిన కుమార్తె తల్లిని కొట్టడాన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి తన అవ్వ, తాతతో చెప్పింది. వారు వచ్చేలోపే ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. తన కోడలు చనిపోయిందంటూ అత్త జబువున్నీసా గట్టిగా కేకలు వేసింది. దీంతో మట్టిమసీదు వీధిలోని బంధువులందరూ అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సాదిక్ హుసేన్ అక్కడి నుంచి పరారయ్యాడు. గురువారం వస్తానంటివే... సాదిక్ హుసేన్ మధ్యాహ్నం చక్రాయపేటలోని యాస్మిన్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనకు ఆరోగ్యం సరిగా లేదని అన్నాడు. అయితే ఇక్కడికి వచ్చి రెండు రోజుల పాటు ఉండి వెళ్లాలని వారు అల్లుడితో అన్నారు. తర్వాత యాస్మిన్ కూడా తల్లిదండ్రులతో మాట్లాడింది. వచ్చే గురువారం అక్కడికి వస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. అయితే 4 గంటల సమయంలోనే కుమార్తె హత్యకు గురైనట్లు బంధువులు ఫోన్ చేయడంతో అల్లాబకాష్ దంపతులు రోదించసాగారు. రెండు గంటల ముందు ఫోన్ చేసిన కుమార్తె హత్యకు గురైందన్న వార్తను వారు నమ్మలేకపోతున్నారు. హుటాహుటిన తల్లిదండ్రులతోపాటు బంధువులందరూ చక్రాయపేట నుంచి జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా సాదిక్ హుసేన్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. -
ఎందుకీ వివక్ష!
ప్రొద్దుటూరు, న్యూస్లైన్: విద్యార్థుల యూనిఫాం పంపిణీ విషయంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలకు ఓ విధంగానూ, హాస్టల్ విద్యార్థులకు మరో విధంగాను దుస్తుల కొలతలు ఇచ్చి తేడా చూపిస్తోంది. ప్రతి ఏటా రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో 1-8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫాం సరఫరా చేస్తోంది. ఇందుకు సంబంధించి గతంలో కాంట్రాక్టర్ల వ్యవస్థ ఉండగా ఈ ఏడాది ఆప్కో నుంచే దుస్తులు కొనుగోలు చేయాలని ఆర్వీఎం అధికారులు ఎంఈఓలకు సూచించారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆప్కో ద్వారానే యూనిఫాం సరఫరా అవుతోంది. ప్రతి విద్యార్థికి రెండు జతలు.. ఈ ఏడాది 1-8వ తరగతి వరకు చదివే 1,88,397 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాం సరఫరా చేయాల్సి ఉంది. కుట్టు కూలితో సహా ఒక్కో జతకు రూ.200 చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఇందులో సగం మొత్తం ప్రధానోపాధ్యాయులు ఆర్వీఎంకు జమ చేశారు. ఇందులో భాగంగా కొలత ప్రకారం ఏ విద్యార్థికి ఎంత బట్ట అవసరం అనే విషయాన్ని ఆర్వీఎం అధికారులు ప్రధానోపాధ్యాయులకు వివరించారు. కొలతల్లో తేడా.. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు దుస్తుల కొలతలు వేర్వేరుగా ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. వివరణ.. ఈ విషయమై ఆర్వీఎం సీఎంఓ గంగిరెడ్డిని ‘న్యూస్లైన్’ వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు చేశామని తెలిపారు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు. -
కటకటాల్లో కానిస్టేబుల్
నిశ్చితార్థం ఒకరితో.. పెళ్లి మరొకరితో సస్పెన్షన్కు రంగం సిద్ధం ప్రొద్దుటూరు, న్యూస్లైన్: బాధ్యతగల కానిస్టేబుల్గా పనిచేస్తూ ముందుగా ఓ యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. కట్నంపై ఆశతో మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు జిల్లా ఎస్పీని ఆశ్రయించగా రాజుపాళెం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ ప్రొద్దుటూరు సబ్జైలులో కటకటాలు లెక్కిస్తున్నాడు. రాజుపాళెం మండలం అర్కటవేముల గ్రామానికి చెందిన మడూరి రమణయ్య, ఆదిలక్ష్మిల పెద్ద కుమార్తె శివలక్ష్మిని కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన దూరపు బంధువు సీతగారి శంకరయ్య కుమారుడు మల్లికార్జునకు ఇచ్చి వివాహం జరిపించేలా నిర్ణయించారు. 2010 జూన్ 30న అర్కటవేములలోని శివలక్ష్మి ఇంటిలో ఘనంగా నిశ్చితార్థం జరిపించారు. కట్నం కింద రూ.2లక్షల నగదుతోపాటు 15 గ్రాముల బంగారు చైన్, 7 గ్రాముల బంగారు ఉంగరం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. నిశ్చితార్థం అనంతరం శివలక్ష్మి తల్లిదండ్రులు వివాహం కోసం మల్లికార్జునను సంప్రదిస్తూ వచ్చారు. డిగ్రీ చదువుతున్నానని, ఉద్యోగం వస్తానే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో పెళ్లికి జాప్యం జరుగుతూ వచ్చింది. గత ఏడాది కానిస్టేబుల్ సెలక్షన్లలో మల్లికార్జున సివిల్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. విషయం తెలుసుకున్న శివలక్ష్మి తల్లిదండ్రులు ఉద్యోగం వచ్చింది కదా పెళ్లి చేసుకొమ్మని అడగగా శిక్షణ తర్వాత చేసుకుంటానని చెప్పాడు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ప్రస్తుతం గోపవరం పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా మల్లికార్జున పనిచేస్తున్నాడు. కట్నంపై ఆశతో శివలక్ష్మిని కాదని మరో చోట పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న శివలక్ష్మి తల్లిదండ్రులు గత అక్టోబర్ 30న జిల్లా ఎస్పీని కలిసి సమస్యను వివరించారు. ఫిర్యాదును కడపలోని మహిళా పోలీస్స్టేషన్కు ఎస్పీ బదిలీ చేయగా పోలీసులు ఇరువురిని విచారించారు. వివాహం చేసుకోవడానికి మరో రెండేళ్లు సమయం కావాలని మల్లికార్జున కోరగా పోలీసులు అంగీకరించలేదు. దీంతో 3 నెలలకు శివలక్ష్మిని వివాహం చేసుకుంటానని మల్లికార్జున లిఖిత పూర్వకంగా తెలియజేశాడు. అయితే మాటతప్పిన మల్లికార్జున బీ మఠం మండలం మల్లేపల్లె గ్రామానికి చెందిన కోనేటి రామకృష్ణ, ఉమ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. శివలక్ష్మి తల్లిదండ్రుల అభ్యంతరాన్ని ఏ మాత్రం లెక్కచేయలేదు. వివాహం సందర్భంగా మల్లికార్జునకు రూ.7లక్షల వరకు కట్నం ఇచ్చినట్లు సమాచారం. శివలక్ష్మి తల్లిదండ్రులు ఈనెల 17న జిల్లా ఎస్పీని మళ్లీ ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎస్పీ ఆదేశాల మేరకు మల్లికార్జునపై ఐపీసీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మూడు రోజులుగా నిందితుడు ప్రొద్దుటూరు సబ్ జైలులో ఉన్నాడు. ఈ విషయాన్ని సబ్జైలర్ ‘న్యూస్లైన్’కు ధ్రువీకరించారు. నిబంధనల ప్రకారం 24 గంటలకు మించి రిమాండ్లో ఉంటే సస్పెండ్ చేస్తారు. ఈ ప్రకారం మల్లికార్జునపై కూడా చర్య తీసుకోనున్నారు. -
వెనక్కెనక్కి..
ప్రొద్దుటూరు, న్యూస్లైన్: ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ డెయిరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రైవేటు డెయిరీలు పాల ఉత్పత్తి దారులను ఆకర్షించే చర్యలను తీసుకోవడంతోపాటు పాల ధరలను ఎప్పటికప్పుడు మార్కెట్కు అనుగుణంగా పెంచుతున్నారు. ఈ విషయాలలో ఏపీ డెయిరీ చాలా వెనుకబడి ఉంది. పతి సందర్భంలో ప్రైవేటు డెయిరీల తర్వాతే ధరను పెంచుతోంది. క్షేత్రస్థాయిలో రైతులతో చర్చించి పాలసేకరణను ప్రోత్సహించే అధికారులే కరువయ్యారు. గత ఏడాది వరకు జిల్లా వ్యాప్తంగా ఏపీ డెయిరీ రోజుకు 60వేల లీటర్ల వరకు పాలను సేకరించింది. ప్రస్తుతం 14వేల లీటర్లకు పడిపోయింది. జిల్లాలోని ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లో ఏపీ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రాలు ఉండగా తొండూరు, వేంపల్లి, సింహాద్రిపురం, లింగాల, సుండుపల్లి, ఒంటిమిట్ట, రైల్వే కోడూరు తదితర ప్రాంతాల్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఎంసీలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం చాలా కేంద్రాల నుంచి పాల సేకరణ సక్రమంగా జరగడం లేదు. వేల లీటర్ల పాలను సేకరించే బీఎంసీలు కూడా నేడు వందల లీటర్లకు చేరాయి. ప్రైవేటు డెయిరీల నిర్వాహకులు ఎప్పటికప్పుడు గ్రామాలకు వచ్చి పాల ఉత్పత్తిదారులతోపాటు రైతులతో చర్చించి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో ఏపీ డెయిరీ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో మహిళా సంఘాలకు శిక్షణా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తుండేవారు. ప్రస్తుతం ఇలాంటివి లేకపోవడంతో ఏపీ డెయిరీకి గ్రామాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. మరో వైపు పాల ధరల్లో కూడా పూర్తిగా వ్యత్యాసం కనిపిస్తోంది. ఏపీ డెయిరీ అధికారులు రాష్ట్రంలోని ప్రాంతాలను బట్టి ధరలను చెల్లిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం జిల్లాలో ప్రైవేటు డెయిరీల నిర్వాహకులు వెన్నశాతాన్ని బట్టి లీటర్ పాలను రూ.49లతో కొనుగోలు చేస్తుండగా ఏపీ డెయిరీ మాత్రం రూ.45 మాత్రమే చెల్లిస్తోంది. వాస్తవానికి రూ.49 కూడా తమకు గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా ఏపీ డెయిరీ మాత్రం నిద్రమత్తు నుంచి ఇంకా తేరుకోవడంలేదు. జిల్లాలో సుమారు 40 ప్రైవేటు డెయిరీలు ఉండగా మైదుకూరు, జమ్మలమడుగు ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. -
మంచి రోజులు
‘రేయ్..ఎక్కడ పండ్లు అమ్ముకునేది.. బండితీయ్... ట్రాఫిక్ చూడు ఎలా ఉందో... ‘ఏమయ్యా! ఎన్నిసార్లు చెప్పాలి అంగడి ఎదురుగా బండిపెట్టకూడదని.. ఫో.. పక్కకు ఫో!’... తోపుడుబండ్ల వ్యాపారులకు పోలీసులు, వ్యాపారదుకాణాల యజమానుల నుంచి నిత్యం వచ్చే హెచ్చరికలు ఇవి. తోపుడు బండి నడిస్తేగానీ వారి బతుకుబండి నడవదు. ఆటుపోట్ల మధ్య జీవన ప్రయాణం చేస్తున్న తోపుడుబండ్ల వ్యాపారులకు మంచిరోజులు వచ్చాయి. వారికి గుర్తింపుకార్డులను ఇవ్వనున్నారు. స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే వెసులుబాటుతో పాటు ఆర్థికంగా ఆదుకునేందుకు రుణాలను ఇవ్వనున్నారు. లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా ‘వీధివ్యాపారుల ’బిల్లుకు ఆమోదముద్రపడింది. సాక్షి, కడప: పట్టణాల్లోఎక్కడ తోపుడు బండి పెట్టినా పోలీసులు, మునిసిపల్ అధికారులు, సమీపంలోని భవన యజమానులతో ఇబ్బందులు ఉండేవి. ఇకపై అలాంటి పరిస్థితి ఉండబోదు. వీరికి ప్రత్యేమైన గుర్తింపునిచ్చే ‘వీధివ్యాపారుల’ బిల్లును బుధవారం రాజ్యసభలో ఆమోదించారు. గత సెప్టెంబరు 6న లోక్సభలో కూడా ఈబిల్లు ఆమోదం పొందింది. బిల్లుపై రాష్ట్రపతి ఆమోదముద్రపడటమే తరువాయి. బిల్లుఆమోదంతో దశాబ్దాల కాలంగా ఒకే ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న వారి జీవన స్థితిగతులు మెరుగుపడనున్నాయి. వీరి వ్యాపారాలకు దన్నుగా నిలిచేందుకు పట్టణ పేదరిక నిర్మూలన విభాగం కూడా చర్యలకు ఉపక్రమించింది. జిల్లాలో కడప కార్పొరేషన్తో పాటు ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల, మైదుకూరు మునిసిపాలిటీలు ఎర్రగుంట్ల నగరపంచాయతీ ఉంది. వీటిలో ఇప్పటికే తోపుడుబండ్ల వ్యాపారుల గుర్తింపుపై ప్రత్యేక సర్వే పూర్తయింది. కడప కార్పొరేషన్తో పాటు అన్ని పట్టణప్రాంతాల్లో 9,30,699 మంది జనాభా ఉన్నారు. వీరిలో దాదాపు 7,650మంది తోపుడు బండ్లవ్యాపారులు ఉండొచ్చని అంచనా. వీరితో పాటు జిల్లాలోని మండల కేంద్రాల్లో మరో 3వేలమందిదాకా ఉండొచ్చు. వీరిలో చాలా కాలంగా ఒకేచోట వ్యాపారం చేసుకునేవారు 60 శాతం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎక్కువమంది పండ్లు, ఇడ్లీ, పాస్ట్ఫుడ్(పానీపూరీ, గోబీ, వడలు, బజ్జీలు) తదితరాలను విక్రయిస్తుండగా కొందరు కులవృత్తులతో పాటు ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. వీరంతా మునిసిపాలిటీలకు రోజూ నిర్ణీత రుసుం చెల్లిస్తున్నారు. అయినా సరైన భద్రత లేని పరిస్థితి. ట్రాఫిక్ సమస్య తలెత్తిన ప్రతిసారీ పోలీసుల ప్రతాపానికి గురవుతుంటారు. ఈ బిల్లుచట్టమైతే ఇకపై ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ప్రత్యేక కమిటీల ఆధ్వర్యంలో.. నగర, పురపాలక సంస్థ పరిధిలో ఉన్న వీధివ్యాపారులకు రేషన్, వాటర్, ఆధార్, ఓటర్ వంటి గుర్తింపు కార్డు ఉండాలి. దశాబ్దాల కాలానికి మించి ఒకేచోట వ్యాపారం చేస్తున్న వారిని స్వయం సహయక బృందాలుగా ఏర్పాటు చేస్తారు. వారికి బీమా సౌకర్యం కల్పిస్తారు. లక్షలోపు జనాభా ఉన్న మునిసిపాలిటీలో 10మంది, 1.50లక్షలోపు జనాభా ఉన్నచోట 15మంది, 3లక్షల జనాభా ఉంటే 20మందితో ప్రత్యేక కమిటీలు వేస్తారు. ఈ బృందాలు వీధివ్యాపారుల హక్కులతో పాటు వారి వ్యాపార అభివృద్ధికి సహకారం అందిస్తారు. ఇవీ ప్రయోజనాలు ‘వీధివ్యాపారుల బిల్లు’ చట్టబద్ధం కావడంతో వ్యాపారులందరికీ ధ్రువీకరణపత్రాలు, గుర్తింపుకార్డులు ఇస్తారు. ఏప్రాంతంలో వ్యాపారం చేయాలో అందులో స్పష్టంగా ఉంటుంది. ఆప్రాంతం నుంచి వీరిని ఖాళీచేయించడానికి అధికారులకు అవకాశం ఉండదు. మెప్మా ఆధ్వర్యంలో తగిన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రప్రభుత్వం విధివిధానాలను సిధ్ధం చేసింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలోనే ఈ సర్వేను చేపట్టి వీధి వ్యాపారులను లెక్కించారు. జిల్లాలో పట్టణప్రాంతాల్లోనే దాదాపు 7వేలమంది ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాపారుల పూర్తి వివరాలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. మరో దఫా సర్వే చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎంపిక చేసిన వారికి మాత్రమే సౌకర్యాలు వర్తింపజేయనున్నారు. గుర్తింపుకార్డులున్న వీధివ్యాపారులను సమూహాలుగా ఏర్పాటు చేసి రుణసదుపాయం ఇచ్చే అవకాశాలున్నాయి. వీరికి ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తారు. ఇళ్ల నిర్మాణం, స్థలాల కేటాయింపు, వ్యక్తిగతరుణాలు, ఇతర సౌకర్యాల కల్పనవంటి ప్రయోజనాలు ఉంటాయి. -
దైవదర్శనం చేసుకుని వస్తూ..
జమ్మలమడుగు,న్యూస్లైన్: ఒక అరగంట ఆగివుంటే తమ గమ్యాలకు చేరుకునేవారు. అయితే లారీ రోడ్డు మధ్యలో నిలబడివుండటంతో డ్రైవర్ వెనుకవైపు నుంచి వేగంగా తగిలించడంతో క్వాలిస్ వాహనం లారీ వెనుక భాగంలోనికి దూసుకెళ్లింది. అక్కడే ఒక మహిళ మరణించగా మరోమహిళ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. డ్రైవర్తోపాటు మరో ఇద్దరి మహిళలకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా... ప్రొద్దుటూరుకు చెందిన మేరువ రామలక్షుమ్మ, సంకం కల్యాణిదేవి, ప్రభావతి, శైలజ రెండురోజుల క్రితం కర్నాటక రాష్ట్రం గుల్బార్గాలోని గానుగపూర్లోవున్న సాయిబాబా దర్శనానికి వెళ్లారు. అక్కడ దర్శనం ముగించుకుని శనివారం సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున జమ్మలమడుగు బైపాస్లోని రైల్వేస్టేషన్ సమీపంలోనికి రాగానే రోడ్డుకు మధ్యలో అగివున్న లారీని వెనుకవైపునుంచి వేగంగావచ్చి డ్రైవర్ తగిలించడంతో మేరువ రామలక్షుమ్మ (50) అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రగాయాలైన కల్యాణిదేవి(68) చికిత్సపొందుతూ మరణిం చింది. డ్రైవర్ యేసన్నతోపాటు ప్రయాణికులు ప్రభావతి, శైలజకు గాయాలయ్యాయి. అర్బన్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
నిఘా నేత్రం
కడప అర్బన్, న్యూస్లైన్ : సీసీ టీవీల వ్యవస్థ ఏర్పాటుతో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు డీటీసీ శ్రీకృష్ణవేణి తెలిపారు. శుక్రవారం ఆమె తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కడప, ప్రొద్దుటూరు కార్యాలయాల్లో 8 కెమెరాల సీసీ టీవీ వ్యవస్థ ఏర్పాటుచేశామన్నారు. మిగతా నాలుగు కార్యాలయాల్లో నాలుగు కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామన్నారు. వాహనదారులు తమ లెసైన్సుల కోసం, ఆర్సీల కోసం నేరుగా సంప్రదించవచ్చున్నారు. -
రూ.50 కోట్లు మురుగుతున్నాయ్..!
అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్న చందంగా తయారైంది ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిస్థితి. రూ. 50 కోట్ల నిధులు మున్సిపాలిటీలో మూలుగుతున్నా ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టడం లేదు. అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైళ్లపై స్పెషలాఫీసర్ సంతకాలు చేయకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ప్రొద్దుటూరు, న్యూస్లైన్: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సుమారు రూ.50కోట్ల నిధులు మురిగిపోతున్నాయి. రూ.40కోట్లు జనరల్ ఫండ్తోపాటు వివిధ గ్రాంట్ల కింద సుమారు మరో రూ.10కోట్లు నిధులు ఉన్నాయి. మున్సిపాలిటీ పాలకవర్గ పదవీ కాలం 2010 సెప్టెంబర్ 28 నాటికి పూర్తయింది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కావడంతో ఇక్కడ జిల్లా జాయింట్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. ముందుగా ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులకు సంబంధించి అనుమతులు ఇవ్వడం (కౌన్సిల్ ఆమోదం), పనులు చేయడం జరిగేది. అయితే గత ఏడాది ఆగస్టు నుంచి మున్సిపాలిటీకి సంబంధించిన పనులపై స్పెషల్ ఆఫీసర్ ఏ కారణంగానో సంతకాలు చేయడం లేదు. కొన్ని పనులకు అనుమతులు మంజూరు చేసినా మళ్లీ టెండర్లు రద్దు చేశారు. ఇలాంటి కారణాల వలన మున్సిపాలిటీకి సంబంధించి సుమారు రూ.8కోట్ల విలువ కలిగిన 70 పనులకు స్పెషల్ ఆఫీసర్ అనుమతి మంజూరు చేయలేదని తెలుస్తోంది. దీంతో మున్సిపాలిటీలో నిధులు ఉన్నా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. కోడ్ అమలైతే పరిస్థితి ఏమిటి ప్రస్తుతం జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్మల బదిలీ అయ్యారు. నూతనంగా రామారావు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ఆయన బాధ్యతలు స్వీకరించి ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వచ్చేలోపు అనివార్యంగా ఎన్నికల కోడ్ అమలైతే మున్సిపాలిటీ అభివృద్ధి ఆగిపోయినట్లే. కౌన్సిల్ ఆమోదం తర్వాతనే పనులు కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాతే మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతాయి. నిబంధనల ప్రకారమే తప్ప మున్సిపల్ కమిషనర్ స్థాయిలో పనులు మంజూరు చేయడానికి వీలుకాదు. ప్రతి పనికి కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. - సంక్రాంతి వెంకటకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రూ.2వేల వరకు ఖర్చయింది వార్డు పరిధిలో ట్యూబ్లైట్లు, బోర్ల మరమ్మతులకు సుమారు రూ.2వేల వరకు ఖర్చయింది. మున్సిపాలిటీ సిబ్బందికి చెప్పినా సామాన్లు లేవని చెబుతుండటంతో సొంతంగా బిగించుకున్నాం. కోట సంజీవరాయుడు, మాజీ కౌన్సిలర్ ఈయన పేరు అబ్దుల్లా. మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆదేశించడంతో వార్డు పరిధిలో ఇటీవల మూడు బోరింగ్లను మరమ్మతు చేయించారు. ఈయన పేరు బలిమిడి చిన్న రాజు. 30వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకునిగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ అధికారులకు పది మార్లు విన్నవించినా సమస్యలను పట్టించుకోకపోవడంతో చివరకు ఆయనే వార్డు పరిధిలో 8 ట్యూబ్లైట్లను కొనుగోలు చేసి సిబ్బందితో బిగించారు. -
మనసెలా వచ్చిందో...!
ప్రొద్దుటూరు, న్యూస్లైన్: గురువును దేవుడితో పోలుస్తాం.. విద్యాబుద్ధులతో పాటు జ్ఞానాన్ని అందివ్వాల్సిన బాధ్యత గురువుదే.. ఉన్నత స్థానంలో నిలవాల్సిన గురువులు అక్కడక్కడ వక్ర మార్గం పడుతున్నారు. గురువు స్థానానికే తలవంపులు తెస్తున్నారు. కేవలం రూ. 500 పోయిందని ఓ టీచర్ విద్యార్థుల చేతులు కాల్చి ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చింది. ప్రొద్దుటూరు మండలం ఈశ్వరరెడ్డినగర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న జయ అమృతాబాయి పర్సులోని రూ. 500 ఎక్కడో పోయింది. ఎవరైనా తీశారా అంటూ విద్యార్థులను ప్రశ్నించింది. అంతటితో ఆగక విద్యార్థుల బ్యాగులు, పుస్తకాలలో సోదా చేయించింది. అంతటితో వదలకుండా కర్పూరం తెప్పించి విద్యార్థుల చేతుల్లో పెట్టి వెలిగించింది. ఎవరైనా డబ్బు తీసుకుని ఉంటే వారి చేతులు కాలుతాయని హెచ్చరించింది. హుసేన్బాషా, రమేష్, యాసిన్, మాధవి, తనూజ, వనజ, చిన్ని అనే విద్యార్థులు మంటకు తాళలేక కర్పూరాన్ని కింద వేశారు. ఈశ్వరమ్మ అనే విద్యార్థి కర్పూరాన్ని అలాగే ఉంచుకోవడంతో చేతికి బొబ్బలు వచ్చాయి. మరో విద్యార్థికి ఇలాగే జరిగింది. టీచర్ బెదిరించడంతో ఈశ్వరమ్మ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. చేతికి బొబ్బలు ఉండటం గమనించిన అవ్వ కుళాయమ్మ ఈశ్వరమ్మను నిలదీసింది. దీంతో ఈశ్వరమ్మ జరిగిన విషయాన్ని తెలిపింది. అందరి చేతుల్లో కర్పూరం పెట్టింది డబ్బు పోయిందని మా అందరి చేతుల్లో కర్పూరం వెలిగించింది. ఆ బాధ తట్టుకోలేక వెంటనే కింద పడేశా. ఈశ్వరమ్మ, తనుజా అలాగే పెట్టుకున్నారు. జరిగిన సంఘటనను బయట చెప్పవద్దని టీచర్ హెచ్చరించింది. - మాధవి, విద్యార్థిని చేతులెలా వచ్చాయో చిన్న పిల్లల చేతుల్లో కర్పూరం వెలిగించడానికి ఆ టీచర్కు చేతులెలా వచ్చాయో.. చదువుకున్న వారు చేసే పనేనా ఇది.. ఇలాంటి వారి వల్లే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోతోంది.. - కుల్లాయమ్మ, ఈశ్వరమ్మ అవ్వ విచారణ చేస్తాం పాఠశాలలో జరిగిన సంఘటన నా దృష్టికి రావడంతో ప్రాథమికంగా విచారించాం. నిజమేనని తేలింది. సోమవారం పాఠశాలకు వెళ్లి పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. - రాజగోపాల్రెడ్డి, ఇన్చార్జి ఎంఈఓ, ప్రొద్దుటూరు -
విభజన బిల్లును అడ్డుకోండి
తెలంగాణ బిల్లును పార్లమెంటులో అడ్డుకోవాలని సమైక్య వాదులు డిమాండ్ చేశారు. కడప, ప్రొద్దుటూరు, రాజంపేటలో ఆదివారం ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు సమైక్య రన్ నిర్వహించారు. సమైక్యోద్యమ గీతాలు, నినాదాలతో హోరెత్తించారు. రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడం దారుణమన్నారు. అవసరమైతే చలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించి బిల్లును అడ్డుకుంటామన్నారు. విభజనతో ప్రతి ఒక్కరూ నష్టపోతారన్నారు. కడప కలెక్టరేట్, న్యూస్లైన్ : రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును సీమాంధ్రకు చెందిన ఎంపీలు అడ్డుకోవాలని సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాష్ట్ర పిలుపులో భాగంగా మున్సిపల్ స్టేడియం నుంచి అప్సర సర్కిల్, ఆర్టీసీ బస్టాండు, కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ఏడురోడ్ల కూడలి వరకు ‘సమైక్య రన్’ నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు, ఎన్జీఓలు, రెవెన్యూ ఉద్యోగులు, ఎయిడెడ్ పాఠశాలల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, వివిధ ప్రజాసంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దారిపొడవునా సమైక్యోద్యమ గీతాలు, నినాదాలతో హోరెత్తించారు. ప్రదర్శన కారణంగా కొన్నిప్రాంతాల్లో ట్రాఫిక్ కాసేపు ఆగిపోయింది. పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్బంగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు కేవీ శివారెడ్డి, సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి, గోవర్దన్రెడ్డి, మంత్రి అహ్మదుల్లా తనయుడు అస్రఫ్ మాట్లాడుతూ సీమాంధ్రుల మనోభావాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం దూకుడుగా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపట్టడం దారుణమన్నారు. హడావుడిగా కేంద్ర కేబినెట్తో ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపారన్నారు. రాజ్యాంగ విరుద్దంగా విభజన ప్రక్రియ సాగుతున్నప్పటికీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జి బిల్లును పార్లమెంటుకు పంపేందుకు గుడ్డిగా సంతకం చేయడం దారుణమని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వానికి రబ్బరు స్టాంపులా మారారని ఆరోపించారు. ఈ నేపధ్యంలో అవసరమైతే ఛలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా బిల్లును అడ్డుకుంటామని హెచ్చరించారు. విభజన వల్ల ముస్లింలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాకం అశోక్కుమార్, నగర అధ్యక్షుడు నజీర్ అహ్మద్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అద్యక్షుడు వేదనాయకం, కోశాధికారి అలీఖాన్, ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, నిత్య పూజయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్కుమార్రెడ్డి, విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ రవిశంకర్రెడ్డి, టీడీపీనాయకులు పీరయ్య, వెంగల్రెడ్డి, విద్యా సంస్థల అధినేత రాజోలి వీరారెడ్డి, రామచంద్రారెడ్డి, ఎలియాస్రెడ్డి, డాక్టర్ వారణాసి ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈ పాపం ఎవరిది..!
ఈ విద్యార్థి వయస్సు కేవలం ఎనిమిదేళ్లే శుక్రవారంతో నూరేళ్లు నిండాయి మూత్రం పోస్తుండగా పాఠశాల గోడ కూలడంతో ..తిరిగిరాని లోకాలకు వెళ్లి‘పోయాడు’ఈ పాపం ఎవరిదన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.పునాది లేకుండా నాసిరకంగా గోడకట్టిన పాఠశాల యాజమాన్యానిదా.. అనుమతి లేకున్నా పాఠశాలపై చర్యలు తీసుకోని విద్యాశాఖదా.. ఏమైతేనేం.. ఎలాగైతేనేం..ఓ చిన్నారి ఊపిరి ఆగి‘పోయింది’..! ఓ కన్నతల్లికి కడుపు కోత మిగిలింది..!! ప్రొద్దుటూరు క్రైం, న్యూస్లైన్: పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం పసివాడి ప్రాణాలను బలిగొంది. కళ్లముందే నిర్లక్ష్యం కనిపిస్తున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. ఫలి తంగా తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. స్థానిక నాగేంద్రనగర్లో ఉన్న చైతన్య భారతి స్కూల్లో మూత్రశాల గోడ కూలడంతో దేవరెడ్డి గురుమహేశ్వరరెడ్డి(8) అనే ఒకటో తరగతి విద్యార్థి మృతి చెందగా గూడూరు అమర్నాథ్రెడ్డి అనే రెండో తరగతి విద్యార్థికి స్వల్పగాయాల య్యాయి. విరామ సమయంలో విద్యార్థి మూత్రం పోస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు జమ్మలమడుగు మండలం శేశిరెడ్డిపల్లెకు చెందిన పుల్లారెడ్డి ఎనిమిదేళ్ల క్రితం ప్రొద్దుటూరులోని నాగేంద్రనగర్కు వచ్చి స్థిరపడ్డాడు. అతనికి భార్య రమాదేవి, కుమారులు గురుమహేశ్వరరెడ్డి, భార్గవ్రెడ్డి ఉన్నారు. అతను బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటి సమీపంలో ఉన్న చైతన్యభారతి అనే ప్రైవేట్ స్కూల్లో కుమారున్ని చ దివిస్తున్నారు. ఈ పాఠశాలను రాజారావు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం పాఠశాల విరామ సమయంలో మరో విద్యార్థితో కలిసి గురుమహేశ్వరరెడ్డి మూత్రం పోయడానికి వెళ్లగా గోడ ఒక్కసారిగా ఆ విద్యార్థిపై పడింది. గోడ శకలాల కింద విద్యార్థి కుప్పకూలి పోయాడు. మరో విద్యార్థి అమర్నాథ్రెడ్డి గట్టిగా కేకలు వేశాడు. దీంతో పాఠశాల సిబ్బంది అక్కడికి చేరుకొని విద్యార్థిని గాంధీరోడ్డులోని శ్రీరాములపేటలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ైవె ద్యులు తెలిపారు. గోడ ఇటుకలు విద్యార్థి ఛాతిపై పడటంతోనే మృతి చెంది ఉంటాడని వైద్యులు భావిస్తున్నారు. ఈ సంఘటనలో అమర్నాథ్రెడ్డికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. మూత్రశాలలో బండలపై సుమారు నాలుగు అడుగుల మేర ఒంటి వరుసతో ఇటుక గోడ నిర్మించారు. పునాది లేకపోవడం వల్లనే బలహీనంగా ఉన్న గోడ కూలిపోయి ఉంటుందని పోలీసులు అంటున్నారు. కుప్పకూలిన త ల్లిదండ్రులు తమ కుమారుడు ఇక లేడన్న వార్త విని తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే యాజమాన్యం తల్లిదండ్రులకు తెలపలేదు. ఆస్పత్రి నుంచి మృతదే హాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మరణ వార్త వారికి తెలిసింది. తల్లి రమాదేవి కుమారుడి మృతదేహంపై పడి రోదించసాగింది. వన్టౌన్ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్ఐ రెడ్డిశేఖర్రెడ్డిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనపై ప్రధానోపాధ్యాయురాలు తబితతో సీఐ మాట్లాడారు. ముందుగా పాఠశాలకు అనుమతి ఉందని చెప్పిన ప్రధానోపాధ్యాయురాలు సంబంధించిన పత్రాలు చూపాలని అడగటంతో అసలు విషయం బయట పడింది. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఎంఈఓ రాజగోపాల్రెడ్డి పాఠశాలకు అనుమతి లేదని చెప్పారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు తెలియచేస్తామని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు బంగారురెడ్డి, శేఖర్లు విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి తల్లిదండ్రులను ఓదార్చారు. తండ్రి పుల్లారెడ్డి ఫిర్యాదు మేరకు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. -
బంగారు కొనుగోళ్లపై సీబీఐ ఆరా
ప్రొద్దుటూరు, న్యూస్లైన్: పోస్టల్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని బంగారం దుకాణాల్లో జరిగిన కొనుగోళ్లపై సీబీఐ అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. హైదరాబాద్కు చెందిన సీబీఐ సీఐ రాఘవేంద్రకుమార్తోపాటు సిబ్బంది స్థానిక పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విచారణ చేస్తున్నారు. ప్రొద్దుటూరు పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం పరిధిలోని వివిధ బ్రాంచి కార్యాలయాల్లో పోస్టల్ ఉద్యోగులు కోట్ల రూపాయల నిధులు స్వాహా చేశారు. ఈ డబ్బుతో వారు ప్లాట్లు, భూములు, బంగారం కొనుగోలు చేసినట్లు సమాచారం. డిపాజిట్ల రూపంలో ఉన్న ప్రభుత్వ నిధులను వివిధ ఖాతాల్లో జమ చేర్చి స్వాహా చేశారు. ఒక్క ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని పోస్టాఫీసులోనే రూ.5కోట్ల వరకు స్వాహా జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. మిగతా బ్రాంచి కార్యాలయాల పరిధిలో కూడా నిధులు స్వాహా అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న 10 మంది సిబ్బందిని గతంలోనే పోస్టల్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించారు. మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు గురువారం స్థానిక సూపరింటెండెంట్ కార్యాలయానికి సీబీఐ అధికారులు వచ్చారు. సస్పెండ్ అయిన పలువురు ఉద్యోగులను పిలిపించి స్వయంగా విచారించారు. ఈ వ్యవహారమంతా ఎక్కువగా రాత్రివేళల్లో జరిగిందని నిర్ధారణకు వచ్చిన సీబీఐ అధికారులు నైట్వాచ్మెన్లను కూడా పిలిచి విచారించారు. పోస్టల్ నిధులను స్వాహా చేసిన కొంత మంది ఉద్యోగులు స్థానికంగా బంగారం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆయా దుకాణాల బిల్లులను కూడా సేకరించారు. పట్టణ షరాబు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు రామ్మనోహర్, కార్యదర్శి నామా శ్రీధర్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్ బుశెట్టి రామ్మోహన్రావు, ధర్మకాటా అటెండర్ లక్షుమయ్య తదితరులను పిలిపించి విచారించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లులు ప్రొద్దుటూరువా కాదా అన్న విషయంపై వారిని అడిగి తెలుసుకున్నారు. -
వండేదెట్టా..!
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్లైన్: మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలల్లో వంట గదుల నిర్మాణం కోసం మూడేళ్ల కిందట అంచనాలు వేసి ప్రస్తుతం నిర్మిస్తుండటంతో నిధుల కొరత ఏర్పడి వంట గదులు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 16 పాఠశాలల్లో, మండల పరిధిలో 29 వంట గదులు, రాజుపాళెం మండల పరిధిలో 19 వంట గదుల నిర్మాణానికి జీఓ ఎంఎస్ నెంబర్ 821 ప్రకారం 2011 నవంబర్ 15న అంచనాలను రూపొందించారు. దీని ప్రకారం ఒక్కో వంట గది నిర్మాణానికి రూ.75వేలు కేటాయించారు. అయితే వంట గదుల నిర్మాణాన్ని అప్పట్లో ఎవ్వరు చేపట్టకపోవడంతో చాలా కాలంగా నిలిచిపోయాయి. కొంత కాలానికి సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) అధికారులు కూడా నిర్మాణాన్ని తక్కువ ధరకు చేయలేమని చేతులెత్తేశారు. దీంతో ఈ పనులను 2012 డిసెంబర్ 12న అప్పటి జిల్లా కలెక్టర్ అనిల్కుమార్ ఆదేశాలతో పంచాయతీ రాజ్ శాఖకు కేటాయించారు. అయితే పంచాయతీ రాజ్ అధికారులు కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనాలను రూపొందించాలంటూ నివేదికలు పంపినా అవి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వంట గదులు లేక అవస్థలు మున్సిపాలిటీ, ప్రభుత్వ పాఠశాలల్లో వంట గదులు లేకపోవడంతో వంట ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నేటికీ పాఠశాలల్లోని చెట్ల కింద కట్టెల పొయ్యితో వంట చేస్తున్నారు. ఈ విధంగా ఆరుబయట వర్షాకాలంలో వంట చేయడానికి పడుతున్న ఇబ్బందులపై పత్రికల్లో కథనాలు రావడంతో అధికారులపై ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు తక్కువ డబ్బుతోనే పనులు ప్రారంభం దీంతో పంచాయతీ అధికారులు ఉన్న డబ్బుతోనే వంటగది నిర్మాణ పనులు మొదలుపెట్టారు. స్టీల్, సిమెంట్ ఇతర వాటి ధర పెరిగిపోవడంతో పనులు పూర్తికాకుండా నిలిచిపోయాయి. ప్రస్తుతం వంట గదికి వరండా, పూతలు, నీటి సరఫరా, ఫ్లోరింగ్ పనులు నిలిచిపోయాయి. ఈ పనులు పూర్తి చేయాలంటే ఒక్కో వంట గదికి అదనంగా రూ.30 నుంచి రూ.35వేలు నగదు అవసరం. దీనిపై జిల్లా కలెక్టర్కు పంచాయతీ అధికారులు నివేదికలు పంపినా నిధులు మంజూరుపై ఎలాంటి ప్రక్రియ జరగలేదు. దీంతో పంచాయతీ అధికారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయులు వంట గదులు పూర్తి చేయాలంటూ పంచాయతీ అధికారులపై ఒత్తిడి తెస్తుండటంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. పాఠశాలలో అత్యవసరమైన వంట గది నిర్మాణంపై జిల్లా కలెక్టర్కానీ, ఎస్ఎస్ఏ అధికారులు కానీ దృష్టి సారించకపోవడం విచారకరం. పాఠశాలల్లో గదులు ఉన్నా అదనపు గదుల కోసం లక్షల రూపాయల నిధులను ఎస్ఎస్ఏ మంజూరు చేస్తున్నా వంట గది నిర్మాణానికి కావలసిన నిధులపై ఎందుకు దృష్టి సారించడం లేదన్నది ప్రశ్నగా నిలుస్తోంది. నిధులు లేకనే పనులు ఆపేశాం వంట గదుల నిర్మాణానికి నిధులు తక్కువ కావడంతో పనులు ఆగిపోయాయని పంచాయతీ రాజ్ శాఖ డీఈ లక్ష్మిరెడ్డి తెలిపారు. ఒక్కో వంట గదికి అదనంగా రూ.30వేలు కావాలి, 2011 అంచనా ప్రకారం గదులకు నిధులు మంజూరు కావడంతోనే పెరిగిన వస్తువుల ధరలతో నిర్మాణ వ్యయం ఎక్కువైందన్నారు. పంచాయతీ పరిధిలో ఉన్న వంట గదులకు పంచాయతీ అధికారులను, మున్సిపాలిటీ పరిధిలోని వంట గదులను పూర్తి చేసేందుకు మున్సిపల్ అధికారులకు లేఖలు రాస్తున్నామని తెలిపారు. వారు నిధులు ఇస్తే వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. -
ఏసీబీ వలలో అవినీతి చేప
పొదలకూరు/రాపూరు, న్యూస్లైన్: ఏసీబీ అధికారులు మరో అవినీతి ఉద్యోగి భరతం పట్టారు. ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటున్న రాపూరు సర్వేయర్ లాలి వెంకటేశ్వర్లును శనివారం పొదలకూరులో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ నెల్లూరు డీఎస్పీ జె.భాస్కర్రావు కథనం మేరకు..రాపూరు మండలం గండూరుపల్లికి చెందిన రైతు గుడిగుంట బాలకృష్ణయ్య రెండు దశాబ్ధాలుగా ఏడెకరాల పొలాన్ని సాగుచేసుకుంటున్నాడు. ఆ పొలానికి సంబంధించి తన కుటుంబంలోని నలుగురి పేర్లపై ఏడో విడత భూపంపిణీలో పట్టాలు పొందే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. అందులో భాగంగా డిసెంబర్లో రాపూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో అధికారులకు అర్జీ సమర్పించాడు. పట్టాలు పొందేందుకు భూమిని సబ్డివిజన్ చేయాల్సి ఉండటంతో సర్వేయర్ వెంకటేశ్వర్లును కలిశాడు. ఆయన ఎకరాకు రూ.2,500 లంచం ఇవ్వాలని బాలకృష్ణయ్యను డిమాండ్ చేశాడు. చివరకు రూ.2,200 వంతున ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్గా రూ.10 వేలు చెల్లించాలని సూచించాడు. పొలాన్ని సబ్డివిజన్ చేయించుకునేందుకు లంచం ఇవ్వడం ఇష్టలేని రైతు బాలకృష్ణయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సర్వేయర్ వెంకటేశ్వర్లును సంప్రదించగా, పొదలకూరులోని తన ఇంటి వద్దకు రావాలని చెప్పాడు. పొదలకూరులోని నాగార్జున స్కూలు సమీపంలో తాను నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద బాలకృష్ణయ్య వద్ద రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వెంకటేశ్వర్లును రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాపూరులో ఆయన విధులు నిర్వర్తించే కార్యాలయానికి తీసుకెళ్లారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్న అనంతరం నెల్లూరుకు తరలించారు. ఇదిలా ఉంటే భూ కొలతల్లో ఉత్తమ సేవలు అందించింనందుకు ఉత్తమ సర్వేయర్గా ఆయన 2012 ఏప్రిల్లో సర్వే సెటిల్మెంట్ కమిషనర్ కిషోర్, సీసీఎల్ఏ ఏకే మహంతి, ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా నుంచి అవార్డు అందుకోవడం గమనార్హం. సమాచారమందిస్తే చర్యలు: ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగిన పక్షంలో తమకు కచ్చితమైన సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ భాస్కర్రావు తెలిపారు. రాపూరు తహశీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 94404 46184, 94404 46185-189 నంబర్లలో తమను సంప్రదించవచ్చన్నారు. ఆయన వెంట ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సిబ్బంది శ్రీనివాసులు, సుధాకర్, ఖుద్దూస్, షపీ, ఫణి,సత్యనాథ్ తదితరులు ఉన్నారు. - భాస్కర్రావు, డీఎస్పీ విసిగిపోయా: నేను సాగుచేసుకుంటున్న పొలాన్ని సబ్డివిజన్ చేయమని పలుమార్లు ప్రాధేయపడ్డాను. లంచం ఇవ్వనిదే చేయడం కుదరదని సర్వేయర్ తేల్చి చెప్పాడు. అంత పెద్దమొత్తం ఇచ్చుకోలేనని, తగ్గించాలని పదేపదే అడిగితే కొద్దిగా తగ్గించాడు. ఆయన తీరుతో విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సి వచ్చింది. - బాలకృష్ణయ్య, రైతు ఎవరో చేసిన దానికి నేను బలయ్యా: పొలాన్ని సబ్డివిజన్ చేయకుండా గతంలో పనిచేసిన సర్వేయర్లు వేధించినట్టు తెలుస్తోంది. వారు మాట్లాడుకున్న లంచం మొత్తాన్ని నాకు ఇవ్వడంతో నేను బలయ్యాను. రైతును నేను వేధించలేదు, తిప్పుకోనూ లేదు. - వెంకటేశ్వర్లు, సర్వేయర్ -
ప్రొద్దుటూరులో ఐటీ దాడులు
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్లైన్: ప్రొద్దుటూరులోని బంగారు దుకాణాలు, ప్రముఖ డాక్టర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. తిరుపతి, కడప, ప్రొద్దుటూరుకు చెందిన అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఏక కాలంలో దాడులు చేశారు. ముందుగా ఐటీ అధికారులు మెయిన్బజార్లోని శ్రీలక్ష్మీ జ్యువెలర్ షాపులో సోదాలు చేశారు. ఈ విషయం తెలియడంతో పట్టణంలోని బంగారు వ్యాపార దుకాణాలు చాలా వరకు మూత పడ్డాయి. కొందరైతే దుకాణంలోని విలువైన బంగారు నగలు, వెండి సామగ్రిని వేరే చోటికి తరలించారు. చాలా షాపుల్లో యజమానులు కనిపించలేదు. ఉదయం నుంచి గుమాస్తాలు మాత్రమే కనిపించారు. దాడులు నిర్వహిస్తున్న దృష్ట్యా బుధవారం బంగారు లావాదేవీలు జరగలేదు. చాలా షాపులు కొనుగోలుదారులు లేక ఖాళీగా కనిపించాయి. డాక్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు బంగారు దుకాణాలతో పాటు పలువురు వైద్యుల ఇళ్లపై కూడా ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. గాంధీ రోడ్డులోని డాక్టర్లు సత్యప్రసాద్, నాగార్జునలతోపాటు మరి కొందరి నివాస గృహాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఇళ్లతోపాటు ఆస్పత్రుల్లోని పలు రికార్డులను తనిఖీ చేశారు. కొన్ని రికార్డులను అధికారులు తిరుపతికి తీసుకొని వెళ్లినట్లు తెలిసింది. దాడులు చేస్తున్న సమయంలో వివరాలు వెల్లడించలేమని అధికారులు విలేకరులకు చెప్పారు. కడప ఐపీఓ భూపాల్నాయక్తో పాటు 22 మంది అధికారులు దాడుల్లో పాల్గొన్నారు. -
రుణం
‘రుణం కోసం ఆరు నెలల నుంచి కాళ్లరిగేలా తిరుగుతున్నాం. రేపు రండి.. మాపు రండి అంటూ తిప్పుకుంటూనే ఉన్నారు. ఎన్ని నెలలు తిరగాలి సార్. ఇక మా వల్ల కాదు. రుణం ఇవ్వకుండా ఇలా తిప్పుకోవడం న్యాయమా.. మా పనులన్నీ వదులుకుని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా కనీస కనికరం కూడా లేదు. ఎంత అన్యాయం సార్..’ అంటూ మహిళలు మూకుమ్మడిగా బ్యాంకుపై దండెత్తారు. ప్రొద్దుటూరు, న్యూస్లైన్: ప్రొద్దుటూరు పట్టణం సూపర్బజార్రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (వ్యవసాయ అభివృద్ధి శాఖ) అధికారుల నిర్లక్ష్య వైఖరిలపై బుధవారం ఉదయం మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గడువు ముగిసినా బ్యాంక్ అధికారులు రుణాలు మంజూరు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకెళితే.. మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన ఇందిరాక్రాంతి పథం మహిళలకు ఈ బ్యాంక్లో రుణాలు మంజూరు చేస్తున్నారు. సుమారు 1200 స్వయం సహాయక సంఘాలు బ్యాంక్ పరిధిలో ఉన్నాయి. కాగా ఇటీవల కాలంలో రుణాల మంజూరుకు సంబంధించి బ్యాంక్ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. గత ఆరు నెలలుగా పరిస్థితి ఇలాగే ఉంది. దాదాపు 150 సంఘాలకు సంబంధించి డాక్యుమెంటేషన్ పూర్తయినా వారికి ఇంత వరకు రుణాలు మంజూరు చేయలేదు. మరో 200 సంఘాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్లు సంబంధిత అధికారుల వద్ద ఉన్నాయి. నిబంధనల ప్రకారం పాత రుణాలు చెల్లించిన వెంటనే వీరికి కొత్తగా రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. ప్రస్తుతం సుమారు రూ.4కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజి కింద రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం బిజీగా ఉన్నామని, మాకు ఇతర పనులు కూడా ఉన్నాయంటూ రుణాల కోసం వెళితే బ్యాంక్ అధికారులు కసురుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా కట్టిన రుణాలను కూడా క్రెడిట్ చేస్తూ ఆలస్యంగా సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్న కారణంగా మహిళలు నష్టపోతున్నారు. ఇందిరా క్రాంతి పథం అధికారులు బ్యాంక్కు వచ్చినప్పుడు సంఘాల వారు రాలేదని, సంఘాల వారు వచ్చినప్పుడు అధికారులు రాలేదని సాకులు చెబుతూ పదే పదే తిప్పుతుండటంతో ఒక్కసారిగా మహిళలంతా ఏకమయ్యారు. కొత్తపల్లె, సోములవారిపల్లె, నంగనూరుపల్లె, దొరసానిపల్లె తదితర గ్రామ పంచాయతీల పరిధిలోని స్వయం సహాయకసంఘాల మహిళలంతా తరలి వచ్చారు. వీరంతా బ్యాంక్ ఆవరణలోకి రావడంతో పరిస్థితిని గమనించిన బ్యాంక్ మేనేజర్ అనంతకుమార్, ఫీల్డ్ ఆఫీసర్ రాఘవేంద్రలు బయటికి వచ్చి వీరితో మాట్లాడారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ న్యూస్లైన్తో మాట్లాడుతూ తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, ఈ సమస్య తన దృష్టికి రాలేదని తెలిపారు. వీలైనంత త్వరలో అర్హులకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. -
అక్రమార్కులపై చర్యకు విజిలెన్స్ సిఫార్సు
ప్రొద్దుటూరు, న్యూస్లైన్: భవన నిర్మాణాలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 34 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖరాశారు. పొద్దుటూరు మున్సిపాలిటీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మించిన కళ్యాణ మండపాలు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఆస్పత్రులు, విద్యా సంస్థలతోపాటు మొత్తం 48 భవనాల నిర్మాణాలకు సంబంధించి అధికారులు నిబంధనలు పాటించలేదని వారు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి 2011 జూలై 18, 19, 20, 25 తేదీలలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వయంగా ఇక్కడ తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయా అధికారులతో స్వయంగా అభిప్రాయాలను సేకరించిన విజిలెన్స్ అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.పెన్నానది ఒడ్డున నిర్మించిన రెడ్ల కళ్యాణ మండపం, కేఎస్ఆర్ అండ్ సీఆర్సీ కళ్యాణ మండపం, కొవ్వూరు కళ్యాణ మండపాలు పూర్తిగా ఏటిపోరంబోకులో నిర్మించినవని తేల్చారు. పస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీలో పనిచేస్తున్న అప్పటి టౌన్ ప్లానింగ్ అధికారి బి.శివగురుమూర్తి, పులివెందుల మున్సిపాలిటీలో పనిచేస్తున్న అప్పటి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీజర్ ఎస్.మహబూబ్బాషా, కడప మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అప్పటి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సీటీ కృష్ణ సింగ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న అప్పటి మున్సిపల్ కమిషనర్ డి.గోపాలకృష్ణారెడ్డి, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్న అప్పటి మున్సిపల్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, రిటైర్డు మున్సిపల్ కమిషనర్ జీ.వెంకట్రావు, ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి కేవీ కృష్ణ ప్రసాద్, పెద్దశెట్టిపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి పీ.సాంబశివారెడ్డి, చాపాడు మండలంలోని పల్లవోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి టీ.ఆమోష్, దువ్వూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి రియాజుద్దీన్, నంగనూరుపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి కే.రవి, గతంలో కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఉన్న డీ.ధనుంజయబాబు, ఎర్రగుంట్ల మండలంలోని చిన్నదండ్లూరు గ్రామ కార్యదర్శి ఎం.విజయలక్ష్మిలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అప్పట్లో పనిచేసిన రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల తహశీల్దార్ ఎం.మనోహర్, జమ్మలమడుగు తహశీల్దార్ కే.వీ.శివరామయ్య, చక్రాయపేట తహశీల్దార్ ఎం.ప్రభాకర్రెడ్డి, ఎర్రగుంట్ల ఏఆర్ఐ బి.లక్ష్మిదేవి, గతంలో ఎర్రగుంట్ల తహశీల్దార్గా పనిచేసిన టీ.అంజనాదేవి, రిటైర్డు తహశీల్దార్లు ఎస్.నాగమల్లన్న, టీవీ సత్యకుమార్, ఎం.వెంకోబరావు, పీ.శ్రీనివాసులు, టీ.జయచంద్ర, ప్రస్తుతం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఏ.ప్రకాష్, రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న జీ.వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ ఎస్.శాంతన్ సుధాకర్, సిద్ధవటం తహశీల్దార్ వైఎస్ సత్యానందం, రాయచోటి తహశీల్దార్ జీ.చిన్నయ్య, జమ్మలమడుగు డిప్యూటీ తహశీల్దార్ పుష్పాంజలి, రిటైర్డు సీనియర్ అసిస్టెంట్ వీ.రవీంద్రబాబు, రిటైర్డు డిప్యూటీ తహశీల్దార్ సీ.కృష్ణమూర్తి, రిటైర్డు వీఆర్ఓ ఏ.మహ్మద్ఖాసీంతోపాటు ఎర్రగుంట్ల వీఆర్ఓ ఓబయ్య, ఎంఆర్ఐ పీఎంవీ మనోజ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. పెన్నానది ఒడ్డున ఏటి పోరంబోకులో నిర్మించిన కళ్యాణ మండపాలకు సంబంధించి వీరిపై పూర్తిగా నివేదిక పంపారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను కూల్చివేయాలని, బిల్డర్లకు భారీ ఎత్తున జరిమానా విధించాలని సూచించారు. ఈరు గుర్తించిన నిర్మాణాల్లో ఎంవీఎస్ రెసిడెన్సి, జీ రామచంద్రుడు కమర్షియల్ బిల్డింగ్, సత్యనారాయణ ప్యారడైజ్, సరోవర్ రెసిడెన్సి, ఆదిత్య ఎన్క్లేవ్, రాజా రెసిడెన్సి, పద్మలక్ష్మి ఎన్క్లేవ్, వీఎన్ ఇన్ఫ్రా ప్రాజెక్టు, శివబాలాజీ రె సిడెన్సి, శ్రీకృష్ణ ఆర్కేడ్, శ్రీరామ అపార్ట్మెంట్, రాజా రెసిడెన్సి, రాఘవేంద్ర రెసిడెన్సి, ఎస్ఎస్ రెసిడెన్సి, తల్లం సాయి రెసిడెన్సి, గోకుల్ రెసిడెన్సి, లక్ష్మిటవర్స్, రిషి రిసిడెన్సి, చరణ్తేజ్ రెసిడెన్సి, శ్రీబాలాజీ హాస్పిటల్స్, భారత్ ఎన్క్లేవ్, శ్రీనివాస, గౌతమి, సీబీఐటీ విద్యా సంస్థలతోపాటు పెన్నానది వద్ద నిర్మించిన మూడు కళ్యాణమండపాలు ఉన్నాయి. -
ధర తగ్గిన కళింగర
ఏ పంట సాగు చేసినా రైతన్నకు కాలం కలిసి రావడం లేదు. అప్పోసప్పో చేసి పంట సాగు చేయడం.. ధరల్లేకనో.. ప్రకృతి వైపరీత్యాలతోనో పంట నష్టపోతూనే ఉన్నాడు. అప్పుల భారం మోయలేక ఆపసోపాలు పడుతున్నాడు. నిన్న టమోట పంట నట్టేట ముంచగా.. నేడు కళింగర రోడ్డు పాలు చేసింది. రైతు గుండె బరువెక్కేలా చేసింది. కడప అగ్రికల్చర్,న్యూస్లైన్: ఖరీఫ్లో సాగు చేసిన పంటలు నూర్పిళ్ల సమయంలో అధిక వర్షాలకు తుడిచి పెట్టుకుపోవడంతో రైతులు కళింగర సాగు చేశారు. జిల్లాలోని చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, రామాపురం, చక్రాయపేట, వేంపల్లె, వేముల, పులి వెందుల, తొండూరు, లింగాల, చాపాడు, రాజు పాలెం, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో మొత్తం 7500 ఎకరాల్లో కళింగర సాగు చేశారు. పంట సాగుకు ఎకరానికి విత్తనాలు, రసాయనిక, సేంద్రియ, పోషక ఎరువులు తదితరవాటికి రూ. 20 వేల వరకు పెట్టుబడి పెట్టారు. కుప్పకూలిన ధరలు.. పంట సాగు సమయంలో టన్ను రూ. 5 నుంచి 6 వేలు పలకడంతో రైతులు ఎంతో ఆశించారు. తీరా పంట కోతకు వచ్చే సమయానికి ఒక్కసారిగా కుప్పకూలి రూ. 3 వేలకు పలుకుతున్నాయి. ఎకరానికి దిగుబడి ఎకరానికి 5,6 టన్నులు వచ్చిందని .. ప్రస్తుత ధర ప్రకారం రూ.15 నుంచి రూ.18వేలు మించి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు ఏమంటున్నారంటే.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో చలి ఎక్కువ గా ఉండడంతో అక్కడి నుంచి ఎగుమతి ఆర్డర్లు రానందున పంటను కొనుగోలు చేయలేకపోతున్నామని స్థానిక వ్యాపారులు అంటున్నారు. మరోవైపు ధరలు ఎక్కువగా ఉన్న చెన్నై, హైదరాబాదు, బెంగుళూరు నగరాలకు తరలించడం లో మార్కెటింగ్శాఖ అధికారులు ఆసక్తి చూ పాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. చేతి నుంచే పడుతోంది.... మూడున్నర ఎకరా కళింగర పంట వేశాను. పంట మార్కెట్కు వచ్చే సరికి ధర పడిపోయింది. కాయలను మార్కెట్కు తీసుకువస్తే ట్రాక్టరు బాడుగ రూ.1500లు చేతి నుంచి పెట్టుకున్నాను. - బిచ్చన్న, వెంకట్రామపల్లె, సీకేదిన్నె ఇలా ఉంటే పంటలేలా పండించాలి.... పంటసాగు చేసినప్పటి నుంచి కోత వరకు ధర లు నిలకడగా ఉండడం లేదు. పెట్టిన పెట్టుబడులైనా వస్తే చాలనే పరిస్థితులు రైతుల్లో ఉం టోంది. ఇలా ఉంటే పంటలెలా పండించాలి. - మల్లారెడ్డి,వెంకట్రామపల్లె, సీకేదిన్నె -
వారి మాటలకు అర్థాలే వేరులే...
ట్రాక్టర్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ రిపేరుకొచ్చింది. మరో ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఎర్రగుంట్లలోని మరమ్మతుల కేంద్రానికి వెళ్లాల్సిందే. ప్రొద్దుటూరు నుంచి ట్రాక్టర్లో ఎర్రగుంట్లకు ట్రాన్స్ఫార్మర్ను తీసుకెళ్లేందుకే రూ.1500 వరకు ఖర్చవుతోంది. ఎలాగోలా వెళ్లినా అక్కడి సిబ్బంది చేతులు తడపకపోతే మరమ్మతులు చేయరు. ట్రాన్స్ఫార్మర్ల స్టాక్ లేదంటూ కొన్ని సందర్భాలలో వారం, పది రోజుల పాటు తిప్పుకుంటుంటారు. కడప అగ్రికల్చర్,న్యూస్లైన్: విద్యుత్ అధికారుల మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదు. విద్యుత్ సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తాం..రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు కలుగనివ్వం...ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అన్ని ఖర్చులు భరించి మేమే మరమ్మతులు చేయిస్తామని చెబుతున్న మాటలు ఆచరణలో కనిపించడం లేదు. తామే వాహనాలను సమకూర్చుకుని ట్రాన్స్ఫార్మర్లు తీసుకువెళ్లి రిపేర్లు చేయించుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో హెచ్టీ 11కేవీ విద్యుత్ లైన్లు 19538.06 కిలోమీటర్లు, 33కేవీ 1747.20 కిలో మీటర్లు, 6.3 కేవీ విద్యుత్ లైన్లు 1277.30 కిలోమీటర్లు, ఎల్టీ లైన్లు 2111194.24 కిలోమీటర్ల చొప్పున లాగారు. అలాగే 5 కిలోవాట్స్ ఎంపీయర్ ట్రాన్స్ ఫార్మర్లు 284, 15 కేవీఏ 28851, 25 కేవీఏ 23239, 40 కేవీఏ 147, 50 కేవీఏ 35, 63 కేవీఏ 2674, 75 కేవీఏ 19, 100 కేవీఏ 4556, 150 కేవీఏ 6, 160 కేవీఏ 227, 200 కేవీఏ 5, 250 కేవీఏ 63, 281 కేవీఏ 1, 315 కేవీఏ 29, 400 కేవీఏ 2, 500 కేవీఏ 14 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. రోజుకు జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 20 వరకు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుంటాయని అధికారులు తెలుపుతున్నారు. చేయి తడిపితేనే గానీ కిందిస్థాయి సిబ్బంది రిపేర్లు చేయడం లేదని రైతులు బాహటంగానే ఆరోపిస్తున్నారు. లేనిపక్షంలో రేపురా...మాపురా అనడంతోపాటు మా...ఏడీఈ, ఏఈల వాహనాలు అందుబాటు లేవని తప్పించుకునే మాటలు చెబుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. పెండ్లిమర్రి మండలంలోని చింతలవాండ్లపల్లె సమీపంలో 33/11 కేవీ విద్యుత్ స్తంభం కూలిపోయే స్థితిలో ఉందని చెప్పినా సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు తెలిపారు. అదే మండలం పగడాలపల్లెలోని పొలాల్లో స్తంభాలు ఏర్పాటు చేయకపోవడంతో కర్రలపైనే వైర్లను లాగి మోటార్లు ఆడించుకుంటున్నారు. సింహాద్రిపురం మండలంలో ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని పలుగ్రామాల ప్రజలు చెబుతున్నారు. సంస్థే బరాయిస్తుంది.... ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే పట్టణాల్లో 24 గంటలు, గ్రామాల్లో 48 గంటల్లో రిపేర్లు చేసి బిగిస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే తీసుకువెళ్లడానికి 23 మంది ఏడీఈలు సిద్ధంగా ఉంటారు. హెచ్వీడీఎస్ పద్ధతి వచ్చాక వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం తగ్గింది. ఒక్కో సర్వీసుకు రూ. 50 వేలు సబ్సిడీ ఇస్తాం. అందులోనే 3 స్తంభాలు, వైరు, సామగ్రి ఇస్తాం. స్తంభం వద్ద కాకుండా దూరంగా బోర్లు వేసుకుని కర్రలపై తీగలను కొందరు రైతులు లాక్కుంటున్నారు. లాక్కున్నారు. బోరు వరకు స్తంభాలు, వైర్లు, సామగ్రి కోసం అదనంగా డబ్బులు చెల్లిస్తే మేమే ఏర్పాటు చేస్తాం. - డాక్టర్ కేఎస్ పరబ్రహ్మం, ట్రాన్స్ఫార్మర్ల డీఈ, కడప -
ఏమున్నది గర్వకారణం..
సాక్షి, కడప : జిల్లాలోని కొన్ని బస్టాండ్లలో బస్సు ఎక్కాలంటే అదిరిపోవాల్సిందే. కడప పాత బస్టాండులాంటి ప్రాంతాల్లో ప్రొద్దుటూరు, కమలాపురం వెళ్లే బస్సుల్లో ప్రయాణికులు ఎక్కేచోట చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే. దుర్వాసనతో అదిరిపోవాల్సిందే! బస్టాండు ప్రాంగణంలో చెత్తతోపాటు ఆరుబయటే మల, మూత్ర విసర్జన చేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. అనేక చోట్ల తాగునీటి సౌకర్యం లేదు. మూత్ర శాలలు అంతంత మాత్రమే. ప్రయాణికులకు బస్టాండుచుట్టుపక్కల ఉన్న పరిసరాలే మరుగుదొడ్లుగా, మూత్రశాలలుగా మారుతున్నాయి. ఆర్టీసీ అధికారులు బస్టాండుల నిర్వహణను గాలికొదిలేశారు.బస్టాండ్లలో తాగునీటి సౌకర్యం కల్పించామని చెబుతున్నప్పటికీ ట్యాంకులు శుభ్రపర్చక పోవడంతోపాటు నీరు బాగా లేకపోవడంతో ఆ నీటిని ప్రయాణికులు ఎవరూ తాగడం లేదు. కడప పాత బస్టాండు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తతోపాటు ప్రాంగణంలోనే మూత్ర, మల విసర్జన చేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. బుగ్గవంక సమీపంలో పాతబస్టాండ్ ఉండటంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. బస్టాండులో ప్రయాణికులు నిలువలేని పరిస్థితి నెలకొంది. ప్రొద్దుటూరులో 30 ఏళ్ల నాటి భవనం పెచ్చులూడి అధ్వానంగా కనిపిస్తోంది. పురుషుల మరుగుదొడ్లు ఏడాదిగా పనిచేయడం లేదు. తాగునీటి కొళాయి వద్ద అపరిశుభ్రత తాండవిస్తోంది. చెత్త, పందుల సంచారంతో పరిసరాలన్నీ దుర్వాసనతో అధ్వానంగా ఉన్నాయి. అధికారులు డిపోలోకి ప్రతిరోజు వెళుతూ వస్తున్నప్పటికీ ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జమ్మలమడుగు కొత్త బస్టాండులో తాగడానికి నీరు, కూర్చోవడానికి సీట్లు లేవు. ప్రయాణికులకు సమాచారం అందించేవారు కూడా లేరు. మరుగుదొడ్ల పరిస్థితి అంతంత మాత్రమే. ముద్దనూరు, మైలవరంలో లక్షలాదిరూపాయలు వెచ్చించి బస్టాండు నిర్మాణాలు చేపట్టినప్పటికీ అవి నిరుపయోగంగా ఉన్నాయి. రాయచోటి బస్టాండులో మరుగుదొడ్ల కొరత ఉంది. ఆరుబయటే మూత్ర విసర్జన చేయాల్సి వస్తోంది. ప్రయాణికులు కూర్చోనేందుకు కనీసం స్థలం కూడా సరిగా లేదు. మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేకోడూరులో బస్టాండు సౌకర్యం లేదు. 1993లో నిర్మించినప్పటికీ ఇప్పటికీ నిరుపయోగంగానే ఉంది. హైవే రోడ్డే ప్రయాణికులకు దిక్కయింది. మహిళలు బస్సు ఎక్కాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే! బద్వేలులో ఎటు చూసినా మూత్ర విసర్జన, చెత్తాచెదారం, పందుల సంచారంతో బస్టాండు పరిసరాలలో దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది. తాగేందుకు నీటి సౌకర్యం లేదు. రాజంపేటలో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. బస్టాండు ఆరంభంలోనే చెత్త దర్శనమిస్తుంటుంది. పాత బస్టాండులో నిలబడేందుకు కూడా సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. పులివెందులలో ప్రయాణికుల సౌకర్యార్థం మినరల్ ప్లాంట్ ఉన్నప్పటికీ అది పనిచేయకపోవడంతో కుళాయి నీళ్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. పందుల సంచారంతోపాటు పరిసరాల్లోని చెత్తతో ఇబ్బందులు తప్పడం లేదు. మైదుకూరులో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. పరిసరాల్లో ప్రవహిస్తున్న మురుగునీరు, చెత్తతో బస్టాండు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. కమలాపురంలోబస్టాండు ఉన్నప్పటికీ బస్సులు వెళ్లే పరిస్థితి లేదు. బస్టాండు శిథిలావస్థకు చేరింది. మెయిన్రోడ్డులోనే నిలబడి తోసుకుంటూ బస్సు ఎక్కాల్సిందే! -
అక్రమ పునాదుల జోరు
ప్రభుత్వ స్థలంపై కన్నేశారు.. అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్నారు.. అంతే.. అక్రమ పునాదులు వేస్తూ.. దర్జాగా కబ్జా చేస్తున్నారు. ప్రొద్దుటూరు ఇందిరమ్మ కాలనీలోని పేజ్-1,2 కింద పేదలకు కేటాయించిన ఖాళీ స్థలాల్లో అక్రమ పునాదుల జోరు మళ్లీ ఊపందుకుంది. ప్రొద్టుటూర్ టౌన్, న్యూస్లైన్: కొత్తపల్లె పంచాయతీ మైలవరం కాలువకు పక్కనే ఉన్న 350 ఎకరాలను ప్రభుత్వం ఫేజ్-1,2,3 కింద ఇందిరమ్మ పథక లబ్ధిదారులకు కేటాయించింది. ఇందిరమ్మ ఫేజ్-1 కింద లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలో కొందరు అక్రమ పునాదులు వేస్తున్నారు. గతంలోనూ కొంతమంది ఇక్కడ అక్రమ పునాదులు వేసినా .. అప్పట్లో హౌసింగ్, రెవెన్యూ అధికారులు స్పందించి వాటిని తొలగించారు. ఈ తతంగం జరిగి ఏడాది దాటినా తొలగించిన పునాదుల స్థలాల అసలైన లబ్ధిదారులను హౌసింగ్ అధికారులు గుర్తించలేదు. ఇటీవలే ఇందిరమ్మ కాలనీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వెలుస్తున్న ఈ పునాదులు అసలైన లబ్ధిదారులవేనా.. లేక అక్రమదారులవా అన్నది అధికారులు తేల్చాల్సి ఉంది.