
పరిటాలను చంపించింది బాబే: గడికోట శ్రీకాంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత పరిటాల రవిని చంద్రబాబునాయుడే హత్య చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి చెప్పారు. టీడీపీలో పరిటాల ఎదుగుదలను ఓర్వలేక చంద్రబాబే హత్య చేయించారని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారని ఆయన అన్నారు. అయితే నేడు సిగ్గులేకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. ప్రతి విషయానికీ రాజశేఖరరెడ్డిని, జగన్లను విమర్శించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాసులు, బి.గుర్నాథరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
హత్యా రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని, పదవికోసం ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచి హత్య చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. అంతేగాక.. కాపు నాయకుడు వంగవీటి రంగాను అత్యంత దారుణంగా హత్య చేయించారన్నారు. అలాగే ఎలిమినేటి మాధవరెడ్డి, మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్, పి.ఇంద్రారెడ్డిలను కూడా చంద్రబాబే హత్య చేయించారనే ఆరోపణలున్నాయన్నారు. వాటి నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. వీరి మరణాలతో చంద్రబాబుకు నిజంగా సంబంధం లేకపోతే సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు.