విద్యార్థుల యూనిఫాం పంపిణీ విషయంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలకు ఓ విధంగానూ, హాస్టల్ విద్యార్థులకు మరో విధంగాను దుస్తుల కొలతలు ఇచ్చి తేడా చూపిస్తోంది.
ప్రొద్దుటూరు, న్యూస్లైన్: విద్యార్థుల యూనిఫాం పంపిణీ విషయంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలకు ఓ విధంగానూ, హాస్టల్ విద్యార్థులకు మరో విధంగాను దుస్తుల కొలతలు ఇచ్చి తేడా చూపిస్తోంది. ప్రతి ఏటా రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో 1-8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫాం సరఫరా చేస్తోంది. ఇందుకు సంబంధించి గతంలో కాంట్రాక్టర్ల వ్యవస్థ ఉండగా ఈ ఏడాది ఆప్కో నుంచే దుస్తులు కొనుగోలు చేయాలని ఆర్వీఎం అధికారులు ఎంఈఓలకు సూచించారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆప్కో ద్వారానే యూనిఫాం సరఫరా అవుతోంది.
ప్రతి విద్యార్థికి రెండు జతలు..
ఈ ఏడాది 1-8వ తరగతి వరకు చదివే 1,88,397 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాం సరఫరా చేయాల్సి ఉంది. కుట్టు కూలితో సహా ఒక్కో జతకు రూ.200 చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఇందులో సగం మొత్తం ప్రధానోపాధ్యాయులు ఆర్వీఎంకు జమ చేశారు. ఇందులో భాగంగా కొలత ప్రకారం ఏ విద్యార్థికి ఎంత బట్ట అవసరం అనే విషయాన్ని ఆర్వీఎం అధికారులు ప్రధానోపాధ్యాయులకు వివరించారు.
కొలతల్లో తేడా..
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు దుస్తుల కొలతలు వేర్వేరుగా ఉండడంపై విమర్శలు వస్తున్నాయి.
వివరణ..
ఈ విషయమై ఆర్వీఎం సీఎంఓ గంగిరెడ్డిని ‘న్యూస్లైన్’ వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు చేశామని తెలిపారు. బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు.