తెలంగాణ పదిలం | Centre nod to Telangana with 10 districts | Sakshi
Sakshi News home page

తెలంగాణ పదిలం

Published Fri, Dec 6 2013 4:34 AM | Last Updated on Sat, Aug 11 2018 7:54 PM

Centre nod to Telangana with 10 districts

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పది జిల్లాలతో కూడిన తెలంగాణకు కేంద్ర కేబినెట్ అంగీరించిందని తెలియగానే జిల్లా ఆనందంలో ఓలలాడింది. తెలంగాణవాదులు వీధులలోకి వచ్చి పటాకులు కా ల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. పీడీఎస్‌యూ, ఏబీవీపీ, ఏఐఎస్‌ఎఫ్, తదితర విద్యార్థి సంఘాలు జై తెలంగాణ నినాదాలను మారుమోగించాయి. న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, జుక్కల్, బాల్కొండ, డిచ్‌పల్లి, బా న్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండలా లు, పట్టణాలలో సంబరాలు కొనసాగాయి. అమరవీరుల త్యాగఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అన్నివిధాలుగా సౌకర్యాలు సమకూర్చేవిధంగా పునర్నిర్మాణంలో తమవంతు బాధ్యతను నెరవేరుస్తామని ఈ సందర్భంగా పలు పార్టీలు, తెలంగాణవాదులు, ఉద్యోగ సంఘాలు ప్రతినబూనాయి.
 
 పోలీసు కిష్టయ్య, విద్యార్థి రాములు వంటి త్యాగధనులు 1100 మందికిపైగా ప్రాణాలర్పించారని కొనియాడుతూ నివాళులర్పించారు. 1969లో 369 మంది విద్యార్థులు తెలంగాణ కోసం తమ ప్రాణాలను ప్రణంగా పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారులు, కవులు, రచయితలు, విద్యార్థుల పాత్ర మరువలేనిదన్నా రు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంపై ప్రభుత్వ విప్ ఈరవత్రి అని ల్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురా లు ఆకుల లలిత, జిల్లా అధ్యక్షురాలు అరుణతా ర, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, నాయకులు మానాల మోహన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నాయకుడు నరేందర్‌గౌడ్, బీజేపీ నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి, ఆనందరెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమరవీరుల త్యాగఫలం, ప్రజల పోరాట ఫలి తంగా తెలంగాణ సిద్ధించిందని అన్నారు.
 
 సిద్ధాంతానికి కాంగ్రెస్
 కట్టుబడి ఉంది..
 సోనియాగాంధీ సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఒక సిద్ధాంతం కోసం నిలబడే పార్టీగా కాంగ్రెస్‌కు పేరుంది. జీవోఎం ప్రతిపాదించిన ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రి వర్గం ఆమోదించి ఆ పేరును నిలబెట్టుకుంది. 29వ రాష్ర్టంగా తెలంగాణను దేశంలోనే అదర్శవంతమైన రాష్ట్రంగా, అభివృద్ధి దిశలో తీసుకెళ్తాం. చెప్పినట్లుగానే తెలంగాణను ఇచ్చింది....తెచ్చింది..కాంగ్రెసేనన్న విషయాన్ని ప్రజలు గమనించాలి.
 - పి.సుదర్శన్‌రెడ్డి,భారీ నీటి పారుదల శాఖా మంత్రి
 
 సోనియా మాటంటే మాటే..
 ముందు నుంచి చెబుతున్నట్లుగానే సోనియాగాంధీ బంగారు పల్లెంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు అందించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇక ఏర్పడినట్లే. సోనియాగాంధీ మాటంటే..మాటే! సిద్ధాంతానికి , విలువలకు కట్టుబడి సీడబ్ల్యూసీ, యూపీఏ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే విధంగా కృషి చేశా రు. తెలంగాణ ప్రజలు సోనియాను మరువలేరు.
 -డి. శ్రీనివాస్, పీసీసీ మాజీ అధ్యక్షుడు
 
 అమరుల త్యాగఫలం
 తెలంగాణ అమరవీరుల త్యాగఫలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 1969లో 369 మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయగా, ఈ నాలుగు సంతవ్సరాల వ్యవధిలో 1100 మంది బలిదానం చేశారు. ఇక్కడి ప్రజల ఉద్యమ ఫలితంగా తెలంగాణ సిద్ధించింది. కేంద్ర మంత్రి వర్గం పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడాన్ని టీడీపీ స్వాగతిస్తోంది.
 -వీజీ గౌడ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు
 
 భవిష్యత్తు బంగారు తెలంగాణదే
 తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంది. తెలంగాణను అడ్డుకోవడానికి కొన్ని శక్తులు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నాయి. ఆ కుట్రలకు కేంద్ర మంత్రివర్గ ఆమోదంతో తెరపడింది. తెలంగాణ ప్రజల అకాంక్ష నెరవేరింది.  బీజేపీ మద్దతుతోనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్ అవుతుంది. ప్రజల పోరాటాల ఫలితంగా ఈ సాకారం లభించింది. ఈ రోజు శుభదినం. చాలా సంతోషంగా ఉంది.
 -పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
 
 పార్లమెంటులో త్వరగా బిల్లు పెట్టాలి
 తెలంగాణ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నాం. సత్వరమే పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలి. ప్రజల పోరాటాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. తెలంగాణలో బడుగులకు న్యాయం జరిగే విధంగా కృషి చేద్ధాం.
 -భూమయ్య, న్యూడెమోక్రసీ నేత
 
 29వ రాష్ట్రంగా తెలంగాణ
 దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడుతోంది. కాంగ్రెస్ నాయకులు ఒక సిద్ధాంతానికి కట్టుబడిన త్యాగశీలురు. అందుకే గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో పూర్తిస్థాయిలో విశ్వాసం, నమ్మకం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సహకరించిన జీవోఎంకు, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని, సోనియాను మరువద్దు.
 -తాహెర్ బిన్ హుందాన్, డీసీసీ అధ్యక్షుడు
 
 పునర్నిర్మాణంలో సీపీఐ పాత్ర ఉంటుంది
 తెలంగాణ  రాష్ట్ర పునర్నిర్మాణంలో సీపీఐ పాత్ర గణనీయంగా ఉంటుంది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి దిశలో పయనింపచేయడానికి ఏమి చేస్తే బాగుంటుందనే విషయంపై కమ్యూనిస్టులు ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు.
 -భూమయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి
 
  ఇది ప్రజల విజయం
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజల విజయం. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకు అప్రమత్తంగా ఉందాం. అసెంబ్లీలో ముసాయిదా బిల్లు మోక్షం పొందేవిధంగా కృషి చేద్దాం. కొత్తగా ఏర్పడనున్న తెలంగాణను ప్రజలకు చేరువగా అభివృద్ధి చేద్దాం.
 -బస్వా లక్ష్మీనర్సయ్య, టీఆర్‌ఎస్ నేత
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement